ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు... 89 రోజు నుండి తగలబడుతున్న అడవి

  ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకూ ఆగనేలేదు. దాదాపు 89 రోజు నుండి తగలబడుతున్న అటవీ ప్రాంతంలో సుమారు 70 శాతం మేరకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా వ్యాపించిన పొగలవల్ల సహాయక చర్యలు కూడా చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది పరిస్థితి. మరోవైపు శాటిలైట్ చిత్రాల ఆధారంగా మంటలు ఆర్పడానికి ఒకపక్క అగ్నిమాపక యంత్రాలు నిరంతరం శ్రమిస్తుండగా.. మరోవైపు ఐఏఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు రంగంలోకి దిగి భీమ్‌తల్‌ సరస్సు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నాయి. కొద్ది రోజుల్లో పూర్తిగా మంటలను ఆర్పేస్తామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ వెల్లడించారు.   ఇదిలా ఉండగా అడవుల్లోని మంటల గురించి ఉత్తరాఖండ్ గవర్నర్, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంకా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించి ప్రస్తుతానికి 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.

మా దేశాన్ని చైనా రేప్ చేసింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గతంలో మన ఉద్యోగాలు చైనా వాళ్లు కొల్లగొడుతున్నారని నోరు జారిన ట్రంప్ ఇప్పుడు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నోరు జారారు. దఫోర్డ్‌వేన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన అమెరికా వాణిజ్య లోటు గురించి మాట్లాడుతూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని.. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మళ్లీ చైనాపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇంతకుముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందని ఆరోపించారు. మరి గతంలో తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు అన్న ట్రంప్ వ్యాఖ్యలను చైనా వాళ్లు పొగడ్తలుగా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో చూద్దాం..

మూడేళ్లు దాచి బంగారు పోత పోసిన మృతదేహానికి పూజలు..

  చనిపోయిన తన గురువు మరణాన్ని తట్టుకోలేక ఆయన మృతదేహాన్ని దాచి.. దానికి బంగారు పూత పూసి భగవంతుడిలా కొలుచుకుంటున్నారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంత విచిత్రమైన ఘటన దక్షిణ చైనాలో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. దక్షిణ చైనాలో ఫూహోయ్ అనే బాలుడు తన 13వ ఏట బౌద్ధ భిక్షువుగా మారి, ధమ్మ సూత్రాలను బోధిస్తూ, 94 సంవత్సరాల పాటు చాంగ్ ఫూ దేవాలయంలోనే గడిపారు. అయితే 2012 లో ఆయన మరిణంచగా.. అది జీర్ణించుకోలేని అతని శిష్యులు ఆయన మృతదేహాన్ని మూడు సంవత్సరాలు ప్రత్యేక రసాయనాలతో కూర్చున్న భంగిమలో ఓ కుండలో భద్రపరిచారు. ఇటీవలే ఆ మమ్మీని బయటకు తీసి దానికి బంగారంతో పోత పోసి అక్కడే పూజలు నిర్వహిస్తూ, దేవుడని కొలుస్తూ, ఆయనపై ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింస.. నలుగురు మృతి

  పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల క్రితమే ఐదో దశ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో టీఎంసీ పార్టీ కార్యకర్తలకు, సీపీఎం పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగగా.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా మాల్దా ప్రాంతంలో హింస చలరేగింది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు టీఎంసీ నేతలు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బాంబులను విసిరారని, ఈ కారణంతోనే తమవారు మరణించారని తృణమూల్ ఆరోపించగా, కాంగ్రెస్ దాన్ని ఖండించింది.

దావూద్ గురించి రహస్య సమాచారం ఉంది.. మోడీకి మాత్రమే ఇస్తా..

  మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి మన ప్రభుత్వం తలలు పట్టుకుంటుంటే.. దావూద్ గురించిన విలువైనరహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్ కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నారు. దావూద్ మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డు చేసిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి.. కానీ ఈ రహస్య సమాచారం ఎవరికి తెలుపను.. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే.. ఈ సమాచారాన్ని సేకరించేందకు నేను నా జీవితాన్నే పణంగా పెట్టాను.. ఎంతో కష్టపడి సమాచారం సేకరించాను.. అయితే మొదట వడోదరా పోలీసులు ఈ విషయంలో సహకరించారు కానీ.. ఆతరువాత వేధించడం మొదలుపెట్టారు.. తాను తప్పుడు ప్రచారం చేస్తున్నానని పోలీసు కమిషనర్ ఈ రాధాకృష్ణన్ అసత్యాలు చెబుతున్నారు అని ఆరోపించారు. మోడీ కలవడానికి ఎన్నో సార్లు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగా.. ఎన్నో సార్లు మోడీని కలవాలని ప్రయత్నించినా కుదరలేదు అని.. ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయనను కలిసి తన వద్ద ఉన్న సాక్ష్యాలు అప్పగిస్తానని అన్నాడు. ఒకవేళ తన వద్ద ఉన్న సమాచారం తప్పని తెలిస్తే ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించాడు.

అగస్టా దర్యాప్తులో సీబీఐ వేగవంతం.. విచారణలో త్యాగి

  అగస్టా స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు సీబీఐ త్యాగిని విచారిస్తుంది.   మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.

తెలంగాణలో కూడా జగన్ కు దెబ్బ.. టీఆర్ఎస్ లోకి పొంగులేటి, మరో ఎమ్మెల్యే..!

  ఒకపక్క ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి చేరి వైసీపీ అధినేత జగన్ కు చెమటలు పట్టిస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ నుండి కూడా జగన్ షాకులు ఎదురవుతున్నాయి. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లోలోకి జంప్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా పొంగులేటి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ఆ సందేహాలకు తెర దించుతూ ఆయన టీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు.   పొంగులేటితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్లో చేరుతన్నట్టు సమాచారం. ఇంకా వీరితోపాటు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ, 102 మంది ఎంపీటీసీలు, నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 15 మంది కౌన్సిలర్లు, 8 మంది సొసైటీ చైర్మన్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.   ఇదిలా ఉండగా మరోవైపు తాను పార్టీ మారడం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మృతి

  కెన్యాలో భారీ తుఫాను సంభివించింది. ఈ తుఫాను వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం కెన్యా రాజధాని నైరోబీలో తుఫాను సంభవించడం వల్ల కుండపోత వర్షాలకు ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మరణించడంతో పాటు 121 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అలాగే వరదలు, భవనాలు కూలడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలాల నుంచి పది మృతదేహాలు వెలికితీశామని, 80 మందికి చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు.

టీడీపీ రూ.20 కోట్ల భూమి ఆఫర్ చేసింది.. వైసీపీ ఎమ్మెల్యే

  వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీటీడీపీలోకి చేరుతున్న వేళ మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ..  తనను టీడీపీ పార్టీలోకి చేర్చుకునేందుకు గాను సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించారని.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని.. రూ.20 కోట్లు, రాజధానిలో భూమి ఇచ్చేందుకు తనకు ఎర చూపారని ఆరోపించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలిసే ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తనతో అన్నారని, అయితే, ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు.

కేజ్రీ ప్లాన్ ఫ్లాప్ అయిందా.. 23 శాతం కాలుష్యం పెరిగింది

  ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈమధ్యే మలి దశను ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పద్దతి సత్ఫలితాన్ని ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ నాటికి కాలుష్యం 23 శాతం పెరిగిపోయిందట. తొలి రెండు వారాల్లో ఘనపు మీటర్ పరిధిలో 56.17 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలుండగా, సరి-బేసి విధానం ముగిసేనాటికి అది 68.98 మిల్లీగ్రాములకు పెరిగిందట. దీంతో బస్ సర్వీసులను పెంచడం, పరిశ్రమలకు అడ్డుకట్ట, కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల అదుపు వంటి అదనపు చర్యలు తీసుకోకుంటే, దీర్ఘకాలంలో సరి-బేసి విధానం పని చేయదని వెల్లడైనట్లయింది. మరి దీనికి కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మోడీ విద్యార్హతలపై డౌట్ క్లియర్.. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు..

  ప్రధాని నేరంద్ర మోడీ విద్యార్హతలు ఏంటో తెలియజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార కమిషనర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారో లేదో తెలియదు కాని..  గుజరాత్ కు చెందిన 'అహ్మదాబాద్ మిర్రర్' పత్రిక మోదీ విద్యార్హతల వివరాలను బయటపెట్టింది. ఆయన విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారని, ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారని తెలిపింది. 1983లో 62.3 శాతం మార్కులతో పట్టాను పొందారని వివరించింది. ఆయన చదువుకుంటున్న సమయంలోనే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ చేస్తున్నారని, వీరిద్దరి రోల్ నెంబర్ 71 అని పేర్కొంది. మరి కేజ్రీవాల్ గారికి  ఈ వివరాలు సరిపోతాయో లేదో చూడాలి మరి.

అగస్టా పై పారికర్.. 4న అంతా బయట పడుతుంది..

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ డీల్ లో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈకేసు వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసింది కూడా. అయితే ఇప్పుడు దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మరో విషయం వెల్లడించారు. 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.   మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు మరోసారి అగస్టా కుంభకోణాన్ని బీజేపీ వెలుగులోకి తీసుకురాగా, పూర్తి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

పవన్ పై వర్మ సెటైర్లు... గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ వద్దు..

  ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై ట్విట్లర్లో ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..  మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశారు. పవన్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం మానాలని.. పవన్ గబ్బర్ సింగ్ అని, బెగ్గర్ సింగ్ కావొద్దని వివాదాస్పదవ్యాఖ్యలు చేశాడు.  వీరుడు అడుక్కోకూడదని, ఏ కాపులకైతే మీరు పవర్ ఇచ్చారో.. వాళ్లని మీ విన్నపాలతో బీదవాళ్లను చేశారని వ్యాఖ్యానించాడు. అరే కెసిఆర్‌లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి. విన్నపాలు కోరే పవర్ లేని స్టార్‌లు వద్దని వ్యాఖ్యానించారు. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాని.. విన్నపాలు చేస్తే ప్రత్యేక హోదా రాదని అన్నారు.

'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ ను ప్రారంభించిన మోడీ..

  ప్రధాని నరేంద్ర మోడీ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని బాలియాలో కొద్దిసేపటి క్రితం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు తెలిపారు. పలువురు మహిళలకు స్వయంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసిన మోదీ, పేదలందరి జీవితాల్లో వెలుగులను నింపే లక్ష్యంతో తమ ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రకటించనుందని వివరించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని తాను నమ్ముతానని అన్నారు.

ఈసారి జయలలితకు ఓటమి తప్పదా..? తమిళనాట కొత్త సర్వే..

  తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా వాడీ వేడీగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఒకపక్క ఎన్నికల బరిలో సెలబ్రిటీలు ఉండగా, మరోపక్క ఈసారి హిజ్రాలు కూడా పోటీ చేస్తుండటంతో మరి రసవత్తరంగా మారింది. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి జయలలితకు పరాభవం తప్పదని, తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. పూర్వవిద్యార్థుల సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామని.. ఈ సర్వేలో జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిందని.. సర్వే వివరాలు తెలియజేస్తూ, డీఎంకేకు 124 సీట్లు లాభించనున్నాయని, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితం కానుందని వివరించారు.

స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారు..

  వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరగా.. ఇంకా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. వైయస్సార్ కాంగ్రెస పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 16మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. వారిపై అనర్హత వేటు వేయాలని.. పార్టీ ఫిరాయింపులను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని .. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఫిర్యాదు చేశారు.

కెనడాలో తెలుగు అమ్మాయిపై కాల్పులు..

  విదేశాల్లో తెలుగువారిపై దాడులు జరగడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు కెనడాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కెనడాలో ఓ తెలుగు అమ్మాయి పైన గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపి దాడి చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాదుకు చెందిన తింత్రియాజాన్‌ కెనడాలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఆమె  ఓ షాపింగ్ మాల్లో వస్తువులు కొనుగోలు చేస్తుండగా.. ఆ సమయంలో దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్పుల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పోలీసులు చెప్పారు

హైదరాబాద్ మ్యాచ్ కు మళ్లీ వరుణుడి అడ్డంకి..!

  ఐపిఎల్ లో ఎవరికీ లేని అడ్డంకి సన్ రైజర్స్ ను మాత్రం వెంటాడుతోంది. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తో జరిగిన గతమ్యాచ్ లో అడ్డు వచ్చిన వరుణుడు, ఈ రోజు బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు కూడా వచ్చేశాడు. సాయంత్రం నుంచి మబ్బు పట్టి చల్లగా మారింది హైదరాబాద్ వాతావరణం. ఉప్పల్లో ప్రస్తుతానికి చిన్న జల్లులా వర్షం కొడుతుండటంతో, టిక్కెట్ కొని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు మ్యాచ్ జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గత మ్యాచ్ లో వరుణుడి ప్రభావంతో, హైదరాబాద్ ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు సహకరించిన పిచ్, పుణే బ్యాటింగ్ సమయానికి బ్యాటింగ్ పిచ్ గా మారిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పుణే టీం కంఫర్టబుల్ గా గెలిచింది. ఈరోజు బెంగళూర్ తో జరిగే మ్యాచ్ కు కూడా వర్షం వస్తుండటంతో, క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నా సిటీజనానికి మాత్రం, మలమల మాడ్చుతున్న ఈ ఎండల కాలంలో, వర్షం రిలీఫ్ ఇస్తోంది. ఇంకా వర్షం కురవాలని సిటీవాసులు కోరుకుంటున్నారు.