చంద్రబాబే టార్గెట్... వైసీపీ వ్యూహమిదే? 

ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించనే సినీ డైలాగ్ మాదిరిగా... టీడీపీ చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీలో పంచ్ డైలాగ్ లు పేల్చారు. యాభై మంది కాదు... నూటా యాభై మంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొగల శక్తి సామర్ధ్యాలు... సమాధానం చెప్పగల దమ్ము తనకుందంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారంటే... ఏపీ శాసనసభలో చంద్రబాబు టార్గెట్ గా అధికారపక్షం గేమ్ ఆడుతోంది. చంద్రబాబు మానసిక స్థైర్యాన్ని మనో బలాన్ని దెబ్బతీసేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వరకూ అందరూ బాబే టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సందర్భమైనా, అసందర్భమైనా ఏ అంశంలోనైనా చంద్రబాబును కార్నర్ చేస్తూ వ్యక్తిగత దూషణులకు దిగుతున్నారు. దాంతో, చంద్రబాబు ఎంతగా మనో నిబ్బరం ప్రదర్శించినా... వైసీపీ ఎమ్మెల్యేల మాటల తాలుకూ ప్రభావం టీడీపీ అధినేత ముఖంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల కోసమే అవమానాలన్నీ భరిస్తున్నానని చంద్రబాబు అంటుంటారు. అసెంబ్లీలో సీన్ చూస్తే నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు...లేదంటే లోకేష్‌. అధికార వైసీపీ టార్గెట్ ఈ ఇద్దరే. అందుకే, టాపిక్‌ ఏదైనా, ఇద్దర్నీ టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ మొదలుకొని... పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు... చంద్రబాబుపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్, బొత్స, బుగ్గన, పేర్ని నాని, కన్నబాబు తదితర మంత్రులు... బాబు అండ్ లోకేషే టార్గెట్ గా మాటల తూటాలు పేల్చుతున్నారు. చంద్రబాబును తిట్టడంలో పోటీ పెట్టినట్టుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. అయితే, బాబుని ఈవిధంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. టీడీపీకి చంద్రబాబే బలం. ఆ బలాన్నే దెబ్బకొడితే మొత్తం పార్టీనే దెబ్బతీయొచ్చన్న వ్యూహంతోనే బాబుపై పర్సనల్ అటాక్ కి దిగుతున్నారని అంటున్నారు. బాబునే సైలెంట్ చేస్తే, ఇక మిగతా నేతలందరూ నోరు మూసుకుంటారనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఇక, బాబు వయసు పైబడటంతో, భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్న లోకేష్ ను టార్గెట్ చేయడం ద్వారా, అతని ఆత్మస్థైర్యం దెబ్బతీసి టీడీపీకి భవిష్యత్తే లేదనే చర్చను తెలుగుదేశం కేడర్ లోకి, అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వైసీపీ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి బాబు అండ్ లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... తెలుగుదేశంలో సంక్షోభం తేవడమే లక్ష్యమంటున్నారు. అయితే, గతంలో పదేళ్లపాటు గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నా తన పోరాట పటిమతో 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు... ఒంటరి పోరాటంచేసైనాసరే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తారని టీడీపీ కేడర్ భావిస్తోంది. ఇక, చంద్రబాబు కూడా తనపై జరుగుతోన్న పర్సనల్ అటాక్ ను... ప్రజల్లో సానుభూతిగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి.

జనసేనలో అసలేం జరుగుతోంది? రాపాక, రాజు ఆరోపణలు నిజమేనా?

జనసేనలో కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, జన సైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడటం క్యాడర్‌ను‌ కన్‌ఫ్యూజ్ చేస్తుంటే, పార్టీ సిద్దాంతకర్తలు, కీలక నాయకులు, వరుసగా రాజీనామాలు సమర్పిస్తూ బయటకు వెళ్లిపోతుండటం మరింత కలకలం రేపుతోంది. ఇప్పటికే, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అద్దేపల్లి శ్రీధర్, పార్టీ కోశాధికారి, మెగా ఫ్యామిలీకి బంధువు రాఘవయ్య, శివశంకర్‌లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాజాగా పార్టీ సిద్దాంతకర్త, వ్యూహకర్త, పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ, తాజాగా జనసేనకు రాజీనామా సమర్పించి, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. అయితే, జనసేన వ్యవస్థాపనలో రాజు రవితేజ కీలకంగా వ్యవహరించారు. జనసేన మొదటి జనరల్‌ సెక్రటరీ కూడా ఈయనే. పార్టీ రాజ్యాంగం రచన చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు. పవన్‌ సిద్దాంతాల సమాహారం ఇజం పుస్తకం రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి. అలాంటి రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన స్థాపన టైంలో కులాలను ఏకం చేద్దాం, మతాలకు అతీతంగా నడుద్దామంటూ ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, ఇప్పుడు దానికి విరుద్దంగా వెళుతోందని, అందుకే తాను పార్టీ నుంచి బయటికి వచ్చానని రవితేజ ప్రకటించారు. అంతేకాదు బీజేపీకి దగ్గరయ్యేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు, విద్వేష ప్రసంగాలు చేసిన పవన్... ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయారని, పార్టీ మూల సిద్దాంతాలకు విరుద్దంగా, కులమతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని  రాజు రవితేజ చెబుతున్నారు. రాజు రవితేజ రాజీనామా వ్యవహారం అటుంచితే, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సైతం, పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని పవన్ కల్యాణ్‌ అంటే, కావాలని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు రాపాక. అనవసరమైన కారణాలతో పవన్ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు సైతం వెళ్లలేదు రాపాక. అంతేకాదు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాపాక. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని, మరెవరితోనూ మాట్లాడరని రాపాక తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీనామాల నుంచి రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల దాకా, జనసేనలో జరుగుతున్న పరిణామాలు, జనసైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో ఏమో, ఎవరెప్పుడు పార్టీ మారతారోనన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పవన్ కల్యాణ్‌ కుల, మతాల గురించి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాజు రవితేజ ఆరోపిస్తే, ఇటు పవన్‌పై పెద్దగా విమర్శలు చేయకపోయినా, పార్టీలో నాదెండ్ల పెత్తనం పెరగడమే అశాంతికి దారి తీస్తోందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యాఖ్యానించడం, రెండు అంశాలను స్పష్టం చేస్తోంది. అది పవన్‌ కల్యాణ్‌లో మార్పు, పార్టీలో నాదెండ్ల మనోహర్‌ వ్యవహారం. మరి, నిజంగానే, నాదెండ్ల మనోహర్‌ పెత్తనంపైనా నేతలు గుర్రుగా ఉన్నారా?. అలాగే, పవన్‌లో మార్పొచ్చిందా...వస్తే మార్పు మంచికేనని పవన్‌ చెబుతారా....లేదంటే ఈ కన్‌ఫ్యూజ్‌నే కంటిన్యూ చేస్తారో చూడాలి.

రాజ్యసభలో విజయసాయిరెడ్డికి చుక్కెదురు.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించి అబాసుపాలయ్యారు

ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.  దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.

కొత్తవారికి స్వాగతం.. పాతవారికి న్యాయం.. జగన్ రాజకీయం అమోఘం

కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.

చొప్పదండి తలనొప్పి రాజకీయం.. వ్యక్తిగత విమర్శలతోనే కాలం గడిపేస్తున్నారు

  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.

ఎల్లారెడ్డిలో చీలిన గులాబీ.. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నేతలతో మొదలైన ముసలం!

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.

కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాసిన కండెక్టర్... ఆత్మభిమానాన్ని చంపుకొని చేసే ఉద్యోగం నాకొద్దు

రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.

నారదునిగా మారిన కొడాలి నాని.. ధర్మాన సోదరుల మధ్య దూరం పెంచే వ్యాఖ్యలు!

  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

అన్నీ అప్పులే.. ఆదాయం పెంచే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కార్!

  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.

మంత్రుల బండ్లు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి?... అసలు కాన్వాయ్‌లో ఏం జరుగుతుంది ?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాన్వాయిలో వెనుక వస్తున్న వాహనం బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్ లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్య మొదలైంది. కాన్వాయ్ లో ఏం జరుగుతోంది అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కాన్వాయ్ లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. లేటెస్ట్ వెర్షన్ ఫార్చునర్ వాడుతున్నారు, అయితే ఇచ్చిన కారు సౌకర్యంగా లేదని మంత్రులు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లల్లో హై ఎండ్ ,సెకన్ లలో వంద కిలోమీటర్ల స్పీడ్ దాటి పరుగుపెడతాయి.దీంతో ఈ కారును స్పీడ్ ను కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లో అందుకోలేకపోతున్నాయి. మంత్రి కారును అందుకోవాలని స్పీడుగా వెళ్లి పైలట్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదంలోనూ ఇదే జరిగింది. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే ఆయన కారును అందుకోవాలని స్పీడ్ గా కాన్వాయ్ వాహనం వెళ్ళిందని తెలిసింది. చివర్లో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైంది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లో వాహనం కూడా బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయట పడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మళ్లి కొంత మంది మంత్రులు సొంత వాహనాన్ని వాడుతున్నారు. రూరల్ ఏరియా లో సింగిల్ రోడ్ల పై మంత్రుల కాన్వాయ్ కు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యుల పై దూసుకెళుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

జీవీఎల్ సైలెన్స్‌కి కారణమేంటి? మోడీ-షాకి ఫిర్యాదు చేసిందెవరు?

జీవీఎల్ నరసింహరావు... బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్... ఇక జీవీఎల్ స్టైలే వేరు... ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ఒక సంచలనం ఉండి తీరుతుంది... 2014కి ముందు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక... చంద్రబాబుపైనా, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేయడంతో జీవీఎల్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. జీవీఎల్ ఏ ఆరోపణ చేసినా నిజమేననిపించేలా ఉండేవి. ఎక్కువగా టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారు. ఇవిగో ఆధారాలంటూ లెక్కలతో సహా వివరించేవారు. దాంతో, జీవీఎల్ ను ఎదుర్కోవడానికి టీడీపీ నేతలు నానా తిప్పలు పడేవారు. ప్రతి అంశంలోనూ లోతైన విషయ పరిజ్ఞానంతోపాటు వాగ్ధాటి మరో అడ్వాంటేజ్ గా ఉండటంతో టీవీ డిబేట్స్ లో ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకుపడేవారు.  అయితే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ కొద్దిరోజులుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, రాజధాని వివాదం, మత వివాదం.... ఇలా అనేక బర్నింగ్ ఇష్యూస్ తో విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే... జీవీఎల్ మాత్రం తనకేమీపట్టనట్టు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్ధులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే జీవీఎల్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే, జీవీఎల్ మౌనం వ్యూహాత్మకమా? లేక అధిష్టానం ఆదేశమా అనే చర్చ జరుగుతోంది. జీవీఎల్ సైలెన్స్ కి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అండ్ జగన్ సర్కారుపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదని... అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే, రాజధాని ఇష్యూలో ఆమధ్య జగన్ సర్కారుకు అనుకూలంగా జీవీఎల్ మాట్లాడరనే విమర్శలు వచ్చాయి. ఏపీ బీజేపీ నేతలకు భిన్నంగా జీవీఎల్ మాట్లాడటంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, దాంతో సైలెన్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు జరిగిన తర్వాత, వైసీపీ అండ్ జగన్ సర్కారుపై ఎలా వ్యవహరించాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత తన వాయిస్ వినిపించాలని జీవీఎల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, టీడీపీ, జనసేనతో మళ్లీ కలిసి సాగే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో... దీనిపైనా క్లారిటీ కోసం చూస్తున్నారట. మొత్తానికి ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చే జీవీఎల్... వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారని... వన్స్ ఏపీ పొలిటికల్ స్టాండ్ పై అధిష్టానం క్లారిటీ ఇచ్చిందంటే మాత్రం మళ్లీ సూపర్ యాక్టివ్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ క్రిస్టియానిటీయే ఆయుధం... 2024కి బీజేపీ-జనసేన ఉమ్మడి వ్యూహం..!

  2024 నాటికి ఇటు తెలంగాణలోనూ... అటు ఏపీలో కూడా బలపడాలనుకుంటోంది బీజేపీ. అయితే, తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు అంత ఆశాజనంగా లేవు. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క శాతం ఓట్ షేర్ కూడా రాలేదు. అయితే, ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసలు పెరగడం... నలుగురు టీడీపీ ఎంపీలు... పార్టీలో చేరడంతో... ఏపీ బీజేపీలో కొంత ఊపు వచ్చింది. ఇక, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు... ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. అయితే, పవర్ ఫుల్ మాస్ లీడర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు పవన్ ను సంప్రదించినా... జనసేనాని నో చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినా ఆయనా సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఎన్నికల తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో... ఇప్పుడే పవనే... బీజేపీ వైపు చూస్తున్నాడని అంటున్నారు. ఇక, బీజేపీకి ఎలాగూ పవన్ లాంటి క్రౌడ్ ఫుల్లర్ అవసరం ఉంది. ఉందుకే వీళ్లిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఆమధ్య అమెరికాలో పర్యటనలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్... జనసేనాని పవన్ కల్యాణ్ చర్చలు జరిగాయట. బీజేపీ-జనసేన కలిసి పనిచేయడంపైనే వీళ్లిద్దరి మధ్య చర్చలు సాగాయి. అయితే, ఇప్పుడు జగన్ లక్ష్యంగా పవన్ విరుచుకుపడటం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇసుక ఇష్యూ... ఆ తర్వాత ఇంగ్లీష్ వివాదంపై విమర్శలు ఎలాగున్నా... మతపరమైన అంశాలను తెరపైకి తేవడం వెనుక మాత్రం బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే ప్రస్తావించడం... తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం.... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో వినిపించాలనడం వెనుక కాషాయ వ్యూహం ఉందంటున్నారు. జగన్ అసలు తిరుమల లడ్డూ తింటారా అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించడం వెనుక బీజేపీ మత రాజకీయం ఉందని అంటున్నారు. మతపరంగా జగన్ ను టార్గెట్ చేయడం వెనుక జనసేన-బీజేపీ ఉమ్మడి వ్యూహం ఉందంటున్నారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా జగన్ ను మతపరంగానే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ ను మతపరంగా విమర్శిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం బీజేపీ అజెండానే అమలు చేస్తున్నారనే మాట గట్టిగా వినబడుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే తెరపైకి తీసుకొచ్చి హిందువులను తమవైపు తిప్పుకోవాలన్నదే బీజేపీ-జనసేన వ్యూహంగా తెలుస్తోంది. అందుకే అదేపనిగా జగన్ పై మతపరంగా అటాక్ చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్... కాషాయ పెద్దలను కలిసి ఇదే అంశంపై చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం లేకపోయినా, పదేపదే జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తేవడం ద్వారా 2024 నాటికి ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి, బీజేపీ మతపరమైన అజెండాను జనసేనాని నెత్తిన పెట్టుకుని మోస్తారా? లేక విధానపరమైన అంశాలపై మాత్రమే పోరాడతారో చూడాలి. అయితే, ఉత్తరాది తరహా మతతత్వ ఫార్ములా ఏపీలో వర్కవుట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

ఎలక్ట్రిక్ బస్సులకు నిధులు లేవు.. డీజిల్‌వే నడుపుకోండి... ఏపీఎస్ఆర్టీసీకి జగన్ పిలుపు

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ఏపీ సర్కారు వెనుకడుగు వేస్తుంది. డీసిల్ బస్సుల నిర్వహణ ఖర్చుల కంటే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చులే ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఎందుకు ఆహ్వానించి రద్దు చేశారనేది ప్రశ్నగా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై ఏపీఎస్సార్టీసీ వెనకడుగు వేసింది. కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ధర.. డీజిల్ బస్సులతో పోల్చితే నిర్వహణ వ్యయం ఎక్కువ. అలాంటప్పుడు కొనుగోలుకన్నా వదులుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అద్దెకు తీసుకుందామని అనుకున్నా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సుల అద్దె ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు తాత్కాలికంగా ఆపేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసే రవాణా సంస్థలకు.. ప్రైవేటు వ్యక్తులకు భారీ సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని భావించింది.  మొదటి విడతలో భాగంగా 350 బస్సులు కొనాలనుకుంటే బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టులో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్కో బస్సు ధర రూ.కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. ఇది ఎంతో భారమని భావించిన ఉన్నతాధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి అద్దెకు తీసుకోవాలనుకున్నారు. కర్ణాటక , తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె కిచ్చిన సంస్థలను ప్రీపెయిడ్ కు ఆహ్వానించి చర్చలు జరిపారు.కిలో మీటరుకు రూ.60 రూపాయల వరకు ఇవ్వాలని కొన్ని కంపెనీలు అంతకు ముందే చెప్పడంతో అందుకు అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ససేమిరా అన్నారు. తాము బస్సు నడిపితే కిలోమీటరుకు వచ్చే ఆదాయమే రూ.32 రూపాయలకు మించదని.. అలాంటప్పుడు రూ.60 రూపాయలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.  ప్రీ బిడ్ సమావేశానికి ముందు రోజు ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంచార్జి ఎండీగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబును నియమించింది. దీని పై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్ అనే శీర్షికతో సెప్టెంబర్ 25 న ఒక కథనం ప్రచురించింది. దీనిని ప్రభుత్వం ఖండించింది. అనంతరం అద్దె ప్రాతిపదికన 1350 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ లు పిలిచింది. ఈ నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అయితే రాష్ట్రంలో వంద కోట్ల రూపాయల దాటిన పెద్ద టెండర్లన్నీ జుడిషియరీ కమిషన్ కు పంపి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెండర్ లను 4వ తేదీనే రద్దు చేశారు. ఈ నెల ( నవంబర్ ) 15 లోపు మళ్లీ టెండర్ లు పిలుస్తామని అధికారులు చెప్పిన అలాంటిదేమీ జరగలేదు. ఎలక్ట్రిక్ బస్సులు కొనడమో అద్దెకు తీసుకోవడమో చేసే కంటే డీజిల్ బస్సులు కొనడం మేలని రవాణామంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది. 4వ తేదీన టెండర్ లు రద్దు చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఎలక్ట్రిక్ బస్సులు అంశంపై సమీక్షించారు. ఈ బస్సుల ధర కోట్లల్లో ఉండటం.. నిర్వహణ డీజిల్ కన్నా భారంగానే ఉండటం.. రీచార్జి స్టేషన్ ల ఏర్పాటుకు రూ.200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఉన్నతాధికారులు చెప్పడంతో కొనుగోళ్లు వద్దని సీఎం అన్నట్లు తెలిసింది. అద్దెకు తీసుకున్న భారమేనని చెప్పడంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలిసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ప్రభుత్వం ప్రస్తుతానికి ఆసక్తిగా లేదని మంత్రి మంగళవారం ( నవంబర్ 19న) తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ కు పంపిన తరవాతే తక్కువకు ఎవరూ ముందుకు వస్తారో వాళ్లకు అవకాశమిస్తామని తెలిపారు.ఈ నెల 23 లోపు ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు ఇన్ చార్జ్ ఎంటీ కృష్ణబాబు.

జగన్ కి కోపమొచ్చింది.. ఏపీ కేబినెట్ నుంచి నలుగురు మంత్రులు ఔట్!!

  నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది. మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు. ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.

కేసీఆర్, జగన్ ల మధ్య దూరం పెరగడానికి కారణమేంటి?

  ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు. అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఆర్ముర్ పాలిటిక్స్... విఠల్ రావు దెబ్బకి జీవన్ రెడ్డిలో పెరుగుతున్న అభద్రత!!

  ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.  మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.  ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.

మాజీ ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ కొవ్వూరులో కార్యకర్తల ఆవేదన.. మాజీ మంత్రి రీఎంట్రీ!!

  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.

ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అవుతున్న మంత్రులు...

  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణలో  భూ పంపిణీ పథకం కనుమరుగు అవ్వబోతోందా?

  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.