విశ్వవిద్యాలయాలపై కాషాయ జెండా రెపరెపలు.. దేనికి సంకేతం?
posted on Sep 24, 2025 @ 1:36PM
కాంగ్రెస్ అగ్ర నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమ మనసులోని మాటను చాలా చక్కగా బయట పెట్టారు. మన ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు మన దేశంలో కూడా వస్తుందనీ, దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్ముక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళన సాగిస్తున్న రాహుల్ గాంధీ.. తమ ఓటు చోరీ ఆందోళన జెన్ జెడ్ ఆందోళనగా రూపాంతరం చెందుతుందని ఆశిస్తున్నారు. నమ్ముతున్నారు. అదే మాట అంటున్నారు. విద్యార్ధులు, యువత ఒక్కటై రాజ్యాంగాన్ని కాపాడుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఎప్పుడూ ముందుంటాననీ, జెన్ జెడ్ ఆందోళనకు సంపూర్ణ మదటు ఉంటుందని రాహుల్ గాంధీ చెబుతున్నారు.
ఒక్క రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామరావు కూడా ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే మన దేశంలోనూ నేపాల్ తరహా జెన్ జెడ్ తిరుగుబాటు తప్పక వస్తుందంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ మొదలు కేటీఆర్ వరకు.. ఇంకా ఇండి కూటమి పార్టీల నాయకులు కూడా నేపాల్ తరహా తిరుగుబాటు మన దేశంలోనూ వస్తుందనీ.. రావాలని ఆశిస్తున్నారు. మరో వంక బీజేపీ రాహుల్ గాంధీ ఆలోచనలను అర్బన్ నక్సల్ ఆలోచనలుగా పేర్కొంటూ.. దేశంలో అస్థిరత్వాన్ని ప్రోది చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపి స్తున్నారు.
అదలా ఉంటే.. భారత దేశంలో నిజంగా ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితి ఉందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే.. విద్యార్ధి లోక నుంచి లేదనే జవాబే వస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు, ఇటివల కాలంలో వెలువడిన విద్యార్ధి తీర్పులను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ జరిగిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘం ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యర్ది పరిషత్ (ఏబీవీపీ) వరస విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీ నుంచి మణిపూర్ వరకూ,మణిపూర్ నుంచి గుహవటి వరకూ, గుహవటి నుంచి పంజాబ్ , పంజాబ్ నుంచి పాట్నా, పాట్నా నుంచి ఉత్తారఖండ్, ఉత్తారఖండ్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాల ఎన్నికలలో ఏబీవీపీ ఎదురులేని విజయాలను సొంత చేసుకుంది.
ఈ విజజయాలు నేపాల్ తరాహా విద్యార్ధి తిరుగుబాటును ఆశించిన రాహుల్ గాంధీ, సహా పలువురు నేతల ఆశలను అడి యాసలు చేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే.. విద్యార్ధులు, యువతలో అశాంతి అసలే లేదా అంటే ఔనని చెప్పలేం. అయితే.. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంచడంలో విఫలం కావడం వల్లనే విద్యార్ధులు,యువత సహా అన్ని వర్గాల ప్రజలు కాషాయంవైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటు న్నారు.