పుతిన్ కు మళ్లీ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు..

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గతంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఓ వీడియో ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఓ రష్యన్ ని రష్యా గూఢాచారిగా అనుమానించి.. అతని చంపుతూ ఓ 8 నిమిషాలు నిడువు ఉండే వీడియోను విడుదల చేశారు. అయితే మొదట ఆరు నిమిషాలు అతనిని హింసించి.. అతను రష్యా గూఢాచారినే అని చెప్పినట్టు ఉండగా తరువాత  పుతిన్ కు హెచ్చరికులు జారీ చేసినట్టు ఉంది. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం....మీ కుమారులును హతం చేస్తాం...మీ ఇళ్లను పేల్చేస్తాం...ప్రతి రష్యన్ సైనికుడి దాడిలో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ ధ్వంసమైన ప్రతి ఇంటికి తాము బదులు తీర్చుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో రష్య ప్రభుత్వం మరోసారి అలెర్ట్ అయింది.

టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్.. మరి దానం?

ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణగా తయారైంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి చాలామంది నాయకులే వేరే పార్టీల్లోకి మారారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఇక అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. అయితే ఇప్పుడు అర్ధం కానీ పరిస్థితి ఏంటంటే ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరిపోయారు.. మరి ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన దానం నాగేందర్ ఇప్పుడు ఏం చేస్తారు అని.. టీఆర్ఎస్ లోకి చేరుతారా? లేదా అని అందరి సందేహం. ఇలా అందరూ సందేహ పడుతున్న సమయంలో దానం కేసీఆర్ ను కలిసిన వార్త బయటకి వచ్చింది. దీంతో ఇప్పుడు దానం కూడా తాను కేసీఆర్ ను కలిశానని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది చెప్పిన దానం తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే దానం అలా చెబుతున్నా.. టీఆర్ఎస్ మాత్రం ఒకసారి ఫిక్స్ అయితే దానం గులాబీ గూటికి వెళ్లక తప్పదు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

డిసెంబర్ 22న ముగియనున్న నిర్భయ నిందితుడి గడువు.. తరువాత?

నిర్భయ కేసులో అందరికి శిక్ష పడగా ఒక్క పిల్ల పిశాచి మాత్రం తప్పించుకున్న సంగతి తెలిసిందే. మైనర్ అనే ఒకే ఒక్క కారణం చేత ఆ దుర్మార్గుడు శిక్ష నుండి తప్పించుకున్నాడు. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. నిర్భయ చెప్పిన వాంగూల్మం ప్రకారం అందరి కంటే ఎక్కువ తనను హింసించింది బాల నేరస్తుడే అని తెలిపింది. అలాంటి వాడికి మైనర్ అన్న సాకుతో మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. అయితే ఈనెల 22తో అతడి శిక్ష పూర్తవుతుంది. దీంతో అతడిని విడుదల చేస్తారా? లేదా? అన్నది అందరి సందేహం. అయితే ఈ విషయంపై అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని గడువు ముగిసిన తరువాత  విడుదల చేయకుండా ఒక స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ఉంచి అతని ప్రవర్తనను మరో ఏడాది గమనించి ఆ తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఇప్పటి వరకూ అతని ఫేస్ కూడా ఎవరికి చూపించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలో అతని ఫేస్ అందరికి చూపించాలని నిర్భయ తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని కూడా కోరారు.

లొంగిపోయిన వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి..

రాజకీయ నాయకులకు దూకుడు ఉంటడం సహజమే.. కానీ అది ఎక్కువైనప్పుడే కాస్త తలనొప్పులు ఎదురవుతాయి. వైకాపా పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. వైకాపా పార్టీలో అందరి కంటే చెవిరెడ్డికి కాస్త దూకుడు ఎక్కువనే చెప్పొచ్చు. ఈ మధ్య రేణిగుంట విమానాశ్రయంలో ఆయన ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ మీద చేయి చేసుకోవడం తెలిసింది. దీంతో ఆయన మీద ఒకటే విమర్శలు. అంతేకాదు పార్టీ నేతలు కూడా చెవిరెడ్డిపై జగన్ కు ఫిర్యాదు చేశారంట. ఇక చెవిరెడ్డి మీద చర్యల కోసం పోలీసులు వెతికే పరిస్థితి. దీంతో పరిస్థితి గమనించిన చెవిరెడ్డి తానే పోలీసుల దగ్గర లొంగిపోయాడు. బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టులో చుక్కెదురైంది. దీంతో అయిన చెవిరెడ్డి అతి దూకుడు పనికి రాదని తెలుసుకుంటారో? లేదో?

లోకేశ్ పథకానికి ఇంప్రెస్ అయిన కేంద్రమంత్రి

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న పథకాలు ఇప్పుడు కేంద్రానికి సైతం నచ్చి సాయం చేస్తున్నాయి. నారా లోకేశ్ యువతలో నైపుణ్యత పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో లోకేష్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా యువతకు నైపుణ్యత పెంపొందించాలని.. దీనిలో భాగంగానే ఇప్పటి వరకూ 1500 మందికి వివిధ విభాగాల్లో శిక్షణ కూడా ఇచ్చారు. అయితే దీన్ని ఇంకా విస్తరింపజేయాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. దీంతో ట్రస్ట్ చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి తెలుగుదేశం ఎంపీలు ట్రస్టు అధికారులతో కలిసి కేంద్ర స్కిల్ డెవలప్ పెంట్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు ట్రస్ట్ గురించిన వివరాలు అన్ని చెప్పేసరికి రూడీ కూడా వారు చెప్పిన అంశం నచ్చి.. ప్రతి నియోజకవర్గానికి మూడుకోట్ల రూపాయలను ప్రాథమికంగా మంజూరు చేయటానికి అంగీకరించారు. మొత్తానికి నారా లోకేశ్ చేపట్టిన పథకం కేంద్రమంత్రిని ఇంప్రెస్ చేయడం సంతోషించాల్సిన అంశమే.

టీఆర్ఎస్ పార్టీ పాలించమంటే దళారీ చేస్తున్నారు.. ఎర్రబెల్లి

టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకున్నంత మాత్రనా టీడీపీని బలహీన పరచలేరని.. మంత్రులు పాలనను వదిలేసి ఎంపీటీసీలను కొనే పనిలో పడ్డారు అని విమర్శించారు. అధికార పార్టీ క్యాంప్ ఆఫీసు, సచివాలయాన్ని టీఆర్ఎస్ ఆఫీసులుగా మార్చారు అని మండిపడ్డారు. పాలించాలని అధికారమిస్తే గులాబీ నేతలు దళారీ పని చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కేసీఆర్ తో భేటీ అయి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి విదితమే.

నీటి సంద్రమైన చెన్నై.. ఏమైనా సాయం కావాలా.. చంద్రబాబు

భారీ వర్షాల కారణంగా చెన్నై నీటి మయమయిపోయింది. వరద నీటితో ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు అన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ప్రజలు ఉన్నారు.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు నీళ్లు, పాల కోసం జనం అల్లలాడుతున్నారు.. ఈ పరిస్థితిలో మరో మూడు రోజుల వరకూ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇంకా ఆందోళన చెందుతున్నారు చెన్నై వాసులు. కాగా వరదనీటిలో చిక్కుకుపోయిన 200 మంది బాధితులను ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ వర్షాలపై జయలలితకి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాదు వర్షాల కారణంగా అతలాకుతలమైన తమిళనాడుకి సాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందుకొచ్చారు. దీనిలో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ఏమైనా సాయం కావాలేమో అడగాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో ఐవైఆర్ కృష్ణారావు తమిళనాడు సీఎస్‌కు ఫోన్ చేసి ఆరా తీసి సాయం చేస్తామని చెప్పగా.. చిత్తూరు జిల్లాలోని  కొన్ని డ్యాంల నుంచి నీటి విడుదల తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరినట్టు తెలుస్తోంది.

టీ కాంగ్రెస్, టీడీపీకి షాక్.. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్

తెలంగాణలో కాంగ్రెస్ కు, టీడీపీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసందే. అయితే కేసీఆర్ తో భేటీ అనంతరం కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ లో చేరా.. నా నియోజకవర్గం అభివృద్ధే నాకు ముఖ్యం.. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో కేసీఆర్ ది కీలక పాత్ర.  బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతాం అని వ్యాఖ్యానించారు.

నన్ను పిలవలేదు.. దానం నాగేందర్..

  టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కాంగ్రెస్ నేతలందరూ హాజరవ్వగా దానం నాగేందర్ మాత్రం డుమ్మా కొట్టారు. అయితే సమన్వయ కమిటీ సమావేశానికి రానని నిన్ననే ఉత్తమ్ తెలిపారని నేతలు అంటున్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం సమన్వయ కమిటీ సమావేశానికి ఉత్తమ్ నన్ను పిలవలేదు..కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు అని అంటున్నారు. కాగా కాసేపట్లో పార్టీ అనుచరులతో తన నివాసం వద్ద దానం భేటీ కానున్నారు.

మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన టీఆర్ఎస్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలను మంత్రి హరీశ్ రావే స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మరోసారి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్  కు తెరలేపినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మంత్రులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గీతారెడ్డి, ముఖేష్ గౌడ్ లను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్. అయితే గీతారెడ్డి, ముఖేష్ గౌడ్లను ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలని.. ఆ భాధ్యతను కేశవరావుకు, డిఎస్ లకు అప్పగించారట కేసీఆర్. మరోవైపు టీడీపీ పై కూడా టీఆర్ఎస్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే సాయన్నతో భేటీ అయినట్టు కనిపిస్తోంది. మరి వారు అనుకున్నట్టు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం చేకూరినట్టే.

చెవిరెడ్డి హడావుడితో జగన్ కు చిక్కులు..?

వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉండి.. అధికార పార్టీని విమర్శించడంలో ఎప్పడూ ఫస్ట్ ఉంటారు. అలా విమర్శించే నేతకే ఇప్పుడు ఆపార్టీలోని ఒక నేత చేసే విమర్శలు తలనొప్పిగా తయారయ్యాయి. అది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి ఈ మధ్య తనకు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నాడని చాలామంది నేతలు జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారంట. దీంతో పదే పదే అందరిని విమర్శిస్తూ.. వివాదాల్లో చిక్కుకుంటూ తలనొప్పులు తెచ్చిపెడుతున్న చెవిరెడ్డికి జగన్ వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ ఇలాంటి వివాదాల్లో తెచ్చిపెడితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. కానీ చెవిరెడ్డి నడవడిక తెలిసిన నేతలు మాత్రం.. ఎవరెన్ని చెప్పినా చెవిరెడ్డి మాత్రం మారడు అని అనుకుంటున్నారు. కాగా గతంలో చెవిరెడ్డి బడ్జెట్ సమావేశాల్లో కోడెల పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గంలో కొందరనీ కులం పేరుతో దూషిస్తున్నారన్న కారణంగా ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు. ఇక ఇప్పుడు ఎంపీ మిధున్ రెడ్డితో కలిసి ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై చెవిరెడ్డి దాడి చేయడం. మరి జగన్ వార్నింగ్ కు భయపడైనా చెవిరెడ్డి నోటివాటం తగ్గిస్తారో లేదో చూడాలి.

ఆంధ్రా సిఎం కిడ్నాప్...కేసీఆర్ పై అనుమానం?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నాప్ అయ్యారా?తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుమానాలు? ఇది చూసి నిజమనుకొని కంగారుపడకండి. ఇది దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో తీయబోయే సినిమా పేరు. “ఆంధ్రా సిఎం కిడ్నాప్” దానికి ట్యాగ్ లైన్ గా “తెలంగాణ సిఎం సస్పెక్టెడ్” అని ఉంటుందని రాంగోపాల్ వర్మ తన తాజా ట్వీట్ మెసేజు ద్వారా తెలియజేసారు.   ఈ సినిమా పేరు చాలా వివాదాస్పదంగా ఉంది కనుక ఇక మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ మొదలవుతుంది. రాంగోపాల్ వర్మ చాలా కాలంగా మంచి హిట్ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారు. అయినా ఈవిధంగా నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చిన దర్శకులు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే, రాంగోపాల్ వర్మ వరుసగా ఇన్ని డజన్ల ఫ్లాపులు తీసి కూడా స్థిరంగా నిలదొక్కుకొని ఉండగలగడం విశేషమే. ఒకవేళ ఆయన స్థానంలో మరో దర్శకుడు ఎవరయినా ఇన్ని ఫ్లాపులు మూటగట్టుకొని ఉన్నట్లయితే, ఎక్కడా కనబడకుండాపోయేవారు.

అమెరికాలో కాల్పులు... 14 మంది మృతి

  అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌బెర్నార్డినో ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శాన్‌బెర్నార్డినో వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతున్న సమయంలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఆగంతకుడు మరణించినట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద భారీగా ఆయుధాలు వున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన మీద అమెరికా అధ్యక్షుడు స్పందించారు. దుండగులు అందరూ హతమయ్యే వరకూ ఆపరేషన్ కొనసాగించాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.

మీరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.. చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో టీ.టీడీపీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు తాము వ్యూహాలు సిద్దం చేశామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేయాలని.. ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలన్న విషయం నేతలు చర్చించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే వారు మహబూబ్ నగర్ నుంచి పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావించి.. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ... మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా జిల్లాల పర్యటనలను ఖరారు చేసుకోవాలన్నారు.

రాజకీయాల్లోకా.. నో వే.. అనుపమ్ ఖేర్

అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై అందరి సంగతేమో కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కాస్త ఎక్కువగానే స్పందిచారన్న దాన్లో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆయన పాలిటిక్స్ ఎంట్రీపై అందరికి సందేహాలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయనకు ఈ తరహా ప్రశ్నే ఎదురైంది. దీంతో ఆయన స్పందించి.. తాను రాజకీయాల్లోకి రావడం అసాధ్యమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని తేల్చిచెప్పారు. అంతేకాదు రాజకీయాల్లోకి రాకపోయినా తాను కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. కాగా అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో చేరి ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు చంద్రబాబు రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. అయితే కేసీఆర్ ఈ నెల చివరి వారాంతంలో ఆయుత చండీయాగం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబును కలవనున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు.. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉన్నందున కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సమేతంగా యాగానికి రావాలని ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతేకాదు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించి.. చాలా జాగ్రత్తగా.. గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ కూడా అదేవిధంగా చంద్రబాబు తనకు ప్రత్యేక స్థానం ఇచ్చినట్లే.. కేసీఆర్ కూడా చంద్రబాబు ప్రత్యేక స్థానం ఇవ్వాలని చూస్తున్నారట. కాగా కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రపతి, గౌవర్నర్ లను చండీయాగానికి ఆహ్వానించిన సంగతి విదితమే.

రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదు.. సుప్రీం

  రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజీవ్ గాంధీ హత్య కేసులు నిందితులుగా ఉన్న ఏడుగురికి మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ప్రభుత్వం.. మరణశిక్ష పడిన మురుగన్, శంతన్, అరివు అనే ముగ్గురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వారితో పాటు  నళిని, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్‌లను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న నిందుతులకు శిక్ష తగ్గించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దోషులను వదలిపెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. శిక్షల విషయంలో ఉపశమనం కలిగించే అధికారం గానీ హక్కు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పింది.

తెలంగాణ తెలుగు యూనివర్శిటీ పేరు మార్పు..

రాష్ట్రం విడిపోయిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించిన పేర్లన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయా విశ్వవిద్యాలయానికి ఫ్రోపెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చగా..  ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మార్చి దానికి సామాజిక చరిత్రకారుడైన సురవరం ప్రతారపెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని.. ఈవిషయంపై ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటామని టీ సర్కార్ వెల్లడించింది. అంతేకాదు ఈ యూనివర్శిటీ పేరు మార్పుపై కేసీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.