రేవంత్ పై పీకే విమర్శలు.. వ్యూహమేంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం, విమర్శల వెనుక అర్ధవంతమైన కారణమే ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడానికి బీహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలను ఒక్క ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు.. రాజకీయాలకు అతీతంగా బీహార్ వాసులంతా తప్పుపడుతున్నారు. బీహార్ కు చెందిన కన్హయ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు రేవంత్ ను మర్యాద తెలియని మనిషిగా, అనాగరికుడిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. తనది తెలంగాణ డీఎన్ఏగా గర్వపడుతున్నానని చెబుతూ.. కేసీఆర్ డీఎన్ఏను తక్కువ చేసి వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది.  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  కారాలు మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ ను గద్దెదింపడం ఖాయమని పీకే ప్రతిజ్ణ చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు ఉన్న పీకే చేసిన ఈ సవాల్ సంచలనం సృష్టించింది. అంతే కాదు.. రేవంత్ వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలపై చూపే అవకాశం ఉందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై పీకే వ్యక్తం చేసిన ఆగ్రహం, చేసిన సవాల్ 2028 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చూపే ప్రభావం ఏమిటో తెలియదు కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలన్నదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రేవంత్ పై వ్యక్తం చేసిన ఆగ్రహం ద్వారా బీహారీలలో ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపడం ద్వారా తన జనసూరత్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పీకే ఈ ఎత్తుగడ బీహార్ లో ఆయన పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే తన పార్టీ విజయం కంటే.. ప్రత్యర్థి పార్టీల అవకాశాలను దెబ్బతీయడానికే వ్యూహాలు రచిస్తారని గతంలో పలు సందర్భాలలో రుజువైన సంగతి తెలిసిందే.   

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల సవారీ!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల చూసినా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ సజావుగా అమలు ఔతున్నాయి. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల జగన్ పాలనలో పేరుకే సంక్షేమం, అభివృద్ధి శూన్యం అన్నట్లుగా సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. తెలుగుదేశం కూటమి సర్కార్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు సాగుతోందనిపరిశీలకులు సైతం చెబుతున్నారు.  రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ హయాంలో కంటే ఇప్పుడే సంక్షేమం ఎక్కువగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అందించిన సంక్షేమం గోరంత,  చేసుకున్న ప్రచారం కొండంత అన్నట్లుగా ఉండేదని అంటున్నారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం కంటే లబ్ధిదారులకు సంక్షేమం అందడం ముఖ్యం అన్నట్లుగా సాగుతోందని అంటున్నారు. అభివృద్ధి పనులు నిరాటంకంగా నిరంతరం సాగుతుండటంతో ఉపాధి సైతం పుష్కలంగా లభిస్తోంది. గత జగన్ పాలనతో పోలుస్తూ ప్రస్తుత తెలుగుదేశం కూటమి పాలనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ హయాంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అదే ఇప్పడు బాబు పాలనలో తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింప చేస్తున్నారు. అలాగే గతంలో అంటే జగన్ హయాంలో పింఛన్ల కంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎక్కకువ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ హయాంలో పది వేల రూపాయలు ఇస్తే.. ఇప్పుడు చంద్రబాబు 15 వేల రూపాయలు ఇస్తున్నారు.  ఇలా ఏ పథకం చూసుకున్నా.. జగన్ హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు పాలనలో మెరుగ్గా ఉంది. అమలు పారదర్శకంగా ఉంది. గతంలో బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చానని జగన్ చెప్పినా.. ఆ బటన్ నొక్కిన సొమ్ములు ఎప్పడు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక  జగన్ హయాంలో  అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. పెట్టుబడులు ఏపీయే గమ్యం అన్నట్లుగా తరలి వస్తున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ఆందోళనలకు పిలుపునిస్తున్నా పార్టీ శ్రేణులే సీరియస్ గా తీసుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. 

తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం.. ఇంతకు మించి తరుణం ఉంటుందా?!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో   వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో   ఉనికి మాత్రంగానే మిగిలిందని చెప్పవచ్చు.  అయితే ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నది నాయకుల కొరతే తప్ప కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచారు.   ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన పరిస్థితి.  కాంగ్రెస్, బీజేపీలు ఆ ఎన్నికల  ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావన తీసుకురావడమే కాదు, పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు.  అంతే కాదు..  అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నం చేసింది.  ఎవరు ఔనన్నా కాదన్నా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం దండిగా ఉంది. ఈ విషయం పదేపదే నిర్ద్వంద్వంగా రుజువు అవుతూనే వస్తోంది. రాష్ట్ర విభజన అనంతర   పరిణామాలతో  తెలంలగాణలో తెలుగుదేశం పార్టీ   ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యిందన్న మాట వాస్తవమే. అయితే ఆ పార్టీ పునాదులు మాత్రం తెలంగాణలో చెక్కు చెదరలేదు.  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు క్రియాశీలంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న భావనతో ఉన్నారు. ఇందు కోసం ఆయన తరచుగా తెలంగాణ తెలుగుదేశం నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కొద్ది కాలం కిందట జోరుగా సాగింది. అయితే ఆ దిశగా పార్టీ ముందుకు సాగిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే పరిశీలకులు మాత్రం తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడానికి, పునర్వైభవం సంతరించుకోవడానికి ఇది మంచి తరుణమని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కారణాలేమైతేనేం.. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే ఆలా వెళ్లిన నేతల వెంట కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు. అంతెందుకు తొలి నుంచీ తెలుగుదేవం పార్టీతో అనుబంధం ఉన్న పలువురు నేతలు ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం ఇన్ యాక్టివ్ అయినా.. ఎప్పటికైనా తెలుగుదేశం రాష్ట్రంలో పుంజుకుంటుందన్న విశ్వాసం మాత్రం కార్యకర్తలలో ఇసుమంతైనా సడలలేదు.   ఇటీవల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు.  ఇది జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ తరుణంలో తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా.. స్థానిక సమరంలో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించితే.. పార్టీ ప్రజలకు చేరువ అవుతుందనీ, అది రాష్ట్రంలో ముందు ముందు  తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు దోహదపడుతుందని కార్యకర్తలు గట్టిగా చెబుతున్నారు.  పరిశీలకులు విశ్లేషణలు కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో? 

తెలంగాణ స్థానిక ఎన్నికలు.. చేతులెత్తేసిన పార్టీలు

రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించవలసి వుంది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై జీవో జారీ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి మార్గం సుగమం చేసింది. అంతే వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అయితే ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన పార్టీలేవీ రెడీగా లేవు.  వైపు ఓటమి భయం అన్ని పార్టీలలోనూ సమానంగా వ్యక్తం అవుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. అన్న ఆందోళన కనిపిస్తున్నది. ఈ దశలో బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసలు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. అనవసరంగా భారీ ఆర్భాటంతో ప్రచారాలు చేయవద్దనీ, దావతుల పేరుతో డబ్బులు వృధా చేసుకోవద్దనీ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  నిజానికి స్థానిక సమరంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహకాల విషయంలో ఇంకా తొలి అడుగులోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల జీవో తో రేవంత్ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం కాంగ్రెస్ గ్రాఫ్ ను ఏ మాత్రం పెంచిందంటే.. ఆ పార్టీ నాయకులే అనుమానం అంటూ నసుగుతున్నారు. అధికారంలో ఉండి స్థానిక ఎన్నికలలో సత్తా చాటలేకపోతే ఆబోరు దక్కదన్న భయం కాంగ్రెస్ లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ లో స్థానిక ఓటమి పార్టీ ఉనికికే ముప్పు తెస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.    ఇక్కడ మరో ప్రధాన అంశమేంటంటే.. బీజేపీ 42శాతం రిజర్వేషన్లను బాహాటంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేదు. అయినా ఈటల మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థ‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వం  ప్ర‌భుత్వం 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఏదోలా ఎన్నికలు జరిగినా.. తరువాత ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే జరిగిన ఎన్నికలను రద్దు చేసే అవకాశాలున్నాయని ఈటల చెబుతున్నారు. తద్వారా ఈటల హేతురహితంగా ఎన్నికల రద్దు ప్రస్తావన తేలేదనీ, గతంలో  మ‌హారాష్ట్రంలో ఇలాగే జరిగిందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మహారాష్ట్ర కూడా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించింది. అయితే ఆ తరువాత ఆ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని బొంబై హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని కూడా ఈటల ఉదహరించారు. ఆ ఉదాహరణ చూపుతోనే.. ఎన్నికలకు ప్రచారార్భాటాలు, దావత్ లతో సొమ్ము వృధా చేసుకోవద్దన్నారు.  అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేంటంటే స్వయంగా బీసీ నాయకుడై ఉండీ ఈటల కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకించడం. దీనినే ఎత్తి చూపుతూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా.. ఎన్నికల విజయంపై మాత్రం ఆ పార్టీలో ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అందుకే షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల హడావుడి మాత్రం పార్టీలలో పెద్దగా కనిపించడం లేదు. 

స్ధానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ కు రిజర్వేషన్ల సవాల్!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే..  తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 5 వేల 749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు.. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక.. 12 వేల 733 గ్రామ పంచాయతీలకు..  3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.  అక్టోబర్‌ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్‌ 13న రెండో దశఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రెండో దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 15ని చివరి తేదీగా నిర్ణయించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ  స్థానాలకు.. అక్టోబర్ 23న తొలిదశ , అక్టోబర్ 27న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.  అక్టోబర్ 31న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం లక్షా 12 వేల 474 పోలింగ్ స్టేషన్లలో.. పోలింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కోటీ 67 లక్షల మందికి పైగా ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో.. 85 లక్షల 36 వేల మందికి పైగా మహిళా ఓటర్లు, 81 లక్షల 65 వేల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో.. 14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఈ మేరకు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. అక్టోబర్ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అయితే.. దానికంటే ఒక్క రోజు ముందే.. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై.. హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూలమైన ఆదేశాలు గనక వస్తే.. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చర్చ జరుగుతోంది. ఇది.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర మేలు చేస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బహుశా ఇదే తొలిసారి. ఇప్పటికే దీనిపై జనంలో చర్చ మొదలైంది. దాంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవలం చేసుకుంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.

ఆసియా క‌ప్ కాదు.. భార‌త్- పాక్ గ్రౌండ్ వార్?

ఈ సారి ఆసియా క‌ప్   చాలా చాలా ప్ర‌త్యేకం. దీన్ని పిచ్ పై జ‌రిగిన‌ భార‌త్- పాక్  వార్ గానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ లో భార‌త్ గెలిచిందే కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి మొద‌లైంది అస‌లు ర‌గ‌డ‌. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య కేవ‌లం స‌రిహ‌ద్దులోనే కాదు ఏ వైదిక‌మీద‌నైనా యుద్ధం యుద్ధ‌మేని. అందుకే మోడీ కూడా ఇదే త‌ర‌హాలో ట్వీట్ చేశారు. పిచ్ మీద జ‌రిగిన‌ ఆప‌రేష‌న్ సిందూర్ లో కూడా భార‌త్ దే విజ‌య‌మంటూ ఆయ‌న అన‌డం అదే సూచించింది. ఈ టోర్నీలో రెండు జ‌ట్ల మ‌ధ్య మొత్తం మూడు మ్యాచ్ లు జ‌ర‌ిగాయి.. ఫైన‌ల్లో భార‌త్, పాక్ ని ఉత్కంఠ పోరులో చిత్తు చేసి త‌న క్రికెట్ ప్ర‌తీకారంతీర్చుకోగ‌లిగింది.  ఒక ద‌శ‌లో పాక్ ఆట‌గాళ్లు అన్న మాట‌లేంటంటే.. తాము ఎందుకు ఓడిపోయామంటే.. భార‌త్ ని ఫైన‌ల్ వ‌చ్చేలా చేసి.. అక్క‌డ ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోడానికీ అన్న కామెంట్లు పెద్ద ఎత్తున హాస్యాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ స‌రికే గ‌న్ పేల్చిన పోజులు, విమానాన్ని కూల్చామ‌న్న సిగ్న‌ళ్లిచ్చి వివాదాస్ప‌ద‌మైన పాక్ ఆట‌గాళ్లు.. త‌ర్వాత ఐసీసీ చేత చీవాట్లు తినాల్సి వ‌చ్చింది. ఇక ఇలాంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం కూడా నేర‌మ‌న్న కోణంలో సూర్య‌కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌తీకార చ‌ర్య‌కు ఐసీసీ ద్వారా మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కోవ‌ల్సి వ‌చ్చింది. అయినా సరే ఏమంత లెక్క  చేయ‌లేదు.. సూర్యా భాయ్. పైపెచ్చు ఆ  దేశాన్ని త‌మ‌కు ప్ర‌త్య‌ర్ధిగా అభివ‌ర్ణించ‌రాద‌ని కూడా సూచించారాయ‌న‌. కార‌ణం.. త‌మ‌తో ఏ పిచ్ మీద, ఏర‌క‌మైన మ్యాచ్ జ‌రిగినా.. వ‌రుస‌గా ఓడిపోయే టీమ్ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు  సూర్య‌. ఇక ఫైన‌ల్ అయితే టాస్ ఓడి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన పాక్.. తొలుత మంచి ప్రారంభం చేసింది. కానీ ఓపెన‌ర్లు ఔట్ కాగానే, ఆ ఇన్నింగ్స్ కాస్తా పేక‌మేడ‌లా కూలింది. కుల్ దీప్ అయితే ఏకంగా  నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు ఆ నాలుగు వికెట్లలో మూడు ఒకే ఓవర్ లో తీసుకున్నాడు. ఇక 147 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న మొద‌లు పెట్టిన భార‌త్ .. అభిషేక్ శ‌ర్మ రూపంలో ఊచ కోత మొద‌వుతుంద‌ని అంద‌రూ ఆశిస్తే.. అది కాస్తా ఆశ అడియాశే అయ్యింది. ఆపై శుభ్ మ‌న్ గిల్, సూర్య కూడా త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్  అయ్యారు. అయితే ఇండియా చేతులెత్తేయలేదు. తెలుగింటి కుర్రాడు.. తిల‌క్ వ‌ర్మ‌.. త‌న‌దైన బ్యాటింగ్ విధ్వంసంతో క‌ప్పు భార‌త్ చేజారి పోకుండా కాపాడాడు. దీంతో 9వ సారి ఆసియా క్రికెట్ కింగ్ భార‌తే అని నిరూపించ‌గ‌లిగాడు.  ఒక్క మాట‌లో చెప్పాలంటే తిల‌క్ వ‌ర్మ చేసినవి కేవ‌లం 69 తొమ్మిది ప‌రుగులు మాత్ర‌మే కావు, కోటాను కోట్ల మంది భార‌తీయుల‌ భావోద్వేగాలు. దీంతో సూర్య‌కుమార్ యాద‌వ్ తిల‌క్  వ‌ర్మ‌కి టేక్ అబౌ ఇచ్చి గౌర‌వించాడు. ఇక క‌ప్ ఒక పాకిస్తానీ నుంచి అందుకోవ‌డం భారత్ కు నచ్చకపోవడంతో.. ప్రజంటేషన్  సెర్మ‌నీ గంట‌న్న‌ర ఆల‌స్యంగా జ‌రిగింది. ఆపై మ‌రొక‌రి ద్వారా ఇస్తార‌న్న మాట కూడా వినిపించింది .కానీ..  ఏషియ‌న్ ఛాంప్స్- 2025 ఈ సారి క‌ప్ అందుకోకుండానే టీమిండియా స‌భ్యులు త‌మ‌ సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌ల్సి వ‌చ్చింది.  దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానీయుల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌క పోవ‌డం మాత్ర‌మే కాదు, వారిచ్చే క‌ప్పు కూడా మాకు గ‌డ్డిపోచ‌తో స‌మానం అన్న అర్ధ‌మొచ్చేలా వ్య‌వ‌హ‌రించింది భార‌త జ‌ట్టు. ఒక ద‌శ‌లో టోర్నీ  నుంచి నిష్క్ర‌మిద్దామ‌నుకున్న పాక్ జ‌ట్టు.. కోట్ల రూపాయ‌ల‌  న‌ష్ట‌ప‌రిహారం క‌ట్ట‌లేక కొన‌సాగ‌డం మాత్ర‌మే కాదు.. ఫైన‌ల్ లోనూ భార‌త్ చేతిలో ఓడి.. భార‌త్ ముందు త‌న ప‌రాజ‌య ప‌రంప‌ర‌ను పూర్తి చేసుకుంది.  దీంతో క‌ద‌న రంగంలో,క్రికెట్ పిచ్ పైనా.. రెండింటా.. భార‌త్ ముందు పాక్ దిగ‌దుడుపే అని మ‌రోమారు ప్ర‌పంచానికి అర్ధమయ్యేలా   ఈ ఆసియా క‌ప్ జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పండ్రా అమెరిక‌న్లూ.. కాల్పుల విర‌మ‌ణ మీరు చేశారా? లేక భార‌తే పాక్ ని త‌ల వంచేలా చేసిందా?  అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  ఆ మాట‌కొస్తే ఇండియ‌న్ ఫ్యాన్స్ ఫ‌స్ట్ మ్యాచ్ నే బాయ్ కాట్ చేశారు. పెహ‌ల్గాంలో అకార‌ణంగా 26 మంది చావుకు కార‌ణ‌మైన పాక్ జ‌ట్టుతో మ‌నం క్రికెట్ ఆడ్డం ఏంట‌న్నది వీరి వాద‌న‌.  కాగా.. ఇపుడీ ఫైన‌ల్ మ్యాచ్ విన్నింగ్ ద్వారా పాక్ కి మ‌రో మారు బుద్ధి చెప్ప‌గ‌లిగింది భార‌త్. ఇదిలా ఉంటే కొంద‌రు పాకిస్థాన్ క్రికెట్ ల‌వ‌ర్స్.. మా క్రికెట్ జ‌ట్టు వ‌ల్ల మాకెలాంటి లాభం లేదు. సుఖం సంతోషం లేదు.. పాకిస్థాన్ మొత్తం క‌ట్ట‌క‌ట్టుకుని వ‌చ్చినా కూడా భార‌త్ పై మేం గెల‌వ‌డం సాధ్యం కాదు. అందుకే ఐ ల‌వ్ ఇండియా. మేం కూడా టీమిండియా అభిమానుల‌మే.. అన‌డం క‌నిపించింది.

ఔషధాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌ బాంబు

ఇప్పటికే.. భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. మరోసారి టారిఫ్ షాక్ ఇచ్చింది. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్ విధించింది. దాంతో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైనా అమెరికా అధ్యక్షుడు సుంకాలతో విరుచుకుపడ్డారు.  ముఖ్యంగా పేటెంట్ ఔషధాలపై.. ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక.. కిచెన్ క్యాబినెట్, బాత్ రూమ్ పరికరాలపై 50 శాతం, అప‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై పాతిక శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ విధించిన   జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని.. ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సుంకాలతో.. భారత ఫార్మా ఉత్పత్తులపై ఎంత ప్రభావం పడుతుం దన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 28 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం ఔషధాలు యూఎస్‌కే వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం ఇండియా నుంచి సరఫరా అయ్యేవే ఉంటాయి.  ఇప్పుడు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో  అమెరికా మార్కెట్‌లో భారత ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే.. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసే మెడిసిన్లలో ఎక్కువ భాగం జనరిక్ మందులే ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై టారిఫ్ లేదు. కేవలం.. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే ఈ వంద శాతం టారిఫ్ వర్తిస్తుంది. దీంతో.. ఈ తరహా ఔషధాలు ఎగుమతి చేసే కంపెనీల లాభాల మార్జిన్‌లు, స్టాక్ ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ.. టారిఫ్ పరిధిని కాంప్లెక్స్ జనరిక్స్‌కి కూడా విస్తరిస్తే.. భారతీయ ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.  తక్కువ ధరలలో నాణ్యమైన ఔషదాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసమయ్యే 47 శాతం ఔషధ అవసరాలను భారత్ కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్‌లు కేవలం బ్రాండెడ్, పేటెంట్ కలిగిన  ఔషధ దిగుమతులకే వర్తిస్తాయి. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి జనరిల్ ఔషధాలే. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత్ ఎగుమతులపై ప్రభావం ఉండబోదంటున్నారు.  అయితే.. సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు.. భారతీయ కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గానీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై ఫోకస్ చేయడం లాంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తరచుగా ట్రంప్ సర్కార్.. భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని.. విదేశాంగ విధాన వైఫల్యంగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. సుంకాలు, హెచ్1బీ వీసాల ఫీజు పెంపు, వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. అమెరికా చర్యల పట్ల.. కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంపైనా.. విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

రాహుల్ కోరుకుంటున్న జెన్ జెడ్ మూవ్ మెంట్ ఇదేనా?

మొన్నా మ‌ధ్య రాహుల్ ఓట్ చోరీ వ్య‌వ‌హారంలో చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్ లోనూ విద్యార్ధులు జెన్ జెడ్ ఉద్య‌మం మొద‌లు పెడితే.. వారికి తాము అండ‌గా నిలుస్తామ‌ని అన్నారాయ‌న‌. అందులో భాగంగానే త‌న విదేశీ స‌ల‌హాదారు శ్యామ్ పిట్రోడా ద్వారా.. పాకిస్థాన్ సొంతింటిలా అనిపిస్తుంది.. నేపాల్, బంగ్లా ప్ర‌శాంతంగా ఉంటాయ‌న్న రాంగ్ కామెంట్స్ చేయించిన‌ట్టు గానూ తెలుస్తోంది. ఇవ‌న్నీ అలాగుంటే ఇప్పుడు ల‌డక్ నుంచి రాహుల్ కొన్ని విదేశీ శ‌క్తుల‌తో క‌ల‌సి జెన్ జెడ్ మూమెంట్ ని మొద‌లు పెట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. కావాలంటే చూడండి.. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తోంది పైకి సోనం వాంగ్ చుక్ అయినా.. దీని వెన‌క ఉన్న‌ది స్థానిక కాంగ్రెస్ నేత‌.. పుంట్సోక్ త్సెసాగ్ అంటారు వీరు. లేహ్ లోని ప్ర‌భుత్వ ఆస్తుల‌తో పాటు బీజేపీ కార్యాల‌యాన్ని త‌గ‌ల‌బెట్టించ‌డం అనే ఘ‌న కార్యం ఈ త్సెసాగ్ చేతుల మీదుగానే జ‌రిగింద‌ని చెప్పుకొస్తారు. ఇంత‌కీ ఎవ‌రీ సోనం వాంగ్ చుక్. ఏంటీ ల‌డ‌క్ డిమాండ్? అని చూస్తే..  ఒక విద్యావేత్తగా, ఇంజినీర్‌గా, పర్యవరణ సంరక్షకునిగా, సామాజిక కార్యకర్తలు ఈ దేశ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని సోనమ్ వమ్ము చేశాడ‌ని అంటారు బీజేపీ నేత‌లు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో లడ‌క్ ప్రజలను రెచ్చగొడుతున్నార‌నీ ఆరోపిస్తున్నారు వీరంతా.   లడ‌క్ ప్ర‌స్తుత‌ పరిస్థితిని మనమంతా గమనించాలనీ.. ఇప్పటికే లడక్‌లోని సగభాగం అక్సాయ్ చిన్‌ను చైనా ఆక్రమించిందనీ.. దేశ భద్రత దృష్ట్యా అది మన దేశానికే కీలక ప్రాంతమ‌నీ.. ఈ కారణాలవల్లే ఆర్టికల్ 370 రద్దు దర్వాత జమ్మూ కశ్మీర్ నుంచి లడ‌క్ ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించించారనీ చెప్పుకొస్తారు కాషాయ నేత‌లు.   కేవలం 2 లక్షల మంది కోసం ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం?  ఈ లెక్కన మన దేశంలోని ప్రతి జిల్లాను ఒకటో, రెండో రాష్ట్రాలు చేయాల్సిందేనా? లడ‌క్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలంటే దాన‌ర్ధ‌మేంటి? దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు, ఏర్పాటు చేయకాకుండా అడ్డుకోవాల‌నే కుట్ర కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు క‌మ‌ల‌నాథులు.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్ హ్యాండిల్స్  ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? ఈయన వెనుక కొన్ని విదేశీ శక్తులు దాగి ఉన్నాయా? అన్న కోణంలోనూ ఆరా తీయాల్సిందేనంటారు బీజేపీ వారు. ఈ అనుమానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా.. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో పర్యటించి వచ్చారు. అంతే కాదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో కూడా స‌త్సంబంధాలు ఉన్నాయి సోన‌మ్ కి. వాంగ్‌చుక్ చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్న కేంద్రం చర్చల కోసం తేదీలను కూడా ప్రకటించింది. అసలు సోనమ్ ఇచ్చిన జన్ జడ్ పిలుపు అర్థం హింసేనా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తో పోల్చ‌డంలోని ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ అంత‌ర్గ‌తంగా దేశ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అత‌లాకుత‌లం చేసే కుట్రలు కావా? అని ప్ర‌శ్నిస్తున్నాయి కాషాయ వ‌ర్గాలు. రాహుల్ గాంధీ చెప్పిన జన్ జడ్ తిరుగుబాటు ఇదేనా? లడాక్‌లో అల్లరి మూకలను పోగేసి విధ్వంసానికి దిగింది ఎవరో గమనించ‌మంటున్నారు క‌మ‌ల‌నాథులు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంట్సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ చేతిలో ఆయుద్ధం పట్టుకొని హింసాకాండకు నాయత్వం వహించాడ‌నీ.. లేహ్‌లో ప్రభుత్వ ఆస్తులతో పాటు బీజేపీ కార్యాలయానికి కూడా ఇత‌డే నిప్పు పెట్టించాడనీ అంటారు బీజేపీ లీడ‌ర్లు. అయితే ఫోటోల్లో ఉన్నది తాను కాదని త్సెపాగ్ బుకాయిస్తున్నాడనీ.. నిజమేంటో త్వ‌ర‌లో దర్యాప్తు ద్వారా తేలుతుందని చెప్పుకొస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు.  అసలు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ విష‌యం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డుతుంద‌ని.. ఇదంతా రాహుల్ విదేశీ శ‌క్తుల‌తో చేతులు క‌లిపి చేస్తున్న కుట్ర మాత్ర‌మేన‌ని అంటోంది క‌మ‌ల‌ద‌ళం. మ‌రి చూడాలి.. ఈ పోరాటం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో!

విశ్వవిద్యాలయాలపై కాషాయ జెండా రెపరెపలు.. దేనికి సంకేతం?

కాంగ్రెస్ అగ్ర నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమ మనసులోని మాటను చాలా చక్కగా బయట పెట్టారు. మన ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో వచ్చిన జెన్  జెడ్    తిరుగుబాటు మన దేశంలో కూడా వస్తుందనీ, దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్ముక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళన సాగిస్తున్న రాహుల్ గాంధీ.. తమ ఓటు చోరీ ఆందోళన జెన్ జెడ్  ఆందోళనగా రూపాంతరం చెందుతుందని ఆశిస్తున్నారు. నమ్ముతున్నారు. అదే మాట అంటున్నారు. విద్యార్ధులు, యువత ఒక్కటై రాజ్యాంగాన్ని కాపాడుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఎప్పుడూ ముందుంటాననీ, జెన్ జెడ్  ఆందోళనకు సంపూర్ణ మదటు ఉంటుందని  రాహుల్ గాంధీ చెబుతున్నారు.  ఒక్క  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు..  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామరావు కూడా  ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే మన దేశంలోనూ నేపాల్ తరహా  జెన్  జెడ్ తిరుగుబాటు తప్పక వస్తుందంటున్నారు. మొత్తానికి  రాహుల్ గాంధీ మొదలు కేటీఆర్ వరకు.. ఇంకా ఇండి  కూటమి పార్టీల నాయకులు కూడా నేపాల్  తరహా  తిరుగుబాటు మన దేశంలోనూ వస్తుందనీ.. రావాలని ఆశిస్తున్నారు.  మరో వంక  బీజేపీ రాహుల్  గాంధీ ఆలోచనలను అర్బన్ నక్సల్  ఆలోచనలుగా పేర్కొంటూ.. దేశంలో అస్థిరత్వాన్ని ప్రోది చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపి స్తున్నారు.  అదలా ఉంటే..  భారత దేశంలో నిజంగా   ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితి ఉందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే..   విద్యార్ధి లోక నుంచి లేదనే జవాబే వస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు, ఇటివల కాలంలో వెలువడిన విద్యార్ధి తీర్పులను ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇటీవలి కాలంలో ఢిల్లీ జరిగిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘం ఎన్నికల్లో  ఆర్ఎస్ఎస్  అనుబంధ అఖిల భారతీయ విద్యర్ది పరిషత్ (ఏబీవీపీ) వరస విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీ నుంచి మణిపూర్ వరకూ,మణిపూర్ నుంచి గుహవటి వరకూ,  గుహవటి నుంచి పంజాబ్ , పంజాబ్ నుంచి పాట్నా, పాట్నా నుంచి ఉత్తారఖండ్, ఉత్తారఖండ్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాల ఎన్నికలలో ఏబీవీపీ ఎదురులేని విజయాలను సొంత చేసుకుంది.  ఈ విజజయాలు   నేపాల్ తరాహా విద్యార్ధి తిరుగుబాటును ఆశించిన రాహుల్ గాంధీ, సహా పలువురు నేతల ఆశలను అడి యాసలు చేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే..  విద్యార్ధులు, యువతలో అశాంతి అసలే లేదా అంటే ఔనని చెప్పలేం. అయితే..  ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంచడంలో విఫలం కావడం వల్లనే విద్యార్ధులు,యువత సహా అన్ని వర్గాల ప్రజలు కాషాయంవైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటు న్నారు.  

కేంద్ర మంత్రి పదవి.. గవర్నర్ పోస్టు.. తెలుగుదేశంకు కేంద్రం ఆఫర్?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కేంద్రంలో ఉన్న పలుకుబడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇలా అడిగితే.. అలా కేంద్రం అనుమతులు మంజూరు చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ మనుగడకు తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకం కనుక మాత్రమే ఈ పలుకుబడి అనుకోవడానికి వీలు లేదు. చంద్రబాబు దార్శనికత.. దేశ ప్రగతికి ఆయన సలహాలు అత్యంత ముఖ్యమని కేంద్రం పెద్దలు భావిస్తుండటమే అందుకు కారణమని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా కేంద్రం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కేంద్రం తెలుగుదేశం పార్టీకి మరో రెండు కీలక పదవులను కట్టబెట్ట నుంది. అవేంటంటే బీహార్ ఎన్నికల తరువాత జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం కు మరో మంత్రి పదవి. అంటే ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఇద్దరు తెలుగుదేశంకు చెందిన వారు ఉన్నారు. అదనంగా మరో మంత్రిపదవిని కూడా తెలుగుదేశంకు ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా కూడా తెలుగుదేశం కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్రం వర్గాలు అంటున్నాయి.  ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రధాని మోడీ చర్చించినట్లు సమాచారం.  ఇటీవలే  కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి   అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నేతను మరో  రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పడు అంటే బీహార్ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం మరో రెండు కీలక పదవులను తెలుగుదేశంకు ఆఫర్ చేయనున్నది. అయితే ఆ పదవులకు చంద్రబాబు ఛాయస్ ఎవరై ఉంటారన్నచర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు  తెలుగుదేశం నుంచి గవర్నర్ పదవి కోసం రేసులో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. వారిలో ఒకరు మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన యనమల రామృష్ణుడు కాగా మరొకరు మాజీ మంత్రి కేఈకృష్ణమూర్తి. ఈ ఇరువురూ కూడా చంద్రబాబుకు సన్నిహితులే. ఈ ఇరువురిలో చంద్రబాబు కేఈ కృష్ణమూర్తివైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా ఉన్నారు. కనుక ఇప్పుడు రాయల సీమకు చెందిన కేఈ కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే.. సామాజిక సమీకరణలతో పాటు ప్రాంతీయ సమతుల్యం కూడా పాటించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక యనమనలను అయితే రాజ్యసభకు పంపించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ సీనియర్లలో ఆయన సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. 

అన్న‌ల్లో ఏంటీ గంద‌ర‌గోళం?

ఎల్లకాలమూ సింహం మాత్ర‌మే   వేటాడ‌దు. అప్పుడ‌ప్పుడూ సింహాన్ని వేట‌గాడు త‌రిమి త‌రిమి  కొడుతుంటాడు. దీంతో ఆ సింహం వెన‌క‌డుగు వేసి అల‌సి సొల‌సి లొంగిపోయేలా క‌నిపిస్తుంది. వేట నుంచి త‌ప్పుకుందామ‌ని కొంత సేపు. లేదు నేనింకా మృగరాజునే.. న‌న్నెవ‌డ్రా ఆపేద‌న్న ఆలోచ‌న కూడా చేస్తుంటుంది. ఈ రెండు ఆలోచ‌న‌ల దోబూచులాట‌లో.. ప‌డ్డ సింహం అవ‌స్థ ఆ వేట‌గాడికి కూడా కాసేపు ఏం చేయాలో అర్ధం కాదు. స‌రిగ్గా అలాంటి దృశ్య‌మే క‌నిపిస్తోంది అడ‌విలోని.. అన్న‌ల విష‌యంలో. కావాలంటే చూడండీ.. మొన్న నక్సల్ నేత అభ‌య్ పేరిట ఇక ఈ ఉద్య‌మం మేం న‌డ‌ప‌లేం అన్న ఆడియో క్లిప్పింగ్ విడుద‌లైందా? ఇప్పుడు చూస్తే అదే అన్నల నాయకుడు జ‌గ‌న్ పేరిట మ‌రో లేఖ విడుద‌లైంది. అన్న‌లు అలాంటి డెసిష‌న్ ఏమీ తీసుకోలేదు. ఇప్ప‌టికీ మేం అదే ఊపులో.. ఉద్య‌మంలో.. ఉన్నాము. ఇప్ప‌టికిప్పుడు మా ఉద్య‌మానికొచ్చిన లోటేం లేదు. త‌గ్గేదే లే  అన్నది ఆయన లేఖ సారాంశం.   సోనూ అలియాస్ అభ‌య్ లా ఎవ‌రైనా లొంగిపోవాల‌నుకుంటే.. వారు ఎంచ‌క్కా పార్టీ ప‌ర్మిష‌న్ తీసుకుని వెళ్లిపోవ‌చ్చు. ఇక్క‌డెవ‌రూ వార్ని ఆప‌డం లేద‌ని కూడా జ‌గ‌న్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇటు చూస్తే 2026 మార్చినాటిక‌ల్లా అడ‌వుల్లో అన్న‌ల్ని ఏరి పారేస్తామంటోంది కేంద్రం. దానికి  తోడు ఆప‌రేష‌న్ క‌గార్ ద్వారా స‌గం అడ‌వుల‌ను ఖాళీ చేసేశారు. మొన్నా మ‌ధ్య నంబాల అనే అతి పెద్ద మావోయిస్టు వ‌ట వృక్షాన్ని నేలకూల్చారు. యువ క‌మాండ‌ర్ హిడ్మా ఎలా ఉన్నాడో తెలీడం లేదు. ఇంకో ప‌క్క చూస్తే.. అస‌లు మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబ‌ల్యం బాగా త‌గ్గిపోయింది. అస‌లు అన్న‌ల్లో చేరుతున్న వారెవ‌రైనా ఉన్నారంటే.. అడ‌వుల్లోని ఆదివాసీలే. వారికంటే ఇటు మృగ వేట అటు పోలీసుల‌ వేట కు పెద్ద  తేడా తెలీదు. ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుట్లో అన్న‌లంటే బీటెక్, ఎంటెక్ చ‌దివే వారు,  యూనివ‌ర్శిటీల నుంచి ఎక్కువ‌గా వెళ్లేవారు. నంబాల అదే కోవ‌లోకి వ‌స్తారు. ఇప్పుడు అలాంటి డిగ్రీ హోల్డ‌ర్స్ ఎవ‌రూ లేర‌క్క‌డ‌. ఎంచ‌క్కా ల్యాప్ ట్యాప్ నే త‌మ ఆఫీసు చేసుకుని.. ఐదు రోజుల డ్యూటీ ఆపై ప‌బ్బుల వెంబడి తిరిగి తాగి తంద‌నాలాడుతూ డాల‌ర్ల వేట‌లో పీక లోతు మునిగిపోయి క‌నిపిస్తున్నారు. ప్రెజంట్ అడ‌వుల్లో ఉన్న‌ద‌ల్లా వ‌య‌సుడిగిన బ్యాచీయే. వీరంతా క‌ల‌సి.. ఉద్య‌మం న‌డ‌పాలా వ‌ద్దా? అన్న రెండు కోణాల ఆలోచ‌న చేస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డుతోంది. అందులో భాగంగానే ఈ భిన్న పార్శ్వాలు వెలుగులోకి వ‌స్తున్న‌ట్టు అంచ‌నా  వేస్తున్నారు విశ్లేష‌కులు.

యువ గళంతో కమల దళం భవిష్యత్ వ్యూహం!

వందేళ్ళు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్),భవిష్యత్  వ్యూహంలో భాగంగా బీజేపీ సహా, సంఘ్ పరివార్ సంస్థల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా?  ముఖ్యంగా, బీజేపీకి కొత్త రూపు ఇచ్చేందుకు, కాషాయ కూటమి  కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందా? దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు పార్టీకి  యూత్ లుక్, యువ వర్చస్సు ఇచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగ్తున్నాయా అంటే ఇటు పరివార్ వర్గాల నుంచి అటు పార్టీ వర్గాల నుంచి కూడా అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి..  2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా బీజేపీ  ఒక పథకం ప్రకారం పార్టీలో యువ నాయకత్వానికి సముచిత ప్రాధాన్యత  ఇస్తూ వస్తోంది. ఆర్ఎస్ఎస్ , విద్యార్ధి పరిషత్’ వంటి సంఘ్ పరివార్  సంస్థల నుంచి ఎంపిక చేసిన యువ నాయకులను  పార్టీలోకి ఆహ్వానించి బాధ్యతలు అప్పగించింది.  నిజానికి..  పరివార్ సంస్థల నుంచి పార్టీలోకి రావడం కొత్త విషయం కాదు. ముందు నుంచి కూడా ఉన్నదే. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో..  బీజేపీ పాలిత  రాష్ట్రాల మంత్రి వర్గాల్ల, సంఘ్ పరివార్ సంస్థలలో పనిచేసిన అనుభవం  సైద్ధాంతిక అవగాహన ఉన్నవారే మెజారిటీగా ఉన్నారు.  అయితే.. ఇప్పుడు 2029 తర్వాత కూడా అధికారం నిలుకునేందుకు, అంతకంటే ముఖ్యంగా ప్రస్తుత సైద్ధాంతిక ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకు పోయేందుకు, భవిష్యత్ నాయకత్వ నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ద అవసరమని బీజేపీ, పరివార్ నాయకత్వం  గుర్తించింది.  అందుకే 2024 ఎన్నికలకు ముందు నుంచి యువ నాయకత్వ నిర్మాణం పై  దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పడు యువ నాయకత్వ నిర్మాణంలో వేగం పెంచిందని  పార్టీ వర్గాల  సమాచారం.    అదలా ఉంచితే.. సంఘ్ పరివార్ సంస్థల నుంచి యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంతో పాటుగా.. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో సత్తా నిరూపించుకున్న సమర్ధ యువ నేతలను ఆకర్షించే దిశగా కమల దళం కదులుతోంది. నిజానికి..  ఇప్పటికే రాహుల్ గాంధీ పుణ్యాన, కాంగ్రెస్  పార్టీని వదిలిన  జ్యోతిరాదిత్య సింధియా వంటి అనేక మంది యువ నాయకులు  బీజేపీలో చేరారు. ముఖ్యంగా, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్న కాంగ్రెస్ యువ నాయకులు  బీజేపీ గూటికి చేరిన వారిలో అధికంగా ఉన్నారు.  ఉదారణకు  సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా, మన్మోహన సింగ్ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక భూమిక పోషించిన అహ్మద్ పటేల్ కుమారుడు  ఫైసల్ పటేల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే..  గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా నిలిచిన రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే అంటోనీ కుమారుడు అనీల్ అంటోనీ  సైతం కమలం గూటికి చేరారు.అదే విధంగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా.. ముందస్తు అప్పాయింట్ మెంట్ లేకుండా నేరుగా ఆమెను కలిసే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందిన  మాజీ ఏపీసీసీ చీఫ్  ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారడు, నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్  బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన నాయకుల కుమారులు అనేక మంది కమల దళంలో చేరారు.  కమల దళంలో చేరడం మాత్రమే కాదు.. మెల్ల మెల్లగా బీజేపీ ఐడియాలజీతో మమేక మవుతున్నారు.  నిజమే..  రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోవడం కాంగ్రెస్ యువ నాయకులు బీజేపీలో చేరడానికి ఒక   కారణం అయితే  కావచ్చు కానీ.. బీజేపీ జాతీయ భావజాల వ్యాప్తి లక్ష్యంగా రచించిన  భవిష్యత్ వ్యూహంలో భాగంగా పార్టీలతో సంబంధం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా యువ నాయకులను అకర్షించే ప్రయత్నాలు చేసింది. అందుకే..  యువ నాయకులను ఆకర్షిచడం ద్వారా  భావజాల వ్యాప్తికి విశేషంగా కృషిచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి..  జాతీయ స్థాయి మొదలు గ్రామ స్థాయి వరకు యువతను ఆకట్టుకునేందుకు, తద్వారా యువతలో జాతీయ భావజాలాన్ని నింపేందుకు  బీజేపీ  ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఫలితంగా ఈరోజు  బీజేపీ భావజాలం ముందుకంటే వేగంగా విస్తరిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి  పైకి కనిపించే పేర్లు కొన్నే అయినా అనేక రాష్ట్రాలలో చాప కింద నీరులా వేర్వేరు పార్టీల యువ నాయకులు కమల దళం లో చేరుతున్నారని సోదాహరణంగా చెబుతున్నారు.  మరో వంక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  బీజేపీతో పాటుగా ఎన్డీఎని బలోపేతం చేసేందుకు, ఎన్డీఏ పరిధిని విస్తరించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  మిత్ర పక్షాలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు  ముఖ్యంగా మిత్ర పక్షాల యువ నాయకత్వాన్ని ఆకర్షించేందుకు, యువ నేతలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  ఏపీలో తెలుగుదేశం, బిహార్ లో  జేడీయు, ఎల్జీపీతో పాటుగా.. వేర్వేరు పార్టీల యువ నాయకులను, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే..  కేంద్ర మంత్రులుగా ఉన్న యువ నాయకులు  కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, జ్యోతిరాదిత్య సింధియా సహా పార్టీతో సంబంధం లేకుండా యువ మంత్రులకు  ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అంతే కాదు..త్వరలో చేపట్టే మంత్రివర్గ పునర్వ్య స్థీకరణలో యువతకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేక పోలేదని, తద్వారా ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న  కేంద్ర మంత్రివర్గ సగటు వయసును మరింతగా తగ్గించే  ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా..  బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న విశ్లేషకులు దేశ జనాభాలో ఇంచుమించుగా 60 శాతానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని అంటున్నారు.

బీసీ కార్డ్.. తీన్మార్ మల్లన్న సరే.. కవిత ఎంట్రీ ఎప్పుడు?

తెలంగాణ రాజకీయాలలో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలూ బీసీల అభ్యున్నతి, సంక్షేమం తమ అజెండాగా చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ బీసీల విషయంలో చాంపియన్ గా నిలిచేందుకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆయుధంగా వాడుకుం టుంటే... ఈ పార్టీ నుంచే ఎమ్మెల్సీ అయ్యి.. ఇప్పుడు కాంగ్రెస్ బీసీ విధానాలు లోపభూయిష్టమని విమర్శలు గుప్పిస్తూ.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నఏకంగా ఓ కొత్త పార్టీ ప్రారంభిం చేశారు.  తెలంగాణ రాజ్యధికార పార్టీ (టీఆర్పీ) అని తన పార్టీకి పేరు పెట్టి, బీసీలకు రాజ్యాధికారం అంటూ నినదిస్తున్నారు. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా తెలంగాణ రాజకీయాలలో కి ఎంట్రీ ఇచ్చిన తీన్మార్మల్లన్న బీసీ నినాదంతో రాష్ట్రంలో గతంలో లేని కుల రాజకీయాలను వేదికపైకి తీసుకువచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.  సరే  తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదంతోనే రాజకీయాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధన అంటూ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి సస్పెండై మరీ సొంత రాజకీయ బాట ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. తన కార్యక్రమాలలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్న కవిత.. సొంత పార్టీతో ఎప్పుడు ముందుకు వస్తారన్న చర్చ తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు తరువాత మరింత గట్టిగా వినిపి4స్తోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ బీసీ కార్డును ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్ కు కవితను బీఆర్ఎస్ ట్రంప్ కార్డుగా ప్రయోగించిందా? కవిత తిరుగుబాటు వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు గుప్పించి సస్పెండైనా, హరీష్ కు మద్దతుగా, కవితకు వ్యతిరేకంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కానీ కవితపై పన్నెత్తు మాట అనలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ తీన్మార్ మల్లన్న పొలిటికల్ ఎంట్రీపై పడింది. ఆయన బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనడం లేదు.. కానీ కల్వకుంట్ల కవితపై నిప్పులు చెరుగుతున్నారు. కవితపై తీన్మార్ మల్లన్న విమర్శలను బీఆర్ఎస్ ఖండించడం లేదు.  దీంతో ఈ ఇరువురి వెనుకా ఉన్న శక్తులేంటి? వ్యక్తులెవరు అన్న సందేహం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. సరే శక్తుల సంగతి పక్కన పెడితే.. తీన్మార్ మల్లన్న టీఆర్సీ పార్టీని ప్రకటించడంతో.. ఇప్పుడు కవితపార్టీ ప్రకటన ఎప్పుడన్న ప్రశ్నకు ఆమె బదులు చెప్పుకోవాల్సి ఉంది. చూడాలి మరి జూబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ తరువాత తెలంగాణ రాజకీయాలలో ఎవరి రంగు ఏమిటి?  ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.  

చరిత్ర సృష్టించిన అసామాన్యడు.. మోదీ @75

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  బుధవారం  (సెప్టెంబర్17) 75 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ సహా దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.  మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.   మోడీ పుట్టింది పేద కుటుంబంలో  ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ పట్టణంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. పుట్టింది, పెరిగింది అతి సామాన్య కుటుంబం. ఇంకా సపష్టంగా చెప్పాలంటే..  అత్యంత నిరు పేద కుటుంబంలో మోదీ జన్మించారు. బాల్యం నుంచే పేదరికాన్ని రుచి చూశారు. అయినా.. జీవితంలో ఎక్కడా అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే ఆత్మవిశ్వాసంతో, ఒక సారి కాదు, రెండు సార్లు కాదు,  వరసగా మూడు సార్లు దేశ ప్రధాని, బాధ్యతలు చేపట్టారు.  దేశ ప్రధాన సేవకుడిగా, దేశానికి సేవలు అందిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా  గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్నారు.  స్వాతంత్య్రానంతరం  జన్మించన తొలి ప్రధానిగానే,  కాకుండా.. వరసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెసేతర తొలి ప్రధానిగానూ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్నారు.  నిజానికి స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధాని పదవిని చెపట్టిన  ప్రదానిగానూ మోదీ చరిత్ర  పుటల్లో  ఇందిరాగాంధీ కంటే ఒకమెట్టు పైన నిలిచారు.  వరసగా మూడు సార్లు ప్రధాని పదవిని అలంకరించిన మోదీ..  దేశంలో తిరుగులేని నేతగా నిలవడమే కాదు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. చేస్తున్నారు.  ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా కితాబు నందుకున్నారు. ఈ రోజుకు కూడా, 75 శాతం ప్రజమోదంతో మోదీ ప్రపంచ దేశాలు అత్యంత ప్రభావంతమైన నాయకులలో ప్రప్రధముడిగా నిలిచారు. అతేకాదు, ఇంతవరకు భారత ప్రధాని ఎవరూ అందుకోనన్ని, ప్రపంచ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇంతవరకు 18 దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో భారత ప్రధానమంత్రి, ప్రథమ సేవకుడు మోదీని  సత్కరించాయి. భారత దేశం పూర్వ వైభవాన్ని,  విశ్వగురు స్థానాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా.. 75 ఏళ్ల యువకుడిగా వడివడిగా అడుగులు వేస్తున్న మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు కారణంగా ఆయన శరీరంపై ముడతలు కనిపించినా.. ఆయన గుండె నిబ్బరం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎక్కడా ముడతలు, మడతలూ లేవు. ఒకటే గమ్యం.. ఒకటే లక్ష్యం అన్నట్లుగా  ముందుకు సాగుతున్నారు. అందుకే, 75 సంవత్సరాల వయోపరిమితి రేఖ  ఆయన ప్రస్థానానికి అడ్డు కాలేదు. సర్వామోదంతో ఆయన  ప్రధాన మంత్రిగా, ప్రధాన సేవకుడిగా  కొనసాగుతున్నారు.   బాల్యం నుంచే  1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ..  ఎనిమిదేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.ఇక అక్కడి నుంచి ఆయన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, చిరుప్రాయంలో పడిన సైద్ధాంతిక  పునాదుల ఆధారంగానే  మోదీ జీవన ప్రస్థానం సాగింది.  హై స్కూల్ చదువు పూర్తయిన  తర్వాత    ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపిన మోదీ..  ఇల్లు వదిలి కొంత కాలం  రామకృష్ణ మఠంలో, ఆ తర్వాత హిమలయా పర్వతాలలో   గురువులు, సాధు సంతుల మార్గదర్శకత్వంలో ఆద్యాత్మిక  జీవిత ప్రస్థానం సాగించారు. అయితే, ఆ తర్వాత కాలంలో  గురువులు, సాధుసంతుల ఆదేశం మేరకు, తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలనే నిర్ణయానికి కొచ్చారు. ఆర్ఎస్ఎస్  లో క్రియాశీల కార్యకర్తగా ప్రవేశించి..  కొద్ది కాలానికే  ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త) గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 15 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల్లో, సంఘ్ ప్రచారక్ గా  పనిచేశారు. ఈ 15 సంవత్సరాల కాలంలో మోదీ దేశ సామాజిక స్థితి గతులను,సమూలంగా అధ్యయనం చేశారు.   ఆ తర్వాత సంఘ్ ఆదేశాల మేరకు  బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పాలనలో గుజరాత్ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించింది. పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యంతో  గుజరాత్ మోడల్ జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలన దేశానికి ఒక ఉదాహరణగా మారింది. మోదీ సారథ్యంలో బీజేపీ గుజరాత్  లో ఆరోజు నుంచి ఈరోజు వరకు ఏనాడూ ఓటమిని చూడలేదు. 2014 మే 26న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ ఆ తరువాత 2019, 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించింది.ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుంది.  ఇంచుమించుగా పుష్కర కాలంగా సాగుతున్న మోదీ పాలనలో దేశం  కొవిడ్ మహమ్మారి సహా  ఎన్నో సవాళ్ళను ఎదుర్కున్నది. మైలు రాళ్ళను దాటింది. ఆర్థిక రంగంలో  అనూహ్య ప్రగతిని సాధించింది. 2014 లో తొమ్మిది, పది స్థానాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈరోజు ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అలాగే..  సైనిక సామర్ధ్యంలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అందుకే,మోదీ తిరుగులేని నేతగా నిలిచారు. నవ భారత నిర్మాతగా గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నారు.

జగన్ పై నడ్డా విమర్శల మతలబేంటి?

 జ‌గ‌న్  హయాంలో  పాల‌న‌పై జేపీ న‌డ్డా కీల‌క‌మైన కామెంట్లు చేశారు. జ‌గ‌న్ అస‌మ‌ర్ధ, అస్త‌వ్య‌స్త పాల‌న  ద్వారా ఏపీ అభివృద్ధి మొత్తం ప‌డ‌కేసింద‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో  సంక్షేమం అభివృద్ధి గాడిలో పడుతున్నాయని నడ్డా అన్నారు. నడ్డా మాటలు అక్షర సత్యాలే అయినా.. ఇంత కాలం లేనిది ఇప్పుడీ విమర్శలేంటన్న సంశయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ మీద ఈగ వాల‌నివ్వ‌ని బీజేపీ స‌డెన్ గా ఇలా రివర్స్ అవ్వడమేంటి?  జగన్ పై వ్యతిరేక కామెంట్లు చేయడమేంటి? అన్న ఆశ్చర్యం, విస్మయం పరిశీలకుల్లోనే కాకుండా.. సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అడిగీ అడ‌క్క ముందే.. బీజేపీకి మద్దతు ప్రకటించచేసి ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన  జ‌గ‌న్ పార్టీ.. ఇటు చెల్లి నుంచి ఢిల్లీ గ‌ల్లీ గ‌ల్లీ వ‌ర‌కూ విమ‌ర్శ‌ల పాల‌య్యింది. ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి చెందిన ఒక వ్య‌క్తికి వైయ‌స్ఆర్ కొడుకు ఇలా ఓటు వేయ‌డ‌మేంట‌ని.. ఆయన సోదరి ష‌ర్మిళ అయితే క‌డిగిపాడేశారు. ఇక వైఎస్ అతేవాసి, జగన్ కు బిహైండ్ ది కర్టెన్ మెంటార్ అయిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్  అయితే.. ఇక్క‌డ ఎన్డీయే కి వ్య‌తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన జ‌గ‌న్ తాము కాంగ్రెస్ వ్య‌తిరేకులం అంటూ ఎన్డీయే అభ్య‌ర్ధికి ఓటు వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. కొంత‌లో కొంత‌.. బీఆర్ఎస్సే న‌యం.. కాస్త సంయ‌మ‌నం పాటించి ఓటింగ్ లోనే పాల్గొన‌లేదు. జ‌గ‌న్ మ‌రీ ఇంత దిగ‌జారుడుత‌న‌మా? అన్న టాకొచ్చింది. అలా తమ అభ్య‌ర్ధికి ఓటు వేసిన పార్టీ అని కూడా చూడ‌కుండా.. జేపీ న‌డ్డా ఇలా అనేశారేంటన్న చర్చ సాగుతోంది.  ఈ మ‌ధ్య ఒక కొత్త ఈక్వేష‌న్ వెలుగులోకి వ‌చ్చింది. బీజేపీ అంటే దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అయితే అయి ఉండొచ్చేమోగానీ, ఏపీలో మాత్రం ఇందుకు భిన్నం. బీ అంటే- బాబు జే అంటే- జ‌గ‌న్, పీ అంటే- ప‌వ‌న్ అంటూ కామెంట్ చేశారు మాజీ ఐఏఎస్ విజ‌య కుమార్. దానికి తోడు బీజేపీకి వైసీపీకి చీక‌టి ఒప్పందాలు ఏవో ఉండ‌బ‌ట్టే.. ఆయ‌నింకా జైలుకు వెళ్ల‌కుండా బ‌య‌ట  ఉండ‌గ‌లు గుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. మ‌ద్యం కుంభ‌కోణంలో కూడా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లేవీ క‌నీసం ముట్టుకోలేదీ కేసును. దీన్నిబ‌ట్టీ చూస్తే బీజేపీ జ‌గ‌న్ మ‌ధ్య అవినీతి సంబంధం స్టిల్ అలైవ్ అంటున్నారు విశ్లేషకులు.  ఇలాంటి కామెంట్లకు కాస్త ఫుల్ స్టాప్ పెట్ట‌డానికో ఏమో.. జేపీ  న‌డ్డా జ‌గ‌న్ పై ఇలాంటి కామెంట్లు చేశార‌న్న మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎప్పుడైతే జైలుకు వెళ్తారో అప్పుడు త‌ప్ప బీజేపీని న‌మ్మ‌డానికి వీల్లేద‌న్న కామెంట్ కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌వితను అరెస్టు చేయ‌కుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక‌టే అన్న అర్ధం వ‌స్తుంద‌ని ఏకంగా.. ఆ పార్టీ ఎంపీ కొండా అన‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం.  తాజాగా ఏపీలో కూడా స‌రిగ్గా ఇలాంటి మాటే వినిపిస్తోంది. జ‌గ‌న్ బ‌య‌ట  ఉన్నంత వ‌ర‌కూ వీరెన్ని మాట‌లు మాట్లాడినా అది జ‌నం దృష్టి మ‌ర‌ల్చే ఎత్తుగ‌డ త‌ప్ప మ‌రొక‌టి కాదంటున్నారు చాలా మంది.

బ్రిట‌న్ లోనూ వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మం.. ట్రంప్ కు పట్టపగ్గాలుండవుగా?

ఈ వ‌ల‌స వ్య‌వ‌హారం అమెరికాకే ప‌రిమితం అనుకున్నాం. క‌ట్ చేస్తే ఈ ట్రంప్ ర‌గిల్చిన చిచ్చు మేక్ అమెరికా గ్రేట్ అగైన్.. అనేది యూకేకి కూడా పాకింది. అక్కడ యునైట్ ద కింగ్ డ‌మ్ అంటూ ఒక కొత్త నినాదం పురుడు పోసుకుని లండ‌న్ వీధుల‌ను ముంచెత్తింది.  గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా..  1.5 ల‌క్ష‌ల మంది జ‌నం వ‌ల‌స దారుల‌ను త‌రిమి కొట్టాల్సిందే అన్న నినాదంతో రోడ్లపైకి వచ్చారు.  దీనంత‌టికీ టామీ రాబిన్స‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈయ‌న‌కు ఎలాన్ మ‌స్క్ మ‌ద్ద‌తు   ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఎలాన్ మ‌స్క్ సైతం ఎక్క‌డో ద‌క్షిణాఫ్రికా నుంచి అమెరికా వచ్చి వ‌చ్చిఅక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద మూట‌గ‌ట్టుకునే య‌త్నం చేస్తున్నారు. అలాంటి మ‌స్క్ సైతం ఇలాంటి వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంటే ఏం చేయాలో పాలు పోవ‌డం లేదంటారు కొంద‌రు బ్రిట‌న్ వ‌ల‌సదారులు. శ‌నివారంసెప్టెంబర్ 14) సెంట్ర‌ల్ లండ‌న్లో జ‌రిగిన ఈ ర్యాలీ బ్రిట‌న్ చ‌రిత్ర‌లోనే అతి ర్యాలీగా మెట్రో పాలిటన్ పోలీసులు అభివర్ణిస్తున్నారు. వ‌ల‌స‌లు, ఇస్లామీక‌ర‌ణ‌పై పెద్ద ఎత్తున వ్య‌తిరేకిస్తున్న సామాజిక కార్య‌క‌ర్త టామీ నేతృత్వంలో యునైట్ ది కింగ్ డ‌మ్ అనే ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. మ‌రో వైపు జాత్య‌హంకారానికి వ్య‌తిరేకంగా స్టాండ్ అప్‌ టు రేసిజమ్  అనే నిరసన కూడా చేపట్టారు. ఇందులో కేవ‌లం 5వేల మంది మాత్ర‌మే పాల్గొన్నారు.   ఒకరేమో ఇక్క‌డి నుంచి మీరు వెళ్లిపోండ‌ని కోరుతుంటే.. మ‌రొక బృందం స‌మాజంలో స‌మాన‌త్వం, స‌మైక్యత అవ‌స‌రం అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య ఎలాంటి గొడ‌వా రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహ‌రించారు. నిర‌స‌న కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. నిర‌స‌న కారులు సైతం పోలీసుల‌పై నీళ్ల సీసాల వంటి వ‌స్తువుల‌ను విసిరారు. ఈ ఘ‌ట‌న‌ల్లో  ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాతిక మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తాజా పరిణామాలను బ్రిటన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ తీవ్రంగా ఖండించారు.  ఇందులో మ‌రో విశేషం ఏంటంటే.. ఈ వ‌ల‌స వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో అమెరికా ఇజ్రాయెల్ జెండాల ప్ర‌ద‌ర్శ‌న‌. వారిని తిరిగి పంపించండి. మా దేశాన్ని తిరిగి మాకివ్వండీ అంటూ బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ ని డిమాండ్ చేశారు. మ‌రికొంద‌రు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలు ధ‌రించి వ‌చ్చారు. దీంతో ట్రంప్ మ‌న‌ల్ని యూకేలో కూడా ఫాలో అవుతున్నారు చూడ‌మంటూ కాల‌రెగ‌రేస్తున్నారు.   ఈ వ‌ల‌స వ్య‌తిరేక ర్యాలీకి స‌పోర్ట్ గా నిలుస్తోన్న మ‌స్క్ సైతం ఏమంత త‌క్కువ‌గా మాట్లాడ్డం లేదు. వ‌ల‌స‌ను వ్య‌తిరేకించి పోరాడండీ లేకుంటే మీరు చ‌నిపోతార‌ని రెచ్చ‌గొట్టుడు ధోర‌ణిలో చేస్తున్న వ్యాఖ్య‌లు సైతం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. మ‌స్క్ తో పాటు ఫ్రాన్స్ కి సంబంధించిన ఎరిక్ జెమ్మార్, జ‌ర్మ‌నీకి చెందిన బై స్ట్రోన్ సైతం ఈ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. వీరంతా ఇటీవ‌ల సంభ‌వించిన చార్లీ కిర్క్ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తెల్ల‌జాతీయుల‌ను వ‌ల‌స‌వాదులు భ‌ర్తీ చేస్తున్నారంటూ త‌మ‌ త‌మ వాద‌న‌లు వినిపిస్తున్నారు.   బ్రిట‌న్ లో ఉండే జ‌నాభా సంఖ్య సుమారు ఆరు కోట్లు మాత్ర‌మే. సంప‌న్న దేశాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మాత్రం వ‌ల‌స జ‌నాభాకు ఇంత పెద్ద ఎత్తున నిర‌స‌న అవ‌స‌ర‌మా? అన్న‌దొక ప్ర‌శ్న. అయితే ఇదంతా ఎందుక‌ని చేశారో చూస్తే.. ఈఏడాది ప‌ది నెల‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ఏకంగా 28 వేల మందికి పైగా వ‌ల‌స‌దారులు ప‌డ‌వ‌ల‌పై బ్రిట‌న్ చేరుకున్నారు. ఈ అక్ర‌మ వ‌ల‌స రికార్డు స్థాయికి చేర‌డంతోనే స్థానికుల్లో అసంతృప్తి పెరిగింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం వీరిని తాత్కాలికంగా హోట‌ళ్ల‌లో ఉంచుతోంద‌ని.. అందుకే ఇదంతా జ‌రుగుతోంద‌ని అంటున్నారు. అందుకే మ‌స్క్  ఈ పార్ల‌మెంటును ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నికల‌కు వెళ్ల‌డం మంచిద‌ని వీరికి   స‌ల‌హా ఇస్తున్నారు.  స్టార్మ‌ర్ ప్ర‌భుత్వం ఏమంత గొప్ప‌గా  లేద‌ని అంటున్నారు వీరు.   వ‌ల‌స‌దారులు దేశ వ‌న‌రుల వాడ‌కంతో పాటు స్థానికుల ఉద్యోగాల‌ను కొల్ల‌గొడుతున్నారని ఆరోపిస్తున్నారు  నిర‌స‌న కారులు. ఇప్ప‌టికే బ్రిట‌న్ ఆర్ధిక వ్య‌వ‌స్థ అంతంత మాత్రం. ఈ అక్ర‌మ వ‌ల‌స కూడా ఇందుకు తోడైతే,  దేశ ఆర్ధిక ప‌రిస్థితి మ‌రింత‌ భారంగా మారే అవ‌కాశ‌ముంద‌ని అంటారు వీరంతా. వీరి వ‌ల్ల త‌మ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక వైభ‌వం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్న ఆందోళ‌న సైతం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళ‌న‌ల‌కు తాము త‌లొగ్గ‌మ‌నీ.. హింస చోటు చేసుకోడాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో చూస్తూ ఊరుకోమ‌న్నారు బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్.   ఈ వ‌ల‌స వ్య‌తిరేక ర్యాలీ వెన‌కున్న టామీ రాబిన్స‌న‌న్ ఎవ‌రంటే.. ఇత‌డి అస‌లు పేరు స్టీఫెన్ యాక్స్ లీ లెన్నాన్. జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేసే రాబిన్స‌న‌న్.. యూకే గ‌వ‌ర్న‌మెంటులోని అవినీతి బ‌య‌ట పెడ‌తానంటూ ప‌లు మార్లు హెచ్చ‌రించారు. ఈయ‌న‌కు మ‌స్క్ తో స‌హా ప‌లువురి ప్ర‌ముఖుల మ‌ద్ద‌తుండ‌టంతో.. ఈ మొత్తం గ్యాద‌రింగ్ సాధ్య‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.   ఇటీవ‌ల ఆస్ట్రేలియా, కెన‌డా వంటి దేశాల్లో కూడా ఇలాంటి వ‌ల‌స వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక భార‌త్ లోనూ..  ఎన్నార్సీ వంటి ప్రోగ్రామ్స్ పై కాంగ్రెస్, దాని వెన‌కున్న శ‌క్తులు వ్య‌తిరేకించడం చూస్తూనే  ఉన్నాం అంటారు మ‌రికొంద‌రు. ఇపుడీ వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుంది?  అమెరికా నుంచి ఇత‌ర దేశాల‌కు పాకుతున్న ఈ యాంటీ ఇమ్మిగ్రెంట్ మూమెంట్ టార్గెట్ ఏమిటి? తేలాల్సి ఉంది.

ఈ నగరానికి ఏమైంది?

  అది నగర జీవన ప్రమాణమే కారణమా? లేక సిటీ కల్చర్ లో పెరుగుతోన్న కక్షలు కార్పణ్యాలే రీజనా? లేక డబ్బు ప్రభావమా? ఓటీటీల ఎఫెక్టా.. ఇదీ అదని చెప్పలేం కానీ.. ఇటీవల హైదరాబాద్‌లో హత్యలు పెరుగుతున్నాయ్. ఎక్కడో డల్లాస్‌లో  ఒక భారతీయుడి తల అమెరికన్ నరికి ఫుట్ బాల్ లా కాలితో తన్ని.. డస్ట్ బిన్ లో పడేశాడని.. ఇదంతా ఒక జాత్యహంకారమనీ భావిస్తున్న మనం.. నగరంలో జరుగుతోన్న హత్యా పరంపర మీద మాత్రం ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితిలో పడిపోయాం. తాజగా కుషాయి గూడకు చెందిన రియల్ ఎస్టేట్, కమ్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య ఇదే చెబుతోందా? అంటే అదే నిజమని భావించాల్సి ఉంది. శ్రీకాంత్‌ని మర్డర్ చేసింది మరెవరో కాదు ఆయనతో వ్యాపార లావాదేవీలు నెరిపే ధన్ రాజ్. శ్రీకాంత్, ధన్ రాజ్ మధ్య ఎప్పటి నుంచో వ్యాపార పరిచయం. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. ధన్ రాజ్‌కి ఎలాగైనా సరే శ్రీకాంత్ రెడ్డి అంతు చూడాలన్న కసి. దీంతో శుక్రవారం రాత్రి ఇద్దరూ కలసి మందు సిట్టింగ్ వేసిన టైంలో ముహుర్తం ఫిక్స్ చేశాడు ధన్ రాజ్. ఆపై కావాలనే మాట కలిపి, అది మరింత ముదిరేలా చేసి.. ఇద్దరి మధ్య కొట్లాటకు కారణమైంది.  ఎప్పటి నుంచో శ్రీకాంత్ ని హతమార్చాలన్న ఉద్దేశంతో కత్తి పెట్టుకుని తిరుగుతున్న ధన్ రాజ్.. ఎట్టకేలకు దాన్ని బయటకు తీసి శ్రీకాంత్ పై దాడి చేశాడు. ఇక అతడు చనిపోయాడని తెలిశాక.. పారిపోయాడు. అప్పటికీ స్థానికుల సమాచారంతో.. కుషాయిగూడ పోలీసులకు తెలియడం. ఆపై శ్రీకాంత్ ని గాంధీ ఆస్పత్రికి తరలించడం.. సీపీఆర్ చేసి బతికించాలన్న యత్నం చేయడం.. ఇవన్నీ జరిగాయి. కానీ శ్రీకాంత్ ఆ సరికే ప్రాణాలు కోల్పోయాడని తెలిసి.. ఇక తమ ప్రయత్నాలన్నిటినీ ఆపేశారు. ధన్ రాజ్ శ్రీకాంత్ మధ్య ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.  తన భర్త హత్యకు సంబంధించిన వార్త తెలిసిన శ్రీకాంత్ భార్య అపర్ణ కన్నీరు మున్నీరైంది. తాను షాపింగ్ వెళ్దామని అంటే పిల్లలకు పరీక్షలున్నాయని.. అవయ్యాక పోదామని తన భర్త అన్నాడనీ.. ఒక వేళ షాపింగ్ వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయిందామె. ఇక కూకట్ పల్లికి చెందిన రేణు అగర్వాల్ హత్య సంగతి సరే సరి.  రేణు ఇంట్లో కేవలం 11 రోజుల క్రితమే పనిలోకి చేరారు జార్ఖండ్ కి చెందిన హర్ష, రోషన్. ఆమెకున్న డబ్బు, గోల్డ్‌పై కన్నేశారు. అదే అదనుగా భావించి ఆమెను హత్య చేసి పారిపోయారు. వీరి ఆనవాళ్లు హఫీజ్ పేట్ వరకూ మాత్రమే కనుగొన్నారు పోలీసులు. ఆపై ఎంతకీ క్లూ జరగడం లేదు. ఇక్కడా డబ్బూ, బంగారానిదే ప్రధాన పాత్ర. ఇదే కూకట్ పల్లిలో సహస్ర హత్య సంగతి ఇందుకు భిన్నమైనది. ఇదైతే ఒక బాలుడు బాలికను హతమార్చిన పరిస్థితి. ఆ కుర్రాడు గత కొంత కాలంగా ఓటీటీల ప్రభావానికి లోనై.. చోరీలు, హత్యలు ఎలా చేయాలన్న స్కెచ్ వేసుకుని.. దాన్ని పేపర్ల పై రాసుకుని మరీ అమలు చేయాలని చూశాడంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. మూడింట్లో రెండు ఘటనలు డబ్బు చుట్టూ తిరిగినవి. ఇక బాలుడు మర్డర్ చేయడం ఈ మూడింట్లోకి భిన్నమైనది. దీన్నిబట్టీ చూస్తే మనిషి ఆగ్రహావేశాలకు విచక్షణ కోల్పోడానికి.. అమెరికాలోని డల్లాస్ అయినా తెలంగాణ లోని హైదరాబాద్ అయినా ఒకటే.  అక్కడ జరిగితే దాన్ని జాత్యహంకారంగా భావిస్తున్న మనం.. అదే ఇక్కడ జరిగితే ఆర్ధిక వ్యవహారాల కింద జమ కట్టేస్తున్నాం. ఏమాటకామాట.. ఈ విషయంలో ప్రపంచమంతా ఒకే సింక్ లో ఉంది. దీన్నించి బయట పడ్డానికి మరోదే గట్టి కృషి జరగాల్సి ఉంది.  ఈ విశ్వమానవాళికి ఏదో కౌన్సెలింగ్ అవసరమనిపిస్తోందని అంటారు మానసిక నిపుణులు. మరోవైపు హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రోజురోజుకు క్రైమ్ రేటు విపరీతంగా పెరిగుతుంది. రాష్ట్రాన్నికి హొం మంత్రి లేకపోవటం సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించాటంతో ముఖ్యమంత్రి బిజీ వల్ల హోం శాఖ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పవచ్చును.

చిన్న దేశాల్లోనే .. చిచ్చుకు కార‌ణ‌మేంటి?

చిన్న కుటుంబం చింతల్లేని  కుటుంబం అని మ‌న‌కు మ‌నం చాలా ఎక్కువ ఫీల‌వుతుంటాం. ఎప్పుడైతే ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ మాయ‌మైందో ఈ చిన్న కుటుంబాల‌కు భారీ స‌పోర్టింగ్ వ‌చ్చింది. దానికి తోడు కుటుంబ నియంత్రణపై కూడా  పెద్ద ఎత్తున ప్రచారం సాగ‌డంతో.. ఆ చిన్న కుటుంబాలు మ‌రింత చిరు కుటుంబాలుగా మారిపోయాయి. ఈ కుటుంబ వ్య‌వ‌స్థ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. చిన్న దేశాల విష‌యంలో త‌ర‌చూ ఏవో ఒక వివాదం. ఒక‌ప్పుడు మ‌య‌న్మార్, ఆపై శ్రీలంక‌, బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్. ఇక పాకిస్థాన్ సంగ‌తి స‌రే స‌రి. అది నిత్య అగ్ని గుండ‌మే. మయ‌న్మార్ అయితే ఆంగ్ సాన్ సూకీ ని జైల్లో బంధించ‌డం.. ఆర్మీ మొత్తం దేశాన్ని శాసించే య‌త్నం చేయ‌డం. ఇది కొన్ని త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తోన్న ఒకానొక ఆర్మీ డామినేటింగ్ హిస్ట‌రీ. ఆ దేశం ఎంత చిన్న‌దైతే.. అక్క‌డ ప్ర‌జాస్వామిక పాల‌న అంతగా ప‌డ‌కేయాల్సిందే. సైన్యం అంత‌గా ప్ర‌తాపం చూపాల్సిందే.  మీరు కావాలంటే చూడండీ పాకిస్థాన్ లో సైన్యం ఎప్పుడెప్పుడు దేశ ప‌రిపాల‌న ఆక్ర‌మిద్దామా? అని చూస్తుంటుంది. ఇప్ప‌టికి  ఎన్నోసార్లు అలా జ‌రిగింది కూడా. ప్ర‌స్తుతం కూడా అక్క‌డ సైన్యాధ్య‌క్షుడిదే హ‌వా. అన్ని విదేశీ అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ఆర్మీ చీఫ్ మునీరే హాజ‌ర‌వుతుంటారు. ఇక బంగ్లాదేశ్ సంగ‌తి స‌రేస‌రి. ఇటీవ‌ల అక్క‌డ స‌రిగ్గా నేపాల్ లాంటి  ఉద్య‌మం రావ‌డం.. ఒక ఆర్ధిక వేత్త తిరిగి తాత్కాలికంగా అధికారం చేజిక్కించుకోవ‌డం సంగ‌తి తెలిసిందే. అయితే..  ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అనే విష‌యం మీద సైన్యం వ‌ర్సెస్ ప్ర‌భుత్వం గొడ‌వ చెల‌రేగింది. దీంతో తిరిగి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు మిన్నంటాయి.  స‌రిగ్గా నేపాల్ కి మ‌ల్లే బంగ్లాదేశ్ లోనూ సాదాసీదాగానే మొద‌లైంది మూమెంట్. విద్యార్ధులే కీల‌క పాత్ర పోషించారు. జెన్ జెడ్ అనే ఒక మూముంట్ స్టార్ట్ అయ్యింది. దీంతో సోష‌ల్ మీడియానునిషేధించింది నేపాలీ ప్ర‌భుత్వం. అంతే అగ్గి  రాజుకుంది. అది దేశ పార్ల‌మెంటు, ప్ర‌ధాని, అధ్య‌క్ష, మంత్రుల కార్యాల‌య నివాస ప్రాంతాల‌న్నిటినీ త‌గ‌ల‌బెట్టేసింది. నేపాలీ యువ‌త రాజేసిన ఈ నిర‌స‌న జ్వాల‌కు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం  నిలువునా కుప్ప‌కూలింది. ఇక్క‌డా  సైన్యం క‌మాండింగే. మీరు అర్జెంటుగా పీఠం దిగండ‌ని ప్ర‌ధాని ఓలీకి  సైన్యం సూచించ‌డంతో.. ఆయన రాజీనామా చేసి దిగిపోయారు.   ఈ హింసాత్మ‌క నిర‌స‌న‌ల పుణ్య‌మాని ఒక మంత్రి భార్య మ‌ర‌ణించారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. చిన్న‌దేశం అన‌గానే..  ఏ మాత్రం తేడా వ‌చ్చినా సైన్యం దేశాన్ని త‌న అదుపాజ్ఞ‌ల్లోకి తీసుకుంటుంది. దీంతో ప్ర‌జాస్వామ్యం కాస్తా ప‌క్క‌కు త‌ప్పుకోవ‌ల్సి వ‌స్తుంది. మ‌రి చూడాలి.. నేపాల్లో సాధార‌ణ ప‌రిస్థితి ఎప్పుడు ఏర్ప‌డుతుందో తేలాల్సి ఉంది. చిన్న దేశాలు బాగానే ఉంటాయిగానీ అది ఏదో ఒక అసంతృప్తి ర‌గులుకునే వ‌ర‌కే. ఆపై వాటి లో భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతుంది. అది మొత్తం దేశాన్ని త‌గ‌ల‌బెడుతుంద‌ని  అంటారు. ఈ మొత్తం వ్య‌వ‌హార క్ర‌మంలో ప్ర‌ధానంగా క‌నిపించేది సైన్యం పాత్ర‌.

బాబు ఎఫెక్ట్.. ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్!

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంగా జాతీయ సగటును దాటి వృద్ధి రేటు సాధించింది. 2025-26 తొలి త్రైమాసికంగా ఆంధ్రప్రదేశ్ 10.5 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఎక్కువ. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా బలోపేత మౌతోందనడానికి తార్కానంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. దీంతో రాష్ట్రం వృద్ధిలోనే, అభివృద్ధిలోనూ కూడా తిరిగి కోలుకోవడం సాధ్యం కాదనిపించేంతగా దిగజారింది. అయితే ఎప్పుడైతే గత ఏడాది జరిగిన ఎన్నికలలో అద్బుత విజయంతో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచీ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పాట పట్టింది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక పరిపుష్టి, రైతు ప్రయోజనాలు, ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టారు.  రాష్ట్రంలో  ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఐటీ వృద్ధితో పాటు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు వంటి అంశాలపై దృష్టి పెట్టారు.  పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలలో రాష్ట్రంపై విశ్వాసం, నమ్మకం పెరిగేలా చేశాయి. అది ఎంతగా అంటే మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టేదే లేదంటూ తమ వ్యాపారాలు, పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించేసిన లూలూ వంటి పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చేంతగా.చంద్రబాబు ఈ విధానాలే ఏపీ ఆర్థిక వ్యవస్థ అనూహ్య వేగంతో పుంజుకోవడానికి కారణమైందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  బాబు సర్కార్ అవలంబిస్తున్న నూతన విధానాల ఏపీలో డూయింగ్ ఆఫ్ బిజినెస్ సులభతరం కావడానికి దోహదపడటమే కాకుండా.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైంది.   ఆంధ్రప్రదేశ్ న దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన దార్శనికత ఇప్పడు ఫలితాలను అందిస్తోంది. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూసేలా చేస్తున్నాయి. చంద్రబాబు ఆచరణాత్మక దృక్ఫథానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏపీ అభివృద్ధి దర్పణమని చెప్పవచ్చు.  దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అభివృద్ధి అనూహ్య వేగంతో ఉండటానికి చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం, ఆయన దార్శనికతపై నమ్మకం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వేగం, ఇదే ఒరవడి కొనసాగితే ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా మారడం తథ్యమని అంటున్నారు.