వైసీపీ మాస్టర్ ప్లాన్.. ఉప ఎన్నికలకు సై!!

  వైసిపి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రతిపక్షం టిడిపిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది గోడ దూకుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది. మాజీలుగా ఉన్నవాళ్లు టిడిపిని వీడడానికి ఎలాంటి ఇబ్బందులూ ఆటంకాలు ఉండవు. కానీ ఎమ్మెల్యే గానో ఎంపీగానో కొనసాగుతున్న వారు పార్టీ మారాలంటేనే సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో మాదిరి అయితే ఈపాటికే పెద్ద ఎత్తున పార్టీలు మారే వ్యవహారం రసకందాయంలో పడేదేమో. అయితే పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తీరాల్సిందేనని స్వీయ నిబంధన పెట్టుకున్న క్రమంలో వైసీపీలోకి ఆశించిన స్థాయిలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిలు వెళ్ళలేదనే చెప్పాలి. ఇదే సందర్భంలో వైసిపి నేతలు సదరు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారో వారితో మాత్రం వైసీపీ పెద్దలు  సన్నిహిత్యం లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైన సమయంలో వీలు చూసుకుని పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందాక ఒక్కొక్కరినీ తెరమీదకు తెచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా మాజీలపై ఫోకస్ పెట్టి వరసలపై దృష్టి సారించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే వంశీని వెంటబెట్టుకొని మంత్రులు నాని ద్వయం సీఎంను కలవడం ద్వారా వరస ఎపిసోడ్ కు తెరలేపినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో నెమ్మదిగా తమతో టచ్ లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదే బాట పట్టించే దిశగా పావులు కదిపేందుకు వైసీపీ రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. గంటా కూడా పార్టీ కార్యకలాపాలలో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే భావన అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న క్రమంలో గంటా రూట్ బిజెపినా లేక వైసిపినా అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఉత్తరాంధ్ర వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే వైసిపికి చెందిన ఓ పెద్దాయనతో గంటా మాట్లాడుకోవలసిన అంశాలన్నీ మాట్లాడేశారని అంటున్నారు. ఈ క్రమంలో వంశీ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చాక గంట కూడా ఇదే తరహాలో తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఇక వీరిద్దరే కాకుండా ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కొందరు చాప కింద నీరులా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో బలంగా జరుగుతోంది. ప్రస్తుతం టిడిపి అధినాయకత్వం మీద అసంతృప్తి, చంద్రబాబు వారసుడు లోకేష్ పై అపనమ్మకం ఉన్న వారిని గుర్తించే పనిలో సదరు టిడిపి నేతలు సీరియస్ గానే నిఘా పెట్టారని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.  హైదరాబాద్ కేంద్రంగా సదరు టిడిపి నేతలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా పిలిపించుకుని మాట్లాడుతూ పార్టీలో పరిస్థితేంటి ఇలాగే ఉంటే భవిష్యత్తు రాజకీయం ఎలా అనే అంశాల పై వివిధ స్థాయిల్లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పుకారులు కూడా వెల్లడవుతున్నాయి . అయితే ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడపాలని నిర్ణయించుకుని ఉమ్మడి రాజధాని కేంద్రంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రాంగం కనుక ఫలిస్తే టిడిపి నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందటున్నారు వైసీపీ వర్గాలు. ఇదంతా జరిగితే ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.  అధికారంలోకి వచ్చి నిండా అయిదు నెలలు కాకుండా భారీ స్థాయిలో వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం పై గూడుకట్టుకొని పోయిందనే ప్రచారం ప్రతిపక్షం పెద్దఎత్తున చేస్తోంది. ప్రతిపక్ష ప్రచారానికి చెక్ చెప్పాలంటే ఉప ఎన్నిక ద్వారానే సమాధానం చెప్పొచ్చు అనేది కొందరి వైసిపి నేతల వ్యూహంగా కనిపిస్తోంది. పనిలో పనిగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది కాబట్టి ఇదే ఊపులో తమతో టచ్ లో ఉన్న ఇంకొందరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తే అన్ని నియోజక వర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం అధికార పక్ష శ్రేణుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ పని తీరు మీద రిఫరెండం అటు ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి సత్తా చాటాలని కొందరు సూచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పార్టీ పెద్దల వద్ద నిర్ణయం జరగాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపి టిడిపిలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.ఇక ఈ రెండు మూడు నెలల్లో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.

టీఆర్ఎస్ లో మున్సి-పోల్స్ రగడ... టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి

    ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో గతేడాది తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. రెండు మూడు నెలల గ్యాప్ తో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత సార్వత్రి ఎన్నికలు... అనంతరం జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగ్గా... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మున్సిపోల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపోల్స్ కు రంగంసిద్ధమవుతుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్ కంటే ముందుగా తమ టికెట్ ను కన్ఫ్మామ్ చేసుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. ప్రతి వార్డు, డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి మేయర్ పీఠం వరకు టికెట్లు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఎప్పట్నుంచో మీ గెలుపు కోసం పనిచేశాను... ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యనేతలు తలల పట్టుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, టికెట్ల కేటాయింపు తమ చేతిలో ఉండదని, అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.      మొత్తానికి నవంబరు నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో.... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ, జెడ్పీ, పంచాయతీల్లో ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, టికెట్ల లొల్లి... ప్రతి వార్డు, డివిజన్ లో మూడేసి గ్రూపులు ఉండటం.... టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.   

వంశీ ఎపిసోడ్‌లో వైసీపీ రియాక్షనేంటి? యార్లగడ్డపై జగన్‌కు సానుభూతి ఉందా?

వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది. అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

వలస నాయకులతో ఇంకెంత కాలం బండి లాగిస్తారు బాబు గారు!!

  2019 సార్వత్రిక ఎన్నికల ఘోర పరాయజంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. గెలిచిందే 23 ఎమ్మెల్యేలు అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సంఖ్య రెండు ప్లస్ మూడు.. ఐదుకి పడిపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చేరిపోయారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసిన వంశీ.. పార్టీ మార్పు అంశంపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే గన్నవరం రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశముంది. ఇక్కడ వంశీకి వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడటమే కాకుండా, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఓ రకంగా వీరి పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటిది ఇప్పుడు వంశీ వైసీపీలో చేరనున్నారని వార్తలు రావడంతో.. యార్లగడ్డ వర్గంలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలో తాము పట్టు కోల్పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వంశీని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రమ్మన్నారని, రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే.. రాజ్యసభకు వెళ్తారా? లేక వైసీపీ గుర్తుపై తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వంశీ పార్టీ మార్పు వార్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాని రంగంలోకి దింపిన బాబు.. యార్లగడ్డను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారట. అయితే బాబు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తప్పుపడుతున్నారు. బాబు ఇంకెప్పుడు మారతారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని పేరుండేది. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్నో రంగాలకు చెందిన వారు, మధ్యతరగతి వారు, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ పొంది మంచి నాయకులుగా పేరుతెచ్చుకున్నారు. టీడీపీ లో నాయకులుగా ఎదిగి ఇతర పార్టీల్లో చేరి మంచి స్థానాల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. నాయకులను తయారుచేయటం సంగతి మరిచి, వలస నేతల వెంట పరుగెడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు అవసరం కోసం ఎందరో నేతలు టీడీపీలో చేరి, తర్వాత పార్టీని వీడారు. వలస నేతలను నెత్తిన ఎక్కించుకోవద్దని కార్యకర్తలు మొత్తుకుంటున్నా బాబు తీరులో మార్పు కనిపించడంలేదు. వంశీ పార్టీని వీడుతున్నారని వార్తలు రాగానే, యార్లగడ్డతో మంతనాలు మొదలు పెట్టడంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బాబు తన తీరు మార్చుకోకపోతే పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలస నేతలతో పబ్బం గడిపి పార్టీ పరిస్థితిని దిగజార్చకుండా.. ధైర్యంగా పోరాడి పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేలా చేయాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ పొతే ఏంటి? పార్టీనే నమ్ముకొని ఉన్న నిజాయితీపరుడైన కార్యకర్తను నాయకుడిని చేయండి లేదా యువ నాయకుడు నారా లోకేష్ ని బరిలోకి దింపండని కార్యకర్తలు కోరుతున్నారు. నారా లోకేష్.. మంగళగిరి నుంచి బరిలోకి దిగినప్పుడు.. నియోజకవర్గం ఎంపిక సరైన నిర్ణయం కాదని అప్పట్లోనే కార్యకర్తలు పెదవి విరిచారు. దానికి తగ్గట్టే ఫ్యాన్ గాలికి లోకేష్ కుప్పకూలిపోయారు. అయితే ఇప్పుడు లోకేష్ కి మంచి అవకాశం వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. నిజంగానే లోకేష్ తనని తాను నాయకుడిగా పరిచయం చేసుకోవాలంటే.. ఇదే సరైన సమయమని చెప్తున్నారు. గన్నవరం ప్రజలు ఐతే స్థానికులకు లేదా సౌమ్యులకు పట్టం కడతారు.. మిగతా వారిని పక్కన పెడతారని పేరుంది. అందుకే సౌమ్యుడిగా పేరున్న లోకేష్ గన్నవరం నుంచి పోటీచేసి గెలిస్తే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచి మైలేజీ వస్తుంది. పార్టీ భవిష్యత్తుకి భరోసా కలుగుతుంది. ఒకవేళ లోకేష్ ఓడిపోయినా.. పోరాట పటిమ కనబరిచారని, కార్యకర్తలు ఆయన వెంట ధైర్యంగా నడిచే అవకాశముంది. కానీ చంద్రబాబు ఇవేం పట్టించుకోకుండా.. తనకు అలవాటైన దారిలోనే వెళ్తూ.. వలస నాయకుల వెంట పరిగెడితే పార్టీ కోలుకోవడం కష్టమనే అంటున్నారు. బాబుకి రిటైర్మెంట్ టైం వచ్చింది, లోకేష్ పై ఇంతవరకు ప్రజల్లో పూర్తి నమ్మకం కలగలేదు. బాబు ఇంకా అలాగే భయంభయంగా పోరాడితే లోకేష్ పై పడిన పప్పు అనే ముద్ర పోదు. ఇలాంటి సమయంలోనే కార్యకర్తల్లో ధైర్యం నింపేలా లోకేష్ ని బరిలోకి దింపితే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచిదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు గన్నవరం విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

మొన్న నాని, నిన్న నార్నె, నేడు వంశీ.. వైసీపీలోకి ఎన్టీఆర్ వర్గం.. పక్కా వ్యూహమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. 2009 అసెంబ్లీ ఎన్నికలు. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితం కాకుండా ఉండాలని టీడీపీ, మరోవైపు మెగాస్టార్ పీఆర్పీ. ఇలా అధికారం కోసం పార్టీల హోరాహోరా పోటీ, హోరాహోరీ ప్రచారం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రచారంలో ఓ కొత్త ఉత్సాహం కనిపించింది. ఆ ఉత్సాహం పేరే జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్.. పాతికేళ్లకే తన వాక్చాతుర్యంతో ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయన ప్రచారానికి వచ్చిన విశేష స్పందన చూసి.. రాజకీయ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఎన్నికల ప్రచారం సమయంలోనే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. అయినా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్ వేయాలని కోరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా కూడా.. ఎన్టీఆర్ కి పార్టీలో, ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత కారణాలేమైనా టీడీపీకి, ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. తన ప్రచారానికి వచ్చిన స్పందన చూసి.. టీడీపీకి నేనే దిక్కు, నెక్స్ట్ సీఎంని నేనే అన్నట్టు ఎన్టీఆర్ ఫీలయ్యేవారని.. అందుకే ఎన్టీఆర్ ని టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందని.. ఒక వర్గం చెప్పుకొచ్చింది. కాదు, ఎన్టీఆర్ కి వస్తున్న ఆదరణ చూసి భవిష్యత్తులో తన కుమారుడికి అడ్డుగా వస్తాడని చంద్రబాబే ఆయన్ని కావాలని దూరం పెట్టారని మరో వర్గం వాదన. నిజమేంటో తెలీదు కానీ ఎన్టీఆర్ కి, టీడీపీతో గ్యాప్ వచ్చిందనేది మాత్రం వాస్తవం. దీంతో టీడీపీలోని ఓ వర్గం ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు, చిరకాల మిత్రుడు కొడాలి నాని.. టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో.. ఎన్టీఆరే కొడాలి నానిని వైసీపీలోకి పంపించారని, ఎన్టీఆర్ వైసీపీకి మద్దతిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ మీద విమర్శలు కూడా తీవ్రతరమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ మీడియా ముందుకొచ్చి.. కొడాలి నాని తనకు మిత్రుడే కానీ, పార్టీ మార్పు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన నిర్ణయంతో నాకు సంబంధం లేదని, కట్టే కాలే వరకు టీడీపీ లోనే ఉంటానని స్పష్టం చేసారు. ఆ తరువాత ఎన్టీఆర్ తన దృష్టంతా కేవలం సినిమాల మీదే పెట్టారు. ఆయన మీద విమర్శలు కూడా తగ్గిపోయాయి. సరిగ్గా పదేళ్ల తరువాత 2019 ఎన్నికల సమయంలో మళ్లీ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఎన్టీఆర్ కి తెల్సే నార్నె శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లారని ప్రచారం మొదలైంది. అయితే నార్నె రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఈ విషయాన్ని ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా రాజకీయాలతో తనకేం సంబంధం లేనట్టు దూరంగా ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కాదు కదా.. కనీసం టీడీపీకి ఓట్ వేయమని ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇక ఆయన ప్రస్తుతానికి సినిమాలకే పరిమితమయ్యారని అనుకున్నారంతా. అయితే అయన రాకపోయినా ఆయన పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం మొదలైంది. వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత ప్రకటన చేస్తానన్నారు. అంటే పార్టీ మారే ఆలోచన ఉందని చెప్పకనే చెప్పేసారు. దీంతో ఎన్టీఆర్ పేరు మళ్లీ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. కారణం, వంశీ.. కొడాలి నానికి చిరకాల మిత్రుడు. ఎన్టీఆర్ కి సన్నిహితుడు. దీంతో ఎన్టీఆర్ తెర వెనుక ఏదో చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ సన్నిహితులు ఒక్కఒక్కరిగా సైలెంట్ గా వైసీపీలో చేరుతుండంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్లానింగ్ ప్రకారమే తన వర్గాన్ని వైసీపీలోకి పంపి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారని అంటున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ కూడా వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొన్న కొడాలి నాని, నిన్న నార్నె శ్రీనివాస్, నేడు వంశీ.. ఎన్టీఆర్ సన్నిహితుల వైసీపీ బాట. మరి ఇది యాదృచ్చికమో, వ్యూహమో తెలీదు కానీ.. ఎన్టీఆర్ సన్నిహితులు వైసీపీలో చేరటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

మొన్న అఖిలప్రియ... ఇఫ్పుడు జేసీ... సీమలో జగన్ సైలెంట్ ఆపరేషన్

  రాయలసీమలో కేవలం మూడే మూడు స్థానాలు మినహా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన జగన్మోహన్ రెడ్డి... తనను విమర్శిస్తున్నవాళ్లను, తన ప్రత్యర్ధులను సైలెంట్ టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా... ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకుండానే... కేసులు, దాడులతో కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర మొదలుకొని కోస్తాంధ్ర వరకు పలువురు టీడీపీ ముఖ్యనేతలపై కేసుల మీద కేసులు పెట్టడమే కాకుండా కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు రాయలసీమపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని దూషించిన జేసీ బ్రదర్స్ టార్గెట్ గా ఆపరేషన్ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారని చెబుతున్నారు. అయితే, దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ పై ఘాటు రియాక్టయిన జేసీ దివాకర్ రెడ్డి... జగన్ పై సెటైర్లు వేశారు. ఎన్నో ట్రావెల్స్ ఉండగా జగన్‌‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా అంటూ జేసీ ప్రశ్నించారు. ఎందుకు నా బస్సులనే భూతద్దంలో చూస్తున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్న జేసీ దివాకర్ రెడ్డి.... బస్సుల సీజ్ పై కోర్టును ఆశ్రయిస్తానన్నారు. 70ఏళ్లుగా వాహనరంగంలో ఉన్నామన్న జేసీ.... చిన్నచిన్న లోటుపాట్లు ఉండటం సహజమని, కేవలం ఫైన్‌లతో సరిపోయే తప్పిదాలకు సీజ్‌లు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇక, ఇదే తరహా ఆరోపణలను మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యురేనియంపై పోరాడుతున్నందుకే తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిది, కర్నూలు ఎస్పీదే బాధ్యతంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న పరిటాల సునీత కూడా జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భద్రతను వన్ ప్లస్ వన్ కి కుదించారని, గతంలో మాదిరిగా 2 ప్లస్ 2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రాయలసీమలో ఇలా ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి... రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.

గవర్నర్ దూకుడుతో టీఆర్ఎస్ కు కష్టాలు.. మరో సచివాలయంగా మారుతున్న రాజ్ భవన్!!

  తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడు పెంచారు. సమస్యలపై ప్రభుత్వ పెద్దల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే వారిని నిరాశ పరచడం లేదు, భరోసా ఇచ్చి పంపుతున్నారు. ప్రజా దర్భార్ నిర్వహించబోతున్నారు, తండాల్లో బసకు రెడీ అవుతున్నారు. తమిళిసాయి ఇంత చురుగ్గా వ్యవహారాలు చక్కబెట్టేందుకు కారణమేంటి. తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడులో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజ్ భవన్ లో రెస్ట్ తీసుకోవడానికి గవర్నర్ గా రాలేదని చాలా స్వల్ప కాలంలోనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్ వచ్చీ రాగానే తెలంగాణా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు సమయం కేటాయించారు. ఆ తర్వాత మెల్లగా తనదైన పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారు అందుకే ముందు యూనివర్సిటీలపై దృష్టి పెట్టారు. తొలుత వర్సిటీల స్థితిగతులపై సమీక్ష చేశారు, కీలకమైన సూచనలు చేశారు. అప్పుడే తమిళసాయి తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. దీన్ని గవర్నర్ నిజం చేస్తున్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రాజ్యాంగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణాలో ఏర్పడ్డాయి. ఈ విషయంలో తమిళసాయి మొహమాటాలకు పోలేదు, అలాగని వివాదమూ చేయదలచుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఆమె పరిస్థితుల్ని కొన్నాళ్లు పరిశీలించిన తరువాతే రంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం, పిలిచి చర్చిస్తే పరిష్కారమయ్యే సమస్యను ప్రభుత్వమే కావాలని పెద్దది చేస్తోందన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే తమిళసాయి నివేదికతో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ పరిస్థితుల్ని ప్రధాని, హోంమంత్రికి వివరించారు, వారి సలహాలు, సూచనలు తీసుకుని తిరిగి వచ్చారు. వెంటనే ఆర్టీసీ అధికారులని పిలిపించి మాట్లాడారు, రవాణా మంత్రికి ఫోన్ చేశారు, సమ్మె విషయంలో తనకు వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ లు సమ్మెకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు, దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్న ఆందోళన ప్రజల్లో ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వం చర్చలు జరపటం లేదు, ఇక ప్రైవేటు క్యాబ్ ఆపరేటర్ లతో చర్చలు జరిపే ప్రసక్తే ఉండదు. ఈ విషయం గవర్నర్ ముందుగానే ఊహించి క్యాబ్ డ్రైవర్ సంఘ నేతలను పిలిపించి మాట్లాడారు, సమ్మెను విరమింపజేశారు. దాంతో ప్రజలు కాస్త రిలీఫ్ గా ఫీలయ్యారు, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు, కార్మికులకు భరోసా ఇస్తున్నారు. కీలకమైన అంశాల్లో మాత్రమే కాదు ప్రజా సమస్యల విషయం లోనూ తమిళసాయి దూకుడుగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ లోని పద్మాలయ, అంబేద్కర్ నగర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు ఆక్రమణకు గురైంది. దీనిపై ఆయన ప్రభుత్వ విభాగాలన్నింటికి ఫిర్యాదు చేశారు కానీ, ప్రయోజనం లేకపోయింది. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆయన గవర్నర్ కు ట్వీట్ ద్వారానే ఫిర్యాదు చేశారు, వెంటనే గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాదు వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించారు కూడా. దీంతో గవర్నర్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ప్రజా దర్బార్ ను కూడా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవ్వనుంది. కొత్తగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తండాలో ఒక రోజు బస చేయనున్నారు, రాజ్ భవన్ లో గిరిజన సంక్షేమ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు అన్నింటి లోనూ తనదైన ముద్ర వేసేందుకు తమిళసాయి ప్రయత్నిస్తున్నారు.  తమిళసాయి గత గవర్నర్ నరసింహన్ లా బ్యూరోక్రాట్ కాదు, ఆమె ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్. బీజేపీకి ఏమాత్రం బేస్ లేదని భావించే తమిళనాడులో ఆ పార్టీని నడిపించిన నేత. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు, రాజకీయాలు ఎలా చేయాలో ఆమెకు ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని చేతల ద్వారానే చూపిస్తారని అంటున్నారు. నిజానికి గవర్నర్ కు ఇంత ఛాన్స్ ఇస్తోంది తెలంగాణా ప్రభుత్వమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రజలకు ఎప్పుడో దూరమైందనే విమర్శలు ఉన్నాయి, ప్రగతి భవన్ ఛాయలకు సామాన్యులకు ప్రవేశం ఉండదు. సచివాలయం ఇపుడు ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఈ విషయంలో అధికారులకే అంతంత మాత్రం క్లారిటీ ఉంది, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పోగుబడిపోతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం కూడా తగ్గిపోతోంది, ఈ కారణంగా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వారి కోసం చూస్తున్నారు. వారికిప్పుడు గవర్నర్ రూపంలో ఓ అవకాశం దొరికిందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. తమిళసాయి ప్రజల అంచనాలను గుర్తించినట్లే ఉన్నారు అందుకే దూకుడుగా వెళుతున్నారు. ఇప్పుడున్న వేగంలోనే తమిళసాయి విధులు నిర్వహిస్తే రాజ్ భవన్ త్వరలో మరో సచివాలయంగా గుర్తింపు పొందినా ఆశ్చర్యం ఉండదంటున్నారు. గత గవర్నరుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ప్రభుత్వానికి ప్రస్తుత గవర్నర్ తీరు మింగుడుపడని అంశమే కానీ, వ్యతిరేకించలేని పరిస్థితి. గవర్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభిస్తే అది రాజకీయంగా మారిపోతోంది, ఈ అడ్వాంటేజ్ కూడా తమిళిసాయికి బాగానే ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది.

అంచనాలను తలకిందులు చేసిన ఫడ్నవిస్... మరాఠా రాజ్యంలో దేవేంద్రుడి ముద్ర...

  యువకుడు... పైగా అనుభవం లేదు... మరోవైపు శివసేన పోరు... ఇంకోవైపు సీనియర్ల ఆధితప్యం... ఇన్ని అడ్డంకులు అవరోధాల మధ్య... ప్రభుత్వాన్ని నడపడం అతనికి చేతగాదని అంచనా వేశారు. ముఖ్యంగా శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, వారందరి అంచనాలను దేవేంద్రుడు తలకిందులు చేశాడు. ప్రాంతీయ పార్టీల అధినేతల మాదరిగా మరాఠా ప్రజలపై బలమైన ముద్ర వేశాడు. ఒక్క అవినీతి మరకా అంటకుండా పరిపాలన సాగించాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని పరిష్కరించాడు. అంతేకాదు పక్కలో బల్లెంలా మారిన శివసేనను సైతం దారిలోకి తెచ్చుకుని రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అందుకే మహారాష్ట్ర ప్రజలు మళ్లీ దేవేంద్రుడికే పట్టం కట్టారని ఎగ్టిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.    ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లు బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచాయని ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి. మహారాష్ట్ర జనాభాలో 30శాతమున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అత్యంత సాహసంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో... మెజారిటీ మరాఠాల ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని తేల్చాయి. అందుకే, మరాఠా కాంగ్రెస్‌ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి మరాఠాలంతా ఏకపక్షంగా బీజేపీకి సై అన్నారని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక, మోడీ-షా మాయాజాలం ఎలాగూ ఉంటుంది. అలాగే బీజేపీకి పేటెంట్ గా మారిన జాతీయవాదం, హిందూత్వం కూడా మరోసారి మహారాష్ట్ర పీఠం దక్కించుకునేందుకు దోహదపడబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను... మరోసారి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. రాహుల్ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను మాత్రం మరాఠాలు చేరదీయలేదని అంచనా వేశాయి.

ఏపీ ఆవిర్భావ దినోత్సవంపై వివాదం... నవంబర్ 1పై జగన్ సర్కార్ మొగ్గు..!

  అవశేష ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆవిర్భావ దినోత్సవం నిర్వహించకుండా, నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేసిన విభజనతో ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారంటూ విభజన బాధలను ప్రజలు గుర్తుతెచ్చుకునేలా ఆరోజు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఇఫ్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ మొదలైంది. అయితే, రాష్ట్ర విభజనతో జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు... ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడింది. అలాగే విస్తృత చర్చలు జరిపింది. చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయానికి వచ్చిందట. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన దినాన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం అంత సరైనది కాకపోయినా... తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. ఈ రెండు తేదీలను కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, జగన్ ప్రభుత్వం ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుందో చూడాలి. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా... ముందుగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అంటున్నారు.

వరుస భేటీలతో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశం తుది దశకు చేరనుందా?

  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.

రెండు వర్గాలుగా విడిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. అసలేం జరుగుతోంది?

  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.

నిర్మలాపై పరకాల ఎఫెక్ట్... కేంద్రంలో కలకలం రేపుతోన్న కామెంట్స్

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

కేసు మీద కేసు... రిమాండ్ మీద రిమాండ్... చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తాడా?

చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.

జెడ్పీ ఛైర్మన్‌ వర్సెస్ కలెక్టర్... టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న కొత్త వివాదం 

  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.

హుజూర్ బైపోరులో టీఆర్ఎస్ కి కొత్త భయం... టెన్షన్ పెడుతోన్న రోడ్ రోలర్, ట్రాక్టర్

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.

ఏపీ బయటా ఆరోగ్యశ్రీ... ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు జగన్ సూత్రాలు

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ బయటా... ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏపీలోనే కాకుండా... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. అలాగే, పశ్చిమగోదావరిలో 2వేల వ్యాధులకు... మిగతా జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కిడ్నీ రోగులకు ఇస్తున్నట్లే.... తలసేమియా, హీమోఫీలియో, ఎనీమియా పేషెంట్స్‌కు కూడా నెలకు 10వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్ర వ్యాధులుంటే ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆపరేషన్స్ తర్వాత కోలుకునేంతవరకు ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. వీళ్లందరికీ నెలకు 5వేలు లేదా రోజుకి 225 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. అదేవిధంగా 5వేల రూపాయల పెన్షన్ కేటగిరిలోకి పక్షవాతం, కండరాల క్షీణతలాంటి మరో నాలుగు వ్యాధులను చేర్చారు. వైద్యారోగ్యశాఖలో మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం జగన్‌.... హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది జీతాలను 16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు.... కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని తెలిపిన వైఎస్ జగన్‌.... కంటి వెలుగు మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనూ బైక్స్ ద్వారా వైద్యసేవలు అందిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా ఆరు సూత్రాల అజెండాతో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ‎ఆదేశించారు.

క్లైమాక్స్‌కి హుజూర్‌నగర్‌ క్యాంపైన్... ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

హుజూర్‌నగర్‌ బైపోల్‌ క్యాంపైన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్ధులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నువ్వానేనా అంటూ తలపడుతోన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉపపోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనాసరే హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా... మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, నియోజవర్గమంతా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి... తనకు ఒక్క అవకాశం ఇస్తే.... హుజూర్‌ నగర్‌ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ టీమ్‌ డేగకన్నుతో కాపలా కాస్తోంది. అయితే... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో హుజూర్‌నగర్‌ ఫలితం కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అగ్ర నేతలతో వరుస భేటీ అవుతున్న మెగాస్టార్ అసలు వ్యూహం ఏమిటి?

'సైరా' తో మెగాస్టార్ ఘన విజయం సాధించిన తరువాత మెగా హీరో పలువురు అగ్రనేతలతో భేటీ అవుతున్నారు.దీనిపై మెగాస్టార్ ఎటువైపు అడుగులు ఎటు వేయబోతున్నారనే అనుమానాలు జోరందుకుంటున్నాయి.కానీ మెగాస్టార్ మాత్రం పెదవి విప్పడం లేదు. చిరంజీవి వరుస భేటీలు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. ఆయన ఈ వరుస సమావేశాలు ఎందుకు జరుపుతున్నారని చర్చ మొదలైంది.మొన్న గవర్నర్ తమిల శ్రీతో భేటీ, నిన్న జగన్ తో ఫ్యామిలీ లంచ్ మీటింగ్, వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వక సమావేశం, రేపు అమిత్ షా, మోదీని కలవబోతున్న మెగా హీరో పై పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేక సైరా ప్రమోషన్ కోసమే ఈ మీటింగుల అనే విషయం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిల శాయిని కలిశారు. ఆ తర్వాత అమరావతి వెళ్లి సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ ని కలిశారు. గంటపాటు లంచ్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో ఏమి చర్చించారనేది హాట్ టాపిక్ గా మారింది.కేవలం మర్యాదపూర్వక భేటీ ఏ అని రాజకీయాలు చర్చించలేదని బయటకి చెప్పారు. కానీ లోపల సమావేశాల్లో చాలా చర్చించారు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. జగన్ తో మీటింగ్ అలా ముగిసిన వెంటనే చిరంజీవి ఢిల్లీకి పయనమైయ్యారు.ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడిని కలిసి ఆయనకు సైరా సినిమాను చూపించారు. రేపో మాపో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా కలవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ నేపథ్యంలో కొత్త కొత్త వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.బీజేపీ వైపు చూపు పడింది అనే ప్రచారం ఊపందుకుంది. ఏపీలో బీజేపీకి క్రౌడ్ పుల్లర్ కావాలి. బీజేపీకి సరైన లీడర్ దొరకడం లేదు. దీంతో చిరంజీవిని లాగాలని ఎప్పట్నుంచో బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అమిత్ షా భేటీ తర్వాత చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ వస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి వస్తే బీజేపీ, వైసీపీ కూడా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ చిరు మనసులో ఏముందో పార్టీలు మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. అయితే చిరూ సన్నిహితుల్లో మాత్రం వేరే వర్షన్ వినిపిస్తున్నారు. సైరా సినిమా ముందు నుంచే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన ఇక రాజకీయాల వైపు వెళ్లారని అంటున్నాయి. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే నేతలను కలుస్తున్నారని వీరు చెబుతున్నారు. ఈ వరుస భేటీలు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వివరిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాకు ఇప్పటికే ప్రారభించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా వరుస సినిమాలతో చిరంజీవి బిజీ కాబోతున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల వైపు రారనేది ఆయన సన్నిహితుల మాట.మరి చిరంజీవీ మనసులో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ

    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.