జయలలిత బురద రాజకీయం..

భారీ వర్షాల వల్ల చెన్నై అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల వల్ల చెన్నై వాసులు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. దాంతో ఎంతో మంది దాతలు చెన్నైను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు మన తెలుగు నాట నుండి కూడా ఎంతోమంది చెన్నై ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై కూడా తమిళనాడు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. అమ్మ బోమ్మతోనే సాయం అందించాలని.. పలువురు స్వచ్ఛంధ సంస్థలను కూడా కార్యకర్తలు అడ్డుకుంటున్నారట. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటపడుతున్నారని.. జయలలితపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వరద సాయం అందించడంలో జయలలిత విఫలమైందని అంటున్నారు.

వరంగల్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కొండా మురళి

  ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్ నుంచి తెరాస అభ్యర్ధిగా మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పేరు ఖరారు అయింది. గత ఏడాది వైకాపాని వీడి తెరాసలో చేరినప్పటి నుంచి కొండా దంపతులను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అందుకే పార్టీ వ్యవహారాలలో కూడా ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు. బహుశః అందుకే కొండా మురళికి అవకాశం కల్పించి ఉండవచ్చును. కొండా దంపతులకు వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడికి తోడు, అధికార పార్టీకి చెంది ఉండటంతో కొండా మురళి చాలా తేలికగానే ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని భావించవచ్చును.   తెలంగాణాలో మొత్తం 12 స్థానాలలో తెరాస పోటీకి దిగుతోంది. తెరాస తరపున రంగారెడ్డిలో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయబోతున్నారు. కనుక ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలలో అన్ని పార్టీలలో క్రాస్ ఓటింగ్ జరగడం తధ్యంగా కనిపిస్తోంది. తెరాస ఎన్నికలలో గెలిచేందుకు ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ, దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస దౌర్జన్యాలని ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు.

దయచేసి సచివాలయంలో ఉండండి.. కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్

  టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని.. కరువు మండలాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపలేదు..  కేసీఆర్ ఒంటెత్తు పోకడకు పోయారు అని విమర్శించారు. మండలానికో కోటి రూపాయలు ఇవ్వాలని.. ఉపాధిహామీ పని దినాలు పెంచాలని.. ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరారు. అంతేకాదు దయచేసి సచివాలయంలో ఉండండి.. రైతలను ఆదుకోండి అని కేసీఆర్ కు సూచించారు. యాగాలకు కేటాయించే సమయంలో కొంచెం రైతులకోసం కేటాయించండి అని వ్యాఖ్యానించారు.

అయినా కోర్టుకు హాజరు కాని సోనియా, రాహుల్..

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు గాను ఇరువురు కోర్టు హాజరుకావాల్సి ఉంది. కానీ సోనియా గాంధీ, రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన కోర్టు.. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పినా ఇద్దరూ హాజరుకాకపోవడం. అంతేకాదు కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజే రాహుల్ చెన్నై వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మరోవైపు ఈ విషయంపై మీడియా సోనియాను పదేపదే అడుగగా ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి కోర్టు ఆదేశాలను కూడా దిక్కరించిన సోనియా, రాహుల్ పై.. కోర్టు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కొత్త నియోజకవర్గాలు పెంపు ఇప్పట్లో లేనట్టే..

రాజకీయ పదవులు కోసం ఆశగా ఎదురుచూసే వాళ్లకి నిరాశే ఎదురైంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ, తెలంగాణ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో.. రాష్ట్రాల్లో కొత్త నియోజక వర్గాలు ఏర్పడుతాయని.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందని పలువురు ఆశపడ్డారు కానీ అవేమి ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా పరిస్థితులు కనిపించడంలేదు. అయితే గతంలో కూడా ఇరు రాష్ట్రాల ఎంపీ లు కూడా కలిసి ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడారు కానీ..ఇప్పుడు అవన్నీ కుదిరే పరిస్థితులు లేవని కేంద్రం చెబుతుంది. ప్రసుత్తం.. ఏపీలో 175 - తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు  ఏపీలో 225 - తెలంగాణలో 150 సీట్లకు పెంచాలని కోరగా.. 2026 వరకూ నియోజక వర్గాలు పెంచడం కుదరదని..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి మంగళవారం పార్లమెంటులో చెప్పేశారు. దీంతో 2026 వరకూ నియోజకవర్గాల పెంపు సాధ్యమని తెలిసిపోయింది.

అజాంఖాన్ ను తిట్టి ఎంఐఎం ను పొగిడిన శివసేన..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎవరి ప్రత్యేకత వారిది. అందులో శివసేనది ఒక స్టైల్ అయితే.. ఉత్తర ప్రదేశ్ మంత్రి అజాంఖాన్ ది మరో స్టైల్.. కానీ కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి మాత్రం శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అజాంఖాన్ తిడుతూ.. వేరే పార్టీని పొగిడారు. అందులో ఆశ్చర్యం ఏముందంటారా.. అయితే శివసేన పొగిడింది ఎవర్నో కాదు.. తాము ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఎంఐఎం పార్టీని.. అసలు సంగతేంటంటే.. అజాంఖాన్ తాజాగా పారిస్ లో దుర్మార్గుల బాంబు దాడిని బాబ్రీ మసీదు సంఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లే పారీస్ ఘటన జరిగిందని.. బాబ్రీలో లేనిపోని విద్వంసం సృష్టించడం వల్లే ముంబైలో బాంబు దాడి జరిగిందని అన్నారు. అంతే అజంఖాన్ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే అజాంఖానే చాలా డేంజరస్ అని.. అజాంఖాన్ లాంటి వారు ఒక్కరుంటే చాలు ఇంక ఉగ్రవాదులు అవసరం లేదు.. ఆయనే పెద్ద ఉగ్రవాది అని మండిపడ్డారు. అంతేకాదు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ  ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేదని.. ఒవైసీ నుంచి అజాంఖాన్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది.

వైసీపీ నేతలకు నెహ్రూపై అంత ఇంట్రస్ట్ ఎందుకో.. ?

  వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆపార్టీ నేతలకే అర్దంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమంది నేతల వల్ల పార్టీకి లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకుల కంటే.. వివాదాస్పద నాయకులే ఎక్కవ తయారయ్యారు వైకాపాలో.. దానికి తోడు ఇప్పుడు మరో నేతను పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. అయితే తీసుకొచ్చేది వేరే పార్టీలోని ఏబలమైన నేతనో అయితే పార్టీకి కాస్త బలంగా అన్న ఉండేది.. కానీ తాము తీసుకురావాలని చూసేది  మాజీ మంత్రి దేవినేని నెహ్రూని.. ప్రస్తుతం ఫేడవుట్ లో ఉన్న నెహ్రూనే పార్టీలోకి తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే నెహ్రూ ఎంట్రీకి అభ్యంతరం చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారంట. అందులో మొదటి వ్యక్తి  వంగవీటి రాధా. నెహ్రూ కనుక పార్టీలోకి వస్తే తాము వెంటనే పార్టీ వీడతామని ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి రాధా చెప్పారంటా. వంగవీటి రాధా ఒక్క విషయమే కాదు.. ఒకవేళ నెహ్రూ కనుక వైసీపీ లోకి వస్తే  ఆయన సామాజిక వర్గంతో బలం చేకూరవచ్చు కానీ కాపు సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నారు.. మొత్తానికి ఎంతోమంది బలమైన నాయకులు ఉండగా.. వైసీపీ మాత్రం నెహ్రూపై ఎందుకు ఇంట్రస్ట్ చూపుతుందో..

చంద్రయ్య కోసం కారు ఆపిన చంద్రబాబు..

ఒక్కొక్కసారి చిన్న విషయాలే కదా అని అవి పట్టించుకోం..కానీ వాటి వల్లే ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పుడు అలానే చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలు దేరారు. అయితే ఆయన నివాసం బయట ఒక కార్యకర్త చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు కారు దిగి.. అతని దగ్గరికి వెళ్లారు. ఒక సాదాసీదా కార్యకర్త కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కారు ఆపి వెనక్కి వస్తుండటంతో పార్టీ కార్యకర్త చంద్రయ్య పరుగున బాబు వద్దకు వెళ్లి.. ఆయన కాళ్లకు నమస్కారం పెట్టారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడి.. ఏదైనా కష్టం ఉంటే చెప్పమని కోరి తిరిగి వెళ్లిపోయారు. దీంతో చంద్రయ్య చంద్రబాబే స్వయంగా వచ్చి మాట్లాడినందుకు ఆనందంతో పులకరించిపోయాడు. ఏది ఏమైనా కార్యకర్తలను ఆదరించడంలో చంద్రబాబు తరువాతే ఏవరైనా అని చెప్పవచ్చు.

కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటన.. 9 మందిపై ఎఫ్ఐఆర్

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బార్ లైసెన్సీ భాగవతుల శరత్ చంద్ర సహా రాజపురెడ్డి మాలకొండారెడ్డి, టి. వెంకటేశ్వరరావు, కావూరి పూర్ణచంద్ర శర్మ, కావూరి లక్ష్మీ, మల్లాది బాల త్రిపుర సుందరి, కాళిదాసు, వెంకటరమణ, సున్నా వెంకటేశ్వరరావు, మల్లాది విష్ణువుల పై ఎఫైఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా పలు బార్లు మూతపడ్డాయి. పలు బ్రాండ్లపై ఏపీ ప్రభుత్వం నిషేదం విధించింది. ఎక్సైజ్ అధికారులు బార్లపై తనిఖీలు నిర్వహించి.. వాటి శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని పరీక్షించిన తరువాతే తిరిగి బార్లను ప్రారంభించాలని ఆదేశించారు. 

పార్టీ మారే నేతలకు చంద్రబాబు ఆహ్వానం..!

  ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పార్టీ నేతల వలసల పర్వం నడుస్తోంది. తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మక్కువ చూపిస్తుంటే.. ఏపీలో టీడీపీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అటు కాంగ్రెస్.. వైసీపీ కాంగ్రెస్ నుండి నేతలు టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు వీరి రాకకు అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్టీనుండి ఆదినారాయణరెడ్డి.. కొణతాల రామకృష్ణ టీడీపీలోకి చేరడానికి సిద్దమయ్యారు. వీరితో పాటు మాజీ కేంద్రమంత్రి.. కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రతాప్ ను కూడా టీడీపీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారంట. అంతేకాదు ఓ కర్నూలు ఎంపీ.. నలుగురు శాసనసభ్యులు కూడా టీడీపీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరందరి చేరికకు చంద్రబాబు పార్టీనేతలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుండి నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కాని.. వైసీపీ లోకాని ముఖ్య నేతలెవరూ ఉండకుండా చూడాలని చంద్రబాబు వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కృష్ణాజలాల వివాదం.. ఆ రాష్ట్రాలకు సంబంధం లేదు.. మీరే పంచుకోండి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదం ఎప్పటినుండో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున 4 రాష్ట్రాలకు మళ్లీ నీటి కేటాయింపులు జరపాలని కోరింది. దీనికి కేంద్రం స్పందించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈవివాదంతో సంబంధం లేదని..ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే.. ఏపీ తెలంగాణ పంచుకోవాలని స్పష్టం చేసింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

బాలకృష్ణకు షాక్.. కన్వీనర్ రంగారెడ్డి రాజీనామా

హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణకు తన నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎంతోకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిలమత్తూరు మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే దీనికి కారణం బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖరే కారణమని తెలుస్తోంది. దీంతో శేఖర్ వ్యవహార శైలి మరోసారి బయటకు వచ్చింది. గతంలో కూడా శేఖర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎలాంటి హోదా లేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంతో శేఖర్ పై పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలకృష్ణ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మోడీ, రామోజీల భేటీ.. సూటు.. బూటులో రామోజీ

  మీడియా మొఘల్ రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. అయితే సాధారణంగా ప్రముఖులు భేటీ అయి ముచ్చటిస్తే ఎవరైనా ఏం మాట్లాడుకున్నారు అని పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ రామోజీరావు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ముచ్చటించినా.. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది మాత్రం రామోజీ డ్రస్ గురించి. మామూలుగా అయితే రామోజీరావు ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారు. చాలా మందికి ఆయన ఆ డ్రస్సింగ్ తోనే తెలిసిఉంటారు. దీంతో ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఉండే రామోజీ ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి మాత్రం.. సూటు వేసుకొని దానికి టై కూడా పెట్టుకున్నారు. ఇంత విభిన్నంగా డ్రస్సింగ్ అయ్యి రామోజీరావు మోడీని కలవడం చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇంతకీ వీరిద్దరూ ఎందుకూ కలిశారంటే.. ఈనాడు.. ఈ టీవీ సంస్థల అధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ ఆసుపత్రి కార్యక్రమాల్ని వివరించారట. దీనికి సంబంధించిన కొన్ని డీవీడీలు.. పుస్తకాలు కూడా మోడీకి అందించారట. మొత్తానికి రామోజీ మోడీని కలవడం వెనుక ఇదే ఉందో.. ఇంకేదైనా ఆంతర్యం ఉందో..

లోకేశ్ విషయంలో పార్టీ నేతలు అనుకున్నదే జరిగిందా..?

గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారా? లేదా?అనే దానిపై అనుమానాలు వస్తునే ఉన్నాయి. ఉప ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొనని ఆయన ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు కొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. ఈ గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు తన తనయుడిని ముందుకు తీసుకురావాలని చూస్తున్నారంట. మొదట ఈ విషయంలో చంద్రబాబు కన్ఫ్యూజన్లో ఉన్న ఇప్పుడు మాత్రం ఈ గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇకనుండి లోకేశ్ తోనే చర్చించాలని.. పార్టీనేతలకు చంద్రబాబు సూచించారట. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల పరిధిలో తనకున్న ఎక్స్ పీరియన్స్ ను కూడా లోకేశ్ కు చంద్రబాబు చెప్పారంట. ఇంకా అవసరమైతే పార్టీలోని సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోమని చెప్పారంట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఇక పార్టీని ముందుండి నడిపేది లోకేశే అని గట్టిగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల కోసం గాను లోకేశ్ ఏపీలోని పార్టీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టారంట. మొత్తానికి టీడీపీ నేతలు అనుకున్నట్టే లోకేశ్ గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్నాడు. మొత్తానికి వారు అనుకున్నది సాధించారు. 

జగన్ మౌనం వెనుక కారణం ఉందా?

ప్రతి పక్షనేత అంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అధికార పార్టీని విమర్శించడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వారిని విమర్శించాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడంలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆమధ్యలో ధర్నాలు, ఆందోళనలు అంటూ కొంచెం హడావుడి చేసినా ఇప్పుడు మాత్రం అలాంటి ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు. తన పాటికి తాను సైలెంట్ గా పనులు చూసుకుంటారు. దీంతో పార్టీ నేతలకు జగన్ ఎక్క‌డంటూ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఆయన వైఖరిపై పార్టీ నేతలే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క టీడీపీ ప్రజల్లో తమ పార్టీని బలోపేతం చేసుకుంటుంటే మరో పక్క జగన్ మాత్రం తనకేమి పట్టనట్టు తన బిజెనెస్ పనుల్లో మునిగిపోతున్నారని.. ఇది పార్టీకే మంచిది కాదని అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు..అంతేకాదు జగన్ తరుపున బొత్స లాంటి పెద్దలు ప్రెస్ మీట్ లు పెడుతున్నా.. టీడీపీ నేతలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదట. జగన్ విమర్శిస్తే అప్పుడు చూసుకోవచ్చులే.. ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఏందుకని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా జగన్ మాత్రం.. ప్రతిపక్షంగా ఎంత పోరాడినా వేస్ట్ అని.. ఏం చేసినా చంద్రబాబుదే పై చేయిగా నిలుస్తుందని చెప్పి.. ప్రస్తుతానికి మౌన మంత్రాన్ని అనుసరిస్తున్నారట. మరి జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో.. ఆయన సైలెంట్ వెనుక ఏదైనా కారణం ఉందా?.. సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారా?.. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే వైయిట్ చేయాల్సిందే.

డిసెంబర్ 17 నుండి ఏపీ శీతాకాల సమావేశాలు.. కోడెల

డిసెంబర్ 17 నుంచి 22 వరకు 6రోజులపాటు అసెంబ్లీ శీతాకల సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరుగుతాయని కోడెల స్పష్టం చేశారు. అంతేకాదు డిసెంబర్ 11వ తేదీనుండి నరసరావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కూడా ఆహ్వానించామని.. ఇంకా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరవుతారని తెలిపారు. ఒక స్పీకర్ గా నాకు ఉన్న అవకాశాలు అన్నీ వినియోగించుకుంటున్నాను.. రూ.200 కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణంతో పాటు, 5శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.

తీవ్ర అస్వస్థతకు గురైన సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండెపోటుతో ఉదయం 8 గంటల నుండి స్పృహలో లేని బర్దన్ ను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న బర్ధన్ కు వయసు ఎక్కువ కావడంతో చికిత్సకు శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. బెంగాల్ కు చెందిన బర్దన్ పూర్తి పేరు ఆర్దేందు భూషణ్ బర్ధన్. 1996 నుండి ఆయన సీపీఐ ప్రధాన కారదర్శిగా పనిచేశారు. బెంగాల్ లోని బరిసల్ అనే ప్రాంతంలో 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.

యాసిడ్ బాధితులు కూడా వికలాంగులే.. సుప్రీం కోర్టు

దేశంలో చాలా మంది యాసిడ్ దాడులకు గురవుతుంటారు. అలాంటి వారి కోసం సుప్రీం కోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక కారణంతో.. ఎవరో దుర్మార్గానికి బలైపోవడం.. యాసిడ్ దాడులకు బలవ్వడం జరుగుతుంటాయి. అలా యాసిడ్ దాడులకు బలైన వారు ఎంతో నష్టపోతుంటారు. అలా యాసిడ్ దాడులకు గురైన వారిని వికలాంగులుగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యాసిడ్ దాడులకు గురైన వారు వికలాంగులేనని తేల్చి చెప్పింది. వారికి.. వికలాంగులకు ఎలాంటి వసతులు.. రాయితీలు కల్పిస్తారో అవన్నీ కల్పించాలని స్పష్టం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని కూడా ఆదేశించింది..