కిరణ్ ఈటెల మధ్య వాగ్వివాదం..బాబు కౌంటర్

      తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వలేదని ఈటెల ఆరోపించారు. దీనిపై సీఎం కిరణ్ స్పందిస్తూ...తెలంగాణ నుంచి సీఎం పదివి పొందిన వారు అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును మీరు గెలిపిస్తారని నమ్మకం లేకనే మీము గెలిపించామని వ్యాఖ్యానించారు.   శాసనసభలో సీఎం కిరణ్ మాట్లాడుతూ పీవి ప్రస్తావన తేవడంతో... బాబు దానిపై స్పందించారు. పీవికి ఢిల్లీలో ఘాట్ ఎందుకు నిర్మించలేదని  ..కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పీవి చనిపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఆఫీస్ కూడా తీసుకెళ్ళలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా పీవి అంత్యక్రియలు సక్రమంగా చేయలేదన్నారు.పీవీని కాంగ్రెస్ హైకమాండ్ అడుగడుగా అవమానించిందన్నారు. పీవీకి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు.  

పాలెం బస్సు ప్రమాద బాధితులకి న్యాయం జరిగేదెన్నడు

  పాలెం బస్సు దుర్ఘటనలో 45మంది నిండు ప్రాణాలు మంటలకు ఆహుతయిపోయాయి. ఆప్తులను, వారి అండను కూడా పోగొట్టుకొని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నవారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్నాఇంతవరకు వారికి ఎటువంటి సహాయం, న్యాయం చేయలేదు. కనీసం వారిపట్ల సానుభూతి కూడా చూపలేకపోయింది. ఇటువంటి ఘోర దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, రాజకీయపార్టీలు వెంటనే ‘దిగ్బ్రాంతి ప్రకటనలు’ జారీ చేయడం తప్పితే, తదనంతరం వారి గోడు పట్టించుకోవని ఈ దుర్ఘటన మరోమారు రుజువు చేస్తోంది.   ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు ఎటువంటి సానుభూతికి నోచుకోకపోగా, న్యాయం కోరుతూ రోడ్డున పడాల్సిరావడం ఇంకా బాధాకరం. చిన్నచిన్న నేరాలకు సైతం కేసులు పెట్టి దోషులను కోర్టుల చుట్టూ తిప్పే పోలీసులు, 45మంది కళ్ళెదుట కాలి బూడిదయిపోతే ఇంతవరకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చూస్తే ‘చట్టం దృష్టిలో కొందరు అధిక సమానులు’ గనుకనే భాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని కూడా వేలాది ప్రమాద కేసులలో ఒకటిగా పరిగణిస్తూ మాట్లాడుతోంది తప్ప,మానవీయ కోణంలో ఆలోచించేందుకు ఇష్టపడటం లేదు. బహుశః ఈ ప్రమాదాన్ని ప్రత్యేకంగా పరిగణించి భాదిత కుటుంబాలకు న్యాయం చేస్తే, ఎప్పుడయినా దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భాదితులు ప్రభుత్వాన్నిఈవిధంగానే డిమాండ్స్ చేస్తారనే ఆలోచనతో వెనుకంజ వేస్తూ ఉండవచ్చును. అటువంటప్పుడు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి తప్పనిసరిగా ఇన్స్యూరెన్స్ చేయించాలనే నిబంధన అమలు చేస్తే, బాధిత కుటుంబాలకు కొంత మేర ఊరట లబించే అవకాశం ఉంటుంది.   ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న ప్రభుత్వం, ఇప్పుడు భాదిత కుటుంబాలకు క్రమంగా రాజకీయ పార్టీలు కూడా వచ్చిఅండగా నిలబడుతుండటంతో కొంత కదలిక వచ్చింది. నిన్న జబ్బార్ ట్రావెల్స్ భాగస్వాములను నలుగురిని సీఐడీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసారు. వారిని ఈరోజు మెహబూబ్ నగర్ కోర్టులో హాజరుపరిచి కేసుపై విచారణ మొదలుపెట్టబోతున్నారు. అయితే, రెండు రాష్ట్రాలలో రెండు బస్సు యాజమాన్యాల మధ్య జరిగిన ఒప్పందాల దృష్ట్యా ఈ కేసు ఇంత త్వరగా పరిష్కరింపబడే అవకాశం లేదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటప్పటికి ఎన్నినెలలు, సం.లు పడతాయో కోర్టులకే ఎరుక.

గాదెవెంకటరెడ్డి చొక్కా పట్టుకున్న ఎమ్మెల్యే ..!

      ఓ ఎమ్మెల్యే శాసనసభలో మరో ఎమ్మెల్యే చొక్కా పట్టుకోవడం సభలో కలకలం రేపుతోంది. ఈటెల రాజేందర్, ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ద్రోణంరాజు వద్దకు దూసుకెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఊహించని విధంగా విద్యాసాగర్ రావు… గాదె చొక్కా పట్టకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెరేగింది. సర్దిచెప్పడానికి వస్తే చొక్కా పట్టుకుంటారా? అని గాదె వెంకటరెడ్డి శాసనసభలో మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన సభ్యత, సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యుల దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని గాదె అన్నారు. చొక్కా పట్టుకున్న వారితో వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమ సభ్యుల ప్రవర్తనకు చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పారు.

బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తుందా?

  వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నసోనియాగాంధీ, ఎలాగయినా తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో పెట్టేందుకు అవసరమయిన యంపీల మద్దతు కూడ గట్టేందుకు, దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమయిన వ్యూహాలు రచించి, అమలుచేస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు చూసుకొంటే, రాష్ట్ర విభజనకు పూనుకొని చాలా భారీ విద్వంసకర వ్యూహమే అమలు చేస్తున్నారు.   తెలంగాణా ప్రజల ఆకాంక్షలు మేరకే విభజన చేస్తున్నట్లు పైకి ప్రకటిస్తున్నపటికీ, ఇంత హడావుడిగా వచ్చే ఎన్నికలలోగా తన పధకాన్నిఅమలుచేయడానికి ప్రయత్నిస్తున్నతీరు గమనిస్తే ఇదంతా కేవలం తన రాజకీయ లబ్ధికోసమే చేస్తోందని స్పష్టమవుతోంది. నరేంద్ర మోడీ ఒకసారి ప్రధాని కుర్చీలో సెటిల్ అయిపోతే ఇక రాహుల్ గాంధీకి మళ్ళీ జీవితంలో ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కకపోవచ్చనే ఆలోచనతోనే, అతని రాజకీయ భవిష్యత్తుని చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ కోట్లాది రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోంటోoది. అయితే పైకి మాత్రం తానొక పవిత్రమయిన కార్యం కోసం తన పార్టీనే పణంగా పెడుతున్న త్యాగామూర్తిలా మాట్లాడుతోంది. తెలంగాణాలో టీ-కాంగ్రెస్, తెరాసల మద్దతుతో, సీమాంధ్రలో కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, వై.కాంగ్రెస్ పార్టీల మద్దతు పొందాలనేది కాంగ్రెస్ యోచన.   అయితే ఈ వ్యూహం అమలవ్వాలంటే ముందుగా రాష్ట్ర విభజన జరగాల్సి ఉంటుంది. అందుకు బీజేపీ మద్దతు తప్పనిసరి. బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తానని నేటికీ హామీ ఇస్తున్నపటికీ, దానితోబాటే సమన్యాయం పల్లవి కూడా ఆలపించడం మరిచిపోవడం లేదు. అందువల్ల బీజేపీని గుడ్డిగా నమ్మికాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ ఆఖరి నిమిషంలో బిల్లుపై మాటమార్చితే కాంగ్రెస్ ఇరకాటంలో పడక తప్పదు. అటువంటి పరిస్థితే వస్తే, తను క్షేమంగా బయటపడే వ్యూహాలు కాంగ్రెస్ సిద్దంచేసుకొనే ఉంటుంది. బహుశః అందువలనే దిగ్విజయ్, షిండే, ఆజాద్, కమలనాథ్, మొయిలీ తదితర కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెడతామని ఒకరంటే, కాదు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని మరొకరు చెపుతూ బిల్లుపై బీజేపీతో దాగుడుమూతలు ఆడుతున్నారు.   కానీ కాంగ్రెస్ దేశముదురయితే, బీజేపీ మహా ముదురు పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకే పేరు, ప్రయోజనం కలుగుతాయి తప్పతనకు కలగవనే సంగతి కొంచెం ఆలస్యంగానయినా గ్రహించగలిగింది. తాను ఏ కాంగ్రెస్ పార్టీని వచ్చేఎన్నికలలో మట్టి కరిపించి కేంద్రంలో అధికారంలోకి రావాలని తపిస్తోందో, అదే పార్టీ ప్రవేశపెడుతున్నబిల్లుకి ఇప్పుడు మద్దతు ఇస్తే, చేజేతులా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, తన పార్టీని తనే దెబ్బ తీసుకొన్నట్లవుతుంది. కనుక, బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును.   కానీ, బిల్లుపై ‘యూ టర్న్’ తీసుకొంటే, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి, తెరాస, టీ-కాంగ్రెస్ నేతల నోటికి బలయిపోవడం ఖాయం. కనుక తను ఇప్పుడు ఆలపిస్తున్న’సమన్యాయం’ పల్లవితో బాటు మరో కొత్త రాగమేదయినా ఆలపించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుపై టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసారు. వాటిని పట్టుకొని తెలంగాణాకు చాలా అన్యాయం జరుగుతోందని వాదిస్తూ బీజేపీ ‘యూ టర్న్’ తీసుకోవచ్చును. తాము అధికారంలోకి రాగానే బిల్లులో లోపాలను సవరించి తెలంగాణా ప్రజలు, నేతలు కోరుతున్నట్లు ఎటువంటి షరతులేని సంపూర్ణ తెలంగాణా ఇస్తానని హామీ ఇస్తూ బీజేపీ ప్రజలవద్దకు వెళ్ళగలదు.   ఇక తను చాలా పట్టుదలగా, చిత్తశుద్దితో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుచేయబోతే, బీజేపీ దానికి మోకాలు అడ్డిందని, లేకుంటే ఈ ఎన్నికలు తెలంగాణాలోనే జరిగి ఉండేవని, అందువల్ల ప్రజలు మళ్ళీ తనకే ఓట్లేసి గెలిపించినట్లయితే అధికారం చెప్పట్టగానే వెంటనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్ళవచ్చును.   అందువల్ల పార్లమెంటులో బిల్లుకి మద్దతు అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, రాజకీయ సమస్య కూడా అని దీని వల్ల అర్ధం అవుతోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బిల్లు గురించి ఎన్నిమాటలు చెపుతున్నపటికీ, బిల్లు పార్లమెంటులో ఓటింగ్ వచ్చేసమయానికి అందరూ మాట మార్చి వెనక్కి తగ్గడం ఖాయం. అందువల్ల వచ్చేఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చును.

కమలం చుట్టూ ఈగలు

    బీజేపీకి దక్షిణాదిన అధికారం కట్టబెట్టిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీ రాజ్యం ఏలిందక్కడ. కానీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అవినీతి భాగోతాల పుణ్యామాని ఉన్నఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకొంది. వాపును చూసి బలుపని భ్రమసిన ఎడ్యూరప్ప కర్ణాటక జనపక్ష పార్టీ పెట్టి బీజేపీని రాష్ట్రంలో నుండి తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేసారు. కానీ ఆయన పార్టీని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆయన బీజేపీని రాష్ట్రం నుండి తరిమికొట్టలేకపోయినా ఎన్నికలలో గెలవకుండా సైంధవుడిలా అడ్డుపడి, అధికారాన్నికాంగ్రెస్ చేతికి అప్పగించగలిగారు. అందుకు బీజేపీ ఆగ్రహించకపోగా ఆయనను దూరం చేసుకొన్నందునే ఎన్నికలలో ఓడిపోయామని భావించడం ఆశ్చర్యం. అదేవిధంగా ఎడ్యూరప్ప కూడా బీజేపీని వదిలిపెట్టి బయటకి వచ్చినందునే ఓడిపోయానని పశ్చాతాపపడుతూ, మళ్ళీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే ఇంతకాలం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందున, అవినీతికి మారుపేరయిన ఎడ్యూరప్పను పార్టీలో చేర్చుకొంటే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని, అదీ గాక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అదొక ఆయుధంగా మారుతుందని భావించిన బీజేపీ, ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఇంతకాలం దూరంపెట్టింది. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి గనుక, ఆయనకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికి తిరిగి పార్టీలో చేర్చుకొంది. ఈ రోజు ఎడ్యూరప్ప తన అనుచరులతో కలసి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద జోషీ మరి కొందరు సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన కర్ణాటక జనపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుండి, బీజేపీ నేతలు కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించే ముందు వారు ఎడ్యూరప్పఅవినీతి భాగోతాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబీయడానికి సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.

శాసనసభలో టీ-బిల్లుపై చర్చ జరిగేనా

  తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చిన నాటి నుండి నేటి వరకు వైకాపా ముందుగా సభలో సమైక్యాంధ్ర తీర్మానం చేసిన తరువాతనే చర్చ మొదలుపెట్టాలని వితండవాదం చేస్తూ, బిల్లుపై చర్చ మొదలవకుండా అడ్డుకొంటోంది. ఈరోజు ఉభయ సభలలో వైకాపా సభ్యులను సస్పెండ్ చేయడంతో బిల్లుపై చర్చ మొదలయింది. ఈ పని మొదటే చేసి ఉంటే విలువయిన సభా సమయం, ప్రజాధనం వృదా అయ్యేవి కావు.   ప్రస్తుతం సభలో చర్చ మొదలయినప్పటికీ, అది ఎంతకాలం సజావుగా సాగుతుందో చెప్పలేము. ఒకవేళ సజావుగా సాగినా, సభ్యుల ఊకదంపుడు ప్రసంగాలతో, చరిత్ర పాటాలతో పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఈ నెల13 నుండి 16వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా శాసనసభ సమావేశాలు జరుగవు. అంటే బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరపడానికి ఇంకా కేవలం 10రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట. దాదాపు నెల రోజులపాటు సమయం వృధా చేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన కొద్ది రోజులలో మన ప్రజాప్రతినిధులు బిల్లుపై లోతుగా చర్చించగలరని ఆశించలేము.   ఉభయ సభలలో బిల్లుపై లోతుగా చర్చ జరగవలసి ఉన్నపటికీ, తమతమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే మన ప్రజాప్రతినిధులు, తమ పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావిస్తే సభను ఏ నిమిషంలోనయినా స్తంభింపజేయవచ్చును. చర్చ యావత్తు రాష్ట్ర విభజనపైనే జరుగుతోంది గనుక సీమాంధ్ర శాసనసభ్యులు లేవనెత్తే అంశాలను తెలంగాణా సభ్యులు అడ్డుకోవడం తధ్యం. అదేవిధంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేయడం, ఆ వెంటనే తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో చర్చ పక్కదారి పట్టగానే సభలో మళ్ళీ వాయిదాల పర్వం మొదలవవచ్చును. ఈలోగా పుణ్యకాలం కూడా పూర్తయిపోతుంది.

జగన్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..అరెస్ట్

      వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభ నుంచి సస్పెండయ్యారు. ఐదు రోజులుగా అసెంబ్లీకి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ వీరి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా స్పీకర్ ఆమోదం తెలిపి.. 15 మంది ఎమ్మెల్యేల్ని సభ నుంచి బయటికి వెళ్లాల్సిందిగా కోరారు. ఐతే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అక్కడే ఉండటంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటికి పంపారు. ఐతే సస్పెండ్ చేసిన సభ్యుల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదు. తమ సభ్యులందరినీ బయటికి పంపేయడంతో విజయమ్మ ఒంటరి అయిపోయారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతుండగా విజయమ్మ లేచి.. సమైక్య తీర్మానం చేయనందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్లు చెప్పి.. బయటకు వెళ్లిపోయారు.   అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారు.

తెలంగాణలో 'ప్రజాగర్జన'

      ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ప్రజాగర్జన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతం కావడంతో..ఈ సభలను తెలంగాణలోనూ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమైన చంద్రబాబు..పొత్తుల విషయం పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెలాఖరు లోపు విస్తృత సమావేశాలు నిర్వహించి, తర్వాత నియోజకవర్గాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తెలంగాణలో రెండుచోట్ల జోనల్ సభలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకొన్నారు.

బిజెపిలోకి కృష్ణంరాజు

      సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి సొంతగూటికి చేరారు. ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి పాత పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మళ్లీ బీజేపీలో చేరడం, పాత మిత్రులందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు మళ్లీ బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీతరపున లోక్‌సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

తెలంగాణాలో కూడా తెదేపా-బీజేపీల పొత్తులుంటాయా

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తులని ఆశిస్తునట్లు స్పష్టమవడంతో, బీజేపీ కూడా రాష్ట్రంలో తెదేపాతో పొత్తులకి ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అస్పష్ట రాజకీయ పరిస్థితుల్లో తెదేపాకు కూడా బీజేపీ వంటి ఒక బలమయిన పార్టీ మద్దతు చాలా అవసరం కనుక నరేంద్ర మోడీ అందించిన స్నేహ హస్తాన్ని చంద్రబాబు అందుకోవడంతో, రెండు పార్టీల మధ్య మళ్ళీ స్నేహసంబందాలు క్రమంగా బలపడుతున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి ఇతర తెలంగాణా నేతలు తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం వాస్తవ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెదేపాతో పొత్తులకే ప్రాధాన్యం ఇస్తోంది. పొత్తులు కుదుర్చుకోగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ (రహస్య) కూటమిని తేలికగా ఎదుర్కోవడమే గాక రెండు పార్టీలు లాభాపడవచ్చని భావిస్తున్నాయి.   ప్రస్తుతం దేశమంతట నరేంద్ర మోడీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాతావరణం కనిపిస్తునందున, బీజేపీతో పొత్తుల ప్రభావం తెదేపాకు రాష్ట్రంలో మరింత సానుకూల వాతావరణం కల్పించగలదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా, తెదేపా మద్దతుతో సీమాంధ్రలో బీజేపీ కూడా బలపడవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఖరారయిన బీజేపీ-తెదేపాల పొత్తుల గురించి మీడియాలో వస్తున్నవార్తలపై తెదేపా యంపీ రమేష్ రాథోడ్ స్పందిస్తూ, “సంక్రాంతి పండుగ తరువాత రెండు పార్టీల ఎన్నికల పొత్తుల గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని” అన్నారు. కానీ వారి పొత్తులు కేవలం సీమాంధ్రకే పరిమితం చేస్తారా లేక తెలంగాణాకు కూడా వర్తింపజేస్తారా? అనేది తేలవలసి ఉంది.   కాంగ్రెస్-తెరాసలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా కేంద్రంలో ఏకూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలుంటే తెరాస దానికే మద్దతు ఇస్తుంది గనుక, బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకోకపోయినా ఆపార్టీతో వైరం పెంచుకోదు. ఒకవేళ తెరాస-కాంగ్రెస్ పార్టీతో జతకడితే బీజేపీ కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవచ్చును. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉండి ఉండవచ్చును కానీ, రాష్ట్రంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. అయితే సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ కొంత బలంగా ఉందని చెప్పవచ్చును. కానీ, అది తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఒంటరిగా డ్డీకొని ప్రభుత్వం ఏర్పరచగలిగేంత మాత్రం కాదని ఆ పార్టీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు గనుక, తెలంగాణాలో కూడా మంచి బలమయిన క్యాడర్ ఉన్నతెదేపాతో పొత్తులకి సిద్దపడవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా ఒకరివల్ల మరొకరు లాభాపడగలవు కూడా.

అసెంబ్లీలో కిరణ్ కొత్త పార్టీపై చర్చలు..!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీపై అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు చర్చలు జరిపారు.మంత్రులు పార్థసారధి, డీకే అరుణ మధ్య ఈ అంశంపై మాట్లాడుతూ కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని, విభజన ఆగుతుందని అనిపిస్తోందని మంత్రి పార్థసారథి అనగా, విభజన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని, కిరణ్ కొత్త పార్టీ పెట్టరని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు.   కాంగ్రెస్ దుకాణం మూసేస్తే...కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తానని మరో నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 23 వరకు సైలెంట్‌గా ఉండాలని కిరణ్ చెప్పారన్నారు. తాను ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆదాల తెలిపారు. కాంగ్రెస్ టికెట్ కోసం ముసలివాళ్లు పోటీలో ఉన్నారని, హైకమాండ్ ఒక్కో సీటుకు రూ.2 కోట్లు ఇస్తుందంటా అని ఆయన అన్నారు. ఏ పార్టీలో సీటు దక్కని వాళ్లే సీఎం పార్టీలో చేరతారని ఆదాల అన్నట్లు తెలుస్తోంది. కిరణ్ చివరి నిమిషంలో పార్టీ పెట్టి రికార్డు సృష్టించవచ్చని మరో మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.

అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాం

      అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం స్పీకర్ నాదెండ్లమనోహర్, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క స్థలాన్ని పరిశీలించారు. మహాత్మా గాంధీ విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిర్ణయించినట్లు తెలియవచ్చింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 22న విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 500 కేజీల బరువు గల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్‌లో తయారు చేయించారు. దీనికి అయ్యే ఖర్చు రూ. 23 లక్షలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

జేసీ బ్రదర్స్...టిడిపి కన్ ఫార్మ్..!!

      తెలుగు దేశం పార్టీలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులు చేరబోతున్నారని రాజకీయ వర్గాలలో, మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాక ఖాయమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. దీనికి టిడిపి అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల23 లేదా 24న టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని జేసీ బ్రదర్స్ చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో పయ్యావుల కేశవ్ కీలకపాత్ర పోషించాడని తెలుస్తోంది. మరోవైపు జేసీ రాకను పరిటాల సునీత పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పరిటాల హత్య కేసులో జేసీ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడని, ఇతర హత్యల కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఆమెను ఒప్పించే బాధ్యతను జిల్లా నేతలకు బాబు అప్పగించినట్లు సమాచారం.

శాసనసభలో శాడిజం... దామోదర

      శాసనసభ వ్యవహారాలు చూస్తుంటే చిరాకేస్తుంది. శాడిజం పెరిగిపోతోంది. ఇతరులు అసహనానికి గురయ్యేలా మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేశారు. శాస్త్రీయత, అవగాహన, అధ్యయనం లేకుండా ఇతరులను అగౌరవపరచేలా మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభ వ్యవహారాలను పరిశీలిస్తుంటే ఎలాంటి చర్చ జరగదని స్పష్టం అవుతోందన్నారు. బిల్లుపై చర్చ కొనసాగుతుందని ఒకవైపు శాసనసభలో ప్రతిరోజూ విడుదల చేస్తోన్న బులిటెన్‌లో పేర్కొంటుండగా, మరోవైపు ఇంకా చర్చ ప్రారంభం కాలేదని కొందరు అనడం మూర్ఖత్వమే అవుతుందని రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్యవాదం గురించి సభలో రెండు గంటలు మాట్లాడితే, ప్రతిగా తాను దీటైన సమాధానం చెబుతానన్నారు.

వాయిదాల సభ

      శాసన సభ రేపటికి వాయిదా పడింది.  ఈ రోజుకి ముగిసింది.  కానీ రేపు కూడా ఇదే సన్నివేశం పునరావృతం కాదనే హామీ ఏమైనా ఉందా.  దీనికి పరిష్కారమేమిటి?  రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఆ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారు? రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఇంకో రోజు.. వెరసి 10వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్టే. ఆ తర్వాత మళ్ళీ 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును

ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జనవరి 17న జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో కూడా ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత మార్పులపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వారంటున్నారు.

చట్ట సభలను అపహాస్యం చేస్తున్న ప్రజా ప్రతినిధులు

  ఊహించినట్లుగానే అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాష్ట్ర విభజనపై బిల్లుపై సభలోఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుపడుతూ సభను స్థంబింపజేస్తూ రోజులు దొర్లించేస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటే అది రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే అవుతుందని తెదేపా, వైకాపాలు భావిస్తూ అడ్డుపడుతుంటే, చర్చజరిగితే అది కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని తెలంగాణా శాసనసభ్యులు అడ్డుపడుతున్నారు. కానీ, అందరూ కూడా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, కానీ అందుకు ఎదుట పార్టీ వాళ్ళే అడ్డుతగులుతున్నారని వితండవాదం చేస్తూ, చట్టసభలలో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును. అందువల్ల బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకొంటానని చెప్పిన ముఖ్యమంత్రికి కానీ ఆయన అనుచరులకు గానీ ఇక ఆ శ్రమ ఉండకపోవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో బిల్లుపై చర్చ జరగాలని చెప్పడమే కానీ అందుకు గట్టిగా ఎటువంటి ప్రయత్నమూ చేయదంలేదు.   మొత్తం మీద శాసనసభ్యులు అందరూ కలిసి టీ-బిల్లుపై ఎటువంటి ప్రశ్న లేవనెత్తకుండా, ఎటువంటి సూచనలు,సవరణలు చేయకుండా దానిని యధాతధంగా తిప్పిపంపేందుకు సిద్దం అవుతున్నారు. తమ తమ ప్రాంతాల, ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈవిధంగా వ్యవహరించడం కేవలం బాద్యతరాహిత్యమే. విజ్ఞత ప్రదర్శించి లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో లోపాలను సవరించే ప్రయత్నాలు చేయకుండా, రాజకీయంగా తమకి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో దానిని యదా తధంగా త్రిప్పి పంపుతుండటం వలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు తీరని నష్టం కలగడం తధ్యం.

వైకాపాలో సామాజిక 'అ'న్యాయం..!!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని చాలామంది నాయకులు విశ్వసించారు. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి బీసీలు ఇతర సామాజిక వర్గాల నాయకులు తోసుకుంటూ వలస వెళ్లారు. కానీ.. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత! జగన్ సొంత జిల్లాలో తాజాగా ముగిసిన సహకార సంఘాల అధ్యక్ష పదవుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విధమైన అనుమానాలు, సందేహాలకు బలం చేకూరుతోంది.   కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా... వివిధ కారణాల వల్ల కడప జిల్లాలోని 20 ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 16 సొసైటీల్లో వైకాపా, 4 సొసైటీల్లో కాంగ్రెస్ వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే... వైకాపా తరపున 16 సొసైటీల్లో ఎన్నికైన అధ్యక్షులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం. కడపలో 16 సొసైటీల్లో ఆధిపత్యాన్ని సాధించిన వైకాపా.. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఇతర సామాజిక వర్గాలవారిపై చిన్నచూపు చూడడంతో..త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేస్తారన్న అభిప్రాయలు బలపడుతున్నాయి. దీంతో వైకాపాలో అంటే ఒక సామాజిక వర్గం పార్టీగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఈ పరిణామం కనిపిస్తోంది.