రాజన్‌కు రెండవ ఛాన్స్..!

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను ఆ పదవిలో ఉంచుతారా..? లేదంటే ఉద్వాసన తప్పదా..అంటూ బ్యాంకింగ్‌తో పాటు దేశ ఆర్థిక నిపుణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌తో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ పదవికాలం ముగుస్తుంది. దీంతో ఆయనకు రెండోసారి అవకాశమివ్వకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.  అమెరికా గ్రీన్ కార్డ్ పొందిన రాజన్..మానసికంగా భారతీయుడు కాదని, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో వెళ్లకుండా రాజన్ అడ్డుకున్నారని, తక్షణం ఆయనను ఆర్‌బీఐ గవర్నర్ జనరల్‌ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధాని మోడీకి సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు.   స్వామి వ్యాఖ్యలు..ఆర్‌బీఐ కొత్త గవర్నర్ నియామకం తదితర అంశాలపై ప్రధాని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ..ఆర్థిక రంగ నిపుణులతోనూ చర్చించారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేయడంతో పాటు..2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించి భారత్‌ను పెను ప్రమాదంలోంచి రక్షించిన ఘనత రాజన్ సొంతం. అధికారంలోకి వస్తూనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి బ్యాంకింగ్ రంగాన్ని జెట్ స్పీడుతో పరుగులెత్తించారు. ఆయన పనితీరును గుర్తించిన వరల్డ్ బ్యాంక్ మ్యాగ్‌జైన్ రాజన్‌ను కేంద్ర బ్యాంక్ ఉత్తమ గవర్నర్‌గా కొనియాడింది. అటువంటి ట్రాక్ రికార్డు కలిగిన రాజన్ పట్ల స్వామి వ్యాఖ్యలు ఏ మాత్రం ప్రభావం చూపించలేవని స్పష్టమవుతోంది. దీనికి తోడు రాజన్ పనితీరును సాక్షాత్తూ ప్రధాని ప్రశంసించడంతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఆయన్ని గవర్నర్‌గా కొనసాగించాలని కోరుతున్న నేపథ్యంలో రాజన్‌ను రెండవసారి కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇరాన్‌తో ఒప్పందం- పాకిస్తాన్‌కు చెక్

ఇరాన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఒక కీలకమైన ఒప్పందం మీద సంతకం చేశారు. ఇరాన్‌ తీర ప్రాంతంలోని చాబహర్‌ నౌకాశ్రయంలో మన దేశం మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఈ ఒప్పందంలోని సారాంశం. ఎక్కడో ఇరాన్‌లోని ఓ తీరం మీద మన దేశం ఇంత భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతోంది? అంటే సహేతుకమైన జవాబులే వినిపిస్తాయి. పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలలోకి వెళ్లాలంటే దారిలో ఉన్న పాకిస్తాన్‌ను దాటుకుని వెళ్లాల్సిందే! ఇందుకోసం ఆ దేశం సహజంగానే సవాలక్ష సవాళ్లను విసురుతుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో మన దేశం ప్రస్తుతం ఎలాంటి వ్యాపారమూ చేసే స్థితిలో లేదు.    చాబహర్‌ నౌకాశ్రయం కనుక పూర్తయితే సముద్రమార్గం గుండా, చాలా తేలికగా ఆయా దేశాలకు రవాణాను సాగించవచ్చు. అంతేకాదు! ఈ నౌకాశ్రయంతో పెరిగే రాకపోకల వల్ల ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, భారతదేశాల మధ్య బంధం మరింత దృఢపడనుంది. నిజానికి ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లు ఇస్లాం దేశాలే అయినప్పటికీ... పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదంతో, ద్వంద్వ నీతితో తలబొప్పి కట్టించుకున్నవే. అందుకే ఆ రెండు దేశాలూ కూడా ఇండియా పట్లే ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఇక చాబహర్ పోర్టుతో చైనా మీద కూడా మన దేశం పై చేయి సాధించినట్లయ్యింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న గ్వదర్‌ అనే తీర ప్రాంతంలో చైనా తిష్ట వేసింది. అక్కడ ఓ భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మన దేశానికే సవాలు విసురుతోంది. ఇప్పుడు గ్వదర్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాబహర్‌లో మన దేశం పోర్టుని నెలకొల్పి ఆ సవాలుకి దీటైన జవాబుని అందించనుంది.

ఇస్రోనా మజాకా!

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కావచ్చు. కానీ మన అంతరిక్ష పరిశోధనలు మాత్రం ప్రపంచంలోని ఏ దేశానికీ తీసిపోవని దశాబ్దాల క్రితమే నిరూపితం అయ్యింది. మన అంతరిక్ష పితామహుడు విక్రమ సారభాయ్‌ ఏ లక్ష్యంతో అయితే ఇస్రోకు బీజం వేశారో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సతీష్‌ ధావన్‌, అబ్దుల్ కలాం వంటి వందలాది శాస్త్రవేత్తలు తమ మేధస్సుని ధారపోశారు. కుటుంబ జీవితాన్ని సైతం దూరం చేసుకుని తమ జీవితాలను అంకితం చేశారు. అలాంటివారి కృషితో సాగుతున్న ఇస్రో అద్భుతాలు సాధించక ఏం చేస్తుంది. గత నెలలోనే ఇస్రో నావిక్‌ పేరుతో మనదైన ఓ సప్తర్షి మండలాన్ని ఏర్పరుచుకుంది. ఏడు ఉపగ్రహాల సాయంతో పనిచేసే ఈ నావిక్‌ వ్యవస్థ ఇక నుంచి అంతరిక్షం నుంచి మనకు కావల్సిన దారులను చూపించనుంది.   ఆ విజయం తాలూకు జ్ఞాపకాలు చెదిరిపోక ముందే అమెరికా సైతం చేతులెత్తేసిన ‘రీయూజబుల్ లాంచ్‌ వెహికల్‌’ (RLV) ను నేడు విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇప్పటివరకూ అంతరిక్షంలోకి వెళ్లిన వాహనాలను తిరిగి ఉపయోగించే పరిస్థితి లేదు. కానీ ఇస్రో అలాంటి స్థితికి గుడ్ బై చెప్పనుంది. RLV తరహా వ్యోమనౌకలు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావడానికి కనీసం మరో దశాబ్దం అన్నా పట్టవచ్చు. ఇవాళ జరిగిన ప్రయోగం ఆ భవిష్యత్తుకు ఒక పునాది రాయి మాత్రమే! ఇస్రో కనుక RLVకి ఒక తుది రూపుని అందించగలిగితే అంతరిక్షయానాలకి అయ్యే ఖర్చు దాదాపు పదో వంతుకి తగ్గిపోతుంది. దాంతో ఉపగ్రహాలను ప్రయోగించాలన్నా, వ్యోమగాములు ఇతర గ్రహాలకు వెళ్లిరావాలన్నా విమానం ఎక్కినంత సులువైపోతుంది. ఇస్రో ఆ ఘనతలు సాధిస్తుందనడంలో ఎవరికీ ఏ అనుమానం లేదు కదా!

కశ్మీర్‌లో పోలీసుల హతం!

కశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ అదుపుతప్పుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన వేర్వేరు సంఘటనలో ముగ్గురు పోలీసులను తీవ్రవాదులు కాల్చిచంపారు. తీవ్రవాదుల చేతిలో పోలీసులు బలి కావడం మూడు సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. భారత్‌- పాక్‌ సరిహద్దుల వద్ద పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నా, కశ్మీర్‌లో మాత్రం అలజడి చెలరేగుతోందని ఇలాంటి సంఘటనలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ కశ్మీర్ లోయనుంచి తీవ్రవాదులతో సైనికులు పోరు జరుపుతున్న వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజలు సైతం సైనికుల మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న వేర్పాటువాదుల గొంతుక నానాటికీ బలపడుతోంది.    ఈ తరహా ఉపద్రవాలను ఖండించాల్సిన వివిధ పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లిప్తంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జాతీయవాదాన్ని ఒలకబోసే భాజపా, కశ్మీర్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శలు చెలరేగుతున్నాయి. శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో జరిగిన వివాదమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ వివాదంలో జాతీయతకు అనుకూలంగా నినదించిన విద్యార్థులనే చితకబాదిన ఉదంతం మీడియాలో సంచలనం సృష్టించింది. ఒక పక్క తీవ్రవాదులు, మరో పక్క వేర్పాటువాదులు, ఇంకో పక్క రాజకీయ అవకాశవాదులు... వీరందరి మధ్యా పావులుగా మిగులుతున్నది మాత్రం కశ్మీర్‌ పౌరులే. మరి ఇలాంటి సందర్భంలో వారు సంయమనంతో వ్యవహరిస్తారా లేకపోతే వేర్పాటువాదం వైపు మొగ్గు చూపుతారా అన్నది ఓ భయపెట్టే ప్రశ్నే!

గేల్ "బ్యా (ఘా)టు" వ్యాఖ్యలు..మరో వివాదం

మైదానంలో బంతిని బలంగా బాదే వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఈ క్రికెటర్‌ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరపున ఆడుతున్న గేల్ తాజాగా బ్రిటిష్ దినపత్రిక " ద టైమ్స్" మహిళా జర్నలిస్ట్ "చార్లెట్ ఎడ్వర్డ్స్‌"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనది " చాలా పెద్ద బ్యాటు "అని నువ్వు "థ్రిసమ్‌"కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అంటూ వెకిలిగా అడిగాడు. ఈ ఇంటర్వ్యూ ఇటు క్రికెట్ ప్రపంచంతో పాటు, అంతర్జాతీయంగాను దుమారం రేపుతోంది.   క్రిస్‌గేల్‌కు వివాదాలు కొత్త కాదు.. మైదానంలో పరుగుల సునామీ సృష్టించే ఈ విధ్వంసకర ఆటగాడు మంచి "కళా పోషకుడు" అని అతని వివాదాలు తెలియజేశాయి. ఎన్నోసార్లు కొత్త కొత్త అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న ఫోటోలను గేల్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేసేవాడు. ఇది కాస్తా శృతి మించి అతని లీలలు ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన "ఫాక్స్‌ స్పోర్ట్స్‌" రిపోర్టర్ "నెరోలి మెడోస్‌"తో నీ అందాన్ని చూస్తూ ప్రశ్న వినలేకపోయాను అంటూ వ్యాఖ్యానించాడంట. అంతటితో ఆగకుండా ట్విట్టర్ ద్వారా డిన్నర్‌కు రమ్మని తర్వాత డేటింగ్‌కు వెళదామని కోరాడంటూ ఆమె బయటపెట్టేసరికి క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది.   అంతేకాకుండా 2015 వరల్డ్‌కప్ సమయంలో వెస్టిండిస్ జట్టుతో పనిచేసిన ఒక ఆస్ట్రేలియన్ మహిళ గేల్ వెకిలి చేష్టలతో షాక్‌కు గురై తన అనుభవాలను మీడియా ముందుంచింది. ఆకలితో ఉన్న నేను శాండ్ విచ్ తీసుకోవడం కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళినప్పుడు క్రిస్ టవల్ కట్టుకుని ఉన్నాడు. అప్పుడు అతగాడు వెంటనే టవల్ తీసేసి "దీనిని చూసేందుకే వచ్చావా" అంటూ అభ్యంతరకరంగా మాట్లాడాడని వాపోయింది. ఐపీఎల్‌లో వరుసగా ఆడుతున్నప్పటికి సభ్యతగా వ్యవహరించిన క్రిస్‌గేల్ ఈ సారి ఇక్కడ కూడా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. జరిగిన ఘటన గురించి "ద టైమ్స్" జర్నలిస్ట్ చార్లెట్ ఎడ్వర్డ్స్ వెళ్లడించింది. తనది ప్రపంచంలోనే "పెద్ద బ్యాటు" అని దానిని ఎత్తడానికి నీకు రెండు చేతులు అవసరమవుతాయి అని అసభ్యంగా మాట్లాడాడు. ఎంతమంది నల్లజాతి పురుషులతో గడిపావని నన్ను గుచ్చి గుచ్చి అడుగుతూ..నువ్వెప్పుడైనా "థ్రిసమ్‌"కు పాల్పడ్డవా ? నువ్వు చేసే ఉంటావు అని వెకిలి వ్యాఖ్యలు చేశాడని చార్లెట్ వివరించింది. గత వివాదాలలోంచి చచ్చి చెడి బయటపడిన గేల్ తాజా వివాదం నుంచి ఎలా బయటపడతాడో..వేచి చూడాలి.

కేరళ క్యాస్ట్రో అంటూనే.. పొమ్మన్నారు..?

వీ.ఎస్.అచ్యుతానందన్...కేరళ రాజకీయాల్లోనే కాదు, ప్రస్తుత భారత రాజకీయాల్లోనూ కురువృద్ధుడు. కేరళ ఫిడెల్ క్యాస్ట్రోగా, రైతు బాంధవుడిగా, మచ్చలేని వ్యక్తిగా తనదైన ముద్రవేసిన వ్యక్తికి ఘోర అవమానం జరిగింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా..? అంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. సీఎం రేసులో అచ్యుతానందన్, పినరయి విజయన్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ను ఖరారు చేస్తూ సీపీఎం అగ్రనాయకత్వం నిర్ణయించింది. సీఎం ఎన్నికపై నిన్న తిరువనంతపురంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ సమావేశం నిర్వహించారు. అయితే చివరి వరకు వేచి చూసిన అచ్యుతానందన్‌కు నిరాశే మిగిలింది. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయనను ఈ పదవికి ఎంపిక చేయలేకపోతున్నామని..కాని ఆయన సేవలు మాకు ఎల్లవేళలా అవసరం అని సీతారాం ఏచూరి తెలిపారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అచ్యుతానందన్ ఆవేశంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.   93 ఏళ్ల అచ్యుతానందన్‌ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు. స్వతంత్ర పోరాటంలోనూ, అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేకాదు సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ పనిచేశారు. సీఎంగా రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రొత్సహించి, ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఉచిత సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఘనత ఆయన సొంతం. పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందారు. 93 ఏళ్ల వయసులోనూ పార్టీ అప్పగించిన బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని ఎల్‌డీఎఫ్‌ను అధికారంలోకి తెచ్చారు. రోజుకో జిల్లా చొప్పున తిరుగుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అలాంటి ఆయనకు సీఎంగా అవకాశం రాకపోవడంతో కాస్త కోపంగానే ఉన్నారు. కనీసం రెండేళ్లయినా ముఖ్యమంత్రిగా చేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు.   అటు ఆయన అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన్ను ఉపయోగించుకుని తీరా గెలిచిన తర్వాత అచ్యుతను వయసు పేరు చెప్పి పక్కన బెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ప్రచారం చేసినప్పుడు అచ్యుతానందన్ వయసు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. అటు వృద్ధ సింహన్ని బుజ్జగించేందుకు సీపీఎం అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. మరి అచ్యుతానందన్ అలక వీడుతారా? లేదంటే తను అనుకున్నది సాధించేందుకు ఇంకేమైనా చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.  

టీడీపీ-బీజేపీల మధ్య "మాణిక్యాల" వారథి కాగలరా..?

సరిగ్గా 10 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చేసింది. దాని ప్రభావం తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. మిత్రపక్షంగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని టీడీపీకి ఇంటా బయటా విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కమలంతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జరిగింది. బీజేపీ కూడా దీని గురించే ఎదురు చూస్తొందన్న వార్తలు వినిపించాయి. అయితే టీడీపీ వల్ల జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకున్న బీజేపీకి లాభాలే ఎక్కువ కనిపించడంతో..  టీడీపీతో ఘర్షణ వైఖరికి బదులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వెళ్లాలని యోచిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ద్వారా జనంలోకి ఆ సందేశాన్ని పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయడం లేదని ఇప్పటికే ఢిల్లీ లెవల్లో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు పార్లమెంట్‌లో ఏపీ ప్రత్యేకహోదాపై తేల్చిసిన సందర్భం నుంచి మిత్రపక్షమైన టీడీపీ నేతల నుంచి బీజేపీకి విమర్శలు ఎక్కువయ్యాయి. బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదనట్టు టీడీపీపైనా, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా ఎదురుదాడికి దిగారు. ఏపీలో బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం సపోర్ట్ ఉండాలని భావించిన కమలనాథులు..టీడీపీతో సమరం కంటే సఖ్యతకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. రేసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి మాణిక్యాలరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన కంభంపాటి హరిబాబు, టీడీపీతో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నేత కోసమే బీజేపీ అన్వేషిస్తోంది.   వీర్రాజుకు అధ్యక్షపదవి ఇస్తే..టీడీపీతో నేరుగా బాహాబాహీకి సంకేతాలిచ్చినట్టే. పురంధేశ్వరికి, టీడీపీ అధినేతకు వున్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మాణిక్యాలరావు సంగతి చూస్తే వివాదరహితుడు, అందరిని కలుపుకు వెళ్లే వ్యక్తిత్వంతో పాటు చంద్రబాబు వద్ద వెయిటేజ్ ఉన్న వ్యక్తి. అన్నింటి కంటే ముఖ్యంగా కపు వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గాన్ని దరి చేర్చుకోవచ్చు ఇన్ని ప్లస్‌లు ఉండటంతో బీజేపీ పైడికొండల వైపే మొగ్గు చూపపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీని సంతృప్తి పరచడానికి కమలనాధుల వద్ద ఉన్న మరో అస్త్రం కేంద్రమంత్రి  పదవి. ఇప్పటికే కేంద్రంలో టీడీపీకి రెండు పదవులిచ్చిన బీజేపీ, త్వరలో మరోక మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ రకంగా తమ మధ్య విభేదాలు లేవన్న సంకేతాలతో పాటు, మిత్ర పక్షమంటే తమకు ఎంత గౌరవమో ప్రపంచానికి చూపించాలనుకుంటోంది. మరి బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.  

విజయ్‌కాంత్‌కు పొంచి ఉన్న మరో ముప్పు...

ఎదో తెలుగు సినిమాలో ఒక పాటుంది.."అంతన్నాడు..ఇంతన్నాడే గంగరాజు" అని ఎన్నికలకు ముందు తనంతటి వాడు లేడన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడాడు.. సీఎం కుర్చీ ఈ సారి ముమ్మాటికీ తనదేనన్నాడు.. తన తోటి నటుడ్ని పిరికివాడన్నాడు..ఆయనేవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. ఆ మహానుభావుడు ఎవరో కాదు సినీనటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్. తమిళనాడు ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారనుకున్న కెప్టెన్ బొక్కబొర్లాపడ్డారు. సారీ.. అమ్మ హవాలో కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమిగా ఏర్పడి ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచారు విజయ్‌కాంత్. సీఎం కుర్చీ సంగతి పక్కన బెడితే తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.   ఓటమితో ముఖం చూపించుకోలేకపోతున్న విజయ్‌కాంత్‌కు మరో గండం పోంచి ఉంది. ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు కలిగి ఉండాలి. పీడబ్ల్యూపీతో జతకట్టి కెప్టెన్ పెద్ద పొరపాటు చేశారని అదే కరుణతో చేతులు కలిపినట్లైతే ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2006 ఎన్నికల్లో విజయ్‌కాంత్ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని 10 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2011లో అన్నాడీఎంకేతో జట్టుకట్టి అమ్మ దయతో 29 సీట్లు గెల్చుకున్నారు. జయ విధానాలు నచ్చకపోవడంతో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు తమ కూటమిలో చేరాలని ఆహ్వానించినా తానే సీఎం కావాలనే లక్ష్యంతో నాలుగు పార్టీలతో ఏర్పడిన పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ నిర్ణయం పార్టీకి చేటు తెస్తుందని సీనియర్లు వారించినా కెప్టెన్ వినలేదు. చివరకు అదే నిర్ణయం ఆయనకు శరాఘాతమైంది.

నీట్‌పై కేంద్రం కొత్త ట్విస్ట్..

మెడికల్, బీడీఎస్ ప్రవేశాల్లో దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ ఉండాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రోజుకోక వివాదం రేగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలోకి కేంద్రప్రభుత్వం ఎంటరై..కొత్త ట్విస్ట్ ఇచ్చింది. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ  ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు రాశారు. జూలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు నీట్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలతో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. దీంతో మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ తప్పక రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాదాపు 14 రాష్ట్రాలు నీట్ రద్దు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.   నీట్ నిర్వహణపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించారు. ఈ సమావేశంలో సుప్రీం తీర్పుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించి ప్రధాని నిర్ణయం కోసం వేచి చూశారు. ఇవాళ మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో నీట్, సుప్రీంకోర్టు, రాష్ట్రాల అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతిమంగా ఒక సంవత్సరం పాటు నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీని వల్ల మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ , ప్రైవేట్ మేనేజ్‌మెంట్ సీట్లకు మాత్రం నీట్‌ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాలు హర్షం వ్యక్తం చేశాయి. నీట్ టెన్షన్‌ నుంచి ఆర్డినెన్స్‌ ద్వారా ఉపశమనం కల్పించినందుకుగాను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.   

కరుణను "సన్‌"స్ట్రోక్ దెబ్బతీసిందా..?

నిన్న విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కన్నా పెద్ద షాక్ తగిలింది ఎవరికి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు డీఎంకే అధినేత కరుణానిధి. ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు సహా..తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్ర కూడా కరుణకే అనుకూలంగా ఉంది. కానీ వాటన్నింటిని తలకిందులు చేస్తూ తమిళనాడు ఓటర్లు అమ్మకు జై కొట్టడంతో కరుణ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. అయితే ఈ ఓటమికి అధికారపక్షం బలం, విపక్షాల అనైక్యతే కారణమని అందరూ అనుకుంటున్నారు. కాని వీటన్నింటి కంటే ముఖ్యంగా డీఎంకేను దెబ్బ తీసిన వ్యక్తి స్వయానా కరుణ పెద్ద కుమారుడు ఆళగిరి.   తన వారసుడిగా రెండో కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు కరుణ. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేని ఆళగిరి తన అక్కసును బాహాటంగానే వెళ్లగక్కారు. అన్నాదమ్ముల మధ్య చీలికలు పార్టీ ప్రతిష్టను వీధిలో పడేస్తుంటే పెద్దకుమారుడిని మధురై పంపేసి అక్కడ నుంచే ఆ ప్రాంతంలోని పార్టీ కార్యకలాపాలు చూడాలని ఆదేశించారు కరుణానిధి. పెద్దవాడినైన తనను కాదని తమ్ముడికి పార్టీలో ప్రాధాన్యమివ్వడాన్ని ఆళగిరి తట్టుకోలేకపోయారు. చివరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కరుణ. ఈ సమయంలో ఎన్నికలు రావడం డీఎంకే గెలిస్తే కరుణానిధి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించినా..ఆయన వారసుడిగా స్టాలిన్ సీఎం పీఠం ఎక్కుతారని ప్రచారం సైతం జరిగింది. ఈ సారి ఎలాగైనా డీఎంకేను ఓడించి తన తండ్రి, తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అళగిరి భావించారు.   మధురై ప్రాంతానికి అళగిరి నియంత లాంటి వాడు. అక్కడ ఆయన గీసిందే గీత..చేసిందే చట్టం అలాంటి చోట్ల కనుసైగ చేస్తే చాలు డీఎంకేను నిలువరించడం ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడే అళగిరి చక్రం తిప్పాడు. తాను ఈ సారి డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే జనం ఆయన మాటకు కట్టుబడ్డారు. మద్దతుదారులంతా కలిసి డీఎంకేకు వ్యతిరేకంగా పనిచేశారట. దీంతో మధురై, తిరునెల్వేలి, తేని, దిండిగల్, విరుద్‌నగర్ జిల్లాల్లో అన్నాడీంకే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మొత్తానికి దాయాదుల పోరు ఆరోసారి కర్చీ ఎక్కే అరుదైన అవకాశాన్ని దూరం చేసింది. దీనిలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జయ విజయంతో అళగిరి మధురైలో తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారని సమాచారం.

తుమ్మలకు కలిసివస్తున్న ఎన్నికలు

తెలంగాణ ఆవిర్భావం తరువాత తెదెపా నుంచి తెరాసకు వలస వరుస కట్టిన నేతలలో ముఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు.  అధికార పార్టీ బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు ఇలా గట్టుదాటేయడం కొత్తేమీ కాదు. కానీ ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న తుమ్మల ఆ తరువాత తెరాసలోనూ తన హవాను కొనసాగించడమే ఆశ్చర్యం. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్న ప్రాధాన్యత గ్రహించిన తెరాస ఆయనను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా, మంత్రిపదవిని కూడా కట్టబెట్టింది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన తుమ్మలకు ఇది అరుదైన గౌరవమే. కానీ ఆయన కూడా తనకు దక్కిన దానితో తృప్తిగా ఉండిపోలేదు.   ఖమ్మంలో ఒకప్పుడు తెదెపాకు ఉన్న క్యాడర్‌ను నిదానంగా తెరాస వైపు మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. ఇంతలో ఖమ్మం నగరపాలిక ఎన్నికల నగారా మోగనే మోగింది. అప్పటికే హైదరాబాదులో గ్రేటర్‌ ఎన్నికలలో పట్టరాని విజయం సాధించిన తెరాసకు ఖమ్మం ఒక సవాలుగా నిలిచింది. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాల హవా ఉన్న ఖమ్మం ఖిల్లాలో తెరాసను నెగ్గించుకోవడం తుమ్మలకు సవాలుగా మారింది. అందుకే పకడ్బందీగా ఎన్నికల ప్రచారాలను సాగించి, ఓటర్లను ఆకర్షించి ఖమ్మం నగరపాలిక ఎన్నికలలో తెరాసను గెలిపించుకున్నారు. ఆ ఎన్నికలతో తుమ్మల ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. ఆ విజయోత్సాహాలు ముగిశాయో లేదో... పాలేరులో ఉప ఎన్నికలు వచ్చేశాయి. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెకంటరెడ్డి చనిపోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు వచ్చిన ఎన్నికలను తుమ్మల బాగానే ఉపయోగించుకున్నారు. సాధారణంగా ఎవరన్నా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారికి సానుభూతిగా మిగతా పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా తటస్థంగా ఉండిపోతాయి. కానీ తెరాస ఈ అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధపడలేదు. తెరాస తరఫున అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు వరంలా కనిపించింది. ప్రస్తుతం తెరాసకి ఉన్న ఊపుకి, తుమ్మల యంత్రాంగం తోడై పాలేరు తెరాస వశమైంది. కేసీఆర్‌ మాటల్లోనే చెప్పాలంటే పాలేరు చరిత్రలోనే తెరాస అద్భుతమైన విజయాన్ని సాధించింది.

కౌన్‌ బనేగా కేరళ సీఎం..!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ గాడ్స్ ఓన్ స్టేట్ కేరళలో వామపక్షాలు మళ్లీ పాగా వేశాయి. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో అధికార యూడీఎఫ్ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది, ఎల్డీఎఫ్ 91 సీట్లను గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతా బాగానే ఉంది కాని సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారా..? అని రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్, సీపీఎం రాష్ట్ర  మాజీ కార్యదర్శి పినరయి విజయన్ సీఎం రేసులో ఉన్నారు.   కేరళతో పాటు దేశ రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరుపొందిన అచ్యుతానందన్ 90 ఏళ్లు పైబడినా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు సచ్ఛీలుడిగా పేరుంది. గత ఎన్నికల్లో సీఎం కుర్చీకి రెండు అడుగుల దూరంలో ఆగిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని మంతనాలు సాగిస్తున్నారు. ఇక విజయన్ సంగతి చూస్తే సుమారు 15 సంవత్సరాల తర్వాత తిరిగి రాజకీయ ప్రవేశం చేసిన విజయన్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో రెండుసార్లు విజయన్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో అచ్యుతానందన్ సీఎంగా ప్రచారం కావడంతో విజయన్ తప్పుకున్నారు. అయితే ఈ సారి విజయన్ పోటీలో నిలిచారు. వయోభారంతో అచ్యుతానందన్ తప్పుకుంటారని అందరూ భావించారు. కానీ ఇటీవల ఆయన మాట్లాడుతూ రేసులో నేను ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో కేరళ సీఎం ఎవరన్నది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. రేపు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి స్థానంపై ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయి. లేదంటే ఇద్దరూ బాధ్యతలు పంచుకోవచ్చని ఊహగానాలు వినిపిస్తున్నాయి.  

బెంగాల్‌లో కమ్యూనిస్టుల కథ ముగిసినట్లేనా..?

భారతదేశ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్టుల పాత్ర చాలా ప్రత్యేకం. అధికారంలో ఎవరున్నా వారి మాటకు ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా ఉంటుంది వారి తీరు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆవిర్భవించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు హోరాహోరిగా తలపడ్డారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావించడంతో కమ్యూనిస్టుల ప్రభ మసకబారుతూ వచ్చింది. అయితే పశ్చిమబెంగాల్‌ మాత్రం వారికి ప్రత్యేకం. దశాబ్దాలకు దశాబ్దాలు అక్కడ అధికారంలో ఉండటం ద్వారా బెంగాల్‌ను వారు కంచుకోటగా మలుచుకున్నారు. వరుసగా 23 సంవత్సరాల పాటు జ్యోతిబసు ముఖ్యమంత్రిగా బెంగాల్‌ను చక్రవర్తిలా పాలించి దేశ రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించారు.   అలాంటి ఎర్రకోటను మమతాబెనర్జీ బద్దలు కొట్టారు. ఏడేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లో మమత తొలిసారి బెంగాల్‌ గడ్డపై తన ఆగమనాన్ని ఘనంగా చాటి హెచ్చరించారు. దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా గాలి కోదిలేయడంతో ముప్పు ముంచుకువచ్చింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎర్రసైన్యానికి షాకిచ్చారు మమత. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన ఎర్రన్నలు 75 స్థానాలతో సరిపెట్టుకున్నారు. దానిలోనూ కాంగ్రెస్ వాటానే ఎక్కువ లెఫ్ట్ కూటమికి 30 స్థానాలే వచ్చాయి. ఐదేళ్ల కిందటి ఫలితాలతో పోలిస్తే కమ్యూనిస్టులకు ఇది దారుణమైన ఓటమే అవుతుంది. క్రితం సారి ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలన్నీ కలిసి 60 సీట్లు సాధించాయి. ఇప్పుడు ఈ ఎర్ర పార్టీలన్ని కలిపి కేవలం 35 సీట్లకు పరిమితం అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో మమత విజయం ఖాయమని స్పష్టంగా కనిపించినా..శారదా కుంభకోణం, నిరంకుశ వైఖరి, అవినీతి తదితర కారణాలతో ఓటర్లు తమ పక్షాన నిలుస్తారని కమ్యూనిస్టులు భావించారు. దీనిని బట్టి   బెంగాల్లో "ఎర్ర" కథ ముగిసినట్లు కాదా..! 

కరుణానిధి కొంప ముంచిన విజయ్‌కాంత్‌

తమిళనాట ఈసారి వృద్ధ పెన్నిధి కరుణానిధికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అందరూ ఆశించారు. పార్టీను మార్చి మార్చి ఎంచుకునే తమిళ తంబిలు ఈసారి తనకే పట్టం కడతారని పాపం కరుణ కూడా ఎదురుచూశారు. కానీ సినిమాల్లో హీరో పాత్రను పోషించే విజయ్‌కాంతే తమ పాలిట విలన్‌గా మారతాడని ఆయన ఊహించనేలేదు. ఇప్పటివరకూ అందిన ఫలితాలను గమనిస్తే విజయ్‌కాంత్‌ పార్టీ అయిన డీఎండీకే కానీ దానికి అనుబంధంగా పోటీ చేస్తున్న ఇతర చిన్నాచితకా పార్టీలు కానీ అసలు ఖాతానే తెరిచే పరిస్థితుల్లో లేవు. దీనంతటికి విజయ్‌కాంత్ అతి విశ్వాసమే కారణం అంటున్నారు విశ్లేషకులు. 2005లో డీఎండీకే పార్టీని ప్రారంభించిన విజయ్‌కాంత్‌ తొలుత చాలా ఓపికగానే తగిన అవకాశాల కోసం ఎదురుచూశారు. 2006 అసెంబ్లీ ఎన్నికలలో ఖాతా తెరిచి ప్రజల తరఫున మాట్లాడటం మొదలుపెట్టారు. విజయ్‌కాంత్‌ మీద నమ్మకం ఉంచిన జనం 2011లో జయలలితతో కలిసి పోటీ చేసినప్పుడు 41 సీట్లకు గాను 29 సీట్లలో ఆయన పార్టీని గెలిపించి శుభసంకేతాలు పంపించారు.    అయితే ఆ విజయంతో విజయ్‌కాంత్‌ తీరు మారిపోయింది. కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే మీదే కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు. దాంతో జయ తనదైన శైలిలో డీఎండీకే ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే వైపు లాక్కునిపోయారు. అది మొదలు జయ మీద కసితో రగిలిపోయారు విజయ్‌కాంత్‌. అలాగని డీఎంకేతోనో, బీజేపీతోనో పొత్తు పెట్టుకున్నారా అంటే అదీ లేదు. తమిళ ప్రజలకు మరో ప్రత్యామ్నాయం చూపుతానంటూ చిన్నాచితకా పార్టీలను చేరదీసి కొత్త కుంపటి పెట్టారు. విజయ్‌కాంత్ చేసిన ఈ పని వల్ల వచ్చిన ఫలితం ఏమిటయ్యా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిట్టనిలువునా చీలిపోయింది. ఇక యోగాసనాలు వేయడం దగ్గర్నుంచీ విలేకరుల సమావేశాల దాకా విజయ్‌కాంత్‌ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కోపంతో తూలిపోతూ, మైకంలో ఊగిపోతూ ఆయన చేసిన సందడిని యూట్యూబుల్లో చూసి మరీ నవ్వుకున్నారు జనం. ఆయన వింత చేష్టలకు భార్య ప్రేమలత ఎన్ని వివరణలు ఇచ్చినా అవి అంతగా పొసగలేదు. చివరికి గద్దె పరుచుకోవల్సిన డీఎండీకే గొయ్యి తవ్వుకుని కూర్చుంది. తనతో పాటుగా పెద్దాయన కరుణ ఆశలను కూడా కుప్పకూల్చింది.  

తెలంగాణలో డీఎస్సీ రద్దు..అంతా టీఎస్‌పీఎస్సీనే..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని కేసీఆర్ సర్కార్ రద్దు చేసింది. దీని స్థానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య జీవో నెం. 19 జారీ చేశారు. దీని ప్రకారం పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్ట్‌లను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించినట్లైంది. దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీ ద్వారా నియమిస్తుండగా..ఇకపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నియమించనున్నారు.   ఏకరూపకత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే  పాఠశాల విద్యా డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో పనిచేసే ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టు‌లను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. డీఎస్సీని తొలగించి టీఎస్‌పీ‌ఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీ చేపట్టాలని కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అనేక తర్జనభర్జనల తర్వాత ఇవాళ దీనికి ఒక స్పష్టత ఇచ్చింది. మరి ఈ నిర్ణయం పట్ల అభ్యర్థులు, విద్యావేత్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఆజ్ఞాతంలోకి "అమ్మ"

వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అందుకోని తమిళనాడులో ఈ సారి ఆ సెంటిమెంట్‌ను తుడిచివేస్తానంటూ జయలలిత ప్రకటించారు. ఆమె అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలు చూసిన వారేవరైనా సరే అలాగే అనుకుంటారు. కాని వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు అమ్మకు షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాలకు మొన్న జరిగిన ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి. దీనిలో ఒక్క దీదీ తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న వారేవరూ రెండోసారి అధికారంలోకి రారంటూ సర్వేలు తేల్చాయి.   అలా ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వారిలో జయలలిత కూడా ఉన్నారు. సర్వే ప్రకారం ఆమె అధికారానికి దూరం కానున్నారు. ఈ ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో చెన్నై పోయిస్ గార్డెన్స్‌లోని సీఎం జయలలిత నివాసం మూగబోయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండటంతో అక్కడ నిశ్శబ్ధం తాండవిస్తోంది. పోలింగ్‌లో ఓటేసిన అనంతరం తన స్నేహితురాలు శశికళతో కలిసి జయ తన నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే పోలింగ్ తీరు తదితర అంశాలపై జయ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆమె మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం తదితర కారణాలతో జయ కూడా ఓటమిని ఊహిస్తున్నట్లున్నారు. దీంతో గత రాత్రి నుంచి ఎవ్వరికీ అమ్మ దర్శనమివ్వలేదు. పోయిస్‌ గార్డెన్‌లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులనూ ఆమె నిరాకరించినట్టు సమాచారం. మొత్తం మీద ఎగ్జిట్‌పోల్స్ అమ్మను ఆజ్ఞాతంలోకి నెట్టాయి.  

తమిళనాడులో "చంద్ర" మాయ..

చంద్రబాబు డైరెక్షన్‌లో కరుణానిధి పనిచేయడమేంటి అనుకుంటున్నారా..ఎంటి ఈ ట్విస్ట్ అని బుర్రలు బాదుకోకండి అక్కడికే వస్తున్నాం..ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మినహా మిగిలిన చోట్ల అధికారం మారుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అంటే అక్కడ అధికారంలో ఉన్న జయలలితకు అధికారం దూరమై..డీఎంకే అధినేత కరుణానిధి సీఎం కాబోతున్నట్టే కదా...! జయలలిత అభివృద్ధిని, ఎన్నికల్లో ఆమె ఆల్‌ఫ్రీ వాగ్దానాన్ని కూడా కాదని ఓటర్లు డీఎంకే వైపు మొగ్గు చూపేలా కరుణ ఏం మాయ చేశారు? అంటే దానికి సమాధానం "రుణమాఫీ" .   రెండేళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయని స్పష్టంగా కనిపించాయి. అయితే రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు. ఈ అస్త్రం దాటికి వైసీపీ కకావికలమై పోయి, టీడీపీని అధికారంలో కూర్చోబెట్టి.. బాబును ముఖ్యమంత్రిని చేసింది. అచ్చం ఏపీ లాంటి పరిస్థితులే తమిళనాట కూడా కనిపించాయి.  జయలలిత ప్రభంజనం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో కరుణానిధి, "చంద్రబాబు రుణమాఫీ" అస్త్రాన్ని ప్రజలపై వదిలారు. ఈ అస్త్రమే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారిందని, అమ్మను కాదని కరుణపై ఓటర్లు "కరుణ" చూపేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎగ్జిట్‌పోల్స్ నిజమవుతాయా..చంద్రబాబు "మంత్రదండం" బాగా పనిచేసిందా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

రాధాను విజయవాడకే పరిమితం చేయడం వెనుక జగన్ ప్లానేంటి..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను ఆ బాధ్యతల నుంచి తప్పించి విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడెక్కడ..నగర పార్టీ అధ్యక్షుడెక్కడ. రాధా ప్రాధాన్యతను తగ్గించడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? అని వైసీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. కాని ఇక్కడే ఉంది జగన్ మాయ. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌భై చెబుతున్న తరుణంలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకోవాలని జగన్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయాలకు రాజధాని, పవర్ సెంటరైన విజయవాడ నుంచి దానిని మొదలుపెట్టాలని ఆయన అనుకొంటున్నారు.   దివంగత ఎమ్మెల్యే, కాపు ఉద్యమనేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా కుమారుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాధ 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు బెజవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో మాస్ ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో రాధ టీడీపీలోకి వెళుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు రాధ ప్రత్యర్థి దేవినేని నెహ్రూ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడను శాసించే ఇద్దరు వ్యక్తులు, రెండు సామాజిక వర్గాలు తెలుగుదేశం వశమవుతాయి. ఇదే జరిగితే విజయవాడలో టీడీపీకి ఎదురుండదు. దీనిని పసిగట్టిన జగన్ ఆ ప్రమాదం జరక్కుండా రాధాను కాపాడుకోవడానికే ఉన్నపళంగా ఆయనకు విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించారు. దానితో పాటు ఫుల్ పవర్స్‌ ఇచ్చి పార్టీని పటిష్టపరచాలని రాధాకు సూచించినట్టు సమాచారం.   

ట్రంప్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆయన వారసుడు ఎవరా..? అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున యూఎస్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ప్రచార పర్వంలో ఇద్దరూ దూసుకెళ్తున్నప్పటికి విజయావకాశాలు ట్రంప్‌కే ఉన్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి దూసుకెళుతున్నాడు.    ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో అందరికి షాక్ ఇచ్చే ఆయన ఈ సారి పెద్ద షాక్ ఇచ్చాడు. అది మాటలతో కాదు...చేతలతో. ట్రంప్ తన ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘానికి అందజేశారు. దాని ప్రకారం ఆయన ఆస్తి విలువ 10 బిలియన్ డాలర్ల పైనే..అంటే మనదేశ కరెన్సీలో అక్షరాల రూ.66 వేల కోట్ల పై మాటే. ఈ వార్తతో అమెరికన్లతో పాటు ప్రపంచం నివ్వెరపోయింది. ట్రంప్ బిజినెస్ పర్సనాలిటి అని తెలుసు..ఆయన ఆస్తి విలువ మహా అయితే ఏ వెయ్యో..లేదంటే రెండువేల కోట్లో ఉంటుందని ఇప్పటి వరకు అందరూ భావించారు. అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ ట్రంప్ తన ఆస్తుల అసలు నిజాన్ని తెలిపాడు. ఆయన తన ఆస్తుల విలువను ఎన్నికల సంఘానికి అందజేయడం ఇది రెండోసారి. గతేడాది జూలైలో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడు తాజాగా రెండో సారి తన ఆస్తులను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించాడు. అప్పటితో పోలిస్తే..ట్రంప్ ఆస్తుల విలువ దాదాపు 190 మిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశానని..ఎన్నికల సంఘం చరిత్రలోనే ఇంత ఆస్తి కలిగిన అభ్యర్థిని తానే కావడం గర్వంగా ఉందని...తన ఆస్తుల్లో చాలా వరకు ప్రపంచ ప్రముఖ కట్టడాలున్నాయన్నారు.