కౌన్ బనేగా కర్ణాటక సీఎం..?

కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వరుస వివాదాలతో రేపో, మాపో వేటుకు సిద్ధంగా ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య. ఇటువంటి పరిస్థితుల్లో హాట్ కేకులాంటి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సీఎం పీఠం దక్కించుకోగల అవకాశం ఉన్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ఎం కృష్ణ ముందువరుసలో ఉన్నారు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టాలని తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గతవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అంతేకాకుండా తనకు అవకాశమిస్తే పార్టీకి వైభవాన్ని తీసుకువస్తానని..వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు.   మరో నేత ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్తున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పరమేశ్వర తానే సీఎం అని కలలు కన్నారు. అయితే హైకమాండ్ ఆయన కలలను కల్లలు చేస్తూ సిద్ధూని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు సిద్ధూపై వేటు పడటంతో పాటు దళిత నేత కావడం..రాష్ట్రంలో దళితులు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉండటంతో పరమేశ్వరను సీఎం చేయడం వల్ల మరింత ప్రయోజనం లభించి దళితుల మద్ధతు కూడగట్టవచ్చని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.   వీరందరి కంటే ముందు కర్ణాటక సీఎం అభ్యర్థిగా స్క్రీన్‌ మీదకు వచ్చిన వ్యక్తి మల్లిఖార్జున ఖర్గే.  సీనియర్ రాజకీయవేత్త కావడంతో పాటు సోనియ చెప్పినట్లు వినే నేత అయిన ఖర్గే దాదాపుగా కన్ఫాప్ అయినట్లే అని అందరూ భావించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో పార్టీకి నాయకత్వం వహించే కీలకమైన స్థానంలో ఉండటం..ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ వాణిని వినిపిస్తున్నారు ఖర్గే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పోటీలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాల అభిప్రాయం. సుదీర్ఘకాలం తర్వాత కన్నడ రాజకీయాలను కాంగ్రెస్ శాసించడానికి, హస్తం విజయం సాధించడానికి సిద్ధూ కష్టం, వ్యూహాలే ప్రధాన కారణం. మరి అంతటి కష్టజీవిపై వేటు వేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం సాహసించదని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా రానున్న నెల రోజులు సిద్ధరామయ్యకు గడ్డు కాలమే.

మైసూరా కూడా పాయే..జగన్‌కి ఇక పెద్దదిక్కెవరు..?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేధ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కుంటున్నారంటూ ఢిల్లీ లెవల్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అక్కడ చంద్రబాబుపై పుస్తకం రిలీజ్ చేసి 24 గంటలు గడవకముందే జగన్‌కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కురువృద్ధుడుగా అభివర్ణించే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతోనే పార్టీని వీడినట్లు తెలిపారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి జగన్‌ని ఏకీపారేశారు.   గతంలో అందరూ చెప్పినట్లుగానే జగన్ ఒక మోనార్క్ అని, ఎవ్వరి మాట వినరన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడే ధ్యాస జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండటం అనవసరమని..ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని..పార్టీలోని పరిణామాలు స్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వలస వెళ్లినా జగన్‌కి పెద్దగా నష్టం లేదు. కానీ మైసూరా పార్టీని వీడటం పెద్ద లోటే. ఎందుకంటే పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే జగన్ జైలుకు వెళితే పార్టీని నడిపింది..బలోపేతం చేసింది మైసూరానే..దానికి తోడు జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీని విస్తరించి టీడీపీని ఒక్క స్థానానికే పరిమితం చేసిన ఘనత మైసూరాదే.   అలాంటి తనకి పార్టీలో సరైన గౌరవం దక్కలేదని, రాజ్యసభ టికెట్ విషయంలోనూ తనను పరిగణనలోనికి తీసుకోకపోవడం మైసూరాను బాధించింది. అందుకే పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. మిగతా నేతలంతా సైలెంట్‌గా పార్టీని వీడితే మైసూరా మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ఒంటెత్తు పోకడలను విమర్శించారు. మైసూరాను కోల్పోయిన జగన్ పరిస్థితి చాణుక్యుడు లేని చంద్రగుప్తుడిలా మారింది. మరి ఈ నేపథ్యంలో యువనేత, మైసూరాతో మంతనాలు జరిపి రాజీనామాను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారా లేక పోతే పోనీ పోరా? అంటారా అనేది వేచి చూడాలి.

బీజేపీతో దోస్తీ కోసమేనా జగన్ ఢిల్లీ పర్యటన..?

తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాంయిపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలువరించాలని కోరుతూ జగన్ అండ్ కో ఢిల్లీ బాట పట్టారు. దీనికి ఆయన "సేవ్ డెమోక్రసి" అని పేరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ లెవల్ లీడర్లను కలుస్తూ చంద్రబాబు నాయుడి మీద కంప్లైంట్ చేస్తున్నారు. అయితే పైకి సేవ్ డెమోక్రసి అయినా లోపల మాత్రం జగన్ ఉద్దేశ్యం వేరే ఉంది. చంద్రబాబును ఎన్డీఏ నుంచి దూరం చేసి తాను ఆ లోటు పూడ్చాలని భావిస్తున్నారు జగన్. దానితో పాటు చంద్రబాబు స్పీడును తట్టుకోవడం తన వల్ల కాదని జగన్ గ్రహించారు. అందుకే ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుని ఆయన సపోర్ట్‌తో బాబును ఢీకొట్టాలని యువనేత ప్లాన్.   ఏపీలో 2014 నాటి బీజేపీ-టీడీపీ బంధం రోజు రోజుకి చెడిపోతోంది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ సహా పలు అంశాల్లో బీజేపీ వైఖరిపై టీడీపీ లోలోపల రగిలిపోతోంది. కానీ బయటకు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ బీజేపీకి దగ్గరవుతున్నారు. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వదిలి టీడీపీ గూటికి చేరుతుండటంతో సలహా ఇచ్చే నాధుడు లేక కష్టాల్లో ఉన్న జగన్‌ని ఆదుకోవడానికి "మైనింగ్ రాజా" గాలి జనార్థన్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను పార్టీలోకి మారకుండా చేయడంతో పాటు జగన్‌తో బీజేపీ మైత్రిని కుదిర్చే పనిలో గాలి పావులు కదుపుతున్నాడు. ఎందుకంటే గాలి జనార్థన్ రెడ్డి క్రిమినల్ అయినప్పటికి బీజేపీ అథిష్టానం వద్ద ఆయనకు వేయిటేజీ ఉంది. ఆ పలుకుబడితోనే గాలి.. జగన్‌ని కమలానికి దగ్గర చేస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యేందుకు గాలి తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   అటు బీజేపీ కూడా బాబు విషయంలో అంత సాఫ్ట్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇకపై తెలంగాణలో టీడీపీ విషయంలో అంటకాగడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే అంచానికి వచ్చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని పట్టుకుని వేలాడటం వల్ల ఉపయోగం లేదనే భావన కూడా బీజేపీలో పెరిగిపోయింది. అయితే ఇక్కడ బీజేపీతో చంద్రబాబు మైత్రి కోరుకుంటున్నారు..ఆంధ్రప్రదేశ్‌కి మీరేమీ ఇవ్వనక్కర్లేదు-నేను మేనేజ్ చేసుకుంటాను..అని బీజేపీకి, చంద్రబాబు హామి ఇచ్చినట్టుగా ఉంది ముఖ్యమంత్రిగారి పరిస్థితి. దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు టీడీపీ-బీజేపీ విడిపోతాయని అనుకోవడానికి వీల్లేదు. అయితే ఏటోచ్చి ఎటు పోయినా సేఫ్ సైడ్‌లో ఉండాలని బీజేపీ ప్లాన్. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ను..ఏపీలో జగన్‌ను లైన్‌లో పెట్టుకుంటోంది కమలం.   ఇక జగన్ పరిస్థితి చూస్తే అధికారం ఎలాగూ లేదు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై ఉన్న పాత కేసులను  చంద్రబాబు మళ్లీ తిరగ తోడుతారేమోనని జగన్ భయపడుతున్నారు. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన జగన్ అంతకు ముందే బీజేపీ వద్ద మోకరిల్లాలని భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అండ లేకుండా బాబు ఏం చేయలేరు కాబట్టి. మరి బీజేపీ బాబుతో కటీఫ్ చేసుకుంటుందా? లేక జగన్‌తో దోస్తీ కుదుర్చుకుంటుందా అనేది వేచి చూడాలి.

హైదరాబాద్ దాటించడానికే "తలసాని" శాఖ మార్పు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్టుగానే తన కేబినెట్‌లో శాఖలు మార్చారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ..కేవలం నాలుగు శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి సారథ్యం వహించనున్నారు. శాఖల మార్పులో మంత్రి తలసానికి షాక్ ఇచ్చారు సీఎం.   ఆయన ఇన్నాళ్లు పర్యవేక్షించిన వాణిజ్య పన్నుల శాఖను తొలగించి తనవద్దే ఉంచుకున్నారు. దానికి బదులుగా పశుసంవర్థక, మత్స్య శాఖలను ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు పన్ను వసూళ్లలో లొసుగులకు అడ్డుకట్ట వేయడం, పాత బకాయిలను రాబట్టడంలో మరింత మెరుగైన విధానాలను అనుసరించాల్సిన అవసరముందని అందుకే ఆ శాఖను తన వద్దే ఉంచుకుంటున్నట్టు సీఎం చెప్పారు. అయితే ఇలాంటి కీలకశాఖ నుంచి తలసానిని తప్పించి అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్థక శాఖ కేటాయించడానికి బలమైన కారణాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.   తలసాని శాఖ మారబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు పశుసంవర్థక శాఖకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన శాఖను ఇచ్చినా తలసాని దానిని సరిగా నిర్వర్తించలేదని సీఎం చేయించిన సర్వేలో తేలింది. దానికి తోడు తలసానితో పాటు ఆయన గారి పుత్రరత్నం వ్యాపారులు, అధికారులను వేధింపులకు గురిచేసినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య ఏకంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను నిర్బంధించి దందాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో తలసాని తన కుమారుణ్ణి వెనుకేసుకు రావడం జరిగింది. పైగా డిపార్ట్‌మెంట్‌పై ఆయనకు పట్టులేదని, సహచర మంత్రులంతా జిల్లా పర్యటనలకు వెళ్లి అధికారులతో సమీక్షలు జరపడం, సమస్యల పరిష్కారం లాంటివి లేకుండా ఎప్పడూ హైదరాబాద్‌ను పట్టుకుని వేలాడుతున్నారు తలసాని  వీటన్నింటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్న ముఖ్యమంత్రి సరైన టైం కోసం వెయిట్‌చేసి తలసానికి షాకిచ్చారు.   అటు ఆయన శాఖ మార్పుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తలసాని శాఖను మార్చి ముఖ్యమంత్రి మంచి పని చేశారని, అందుకు వ్యాపారులు, అధికారుల తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరి తలసాని, సీఎం నిర్ణయం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వెదురుబొంగుతో నీరు ఉత్పత్తి..!

మానవ మనుగడ ప్రారంభానికి మూల కారణం నీరు. చరిత్ర పరిశీలిస్తే, అద్భుతంగా విలసిల్లిన నాగరికతలన్నీ నదీతీరాన వికసించినవే. నీరు లేకుండా మానవ మనుగడ అసాధ్యం. కానీ నేడున్న పరిస్థితుల్లో, పుష్కలమైన నీటి వనరులున్న ప్రాంతాలు కూడా ఎడారి ప్రాంతాల్లా మారిపోతున్నాయి. ఇప్పటికే మహానగరాల్లో సైతం నీటి నిల్వలు లేని పరిస్థితి. చెట్లు కొట్టేయడం, వర్షాభావం, కరువు, ఏటికేడు పెరుగుతూ వెళ్తున్న సూర్యతాపం లాంటివన్నీ కలిపి, నీటిని ఆవిరి చేసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, నీటిని ఉత్పత్పి చేయడానికి ఇథియోపియాలో ఒక కొత్త రకం పద్ధతిని కనుగొన్నారు. ఆర్టురో విటోరి అనే ఆర్కిటెక్ట్ తయారుచేసిన ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తు, పదమూడు అడుగుల వెడల్పుతో వెదురుకర్రలతో తయారుచేసిన వాటర్ టవర్లను ఈ పద్ధతిలో ఉపయోగిస్తారు. మెష్ లా తయారుచేసిన వెదురు, వాతావరణంలోని తేమను కలెక్ట్ చేసి, ట్యాంక్ లో నీటిరూపంలో స్టోర్ చేస్తుంది. ట్యాంక్ లో నిలవ ఉన్న నీటిని, అడుగుభాగంలో ఉన్న కుళాయి ద్వారా సేకరించుకోవచ్చు. దీన్ని తయారుచేయడానికి, మెయింటెయిన్ చేయడానికి కరెంట్ కూడా అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత కరువును ఎదుర్కొంటున్న దేశాల్లో ఇథియోపియా కూడా ఒకటి. అక్కడి ప్రజలు నీటి కోసం కీలోమీటర్ల తరబడి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకే విటోరి ఆ ప్రాంతాన్ని ఎంచుకుని తమ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడు. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎన్నో దేశాలకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

జగన్‌‌‌ ప్రతిపక్షనేత పదవికి సు"జయం"గా ఎర్త్ ?

ఒకరి తర్వాత ఒకరు పార్టీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి జంప్ అవుతుండటంతో వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ప్రాణం పోయినా సరే జగనన్నను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని మీడియా ముందు చిలుక పలుకులు పలుకుతున్న నేతలంతా పోలోమని పచ్చకండువా కప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అందరు ఎమ్మెల్యేల్లాగా సుజయ చేరిక ఆషామాషీ కథ కాదు. దీని వెనుక పెద్ద స్కెచ్ ఉంది.   అసలే అధికారం కోల్పోయి చివరికి ప్రతిపక్షనేత హోదా అయినా మిగిలినందుకు సంతృప్తి పడ్డారు జగన్. కాని ఇప్పుడు ఆ హోదా కూడా లేకుండా చేయడానికి టీడీపీ చేతిలోని బ్రహ్మాస్త్రమే సుజయ కృష్ణరంగారావు. ఇప్పటికే 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా సైకిలెక్కించి, జగన్ ప్రతిపక్షనేత హోదాకు ఎసరు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొత్తం 37 మంది ఎమ్మెల్యేల ద్వారా  పార్టీలో చీలిక తెచ్చి జగన్ స్థానంలో, జ్యోతుల నెహ్రూను వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని అయితే ఈ వ్యవహారం అంతా సాంకేతికంగానే జరిగిపోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.   దీనిలో భాగంగానే వైసీపీఎల్పీ కార్యదర్శి హోదాలో ఉన్న సుజయకృష్ణ రంగారావును ముందుగా టీడీపీలో చేర్చుకుంది. సుజయ వైసీపీఎల్పీ కార్యదర్శి హోదాలో వైసీపీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాయనున్నారు. అప్పుడు అది వైసీపీ అధికార సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో 37 మంది శాసనసభ్యుల సంతకాలు తీసుకుంని, తాము వైసీపీఎల్పీ నేతగా జ్యోతుల నెహ్రూను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు లేఖ రాస్తారు. తర్వాత స్పీకర్..ఆ లేఖ మేరకు జ్యోతుల నెహ్రూని విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తారు. కార్యదర్శిగా ఉన్నందున అంతా సుజయ చేతుల మీదుగా నడిపిస్తే తర్వాత జగన్ న్యాయస్థానాలను ఆశ్రయించినా ఎలాంటి ఇబ్బందులు రావని టీడీపీ స్కెచ్. సుజయ కృష్ణరంగారావు పార్టీ మారి ఇన్ని రోజులైనా జగన్ ఇప్పటివరకు మరో కార్యదర్శిని నియమించకపోవడం కొసమెరుపు.  

టీ.కాంగ్రెస్‌‌లో కోవర్టులున్నారా? ఆ కోవర్టులు ఎవరు?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్‌లో కొనసాగుతూ టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, పాలేరు అసెంబ్లీ ఉపఎన్నిక తదితర అంశాలపై నిన్న టీపీసీపీ సమావేశమైంది. కొంతమంది పార్టీతో అంటీముట్టునట్టుగా ఉండటం, టీఆర్ఎస్‌లోకి జంపింగ్‌లతో తలబొప్పికట్టిన ఉత్తమ్ సహనం కోల్పోయారు. కోవర్టులు ఉన్నారని అలా మీరు ఎవరైనా ఉన్నారని భావిస్తే తెలియజేయాలని, లేదా పార్టీ అధ్యక్షునికి సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఉత్తమ్ సూచించారు.   పైకి చెప్పనప్పటికి ఆయన ప్రధాన ఉద్దేశం ప్రతిపక్షనేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి అని హస్తం నేతలు గుసగుసలాడుకుంటున్నారు.మొన్నామధ్య ఒక రోజు జీవన్‌రెడ్డి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాతి రోజే సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌తో మంతనాలు జరుపుతూ కనిపించారు. ఆ తర్వాత నుంచి ఆయన గట్టిగా మాట్లాడింది లేదు. ఒకవేళ వినిపించినా అది కేసీఆర్‌కు అనుకూలంగానే అవుతోంది. టీ.కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు, ప్రతిపక్షనేత జానారెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆయన టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్లా, కేసీఆర్ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారని కొందరు నేరుగా ఆయనతోనే అన్నా...తన పద్ధతి ఇంతే అని సూటిగా చెప్పారు జానారెడ్డి. దీంతో కొందరు నాయకులు అప్పట్లో జానాపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న 5 రూపాయలకే భోజనం పథకం బాగుందని కితాబివ్వడం అప్పట్లోనే కాంగ్రెస్‌కు కోపం తెప్పించింది. పీఏసీ ఛైర్మన్ పదవిలో విషయంలో కేసీఆర్‌పై గట్టిగా పోరాడే నాయకులను కాదని సాఫ్ట్‌ నేచర్‌ ఉన్న గీతారెడ్డికి ఆ పోస్ట్ కట్టబెట్టారు.   మరో కీలకనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి సరేసరి. నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ ‌పాయింట్‌ ప్రజంటేషన్‌పై కోమటిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. అక్కడితో ఆగకుండా మీడియా సాక్షిగా కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే..కేసీఆర్‌కు అనుకూలంగా ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారయ్యాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలోకి కాంగ్రెస్ పడిపోయింది. వలసలను అడ్డుకోలేకపోవడం, పార్టీని సరిగా నడిపించలేక ఇంటా బయట విమర్శల పాలతవుతున్న ఉత్తమ్‌కు వీరి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించాయి. అందుకే కోవర్టులు అంటూ నోరు జారారు. 

నిన్న యోగితా..నేడు సచిన్..రేపెవరు?

మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా తాగేందుకు గుక్కడు నీళ్లు కూడా లేక జనం అల్లాడిపోతున్నారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో లాతూర్‌లో అయితే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏకంగా ప్రత్యేక రైలు వ్యాగన్లను తయారుచేసి సాంగ్లీ జిల్లా మిరజ్ పట్టణం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే అవి డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు కరవు పసిప్రాణాల పాలిట శాపంగా మారుతోంది. అభం శుభం తెలియని చిన్నారులు గొంతును తడి చేసుకునేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.   బీడ్ జిల్లాలో యోగితా దేశాయ్ అనే చిన్నారి మండుటెండలో నీటి కోసం అరకిలోమీటరు దూరంలో ఉన్న సంపు దగ్గరికి ఐదు సార్లు అటూ ఇటూ తిరిగింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ బాలికను ఇంట్లో వాళ్లు నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినపుడు..ఇంటికి తిరిగిరాలేదు. ఎంతసేపటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, బాలిక సంపు దగ్గర కుప్పకూలి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేదు. గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా చిన్నారి అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  కరువు తమ కంటిపాపను దూరం చేసిందని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.     ఈ ఘటన మరవకముందే మరో బాలుడు నీటి కోసం బలయ్యాడు. సచిన్ కేదార్ అనే బాలుడు నీటి కోసం తన సైకిల్‌పై గ్రామంలోని బావివద్దకు వెళ్లాడు. నీళ్లు తోడుతుండగా కాలు జారి బావిలో పడ్డాడు. బాలుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బాలుడిని బావిలోంచి బయటకు తీసి బతికించడానికి ప్రయత్నించారు. అప్పటికే అతడు మరణించాడు.   నీటి కోసం కుటుంబమంతా వాటర్ ట్యాంకర్లు, చేతిపంపులు, బావుల వద్ద గంటల కొద్ది నిలబడాల్సి వస్తోందివ. అవి లేనిపక్షంలో కిలో మీటర్ల దూరం వెళ్లి గంగమ్మను తీసుకురావాలి. పెద్ద వారు మండుటెండల్లో అంత దూరం వెళ్లలేక పిల్లల్ని పంపిస్తున్నారు. ఇది వారిపట్ల మరణశాసనమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఇలాంటి యోగితలు..సచిన్‌లు సమిధలవుతూనే ఉంటారు.  

టీఆర్ఎస్‌లో మసకబారుతున్న హరీశ్ ప్రభ

తెలంగాణ రాష్ట్ర సమితి..ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుచ్చేది కేసీఆర్. ఆయన తర్వాత  కేటీఆర్, హరీశ్, కవిత కళ్లేదుట మెదులుతారు. అయితే టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే అంశంపై తెలుగు ప్రజలు ప్రతి రోజూ చర్చించుకుంటూనే ఉంటారు. వారసత్వ రాజకీయాలు రాజ్యమేలే తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తర్వాత కొడుకే అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి కేసీఆర్ వారసుడు కేటీఆరే అవుతారు కాని ఇక్కడ పోటీలో నిలిచారు కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు. టీఆర్ఎస్‌ స్థాపించిన కొత్తలో "నేనూ.. నా భార్య మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారు. నాకు ఏ బాదరబందీలేదు. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడుతా'' అని చెబుతుండేవారు కేసీఆర్. అప్పట్లో మావయ్యకి చేదోడువాదోడుగా ఉంటూ అన్నీతానై వ్యవహరించారు హరీశ్ రావ్.     2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పెట్టుకున్న టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్‌సభ స్ధానాల నుంచి గెలిచిన కేసీఆర్..సిద్ధిపేట స్ధానానికి రాజీనామా చేశారు. అక్కడ హరీశ్‌ను నిలబెట్టి గెలిపించడంతో పాటు మంత్రి పదవి ఇప్పించిన కేసీఆర్...తన వారసుడు మేనల్లుడేనని చెప్పకనే చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో హరీశ్ గట్టి పట్టు సాధించారు. అయితే కేటీఆర్, కవిత రంగ ప్రవేశంతో హరీశ్‌కు వారసత్వ పోరు మొదలైంది. అది అలా నడుస్తుండగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. చివరికి రాష్ట్రం రెండు ముక్కలై 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ లక్ష్యం నెరవేరి రాజకీయ పార్టీగా అవతరించింది.   2014 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచి అధికారాన్ని అందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి హరీశ్, కేటీఆర్‌లకు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. కుమార్తె కవితను నిజామాబాద్ ఎంపీని చేశారు. పైకి వీరంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల వారసత్వ యుద్ధం జరుగుతూనే ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 పోజిషన్ కోసం కేటీఆర్, హరీశ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని గెలిపించారు కేటీఆర్. దీంతో ఇలు పార్టీలోనూ, ప్రజల్లోనూ ఆయన పేరు మారు మోగిపోయింది. ఆయనే కేసీఆర్ వారసుడు అనే బలమైన నిర్ణయానికి పార్టీ శ్రేణులు వచ్చేశాయి. దీనికి సీఎం కూతురు కవిత తోడయ్యారు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆరేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఇదే సమయంలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ విజయం ఏకపక్షమే అని అంతా ఊహించారు. పైగా హరీశ్ అంటే సిద్ధీపేట..సిద్ధీపేట అంటే హరీశ్ అనే నమ్మకం కూడా ఉండటంతో కారు దూసుకెళ్తుందనుకున్నారు. అయితే వాస్తవంలో జరిగింది వేరు. 34 వార్డులకు గానూ 22 వార్డులను మాత్రమే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గతంలో అంతగా ప్రభావం లేని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో సునాయాసంగా గెలిచిన టీఆర్ఎస్, పార్టీ బలంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సిద్ధిపేట పట్టణంలో పన్నెండు వార్డులను కోల్పోవడాన్ని గులాబీ దండు జీర్ణించుకోలేకపోతోంది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై అన్ని వేళ్లూ హరీశ్‌ వైపే చూపెడుతున్నాయి. ఇక అక్కడ నుంచి హరీశ్ ప్రభ మసకబారుతూ వస్తోంది.  ఆయనకు పార్టీ కార్యాకలాపాల్లో అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రతిష్టాత్మక ప్లీనరి ఏర్పాట్లతో పాటు త్వరలో జరగనున్న పాలేరు ఉపఎన్నికకు కేటీఆర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈ నిర్ణయంతో హరీశ్ స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

చైనాను దెబ్బకు దెబ్బ తీసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో జరిగిన అవమానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి కీలక సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను తీవ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది. అంతేకాకుండా అతడు నిషేదం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కావల్సినంత స్వేచ్ఛను పాకిస్తాన్ అందిస్తోంది.   ఒకవేళ ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన అమలై ఉంటే కనుక అజార్‌ తీవ్రవాది అయ్యేవాడు. అందుకే పాకిస్తాన్ కోరిక మేరకు చైనా అజార్‌ను కాపాడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబరచడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదంటూ ఆక్రోశం వెల్లగక్కింది. చైనాకి సరైన గుణపాఠం నేర్పాలని, అవకాశం కోసం ఎదురు చూస్తున్న భారత్‌కి దొల్కన్ ఇసా రూపంలో పెద్ద పట్టు దొరికింది.   ముస్లింలు అధికంగా ఉండే చైనాలోని జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లింల హక్కుల కోసం తిరుగుబాటు జరుగుతుంది. వీరికి మద్ధతుగా వరల్డ్ విఘర్ కాంగ్రెస్ నాయకుడు దొల్కన్ ఇసా మద్దతు తెలుపుతున్నారు. చైనా ఉగ్రవాదిగా భావించే ఆ సంస్థ నాయకుడికి ఇప్పుడు భారత్ వీసా ఇచ్చింది. ఈ నెల 28న హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే సదస్సు కోసం దోల్కన్ ఇసాకు భారత్ వీసా ఇస్తుందన్న వార్తలతో చైనాకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఈ నేపథ్యంలో ఇసాకు భారత్ వీసా ఇవ్వడంపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇసా ఉగ్రవాది అని, అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిందని, అతన్ని చట్టం ముందుకు తీసుకురావడానికి అన్ని దేశాలు సహకరించాలని కోరుతోంది. ఎదైనా తన దాకా వస్తేగాని తెలియదంటారు. ఇప్పుడు ఆ నొప్పి చైనాకి అర్థమైందన్న మాట. 

హస్తంలో "కమలం" ఎందుకు వేలుపెడుతోంది ?

నిన్న గాక మొన్న పీఎఫ్ నిబంధనలు కఠినతరం చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై దేశవ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమనడంతో  వెనక్కి తగ్గిన ప్రధాని నరేంద్రమోడీకి మరో షాక్ తగిలింది. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టిన ఆర్థికబిల్లుకు ఊహించని రీతిలో చిక్కులు ఏర్పడటంతో ఈ సంక్షోభం మొదలైంది. మాజీ సీఎం విజయ్ బహుగుణ శిబిరానికి తొమ్మిదిమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబట్టిన బీజేపీతో చేతులు కలపడం..దానికి అంగీకరించకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు.   71 మంది సభ్యులు గల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 36 కాగా, బీజేపీ సభ్యుల సంఖ్య 28. అధికారపక్షానికి ఆరుగురు సభ్యుల ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతు కూడా ఉంది.  ఆర్ధిక బిల్లుకు అనుకూలంగా 32 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 36 వచ్చాయి. వీగిపోయిన బిల్లును ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడం దేశచరిత్రలోనే తొలిసారి అని ఇది అనైతికమని కనుక ప్రభుత్వం రాజీనామా చేయాలని బీజేపీ కోరింది. దీనికి మద్దతు ప్రకటిస్తూ 9 మంది కాంగ్రెస్ సభ్యులు తిరుగుబాటు చేయడంతో  వీరిపై  స్పీకర్  అనర్హత వేటు వేశారు. ఈ పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. సీఎం హరీశ్‌రావత్ బలనిరూపణ చేసుకోవాల్సిందిగా  గవర్నర్ సూచించారు.   బలపరీక్షలో తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కెమెరాకు పట్టుబడటం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.అయితే మధ్యలో కేంద్రం జోక్యం తీసుకుని రాజకీయ డ్రామాకు తెరదించింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని ప్రకటిస్తూ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీనికి అంగీకరించిన రాష్ట్రపతి ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని రద్దే చేసి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టారు. దీనిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై మండిపడింది.   356 అధికరణంపై గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని పేర్కొంది. రాష్ట్రపతి పాలన అనేది చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి కాని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఇలా తొలగించడం తొందరపడటమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బ కొట్టడమే. రాష్ట్రప్రభుత్వాలను వదిలించుకోవడం, మార్చేయడం లేదా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం...స్తంభింపజేయడం లేదా రద్దు చేయడం ఏదైనా కావచ్చు. అంతిమంగా జరిగేది మాత్రం ప్రజాస్వామ్యాన్ని నేలకూల్చడమేనంటూ కేంద్రానికి మొట్టికాయలు వేసింది. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి పాలన విధించడానికి బీజేపీ మైండ్ గేమ్‌లో ఒక పార్ట్.   అరుణాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన ఇలాంటి సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కసరత్తు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం కష్టంగా మారింది. సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలంటే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి. ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలు లేకుండా బీజేపీ గెలవలేదు. అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షోభం సృష్టించి వీలైతే ముందస్తు ఎన్నికలు జరిగిలా చూస్తే లాభపడాలని బీజేపీ వ్యూహకర్తల ప్లాన్. నెలల వ్యవధిలో రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తిరుగుబాట్లు, రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు, రాష్ట్రపతి పాలన..బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా అర్థం చేసుకోవచ్చు.

జ"గన్" "ముద్ర"తో కాపు ఛానల్-2

తెలుగు మీడియా..దేశంలోని ఏ ప్రాంతీయ భాషకి లేనన్ని ఛానెళ్లు, పేపర్లు, మ్యేగ్‌‌జైన్లు, వెబ్‌సైట్లు ఇలా అన్నింటిలోనూ తెలుగులోనే ఎక్కువ. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో న్యూస్ ఛానల్ రాబోతోంది. పార్టీలు కూడా కులం ప్రాతిపదికమీద నడుస్తున్న ప్రాంతం మనది. కమ్మవారికి టీడీపీ, రెడ్లీకి వైసీపీ, కాపులకు జనసేన ఇలా కులం పార్టీని కమ్మేసింది. ఇదే సంస్కృతి మీడియాకి విస్తరించింది. అందుకే కులానికో ఛానల్ పుట్టుకోస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అగ్రకులాలకి సొంత మీడియా ఉంది. ఒక్క కాపులకు తప్ప.   మొన్నామధ్య కాపులకు నెంబర్ వన్ ఛానల్ వచ్చింది. మిగతా వారి వార్తలు ఇస్తున్నా ఫస్ట్ ప్రిఫరేన్స్ మాత్రం కాపులకే. అందుకే ముద్రగడ దీక్ష సమయంలో ఆ ఛానల్ కాస్త ఎక్కువగా హడావుడి చేసింది. దీంతో ఇప్పటి వరకు తమ వాణిని గట్టిగా వినిపించే ఛానల్‌ రాలేదని..ఇప్పుడు నెంబర్ వన్ తోడుగా ఉందని కాపులు నమ్మారు.  అయితే వార్తను వార్తలా కాకుండా వన్ వే ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గతం కంటే కాస్త రూటు మార్చుకుంది నెంబర్ వన్ న్యూస్. అందరి వార్తలను చాలా జాగ్రత్తగా కవర్ చేస్తూనే టీడీపీపై ఎదురుదాడి వ్యూహంతోనే వెళుతుంది.   కాపుల రిజర్వేషన్ అంశంతో మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ తన కులం వారిలో పాపులార్ కావడానికి, పలుకుబడి పెంచుకోవడానికి తనకు సొంతంగా ఛానల్ ఉంటే బాగుంటుందని ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటికే "ప్రజాటీవీ" పేరుతో ఓ వెబ్‌పోర్టల్‌ను ఆయన అనుచరులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దానినే శాటిలైట్ ఛానల్‌గా తీసుకువచ్చే కసరత్తు చేస్తున్నారు పద్మనాభం. అయితే ఛానల్ పెట్టడమంటే మామూలు విషయం కాదు దానికి ఎక్విప్‌మెంట్, సిబ్బంది జీతభత్యాలు ఇలా తడిసిమోపెడవుతుంది. అందుకే కాస్త వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. అయితే మీకెందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.   2014లో తనను ఘోరంగా దెబ్బకొట్టిన కాపు ఓటు బ్యాంక్‌ను 2019 నాటికి తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రతిపక్షనేత భావిస్తున్నారు. అందుకే కొత్త ఛానల్ ద్వారా కాపుల్లో ఐకమత్యాన్ని తెచ్చి ఆ క్రెడిట్ తన అకౌంట్‌లో వేసుకోవాలనుకుంటున్నారు. జగన్ పిలుపుతో తన ముఖ్య అనుచరులతో బెంగళూరులోని "ఒక ప్రైవేటు ఫార్మ్ హౌస్"కు వెళ్ళారు ముద్రగడ. ఆయన అనుచరులను సైతం బయటకు పంపి రహస్యంగా మంతనాలు జరిపినట్లు కాపునేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ చర్చల్లోనే ఛానల్ పేరు "ప్రజాటీవీగా" దానికి, "సామాన్యుడి ఆశల హరివిల్లు" అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టినట్లు టాక్. "ప్రజాటీవీ" ద్వారా "ముద్రగడ"ను కాపు "బ్రాండ్ అంబాసిడర్‌"గా మార్చి తెలుగుదేశానికి కాపులను దూరం చేసి, వైసీపీకి దగ్గర చేయాలని జగన్ వ్యూహం. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ముద్రగడ, జగన్‌లపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ప్రముఖ మీడియా సంస్థను ప్రజాటీవీతో ఎదుర్కోవాలని వీరిద్దరి టార్గెట్. మ్యాటర్ ఏదైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా వీరి ఉమ్మడి శత్రువు తెలుగుదేశం పార్టీనే. సో వార్  ప్రజాటీవీకి, తెలుగుదేశానికి మధ్యే.

"స్టఫ్" లేని సెలబ్రిటీలు..

సెలబ్రిటీలు..ఇండియాలో వీరికున్నంత క్రేజ్ ఎవరికి ఉండదు. సాహిత్యం, డ్యాన్స్, నటన, క్రీడలు , రాజకీయం ఇలా తమ తమ రంగాల్లో మోస్గ్ టాలెంటెడ్ పర్సన్స్ వీళ్లు. వీళ్ల ప్రతిభ చూసి అబ్బో వీళ్లకు ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి  ఆ రేంజ్‌కు వెళ్లుంటారు అని జనాల ఫీలింగ్. కాని మన ప్రముఖులకు వారి రంగాల్లో తప్ప బయట నాలెడ్జ్ సున్నా. ఇది ఏ మీడియానో..వీకీలీక్స్‌..పనామా పేపర్సో బయట పెట్టలేదు. స్వయంగా వాళ్లంత వాళ్లే బయటపడ్డారు.   తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ కమ్ యాక్టర్ కమ్ పొలిటిషీయన్ అయిన శ్రీశాంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కేరళను రాష్ట్రంగా కాకుండా..ఓ నగరంగా పేర్కొన్నారు. శ్రీశాంత్ బేసిగ్గా సోషల్ మీడియాలో యమా యాక్టివ్. పైగా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ తరపున కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే కేరళ నగరాన్ని ప్రపంచంలోనే బెస్ట్ నగరంగా చేస్తామని..మనమంతా కలిసి కేరళను ప్రపంచంలోనే అత్యుత్తమ సిటీగా తీర్చిదిద్దుకుందామంటూ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. దీనిపై కేరళీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓ మై గాడ్..కేరళ నగరం కాదు..నీకు జనరల్ నాలెడ్జ్ లెసెన్స్ అవసరం. నువ్వు ముందు జాగ్రఫీ నేర్చుకో తర్వాత రాజకీయాల వైపు చూడు అంటూ ఒకరు, కేరళ నగరమైతే, నీ దృష్టిలో భారత్ ఓ రాష్ట్రమా అని మరొకరు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.   బాలీవుడ్ నటి అనుష్క శర్మ నాలెడ్జ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేడమ్ గారికి మన నేతల పేర్లు కూడా సరిగా తెలియదు. తెరపై హీరోలతో రోమాన్స్ చేయడంలో ఉన్న నాలెడ్జ్. సోషల్‌ స్టడీస్‌లో కానీ లేదు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మరణించినప్పుడు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పించింది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. వీరి బాటలోనే అనుష్క కూడా కలామ్‌కి నివాళులర్పించాలనుకుంది. అందరూ ట్వీట్ చేస్తున్నారు, నేను కూడా ట్వీట్ చేయ్యాలనుకుంది. అయితే ఈవిడ గారికి ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు సరిగా గుర్తు లేదు. ఏపీజే అబ్దుల్ కలామ్ అనే పేరుకు బదులుగా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు తప్పుగా రాసింది. మొదట "ABJ KALAM AZAD'' అని ఒకసారి  "APJ KALAM AZAD" అని రెండవ సారి ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేశారు. దీంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని మూడోసారి కరెక్ట్‌గా రాసింది. ఇలాంటివి రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా మన సెలబ్రిటీలు కళ్లు తెరవడం లేదు. సెలబ్రిటీలంటే ప్రజల్లో ఒక విలువ, గౌరవం ఉన్నాయి. ఇకనైనా కాస్త స్పృహలోకి వచ్చి బయట విషయాలు కూడా తెలుసుకుంటే మంచిది. లేదంటే ప్రజల్లో నవ్వులపాలవ్వడం ఖాయం.  

పెద్దలను తప్పించడానికే కులంపై దర్యాప్తు జరిపారా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల కులం వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రోహిత్ దళితుడు కాదని వడ్డెర కులస్తుడని సైబరాబాద్ పోలీసులు ఉమ్మడి హైకోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న గచ్చిబౌలి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమేశ్ కుమార్ హైకోర్టుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారం మొత్తం అతని కులం చుట్టూనే తిరిగాయి. అతను దళితుడు కావడం వల్లే అతనితో పాటు మరో నలుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఏఎస్‌ఏ విద్యార్ధులు ఆరోపించారు. అయితే రోహిత్ తండ్రి తాము వడ్డెర కులానికి చెందిన వారమని చెప్పడంతో కేసులో కొత్త వాదన మొదలైంది. దానికి స్పందించిన రోహిత్ తల్లి తాను మాల కుటుంబంలో జన్మించానని, కానీ తనను పెంచి పోషించింది మాత్రం వడ్డెర కులానికి చెందిన కుటుంబమని తెలిపింది.   రోహిత్ ఆత్యహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానికన్నా..అతని కులం చుట్టూనే వివాదం ముసురుకుంది  దీంతో పోలీసులు జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లా గురజాలలో ఉన్న రోహిత్ తండ్రి నాగమణికుమార్, తండ్రి తరపున బంధువులు, గ్రామ సర్పంచ్, రోహిత్ తల్లి రాధిక బంధువులు, రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు తహసీల్దార్ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం ఆధారంగా రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. గుంటూరులోని రోహిత్ చదివిన పాఠశాల రికార్డుల్లో కులం గురించిన ఆధారాలు లభించలేదని, ఇంటర్, డిగ్రీ రికార్డుల్లో మాత్రం ఎస్సీ మాలగా నమోదై ఉందన్నారు. రోహిత్ తల్లి రాధికను దత్తత తీసుకున్నట్లు అంజనీ దేవి చెప్పిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందన్నారు.   1989 జనవరి 30న పుట్టినట్టు ఎస్సీ కులానికి చెందిన వాడని పేర్కొంటూ గురజాల ఎమ్మార్వో రోహిత్‌కు సర్టిఫికేట్‌  జారీ చేశారు. అయితే గతంలో మిగిలిన వారి సర్టిఫికేట్లలో వడ్డెర కులాన్నే ప్రస్తావించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక, మణికుమార్ బంధువులు, రోహిత్ సోదరుడు, రోహిత్ అమ్మమ్మల వివరణలతో పాటు నీటిపారుదల శాఖలో తండ్రి గతంలో సమర్పించిన పత్రాలను సైతం సేకరించి వాస్తవాలను తెలుసుకుంటున్నారు. మొత్తం మీద రోహిత్ తండ్రి నాగమణి కుమార్, తల్లి రాధిక ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోనికి తీసుకుని రోహిత్‌ను వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా తేల్చినట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.   మరోవైపు ఆత్మహత్యకు పురిగొలిపారనే ఆరోపణలపై హెచ్‌సీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రోహిత్ అసలు దళితుడే కానప్పుడు కేంద్రమంత్రి, వీసీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదని వారిపై కేసులు తొలగించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయినా పోలీసులు ఆత్మహత్యకు కారణాలు వదిలివేసి అతని కులంపై దర్యాప్తు చేసింది కేవలం పెద్దలను తప్పించడానికేనా?

కేసీఆర్ అంచనాలకు అందడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజకీయ వ్యూహాల్లో ఆయన్ను మించిన వారు లేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు పావులు కదిపి అనుకున్నది సాధిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలను దాదాపుగా ఖాళీ చేసేశారు. తాజాగా మరో ప్రత్యర్థి కాంగ్రెస్ బలం తగ్గించేందుకు మరో కొత్త స్కెచ్ గీశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబంలో ఎవరో ఒకరిని నిలబెట్టి ఎన్నికను ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తోంది.   ఆ పద్థతి ప్రకారం రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని పోటీలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీనిని ఎకగ్రీవం చేయాలని భావించిన కాంగ్రెస్ ఆమె విజయానికి మిగతా పార్టీల సహకారం పొందాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటన వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఖంగుతింది. అదంతా ఒక ఎత్తైతే అభ్యర్థి ఎంపికలో సీఎం తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలి సభ్యుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దించాలని కేసీఆర్ వ్యూహం పన్నారు. అనారోగ్యంతో ఫాంహౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఉపఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు.   అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లాలో పట్టు, బలమైన అనుచర వర్గం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరుకు సరైన అభ్యర్థిగా కేసీఆర్ భావించి అక్కడ నుంచి పోటీ చేయాలని తుమ్మలను కోరారు. పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీదే విజయం. అలాంటి చోట కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కేసీఆర్ వ్యూహం. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నికలో కూడా తొలుత టీఆర్ఎస్ పోటీ చేయదని అందరూ అనుకున్నారు.  కేసీఆర్ టీఆర్ఎస్‌ని బరిలోకి దింపి నారాయణ్‌ఖేడ్‌ని కైవసం చేసుకున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ ఏకగ్రీవాలకు వరుసగా గండికొడుతూ హస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు.   నారాయణ్ ఖేడ్ లాగా టీఆర్ఎస్ పోటీ చేస్తుందేమోనని టీపీసీసీ నేతలు ముందుగానే సీఎంని ప్రసన్నం చేసుకోవాలని భావించి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరారు.  కాంగ్రెస్ నేతలు ఎన్నిక ఏకగ్రీవం చేయాలని అడుగుతారని కేసీఆర్ ఊహించారు. అందుకే వాళ్లకి చెక్ పెట్టేందుకేఅయితే నిన్న రాత్రి దాకా తన అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీపీసీసీ నాయకులు ఏకగ్రీవం గురించి ఆడగటానికి కూడా సాహసించబోరనే యోచనతోనే కేసీఆర్ అలా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం షాక్‌కి కాంగ్రెస్‌కి మైండ్ బ్లాంక్ అయ్యింది. కేసీఆర్‌తో గేమ్స్ వద్దు.

బాబు ర్యాంకుల వెనుక క్యా మతలబ్ హై..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్క్ ఆఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీనైనా..ప్రభుత్వాన్నైనా కార్పోరేట్ స్టైల్లో నడుపుతారు.  ఉద్యోగుల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు చేసి వారికి ర్యాంక్స్ ఇవ్వడం కార్పోరేట్ కంపెనీల స్టైల్. అలా ర్యాంకింగ్‌లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరచుకుంటారు. అలాగే పూర్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి త్వరలోనే ఊస్టింగ్ రెడీ అవుతుందని సంకేతాలు పంపడం సర్వే మెయిన్ కాన్సెప్ట్. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో ఐటీకి కేరాఫ్ ఆడ్రస్‌గా నిలిచిన ఆయన తనను తాను రాష్ట్రానికి సీఈవోగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్న బాబు తన కేబినెట్ మంత్రుల పనితీరుపై పర్ఫామెన్స్ రిపోర్టులు తయారు చేయించి ర్యాంకింగ్స్ ఇచ్చారు.   ఎప్పుడూ ఇచ్చే ర్యాంకింగ్సే అనుకున్నారు అంతా కాని ముఖ్యమంత్రి ఊహించని స్ట్రోక్ ఇచ్చారు. ఈ సారి ఓడలు బళ్లయ్యాయి..బళ్లు ఓడలయ్యాయి. అధినేతకు క్లోజ్‌ అనుకున్నవారు-ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనుకున్నవారు వెనుకబడిపోయారు..సరిగా పనిచేయడం లేదని..వేటు తప్పదని భావించిన వారంతా ముందుకొచ్చారు. ఇదేంటో అర్థంకాక మంత్రులు జుట్టుపీక్కుంటున్నారు. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిస్థితి చెప్పనక్కర్లేదు. సీఎంకు రైట్ హ్యాండ్‌గా..ల్యాండ్‌పూలింగ్‌లో..ప్రభుత్వంలో దాదాపు అన్నీ తానై చక్రం తిప్పుతున్న నారాయణకు చిట్టచివరి ర్యాంక్ వచ్చింది. ప్రభుత్వంలో నెంబర్ 2, ఆర్ధిక మంత్రి యనమలకు 15, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి 17వ ర్యాంక్ వచ్చింది.   అదే సమయంలో అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కు, వడ్డాణం, డబ్బుల సంచి తదితర వివాదాలతో ఎప్పుడు మంత్రి పదవి పోతుందోనని ఆందోళనలో ఉన్న పీతల సుజాత అనూహ్యంగా మొదటి ర్యాంక్‌ కొట్టేశారు. అలాగే మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించి పార్టీ పరువు తీసిన మంత్రి రావెల కిశోర్ బాబుకు 6వ స్థానం. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ర్యాంకులు వచ్చాయి. చంద్రబాబు మైండ్ గేమ్‌ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఏ పని చేసినా దాని వెనుక లోతైన మర్మం దాగుంటుంది.   అలాగే ఇప్పడు ఇచ్చిన ర్యాంకులను అర్థం చేసుకుంటే చాలా మంది మంత్రులు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం వల్ల పార్టీ ఇమేజ్ పడిపోతోంది. కొత్తగా వచ్చిన అధికారంతో అంతా తాము చెప్పినట్టే జరగాలని పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది. వీళ్ల జోరు తగ్గించడంతో పాటు,  ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ, రిజర్వేషన్లు తదితర అంశాలు భవిష్యత్తులో తనను టార్గెట్ చేయకుండా ఉండటానికి ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను చూసిచూడనట్లుగా వదిలివేయాలని టీడీపీ అధినేత భావించారు.   దళిత నేత అయిన రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో కేసీఆర్ పట్ల పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యాపించాయి.ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బాబు తన కేబినెట్‌లోని దళిత మంత్రులను అందలం ఎక్కించి తద్వారా ఆ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా చూసుకున్నారు. దానితో పాటు విశాఖకు చెందిన కీలక నేత గంటా వ్యవహరశైలిపై ముఖ్యమంత్రి ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటీకే చాలాసార్లు సీరియస్ అవుతున్నప్పటికీ ఈ మంత్రి గారి తీరు మారకపోవడంతో బాబు గుర్రుగా ఉన్నారు. అందుకే గంటాకి లెక్కలతో షాక్ ఇచ్చారు .   అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో తన మార్క్ పడలేదని భావిస్తున్నారు చంద్రన్న. రాబోయేది కీలక సమయం..ఎన్నికలపై ప్రభావం చూపించే కాలం కావడంతో సమర్థులైన వారిని కేబినెట్‌లో తీసుకోవాలనుకుంటున్నారు. మంత్రులకు ఈ ర్యాంక్‌లు ఒక హెచ్చరిక కావచ్చు లేక ఎవరి పదవి పోతుందో ముందుగానే బాబు తెలియజేసి ఉండవచ్చు. మొత్తానికి బాబు ర్యాంకుల వెనుక రహస్యాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఏదైనా పనిచేసేముందు దానికి సంబంధించిన సంకేతాలివ్వడం బాబు స్టైల్. ఆ ట్విస్ట్ ఎంటో అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది.

చంద్రబాబు ఆ ఛాన్స్ జగన్‌కి ఇస్తారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్..ఎన్నికల్లో ఓటమి, కేసులు, తదితరాలతో తన ఇమేజ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని గమనించారు. తన పాపులారిటీ పడిపోకుండా..జనాలు తన పార్టీని మార్చిపోకుండా , రోజూ వార్తల్లో నిలిచేందుకు జగన్ కొత్త స్కెచ్ గీశారు. అదే పాదయాత్ర. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చి అధికారంలోకి కూర్చోబెట్టింది మండుటెండలను సైతం లెక్కచేయకుండా పల్లె బాట పట్టారు వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా 1467 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు, వారి కోరికలు, అవసరాలను ఆకలింపు చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పిదాలను విమర్శిస్తూ ప్రజల మనిషిగా మారారు.   మళ్లీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే పాదయాత్రను నమ్ముకుని ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఈ యాత్ర చంద్రబాబుకు తిరిగి అధికారం కట్టబెట్టడంలో పూర్తిగా కాకున్నా కొంతమేర పనిచేసింది. ఆ తరహాలోనే తాను కూడా పాదయాత్రతో లబ్ధి పోందాలని చూస్తున్నారు యువనేత. జగన్‌కు యాత్రలు కొత్త కాదు. ఇంతకు ముందు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చే ఉద్దేశ్యంతో ఓదార్పు యాత్ర, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చడానికి పరామర్శ యాత్రలు నిర్వహించారు. ఆ రెండు యాత్రలతో తెలుగు నేలను చుట్టారు జగన్.   తెలుగు దేశం తన ఎమ్మెల్యేలను వరుసగా ఎగరేసుకుని పోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ ఉన్నవారినైనా కాపాడుకోవాలని  పాదయాత్రతో తనకు ప్రజల్లో ఛరిష్మా తగ్గలేదని వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఎమ్మెల్యేలకు చేరవేయాలన్నది జగన్ వ్యూహం. ఇది ఒకవైపు చేస్తూనే ముఖ్యమంత్రిపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.   వీటన్నింటిని ఒక కంట గమనిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌కి చెక్ పెట్టే స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే పాదయాత్ర పవర్ ఏంటో ఆయనకు తెలిసినంతగా మరేవ్వరికి తెలియదు. తనకు హ్యాట్రిక్‌ని దూరం చేసింది పాదయాత్ర..తనను మళ్లీ సీఎంని చేసింది పాదయాత్ర. మరి అలాంటి పాదయాత్రని జగన్ మరోసారి తెరమీదకు తీసుకువస్తుండటంతో సీఎం అలర్టయ్యారు. ఒకప్పుడు తన పాలనను విమర్శిస్తూ వైఎస్ చేసిన పాదయాత్రని ఆయన సరిగా పట్టించుకోలేదు. దీనికి ఆదిలోనే చెక్ పెట్టుంటే రాష్ట్ర, దేశ రాజకీయాలు వేరేలా ఉండేవి. కాబట్టి ఆ తప్పుని మళ్లీ చేయడానికి బాబు సిద్ధంగా లేరు. వైఎస్‌కి ఛాన్స్‌ ఇచ్చినా..జగన్‌కి మాత్రం ఆ ఛాన్స్ ఇచ్చేది లేదంటున్నారు టీడీపీ అధినేత. 

పీఎఫ్ నిబంధన..భగ్గుమన్న కార్మికలోకం

కేంద్రం నిన్న ప్రకటించిన కొత్త పీఎఫ్ నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. భారత ఐటీ రాజధాని బెంగుళూరు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ వేలాదిగా తరలివచ్చి వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు దీనిని అడ్డుకోవడంతో పలుచోట్ల కార్మికులు విధ్వంసకాండకు దిగారు. బస్సులు, ఇతర వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. అసలు కార్మికులు ఇంతగా రగిలిపోవడానికి కారణమేంటి..?    గత నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. కాని సవరణ ప్రకారం రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా మొత్తం సోమ్మును విత్ డ్రా చేసుకోవడం కుదరదు. ఒకవేళ ఉద్యోగం పోయిన పక్షంలో ఉద్యోగి తన వాటాగా చెల్లించిన మొత్తాన్ని, వడ్డీని మాత్రేమే వెనక్కి పొందగలడు, యాజమాన్యం వాటా మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఉద్యోగానికి రాజీనామా చేసి పీఎఫ్ సోమ్ము తీసుకోవడం ఇంతకు ముందు ఉండేది కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తన వాటా మాత్రమే తీసుకోగలడు.   యజమాని వాటా రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలుంది. రిటైర్మెంట్ వయసు 55 సంవత్సరాలైతే దీనిని 58 ఏళ్లకు పెంచారు. పాత నిబంధన ప్రకారం రిటైర్మెంట్‌కు ఏడాది ముందు..అంటే 54 ఏళ్ల వయసులో పీఎఫ్ మొత్తంలో 90 శాతాన్ని మాత్రమే తీసుకునే అవకాశముంది. రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు పెంచడం వల్ల ఈ అవకాశం 57 ఏళ్లకు మాత్రమే వస్తుంది. నిబంధనలు కఠినతరం కావడంతో కార్మికుల్లో అసంతృప్తి పెల్లుబికింది. వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాత నిబంధనలే అమల్లో ఉంటాయని చెప్పారు. యాజమాన్య కోటాలోని 3.67 శాతంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం జరిగిన మీడియా సమావేశంలో కొత్త నిబంధనలను ఆగష్టు 1 నుంచి అమల్లోకి తెస్తామన్న ఆయన సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చి నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.   అసలు ఇంత తతంగాన్ని జరపాల్సిన అవసరం కేంద్రానికి ఏమోచ్చింది. అసలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది. అందుకు సమాధానం ఒక్కటే దేశ నిర్మాణానికి,  పారిశ్రామికాభివృద్ధికి డబ్బు కావాలి. దానికి బాండ్లు, సెక్యూరిటీలు ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. అందుకే కేంద్రం కన్ను భవిష్యనిధిపై పడింది. రిటైర్ అయ్యే వరకు పీఎఫ్ సోమ్మును తన దగ్గరే అట్టిపెట్టుకుని వాటిని ఇతర పథకాలకు మళ్లించాలని కేంద్రం స్కెచ్. కాని కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయన్న వాస్తవాన్ని మోడీ గుర్తిస్తే మంచింది. లేదంటే బెంగుళూరు హీట్ దేశం మొత్తం పాకుతుంది.

సిద్ధూపై వేటు..కర్ణాటక ముఖ్యమంత్రిగా మల్లిఖార్జున ఖర్గే..?

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. అంతా భావించినట్టుగానే వరుస వివాదాలతో పార్టీ పరువు దెబ్బతీస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా సిద్దూ స్థానంలో లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గేను ముఖ్యమంత్రిగా నియమించాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ఖరీదైన హాబ్లేట్ వాచీ పెట్టుకుని కనిపించడంతో అది ఎక్కడ నుంచి వచ్చిందంటూ సిద్థరామయ్యపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. దీంతో ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చుకుని చివరికి వాచీని రాష్ట్ర ఖజానాకు ఇచ్చివేయడంతో వివాదం ముగిసింది.   వాచీ వ్యవహారంలో పీకల్లోతు కూరుకున్న ఆయన ఏసీబీ ఏర్పాటుతో తీవ్ర విమర్శలపాలయ్యారు. రాష్ట్రానికే పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన లోకాయుక్తను కాదని సీఎం ఏసీబీని ఏర్పాటు చేయడంపై కన్నడిగులతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశాయి. మరోసారి సీఎం పుత్ర వాత్సల్యం ఆయన చేత మరో తప్పు చేయించింది. సిద్దూ కుమారుడు డాక్టర్ యతీంద్ర డైరెక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఏర్పాటుచేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది. దీనిని తన పుత్రరత్నానికి కట్టబెట్టి వివాదంలోకి కూరుకున్నారు సీఎం.   ముఖ్యమంత్రి వరుస వివాదాలపై ఒక కన్నెసిన హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ని ఢిల్లీకి పిలిపించింది. ఆయన తాజా పరిస్థితిని పెద్దలకు వివరించారు. ఈ క్రమంలో దక్షిణాదిలో తాను అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధూకి ఉద్వాసన పలికి..ఆయన స్థానంలో ఖర్గేని సీఎం చేయాలని సోనియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేయటమే కాకుండా..మోడీ సర్కార్ మీద అవసరానికి తగ్గట్టు నిప్పులు చెరిగే ఖర్గే రుణాన్ని సోనియా ఈ రకంగా తీర్చుకోదలచారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే సిద్థరామయ్యని సీఎం నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.