మంత్రి గంటాకు షోకాజ్ నోటీస్..!!

      రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. త్వరలో ఆయన షోకాజ్ నోటీసులు ఇవ్వనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైందని, విభజనపై తీవ్రంగా విమర్శలు చేస్తుండడంతో గంటాపై హైకమాండ్ మడిపడుతోంది. రెండు, మూడు రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించినట్లు తెలియవచ్చింది. గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిలో ఉన్న నేపథ్యంలో షోకాజ్ నోటీసులు పీసీసీ ఇవ్వాలా, లేక ఏఐసీసీ ఇవ్వాలా అన్నదానిపై అధిష్టానం సోమవారం నిర్ణయం తీసుకోనుంది. కాగా గంటా తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తనకు వచ్చిన షోకాజ్ నోటీస్‌పై శుక్రవారం వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తి వివరణ ఇస్తాని పీసీసీకి తెలిపుతూ వివరణ ఇచ్చారు.

ఒక్క త్రాటి పైకి వచ్చిన టీ-నేతలు

  ఒకప్పుడు సమైక్యశక్తిగా కనబడిన సీమాంధ్ర నేతలందరూ ఇప్పుడు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కత్తులు దూసుకొంటుంటే, ఒకప్పుడు కత్తులు దూసుకొన్న తెలంగాణా నేతలందరూ తమ స్వప్రయోజనాలను, పార్టీ జెండాలను పక్కనబెట్టి ఒక్క త్రాటి పైకి వచ్చి చివరి దశకు చేరుకొన్నరాష్ట్ర విభజన, తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.   ఈరోజు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మంత్రుల క్వార్టర్స్ లో ఉన్న క్లబ్ హౌస్ లో తెలంగాణా ప్రాంత నేతలందరికీ చిన్నవిందు సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే తెదేపాతో సహా అన్నిపార్టీలకు చెందిన నేతలు దానికి హాజరయ్యారు. వారంతా ఈ సమావేశంలో శాసనసభలో తెలంగాణా బిల్లుపై అనుసరించవలసిన వ్యూహం, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి తగిన మద్దతు కూడగట్టడం, తెలంగాణా బిల్లులో చేయవలసిన సవరణల గురించి చర్చించడం తదితర అంశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల23న బిల్లు రాష్ట్రపతికి త్రిప్పి పంపేవరకు ఏ పార్టీ కూడా ఎటువంటి కార్యక్రమాలు చెప్పట్టకుండా అందరూ పూర్తిగా బిల్లు ఆమోదం కోసమే కృషి చేయాలని తీర్మానించారు.   ఇదే సమయంలో ఏపీఎన్జీవోలు ఈరోజు సీమాంధ్ర బంద్ కు పిలుపునీయగా, వారికి సమాంతరంగా వైకాపా కూడా బంద్ కు పిలుపునిచ్చింది. తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఉద్యోగుల బందుకు సహకరిస్తుంటే, వైకాపా వేరేగా బంద్ నిర్వహించుకొంటోంది. అంటే ఎవరి బంద్ వారిదేనన్నమాట! ఇక ఆరుగురు కాంగ్రెస్ యంపీలు మొదలుపెట్టిన సంకల్పదీక్షకు వివిధ కారణాలతో కొందరు హాజరు కాలేదు. హాజరయిన వారిలో హర్షకుమార్ మాట్లాడుతూ తాము ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నపటికీ తమ పార్టీ చేసిన నిర్వాకానికి తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగామారిందని, ఎవరు ఏ పార్టీలో ఉంటామో చెప్పలేని పరిస్థితులు దాపురించాయని చెప్పడం చూస్తే వారి సంకల్పం, దీక్షలు ప్రజలను మెప్పించడానికే తప్ప రాష్ట్ర విభజనకు నిరసనగా చేస్తున్నవి కావని స్పష్టం అవుతోంది.   తెలంగాణా నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చితెలంగాణా సాధన కోసం పోరాడుతుంటే, సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర కోసమంటూ త్రాడుని చెరోవైపు లాగుతూ తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.

మోడీ ప్రధాని అయితే వినాశన౦: ప్రధాని

      ''బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రధాని అయితే దేశానికి వినాశకరం. గుజరాత్‌లో జరిగిన మారణహోమం దేశంలో జరగాలనుకోవడం లేదు” అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మోడీ మీద తన అభిప్రాయాన్ని ఇలా వినిపించారు. తన పదేళ్ల పాలనగురించి ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామీణ వికాసానికి యూపీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ , రోడ్ల విషయంలో గణనీయ అభివృద్ధి సాధించామని అన్నారు.   మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనని, రాహుల్ సమర్థవంతమైన నాయకుడని తెలిపారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై సరైన సమయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఎన్నికల తరువాత కొత్త ప్రధానికి నా బాధ్యతలు అప్పగిస్తానని తెలిపారు. ఉపకార వేతనాలు, సర్వశిక్ష అభియాన్ లతో విద్యా వ్యవస్థ మెరుగుపడిందని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. నిత్యావసరాల ధరలు నియంత్రణకు చర్యలు తీసుకున్నామని, ఆహార భద్రత బిల్లుతో ప్రజలకు మేలు చేశామని అన్నారు. గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, రక్షణ రంగంలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు.

సాగని చర్చ...రేపటికి వాయిదా

      అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభ సభ్యుల ఆందోళనలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలను కొనసాగించారు. స్పీకర్ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు వినలేదు. దీంతో చేసేది లేక స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఇక ఇరు ప్రాంత సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. రెండు సార్ల వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ బిల్లు చర్చకు రాకుండానే ఈ రోజు సభలు వాయిదాలు పడ్డాయి.

రాహుల్ గాంధీకి మన్మోహన్ లైన్ క్లియర్

  ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే తాను మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోనని ప్రకటించారు. రాహుల్ గాంధీకి ప్రధాని కాగల అన్నిఅర్హతలు ఉన్నాయని, అతని సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము, దేశం అన్నీ మంచి ప్రగతి సాధిస్తాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఆయన ప్రకటన రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలని స్పష్టంగా ప్రతిభింపజేస్తోంది. ఆయన రేసు నుండి తప్పుకొంటున్నట్లు విస్పష్టంగా ప్రకటించడం పూర్తయింది గనుక, ఇక త్వరలోనో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ అధిష్టానం యువరాజ పట్టాభిషేక ప్రకటన కూడా చేయవచ్చును.

సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష మొదలు

      రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సీమాంధ్ర ఎంపీలు సంకల్ప దీక్ష చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఆ దీక్షలో పాల్గొన్నారు. వారందరూ తమ యంపీ పదవులకు రాజీనామాలు చేసామని చెప్పుకొంటారు. కానీ నేటికీ అవి ఆమోదం పొందలేదు గనుక యంపీలుగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు. కానీ అది సభలో చర్చకే రాదు.   ఇప్పడు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ రెండు రోజులు దీక్ష చేయబోతున్నారు. కానీ రాష్ట్ర విభజన ఆగబోదు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నపుడు యంపీలయిన వారందరూ అధికారికంగా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద వారు చేసే దీక్షవల్ల కొత్తగా ఏమి ఒరుగుతుందో వారికే తెలియాలి. బహుశః తామే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చును. రేపు తెలంగాణావాదులెవరయినా అక్కడకి వచ్చిఅలజడి సృష్టిస్తే, తాము ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నామని చెప్పుకొని సానుభూతి ఓట్లు కూడా ఆశించవచ్చును. 

మంత్రిపదవికి శ్రీధర్ బాబు రాజీనామా

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేసిన బౌన్సర్ కు మంత్రి శ్రీధర్ బాబు వికెట్ పడింది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖ తప్పించడంపై నిరసనగా శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని వ్యక్తిగత సహాయకుడితో ముఖ్యమంత్రికి పంపించారు. ''నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను...నా రాజీనామాను ఆమోదించండి'' అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.ఈ రాజీనామాను ఆమోదించకుండా సీఎం పెండింగ్‌లో ఉంచారు. రాజీనామా చేయకుండా శ్రీధర్‌బాబుకు సర్దిచెప్పేందుకు తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. సహచర మంత్రులతో పాటు ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి దామోర రాజనరసింహ కూడా నచ్చజెప్పిన శ్రీధర్ రాజీనామాకె మొగ్గు చూపారు.

సభ జరుగు విదంబు ఎట్టిదనగా

  నేటి నుండి మళ్ళీశాసనసభ శీతాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ నెల 23వరకు సాగే ఈ సమావేశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యలో మూడు రోజుల పాటు అంటే 13నుండి 15వరకు విరామం ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్నిరాజకీయ పార్టీలు ఈ సమావేశాలలో ఏవిధంగా వ్యవాహరించబోతున్నాయో, సభలో ఏమి జరగబోతోందో కూడా ఊహించవచ్చును.   ఓం ప్రధమంగా సభ మొదలవగానే సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు ‘జై సమైఖ్యాంధ్ర’ నినాదాలు చేస్తూ సమైక్యతీర్మానం కోసం పట్టుబడితే, తెలంగాణాకు చెందిన సభ్యులు ‘జై తెలంగాణా’ నినాదాలతో దానిని వ్యతిరేఖిస్తూ అందరూ కలిసి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను చుట్టుముడితే, ఆయన గంటకో, అరగంటకో సభను వాయిదావేస్తుంటారు. ఇక ఒకవేళ సభ జరిగే పరిస్థితే ఏర్పడితే, మొన్న శ్రీధర్ బాబు మంత్రిత్వ శాఖ మార్పు, దానికి నిరసనగా ఆయన రాజీనామా వ్యవహారం పుచ్చుకొని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరగడం ఖాయం. అయితే నిన్న కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని ముఖ్యమంత్రి అనుచరులు ఎదురుదాడికి దిగినప్పుడు వారి వాగ్వాదాలతో సభ దద్దరిల్లడం ఖాయం. కానీ, ఒకరు సమైక్యతీర్మానం కోసం, మరొకరు దానిని వ్యతిరేఖిస్తూ సభను స్తంభింపజేసే అవకాశాలే ఉన్నాయి గనుక బిల్లుపై చర్చ సంగతి దేవుడెరుగు, కనీసం శ్రీధర్ బాబు వ్యవహారంపై కసితీరా వాదోపవాదాలు చేసుకొనే భాగ్యానికి కూడా సభ్యులు నోచుకోకపోవచ్చును.

విశ్వాసపరీక్షలో కేజ్రీవాల్ విజయం

      ఢిల్లీ శాసనసభలో ఆమాద్మీ పార్టీ తన బలం నిరూపించుకుంది. మొత్తం 70మంది ఉన్న అసెంబ్లీ లో 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు ఇవ్వడంతో ఆమాద్మీ విశ్వాస పరీక్ష నెగ్గింది.   ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అమ్ఆద్మీపార్టీకి 28 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు 8 స్థానాలు వచ్చాయి. ఏఏపీకి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ జరుగుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆరు నెలల వరకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ ఆరు నెలల్లో ఏఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసి ఉంటుంది.

చరిత్రలో ఇదే తొలిసారి, శ్రీధర్ ఇష్యూ నో

      ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యంతర భృతిపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి అంగీకరించమని, 2014 జనవరి ఒకటి నుంచి ఐఆర్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఉద్యమాల వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గడానికి కారణమయ్యాయని అన్నారు.  ఒకటి, రెండు రోజుల్లో హెల్త్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.వాణిజ్యపన్నుల శాఖను స్వీకరించబోనన్న శ్రీధర్‌బాబు ప్రకటనపై స్పందించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుని ప్రమోట్ చేస్తున్నారా?

  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలందరి వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్ర విభజన గురించి చాలా ముందుగానే తెలిసి ఉన్నా ఆవిషయాన్ని చివరివరకు దాచిపెట్టి తరువాత ఆడిన నాటకాలు చూస్తూనే ఉన్నాము. ఇక తను ముఖ్యమంత్రి పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరిగే పరసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లు శాసనసభకు చేరుకోనేవరకు అందరినీ కట్టడిచేసి, విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు తెలంగాణా వారికంటే ఎక్కువ సహకారం అందించారు. బిల్లువచ్చాక దాని అంతు తేలుస్తామని ప్రగల్భాలు పలికిన ఆయన అది ప్రవేశపెడుతున్నపుడు అసలు సభకే హాజరు కాలేదు. ఆ తరువాత కూడా దాని గురించి గట్టిగా మాట్లాడింది లేదు.   ఇప్పడు శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందు శ్రీధర్ బాబు మంత్రి పదవి వెనక్కి తీసుకొని మళ్ళీ మరో కొత్త నాటకానికి తెర లేపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జరుగుతున్న రగడ, ఆయన రాజీనామా డ్రామాతో వెల్లువెత్తుతున్నసానుభూతి మంత్రి శ్రీధర్ బాబుని ఒకే ఒక్క రోజులో తెలంగాణా హీరోగా ఎదిగిపోయారు. ఆయన శాఖ మార్పిడితో తెలంగాణా బిల్లుకి వచ్చేనష్టం ఏమీ లేదని అందరికీ తెలిసినప్పటికీ, అందరూ కూడా ఏదో ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు దాని గురించే మాట్లాడుకొంటున్నారు. ఇది చివరికి ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా తెలంగాణా బంద్ కి పిలుపు ఇచ్చేంత. ఇంత చిన్న విషయానికి ఇంత హంగామా ఎందుకు జరుగుతోందనే అనుమానాలు కూడా కలగడం సహజం.   ఇంతకాలంగా మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సంగతి అందరికీ తెలుసు. ఒకరు తెలంగాణా కోసం, మరొకరు సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నపటికీ, అది వారి స్నేహానికి ఎన్నడూ కూడా పెద్ద అడ్డంకిగా మారలేదు. తెలంగాణా ఏర్పాటు అనివార్యమని ముఖ్యమంత్రికి తెలియకపోలేదు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదటి ముఖ్యమంత్రి కావాలనుకొనే వారిలో శ్రీధర్ బాబు కూడా ఒకరని కూడా తెలియకపోలేదు.   అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేఖించే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంకా గీతారెడ్డి, డీ.శ్రీనివాస్ వంటి హేమాహేమీలు అనేకమంది ఈ రేసులో ఉన్నారు. వారందరితో పోలిస్తే శ్రీధర్ బాబు ఈ రేసులో కొంచెం వెనకబడి ఉన్నారనేది సుస్పష్టం. మరి తనకు ఆప్తుడయిన శ్రీధర్ బాబుని ఈ రేసులో అందరి కంటే ముందుకు తీసుకు వెళ్ళాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒకటి చేయక తప్పదు. ఆయనేమి చేసారో, దానివల్ల శ్రీధర్ బాబు స్కోర్ ఒక్కసారిగా ఎలా పెరిగిపోయిందో వేరే చెప్పనవసరం లేదు.   రాష్ట్రం విడిపోయిన తరువాత తనను తీవ్రంగా వ్యతిరేఖించే దామోదర, జానారెడ్డి, జైపాల్ రెడ్డివంటి వారికంటే, తనకు అత్యంత ఆప్తుడయిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కాగలిగితే దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డికి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. బహుశః అందుకే ఈ మిత్రభేధమనే డ్రామా మొదలయినట్లు భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తను ఏవిధంగా సమైక్య చాంపియన్ గా ఎదిగారో, అదేవిధంగా అదును చూసి శ్రీధర్ బాబుకి మంత్రి పదవి తొలగించి అతనిని కూడా రాత్రికి రాత్రి తెలంగాణాలో హీరోగా మార్చేసారు.   మరి శ్రీధర్ బాబు ఈ వేడిని ఎంతకాలం కాపాడుకొని తెలంగాణాలో తన రేటింగ్ పెంచుకోగలరనేది ఆయన శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. తాటిచెట్టు ఎక్కేందుకు ఎవరయినా కొంత వరకే సాయం చేయగలరు. ఆ తరువాత స్వయంగా ఎక్కవలసి ఉంటుంది. ఇది కూడా అంతే మరి.

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు: 27 మంది మృతి

      దేశంలో జరుగుతున్న రైలు,బస్సు ప్రమాదాలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు బస్సు, రైలు ప్రయాణాలు చేయాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అనంతపురంలో నా౦దేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదా సంఘటన మరచిపోకముందే...తాజాగా మహారాష్ట్రలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందారు.   40 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న బస్సు థానే జిల్లా తోకవాడే సమీపంలో మాల్‌సేజ్ ఘాట్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఓ మూలవద్ద బస్సు పైకి ఓ టెంపో దూసుకు రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి 250 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, అందులో 19 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు.

ఈ రాద్ధాంతం కూడా కాంగ్రెస్ వ్యూహమేనా

  ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్ నేతలు అందరూ శ్రీధర్‌బాబు మంత్రిత్వశాఖ మార్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో వీ.హనుమంత రావు నిర్వహిస్తున్నఇందిరమ్మ విజయయాత్రలో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాను, మంత్రి శ్రీధర్‌బాబుతో సహా తెలంగాణా నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పిర్యాదు చేసారు. ఆయన ముఖ్యమంత్రిని మందలిస్తున్నట్లు ఏమయినా చెప్తారేమోనని వారు భావిస్తే, కుంతియా ‘ముఖ్యమంత్రికి తన మంత్రుల శాఖలను మార్చేస్వేచ్చ,అధికారం ఉంటుందని’ చెప్పడంతో షాక్ తిన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి నిరసనగా వారందరూ మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసిన మంత్రి టీజీ వెంకటేష్, “ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం వారికి నచ్చకపోతే రాజీనామా చేయడమే మేలు” అంటూ వ్యాఖ్యలు చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా కలుగజేసుకొంటూ ఇటువంటి సమయంలో మంత్రిత్వ శాఖలు మార్చడం సబబు కాదు. అయినా శాఖలు మార్చిననత మాత్రాన్న తెలంగాణా ఏర్పాటు ఆగిపోతుందని భావించడం అవివేకం, అని మీడియాతో అన్నారు.   రేపు శాసనసభలో అందరూ కలిసి కట్టుగా ముఖ్యమంత్రిని, ఆయన సహచరులను గట్టిగా డ్డీ కొనవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో మంత్రి శైలజానాథ్ ప్రతిపాదించనున్న సమైక్యతీర్మానాన్నిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొంటామని టీ-కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సమైక్యతీర్మానం చేసిన తరువాతనే తెలంగాణా బిల్లుపై చర్చకు అంగీకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు కూడా అంతే ఖరాఖండిగా చెపుతున్నారు. అంటే శాసనసభలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరగకుండానే జనవరి23 రాష్ట్రపతికి తిప్పి పంపే అవకాశాలే ఎక్కువని స్పష్టం అవుతోంది. బిల్లుపై సభలో ఎలాగు చర్చ జరిగే అవకాశం లేదు గనుక, తక్షణమే దానిని రాష్ట్రపతికి తిప్పి పంపమని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు రేపు గట్టిగా పట్టుబట్టడం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి దానిని జనవరి23 గడువు వరకు ఇక్కడే ఆపడం కూడా అంతే ఖాయం. ఈ కాంగ్రెస్ నేతల డ్రామాలన్నీచూస్తుంటే తెలంగాణా బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు దానిని ఎటువంటి చర్చ జరగకుండా, వ్యతిరేఖ ముద్ర పడకుండా ఏవిధంగా రాష్ట్రపతికి తిప్పి పంపాలో అంతా ముందే ప్లాన్ తయారు చేసుకొని అందరూ దాని ప్రకారమే నటించేస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే జైపాల్ రెడ్డి మొదలు టీజీ వెంకటేష్ వరకు అందరూ కలిసి ఇంత రాద్ధాంతం చేయవలసిన సమస్య కాదిది.

సీఎం హెలీకాఫ్టర్‌ను గాల్లో పేల్చేస్తా౦: పొన్నం

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఎర్రంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం జిల్లాకు సీఎం వస్తే హెలీకాఫ్టర్‌ను గాల్లోనే తుపాకీతో పేల్చేసామని హెచ్చరించారు. ‘కిరణ్‌ కరీంనగర్‌కి రావొద్దని సూచిస్తున్నాం.. హెచ్చరిస్తున్నాం.. కాదని సిగ్గులేకుండా వస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. కిరణ్‌ వస్తే హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదే ఆయన తెలిపారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పుతో కిరణ్ వక్రబుద్ది బయటపడిందన్నారు. తెలంగాణ మంత్రులు అసెంబ్లీలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని, అవసరమైతే క్యాంప్ ఆఫీస్‌ను ఆక్రమించుకోవాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

శ్రీధర్ బాబు రాజీనామా..!!

      మంత్రి శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన 'బౌన్సర్'కు తెలంగాణ నేతల నుంచి తీవ్రస్థాయిలో కౌంటర్ ఎదురవుతోంది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించినందుకు నిరసనగా... పౌరసరఫరాల శాఖనూ వదులుకోవాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్‌ కు రాజీనామా లేఖను సమర్పించబోతున్నట్లు తనతోటి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులకు తెలియజేశారు. తన రాజీనామాపై శ్రీధర్ బాబు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ తో చర్చించారు. శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయనకు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖను తీసుకునేది లేదని... పైగా, పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు.     

సమైక్య తీర్మానానికి వైకాపా మద్దతు ఇస్తుందా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభ వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకొని దానిని తన సమైక్య అనుచరుడు శైలజానాథ్ కు కట్టబెట్టారు. దానిపై ప్రస్తుతం జరుగుతున్నయుద్ధం గురించి అందరూ చూస్తూనే ఉన్నాము. శైలజానాథ్ చేత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ శాసనసభలోఒక తీర్మానం ప్రవేశపెట్టించాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనబడుతోంది.   వైకాపా మొదటి నుండి సమైక్య తీర్మానం కోసం పట్టుబడుతూ, అదిచేసే వరకు సభను నడవనీయమని చెపుతున్నందున, ఇప్పుడు తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతు ఈయవలసి ఉంటుంది. ఇక ఇటీవల ఏపీఎన్జీవోలు సమైక్యాంద్ర కోసం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, తెదేపాలు రాష్ట్రాన్ని విడిపోకుండా ఉంచేందుకు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి గనుక సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానికి బేషరతు మద్దతు ఈయవలసి ఉంటుంది. కానీ వారితో కలిసి పనిచేయడానికి ఇష్టంలేదని కుంటిసాకుతో ఆ వైకాపా సమావేశానికి హాజరవలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే వైఖరి అవలంబించవచ్చును.   వైకాపా మొదటి నుండి ఈ తీర్మానం కోసమే పట్టుబడుతునందున, ఇప్పడు అది సభలో ప్రవేశపెట్టబడినట్లయితే దానికి మద్దతు ఈయకుండా తప్పించుకోవడం కూడా కష్టమే. అలాగని మద్దతు ఇస్తే దానివలన ముఖ్యమంత్రికే మరింత పేరు వస్తుంది తప్ప వైకాపాకు రాదు. సీమాంధ్రలో ఏకైక సమైక్యచాంపియన్ గా నిలబడాలనుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తనకు పోటీగా తయారవ్వాలని కోరుకోరు. అదీగాక, రాష్ట్ర విభజన జరిగితే తప్ప వైకాపాకు రాజకీయ లబ్ది కలుగదు. ఈ తెర్మానానికి మద్దతు ఇస్తే అది విభజనకు అడ్డంకులు సృష్టిస్తే, ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరుగకపోతే వైకాపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గనుక ఒకవేళ సభలో మంత్రి శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినా దానికి వైకాపా ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును.   ఇది వైకాపాకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస శాసనసభ్యులు ఆ తీర్మానం సభలో ప్రవేశపెట్టకుండా సభను ఎలాగూ స్తంభింపజేస్తారు గనుక, వైకాపాకు ఇక దాని గురించి ఎటువంటి దిగులు ఉండదు. కావాలంటే తను కూడా వాళ్ళతో చేరి సమైక్యతీర్మానం ప్రవేశపెట్టమని గొడవ చేస్తూ సభను స్తంభింపజేసి వాయిదాపడేలాచేయవచ్చు.

శ్రీధర్ బాబుకి జలక్ దేనికో?

  ఇంతకాలం గట్టిగా సమైక్యవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు తెలంగాణా బిల్లురాగానే చాలా వీరోచితంగా పోరాడి బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తే, ఆయన చప్పగా చల్లారిపోవడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నిన్నఆ పదవి నుండి తప్పించి, ఆ శాఖను తన అనుచరుడు మంత్రి ఎస్‌.శైలజానాద్‌కు అదనపు బాధ్యతగా అప్పగించారు. సరిగ్గా మరో రెండు రోజుల్లో శాసనసభ మళ్ళీ సమావేశాలు మొదలవనున్న ఈ సమయంలో తెలంగాణా బిల్లును సభలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న శ్రీధర్‌బాబును ఆ పదవి నుండి తప్పించడం ద్వారా రాజకీయాలలో మళ్ళీ ఒక్కసారిగా వేడి పుట్టించారు.   అధిష్టానం ఆమోదముద్ర లేనిదే రాష్ట్ర మంత్రుల నియామకాలు, వారి శాఖల మార్పులు చేయ సాహసించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే కీలకమయిన ఈ సమయంలో ఒక తెలంగాణా మంత్రిని శాఖ నుండి తప్పించడం మరోమారు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంగానే భావించవచ్చును. దానివల్ల సీమాంధ్ర ప్రజలో దృష్టిలో ఆయన మళ్ళీ సమైక్యహీరోగా మరికొన్ని మార్కులు సంపాదించుకోవచ్చును.   అంతే గాక ఈ నిర్ణయం తెలంగాణా నేతలందరికీ ఆగ్రహం తెప్పించడం సహజమే గనుక రేపు వారందరూ సభలో ఆయనపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నపుడు, ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో అభిమన్యుడులాగ వారినందరినీ వీరోచితంగా ఎదుర్కొని పోరాడడం ద్వారా ఈ మధ్య కాలంలో మసకబారిన తన సమైక్య చాంపియన్ ట్రోఫీకి మళ్ళీ కొత్త మెరుపులు ఆద్దుకొనే అవకాశం కూడా ఆయనకు కలుగుతుంది. ఇవన్నీఆయన కొత్త పార్టీకి ప్రజల సానుభూతిని, మద్దతుని సంపాదించిపెడతాయి కూడా.   ఇక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న శైలజానాథ్ కు శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఈసారి సభలో తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. అయితే ఓటింగు కూడా అవసరం లేని బిల్లుని వారు ఎంతగట్టిగా వ్యతిరేఖించినా దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు. బిల్లుపై వ్యతిరేఖతకు సిద్డంపడిన తరువాతనే కేంద్రం దానిని శాసనసభకు పంపింది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇదేమి ఆందోళన కలిగించే విషయం కాదనే చెప్పవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు బిల్లుపై చర్చకు సిద్దమయినప్పటికీ, సభలో సమైక్యతీర్మానం చేసేవరకు సభను నడవనీయమని జగన్మోహన్ రెడ్డి చెపుతునందున సభలో చర్చజరగడం అనుమానాస్పదమే. కానీ, ముఖ్యమంత్రికి సభలో చర్చ జరిపే ఉద్దేశ్యం ఉంటే, వైకాపా సభ్యులతో సహా సభలో ఆందోళన చేస్తున్నవారిని సస్పెండ్ చేయవలసి ఉంటుంది. వైకాపా, తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా బహుశః అదే కోరుకొంటునట్లయితే, వారు సభ నుండి బహిష్కరింపబడగానే, మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీలపై రంకెలు వేసి తృప్తి పడవచ్చును.   ఈసారి సమావేశాలలో జరిగిన పరిణామాలను బట్టి, మళ్ళీ శాసనసభ జనవరి16న చివరిసారిగా సమావేశమయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు అంతిమ పోరాటం చేసి, ముందు నుండి అనుకొన్న విధంగానే బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపి, రాజీనామాలు చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందు రావచ్చును.

శ్రీధర్ బాబుపై కిరణ్ బౌన్సర్...'టి' నేతలకు ఝలక్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సంవత్సరం రోజున మంత్రి శ్రీధర్ బాబుపై బౌన్సర్ విసిరి తెలంగాణ నేతలకు ఝలక్ ఇచ్చారు. శ్రీధర్‌బాబు ను శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి... సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న శైలజానాథ్‌కు ఆ శాఖను అప్పగించారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నడనే కోపంతోనే శ్రీధర్‌బాబుకు సీఎం కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మంత్రి శ్రీధర్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించడాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామన్నారు. "ఇలాంటి సమయంలో అదనపు శాఖలు అవసరంలేదు. అసలు ఏ శాఖలూ లేకున్నా ఫర్వాలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. శాసన సభా వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి శ్రీధర్‌ను తప్పించడంపై తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. ఇది సీఎం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు నుంచి శాఖ తొలగించినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహిస్తండడం విశేషం.

‘ఆప్‌’లోకి ‘పాప్‌’...

      భారతదేశంలోకి పాప్‌ ఎప్పుడు వచ్చిందంటే ఎవరూ చటుక్కున చెప్పలేరేమో కాని... పాప్‌ సింగర్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రెమో ఫెర్నాండెజ్‌. హిందీ పాప్‌ సింగర్‌గా సంచలనానికి నాంది పలికిన రెమో... తెలుగుతో సహా విభిన్న భాషల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా బోలెడన్ని పాటలు పాడారు. ఆల్బమ్‌లు విడుదల చేశారు. అవార్డులు అందుకున్నారు. సంగీత సంబరాలకు నిత్య నిలయమైన గోవానగరంలో పుట్టిన ఈ ఆల్‌ ఇండియా సింగర్‌... ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు.   అదేమిటంటే ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి చేరడం. ‘‘స్వాతంత్య్ర పోరాటం అవసరమైనంతటి పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది’’ అని అంటున్నారు రెమో. ఆ పోరాటంలో తన వంతు పాత్ర  పోషించాలని అనుకున్నా... అందుకు తగిన వేదికగా మరే పార్టీ ఆయనకు కనపడకపోవడంతో ఇన్నాళ్లూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ ఆవిర్భావం, విజయం సాధించడం తన లక్ష్యాలకు ఆప్‌ తగిన పార్టీ అని అనిపించడంతో... ఆయన ఆ పార్టీలోకి జేరిపోతున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఆప్‌ అమ్ములపొదిలో తొలి వినోద బాణం చేరిందని మనం చెప్పుకోవచ్చు.