ఒలింపిక్స్‌లో స్థానం కోసం కోర్టుల్లో కుస్తీ

  సుశీల్‌ కుమార్‌- ఒలంపిక్స్‌లో మన దేశానికి పతకాన్ని సాధించిన మల్లయోధుడు. 50 ఏళ్ల విరామం తరువాత మన దేశానికి కుస్తీ పోటీల్లో ఒలంపిక్‌ పతకాన్ని తీసుకురావడమే కాకుండా, వరుసగా రెండు ఒలంపిక్స్‌లో పతకాలను సాధించిన తొలి భారతీయుడు. అలాంటి సుశీల్ కుమార్‌ రాబోయే ఒలంపిక్స్‌లో తనకు స్థానం కల్పించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. సుశీల్‌ కుమార్ ఉదాహరణ చూస్తే మన దేశంలోని క్రీడా సమాఖ్యలు ఎంత తీరుగా నడుస్తున్నాయో తెలుస్తుంది. మొదటి నుంచీ తనతో సంప్రదించకుండా, విషయాన్ని సరిగా తెలియచేయకుండా... భారతీయ రెజ్లింగ్ సమాఖ్య తన ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకుందన్నది సుశీల్‌ ఆరోపణ. సుశీల్‌ 66 కిలోల ఫ్రీస్టైల్‌ నుంచి 74 కిలోల విభాగానికి హఠాత్తుగా మారాడనీ, అతని కోసం 74 కిలోల విభాగంలో ప్రతిభను కనబరుస్తున్న నర్సింగ్‌ యాదవ్‌ను తప్పించలేమన్నది రెజ్లింగ్‌ సమాఖ్య వాదన. అయితే కోర్టు మాత్రం సుశీల్ కుమార్‌ మాటను మరోసారి ఆలకించవలసిందిగా రెజ్లింగ్‌ సమాఖ్య ముఖ్యులని ఆదేశించింది. అయితే ఈ కేసు ఇక్కడితో ముగిసిపోలేదు. కోర్టు తన తదుపరి విచారణలో ఈ సమస్యకు మరో మార్గాన్ని కూడా చూపే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే నర్సింగ్ యాదవ్, సుశీల్‌ కుమార్‌ల మధ్య ఒక పోటీని నిర్వహించి, తద్వారా ఒలంపిక్స్‌లో పాల్గొనే అర్హతను నిర్ణయించమని కూడా కోర్టు ఆదేశించవచ్చు. సుశీల్‌ కోరుకుంటున్నది కూడా ఇదే! అయితే ఇలాంటి బాహాబాహీ పద్ధతులు మొదలైతే మున్ముందు ప్రతి ఒక్కరూ కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉంటారని రెజ్లింగ్ సమాఖ్య కంగారుపడుతోంది. మరి ఇంతగా కంగారుపడే సమాఖ్య, వివాదాన్ని ఇక్కడిదాకా ఎందుకని లాక్కు రాకుండా ఉండాల్సింది కదా! దేశానికి పతకాన్ని అందించిన క్రీడాకారులు, అన్యాయం జరిగిపోయిందో అంటూ కోర్టు బోనులకి ఎక్కడం ఎంత అవమానకరం?

బాబు విన్నపాలకు మోదీ మనసు కరిగేనా!

  2014 నాటి పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మీద అవ్యాజమైన ప్రేమను కురిపించారు. కాంగ్రెస్ మీ రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, ముందుచూపు లేకుండా చీల్చిపారేసిందనీ... రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామనీ హామీలు అందించారు. రోజులు గడిచే కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఊసే మరిచిపోవడం మొదలుపెట్టారు భాజపా నేతలు. ఏదో కొత్త ప్రభుత్వం కదా, కొద్ది రోజులు వేచి చూద్దామని భావించిన తెలుగు తమ్ముళ్ల నెత్తిన పిడుగుపాట్లు మొదలయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నదే చాలా ఎక్కువనీ, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తే మరిన్ని నిధులు వస్తాయనీ... ఇంక ప్రత్యేక హోదా ఏమిటనీ భాజపా నేతల నుంచి ప్రశ్నలు వినిపించసాగాయి. పరాయి రాష్ట్రంలోని నేతలు ఇలాంటి మాటలు అంటే ఫర్వాలేదు కానీ... కష్టకాలంలో కలిసి ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలే, ప్రతిపక్షం కంటే దారుణంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అంత రాజధాని అవసరమా అంటూ సోము వీర్రాజు వంటి నేతలు నీతులు బోధించసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు దిల్లీ ప్రయాణం సాగింది. ఇవాళ ప్రధానమంత్రి మోదీని కలిసిన చంద్రబాబు ప్రత్యేక హోదా, బడ్జెటులోని లోటును  భర్తీచేయడం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు... వంటి 12 అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి అందచేశారు. ఆ తరువాత ఓ 20 నిమిషాల పాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రత్యే హోదా విషయంలో ఇప్పటికే భాజపా, తెదెపా మధ్య సంబంధాలు తెగతెంపులైనంత పని అయ్యాయి. అయినా మోదీ ఎప్పటికైనా తన హామీని నెరవేర్చుకుంటారన్న ఆశతో చంద్రబాబు వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. కేంద్రంలోని ప్రభుత్వంతో కయ్యానికి దిగితే నష్టపోయేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అని చంద్రబాబుకి తెలుసు కాబట్టి... చిక్కుముడులను నిదానంగా విడదీసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. మరి మోదీ ఓ మెట్టు దిగి ఆంధ్రప్రదేశ్‌ మొరను ఆలకిస్తారా లేకపోతే పని గడిచిపోయింది కదా అని ఏపీ తెప్ప తగలేస్తారా అన్నది త్వరలోనే తేలనుంది.

రిజర్వ్ బ్యాంక్‌ గవర్నరుని తొలగిస్తారా?

మన దేశ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరుగా రఘురామ్‌ రాజన్‌ గురించి తెలియని వారుండరు. ద్రవ్యపరమైన విధానాల గురించీ, దేశంలోని ఆర్థిక పరిస్థితుల గురించి కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే రఘురామ్‌ తరచూ వార్తల్లో కనిపించడమే దీనికి కారణం కావచ్చు. కానీ నిష్కర్షగా మాట్లాడే ఆయన తీరే ఇప్పుడు రఘురామ్‌ పదవికి ఎసరు తెచ్చినట్లుంది. ఈ ఏడాదితో మూడేళ్ల పదవీకాలాన్ని ముగించనున్న రఘురామ్‌ను మరికొద్ది రోజులు పదవిలో కొనసాగించాలనే అభిప్రాయం తొలుత ఉండేది. కానీ రానురానూ ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకత మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సాటి తమిళ తంబి అని కూడా చూడకుండా సుబ్రమణ్య స్వామి తరచూ రఘురామ్‌ మీద విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ సోనియాని దుయ్యబట్టే సుబ్రమణ్యం ప్రస్తుతం రఘురామ్‌ను తన లక్ష్యంగా చేసుకున్నట్లున్నారు. వడ్డీ రేట్ల మార్పు, మొండి బకాయిలు వంటి విషయాలలో రఘురామ్ తీరు మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేదిగా ఉందన్నది స్వామి ఆరోపణ. రఘురామ్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల పరిశ్రమలు విఘాతం కలిగిందనీ, లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నది ఆయన ప్రధాన విమర్శ. స్వామి కేవలం పైపై విమర్శలతో సరిపుచ్చుకోలేదు. రఘురామ్‌ను వీలైనంత త్వరగా ఆ పదవి నుంచి పీకేయమంటూ ఏకంగా ప్రధానమంత్రి మోదీకి ఓ ఘాటైన ఉత్తరం కూడా రాశారు. అమెరికా గ్రీన్‌ కార్డుని వదులుకోని రఘురామ్‌, మానసికంగా భారతీయుడు కాడనీ... ఆయనలో జాతీయ భావాలు లేవనీ స్వామి తన ఉత్తరంలో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ కూడా రఘురామ్‌ను పదవిలో కొనసాగించే విషయాన్ని దాటవేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మన ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్ల గురించి నిర్ద్వంద్వంగా తన అభిప్రాయాలు తెలియచేసే రఘురామ్ మాజీగా మిగిలిపోవడంలో మరెన్నో రోజులు పట్టకపోవచ్చు.

కశ్మీర్‌లో మిలిటెంట్ల హవా

  కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీరం మళ్లీ రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకు సాక్ష్యంగా వారం వారం ఏదో ఒక చోట నుంచి ఎన్‌కౌంటరుకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారనీ, మరి కొందరు తప్పించుకున్నారనీ సైన్యం తెలియచేసింది. పఠాన్‌కోట్‌ దాడి తరువాత మన దేశం పాకిస్తాన్‌ మీద కానీ, ఆ దేశంలో బోర విరుచుకుని తిరుగుతున్న సూత్రాధారి మౌలానా మసూద్‌ అజార్‌ మీద కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోవడం... తీవ్రవాదుల దృష్టిలో చులకన అయ్యేందుకూ, వేర్పాటువాదులు తమ గొంతుకను పెంచేందుకూ అవకాశమిచ్చినట్టు అయ్యింది. పైగా చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్‌ తీవ్రవాదులను వెనకేసుకుని రావడంతో వారికి నైతిక స్థైర్యం చిక్కుతోంది. దీనికి అనుగుణంగానే కశ్మీరంలో ఇప్పుడు తిరుగుబాటు ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. సైన్యం తీవ్రవాదుల మీద కాల్పులు జరిపే సందర్భంలో అక్కడకి అల్లరి మూకలు చేరుకుని జాతి వ్యతిరేక నినాదాలు చేయడం సాధారణంగా మారిపోతోంది. ఒక పక్క ఎన్‌కౌంటరు జరుపుతుంటే మరో పక్క దగ్గర్లోని మసీదుల మైకుల నుంచి తీవ్రవాదులను ప్రోత్సహించే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఆ రాష్ట్రంలో ఏ అఘాయిత్యం జరిగినా దానికి సైనికులే కారణం అంటూ మొదలవుతున్న ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. గత నెల హంద్వారాలో జరిగిన ఓ అత్యాచార యత్నానికి సైన్యమే కారణమంటూ చెలరేగిన నిరసనల్లో ఐదుగురు అమాయకులు బలయ్యారు. రానురానూ సంక్లిష్టంగా మారుతున్న అక్కడి పరిస్థితిని అంచనా వేయడంలోనూ, దానికి అనుగుణంగా వ్యవహరించడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు భారతదేశం పట్ల అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకూ, తీవ్రవాదపు విషకోరల నుంచి అక్కడి పౌరులను తప్పించేందుకు ఎవరూ పూనుకున్నట్లు తోచడం లేదు. ఎవరి రాజకీయాలలో వారు నిమగ్నమైపోయి ఉంటే, కశ్మీరం కల్లోలంగా మిగిలిపోవడంలో ఆశ్చర్యం ఏముంది!

ఆ 570 కోట్లకి బాధ్యత ఎవరిది!

తమిళనాడులో ఒక పక్క ఎన్నికలు జరుగుతుండగా ఏకంగా 570 కోట్ల రూపాయలు పట్టుపడటం సంచలనం సృష్టించింది. ఇవన్నీ ఎన్నికలలో పంచేందుకు ఎవరో ఏర్పరుచుకున్న డబ్బన్న పుకార్లు మొదలయ్యాయి. అలాంటిది ఏమీ లేదనీ, ఈ సొమ్మంతా కూడా తమదేననీ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పడంతో పుకార్ల షికార్లు కాస్త నెమ్మదించాయి. కానీ ఇంత మొత్తం సొమ్ము అంత సులువుగా ఎలా తరలిస్తున్నారన్న ప్రశ్న మొదలైంది. రాత్రి పూట అందునా అడవుల గుండా వందల కోట్ల రూపాయలు వెళ్తున్నాయన్న అనుమానం ఎవరికన్నా వస్తే ఇంకేమన్నా ఉందా! సాదాసీదాగా ఉండే ఎన్నికల కమీషన్‌ అధికారులే ఈ కంటెయినర్లని వెంబడించి పట్టుకోగలిగారంటే, ఇక సాయుధంగా వెంటపడేవారి సంగతి చెప్పేదేముంది. స్టేట్‌ బ్యాంక్‌ మాత్రం ఇలాంటి ఆరోపణలన్నింటినీ కొట్టి పారేస్తోంది.   పగలే ప్రయాణించాలన్న నిబంధన ఏదీ లేదని వాదిస్తోంది. కోయంబత్తూరు నుంచి వైజాగు శాఖకు ఈ సొమ్ముని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారనీ, త్వరలోనే ఈ సమస్య తీరిపోతుందనీ అంటోంది. సొమ్ముని తాము పకడ్బందీగానే తరలించామని భుజాలు చరచుకుంటోంది. కానీ ఈ కంటెయినర్లను వెంబడించిన అధికారుల వాదన వేరేలా ఉంది. కంటెయినర్లకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు లుంగీలు కట్టుకుని నిర్లక్ష్యంగా ఉన్నారనీ, బ్యాంకు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారనీ అంటున్నారు. నగదుకి సంబంధించిన ధృవపత్రాలలో కూడా లోపాలు కనిపించడంతో దాన్ని తిరుపూరు కలెక్టరేటు వద్దనే నిలిపివేశారు.   570 కోట్లని అలా నిలిపి ఉంచడమంటే, తక్కువలో తక్కువ వడ్డీ వేసుకున్నా రోజుకి లక్షల్లో నష్టం తేల్తోంది. అటు ఎన్నికల కమీషన్‌, ఇటు ఆదాయపు పన్ను అధికారులు తిరుపూర్‌కి చేరుకుని ఆ సొమ్ము సరైనదే అని తేల్చిన తరువాత కానీ, కంటెయినర్లు కదిలే పరిస్థితిలో లేవు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో, వాటిని కాపాడవలసి వ్యవస్థలు ఎంత ఆషామాషీగా వ్యవహరిస్తున్నాయో బయటపడిపోతోంది. ఏమైనా మనది కాని మంది సొమ్మంటే అందరికీ చులకనే కదా!

న్యాయవ్యవస్థ మీద అరుణ్‌జైట్లీ దాడి

ఆయన బీజేపీలో ఓ ప్రముఖ నేత. దేశానికి ఆర్థికశాఖా మంత్రి. ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన వ్యక్తి. కానీ ఆయనే ఇప్పుడు ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారు. న్యాయవ్యవస్థని తరచూ దుమ్మెత్తి పోస్తున్నారు. స్వయంగా న్యాయవాది అయి ఉండి కూడా న్యాయమూర్తులకు చురకలంటిస్తున్నారు. బహుశా ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విషయంలో న్యాయస్థానాలు చూపిన దూకుడు జైట్లీగారి కడుపుమంటకు కారణం అయి ఉండవచ్చు. దీనికి తోడు కరువు, ఉపాధి హామీ పథకం వంటి అనేక అంశాలలో న్యాయస్థానాలు ప్రభుత్వానికి వేస్తున్న మొట్టికాయల నొప్పి ఆయనకి కూడా తెలుస్తూ ఉండవచ్చు. అందుకే  గత వారం పార్లమెంటులో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, చట్టవ్యవస్థను నాశనం చేస్తోందంటూ మండిపడ్డారు.   అక్కడితో ఆగారా అంటే నిన్నటికి నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ఒక లక్షణరేఖను పాటించాలనీ, అలా కాకుండా పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. న్యాయానికి స్వేచ్ఛ పేరుతో చట్టవ్యవస్థ, పరిపాలనల్లోకి న్యాయస్థానాలు చొచ్చుకువస్తే భరించలేం అంటూ హెచ్చరికలు పంపారు. ఇప్పటికే వేతన జీవుల భవిష్య నిధి మీద పన్ను వేయాలని ప్రయత్నించి భంగపడిన జైట్లీ సాహెబ్‌, ఇప్పుడు న్యాయవ్యవస్థతో చెలగాటాలాడుతున్నట్లు కనిపిస్తోంది. అరుణ్‌జైట్లీ మీద దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లేనిపోని విమర్శలకు దిగినప్పుడు, ఇదే న్యాయవ్యవస్థ ఆయనకు అండగా నిలబడిన విషయం బహుశా జైట్లీగారు మర్చిపోయినట్లున్నారు. ఏమైనా రాజకీయ నాయకులు కదా, మనకో న్యాయం ఇతరులకో న్యాయం అన్న సూత్రాన్ని పాటిస్తున్నారేమో!

విస్తరిస్తున్న రామ్‌దేవ్‌ వ్యాపార సామ్రాజ్యం

జాతీయ స్థాయిలో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సబ్బు ముక్కని విపణిలోకి వదిలినా, దానికి పోటీ పడేందుకు వందలాది బ్రాండ్‌లు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఒక సంస్థ కేవలం ఐదేళ్లలో 20 రెట్ల అభివృద్ధి సాధించిందంటే అది ఊహించని విజయమే అని చెప్పుకోవాలి. ఆ విజయాన్ని సాధించింది పతంజలి. 2011లో 400 కోట్ల వ్యాపారం చేసిన పతంజలి 2016-17 నాటికి పదివేల కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా ఏర్పరుచుకుంది. సహజసిద్ధమైన ఉత్పత్తులు తక్కువ ధరకే అన్న నమ్మకమే నిజానికి పతంజలి విజయరహస్యంగా మారిపోయింది. ప్యాకింగ్‌ దగ్గర్నుంచీ ఉన్నతస్థాయి ప్రమాణాలను పాటించడం, నూడిల్స్‌తో సహా ప్రతి ఉత్పత్తికీ ప్రత్యామ్నాయాన్ని అందించడంతో జనం పతంజలి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఏదో ఒకసారి కొని చూద్దాం అనుకునేవారంతా, ప్రస్తుతానికి పతంజలికి అలవాటు పడసాగారు. పతంజలి దెబ్బకి డాబర్‌, కోల్గేట్ పామోలివ్, నెస్లే వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలన్నీ కుదేలైపోతున్నాయి. బ్రాండ్‌ వాల్యూ కోసమే కోట్ల కొద్దీ ఖర్చుపెట్టే ఆ సంస్థలన్నీ, దిక్కుతోచకున్నాయి.   పతంజలి నుంచి వచ్చిన ఒక్క దంత్‌కాంతి పేస్టే 2015-16లో 450 కోట్ల అమ్మకాన్ని సాధించిందంటే దాని దెబ్బ మిగతా సంస్థల మీద ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. ఒకవైపు విజయం సాధిస్తూనే రామ్‌దేవ్‌ మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలను సానుకూలపరచుకుని అక్కడ తన వ్యాపారానికి అవసరమైన వనరులను పొందడంలో విజయం సాధించారు. మరో వైపు ఖాధీ నుంచి పశువుల దాణా వరకూ మరిన్ని ఉత్పత్తులను వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విజయంలో సామాన్యలు భాగస్వామ్యమేమీ తక్కువ కాదు. ఉచితాలు, ప్రకటనలు, సంస్థ పేర్లు చూసి కాకుండా ధరనీ, మన్నికనీ చూసి తాము ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని జనం చెప్పకనే చెప్పినట్లయింది. అందుకని రామ్‌దేవ్‌గారు ఇదంతా కేవలం తన మహిమే అని భ్రమించకుండా, మున్ముందు కూడా సామాన్యుల ఆశకు అనుగుణంగా నడుచుకుంటారని అశిద్దాం

మరో ప్రమోషన్‌పై కేటీఆర్ కన్నేశారా..?

ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికను తన భుజాలపై వేసుకుని టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్‌‌కు మరో ప్రమోషన్ దక్కనుందా..? అదే నిజమైతే కేసీఆర్ తన కుమారుడికి ఎలాంటి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది? కొడుకు పుట్టినపుడు కాదు..అతడు ప్రయోజకుడు అయినప్పుడే..ఊరువాడా అంతా కొడుకు గురించి చెబుతుంటే..తన కొడుకు అడగకుండానే ఏదైనా ఇచ్చేస్తాడు ఆ తండ్రి. ఇప్పుడు అచ్చం ఇలాంటి సంతోషంలోనే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అన్నీ తానై వ్యవహరించి హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా గులాబీ జెండాను రెపరెపలాడించి ఆ విజయాన్ని నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా అందించారు కేటీఆర్. ఆ సంతోషంతో ఉప్పొంగిపోయిన సీఎం, కేటీఆర్‌కు ప్రమోషన్ కల్పించారు.   కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇచ్చి..జూపల్లి వద్ద ఉన్న పరిశ్రమల శాఖను కేటీఆర్‌కు అప్పగించారు. గ్రేటర్ విజయంతో మున్సిపల్ శాఖ కేటీఆర్‌కు కానుకగా వచ్చింది. దాంతో పాటు ఇటీవల జరిగిన శాఖల మార్పుల్లో కూడా కొడుకుని సర్‌ప్రైజ్ చేయడానికి మరి కొన్ని శాఖలను కేటీఆర్‌కు ఇచ్చారు కేసీఆర్. ఈ గిఫ్ట్‌తో కలిపి కేటీఆర్ వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, మైన్స్ అండ్ జియాలజీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఎన్నారై వ్యవహారాలు ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి తర్వాత కీలక శాఖలన్ని కేటీఆర్ చుట్టూనే ఉన్నాయి.    ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు ఎన్నికలకు కూడా కొడుకుని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల గెలుపును కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అందుకనుగుణంగానే కాళ్లకు బలపం కట్టుకుని సైతం ప్రచారాన్ని నిర్వహించారు. సెంటిమెంట్‌ను ప్రధాన ఆయుధంగా చేసుకోవడంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. అటు విపక్షాలన్నీ ఏకం కావడంతో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటి చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలేరులో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్థేశించే రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వైసీపీ ఎంపి పొంగులేటితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలను కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారు. దీని వెనుక కేటీఆర్ చక్రం తిప్పినట్లు సమాచారం.   అన్నీ అనుకున్నట్లు జరిగితే పాలేరులో కారు జోరు నల్లేరుపై నడకలా సాగిపోనుంది. అదే జరిగితే మరోసారి కేటీఆర్‌కు ప్రమోషన్ దక్కనుందని తెలంగాణ భవన్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంలో మాత్రమే ప్రమోషన్ ఇచ్చి తన వారసుడు కేటీఆరే అని తేల్చిన కేసీఆర్. ఇప్పుడు పార్టీ పరంగా కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని టీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నాయి. ఇవి పుకార్లా లేదంటే నిజంగానే కేసీఆర్ మనసులో ఇదే ఉందా అనేది త్వరలోనే తేలిపోనుంది.

జగన్‌కి "ఆ ఒక్కటి" దక్కనివ్వరా..?

నా అనుకున్న వారు..నమ్మిన వారు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుంటే ఎం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌పై పిడుగు లాంటి వార్త పడింది.  శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు నెల రోజుల వ్యవధిలో వైసీపీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారని బాంబు పేల్చారు. ఈ వార్త విన్నప్పటి నుంచి జగన్‌కు నిద్రపట్టడం లేదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై వచ్చే నెలలో ఎలక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అచ్చెన్న వ్యాఖ్యలు జగన్‌ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఏపీ నుంచి నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికల్లో సంఖ్యా బలం రీత్యా మూడు టీడీపీకీ, ఒకటి వైసీపీకి దక్కే అవకాశముంది. కాని వైసీపీకి ఉన్న ఒక్క సీటును దక్కకుండా చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.   ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్థతు అవసరం. గడచిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున 67 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి 102 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా..తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాల స్వతంత్ర్య ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో పాటు మిత్రపక్షమైన బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటన్నింటికి మించి వైసీపీ నుంచి గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో సైకిల్ బలం 125కు చేరింది. దీంతో టీడీపీ అవలీలగా మూడు స్థానాలు గెలుచుకోవచ్చు. వైసీపీ విషయానికి వస్తే జంపింగ్ ఎమ్మెల్యేలు పోను చివరికి 50 మంది మిగిలారు. దీంతో ఒకే ఒక్క స్థానానికి పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా దక్కకుండా చేయడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.   ముందుగా రాజ్యసభ ఎన్నికల నాటికి వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను నయానో, భయానో తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. మిగతా పది మందిని దశల వారీగా పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నట్లు లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటి దాకా టీడీపీలో విడతల వారీగా ఎమ్మెల్యేలు చేరారు. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతారా? అన్న అనుమానాలు జగన్‌తో పాటు రాజకీయ విశ్లేషకుల బుర్రల్ని తొలిచివేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ కూడా మరో 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అప్పట్లో ప్రకటించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే..జగన్‌ పార్టీ నుంచి ఎవరూ రాజ్యసభలో అడుగుపెట్టకుండా చేయాలన్నది టీడీపీ స్కెచ్.

ట్రంప్‌ అధ్యక్షుడైతే..ప్రపంచానికి నష్టమేనా..?

  ప్రజంట్ అమెరికాలో ఎన్నికల హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం త్వరలో ముగిసిపోనుంది. ఒబామా రెండు విడతలు అధ్యక్షుడిగా పనిచేసినందున అక్కడి రాజ్యాంగం ప్రకారం మూడవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు. దీంతో ఆయన వారసుడు ఎవరా? అని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఒబామా డెమోక్రాటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నుంచి బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్‌లు శ్వేత సౌధాన్ని అధిరోహించేందుకు బరిలో నిలిచారు. వీరిద్దరిలో హిల్లరి విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రవర్తన ద్వారా అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచ వ్యాప్తంగానూ ఆమె జనాదరణ పొందారు. కాని ట్రంప్‌పై మాత్రం ప్రపంచం కలవరపడుతోంది. అతడు దుర్మార్గుడు, ప్రపంచాన్ని బతకనివ్వడు. మరి అలాంటి వాడు అగ్రరాజ్యాధినేత అయితే ప్రపంచ వినాశనం తప్పదు అని మేధావులు భయపడుతున్నారు.   రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఇంకా ప్రకటన రాక ముందే ట్రంప్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, చేస్తున్న వ్యాఖ్యలు అమెరికన్లనే కాకుండా ప్రపంచదేశాలను కూడా కలవరపరుస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఏ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అంతు పట్టకుండా ఉంది. ఒకసారి నోరు జారడం..వెంటనే నాలుక కరుచుకోవడం ట్రంప్‌కు అలవాటైపోయింది. భారతీయులు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అనేశాడు. విమర్శలు వచ్చేసరికి భారతన్నా, భారతీయులన్నా తనకి గౌరవమని, స్నేహ సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ముస్లింల గురించి దారుణమైన పదజాలంతో వ్యాఖ్యానించారు. ముస్లింలను దేశంలోకి రానివ్వరాదన్నది తన విధానమని ఆయన చెప్పారు. ఇదీ వివాదంగా మారడంతో మళ్లీ సరిదిద్దుకునే బాట పట్టారు. ముస్లింలను దేశంలోకి రానివ్వరాదన్నది కేవలం సూచన అని, అయినా అది తాత్కాలికమే అని ట్రంప్ అన్నారు. ఇలా అర్థంలేని వాదనలు..పొంతన లేని వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యాడు..అవుతూనే ఉన్నాడు.   ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుండటంతో సొంతపార్టీ వాళ్లే ఈయనెందుకు దేవుడోయ్...ఇతడి వల్ల మనం అయిపోతాం..అనుకునే పరిస్థితి. కాని ట్రంప్‌ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆయన్ని నిలువరించే శక్తి ఎవ్వరికి లేదు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పూర్వ రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రతినిధుల ఎన్నికల్లోనూ, ప్రైమరీ ఎన్నికల్లోనూ ట్రంప్ ఆధిక్యం సాధిస్తున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక ప్రత్యర్థులు ఒక్కొక్కరే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు.   ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికా స్థానం ప్రత్యేకం. తన అర్థ, అంగ బలంతో ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల శక్తి అమెరికా సొంతం. మరి అలాంటి దేశాన్ని పరిపాలించే అధినేతకు లోకం ఎంత భయపడుతుందో అందరికి తెలుసు. ట్రంప్‌లాంటి వ్యక్తికి అగ్రరాజ్యాధినేతగా అవకాశమిస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఎటు వెళ్తుందో తెలియదు. ఇతడు గెలిస్తే దక్షిణ చైనా సముద్రంలో యుద్ధం రావొచ్చు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వేరవ్వచ్చు. ముఖ్యంగా మనదేశానికి అతడు మిక్కిలి ప్రమాదకారి. చాలా సందర్భాల్లో ట్రంప్ భారత్‌పై తన అక్కసును వెల్లగక్కాడు. ఇన్ని తెలిసినా ఇలాంటి దురహంకారికే అక్కడి ప్రజలు అధ్యక్ష పీఠం కట్టబెట్టాలని ఎందుకు తపిస్తున్నట్టు.  

కేరళలో భార్యల మార్పిడి..సమాజం ఎటు పోతోంది..!

భారతీయ కుటుంబ వ్యవస్థ..భార్యాభర్తల సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయనడానికి కేరళలోని కొచ్చి నావల్ బేస్‌లో జరిగిన..జరుగుతున్న వ్యవహారమే పెద్ద నిదర్శనం. బైకులు..కార్లు..ఫోన్లు మార్చకున్నట్టు భార్యల్ని మార్చుకునే అనాగరికమైన కల్చర్‌ భారతదేశంలో సంచలనం సృష్టించింది. కేరళలోని కొచ్చి నావల్ కమాండ్‌లో పనిచేసే ఒక అధికారికి ఒక మహిళతో 2012 మార్చిలో వివాహం అయ్యింది. వీరిద్దరూ కొచ్చిలోనే కాపురం పెట్టారు. ఐతే ఆమె భర్త సహ అక్కడ పనిచేసే చాలామంది అధికారులకు వైఫ్ స్వాపింగ్ పార్టీలు చేసుకోవడం అలవాటు. అలాంటి పార్టీలో తనను పాల్గొనాల్సిందిగా సాక్షాత్తూ భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకు ఒప్పుకోనందుకు తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నట్లు 2013 ఏప్రిల్ 4న కొచ్చి హార్బర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు తన భర్త ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో సన్నిహితంగా ఉండటం చూశానని ఫిర్యాదులో పేర్కొంది.   ఈ సంఘటనతో సభ్య సమాజం ఉలిక్కిపడింది. మనం ఉంటుంది భారతదేశంలోనా లేక మరెక్కడైనా అని ప్రశ్నించుకుంటోంది. అసలేంటి ఈ వైఫ్ స్వాపింగ్.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జంటలు ముందుగా మాట్లాడుకుని భార్యల మార్పిడి చేసుకోవడం. ఒకరి భార్యతో ఇంకొకరి భర్త శారీరకంగా కలవడమే ఈ భార్యల మార్పిడి. వైఫ్ స్వాపింగ్, వైఫ్ షేరింగ్, వైఫ్ ఎక్స్చేంజ్ పేరేదైనా దీని సారాంశం ఒక్కటే. ఉన్నత వర్గాల్లో, విచ్చలవిడితనం మాత్రమే అలవాటు ఉన్న కుటుంబాల్లో ఈ భార్యల మార్పిడిల వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. కాని రాను రాను ఈ విష సంస్కృతి అన్ని వర్గాలకు పాకుతోంది. ప్రత్యకించి ఇలాంటి వ్యవహారం దేశ భద్రతలో కీలకంగా ఉన్న నేవీలో బయటపడటమే అన్నింటి కంటే ఆశ్చర్యకరం.   నేవిలో పనిచేసే వారి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. కుటుంబాల ఒంటరితనం, చిన్న చిన్న కుటుంబాలు, నెలల కొద్ది జీవిత భాగస్వాములను వదిలి ప్రయాణాలు చేయడం అందుకే గత కొద్ది సంవత్సరాలుగా ఈ విచ్చలవిడి లైంగిక క్రీడ ప్రారంభమైంది. ఇష్టపడి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అలాంటి వెధవ పనులకు మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో..భర్తతో కాకుండా వేరే మగాడితో కలవడానికి ఇష్టపడని మహిళలను సదరు భాగస్వామి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రపంచం మొత్తం కీర్తించే భారతీయ సమాజానికి ఇలాంటి సంఘటనలు మాయని మచ్చ తెస్తున్నాయి.   మన జీవన విధానం, సనాతన ధర్మాలు, ఆచారాలు స్త్రీలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించాయి. అనాదిగా పరాయి వ్యక్తి భార్యను అమ్మలా, అక్కలా, చెల్లిలా, వదినలా గౌరవించే గడ్డ మనది. ఇటువంటి వికృత క్రీడలు మనదేశంలో చెల్లవు. ఒప్పుకోవడం అటుంచి జనం దాన్ని అసహ్యించుకుంటారు. కానీ ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత భాగస్వామితో కాకుండా ఒకసారి మరోకరితో లైంగిక ఆనందాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి వల్ల కూడా పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుడితో సంబంధాల్ని  ఏర్పరిచే ఈ స్వాపింగ్ పార్టీకు అలవాటు పడుతున్నారు.   ఈ దుష్ట సంప్రదాయం మీద సుప్రీం సీరియస్ అయ్యింది..ఈ కల్చర్‌ను తప్పుబడుతూ నేవీ ఆఫీసర్ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనం కనీసం ఊహించుకోవడానికి కూడా ఇబ్బంది పడే విషయం ఇది. దీనిని మొగ్గలోనే తుంచివేయకపోతే సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుంది, తరాలు నాశనం అయిపోతాయి.  

కొత్త మాఫియా...భక్తి మాఫియా పార్ట్-2

  ఇంతక్రితం ఉదయం పూట టీవీ పెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతమో లేదా హనుమాన్ చాలీసానో వినిపించేవి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఉదయం ఎక్కడ చూసినా స్వామీజీల ప్రవచనాలు..సూక్తులు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఒక్కటే..! పబ్లిసిటి. అన్ని వ్యాపారాల్లో లాగే భక్తి వ్యాపారంలోనూ పోటి ఉంది. అందుకే జనాన్ని ఆకర్షించడానికి మంత్రాలు, తంత్రాలు చేసి వాళ్లను తమ ఆశ్రమాల దాకా రప్పిస్తున్నారు. అయినా సరిపోక కోట్ల రూపాయల డబ్బు కుమ్మరించి ఛానెళ్లలో కమర్షియల్ స్లాట్స్ బుక్ చేస్తున్నారు. కాని అందరికి ఒకటే టైం కావాలి. ఆ స్లాట్స్‌ని తమ సొంతం చేసుకోవడానికి అవసరమైతే సంవత్సరంలోని అన్ని ఏపిసోడ్స్‌కి ముందుగా అడ్వాన్స్‌ చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. అక్కడ కూడా పని జరగని పక్షంలో సొంతంగా ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడయితే ఉదయం నుంచి రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా డబ్బా కొట్టుకోవచ్చు.   ఇదివరకటి రోజుల్లో ఏ రాజకీయ పార్టీల నాయకులో..బడా వ్యాపార వేత్తలో..రియల్ ఎస్టేట్ కింగ్‌లో తమ వ్యక్తిగత అవసరాల కోసమో..లేక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడానికో సొంత ఛానెళ్లని ఏర్పాటు చేసుకునేవారు. కాని నోరు తెరిస్తే భౌతికమైనవి మేము ఆశించం. మాకు విశ్వమానవ శ్రేయస్సే ముఖ్యమంటూ పిచ్చి ప్రవచనాలు చెప్పే ఈ కుహనా స్వాములకు ఛానెళ్ల అవసరం ఎంటి? ఒక శాటిలైట్ టీవీ ఛానెల్ పెట్టాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్ధితుల్లో 200 నుంచి 300 కోట్లు కావాలి. సంచుల్లో బూడిద తప్ప ఇంకేమి లేదని కూసే ఈ స్వాములకు అంత డబ్బు ఎక్కడిది . ఇదంతా అవినీతి సంపాదన కాదా..? లేక ఏ వ్యాపారాలు చేయకుండానే అంత కూడబెట్టారా అంటే సమాధానం శూన్యం.  ఇంతకు ముందు ఏ సత్యసాయి నిగమాగమంలోనో, లేదంటే ఏ తుమ్మ్లపల్లి వారి కళాక్షేత్రంలోనే సత్సంగాలు ఏర్పాటు చేసేవారు. అయితే తమ భక్తి వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే మరింత మంది జనానికి తమ గురించి తెలియాలి. కేవలం వ్యాపారం చేసే వారే ప్రజలకు తమ ప్రొడక్ట్ తెలియాలనుకుంటారు. అందుకే టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇస్తారు. మరి స్వామీజీలు స్లాట్స్ బుక్ చేయడం, ఛానెళ్లు పెట్టడం చూస్తే ఇదంతా వ్యాపారం కోసం చేస్తున్నారనుకోవాలి.     తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రముఖ స్వామీజీ ఇటీవలే ఒక ఛానెల్‌లో కొంతవాటాను సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి "భారత్‌టుడే"అని సొంతంగా భక్తి ఛానెల్‌ను ప్రారంభించారు. వీటితో తమ గురించి డబ్బా కొట్టుకోవడంతో పాటు తమకు పోటి వస్తున్న వారికి వ్యతిరేకంగానూ ఉపయోగిస్తున్నారు. భూకబ్జాలు, డ్రగ్స్, లైంగిక ఆరోపణలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కల్కి లీలల గురించి అప్పట్లో ప్రతి టీవీ ఛానెళ్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తిప్పికొట్టాలంటే తనకు సొంత మీడియా ఉండాలని భావించిన కల్కి ఒక టీవీ ఛానెల్ ప్రారంభించాడు. దీని ద్వారా తనకు వ్యతిరేక వార్తలు రాసే వారి పనిపట్టే స్కెచ్ గీశాడు.   ఇదంతా పక్కన బెడితే స్వాములకు , స్వాములకు మధ్యే పడటం లేదు. బుధవారం నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాయిబాబా భక్తుడు సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రచించిన "నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా" అనే గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వార్త తెలుసుకున్న స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వాగ్వివాదానికి దిగారు. "సాయిబాబానే అవమానిస్తారా" అని ఒకరు "ఆదిశంకరాచార్యులనే అవమానిస్తారా" అని ఒకరు తీవ్రవాగ్వాదానికి దిగారు. ఇదే రమణానందకు తెలుగునాట ప్రవచనాల సామ్రాట్‌గా పేరొందిన చాగంటి సోమయాజీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.   తాను షిరిడీ సాయిపై చెప్పిన మాటకు విరుద్ధంగా చాగంటి ప్రవచనాలున్నాయని రమణానంద కక్ష పెంచుకున్నారు. రమణానంద తన చేతిలో ఉన్న శివశక్తిసాయి అనే టీవీ ఛానెళ్లో చాగంటి మీద దుష్ప్రచారం చేయించడం, కొంతమంది తన అనుచరుల చేత చాగంటికి వ్యతిరేకంగా రోడ్లెక్కించడం చేశారు. రాగద్వేషాలు వదిలించుకోవాలని మనకి చెప్పే స్వాములే వాటికి లొంగిపోతే ఎలా? ఇంతకీ స్వామీజిల ప్రేమ దేని మీద హిందూ మతం మీదా.. హిందూ మతాన్ని నమ్మే ప్రజల మీద..లేక ప్రజల డబ్బు మీదా.? రాజకీయ నాయకులో, పారిశ్రామికవేత్తలో కోట్లకు  కోట్లు అవినీతి చేశారంటూ గోల గోల చేసే రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య సంస్థలకు భక్తి ముసుగులో స్వామిజీలు కూడబెడుతున్న కోట్లు కనిపించడం లేదా..? ఒక వేళ ప్రశ్నిస్తే ఏమైనా పాపం చుట్టుకుంటుందని భయమా? అలా భయపడుతున్నంత కాలం మార్కెట్‌లోకి రోజుకొక కొత్త బాబా పుట్టుకొచ్చి వేల కోట్లకు అధిపతి అవుతాడు.    దేశంలో వేలకోట్లకు అధిపతులైన స్వామీజీలు:   నిత్యానంద:   తమిళ సినీనటి రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని ఫుల్ ఫేమస్ అయిన నిత్యానంద కొన్ని కోట్లకు అధిపతి. ఆయన వద్ద సుమారు 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏకంగా సీఐడీ దర్యాప్తులో తేలింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 100 ఎకరాల స్థలంతో పాటు, అమెరికా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. మహిళా భక్తులపై అత్యాచారాలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.   స్వామి రాంపాల్ బాబా:   హర్యానాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రాంపాల్. డిప్లోమా వరకు చదివి కొంతకాలం ప్రభుత్వంలో ఉద్యోగం వెలగబెట్టాడు. దానిని వదిలిపెట్టి బాబా అవతారమెత్తి.. తనను తాను కబీర్ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. హిస్సార్‌లో మనోడీకి 12 ఎకరాల్లో సువిశాల సామ్రాజ్యం ఉంది. మొన్నటి మొన్న లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన ప్రైవేట్ సైన్యం చేత అడ్డగించాడు. వారిని చేధించుకుని కోటలోకి అడుగుపెట్టిన పోలీసులకు స్వామి వారి వైభోగం చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఇంధ్ర  భవనాల్ని తలపించే ఆశ్రమాలు, బంగారు సింహాసనాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే.   ఆశారాం :   మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో అరెస్టై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు ఆశారాం బాపూజీ. భక్తుల వద్ద వసూలు చేసిన విరాళాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు...అమెరికాలోని కొన్ని సంస్థల్లో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈయనగారి వ్యక్త్తిగత ఆస్తులు 350 కోట్లుకాగా, అతని పేరిట బినామీ ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ ఉండవచ్చని ఈడీ అంచనా.   బాబా రాందేవ్:   దేశంలో ప్రముఖ యోగా గురువుగా పేరుగాంచిన బాబా రాందేవ్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. యోగా, ప్రవచనాలు చెప్పుకునే బాబాకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రధాన అనుచరుడు ఆచార్య బాలకృష్ణన్ ప్రకటించిన లెక్కల మేరకు రాందేవ్ వ్యాపార సామ్రజ్యం విలువ 1,100 కోట్ల రూపాయలుగా వెల్లడైంది. ఈయన గారికి సొంత టీవీ ఛానెల్ ఉంది దాని పేరు ఆస్థా.    కల్కిభగవాన్:   కల్కి భగవాన్ ఆలియాస్ "విజయ్ కుమార్". డ్రగ్స్‌, భూదందాలు ఇలా ఈయనగారి ఆశ్రమంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు , నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆశ్రమం ప్రక్కల ఉన్న భూమిని కల్కి ఆక్రమించాడని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. వివిధ దర్శనాలు, పూజల పేరుతో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నట్టు మీడియా కథనాలు ప్రచురించింది. తనపై వచ్చే ఆరోపణలను తిప్పికొట్టడానికి కల్కిభగవాన్ ఓ టీవీ ఛానెల్‌ని స్థాపించాడు.    బాబా గుర్మీత్ రామ్ రహీమ్:   బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా. సిక్కు మతంలోని ఒక శాఖ" డేరా సచ్చా సౌదా"కు ఈయన అధిపతి. భక్తులు యిబ్బడిముబ్బడిగా విరాళాలు ఇవ్వడంతో వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు అబ్బో బాబాగారి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. డేరా తన సంపదతో ప్రభుత్వాలను సైతం శాసించగలుగుతున్నాడు. 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి.   ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్:   మనిషి ఒత్తిడిని తగ్గిస్తామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించిన పండిట్ రవిశంకర్ తన శక్తి, సామర్థ్యాలతో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎఓఎల్ ఫౌండేషన్ ఒక ప్రభుత్వేతర సంస్థ. విదేశాల నుంచి వచ్చే నిధులు దీనికి ప్రధాన తైలం. 156 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాల ద్వారా దాదాపు 1,000 కోట్ల ఆస్తులను రవిశంకర్ ఫౌండేషన్ కూడబెట్టిందని అంచనా.    మేము భగవంతుడికి, భక్తులకు మధ్య అనుసంధానకర్తలం మాత్రమే, మాకు భార్య, పిల్లలు, ఆస్తి, పాస్తి ఏమి లేవంటారు. అలాంటి వారికి బంగారు సింహాసనాలెంటి..? హంస తూలికా తల్పాలెంటి..? సంసారాన్ని, బంధుమిత్రుల్ని త్యజించాం..మాకున్న తోడు దేవుడొక్కడే అని చెప్పే స్వాముల్లో ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో "బంధాన్ని" కొనసాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మనకి మాత్రం ముక్తి పొందాలంటే బంధాలన్ని వదిలిపెట్టాలని శ్రీరంగనీతులు వల్లిస్తారు. అయితే ఇలాంటి స్వాముల్లో కూడా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వ్యక్తులున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైందవ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.  సింహాసనాల మీద కాకుండా పేడతో అలికిన నేల మీదే ఆయన దినచర్య సాగుతోంది. ఆఖరికి కారులో బయటకు వెళ్లేటప్పుడు కూడా చెక్క పీట మీదే కూర్చునేవారు.   మంచికి రోజులు లేనట్టు జయేంద్ర సరస్వతి మీద కూడా కేసులు మోపి, ఆయన్ను జైలుకి పంపారు. కాని నిజం దాస్తే దాగేది కాదు అందుకే న్యాయస్థానం కూడా ఆయనపై నమోదైన అభియోగాలు నిరాధారమైనవని నిర్దోషిగా విడుదల చేసింది. దీనిని బట్టి మతం, రాజకీయం సమ్మిళతమైపోయాయని అర్థం చేసుకోవచ్చు. జనానికి, రైతుకు మధ్య దళారులు, కార్యాలయాల్లో దళారులు, ఇలా ప్రతి పనికి దళారులున్నట్లే మనకి..దేవుడికి మధ్యలో స్వామీజీలు, బాబాలు అనే దళారులు ప్రవేశించారు. అయినా భగవంతుణ్ణి అందుకోవడానికి మనకు కావాల్సింది నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండు ఆయుధాలతో చరిత్రలో ఎంతోమంది దేవుణ్ణి చేరుకున్నారు. కాబట్టి మనకు దళారులు అవసరం లేదు.                                                                                                            సశేషం కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1

"సింహపురి" జగన్‌ నుంచి చేజారిపోనుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి..వైఎస్ జగన్‌కు కంచుకోట లాంటి నెల్లూరులో ఫ్యాన్ రెక్కలు టపటపా ఊడిపోతున్నాయి. అన్ని రెక్కలు కలిసి..సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. వైసీపీకి పట్టున్న..టీడీపీ బలం తక్కువగా ఉన్న జిల్లాలపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందుకే ఆ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. అది మంచి రిజల్ట్ ఇవ్వడంతో మిగతా జిల్లాల్లో కూడా వర్కవుట్ చేయాలని టీడీపీ అధినేత ప్లాన్ గీస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలున్న నెల్లూరు జిల్లాలో వైసీపీ గడచిన ఎన్నికల్లో 7 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అధికార తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ఎదురులేకుండా చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేశారు బాబు.   అందుకే జిల్లాపై పూర్తిస్థాయి పట్టున్న ఆనం బ్రదర్స్‌ను టీడపీలోకి చేర్చుకున్నారు. పనిలో పనిగా వైసీపీ ఎమ్మెల్యేలను సైకిలెక్కించుకుంటున్నారు. ఇప్పటికే గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చివరి శ్వాస వరకు జగన్‌తోనే అని అంటూనే వైసీపీకి షాక్ ఇచ్చారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ, ఆనం బ్రదర్స్‌తో పలు విడతలుగా మంతనాలు జరిపిన ప్రతాప్ స్పష్టమైన హామీ కోసం ఎదురు చూశారు. ఈ సీఎంతో కూడా సమావేశమైన రామిరెడ్డి ఒకటి, రెండు డిమాండ్లు మినహా మిగిలిన వాటన్నింటికి ఆయన నుంచి హామీ తీసుకున్నారట. దీంతో సైకిలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆ పర్యటన నుంచి ఈ నెల 15న విజయవాడకు తిరిగి రానున్నారు. అనంతరం ఈ నెల 18న రామిరెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో నెల్లూరులో సైకిల్ బలం 5కు చేరనుంది. ఇదిలా ఉంటే రామిరెడ్డి బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మహానాడులోపు ఈ ఇద్దరు కూడా టీడీపీలోకి చేరే అవకాశం ఉంది. మొత్తం మీద వైసీపీ కంచుకోటలైన కర్నూలు, నెల్లూరు జిల్లాలు త్వరలో టీడీపీ పరం కానున్నాయి.   

కృష్ణాతీరంలో "ఫ్యాన్" కొట్టుకుపోబోతోంది..!

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రోజురోజుకి చిక్కిపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి మరికొన్ని షాక్‌లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నమ్మినవారు..నా అనుకున్న వారు జగన్ తీరు నచ్చక వలసబాట పడుతున్నారు. రాజకీయాలకు రాజధాని, ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి కేంద్రబిందువు అయిన కృష్ణాజిల్లా వైసీపీలో వలసల పరంపర మొదలయ్యాయి. సీనియర్ నాయకులు, వారి బంధువులు, మిత్రులు టీడీపీకి క్యూకడుతున్నారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సైకిలెక్కగా..ఆయన దారిలో జంప్ కొట్టేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావులు గోడ దూకడానికి మంతనాలు జరుపుతున్నారు.   వాస్తవానికి కృష్ణాజిల్లా అనగానే తెలుగుదేశానికి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటి ఇచ్చింది. ఒక సమయంలో పదిసీట్లకు పైగా వస్తాయని వైసీపీ అంచనా వేసింది. కానీ ఐదు స్థానాలతోనే సరిపెట్టుకుంది. జగన్‌కు ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలిచేందుకు అక్కడి నేతలు సహకరించడం లేదు. నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో విబేధించి వైసీపీలో చేరిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా సొంతగూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇక పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. ఆమె కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా తెలుగుదేశంలోకి వెళ్లాలనుకుంటున్నారు.    మైలవరం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ను నమ్మి వైసీపీలో చేరినను జగన్ మాత్రం ఆశించిన స్థాయిలో అతనికి ప్రాధాన్యత ఇవ్వటంలేదనేది కార్యకర్తల అభిప్రాయం. రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ సంగతి చూస్తే దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగానూ, ప్రభుత్వంలోనూ కాపు నేతలు "కీ" రోల్ ప్లే చేస్తుండటంతో కాపు సామాజికవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న రాధాను టీడీపీలో చేర్చేందుకు కాపునేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి పార్థసారథి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.   కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సారథి పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగారు. జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా హవా నడిచింది. ఇప్పుడదంతా గతం..ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పార్థసారథికి జగన్ అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తనను ప్రెస్ మీట్‌లకే పరిమితం చేసి విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం లేదనే బాధలో సారథి ఉన్నారు. అందుకే పార్టీ మారాలనుకుంటున్నారు. మొత్తం మీద జిల్లాలోని వైసీపీ ముఖ్య అనుచరగణమంతా పార్టీని వీడీ ఎప్పుడెప్పుడు పచ్చకండువా  కప్పుకుందామా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారుతున్న వారికి ఫుల్ పాపులారిటీ వస్తుండటంతో నేతలంతా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఇంత జరుగుతున్నాఅధినేత జగన్ నాయకుల కదలికలపై నిఘా పెట్టకపోవడం గమనార్హం. వీరిని కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో ఫ్యాను పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   

కేవీపీ బిల్లు అడ్డుకోవడానికి బీజేపీ వ్యూహం...!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు ఓటింగ్ జరగనుంది.  షెడ్యూల్ ప్రకారం రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు, రేపు జరిగే ఓటింగ్ "చావో రేవో" కిందే లెక్క. ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన దరిమిలా, కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖుంగా తెరపైకి తెచ్చింది. అందుకే ఈ ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్ ఇంపార్టెన్స్‌ ఇచ్చింది. వ్యూహత్మకంగా రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్‌దే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై కేవీపీ బిల్లు చర్చకు వస్తే..ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో సంఖ్యాబలం లేని బీజేపీ ఓటమిని  ఒప్పుకోవాలి.   రాజ్యసభలో ఈ బిల్లు పాసైనా..లోక్‌సభలో బీజేపీ బలం ముందు కాంగ్రెస్ తలవంచక తప్పదు. కాని ఇక్కడే ఉంది కాంగ్రెస్ మైండ్ గేమ్..లోక్‌సభలోకి బిల్లు వస్తే దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రధాని మోడీ స్వయంగా బిల్లుపై మాట్లాడాలి. హోదాకు మేం ఒప్పుకుంటున్నాం అంటే ఓకే..! అలా కాక ఇవ్వడం కుదరదు అంటే మాత్రం ఏపీలో బీజేపీ గల్లంతే. ఇప్పటి వరకు హోదా ఇవ్వడం సాధ్యపడదు అని తన మంత్రుల చేత చెప్పిస్తున్న మోడీ ఇంతవరకు దీనిపై అధికారికంగా మాట్లాడలేదు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడక తప్పదు. అప్పుడు మోడీ హోదాకు వ్యతిరేకమో..అనుకూలమో చెప్పాలి. దాని కోసమే కాంగ్రెస్ ప్లాన్. హోదా ఇచ్చినా కాంగ్రెస్‌కే ప్లస్..ఇవ్వకపోయినా కాంగ్రెస్‌కే ప్లస్. ఈ ప్లాన్‌ను అర్థం చేసుకున్న బీజేపీ అధినాయకత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.   దీనిని ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచించిన బీజేపీ వ్యూహకర్తలు రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేయాలని వ్యూహన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే నిర్దేశిత సమయం కంటే రెండు రోజులు ముందుగానే లోక్‌సభను వాయిదా వేసిన కేంద్రం..ఓ రోజు ముందుగానే రాజ్యసభను వాయిదా వేయాలని స్కెచ్ గీస్తోంది. ఇవాళ రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే..రేపు సభ ముందుకు రానున్న కేవీపీ బిల్లు..తదుపరి సమావేశాల్లో కాని సభలో ప్రస్తావనకు రాదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం నుంచి తప్పించుకునేందుకు నరేంద్రమోడీకి ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.   ఇప్పుడైతే తప్పించుకున్నారు అనుకుందాం.. కాని వచ్చే సమావేశాల్లో ఏం చేస్తారు అని మీకు డౌట్ రావొచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది..ప్రస్తుతం రాజ్యసభలో 57 మంది సభ్యుల పదవీ కాలం రేపటితో ముగియనుంది. వారి స్థానంలో బీజేపీ తో పాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఎన్నికవుతారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలను బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలే పరిపాలిస్తున్నాయి. తద్వారా బీజేపీ బలం కూడా పెరగనుంది. రాజ్యసభలో తన బలం పెరిగిన తర్వాత జరగనున్న తదుపరి సమావేశాల ముందుకు ఈ బిల్లు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని కమలనాథుల భావన. దీనిని బట్టి బీజేపీ ఏ రకంగానూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించకున్నట్లుంది.  

కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1

భారతదేశం..మూఢాచారాలు విస్తతంగా వ్యాపించిన దేశం. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంత వైవిధ్య దేశమో విశ్వాసాల పరంగా అంతకన్నా విభిన్నమైంది. అనాదిగా మనదేశంలో స్వామిజీలను దైవాంశ సంభూతులుగా కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజలు, తమ సమస్యలు, కష్ఠాలు తీరేందుకు ఒక విశ్వాసం వెంట, ఒక అతీంద్రియ శక్తుల కోసం అన్వేషణకు పురిగొల్పుతుంది. నేడు ప్రజలలో అక్షరాస్యత పెరిగినా, వృత్తిపరంగా శక్తిసామర్ధ్యాలు , వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికి అంధవిశ్వాసాలను అనుసరిస్తూనే ఉన్నారు. దేవుడు..బాబాలు ఇండియాలో వేరు వేరు కాదు అనేంతగా జనం దృష్టిలో పడిపోయింది. సర్వపాపాలు, కష్టాలను దూరం చేసి మనశ్శాంతినిచ్చే ఆనవాళ్లు అని దైవాన్ని నమ్ముకుని జీవించే ప్రతీ మనిషి విశ్వాసం. ఈ విశ్వాసమే భక్తులను ఆలయాలు..బాబాల వద్దకు పరుగులు తీయిస్తుంది. భక్తులకున్న ఈ బలహీనతే కాషాయ వస్త్రాలు ధరించిన బాబాలకు కార్పోరేట్ స్థాయిలో కాసులు కురిపిస్తోంది. అనతికాలంలోనే అత్యంత ధనవంతులను చేస్తోంది.    దేవుడనే వజ్రాయుధాన్ని ప్రయోగించి వీరు ఒక్కో స్టైల్లో మోసాలకు దిగుతున్నారు. భక్తులను మభ్యపెట్టి సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మికత, జాతకాలు, తాయత్తులు, రంగురాళ్లు, విభూతులు, కాశీదారాలు, అల్లా గొలుసులు, క్రీస్తు బిళ్లలు ఇలా పలురకాలుగా జనం వీరిని నమ్మడానికి అస్త్రాల్లాంటివి. ప్రజలు పేదరికంలో, అజ్ఞానంలో, అవిద్యలో ఉండాలని రాజకీయ నాయకులు కోరుకుంటున్నట్లే ఈ బాబాలు, స్వాములు కూడా జనం మూఢత్వంలో కూరుకుపోవాలని కోరుకుంటున్నారు. ఇలా దేశంలో ఇప్పటి వరకు ఎందరో స్వాముల లీలలు బయటకు వచ్చాయి. తమిళనాడుకు చెందిన మరో స్వామీజీ ప్రేమానంద. బీమానంద్‌ జీ మహరాజ్‌ చిత్రకూట్‌ వాలే, సంతోష్‌ మహదేవన్‌. పత్రీజీ స్వామి, ఆశారాం బాపూజీ, బాలసాయి, కాళేశ్వర్‌, కల్కీ వంటి స్వామిజీల గురించి తెలిసిందే. ఆశ్రమాల ముసుగులో సాగించిన అరాచకాలు లోక విదితమే. వీరందరూ భూకబ్జాల నుంచి మోయని కేసులేదు. భక్తి చాటున అనేక మత్తు చేష్టలు చేయించిన ఘనత ఈ స్వాములది.                                                             బాబాల సంపాదన గురించి తరువాయి భాగం రేపు చూద్దాం

కురచ దుస్తులు..మగాడి మైండ్ సెట్ మారదా..?

                    బాలయ్య హీరోగా వచ్చిన" సింహా" సినిమాలో ఒక డైలాగ్ ఉంది.."పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోయ్యారా..రేప్ చేయ్యారా..అని ఒకడంటే అందుకు బాలకృష్ణ అతడి చెంప పగలగొట్టి, పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోస్తావా..తప్పు మగాడి మైండ్ సెట్ మారాలంటూ" హితబోధ చేస్తారు. ఇలా ఎన్ని సినిమాల్లో చూపించినా సగటు మగాడి మైండ్ సెట్ మారడం లేదు. మహిళల్ని దేవాలయాల్లోకి పురుషులతో సమానంగా ప్రవేశించేలా చేసుకున్న మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.   కురచ దుస్తులు వేసుకుందని..అబ్బాయిలతో తిరుగుతోందని ఓ యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేసారు. స్నేహితుడి పెళ్లిలో సంగీత్ కార్యక్రమానికి హాజరై మే 1 తెల్లవారుజామున ఓ యువతి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అడ్డగించి, కురచ దుస్తులు ఎందుకు వేసుకున్నావని..ఈ సమయంలో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఎలా వెళ్తున్నావంటూ ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఇలాంటి వాటికి పుణెలో అనుమతి లేదని హెచ్చరించారు. అనంతరం ఆమెను కారులోంచి బయటకు లాగి దాడి చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వారం తర్వాత తీరిగ్గా నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.  ఇదే మహారాష్ట్రలో గతంలో మరో ఘటన జరిగింది. దేశ ఆర్థిక రాజధాని, మోడ్రన్ హాబ్ ముంబై లో అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళా ప్యాసింజర్‌ కురచ దుస్తులు ధరించిందని ఎయిర్‌ ఇండిగో సిబ్బంది ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆమె మోకాలి పైకి ఫ్రాక్ ధరించిందని, అందుకే ఆమెను అడ్డుకున్నామని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని ఆమె ట్రౌజర్ ధరించి వేరే విమానంలో తన గమ్యస్థానానికి చేరుకుంది.   నాగరిక ప్రపంచంలో మనుషులందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. స్త్రీలకు కూడా అవే హక్కులున్నాయి-వారికి నచ్చిన ఏ దుస్తులనైనా వారు ధరించవచ్చు. చరిత్ర, వారసత్వం, సంస్కృతి పేర్లు చెప్పి స్త్రీల స్వేచ్ఛను కబళించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరోకటి ఉంది కురచ దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలు పెరిగిపోయాయని కాని రెచ్చగొట్టే దుస్తులు అన్నది ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. అంటే చీర కట్టిన వాళ్ల మీద..అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఏ అఘాయిత్యాలు జరగలేదా? మిడ్డి వేసుకునే అమ్మాయిని చూసి సంస్కారంగా ప్రవర్తించే అబ్బాయిలు ఉన్నారు, చీర కట్టుకున్న కూడా వంకర బుద్ధితో చూసే అబ్బాయిలున్నారు. మారాల్సింది వాళ్ల బుద్ధి.   చివరిగా మనం చెప్పుకోవాల్సింది, ముళ్లుంటాయని తెలిసీ చెప్పులు లేకుండా తిరగాలనుకోవడం సాహసం అనిపించుకోదు. వస్త్ర ధారణ అయినా మరోకటి అయినా ఫ్యాషన్‌ని అనుకరించే ముందు ఎవరికి వారు దానిలోని మంచి చెడులు ఒకసారి ఆలోచించాలి. మనం జీవిస్తున్న సామాజిక పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న వారి ఆలోచనా ధోరణినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ధరించేంది మోడ్రన్ డ్రస్స్ అయినా, సాంప్రదాయ వస్త్రాలయినా వాటిని ధరించిన వ్యక్తికి వాటి వల్ల అందం, హుందాతనం పెరగాలి. శతాబ్దాలు ఇంట్లోనే ఉండిపోయిన ఆడది బయటకు వచ్చాక, రప్పించబడ్డాక ఇక చీర, ప్యాంటు ఏది కడితే ఏంటట సమాజానికి? ఎందుకీ అనవసర అభ్యంతరాలు?

టీడీపీలో అసంతృప్తులను "సంతృప్తి" పరచేందుకు జగన్ స్కెచ్

  తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిలలాడుతున్నారు జగన్. అయిన వాళ్లు, నమ్మినవాళ్లు నట్టేట ముంచుతుంటే క్రుంగిపోతున్నారు. రోజుకొక ఎమ్మెల్యే పార్టీని వీడుతుంటే ఎం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆకర్ష్‌కు వ్యతిరేకంగా వికర్ష్‌ను ప్రయోగించాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని అసంతృప్తి నేతలను జగన్ టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల రాకను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలతో జట్టు కట్టేందుకు జగన్ మంత్రాంగం రచిస్తున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లారు. ఈ ఎమ్మెల్యేల రాకవల్ల అప్పటికే స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద దెబ్బ తగులుతోంది. వలస నేతలకు , స్థానిక నేతలకు మధ్య సఖ్యత కుదరడం లేదన్న కథనాలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.   ఉదాహరణకు కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేత శిల్పామోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా వీరిద్దరి వైరం గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. టీడీపీలోకి వచ్చిన మరుసటి రోజే శిల్పా అనుచరుడు తులసీరెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక భూమా ఉన్నారని శిల్పా వాదించాడు. వీరి పంచాయతీ చంద్రబాబు నాయుడి దాకా వెళ్లింది. అదే కర్నూలు జిల్లాకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడంతో అక్కడ స్థానిక నేత, ఎమ్మెల్సీ శిల్పా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.     ఇక కడప జిల్లాకు వస్తే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికతో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరి ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తెలుగుదేశంలో చేరడాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఇప్పుడు వైసీపీలోకి చేరారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యేల గొట్టిపాటి రవికుమార్ త్వరలోనే టీడీపీలో చేరారు. ఆయన చేరిక సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పార్టీ సీనియర్ నేత కరణం బలరాం అనుచరులు చించివేశారని ఆరోపణలున్నాయి. గొట్టిపాటి రాకను చివరి వరకు వ్యతిరేకించిన కరణం అధినేత ఆదేశంతో వెనక్కి తగ్గారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన ప్రతిచోట టీడీపీలో కలహాలు, గ్రూపు తగదాలు భగ్గుమంటున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా..ప్రతి చోట అసంతృప్తుల రచ్చ అధినేత తలబొప్పికట్టిస్తున్నాయి. ఎవరికి సర్దిచెప్పాలో తెలియక ఆయన సతమతమవుతున్నారు.    ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. టీడీపీని అదే రూటులో దెబ్బ తీయాలని..పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలకు గట్టి బుద్ధి చెప్పాలంటే, టీడీపీలో వారి రాక వల్ల అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపుకు తిప్పుకోవాలని వైసీపీ అధినేత స్కెచ్ గీస్తున్నారు. వీరందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ హామీతో ఎర వేసి వాళ్లను వైసీపీలోకి లాగాలని పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. అయితే టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల వల్ల పార్టీలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతల నుంచి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి జగన్ ప్లాన్ వర్కవుటవుతుందా..? చంద్రబాబు అంతవరకు రానిస్తారా అన్నది వేచి చూడాలి?      

తమిళ సినీ పాలి"ట్రిక్స్"

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల సమీకరణలు, పొత్తులు, సర్వేలు ఇలా అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్నిపార్టీలు మేనిఫేస్టోలు విడుదల చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తమిళ తంబీలను పోలింగ్ బూత్‌ల దాకా రప్పించే సత్తా మేనిఫేస్టోలకు, సంక్షేమ పథకాలకు లేదు. ఆ పవర్ ఒక్క సినీ తారలకే సొంతం. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల పాత్ర అత్యంత కీలకం. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ నటీనటులు ప్రచారం చేయడం అనవాతీగా వస్తోంది. ఈ సారి కూడా ఆ రాష్ట్ర రాజకీయాలను సినీ గ్లామర్ ప్రభావితం చేయబోతోంది. దీంతో సినీ ప్రపంచాన్ని తమ సొంతం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.   తమిళ రాజకీయ రంగం, సినీ రంగం వేరు వేరు కాదు. దశాబ్దాలుగా ఈ రెండు విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జానకీ రామచంద్రన్, జయలలిత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా రజనీకాంత్, కమల్‌హాసన్, కుష్బూ వంటి వారు దశాబ్ధాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు.   రాజకీయ నాయకులు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలు వినాలంటే ప్రజలకు ఎంత ఓపిక కావాలి. అందుకే ప్రచార సభల్లో సంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేసి జనాలను కదలకుండా ఉంచుతారు. ఎన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా సినీ గ్లామర్ ముందు దిగదుడుపే. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదలివచ్చినా జనాల నుంచి రెస్సాన్స్ అంతంత మాత్రమే. అదే ఒక నటుడు కాని నటి కాని వచ్చి చెయ్యి ఊపితే వచ్చే రెస్పాన్సే వేరు. అందుకే తమిళ రాజకీయల్లో హీరోలకు , హీరోయిన్లకు అంత డిమాండ్.   డీఎంకే వ్యవస్థాపకుడు స్వర్గీయ అన్నాదురై స్వయంగా రచయిత.. రంగస్థలం, సినిమాలల్లో తన పెన్ పవర్ చూపించారు. ఆయన తర్వాత పార్టీని నడిపిస్తున్న కరుణానిధి కూడా రచయితగా, నిర్మాతగా సినిమాతో బంధం ఉన్నవారే. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ హీరోగా తమిళ సినీ రంగాన్ని శాసించి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాన్ని పొందారు. ఎంజీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత సౌతిండియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్. తమిళ సినిమా దిగ్గజం శివాజీ గణేషన్ కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన మార్క్ చిత్రాలతో ప్రజలను రంజింపచేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్, డీఎండీకే పార్టీని స్ధాపించి ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు.   ఇక ఈ ఏడాది ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఏకైక స్టార్ కాంపెయినర్ అధినేత్రి జయలలితే. ఆమెకు తోడుగా నటులు రామరాజన్, పొన్నాంబళం, సెంథిల్, సీఆర్ సరస్వతి, వింధ్య తదితరులున్నారు. డీఎంకే తరపున వాగై చంద్రశేఖర్, కుమారి ముత్తు, వాసువిక్రం, తదితరులున్నారు, ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే హీరోయిన్లు కుష్బూ, నగ్మా ప్రచారంలో దూకనున్నారు. ఎటోచ్చి బీజేపీకి ఏ హీరో/ హీరోయిన్ దొరకలేదు. యంగ్ హీరో విశాల్‌ను ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి ఒప్పించాలని ప్రయత్నిస్తోంది కమలం. విశాల్ ఇటీవలే నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పాపులర్ అయిపోయారు. విశాల్ పోటీకి ఒప్పుకోకపోయినా కనీసం ప్రచారానికైనా రావాలని బీజేపీ గట్టిగా కోరుతోంది. మరి ఎన్నికల ప్రచార రణరంగంలో ఏ స్టార్ స్టామినా ఎంటో త్వరలో తెలిసిపోతుంది.