కేబినెట్ బెర్త్‌పై గుంటూరు నేతల కన్ను

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో  తనయుడు లోకేష్, బావమరిది బాలయ్యలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ రోజుకోక వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ అటు మీడియాలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మంత్రివర్గంలో మార్పులేంటి? చేర్పులేంటి? ఎవర్ని ఉంచుతున్నారు? ఎవర్ని ఊడబీకుతున్నారో తెలియక పచ్చ కండువాలు జుట్టుపీక్కుంటున్నాయి. ఇవన్నీ అటుంచితే తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలంటూ చాలా మంది ఆశావహులు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరిలో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు రేసులో ముందున్నారు. తొలి విడతలో తమకు అవకాశం రాకపోవడం, కొత్తగా వైసీపీ నుంచి వలసలు రావడంతో ఈసారైనా చంద్రబాబు తమను కరుణిస్తారో లేదోనన్న అనుమానంతో ఎలాగైనా మంత్రిగా ప్రమాణం చేయాలని చూస్తున్నారు గుంటూరు నేతలు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్ర రాజకీయాల్లోనూ గుంటూరు గడ్డది కీరోల్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ 12 స్థానాలు కైవసం చేసుకుని టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచింది ఈ జిల్లా. జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు మంత్రులుగా , కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా ఇంతవరకు అమాత్య పదవి దక్కించుకోని ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు ఈసారి ఎలాగైనా బుగ్గకారు ఎక్కాలని డిసైడ్ అయ్యారు. అందుకనే ఎవరి స్టైల్లో వారు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.   ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం, ఇంతవరకు మంత్రిగా అవకాశం రాకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటైన జవాబివ్వడం ద్వారా థూళిపాళ్ల బాబు వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఈ కారణాలతో ఈసారి ఆయనకి కేబిన్‌ట్‌లో బెర్త్ కన్ఫామ్ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరొ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంగతి చూస్తే తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. కష్టకాలంలో కార్యకర్తలు పార్టీని వదలకుండా కాపాడారు. అందుకే చంద్రబాబు వద్ద తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. మరో సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో వైసీపీని థీటుగా ఎదుర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం ట్రై చేస్తున్న మరో లీడర్ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్. సొంత డబ్బు ఖర్చుపెట్టి మరి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించిన వ్యక్తిగా...పిలిస్తే పలికే నేతగా ప్రజల్లో ఈయన పట్ల సదాభిప్రాయం ఉంది. వీరంతా సీనియర్లు కావడంతో పాటు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు.   అయితే ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రత్తిపాటి, రావెల కిశోర్ బాబు పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉండటంతో వీరికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. దీంతో దళితుల కోటాలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌లు విజ్ఞప్తి చేశారు. ఆనందబాబు సీనియర్ అయినప్పటికి అమరావతి ప్రాంతంలో రైతులను ఒప్పించి ల్యాండ్‌పూలింగ్‌కి సహకరించిన శ్రవణ్ కుమార్‌కు రావెల స్థానంలో బెర్త్ దక్కే అవకాశముందని ట్రస్ట్ భవన్ టాక్.  ఇలా ఎవరికి తోచినట్లు వారు  అనాలిసిస్ చేస్తున్నప్పటికి చంద్రబాబు లెక్కలు ఆయనకుంటాయి. ఒకరిని కాదని ఒకరికి మంత్రి పదవి ఇస్తే రాజకీయ రచ్చ తప్పదని..ప్రతిపక్షంలో ఉండగా..పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని వేరే వారికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పార్టీలో కుదుపు ఖాయమని సీఎం భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాను ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.

కొల్లాం ప్రమాదం విద్రోహ చర్యా..?

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పరవూర్ పుట్టింగల్ ఆలయంలో బాణాసంచా పేలి 110 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పుడు ప్రజల్లోనూ..ప్రభుత్వంలోనూ అనేక కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. కాళికాదేవి ఆలయంలోకి అతి సమీపంలో మూడు గుర్తుతెలియన కార్లు పార్క్ చేసి ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు  తనిఖీలు నిర్వహించగా వాటి నిండా భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నాయి. దీంతో కొల్లాంలో మళ్లీ కలకలం రేగింది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? నిన్న పేలుళ్ల వెనుక సంఘవిద్రోహ శక్తుల హస్తం ఉందా అని ప్రజలు, పోలీసులు చర్చించుకుంటున్నారు.     బాణాసంచా పేలుళ్లతో అంత ప్రమాదం జరగే అవకాశమే లేదని పలువురు అనుమానిస్తున్న నేఫథ్యంలో  తాజా ఘటన దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. నిన్న ప్రధాని నరేంద్రమోడీ సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయా? లేక ఆ తరువాత తీసుకొచ్చి పార్క్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్‌ఐఎస్, జైషే మహ్మద్, లష్కరేతోయిబా వంటి కొన్ని తీవ్రవాద సంస్థలు గత కొంతకాలంగా దేశంలో అలజడులు సృష్టించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే మన భద్రతాదళాలు వాటి ఆటలు సాగనివ్వడం లేదు. దీంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఉగ్రవాదులు పుట్టింగల్ ఆలయాన్ని ఏమైనా టార్గెట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఏది ఏమైనా 110 మంది అమాయకులు ఈ ప్రమాదంలో బలి పశువులయ్యారు.  

మనుసు మార్చుకున్న త్రయంబకేశ్వర ఆలయ పెద్దలు

మహారాష్ట్రలోని ప్రఖ్యాత త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి పురుషులు కూడా ప్రవేశించకూడదంటూ ఇటీవల విధించిన నిషేధాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఉపసంహరించుకుంది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి తరతరాలుగా మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదంలో భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్ధానం వీరి వాదనతో ఏకీభవించింది. ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ, పురుష వివక్ష చూపరాదని..దేవుడిని పూజించడం మహిళల ప్రాథమిక హక్కని..పురుషులతో సమానంగా మహిళలకు దేవాలయాల్లో ప్రవేశించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. శనిసింగనాపూర్ తరహాలో ఇక్కడ మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గానూ పురుషులను గర్భగుడిలోకి రాకూడదని ఏప్రిల్ 3న నిషేధం విధించింది.   అయితే ఈ నిర్ణయంపై స్థానికులు, పలువురి నుంచి పెద్ద ఎత్తున్న ఒత్తిళ్లు వస్తుండటంతో త్రయంబకేశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సమావేశమైంది. పురుషుల గర్భగుడి ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. పురుషులపై నిర్ణయం తీసుకుని మహిళలపై మాత్రం ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరి మహిళల నుంచి మహిళా సంఘాల నుంచి దీనిపై ఆందోళనలు వ్యక్తమైతే మళ్లీ ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మూడు పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ..!

ఒక వ్యక్తిని అభిమానించే వారు ఆ వ్యక్తిలోని క్వాలిటీస్‌ని గుర్తిస్తారు. అలాగే విమర్శించేవారు సదరు వ్యక్తిలో ఏదైనా లోపం దొరుకుతుందా అని వెతుకుతుంటారు. టాలీవుడ్‌లో మిగిలిన నటులకు పవన్‌కు ఓ తేడా ఉంది . మిగిలిన వారిని అందరినీ నటులుగానే చూసిన అభిమానులు పవన్‌ను ఓ విలక్షణమైన వ్యక్తిగా చూస్తూ వచ్చారు. తన జీవనశైలి, మాటతీరు తదితర లక్షణాలతో పవన్ ఈ స్థాయిని సాధించారు. అలాగే ఎన్ని ప్లస్‌లున్నప్పటికి ఆయన ఎక్కడైనా దొరకడా అనుకునే వారికి దొరికిన లాజిక్ మూడు పెళ్లిళ్లు వ్యవహారం.   చాలా సందర్భాల్లో మీడియా నుంచి అభిమానుల నుంచి పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్స్ వస్తుండేవి. అయినా ఇంతవరకు పవన్ నోరు మెదపలేదు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా వివిధ ఛానెళ్లకు పవన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో తన పెళ్లిళ్ల విషయంపై మనసులోని మాటను బయటపెట్టారు. పవర్ స్టార్ తొలిసారి నందినిని వివాహం చేసుకోగా, ఆమె నుంచి విడిపోయి రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే రేణూ నుంచి విడాకులు తీసుకుని రష్యా దేశస్థురాలు అన్నా లెజినావాను పెళ్లాడారు.   అయితే పవన్ అసలు బ్యాచిలర్‌గానే ఉండాలనుకున్నారట. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని అప్పట్లో భావించారట. వాళ్ల అమ్మగారు కూడా ఒరేయ్ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్..అంటూ అనేవారట. ఈ ప్రశ్నకు సమాధానంగా జీవితమంటే అంతే..ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం అన్నారు. ఇన్ని రోజుల సైలెంట్‌గా ఉండి సడెన్‌గా ఆయన ఈ విషయంలో ఎందుకు ఓపెనయ్యారోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. బహుశా  తన వ్యక్తిత్వం మసక బారిందనో లేదా ఇమేజ్ డ్యామేజ్ అయిందనో భావించే వారు కూడా ఉన్నారు. ఎందుకుంటే కాలం మారుతోంది, అనుబంధాలు మారుతున్నాయి. ఈ పెళ్లిళ్ల లెక్కను గోరంతలు, కొండంతలు చేసేవారికి మరోక ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకే పవన్ పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చినట్టున్నారు.  

పవన్ కేసీఆర్‌ని ప్రశంసించానికి కారణం ఏంటీ?

సంచలనాలకు కేంద్ర బిందువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగంతో సంచలనం సృష్టించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సందర్భంగా పవన్ వివిధ ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో పవన్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది రాజకీయ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.  కేసీఆర్ సమర్థ పాలన అందిస్తున్నారని.. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లో  సెటిలైన  సీమాంధ్రులకు  సమప్రాధాన్యమిస్తూ సానకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సెటిలర్లను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారని, వారిపై ఈగ వాలనీయడం లేదని అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ నాయకత్వ పటిమ బాగుందని అన్నారు.   ఇదే పవన్ జనసేన ఆవిర్భావ సభతో పాటు 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పైనా ఆయన కుటుంబంపైనా మాటల తుటాలు పేల్చారు. వరంగల్ సభలో తెలంగాణ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా..నీ తాట తీస్తా అని పవన్ హెచ్చరించారు. దానికి కౌంటర్‌గా కేసీఆర్ కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడి కేసీఆర్‌దే తాట తీస్తనంటున్నాడు వాడెంతున్నాడు. చిటికెస్తే వెయ్యితునకలు అవుతాడు అంటూ ఘాటుగానే విమర్శించారు. ఇలా కొంతకాలంపాటు కేసీఆర్ కుటుంబం పవన్‌ని టార్గెట్ చేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీఆర్ఎస్ వరుస విక్టరీలు తదితర కారణాలతో పవన్ ఆలోచనలో పడ్డారు. దీంతో దూకుడు తగ్గించి కేసీఆర్ కుటుంబం పట్ల మెత్తబడినట్టు కనిపిస్తోంది. అందుకే ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొల్లాం ప్రమాదం ఒక గుణపాఠం

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పరవూర్ పుట్టింగల్ దేవి ఆలయంలో బాణాసంచా పేలుళ్ల కారణంగా భారీఎత్తున ప్రాణనష్టం చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకిత్తించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భద్రత విషయం మరోసారి తెరపైకి వచ్చింది.  కేరళలాగే మనదగ్గరా వివిధ ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనో, సమీపానో బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల,  బెజవాడ కనకదుర్గ,  శ్రీశైలం,  అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి,  వేములవాడ, యాదాద్రి వంటి ప్రముఖ దేవాలయాల ప్రాంగణాల్లో ఉత్సవాలలో బాణాసంచా కాలుస్తుంటారు. ఈ సమయంలో దురదృష్టవశాత్తూ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేలాది మందిని గుడిప్రాంగణం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. వీటికి అదనంగా జాతర్లు, తీర్థాలు వగైరా వగైరా సందర్భమేదైనా బాణాసంచా కామన్. శ్రీశైలంలో ప్రతి ఏటా దసరా నవరాత్రుల ముగింపు రోజు, హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కామదహనం రోజున చెత్తను బాణాసంచాను కలిపి నిప్పంటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జరగరానిది జరిగితే రక్షించేది ఎవరు? ఉత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు గుళ్లకు వచ్చే అవకాశం ఉండటంతో ఇలాంటి సందర్భాల్లోనైనా బాణాసంచా వినియోగంపై నిషేధం విధిస్తే మంచిదని నిపుణుల సూచన. ఇది ఆటవిడుపుకోసం భక్తులను ఆకట్టుకోవడానికి చేసే పని తప్పితే ఆచారం కాదంటున్నారు. దేవాలయాల్లో బాణాసంచా వినియోగంపై ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. లేదంటే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశముంది.  

పవన్‌ సర్దార్‌ను టీడీపీ కాపు కాసిందా?

ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అనుకున్నట్టే భారీ ఓపెనింగ్, అభిమానుల హంగామా అన్ని కామనే. ఈ బాండ్ భజా వెనుక తెలుగుదేశం హస్తం కూడా ఉందని విశ్లేషకుల అంచనా. టీడీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి జనసేన అధినేత పవన్ ఎంత సపోర్ట్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత జనసేన-టీడీపీ బంధం బాగా స్ట్రాంగ్ అయ్యింది. రాజధానికి భూసేకరణ తదితర విషయాల్లో జనం నుంచి వ్యతిరేకత రాకుండా  చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించకుండా పవన్ సహాయపడ్డారు. టీడీపీకి ఎంతో సాయం చేసి పార్టీకి పూర్తి వెన్నుదన్నుగా నిలిచిన పవన్‌ రుణం తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు టైం రానే వచ్చింది. అదే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీనికి ఇరు రాష్ట్రాల్లో టీడీపీ నాయకుల మద్దతు లభించింది. తెలుగుదేశం కంచుకోటలైన విజయవాడ, గుంటూరు నగరాల్లో థియేటర్లు లభించడానికి అర్థరాత్రి షోలు, స్పెషల్ షోలు వేసేందుకు అక్కడి నాయకులు తమ వంతుగా సాయం చేశారు. ఈ విధంగా సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా టీడీపీ ఫుల్ సపోర్ట్ చేసిందని సినీ, రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.  

బాలయ్యను పక్కనెట్టడానికే లోకేష్‌కి మంత్రి పదవా?

  ప్రస్తుతం ఏ రెండు పచ్చకండువాలు కలిసినా మాట్లాడుకునే హాట్ టాపిక్ చంద్రబాబు బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తారా? లేక నారా లోకేష్ కి మంత్రి పదవిస్తారా? ఎవరి కోసం ఎవరిని పక్కన బెడతారు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అంటూ చాలాకాలంగా నందమూరి అభిమానులు నినాదాలు చేస్తున్నారు. పైగా బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వకపోయినా కనీసం బాలకృష్ణకు మంత్రి పదవైనా ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు తనకు మంత్రినయ్యే అర్హతలున్నాయంటూ బాలయ్య బాహాటంగానే ప్రకటించారు కూడా. ఈ పరిణామాలన్నింటిని  ఒక కంట కనిపెడుతున్న అధినేత. బాలయ్యకు పదవిస్తే తనకు లేనిపోని తలనొప్పులు వస్తాయని ఇవాళ మంత్రి పదవి..రేపు పార్టీ పగ్గాలు అంటూ డిమాండ్లు వస్తాయని గ్రహించారు. అందుకే తన వారసుడిగా నారా లోకేష్‌ని నిలబెట్టడానికి నారా వారు మరో ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తున్నారు.   తన రాజకీయ వారసుడిగా భవిష్యత్తు టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చినబాబును చూడాలనుకుంటున్నారు బాబు. పార్టీలో లోకేష్‌కి పోటీ రాకుండా ఉండేందుకు దాదాపుగా నందమూరి వంశాన్ని పక్కకు నెట్టిన చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణను కూడా వారసత్వం నుంచి దూరం చేయడానికి ప్లాన్ వేసినట్టు ట్రస్ట్ భవన్ టాక్. అందుకోసం లోకేష్ అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చినబాబును ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకు మంత్రివర్గంలోకి స్వాగతం అంటూ మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ బాలయ్యను కాదని చంద్రబాబు లోకేష్‌కి మంత్రి పదవి ఇస్తే లెజెండ్ కాదనడు, కాదనలేడు ఎందుకంటే బాలయ్యకి లోకేష్ మేనల్లుడు మాత్రేమే కాదు, స్వయానా తన కుమార్తెకి భర్త, అంటే అల్లుడు కూడా. దట్స్‌వై బాలయ్య నుంచి మేటర్ క్లియర్. ఇదంతా ముందే ఊహించిన బాబు లోకేష్-బ్రహ్మాణిల వివాహంతో అన్ని సెటిల్ చేసేశారు. అందుకే చంద్రబాబుని అపర చాణుక్యుడనేది.

దళితుల మెప్పు కోసం కేసీఆర్ మరో స్కెచ్

రాజ‌కీయ వ్యూహాల్లో తిరుగులేని నాయ‌కుడు కేసీఆర్. ఆయ‌న ఓ పొలిటిక‌ల్ స్టెప్పు వేశారంటే.. క‌నీసం ప‌దేళ్ల ముందు చూపు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్. ఇపుడు అలాంటి వ్యూహమే మ‌రొకటి ర‌చించార‌ు కేసీఆర్. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఎన్నికలవ్వగానే తూచ్ అన్నారు. ముఖ్యమంత్రి పీఠంలో తానే కూర్చున్నారు. తన మంత్రివర్గంలోకి దళితుడైన రాజయ్యను తీసుకున్నట్లే తీసుకుని అవినీతి ఆరోపణల సాకుతో కేబినెట్‌ నుంచి తొలగించారు. దీంతో దళిత సంఘాలు మండిపడ్డాయి. దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీనిపై ఆలోచనలో పడ్డ కేసీఆర్‌కు వెంకటస్వామి రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. అనారోగ్యంతో కాకా మరణించడంతో వెంకటస్వామి జ్ఞాపకార్థం తొలిసారిగా తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేసి వారి ఆగ్రహన్ని చల్లార్చారు కేసీఆర్.  ఇప్పుడు మరోసారి దళితుల విశ్వాసం దెబ్బతినకుండా చూడటానికి గులాబీ దళపతి మరో స్కెచ్ గీశారు. రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగరంలో ప్రతిష్టించాలని కేసీఆర్ సంకల్పించారు.  125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం నిర్మించడంతో పాటు, అంబేద్కర్ పేరిట ప్రతీ నెల… ప్రతీ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీతో పాటు… దళితుల అభ్యున్నతి, చైతన్యం కోసం కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేసి వచ్చే ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణ చేయాలి, దానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అసలే ఇప్పుడు కేసీఆర్ పట్టిందల్లా బంగారమే కాబట్టి ఈ కొత్త స్కెచ్ కూడా తప్పకుండా ఫలితాన్నిస్తుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

శనిసింగనాపూర్‌ ఆలయంలో పాదం మోపిన మహిళలు

మహారాష్ట్ర మహిళలు ఎట్టకేలకు గొప్ప విజయం సాధించారు. ప్రఖ్యాత శనిసింగనాపూర్ ఆలయంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఆలయం సంప్రదాయం ప్రకారం మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధిం. అయితే పురుషులతో పాటు తమకు అన్నింట్లో సమాన అవకాశాలున్నాయని తాము ఆలయ ప్రవేశం చేస్తామంటూ భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు పెద్ద పోరాటం సాగించారు. అయితే పదేపదే వీరి ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై భూమాతా కార్యకర్తలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా వీరి వాదనతో ఏకీభవించి ఆలయంలోకి అనుమతించాల్సిందిగా ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుతో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలను మరోసారి స్థానికులు, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శనిసింగనాపూర్ దేవాలయ ట్రస్ట్ అధికారులు సమావేశమై ఇటువంటి గొడవలు లేకుండా ఉండటానికి ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 100 మంది పురుషులు ట్రస్ట్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్త బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈ రోజు మహిళలకు కూడా అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. దీంతో భూమాతా బ్రిగేడ్ సారథి తృప్తి దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహిళలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

దుర్ముఖిలో పాత రేవంత్‌ బయటకొస్తాడా..?

    తెలుగు సంవత్సరాది సందర్భంగా ఈ ఏడాదైనా పాత సంవత్సరం కష్టాలు తీరతాయని కొండంత ఆశలతో ఎదురుచూస్తుంటారు ప్రజలు. అందుకు సామాన్యులు కూడా అతీతులు కాదు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డికి గత సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదు. ఎంతో ఎత్తుకు ఎదిగి వైకుంఠపాళిలో పాము నోట్లో పడినట్టు కిందకిపడిపోయాడు. అసెంబ్లీ సమావేశాల్లో తన దూకుడు స్వభావంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెమటలు పోయించి టీడీపీ తరపున భావి ముఖ్యమంత్రి అభ్యర్థి తనే అన్నట్టు దూసుకెళ్లాడు.     అయితే ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి వచ్చిన తర్వాత రేవంత్ కాస్త సైలెంయ్యారు. దానికి తోడు ఒకరి తర్వాత ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం కప్పుకోవడంతో రేవంత్ ఒంటరిగా మిగిలిపోయారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం, సపోర్ట్ ఇచ్చే వాళ్లు లేకపోవడంతో ఆయన చప్పబడిపోయారు. మనం చూస్తుంది రేవంత్ రెడ్డినేనా అని అభిమానులు,ప్రజలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుర్ముఖి నామ సంవత్సరంలో రేవంత్ మళ్లీ గర్జించాలని అనుకుంటున్నారు. అభిమానుల్లో ఫాలోయింగ్, వాగ్థాటి ఆయుధాలుగా చేసుకుని రేవంత్ దుమ్ములేపడానికి రెడీ అవుతున్నారు. తద్వారా పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించాలనుకుంటున్నారు.  

మన నాయకుల జాతకాలు ఇలా ఉండనున్నాయి

  నేడు తెలుగు సంవత్సరాది. ఈ రోజున అందరూ కొత్త సంవత్సరంలో తమకు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయోనని పంచాంగ శ్రవణం చేస్తారు.  మన రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఉబలాట పడుతుంటారు. ఇటువంటి వారి కోసమే ఈ రాజకీయ పంచాంగ శ్రవణం   చంద్రబాబు నాయుడు: తెలుగు దేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కూడా కష్టాలతో కాపురం చేయాల్సి ఉంటుంది. సీఎం మానస పుత్రిక అయిన రాజధాని అమరావతి, పోలవరంతో పాటు మరెన్నో ప్రాజెక్ట్‌లు బాబు సత్తాకు సవాల్‌గా మారనున్నాయి. మరోవైపు తెలంగాణలో పార్టీని కాపాడాల్సిన ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది. గెలిచిన 15 మందిలో 12 మంది కారెక్కెయడంతో ఉన్నవారిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వాళ్లని చేజార్చుకోకుండా చూసుకోవడం బాబుకి కత్తిమీద సామే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్ష వైసీపీని చంద్రబాబు బాగానే కంట్రోల్ చేస్తారని చెప్పవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా జగన్‌ను దెబ్బ కొట్టడంలో తెలుగుదేశం అధినేత మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు: దుర్ముఖి నామ సంవత్సరంలోనూ కేసీఆర్ ప్రభ వెలిగిపోనుంది. ఏ ఎలక్షన్స్ ప్రకటించినా అందులో టీఆర్ఎస్ తప్ప వేరొక పార్టీ గెలవకపోవడంతో గులాబీ దళపతి ఖుషిఖుషిగా ఉన్నారు. సమీప కాలంలో ఆయనను ఎదురించే..ఎదుర్కోనే నేత మరొకరు కనిపించకపోవడంతో సూపర్ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందాలు, డబుల్ బెడ్‌రూంలు, మిషన్ భగీరథ, గ్రామజ్యోతి తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆయనపై అభిమానం మరింత పెరిగిపోయింది. ఈ ఏడాది మరిన్ని కొత్త పథకాలు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండటంతో ఈ సంవత్సరం కూడా కేసీఆర్‌కు ఎదురు ఉండదని పండితులు బల్లగుద్ది చెబుతున్నారు.   జగన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌కు ఈ సంవత్సరం కూడా గడ్డుకాలమే. ప్రతిపక్షనేతగా విఫలమవ్వడం, ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి చాలా మంది ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సంవత్సరం ఆపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ బాస్ మరింత పదనుపెట్టనున్నారు. తెలంగాణలో ఉన్న ఒకేఒక్క ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా గులాబీ లాగుతుండటంతో వారు కూడా చేజారిపోయేట్టున్నారు. ఇటు చంద్రబాబు, అంటు కేసీఆర్‌ల పక్కలో బల్లెంలా తయారవ్వడంతో ఏం చేయాలో తెలియక జగన్ జుట్టుపీక్కుంటున్నాడు.

భజనగాళ్ల త్యాగాలు లోకేశ్‌కి అక్కర్లేదు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు త్యాగాలు చేయడానికి టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. లోకేశ్ కోసం మేం రాజీనామా చేస్తామంటే, మేం రాజీనామా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు ఈ త్యాగాల వీరుల్లో ముందు వరుసలో ఉన్నారు. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని, ఆయన కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ బుద్దా చినబాబు మీద తెగ ప్రేమ ఒలకబోశాడు. అంతేకాదు మరో ముందడుగు వేసి రాజీనామాను చంద్రబాబుకు సమర్పిస్తానంటూ ప్రకటించారు. ఇక బోడే ప్రసాద్ విషయానికొస్తే లోకేష్ లాంటి నేతలు రాజకీయాల్లో అరుదని, అలాంటి వారి అవసరం టీడీపీకి ఎంతైనా ఉందన్నారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పదవులు ఆశించకుండా పనిచేస్తున్న లోకేష్‌ను గౌరవించుకునే సమయం వచ్చిందన్నారు. అయితే టీడీపీ అభిమానులు వీళ్ల త్యాగం వెనుక మర్మాన్ని అంచనా వేసేశారు.   లోకేష్ పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలున్నాయి. కాల్‌మనీ పేరుతో మహిళలను ఆటవస్తువుగా మార్చి వేధింపులకు గురిచేశారని ఇప్పటికే వీరిని ప్రతిపక్షాలు, మీడియా చెడుగుడు ఆడుకుంటున్నాయి.  ఈ ఆరోపణలతో ఇప్పటికే పరువు పోవడంతో పాటు ప్రజల దృష్టిలో చులకనయ్యారు. కాల్‌మనీ వ్యవహారం తర్వాత దాదాపుగా కనిపించడం మానేసిన వీరిద్దరికి  ఎడారిలో ఒయాసిస్‌లా లోకేష్ దొరికారు. చాలా రోజుల తర్వాత మైక్ దొరకడంతో లోకేష్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నట్టు వీరిద్దరూ పూనకం వచ్చినట్టు ఊగారు.  లోకేష్ కోసం పదవి త్యాగం చేస్తే అధినేత దృష్టిలో పడటం, మీడియాలో పబ్లిసిటితో పాటు  తమ రాజకీయ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తున్నారట ఈ పోటుగాళ్లు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో క్లీన్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు తన వారసుడికి కూడా అలాంటి క్లీన్ ఇమేజ్ ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి భజనలకు, పొగడ్తల విషయంలో చంద్రబాబు ఆచితూచి స్పందిస్తారు. పైగా వీరి త్యాగాన్ని వాడుకుని లోకేశ్ ని ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో పోటీ చేయిస్తే కాల్‌మనీ నిందితులకు చంద్రబాబు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో బాబు అలాంటి తప్పే చేయరని టీడీపీ నేతల టాక్.  లోకేష్ దేన్నయినా కష్టపడి సాధించుకుంటారని ఒకడి త్యాగం చినబాబుకి అవసరం లేదని కార్యకర్తల ఫిలింగ్.

టీడీపీనా, వైసీపీనా డైలమాలో పెదరాయుడు

  సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటున్నారు. త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించారు. తనకి ప్రత్యేకంగా వేరే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెబుతూనే చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ అంతా తనకు సన్నిహితులేనంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు గాని ఏ పార్టీలో చేరతానో మాత్రం చెప్పలేదు. కలెక్షన్ కింగ్ పొలిటికల్ ఎంట్రీ  తెలుగుదేశంతోనే జరిగింది. అన్న ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన మోహన్ బాబు , చంద్రబాబు హయాంలో ఎంపీగా రాజ్యసభకు ఎన్నికకాబడ్డారు. 2004లో టీడీపీ ఓటమితో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబుతో ఒకింత దూరం పాటించారు. ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు విష్ణుకు వివాహం జరిపించి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.   మరో ప్రక్క రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్‌‌పై మాటల యుద్ధం చేసిన మోహన్ బాబు , కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సైలెంటయ్యారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఆయన్ను పొగుడుతున్నారు. తన చిన్న కుమారుడు మనోజ్ పెళ్లి వేడుకకు గులాబీ దళపతిని ఆహ్వానించి పాత గొడవలు మరచిపోయినట్టు సంకేతాలు పంపారు. తనకు రాజకీయ భిక్షను పెట్టి, పర్సనల్‌గా ఎంతో సపోర్ట్ చేసిన తెలుగుదేశం వైపే పెదరాయుడు మొగ్గుచూపుతారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అలా అని జగన్‌ను దూరం చేసుకోకుండా తన కుటుంబంలో వేరోకరిని వైసీపీలో చేర్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు టాక్. ఈ విధంగా అటు బాబుని, ఇటు జగన్‌ని సంతృప్తి పరచాలని చూస్తున్నారట ఈ రామన్న చౌదరి.

విజయం రోజాదేనా?

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాల్సిందిగా కోరారు. సుమారు ఐదు నెలలు సాగిన ఈ యుద్థంలో విజేత..  కోర్టు తీర్పిచ్చినా రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వని టీడీపీ ప్రభుత్వానిదా? లేక రోజాదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా రోజాదే అని చెప్పవచ్చు. తెలుగు రాజకీయాల్లో మహామహులైన చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ చుట్టూ మీడియా ఎప్పుడూ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే రోజా సస్పెండ్ అయిన దగ్గరి నుంచి తెలుగు రాజకీయాల్లో రోజా హాట్ టాపిక్ అయ్యారు. సస్పెన్షన్ తర్వాత ఆమె నెక్స్ట్ స్టెప్ ఎంటీ అనే దానిపై రోజూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది మీడియా. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తెలుగుదేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే రోజా ఉపయోగించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.    సస్పెన్షన్ కేసును ప్రత్యేకంగా విచారించాలని సుప్రీం,  హైకోర్టును ఆదేశించింది. దీంతో  రోజా సస్పెన్షన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం..స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదంటూ రోజాను సభలోకి అడుగుపెట్టనివ్వకపోవడం..దీనిపై ఆమె దీక్ష తదితర అన్ని పరిణామాలు జాతీయ స్థాయిలో రోజాకి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. చివరికి ప్రివిలేజ్ కమిటీ తనకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చేలా చేసుకుని ఈ కథకి క్లైమాక్స్ ఇవ్వాలనుకుంది. తన ప్లాన్ భాగంగా నిన్న క్షమాపణలు చెప్పింది. సగటు  రాజకీయ నాయకుడు కోరుకునేది నిత్యం జనాల్లో నానాలి అని అసెంబ్లీలో జగన్ గొంతు చించుకున్నా రాని పబ్లిసిటీ రోజాకి బయట నుంచే వచ్చింది. రేపు ఎన్నికల ప్రచారంలోనూ రోజా ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని లబ్థి పొందవచ్చు. బేసిగ్గా మంచి వాగ్ధాటి కలిగిన రోజా మామూలుగానే చెడుగుడు ఆడుకుంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా వదులుతుంది.

చౌద‌రి వ‌ర్సెస్ రెడ్డి..!

  అనంత‌పురం జిల్లా తెలుగు దేశం పార్టీలో కుమ్ములాట‌లు రచ్చ‌కెక్కాయి. తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అనంత‌పురం  ఎమ్మెల్యే  ప్ర‌భాక‌ర్ చౌద‌రి మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉప్పు నిప్పులా ఉన్న వీరిద్ద‌రూ ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ప‌ర‌స్ప‌రం దూషించుకుంటున్నారు.  జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ అధ్య‌క్షుడు ర‌షీద్ ను పార్టీలోకి చేర్చుకోవాలనుకున్నారు చౌద‌రి అయితే ర‌షీద్ రాక‌ను అడ్డుకున్నారు ప్ర‌భాక‌ర్ రెడ్డి అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. అనంత న‌గ‌రంలోని పాతూరు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముదిరి పాకాన ప‌డింది. రోడ్డును విస్త‌రించాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్, విస్త‌ర‌ణ చేప‌డితే ప్రార్థ‌నా మందిరాలు తొల‌గించాల్సి వ‌స్తుందని చౌద‌రి ప‌ర‌స్ప‌రం ఆందోళ‌న‌కు దిగారు.   అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు న‌గ‌రంలో ఆర్య‌వైశ్యులకు చెందిన కొత్తూరు అమ్మ‌వారి క‌ళ్యాణ మండ‌పాన్ని మునిసిపల్ కార్పోరేష‌న్ అధికారులు ఇటీవ‌లే సీజ్ చేశారు. దీనికి మేయ‌ర్ స్వ‌రూప‌, ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్  చౌద‌రి కార‌ణ‌మంటూ న‌గ‌రంలో తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ ఆర్య‌వైశ్యులు జేసీ అనుచ‌రుడు కోగ‌టం విజయ్ భాస్క‌ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్టి కార్పోరేష‌న్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. దీనిని పోలీసులు అడ్డుకోవ‌డంతో కోగ‌టం తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న్నిప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ రెడ్డి నేను అనుకుంటే వాడి ఇంటికాడికి స‌క్క‌గా వ‌చ్చి కొడ‌తానంటూ చౌద‌రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి చౌద‌రి కూడా ఘాటుగానే స్పందించారు. న‌న్ను కొట్టాలంటే మ‌రో జ‌న్మ ఎత్తాల‌ని అన్నారు. వీరిద్ద‌రి చ‌ర్య‌ల‌తో తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మీరు మీరు కొట్టుకుని పార్టీ ప‌రువు తీయోద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. చివ‌రికి పంచాయ‌తీ అధినేత వ‌ద్ద‌కు చేర‌డంతో బాబు ఈ త‌గ‌వును ఎట్లా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.

తప్పెవరిది..గ్లోబల్ ఆస్పత్రిదా, నిఖిల్‌దా?

  లేని దాని కోసం పరిగెత్తడం మనిషికి అలవాటే. ఆ కోవలోకే డబ్బు, అందం, మరేదైనా కావచ్చు. కాని అది మనకి అందుతుందా లేదా అన్నది అర్థం చేసుకోకపోవడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. తాజాగా నిఖిల్ రెడ్డి అనే యువకుడు 5.7 హైట్ ఉన్నాడు. దేవుడిచ్చిన దానితో తృప్తి చెందక, అసాధ్యమని తెలిసి కూడా ఎత్తు పెరగడానికి ఉన్న అన్ని మార్గాలు ట్రై చేశాడు. చివరికి ఇతగాడి పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలోని వైద్యులను తన హైట్ పెంచాల్సిందిగా కోరాడు. నిఖిల్ కోరికను క్యాష్ చేసుకునేందుకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు రెడీ అయ్యారు. కాళ్లలో రాడ్లు వేసి హైటు పెంచుతామని 7 లక్షలు రెడీ చేసుకోమని చెప్పారు.   తల్లి దండ్రులకు మాట మాత్రమైనా చెప్పకుండా ఆపరేషన్‌కి రెడీ అయ్యాడు నిఖిల్. డాక్టర్లు కూడా పేరేంట్స్‌కి సమాచారం అందించకుండా నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆపరేషన్ చేశారు. తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించకపోయేసరికి నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఖిల్ సెల్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించారు. హస్పటల్ బెడ్ మీద తమ కుమారుడి పరిస్థితిని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు సమాచారం అందించకుండా ఆపరేషన్ చేయడమేంటని వారు ప్రశ్నించారు. అయితే నిఖిల్ మేజర్ కాబట్టి ఆపరేషన్ చేశామని వైద్యులు చేబుతున్నారు.   ఇక్కడ నేరం ఎవరిదని చూస్తే నిఖిల్ అత్యాశ, హస్పటల్ కాసుల కక్కుర్తి అని చెప్పవచ్చు. ఒక వయసు దాటిన తర్వాత హైట్ పెరగడం సాధ్యం కాదని తెలియకపోవడం, ఒక వేళ ఆ విషయం తెలిసినా మన ప్రయత్నం మనం చేద్దామని అనుకోవడం నిఖిల్ తప్పు. నిఖిల్‌కి తన తప్పు తనకి తెలియజెప్పి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయేదానికి కాసుల కోసం కక్కుర్తిపడి నిఖిల్‌ను పూర్తిగా అవిటివాడిని చేశారు గ్లోబల్ వైద్యులు. తల్లిదండ్రుల తప్పు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తమ కుమారుడికి హైట్ పెరగడంపై తీవ్రమైన కోరిక ఉందని గుర్తించకపోవడం ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు. అంతా కలిపి బలి పశువయ్యింది మాత్రం నిఖిల్.

చెమటలు పట్టిస్తున్న పనామా పేపర్స్

  పనామా పేపర్స్ ప్రజంట్ ఈ పేరు వింటే చాలు సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ప్రముఖులకు చెమటలు పడుతున్నాయి. ఏ క్షణంలో ఎవరి ముసుగు తొలగిపోతుందో..ఎవరి భండారం బయట పడుతోందోనని బడా బాబుల గుండెలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా పరిగెడుతున్నాయి. మొసాక్ ఫోన్సెకా అనే న్యాయసేవల సంస్థ నుంచి లీక్ అయిన కోట్లాది పత్రాలు ప్రపంచంలోని అనేక మంది కుబేరుల సంపాదనను బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఈ సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశాధినేతల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు ఈ పనామా దెబ్బకి విలవిలలాడిపోతున్నారు.   వ్లాదిమిర్ పుతిన్ , నవాజ్ షరిఫ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ తదితరులు జాబితాలో ఉన్నారు. అయితే వీరు ఆ వార్తలన్నీ తూచ్ మాకేం సంబంధం లేదు. మేము చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామంటూ నీతివాక్యాలు చెబుతున్నారు. ఇప్పటికే దీని దెబ్బకి ఐర్లాండ్ పీఠం కదిలింది విదేశీ కంపెనీల్లో మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారని బయటపడటంతో ప్రధాని సిగ్ముండర్ డేవిడ్ గున్లాగ్సన్ రాజీనామా చేశారు. ఆయన గద్దె దిగాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ఐస్‌ల్యాండ్ పరిమితమయ్యేలా కనిపించడం లేదు. చిలీ అధ్యక్షుడు గొంజాలో డెలివియు, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకో,నైజీరియా అధ్యక్షుడు బుకోలా సరాకీ ఇలా ప్రపంచాన్ని కనుసైగతో శాసించే వారంతా బ్లాక్ మనీ బాధితులే అని తేలడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. వీరిపై ప్రజల్లో ద్వేష భావం కలగడానికి ముందే వీరంతా నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.   ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే నల్లధనాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశంగా ఇప్పటికే భారత్‌కి పేరుంది. ఇప్పుడు దీని వల్ల దేశానికి కొత్తగా వచ్చిన మచ్చంటూ ఏమి లేకపోయినా మనం మంచి వారని అనుకుంటున్న వారంతా నల్లకుబేరులని తెలిసే సరికి సగటు భారతీయుడు విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. పనామా పేపర్స్ మరికొంత మంది పేపర్లు విడుదల చేయడానికి రెడీ అవుతోంది. దీంతో నల్ల కుబేరులు ఎవరా అని ప్రజలు..ఎక్కడ గుట్టు బయట పడుతుందోనని బడా బాబులు కిందా మీద పడుతున్నారు.

విజ‌య్ కాంత్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా వైదొలుగుతారా?

  త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌కు త్వ‌ర‌లో జ‌ర‌గనున్నఎన్నిక‌ల్లో హాట్ ఫేవ‌రేట్ , కింగ్ మేక‌ర్ గా భావిస్తున్న కెప్టెన్ విజ‌య్ కాంత్ కు పొలిటిక‌ల్ క‌ష్టాలు స్టార్ట‌య్యాయి. డీఎంకే, అన్నాడీఎంకేల‌కు స‌పోర్ట్ ఇస్తానంటూ ఊరించి, ఊరించి చివ‌రికి ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐల‌తో కూడిన పీడ‌బ్ల్యూఎఫ్ కూట‌మికి మ‌ద్థ‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చారు విజయ్ కాంత్. త‌ను అనుకున్న ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని సాధించారు.   అయితే ఇదంతా బాగున్న‌ప్ప‌టికి విజ‌య్ కాంత్ నిర్ణ‌యాన్నిడీఎండీకేలోని సీనియ‌ర్లు కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. తొలుత ఈ నిర్ణ‌యాన్నిస్వాగ‌తించిన ఎగ్జిట్ పోల్స్ రిజ‌ల్ట్స్ వ‌చ్చిన త‌ర్వాత చాలా మంది త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. జ‌య‌ల‌లిత‌కు మ‌ద్ద‌తిచ్చుంటే బాగుండేద‌ని వారు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఇన్ని వ్య‌తిరేక‌త‌లు, సర్వేలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ మ‌ద్థ‌తు విష‌యంలో పున‌రాలోచిస్తారా లేక రాక రాక వ‌చ్చిన ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని వ‌దులుకుంటారా అనేది వేచి చూడాలి.