దత్తతకు వూరే అక్కర్లేదు...రోగి కూడా..!

భారత ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నారైలు, విద్యావంతులు, అధికారులు, సెలబ్రిటిలు ఇలా చాలా మంది గ్రామాలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూస్తున్నారు. దేశం మొత్తం ఇది ఒక ఉద్యమంలా సాగుతోంది. ఈ దత్తత అన్న పదానికి కొత్త అర్థం చెప్పేందుకు అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌) వినూత్నంగా ఆలోచించింది.   అదేంటంటే ఊరిని దత్తత తీసుకున్నట్టే రోగులను కూడా దత్తత తీసుకోవచ్చు కదా అని పలువురిని ఆలోచింపజేస్తోంది. వైద్య రంగంలో దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎయిమ్స్‌కు ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది రోగులు వస్తూ ఉంటారు. వీరిలో దాదాపు రెండు లక్షల మంది నయం కాని జబ్బులతో ఆసుపత్రిలో చేరుతారు. అందరూ పేద, మధ్యతరగతి వారే..శస్త్ర చికిత్స చేస్తే తప్ప వీరిలో చాలా మంది బతకడం కష్టం, కాని వారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత ఉండదు. ఒకవేళ ఆసుపత్రి నిధుల నుంచి ఆపరేషన్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తే, ఇంటికెళ్లి అవసరమైన చికిత్స చేసుకోవడానికి తగిన పరికరాలను వారు కొనలేకపోతున్నారు. నానా తిప్పలు పడి బ్రతుకుతారని ఆపరేషన్ చేయిస్తే..ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లి వైద్య ఖర్చులు భరించే శక్తి వారి వారి కుటుంబసభ్యులకు, బంధువులకు లేదు. అందుకే అటువంటి రోగులను వారి బంధువులు ఇళ్లకు తీసుకెళ్లకుండా ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు.   ఈ పరిస్థితిని గమినించిన ఎయిమ్స్ యాజమాన్యం రోగుల బతుకులు మార్చాలని ఆలోచించింది. అందుకే "రోగిని దత్తత తీసుకోండి" అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద పెద్ద మనసున్న దాతలు రోగులను పరిశీలించి, విరాళాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇవ్వవచ్చు. బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన 24 గంటల్లోనే ఇద్దరు దాతలు రూ.14 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ పథకాన్ని ఎయిమ్స్‌ డైరెక్టర్ ఎంసీ మిశ్రా అధికారికంగా రేపు ప్రారంభించనున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న గొప్ప మనుసున్నవారు ఎప్పుడూ స్పందిస్తారని ఈ విషయం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఎయిమ్స్‌ బాటలో మరిన్ని ఆసుపత్రులు నడిస్తే దేశంలో వైద్యం అందక చనిపోయేవారి సంఖ్య తగ్గుతుంది. సో హ్యాట్సాఫ్ టూ ఎయిమ్స్.

టీమిండియా కోచ్‌ పదవికి ఎందుకంత క్రేజ్..!

భారత క్రికెట్ కోచ్‌గా పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌ ఇది. ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో పాటు కోచ్‌ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ కూడా ముగియడంతో ఇఫ్పుడు అందరి దృష్టి టీమిండియా కోచ్‌ పదవిపై పడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెట్ దిగ్గజాలు టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అసలు టీమిండియా కోచ్ పదవికి ఎందుకంత క్రేజ్ వచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ధనిక క్రికెట్ బోర్డు. ఇక్కడ ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతారు. అంతేనా స్పెషల్ అలవెన్స్‌లు, బోనస్‌లు ఇలా బాగా గిట్టుబాటవుతుంది.   ఆటగాళ్లకే అంతుంటే మరి జట్టును వెనుక నుంచి నడిపించే కోచ్‌కు ఏ రేంజ్‌లో పారితోషకాలు అందుతాయో చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు క్రికెట్ ప్రపంచంలో తాను ఏది అంటే అది అన్నట్టు శాసిస్తున్న బీసీసీఐ కోచ్‌ కూడా ప్రపంచ క్రికెట్‌పై అలాగే ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. గతంలో క్రికెటర్లకైనా, కోచ్‌లకైనా మ్యాచ్‌ ఫీజుతో పాటు బీసీసీఐ ఇచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలు మాత్రమే లభించేవి. అయితే రాను రాను క్రికెట్‌కు ప్రజాధరణ పెరిగిపోతుండటంతో క్రికెటర్లు, కోచ్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. ఇలా వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో వచ్చిపడుతున్నాయి. మరి ఇలాంటి కామధేనువును తమ సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే టీమిండియా కోచ్‌ పదవికి అంత క్రేజ్. ఇన్ని లాభాలు ఉన్నా టీమిండియా కోచ్‌గా వ్యవహరించడం అంత తేలిక కాదు. ఎందుకంటే భారత జట్టు గెలిచినా..ఓడినా బాధ్యత కోచ్‌దే. గెలిస్తే సత్కారాలు..ఓడితే ఛీత్కారాలు కూడా అలాగే ఉంటాయి. ఈ మాటను ఆసీస్ లెజండ్ స్టీవ్ వా అంతటి వ్యక్తే అంగీకరించాడు. టీమిండియాకు కోచ్‌గా వస్తారా? అని స్టీవ్‌వా అను అక్కడి మీడియా ప్రశ్నిస్తే..భారత జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి..వాటిని తట్టుకోవడం కష్టం. అంత సాహసం నేను చేయలేనేమో అంటూ సమాధానం ఇచ్చాడాయన. ఏది ఏమైనా మాజీ క్రికెటర్లు మాత్రం ఈ బంపర్ ఆఫర్‌ను వదుకోకూడదని తమ తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

ట్రంప్ చీకటి కోణాలు ఎన్నో..ఎన్నెన్నో..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి నిలిచిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాకముందే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాడు. వర్థమాన దేశాలను నోటికొచ్చినట్లు తిట్టడంతో మొదలుపెట్టి రోజుకోక వివాదంలో చిక్కుకుంటున్నాడు. మొన్నామధ్య తన వ్యాపార లావాదేవీల కోసం మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నట్లు ఒక వెబ్‌సైట్ బయటపెట్టడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అయితే ఇటీవల మీడియాపై నోరు పారేసుకోవడంతో ఇంతకాలం నుంచి బయటకు రాని రహస్యాలను మీడియా మిత్రులు బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్ధులను, బయటి దేశాల వారిని తిట్టిన తిట్టకుండా తిట్టే ట్రంప్ తన దగ్గర పనిచేసే వారిని కూడా తిట్టేవారిని తెలిపింది. చెప్పింది చేయకుంటే ట్రంప్ నుంచి తిట్ల పురాణం వినాల్సిందేనని ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులు స్వయంగా కోర్టుకు వెల్లడించిన ఆధారాలను మీడియా బహిర్గతం చేసింది.   రియల్ బూమ్ జోరుగా ఉన్న 2005లో ఫర్ ఫ్రాఫిట్ స్కూల్ పేరిట ట్రంప్ ఎఓ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్శిటీలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్ధులు అమెరికా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిన విచారించిన న్యాయస్థానం వర్శిటీ ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా వారు దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెల్లడించారు. యూనివర్శిటీలో తరగతులు చెప్పాలంటే ఉండాల్సింది విద్యార్హతలు కాదని, పరపతి అని, వ్యాపారం చేయడం వచ్చు అని ట్రంప్‌కు అనిపిస్తే చాలు. యూనివర్శిటీలో అధ్యాపకులుగా చేరవచ్చని తెలిపారు.   జ్యుయెలరీ షాపులో పని చేసే వ్యక్తి ఇక్కడ తరగతులు చెబుతాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకుడిగా అతని నియామకం చెల్లదు అన్నందుకు ట్రంప్‌తో తిట్లు తినాల్సి వచ్చిందని ఓ అధ్యాపకుడు తెలిపారు. యూనివర్శిటీగా మేనేజర్‌గా వ్యవహరించాల్సింది పోయి యూనివర్శిటీకి ప్రమోటర్‌గా వ్యవహరించాడని వర్శిటీ మాజీ మేనేజర్ ష్నాకెన్‌బర్గ్ తెలిపారు. ఆఖరికి పేద విద్యార్థుల పట్ల ట్రంప్ ఏ మాత్రం జాలి లేకుండా ప్రవర్తించేవాడని ఆయన అన్నారు. ఓ విద్యార్థి ఫీజులు కట్టలేని స్థితిలో ఉండటం చూసి ఫీజుల విషయంలో తాను పట్టించుకోలేదని, దీనికి ట్రంప్ నుంచి చివాట్లు తిన్నానని ఆయన న్యాయస్థానం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న ప్రత్యర్థులకు ఈ వార్తలు అస్త్రాలుగా మారాయి. 

2002 గుజరాత్ మారణహోమంలో కీలక తీర్పు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సోసైటీ హత్యాకాండ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేకకోర్టు తుదితీర్పును వెలువరించింది. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఘర్షణలు జరిగిన 14 ఏళ్ల తరువాత తీర్పు చెప్పింది. విచారణను ఎదుర్కొంటున్న వారిలో 24 మందిని దోషులుగా నిర్థారించగా, మరో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజున గుల్బర్గ్ సోసైటీ ప్రాంతంలో ఒక వర్గం లక్ష్యంగా దాదాపు 20 వేల మంది ఆ ప్రాంతంపై దాడి చేశారు. ఈ దాడిలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీని ఇంటిలోంచి బయటకు లాక్కొచ్చి మరీ నరికేసి, తగలబెట్టారు. పోలీసులకు, సీనియర్ నాయకులకు సాయం కోసం ఫోన్లు చేసినా ఎవరూ అప్పట్లో ఆ ఫోన్లు ఆన్సర్ చేయలేదన్న ఆరోపణలున్నాయి. జరిగిన ఘటనపై ఎంపీ భార్య జకియా జాఫ్రీ న్యాయం చేయాలంటూ ఇన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.   నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఇతర మంత్రుల పాత్ర కూడా అల్లర్లలో ఉందని ఆమె ఆరోపించారు. దిగువ కోర్టులో న్యాయం జరగకపోవడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అందజేసిన నివేదికలో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. బాధితులు సజీవ దహనం చేశారనడానికి అక్కడ లభించిన మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని తెలిపింది. పెట్రోల్ క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా ఘటనా స్థలంలో దొరికాయాని, దాన్ని బట్టి అక్కడ మారణ హోమం ఏ స్థాయిలో జరిగిందో వివరించింది. సిట్ నివేదిక ఆధారంగా అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

వివాదాల ఖడ్సే..!

మహారాష్ట్ర మంత్రివర్గంలో అలజడి రేగింది. ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ అయిన ఏక్‌నాథ్ ఖడ్సే పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే వార్తలు రావడంతో ఒక్కసారిగా మహా రాజకీయాలు వేడేక్కాయి. ఆయన మాట్లాడిన కాల్‌ రికార్డుల్లో దావూద్‌తో మాట్లాడినట్లు తేలడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అవినీతిని ఏ మాత్రం సహించబోమన్న పార్టీ విధానానికి అనుగుణంగా ఖడ్సే మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ మహారాష్ట్ర శాఖను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఖడ్సే‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. దీనిపై విచారణ జరిపిన క్రైం బ్రాంచ్ కూడా ఖడ్సే‌తో దావూద్ మాట్లాడటానికి ఆధారాలేమీ లేవని అంటోంది.   అయితే ఖడ్సే ఫోన్ రికార్డులను హ్యాక్ చేశానని, అందులో ఖడ్సే నెంబర్‌ కూడా ఉందని మనీష్ భంగాలే అనే హ్యాకర్ చెబుతున్నాడు. ఖడ్సే వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. విదర్భ ప్రాంతంలోని లాతూర్‌లో ఒక పక్క ప్రజలు గుక్కెడు నీళ్ల కోంస ఇబ్బందులు పడుతుంటే వారిని ఓదార్చేందుకు ఖడ్సే హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఈ సందర్భంగా లాతూర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ కోసం వేల లీటర్ల నీటిని వృథా చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లకుండా డాబు, దర్జా కోసం కావాలనే హెలికాఫ్టర్లో వెళ్లారని జనం ఆరోపించారు. ఈ వివాదం ముగిసిందో లేదో గత ఏప్రిల్‌లో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ.23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ మంత్రిగా కేవలం రూ.3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొన్నామని..మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్‌ డ్యూటీ కట్టామని ఖడ్సే వివరణ ఇచ్చుకున్నారు. కానీ వివాదం సమసిపోలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఖడ్సే మాఫియా సంబంధాలు బయటపడటంతో ఆయన మంత్రిగా తప్పుకోకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శరణార్థులని నీడనిస్తే...!

స్వదేశంలో రాక్షసుల్లాంటి ఉగ్రవాదులు..ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో..ఎటు నుంచి ఏ బుల్లెట్ దూసుకొస్తుందో తెలియక నిత్యం నరకం. కళ్లముందే అయినవారిని కోల్పోతుంటే భరించలేని గుండెకోత. ఇది ఇరాక్, సిరియా, లిబియా తదితర దేశాల్లోని ప్రజల పరిస్థితి. దీంతో మాతృదేశంలో బతకలేక..ప్రాణాలకు తెగించి సముద్రాలపై ప్రయాణించి పరాయి దేశంలోనైనా బతుకుదాం అని ఎందరో శరణార్ధులు యూరప్‌లోని వివిధ దేశాలకు వలస పోతున్నారు. అలా మానవత్వంతో శరణార్ధులను అక్కున చేర్చుకున్న దేశం జర్మనీ. కానీ ఆ మానవత్వమే జర్మనీని కాటేసింది. ఆ దేశంలో శరణార్థుల దారుణాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. ధర్మస్టాడ్‌ సిటీలో ఆదివారం జరిగిన స్క్లోస్ గార్బెన్‌ఫెస్ట్ సంగీతోత్సవం సందర్భంగా 26 మంది జర్మన్ యువతులపై శరణార్థులు అత్యాచారాలకు ఒడిగట్టారు.   ఆదివారం నాడు ప్రారంభమైన మ్యూజిక్ ఫెస్ట్‌కు దాదాపు లక్షమంది యువతీ యువకులు హాజరయ్యారు. దీనికి శరణార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంపులుగా వచ్చిన వీరు జర్మనీ యువతులను చుట్టుముట్టి అత్యాచారాలకు పాల్పడినట్టు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, కొలోగ్నిలో డిసెంబర్‌ 31వ తేదీన కెథడ్రల్ చర్చి సమీపంలో దారుణ పైశాచికం జరిగింది. ఒకర్ని కాదు, ఇద్దర్ని కాదు ఏకంగా 120 మంది జర్మన్ మహిళలపై దాదాపు వెయ్యిమంది అల్లరి మూకలు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అమ్మాయిలను పశువుల్లా తరుముతూ.. వెంటాడి..వెంటాడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. అదే రోజున జర్మనీలోని స్టట్-గార్ట్, డస్సెల్-డార్ఫ్, హంబర్గ్, మ్యూనిచ్, బెర్లిన్ నగరాల్లో కూడా అమ్మాయిలపై పాశవికంగా అత్యాచారాలు జరిగాయి. అత్యాచారాలకు పాల్పడటంతో పాటు సెల్‌ఫోన్లు, పర్సులను దుండగులు ఎత్తుకెళ్లారు.   అయితే ఈ పని శరణార్థులే చేశారా లేక అక్కడి ముఠాలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు కదా అని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించగా..సామూహిక అత్యాచారానికి గురైన బాధితుల్లో ప్రతిఒక్కరూ అరబ్‌లో మాట్లాడిన వ్యక్తులే మాపై అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పడంతో అందరి చూపు శరణార్థులపైకే వెళ్తోంది. ఈ సంఘటనలతో శరణార్థులకు వ్యతిరేకంగా జర్మనీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చినా, వారిలా కనబడినా చితకబాదాలన్న లక్ష్యంతో జర్మన్లు ఊగిపోతున్నారు. మరోపక్క జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మోర్కెల్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. శరణార్థులను దేశంలోకి రానివ్వడం మూలంగానే ఈ ఆఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరణార్థులు మాత్రం తాము తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పించిన విదేశీయులపట్ల తామెందుకు అమానుషంగా ప్రవర్తిస్తామని బావురుమంటున్నారు. మొత్తంగా ఇది వలసవచ్చిన వారి పనా..లేదంటే ఇంటి దొంగల పనా అని తెలుసుకునే పనిలో పడింది జర్మనీ ప్రభుత్వం.  

"పతంజలి"కి అంత సీన్ లేదంట...!

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలో నడుస్తున్న పతంజలి సంస్థపైనా, బాబా రాందేవ్ పైనా ప్రముఖ పారిశ్రామికవేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ లాబీ ఐఎంసీ ముంబైలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆది గోద్రేజ్ మాట్టాడారు. రాందేవ్ బాబా ఇమేజ్, పరపతి వల్లే పతంజలి నడుస్తోందని, అందులోనూ యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బాగున్నాయి కాని మిగిలిన వాటిని అంతగా చెప్పుకోనవసరం లేదన్నారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తప్ప మిగిలిన ఉత్పత్తులకు అంత సీన్ లేదన్నారు. వ్యాట్ సెగ్మెంట్‌లోనూ ఆ సంస్థ వాటా చాలా తక్కువ అని ఆయన అన్నారు. అలాగే కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్‌తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అన్నారు.   తొలుత ఆయుర్వేద ఫార్మసీగా ప్రారంభమైన పతంజలి..ఆ తర్వాత కన్జ్యూమర్ ఉత్పత్తుల సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. మొత్తం 30 రకాల ఉత్పత్తులతో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ రంగ సంస్థగా అవతరించడానికి రెఢీ అవుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్లుగా నమోదైన కంపెనీ ఆదాయం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి రూ.5000 కోట్లకు పైగా చేరుకుని నెస్లే, యూనిలివర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు గట్టీ పోటీనిస్తోంది. అంతేకాదు పతంజలి ప్రస్తుత ఆదాయం డాబర్, ఇమామీ, మారికో, గోద్రేజ్ వంటి అనేక బడా సంస్థల ఆదాయంతో సమానమని హెచ్ఎస్‌బీసీ సర్వేలో తేల్చింది. తన ఉత్పత్తులకు పోటీగా వస్తున్న పతంజలి పట్ల ఆది గోద్రేజ్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. బహుశా ఆ ఆక్రోశాన్నంతా వెళ్లగక్కడానికి ఈ సమావేశాన్ని వేదికగా మార్చుకున్నట్లున్నారు.

రాహుల్‌‌కు త్వరలోనే పట్టాభిషేకం..

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ అధ్య్షక్షుడిగా పట్టాభిషేకం చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, అందులో యువరాజు పట్టాభిషేకానికి ముహుర్తం నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతోంది. సోనియా మాత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి పదవికి పరిమితం అవుతారని అంటున్నారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలని చాలా కాలంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు సీనియర్లు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో పార్టీకి కొత్త జీవం పోయాలని అటు సోనియా గాంధీ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో పాటు పార్టీ జాతీయ కార్యవర్గం మొత్తాన్ని కూడా పూర్తిగా మారుస్తారని చెబుతున్నారు. ఎక్కువగా యువతకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.   అయితే రాహుల్ సారథ్యాన్ని కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని, రాహుల్‌కు పగ్గాలు ఇస్తే మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని, అందుచేత సోనియా గాంధీయే నాయకత్వం వహించాలని ఆ కొంతమంది కోరుతున్నారు. సీనియర్లు ఇంతగా భయపడటానికి కారణాలు లేకపోలేదు. ఒక్క బీహార్‌లో తప్ప మరెక్కడా ఆయన ఎన్నికల ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రికార్డు లేదు. ఆయన ప్రచారం చేసిన చోట కంటే చేయనిచోట్లే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు. ఇప్పటికి తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకోలేక సోనియా గాంధీ లేక తన అంతర్గత సలహాదారుల మీదే ఆధారపడతారన్న అపవాదు ఉంది. అన్నింటికి మించి వ్యూహ, ప్రతివ్యూహల్లోనూ, వాగ్థాటిలోనూ ప్రధాని నరేంద్రమోడీ ముందు రాహుల్ ఏ మాత్రం నిలబడలేరు . ఇలాంటి పరిస్థితుల్లో సోనియా రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేస్తారా..లేక తానే మరికొంత కాలం పార్టీని నడుపుతారా అని తెలియాలంటే వేచిచూడాల్సిందే.

చిక్కుల్లో సోనియా అల్లుడు..!

వివాదాలకు కేంద్రబిందువైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌వాద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ ఆయుధ వ్యాపారి వాద్రా కోసం లండన్‌లో మ్యాన్షన్‌ను కొనుగొలు చేశాడని వచ్చిన ఆరోపణలపై కేంద్రప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో రాబర్ట్‌వాద్రా, అతని అసిస్టెంట్ మనోజ్ అరోరా ఈ మెయిల్‌ నుంచి ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి ఈమెయిల్‌కు ఈ వెళ్లిన సమాచారం ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రెండు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా కొత్త విచారణను ప్రారంభించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. గత నెలలో సంజయ్‌భండారీకి చెందిన 18 ప్రాంతాల్లోని ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాడులు జరుపగా, వాద్రాకు సంబంధించిన మ్యాన్షన్‌ వివరాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.   ఈ మ్యాన్షన్‌లో మరమ్మత్తులు తదితరాలపై రాబర్ట్ వాద్రా సమాచారాన్ని కోరుతూ, సలహా, సూచనలు ఇస్తున్న ఈ-మెయిల్ 2010 ఏప్రిల్ 4న భండారీకి వెళ్లిందని నివేదికలో ఉంది. లండన్‌లోని భండారీ బంధువు సుమిత్ చద్దాకు వెళ్లిన ఈ-మెయిల్‌లో "నా కార్యదర్శి మీకు అందుబాటులో ఉంటారు " అని ఉందని, ఆపై మనోజ్ ఎక్సిమ్ రియల్ ఎస్టేట్ పేరిట ఈ-మెయిల్ ఐడీ తెరిచి సుమిత్‌తో మాట్లాడుతూ ఉన్నారని పేర్కొంది. ఈ అభియోగం బీజేపీ పాలిట వరమైంది..సోనియా కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి చేతికి మరో ఆయుధం దొరికినట్లైంది. వాద్రా బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని..అక్కడి పౌరసత్వం రాగానే చెక్కేసేందుకు సన్నాహలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాద్రాపై భారత్‌లో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అటు కాంగ్రెస్ కూడా ఈ వ్యవహారంపై ఎదురుదాడికి దిగింది. రాబర్ట్‌వాద్రాను ఓ పద్థతి ప్రకారం ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. మరి సోనియా తన అల్లుడిని ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

గొరిల్లాను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారా..?

తల్లిదండ్రుల నిర్లక్ష్యం...అధికారుల తొందరపాటు ఒక మూగజీవం ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆ పాపమే ఇప్పుడు వారందరిని ప్రపంచం ముందు విలన్లుగా నిలబెట్టింది. ఎన్‌క్లోజర్‌లో పడిన నాలుగేళ్ల బాలుడిని కాపాడటానికి గొరిల్లాను చంపడమే ఇంతటి చర్చకు దారి తీసిన ఘటన. అమెరికాలోని ఓ జంట వీకెండ్ కావడంతో తమ ముద్దుల కొడుకును తీసుకుని సిన్సినాటిలోని ఓ జూకు వెళ్లారు. పిల్లాడికి జంతువులను చూపిస్తూ తాము ఆనందిస్తూ గడుపుతున్నారు. ఈ సమయంలో వారిద్దరూ కబుర్లలో పడిపోవడం..పిల్లాడిని పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారి పాకుకుంటూ వెళ్లి గొరిల్లాలుండే ఎన్‌క్లోజర్‌లోకి జారిపోయాడు.   అంతే..జూలో ఒకటే అలజడి.. ఆ ఎన్‌క్లోజర్‌లో నాలుగు గొరిల్లాలున్నాయి. మధ్యలో వైరింగ్ ఉండటంతో మిగిలిన మూడు రాలేదు కానీ..ఓ భారీ గొరిల్లా మాత్రం చిన్నారి దగ్గరకొచ్చేసింది. దాని పేరు హరాంబే..వయస్సు 17 సంవత్సరాలు. చాలా పెద్ద శరీరంతో, వాడి చూపులతో చూస్తేనే భయమేసేలా ఉంది. ఇంతలో బాబు తల్లిదండ్రుల అరుపులు..జూలోని సందర్శకుల హాహాకారాలు..ఇంతలో ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అక్కడికి వచ్చింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని నిద్రపుచ్చవచ్చు. కాని ఆ మత్తు గొరిల్లాపై పనిచేయడానికి టైం పడుతుంది..ఈ లోగా అది బాబును గాయపరచడమే..చంపేయడమో చేస్తే..? ఇది ఆలోచించి మరో ఛాన్స్ లేకుండా మెషిన్ గన్స్‌కు పనిచెప్పారు. అంతే రెప్పపాటులో 100 బుల్లెట్లు గొరిల్లా శరీరాన్ని జల్లెడగా మార్చేశాయి. వెంటనే చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు జూ సిబ్బంది.   జూ సందర్శకుల్లో ఒకరు జరిగిన సంఘటనను తమ మొబైల్‌లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడంతో ఈ ఘటన ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది..ఇంకా చేస్తూనే ఉంది. ఆ వీడియోలో గొరిల్లాకు బాబును చంపే ఉద్ధేశ్యం లేదని తెలుస్తోంది. ఎన్‌క్లోజర్‌లో పడిన పిల్లాడి కాలుని పట్టుకుని నీళ్లలో కూర్చోబెట్టింది. సందర్శకులు కేకలు పెడుతుంటే, మరోసారి చిన్నారిని లాక్కెళ్లి ఓ బండరాయిపై కూర్చుని బాబును చూస్తూ, వాడి తలను నిమురుతూ ఉండిపోయింది తప్ప ఎలాంటి హానీ చెయ్యలేదు. ప్రజలు అరుపులు ఎక్కువకావడంతో బాబును వారేమైనా చేస్తారేమోనని వాడికి రక్షణ కవచంలా నిలబడింది. చివరకు సెక్యూరిటి సిబ్బంది కురిపించిన బుల్లెట్లు తన శరీరాన్ని ఛిద్రం చేస్తున్నపుడు కూడా బాబు చెయ్యి అలాగే పట్టుకుని  ప్రాణాలొదిలేసింది ఆ గొరిల్లా.    తల్లిదండ్రులపైనా..జూ సిబ్బందిపైనా నెటిజన్లు విరుచుకుపడ్డారు. వీరి తీరును తప్పుబడుతూ ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌‌కు 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. హరాంబే మరణానికి బాలుడి తల్లిదండ్రుల్ని బాధ్యులుగా చేసి వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

నోబాల్ ఇచ్చాడని..అంపైర్‌ చెల్లిని చంపిన క్రికెటర్

ఏ ఆట ఆడేవారికైనా క్రీడాస్పూర్తి లేకుంటే జరిగే దారుణాలు ఊహకు కూడా అందవు. ఈ నేపథ్యంలో "నోబాల్" ఇచ్చాడన్న కోపంతో ఓ క్రికెటర్‌ అంపైర్‌ చెల్లెలిని కడతేర్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు సమీపంలోని "జరారా" అనే చిన్నపట్టణం ఉంది. ఐపీఎల్ పోటీలను స్పూర్తిగా తీసుకున్న ఇక్కడి క్రీడాభిమానులు "జేపీఎల్" నిర్వహించుకుంటారు. ఈ నెల 14న మొదలైన జేపీఎల్‌లో గెలిచిన జట్టుకు రూ.5,100 నగదు బహుమతి ఇస్తామని కూడా నిర్వహకులు ప్రకటించారు. ఈ నెల 28న జరారా, బరికి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతుండగా.."అంపైర్ రాజ్‌కుమార్" నో బాల్ అంటూ ప్రకటించడంతో క్రికెటర్ "సందీప్ పాల్" కోపంతో రగిలిపోయాడు. వెంటనే అంపైర్ రాజ్‌కుమార్ వద్దకు వెళ్లి, గొడవపడ్డాడు. నోబాల్ కాదని చెప్పమన్నాడు. కానీ అంపైర్ వినలేదు. దీంతో సందీప్ హెచ్చరిస్తూ నువ్వు తప్పు చేస్తున్నావని, దీనికి శిక్షగా నీ ఇంట్లో ఒకరిని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించాడు. ఆటలో ఇవన్నీ మామూలేనని రాజ్‌కుమార్ తేలిగ్గా తీసుకున్నాడు.   ఈ నేపథ్యంలో ఈ నెల 29న రాజ్‌కుమార్ చెల్లి పూజ తన స్నేహితురాళ్లతో పొలానికి వెళుతండగా సందీప్ కూల్‌డ్రింక్ ఇచ్చాడు. వారికి సందీప్ తెలియడంతో ఎలాంటి అనుమానం లేకుండా తాగేశారు. అయితే వాటిలో విషం కలిపి ఇవ్వడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. విషం మోతాదు ఎక్కువగా ఉండటంతో రాజ్‌కుమార్ చెల్లెలు పూజ మరణించగా మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. జరిగిన ఘోరంపై గ్రామపెద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ పోటీలు వద్దని నేను ముందునుంచే చెబుతున్నాను. నా భయం నిజమైంది. ఇక్కడి వారెవరికీ క్రీడాస్పూర్తి ఉండదు. పగలు, కొట్టుకోవడాలు తప్ప" అని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడటం మంచిదే కానీ కక్షలు పెంచుకుని ప్రతీకారాలు తీర్చుకోవడం మాత్రం దారుణం. అందుకే ఆటగాళ్లకు క్రీడాస్పూర్తిని నూరిపోయాల్సిన అవసరం ఎంతో ఉందని మరోసారి రుజువైంది.

బానిసత్వంలో "భారతం"..!

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు పోటినిస్తున్నా..చంద్రమండలంపై అడుగుపెట్టినా భారతదేశం సాంఘికంగా ఎదగలేకపోతుందనడానికి రోజుకోక ఉదాహరణలు బయటకొస్తున్నాయి. మనం ఎప్పుడో కనుమరుగైపోయిందనుకున్న "బానిసత్వం" అసలు కనుమరుగుకాలేదు..ఇంకో విషయం ఏంటంటే బానిసత్వం గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువైంది. "వాక్ ఫ్రీ ఫౌండేషన్" అనే సంస్థ బానిసత్వంపై చేసిన సర్వేలో నిగ్గుతేలే నిజాలు వెలుగుచూశాయి. 121 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో దాదాపు 18 లక్షల మంది బానిసలుగా బతుకుతున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో బాలకార్మికులు, లైంగికంగా దగాపడ్డవారు, బలవంతంగా వివాహం చేసుకున్నవారు, ప్రభుత్వేతర సాయుధ దళాల్లో చేరేవారు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బానిసలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలిపింది. అంతేకాకుండా భారత్‌లో బానిసత్వం ఒక తరం నుంచి మరో తరానికి పాకుతోందని సర్వే పేర్కొంది.   బానిసత్వం మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. బలవంతుడు బలహీనుణ్ణి చెరపట్టడం అనాది నుండీ ఉంది. భారత ఇతిహాసాల్లో, పురాణాల్లో దాసదాసీల గురించి ఉంది. కూతురికి పెళ్లి చేసినప్పుడు తనతో పాటు తన చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం, వజ్రవైఢూర్యాలతో పాటు దాసదాసీలను కానుకగా ఇవ్వడం ఉంది. యుద్ధాల్లో బందీలుగా చిక్కిన వారిని, ఓడిపోయిన రాజ్యానికి చెందిన ప్రజలను బానిసలుగా అమ్మేవారు. ఆ రోజుల్లో ఎంతమంది బానిసలను కలిగి ఉంటే అంత గొప్పవారుగా పరిగణించబడేవారు.   రాజులు పోయినా..రాజ్యాలు అంతరించినా బానిసత్వపు విష సంస్కృతి మాత్రం భారతీయుల్ని వీడటం లేదు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి గ్రామాల్లోని పిల్లలను, మహిళలను, యువకులను అక్రమ రవాణా చేసే ముఠాలు వేశ్యా గృహాల్లో, ఇటుక బట్టీల్లో, టెక్స్‌టైల్స్ యూనిట్లలో వారిని విక్రయిస్తున్నారు. ఇప్పటికీ చేసిన అప్పులు తీర్చలేక కొడుకునో, కూతురునో పనిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఏళ్లకేళ్లు పనిచేసినా వడ్డీ తీరని సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీవితాంతం బానిసగా పడివుండటం తప్ప వారి జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడో మీడియా ద్వారానో..స్వచ్ఛంధ సంస్థల ద్వారానో తెలిస్తే విముక్తి లభించడం తప్ప మిగిలిన వారు బానిసలుగా చావాల్సిందే.

అంపశయ్యపై మానవ తొలిజాతి..!

ఏటా కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోతున్నాయని ప్రతి రోజూ మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ఈ జాబితాలోకి మానవుడు వచ్చి చేరాడు. ఎంటి జోక్ చేస్తున్నారా..? భూమి మీద ఇన్ని కోట్ల మంది మానవులు నివసిస్తూ ఉంటే మనిషి అంతరించిపోవడమేంటి ..? అని వెటకారంగా చూడకండి. చిన్ననాటి నుంచి మనం సోషల్ స్టడీస్‌ పుస్తకాల్లో ఆది మానవుడి గురించి ఆసక్తిగా చదువుకున్నాం. ఆయన నిప్పు కనిపెట్టాడంటే అబ్బా అన్నాం..ఆకులు కప్పుకుని తిరిగాడంటే అయ్యో పాపం అని దేవుడిని తలచుకున్నాం. ఇప్పుడు ఆ ఆది మానవుని వారసులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పచ్చి నిజం..తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న సమయంలో ఈ ఆదిమ మానవుడి జాతి కూడా అంతర్థానమయ్యే దశకు చేరింది.   మానవుడి పుట్టిక ప్రారంభమైన ఆఫ్రికాలోని బోట్స్‌వానా, అంగోలా, నమీబియాల్లో శ్యాన్ తెగగా పిలిచే వీరే తొలి మానవుడి వారసులని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు దాదాపు 20 వేల ఏళ్ల కిందటి నుంచే ఆఫ్రికా ఖండంలోని అటవీప్రాంతాల్లో నివసిస్తున్నారు. బోట్స్‌వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు.   అసలు ఇంత చర్చకు కారణం, బోట్స్‌వానా రిజర్వ్ ఫారెస్ట్‌ ప్రాంతంలో నివసించే వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. వీరు ఎప్పుడైతే అడవులను వీడి మైదాన ప్రాంతాల్లోకి వస్తారో..అప్పుడు శ్యాన్ జాతిపై పాశ్చాత్య ప్రభావం పడి వీరు మామూలు మనుషుల్లో కలిసిపోతారు. దీని వల్ల వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. వీరి పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వారు అనాదిగా మాట్లాడుతూ వచ్చిన ఆదిమ భాష క్రమంగా కనుమరుగుకానుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించిపోబోతున్నాయి. ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇకపై ముందు తరాల వారికి వీరి గురించి చెప్పాలంటే పుస్తకాలే దిక్కు. అందుకే శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ప్రియాంకకు చెక్‌పెట్టేందుకు స్మృతి..!

దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. 400 అసెంబ్లీ సీట్లతో..80 లోక్‌సభ స్థానాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా యూపీ సొంతం. త్వరలో ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా పునర్వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ, ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలని బీఎస్పీ, స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ ఎవరి ప్లాన్‌లు వారు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో పార్టీలు తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొలుత రాహుల్ పేరు వచ్చింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు అంతకు ముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌పై అంత నమ్మకం పెట్టుకోవడానికి భయపడుతున్నారు.   దీంతో రాహుల్‌కు బదులు ప్రియాంక పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఎన్నికలు వచ్చినప్పు డల్లా ఇలాంటి వాదన రావడం సహజమే అయినా ఇప్పుడు ఈ వాదన యూపీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యూపీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌‌ను తీసుకొస్తున్న తరుణంలో ఆయన కూడా ప్రియాంకను రంగంలోకి దించితే విజయావకాశాలు మెరుగుపడతాయని అధిష్టానంతో అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బీజేపీ రెడీ అయింది. అందుకే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతీ ఇరానీని బరిలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజాదరణ కలిగిన నేతగా తన వాగ్థాటితో స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాలు విసరగలదని వారి ఆలోచన. ఇవన్నీ పక్కన బెడితే యూపీకి సీఎం అభ్యర్థిని నిర్ణయించడం అంత తేలిక కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంటాయి ఇక్కడ వ్యవహారాలు. బ్రాహ్మణులను ఎంపిక చేస్తే ఠాకూర్లకు కోపం, ఠాకూర్లను ఎంపిక చేస్తే యాదవులకు కోపం, దళితులను ఎంపిక చేస్తే, అగ్రవర్ణాలకు దూరం ఇలా సాగుతుంటాయి ఇక్కడి రాజకీయాలు. మరి ఎవరి స్ట్రాటజీ ఎంటో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

పెళ్లి చూపులకు గుర్తింపుకార్డంట..!

దేశంలో ఏ పని కావాలన్నా గుర్తింపుకార్డు తప్పనిసరి..సిమ్ కార్డు దగ్గరి నుంచి ఓటు వేసే వరకు ఐడెంటి కార్డు లేనిదే ఏ పని జరగదు. తాజాగా పెళ్లిచూపులకు కూడా గుర్తింపుకార్డు కార్డు కావాలంట. ఇదివరకటి రోజుల్లో పెళ్లిచూపులంటే తెలిసినవాళ్లు.. తెలిసిన సంబంధాలు తెచ్చేవారు కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండేవి కావు. కాని సాంకేతిక విప్లవం పెరిగి ప్రపంచం ఓ కుగ్రామంగా మారడంతో ఇప్పుడు అరచేతుల్లోనే అంతా జరిగిపోతోంది. దీనికి వివాహాది కార్యాలు మినహాయింపుకాదు. స్కైప్‌లోనే పెళ్లి చూపులు...నిశ్చితార్ధాలు జరుపుకోవడం మనం చూస్తునే ఉన్నాం. దేశంలో మ్యాట్రిమోనిలు పెరిగిపోవడం, వేళాపాళా లేని ఉద్యోగాల వల్ల ఆన్‌లైన్‌లోనే లుకింగ్స్ కానిచ్చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు కోరిన సమయంలో..కోరిన వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకునే వెసులుబాటు కనిపిస్తున్నాయి మ్యాట్రిమోనిలు.   సెల్‌ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు ఎవరైనా సరే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఫేక్ ప్రోఫైల్స్, మోసాలు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం వీటిపై దృష్టిసారించింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా మేనకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆన్‌లైన్‌లో పెళ్లి ప్రకటనల్లో మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈ విధానంలో కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధ వెబ్‌సైట్లు, మ్యాట్రిమోనిల ప్రతినిధులతో చర్చలు జరిపి కొత్త నియమనిబంధనలను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇకపై ఆన్‌లైన్‌లో పెళ్లి ప్రకటన ఇవ్వాలంటే ప్రభుత్వ గుర్తింపు కార్డులైన ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డులను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా ప్రకటన ఇచ్చే సమయంలో షరతులను ప్రకటనదారుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలని, పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ఫిర్యాదుల అధికారి వివరాలు తెలపాలని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

"మూడవ" జాతికి గౌరవం పెంచేందుకు..?

వాళ్లు మగవాళ్లు కాదు..అటు ఆడవాళ్లు కాదు..మగవారిగా పుట్టి ఆడవారిగా మారిన వారు. మగతనం మచ్చుకైనా కనిపించకుండా వొంటినిండా ఆడతనం కప్పేసుకున్న మగాళ్లు..కొన్ని చోట్ల వీరిలో ఆడవాళ్లు కూడా ఉంటారు. వీరిని వాళ్లను కన్న కుటుంబాలే గెంటేస్తాయి. మీరు మా మనుషులు కాదు పొమ్మంటాయి. ఇక సమాజం గురించి చెప్పేదేముందీ..అంతకన్నా ఛీ కొడుతుంది..మా సంస్కృతి, సంప్రదాయాల్లో ఇలాంటి వ్యవహారమే లేదు వెళ్లమంటోంది. ఈ జీవిత పోరాటంలో ఈ "మూడో తరగతి" మనుషుల ఆగచాట్టు ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడికెళ్లినా చీదరింపులు..చీత్కరాలు అయినా విధిరాతను ఎదిరించి బతుకిడుస్తున్నవారు కోకొల్లలు ఇలాంటి వారి సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడు లేడు.   కాని దేశవ్యాప్తంగా పలు ట్రాన్స్‌జెండర్స్ సంఘాల పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం దిగివచ్చింది. ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమాన్ని "సాంఘిక న్యాయం, సాధికారత శాఖ"కు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలను మార్చింది. వీరిపై సామాజిక వేధింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో వీరి కోసం "కొత్త జాతీయ పాలసీ"ని ఈ మంత్రిత్వశాఖ రూపొందించనుంది. "ట్రాన్స్‌జెండర్స్ హక్కుల బిల్లు-2015' ప్రకారం వీరిని ఇతరులు అని కాకుండా ట్రాన్స్‌జెండర్స్ అనే పిలవాలి. కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదు వీరిపై సమాజం కూడా కాస్త ఆలోచించాలి. తనకు తాను మానవత్వానికి ప్రతీకగా చెప్పుకుంటుంది ఈ సమాజం. దానిలోంచి కాస్త జాలి, మరికాస్త ప్రేమాభిమానాలను వీరిపై చూపడం వల్ల ఆ మానవత్వానికి మరింత విలువ వస్తుంది. సో.. మనవంతుగా వారికి చేయూతనివ్వడం మన ధర్మం.

"సరదా"లు సద్దేసుకోండి..లేదంటే..!

ఫ్లాస్మా టీవీ కొనాలనుకుంటున్నారా..వైఫె సేవలు పొందాలనుకుని స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..ఏసీ గాలులతో సేద తీరాలనుకుంటున్నారా..? కుటుంబంతో కలిసి సినిమా చూసి ఏ హోటల్‌లోనే డిన్నర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ రెండు రోజుల్లోనే..ఎందుకంటే ఎల్లుండి నుంచి మరో సెస్ బాదుడు బిగెన్ కాబోతోంది. దేశంలో రోజు రోజుకు దిగజారిపోతున్న ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుతానంటూ మాటలు వల్లిస్తున్న మోడీ సర్కార్ పన్నుల మీద పన్నులు వేసి ఈ ఏడాదిని పన్నుల సీజన్‌గా మార్చేసింది. ఇప్పటికే వివిధ రకాల సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరిట వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం వేస్తూ వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం. మరో సెస్‌ బాదుడుకు రెడీ అవుతోంది.   దేశంలోని అన్నదాతల సంక్షేమం కోసం కృషి కళ్యాణ్ సెస్ పేరిట 0.5 శాతం సెస్ కలెక్ట్ చేయాలని బడ్జెట్‌లో ప్రకటించారు. దానిని జూన్ 1 నుంచి అమలు చేయనున్నారు. దీని వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు ఇలా పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపై కృషికళ్యాణ్ సెస్‌ను వసూలు చేస్తారు. దీని వల్ల ఇప్పటి వరకు 14.5 శాతంగా ఉన్న సేవాపన్ను 15 శాతానికి చేరుతుంది. దీని ఆదాయ లక్ష్యం 5,000 కోట్ల రూపాయలు. కృషి కళ్యాణ్ సెస్ వల్ల అంతిమంగా భారం పడేది సామాన్యుడిపైనే. సో ఇలాంటి సరదాలు ఏమైనా ఉంటే ఇవాళ, రేపటిలోగా తీర్చేసుకోగలరు.

ఛీ..ఈ జాబేందుకు చేస్తున్నాన్రా బాబూ..!

దేశంలో యువత ఆలోచిస్తున్న తీరిది. ఒకవైపు ఉద్యోగాల కోసం కోట్లాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే..బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తూ..ఐదెంకెల జీతం తీసుకుంటూ అసంతృప్తితో పనిచేస్తున్న వారు దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నారు. టైమ్స్ జాబ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలంటేనే అసహ్యించుకుంటున్నారు. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు ఉద్యోగ భద్రత ఉండే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, భీమా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులతో పాటు భారీ జీతాలు, వారాంతంలో రెండు రోజులు సెలవులుండే ఐటీ, టెలికాం రంగంలోనూ నూటికి 50 శాతం మంది ఉద్యోగులు ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ నెత్తి బాదుకుంటున్నారు.   అసలు ఉద్యోగుల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది తమ "బాస్ టార్చర్" భరించలేకపోతున్నామని/సహోద్యోగులతో వేగలేకపోతున్నామనో చెప్పారు. 30 శాతం మంది మాత్రం కంపెనీలో తమ పాత్ర లేదా పొజిషన్‌ బాగా లేనందున ఉద్యోగంపై మనసు వెళ్లడంలేదన్నారు. మరి కొంతమంది ఆఫీసులో పని వాతావరణం, షెడ్యూల్స్ బాగోలేదని చెప్పారు. ఎన్నేళ్లు పనిచేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడం కూడా ఉద్యోగంపై విసుగురావడానికి కారణంగా తెలిపారు. అయినా తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం మనసు చంపుకుని పనిచేసేవారు భారత్‌లో అడుగడుగునా కనిపిస్తారు. కాని ఇటువంటి పరిస్థితి వల్ల ధీర్ఘకాలంలో ఒత్తిడి ఎక్కువై మనిషి డిప్రెషన్‌కు గురవుతాడని మానసిక నిపుణులు అంటున్నారు.  ఈ సందర్భంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త, ప్రపంచ మేధావి స్టీవ్ జాబ్స్ మాటలు గుర్తుకురాక మానవు. "ఏ పనైతే నీకు గొప్పగా అనిపిస్తుందో అదే నీ వృత్తి, నీ ఉద్యోగం కావాలి. ఆ రంగాన్నే ఎంచుకోండి..ప్రేమించే పనిలోనే అద్భుతాలు చేయగలం..ప్రేమలేని కొలువులు మహా అయితే జీతాన్నిస్తాయి, జీవితాన్ని ఇవ్వవు" అంటూ ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. 

తన ఎమ్మెల్యేలపై జగన్ "విహారాస్త్రం"...!

పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు..ఏ క్షణాన సైకిలెక్కుతారో తెలియక బుర్ర హీటెక్కిపోతోన్న టైంలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో వైసీపీ అధినేత జగన్‌కు టెన్షన్ ఎక్కువైపోయింది. ఏపీ నుంచి భర్తీ కానున్న 4 సీట్లలో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కనున్నాయి. అయితే వైసీపీకి ఒక్కటి కూడా దక్కకుండా చేయడానికి టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షించిన టీడీపీ మరో 15 మంది శాసనసభ్యులకు వలవేసింది. రాజ్యసభ ఎన్నికల నాటికి పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీటిని తిప్పికొట్టడానికి వైసీపీ అధినాయకత్వం వ్యూహం రచించింది.   వైసీపీ సీనియర్లు కొందరు పార్టీ శాసనసభ్యులను విహారయాత్రకు తరలిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధినేత ముందు ఉంచారు. ఒకే చోట అందరినీ తరలించే క్యాంపు రాజకీయాలు వద్దని ఇది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని జగన్ తొలుత వారించినప్పటికి, తెలుగుదేశం ఎటాక్ నుంచి రక్షించుకోవాలంటే వేరే దారి లేదని ఒప్పుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను దేశంలోని కేరళ, గోవా, బెంగుళూరు వంటి పర్యాటక ప్రాంతాలకు పంపినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో పాటుగా వారి కుటుంబసభ్యులను కూడా ఈ విహారయాత్రలకు పంపినట్టు లోటస్‌పాండ్ టాక్. వీరంతా రాజ్యసభ ఎన్నికలకు ఒకరోజు ముందు హైదరాబాద్‌కు వచ్చేలా షెడ్యూల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్యాంపు రాజకీయం అనుకున్నా.. మరోకటి అనుకున్నా టీడీపీ బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇంతకు మించిన దారి జగన్‌కు కనిపించలేదని అర్థమవుతోంది. ఎంత దాచి ఉంచినా ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఉంటారా.?