టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీల క్యూ!

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. కాంగ్రెస్ డెడ్ బాడీ కాలగర్భంలో కలసిపోవడమే తప్ప మళ్ళీ లేచే అవకాశం నూటికి వెయ్యిశాతం లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతోపాటు కొంతమంది స్వతంత్రంగా గెలిచిన ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం వుందని తెలుస్తోంది. శనివారం సాయంత్రం వీరంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవివర్మ, హుస్సేన్, పుల్లయ్య, శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్పరెడ్డి వున్నారు. శనివారం సాయంత్రం లోపు ఈ సంఖ్య పెరిగే అవకాశం వుంది.

ఇకచాల్లే తప్పుకోండి: వెంకయ్య

  యుపిఎ హయాంలో గవర్నర్లు అయిన వారందరూ వ్యవస్థ ప్రయోజనాలరీత్యా పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. ఎక్కువగా ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పదవుల్లోంచి తప్పుకుంటే అది వారికే మర్యాదగా వుంటుందని, హుందాగా ఉంటుందని చెప్పారు. ‘‘యుపిఎ హయాంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాకు మా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందనడం తప్పు. స్వచ్ఛందంగా రాజీనామా చేయని వేధిస్తున్నామంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.

గవర్నర్ ప్రసంగం సంతాప తీర్మానంలా వుందట!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం నాడు ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగమా లేక సంతాప తీర్మానమా అంటూ వెంటకారంగా మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం హైదరాబాద్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా పైవిధంగా స్పందించారు. నరసింహన్ ప్రభుత్వం రాసిచ్చిన కరపత్రం చదవి రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆరోపించారు. గవర్నర్ తన ప్రసంగంతో ప్రజలకు మనోధైర్యం ఇవ్వలేకపోవడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలను నీరుగార్చారన్నారు.

లేటెస్ట్ బ్రాండ్ ‘నమో’

దేశ రాజకీయాలలో ఈమధ్య చాలా బాగా వినిపించిన సరికొత్త మాట ‘నమో’. దేశ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ఆయన పేరుకు షార్ట్ కట్‌గా ఉపయోగిస్తూ ‘నమో’ అనే మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ‘నమో’ అనే మాట లేటెస్ట్ బ్రాండ్‌గా మారింది. హర్యానాలోని ఓ ఔషధాల కంపెనీ తాను తయారుచేస్తున్న నిముసిలైడ్ అనే నొప్పి నివారణ మందుకు 'నమో' బ్రాండు పేరు పెట్టి మార్కెట్లోకి విడుదల చేసింది. ‘నమో’ అని వుండేసరికి జనం కూడా ఈ మందును అడిగి మరీ కొంటున్నారట. తమ ఉత్పత్తికి ‘నమో’ అని పేరు మార్చినప్పటి నుంచి అమ్మకాలు విపరీతంగా పెరిగాయని సదరు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

విజ్ఞానజ్యోతి విద్యార్థులకు సంగీతాశ్రువులు!

  హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో 23 మంది తెలుగు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించిన సంఘటన తెలుగువారినే కాకుండా యావత్ భారతదేశ ప్రజలని కదిలించివేసింది. ఊహించని విధంగా క్షణాల్లో జరిగిపోయిన ఆ దుర్ఘటన అసలు జరక్కుండా వుంటే బాగుండని అనుకోనివారు లేరు. ఇదంతా ఒక కల అయితే బాగుంటుందని అనుకున్నవారూ ఎందరో వున్నారు. ఇలా అందరి మనసులలో వున్న ఈ ఆవేదనకు కొంతమంది యువతీ యువకులు మ్యూజిక్ ఆల్బమ్ రూపాన్నిచ్చారు. ‘వెలుగుతూ మొదలైన ఈ పయనమే.. వెలితిగా మా చెంతకు చేరెనే’ అంటూ సాగే పాటతో ఈ ఆల్బమ్ రూపొందింది. ఈ ఆల్బమ్ ప్రమాదంలో మరణించిన యువతరానికి నివాళులు అర్పించే విధంగా, తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేసే విధంగా వుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాలన్న ఆలోచనతో తెలుగువన్‌ను ఈ యువతీ యువకులు సంప్రదించినప్పుడు వారిని అభినందించడంతోపాటు, వారికి కావలసిన సాంకేతిక సహకారాన్ని తెలుగువన్ అందించింది.

జంప్ జిలానీ మండలికి పదవులు, పార్టీ నేతలకు మొండి చెయ్యి

  ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారు అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆఖరు నిమిషంలో కనీసం పరిశీలనలో కూడా లేని మండలి బుద్ద ప్రసాద్ పేరును చంద్రబాబు ఖరారు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న గొల్లపల్లి తదితరులను కాదని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో నుండి తెదేపాలోకి దూకి అవనిగడ్డ నుండి పార్టీ టికెట్ దక్కించుకొని గెలిచిన మండలి బుద్ద ప్రసాద్ కు ఉపసభాపతి వంటి కీలకమయిన పదవిని కేటాయించడంపై పార్టీలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పదవి ఆశించి భంగపడిన గొల్లపల్లి తదితరులు చంద్రబాబు నిర్ణయంతో మరింత అసంతృప్తి చెందడం సహజమే.   కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కొనసాగిన మండలి బుద్ద ప్రసాద్ గతంలో తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అనేక పోరాటాలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులతో సత్సబందాలు నిలుపుకొంటూ, ఎల్లపుడు ఏదో ఒక కీలక పదవిలో కొనసాగగలిగారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన ఆయన ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తప్పదని గ్రహించి తెదేపాలోకి దూకేశారు. పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న పార్టీ నేతలను కాదని అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు.   అయితే ఆ సమయంలో ఎన్నికలలో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా తెదేపా నేతలందరూ ముందుకు సాగుతున్నందున గెలుపు గుర్రంగా భావిస్తున్న మండలికి చంద్రబాబు టికెట్ కేటాయించడాన్ని పెద్దగా వ్యతిరేఖించలేదు. ఆవిధంగా తెదేపా నేతల సహకారంతో ఆయన అవనిగడ్డ నుండి టికెట్ దక్కించుకొని ఎన్నికలలో విజయం సాధించగలిగారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన అదే రీతిలో పావులు కదిపి ఎవరూ ఊహించని విధంగా ఉపసభాపతి పదవిని దక్కించుకోవడంతో తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.   కులసమీకరణాలలో భాగంగానే ఆయనకు ఉపసభాపతి పదవి ఇచ్చేమని తెదేపా చెపుతున్నప్పటికీ, ఆయన కులానికే చెందిన అనేకమంది తెదేపా నేతలను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆయనను చంద్రబాబు చంకనెక్కించుకోవడం కృష్ణా జిల్లా తెదేపా నేతలు, కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. నామినేషన్ వేసిన తరువాత మండలి బుద్ద ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “నేను తెదేపా పార్టీకి ఎటువంటి సేవలు చేయనప్పటికీ చంద్రబాబు ఇంత ఉదారంగా నాపై నమ్మకం ఉంచి ఇటువంటి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్లే ఉంది.

జార్ఖండ్‌లో హిమాచల్ తరహా ప్రమాదం

  హిమాచల్ ప్రదేశ్‌లో డ్యాం నీరు వదలడంతో 24 మంది తెలుగువారు మరణించిన పీడకలని దేశం ఇంకా మరువకముందే జార్ఖండ్‌ రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన సంఘటన లాంటి సంఘటన మరొకటి జరిగింది. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని చంద్రపుర వద్ద దామోదర నదిలో నీరు తక్కువగా వున్న ప్రదేశంలో పదిమంది స్థానికులు స్నానం చేస్తుండగా తేనూఘాట్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీరు విడుదలైంది. దాంతో స్నానం చేస్తున్న పదిమందీ నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అయితే వారి అదృష్టం బాగుండి నది మధ్యలో ఎత్తుగా వున్న రాయి మీదకి పదిమందీ చేరారు. చుట్టూ నది భయంకరంగా ప్రవహిస్తుంటే ఆ పదిమందీ ఒకచోట చేరి బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. దీనిని స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు డ్యామ్ సిబ్బందిని అప్రమత్తుల్ని చేశారు. దాంతో డ్యాం సిబ్బంది నీటిని నిలిపివేశారు. దాంతో నది ప్రవాహం ఒరవడి తగ్గింది. నీటి మధ్యలో వున్న పదిమందిని రక్షించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నీటి మధ్యలో చిక్కుకున్న పదిమందికి ప్రస్తుతానికి ఏ ప్రమాదమూ లేనట్టు తెలుస్తోంది.

థాంక్యూ చంద్రబాబూ: నిర్మలా సీతారామన్

  కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రాజ్యసభకు ఎన్నిక కావడానికి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆమె ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు. నిర్మలా సీతారామన్ శనివారం నాడు రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసే అవకాశం వుందని తెలుస్తోంది. దీనికోసం ఆమె శుక్రవారం నాడు హైదరాబాద్‌కి వచ్చారు. అటు లోక్‌సభలోగానీ, ఇటు రాజ్యసభలో గానీ సభ్యురాలు కాని నిర్మలా సీతారామన్‌ను మోడీ తన ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా ఆమె ఉభయ సభల్లో ఏదో ఒకదానికి ఎంపిక కావలసి వుంటుంది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం ద్వారా నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెళ్ళడానికి తెలుగుదేశం మద్దతు ప్రకటించింది.

దలైలామాపై దాడి జరిగిందా?

  శుక్రవారం నాడు ఇంటర్నెట్ ప్రపంచంలో కనిపించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని ఆందోళనకు గురిచేసింది. ఆ ఫొటో మరెవరిలో కాదు.. బౌద్ధ బిక్షువు, శాంతిదూత దలైలామాది. ఆ ఫొటోలో దలైలామా మామూలుగా వుంటే ఆందోళన పడాల్సిన అవసరమే వుండేది కాదు. కానీ ఆ ఫొటోలో దలైలామా తీవ్రంగా గాయపడి వున్నారు. ఆయన ముఖమంతా రక్తం చిందుతూ వుంది. కళ్ళజోడు పగిలిపోయింది. పెదవులు పగిలిపోయి రక్తం కారుతోంది. ముక్కులోంచి కూడారక్తం కారుతోంది. ఈ ఫొటో చూసి చాలామంది ఆందోళన పడ్డారు. పాపం దలైలామాని ఇంత దారుణంగా గాయపరిచింది ఎవరని వెతికితే అసలు విషయం బయటపడింది. అది దలైలామాని ఎవరూ గాయపరచలేదు. అవి ఫొటోషాప్ ద్వారా దలైలామా ముఖంమీద కృత్రిమంగా సృష్టించిన గాయాలు. ఇలాంటి పత్యపు పని చేసింది ఎవరో కాదు.. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బెల్జియం బ్రాంచ్. హింసను వ్యతిరేకిస్తూ ఈ సంస్థ చేపట్టిన ‘స్టాప్ టార్చర్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖుల ఫొటోలను ఫొటోషాప్‌లో గాయపడినట్టుగా మార్చి విడుదల చేసింది. దలైలామాతోపాటు లెపీపాప్, కార్ల్ లెగర్ ఫీల్డ్ అనే మరో ఇద్దరు ప్రముుఖుల ముఖాలను కూడా ఫొటోషాప్‌ ద్వారా గాయపడినట్టు తయారు చేసి ప్రపంచానికి విడుదల చేసింది. ఇలాంటి పనికిమాలిన పబ్లిసిటీ ద్వారా హింసను ఆపాలని పిలుపు ఇవ్వడం చాలా దరిద్రంగా వుందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆమ్నె్స్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఇలాంటి కుళ్ళు ఐడియాలను మానుకోవాలని కూడా జనం విమర్శిస్తున్నారు.

తగ్గుతుందనుకుంటే పెరిగిందేంటి దేవ్‌డా..!

  మోడీ ప్రభుత్వం బంగారం మీద దిగుమతి సుంకం తగ్గించబోతోందని, త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని చాలామంది బంగారు నగలు కొనకుండా వెయిట్ చేస్తున్నారు. రేపో మాపో బంగారం ధరలు తగ్గుతాయి.. కావలసిన నగలుకొనుక్కోవచ్చని కలలు కంటున్నారు. బట్.. జనం ఒకటి తలిస్తే బంగారం మరొకటి తలచింది. అందరూ తగ్గుతుందని అనుకున్న బంగారం ధర పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో లోహపు ధరలు పెరగడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర 605 పెరిగి 28,625కు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. బంగారం ధర పెరిగితే నేను మాత్రం ఎందుకు పెరగనంటూ వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర 1800 పెరిగి 44,900 కు చేరుకుంది. డాలర్ బలహీనపడటం బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు.

డిప్యూటీ స్పీకర్‌గా మండలి నామినేషన్

  శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మండలి అవనిగడ్డ తెలుగుదేశం శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ఉప సభాపతి స్థానానికి నామినేషన్ వేయాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును చంద్రబాబు ఖరారు చేశారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో శాసనసభ వ్యవహారాల మీద మంచి పట్టు వున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను ఉప సభాపతి స్థానానికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 23న మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తారు. డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్ వేసిన అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మీడియాతో మాట్లడారు. ప్రస్తుతం రాష్ట్రం వున్న పరిస్థితులలో శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరగాల్సిన అవసరం వుందని, అలా జరపడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా, కృష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక అయినందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: వైగో హెచ్చరిక

  తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. తమిళ భాషను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో, హిందీని అంతగా ద్వేషిస్తారు. హిందీని తమమీద రుద్దడాన్ని వారు ఎంతమాత్రం సహించరు. అయితే ఈమధ్య ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాడులో పార్టీలకి అతీతంగా అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షాత్తూ బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎండీఎంకే నాయకుడు వైగో కేంద్ర ప్రభుత్వాన్ని హిందీ విషయంలో హెచ్చరించారు. నిద్రపోతున్న సింహాన్ని కదిలించాలని ప్రయత్నించవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించారు. హిందీని తమపై రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తాన్ని ధారపోసి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు.

ఆర్థరైటిస్ మందులతో అందమైన జుట్టు

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత. వైద్య శాస్త్రంలో అనేక వింతలు జరుగుతూ వుంటాయి. అలాంటి వింత విషయం ఈమధ్య కొంతమంది అమెరికాకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా మిగలకుండా రాలిపోయే వ్యాధికి గురైన వారికి ఇంతవరకు వైద్య శాస్త్రంలో ట్రీట్‌మెంట్ లేదు. అలాంటి వారు ఇప్పటి వరకూ ఒంటిమీద వెంట్రుకలు లేకుండా జీవించడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయేది. అయితే అలాంటి వ్యాధిగ్రస్తులకు అమెరికా శాస్త్రవేత్తలు మందును కనుగొన్నారు. ఆ మందు మరేదో కాదు.. కీళ్ళనొప్పుల నివారణకు వాడే మందునే ఒక క్రమ పద్ధతిలో వాడటం వల్ల ఒంటిమీద మళ్ళీ జుట్టు మొలిచే అవకాశం చాలా వుందట. దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా వాళ్ళు చేశారు. ఈ వ్యాధికి సంబంధించిన రోగులను ఎంపిక చేసుకుని వారి మీద ఆర్థరైటిస్‌కి సంబంధించిన మందుల్ని ఒక క్రమపద్ధతిలో ఇచ్చారు. ఆశ్చర్యకరంగా వారందరిలో జుట్టుపెరుగుదల కనిపించింది. జీవితంలో దువ్వెన వాడే అవకాశం లేదని బాధపడుతున్న వారందరూ ఇప్పుడు తమ జేబుల్లో దువ్వెనలు మెయిటెయిన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా జుట్టు రాలిపోయే వ్యాధితోపాటు బట్టతల నివారణకు కూడా సరైన మందులు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

  మన పొరుగుదేశం నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ వుండటంతో నేపాల్ పడమర ప్రాంతంలో వున్న గుల్మి జిల్లాలో కొండచరియలు విరిగి ఓ ఇంటిమీద పడటంతో ఆ ఇంటిలో నివసిస్తు్న్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో నలుగురు చిన్నపిల్లలు కూడా వున్నారు. అలాగే నేపాల్‌లోని పైథాన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నేపాల్‌లో ఇప్పటికే అనేకమంది గల్లంతయ్యారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనాలకి దొరికే అవకాశం వుంది.

ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు థాంక్స్: స్పీకర్ కోడెల

  తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు డాక్టర్ కోడెల శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి వుందని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలోని ప్రతి సభ్యుడి మీద ఆంధ్రప్రదేశ్‌ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత వుందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు చాలా అర్థవంతంగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభాపతి అంటే మోనార్క్ కాదని ఆయన చెప్పరాు. ప్రజా సమస్యలను చర్చించే విషయంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా నూతన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. గతంలో టెంట్ల కింద సమావేశాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

వేల కోట్ల అధిపతి.. అనుమానాస్పద మృతి!

      ఆయన పేరు దాది బల్సారా. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వ్యాపారవేత్తల్లో ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాల్లో ఆయన వ్యాపార సంస్థలు వున్నాయి. కానీ, ఆయనకి నా అనేవారు ఎవరైనా వున్నట్టు దాఖలాలు మాత్రం లేవు. ఆయన న్యూఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లోని రూమ్ నంబర్ 901లో 1983 నుంచి ఒంటరిగా వుంటున్నారు. ఆన వ్యాపార సంస్థలన్నిటికీ పర్మినెంట్ అడ్రస్‌ హోటల్లోని ఆ రూమే. వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వ్యాపార సంస్థలు వున్న గురువారం నాడు ఆయన తన రూమ్‌లో చనిపోయి వున్నారు. మంచం మీద పడుకుని వున్న ఆయన అలాగే చనిపోయి పడి వున్నాడు. గత మూడు రోజులుగా ఆయన ఆహారం సరిగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన ఒక సహాయకుడిని పిలిపించుకుని తన అరికాళ్ళకు మసాజ్ చేయించుకున్నారట. తెల్లవారేసరికి డెడ్‌‌బాడీగా మిగిలాడు. తమ హోటల్‌లో గత 31 సంవత్సరాలుగా పర్మినెంట్‌ కస్టమర్‌గా వున్న బల్సారా హఠాత్తుగా చనిపోవడంతో తాజ్ మాన్‌సింగ్ హోటల్ యాజమాన్యం తమ కుటుంబంలో వ్యక్తి చనిపోయినట్టుగా బాధపడుతోంది. అయితే పోలీసులు మాత్రం బల్సారా మరణంపై తమకు తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో వున్నారు.

ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వం!

      ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఎన్నోరకాలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకి అన్యాయం, అవమానాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో అవమానం ఎదురైట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మధిర బస్ డిపో మేనేజర్ సీమాంధ్రకు చెందిన విద్యార్థులకు కళ్ళు తిరిగిపోయే ప్రకటన ఒకటి డిపో నోటీస్ బోర్డులో పెట్టారని సమాచారం అందుతోంది. మధిర డిపోలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే బస్ పాస్‌లు ఇస్తామని, ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వమని ఆ నోటీసులో వుందట. త్వరలో విద్యాసంస్థలు మొదలవుతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో చదువుకుంటున్న సీమాంధ్రకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఏం చేయాలో పాలుపోకుండా వున్నారు.