టీడీపీ సీనియర్ నేత చెన్నమనేని రాజశ్వేరరావు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్వరరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక. విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చెన్నమనేని కొంతకాలం ఆజ్ఞాతవాసం గడిపారు.   1967లో రాజీకీయరంగ ప్రవేశం చేసిన రాజేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా సిరిసిల్ల నుంచి ఐదుసార్లు, మెట్టుపల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా, సీపీఐ అనుబంధ సంస్థ రైతు సంఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.  ఆయన మరణం పట్ల టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.  

టీఆర్ఎస్ ఓడితే పదవికి రాజీనామా చేస్తా..మరి నువ్వు..

  ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. బరిలో నిలిచిన కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాలేరులో టీఆర్ఎస్ ఓడిపోతే తన పదవిని వదులుకుంటానని, కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇప్పటికే కాంగ్రెస్ పరాజయానికి పర్యాయపదంగా మారిందన్నారు. హస్తం పార్టీకి నైతిక విలువలు లేవని ప్రతి ఎన్నికకు ఆ పార్టీ నేతలు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన విమర్శించారు.  

పవన్ సపోర్ట్‌తో కొత్త పార్టీ .. త్వరలో నిర్ణయం: ఆర్.కృష్ణయ్య

తెలుగు రాజకీయ రణరంగంలో మరో కొత్త పార్టీ దూకబోతుందా..? బీసీల కోసం ప్రత్యేక పార్టీ రానుందా..? అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెడతారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. బీసీల కోసం పార్టీ పెట్టాల్సిందిగా తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. కొత్తపార్టీ పెట్టే అంశంపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌తో కూడా చర్చించనున్నట్లు చెప్పారు.   

బీహార్‌లో దారుణం..కారు ఓవర్‌టేక్ చేశాడని యువకుడిని కాల్చిపారేశారు

బీహార్ నేతలు ఎంత క్రూరంగా ఉంటారో దేశం మొత్తానికి తెలుసు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. తాజాగా తన కారు ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో ఓ యువకుడిని కాల్చేశాడు ఒక రాజకీయ నాయకుడి కొడుకు. గయకి చెందిన ఆదిత్య అనే 19 ఏళ్ల యువకుడు నిన్న రాత్రి స్నేహితులతో కలిసి తన కారులో వెళుతున్నాడు. అదే సమయంలో జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి భర్త బింది యాదవ్ ఆయన కుమారుడు రాకీలు కారులో వెళుతున్నారు. అయితే ఆదిత్య వారి కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురైన రాకీ తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో కాల్చేశారు. ఈ ఘటనలో ఆదిత్య అక్కడికక్కడే మరణించాడు. అయితే ఆ యువకుడికి తన కుమారుడికి మధ్య గొడవ జరిగిందని,తనను తాను రక్షించుకునేందుకు తన కుమారుడు తుపాకీ బయటకు తీశాడని, పొరపాటున అది పేలి ఆ యువకుడు చనిపోయాడని చెప్పారు. పరారీలో ఉన్న రాకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కర్నూలు నుంచి ఐదో ఎమ్మెల్యే..సైకిలెక్కిన ఎస్వీమోహన్ రెడ్డి

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. కర్నూలు వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మోహన్ రెడ్డి చేరికతో కర్నూలు జిల్లా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకి చేరింది.  

హిమాచల్‌లో లోయలో పడ్డ బస్సు..12 మంది దుర్మరణం

హిమాచల్ ‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులోయలో పడిన దుర్ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. అర్థరాత్రి ధర్మశాల నుంచి రెకాంగ్‌కు వెళుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మండి జిల్లాలో రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించగా..36 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను కాంగ్రా జిల్లా టండాలోని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చీకటి, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.  

టీఆర్‌ఎస్ ఎల్పీలో వైఎస్సార్సీ ఎల్పీ విలీనం చేసిన స్పీకర్..

  ఒకవైపు ఏపీలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వలసలు పోతూ జగన్ షాకిస్తుంటే ఇప్పుడు తెలంగాణ వైసీపీ నుండి పెద్ద దెబ్బే తగిలింది. ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ తమను టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయగా దానిని పరిశీలించిన స్పీకర్... వారిని టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. శాసనసభలో వారికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిపి సీట్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు.

అగస్టా స్కాం.. సోనియా, మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్..!

ఇప్పటికే అగస్టాం స్కాం ప్రకంపనాలతో దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుండి రోజుకో ఆసక్తికర  విషయం బయటపడటం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈకేసుకు సంబంధించి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ఈడీ విచారణ జరుపుతోంది.   మరోవైపు ఈ కేసులో భాగంగా సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆందోళనలు తలెత్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. విచారణ జరిపిన కోర్టు ఈ పిల్ పై కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ స్కాంపై దర్యాప్తును.. సీబీఐ నుండి కోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక బృందానికి ఇవ్వడంపై స్పందన ఎంటో కూడా తెలియజేయాలని కోరింది. ఇటలీ కోర్టు తన తీర్పులో ప్రముఖులైన రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారికి విరుద్ధంగా సీబీఐ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు.

ట్రంప్ పై ఒబామా ఫైర్.. ఇదేమన్న రియాలిటీ షో అనుకున్నావా..?

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలపాలవుతాడు. అయితే ఇప్పుడు ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు ఒబామా విరుచుకుపడ్డారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, వైట్ హౌస్ లో అడుగుపెట్టడం అంటే రియాలిటీషోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని నిలదీశారు. అధ్యక్ష పదవి అంటే వినోదమని ట్రంప్ భావిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ముస్లింలను దేశంలోకి అనుమతించనంటూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హుడా? అని ఆయన ప్రశ్నించారు. ఉన్నత పదవిని సీరియస్ గా తీసుకునే వ్యక్తినే అది వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తాము ఎవరిని అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోబోతున్నామో తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలనుకునేవారు ట్రంప్ అమెరికాను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. 

ఆ దమ్ము మోడీకి లేదు.. ఎందుకంత భయమో... కేజ్రీవాల్

  కాంగ్రెస్ పార్టీ నిన్న ర్యాలీ నిర్వహించగా.. ఈరోజు జంతర్‌మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు అగస్టా కుంభకోణంపై ధర్నా చేపట్టి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు విసిరారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. అగస్టా స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్నాయి.. అంతేకాదు.. ఇటలీ కోర్టు కూడా సోనియా, అహ్మద్‌పటేల్‌ను దోషులుగా తేల్చింది..అయినా సోనియాపై చర్యలు తీసుకునే దమ్ము ప్రధాని మోడీకి లేదు.. సోనియా అంటే ప్రధానికి ఎందుకంత భయమని ఎద్దేవ చేశారు. రెండేళ్లలో అవినీతికి పాల్పడ్డ ఒక్కరిని కూడా మోడీ సర్కారు జైలుకు పంపలేదన్నారు.

మోడీ గురించి కోహ్లీ చెప్పిన ఒక్క మాట..

  ప్రధాని నరేంద్ర మోడీ, కోహ్లీ ఇద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా.. సందర్బానుసారంగా మాత్రం ఏదో ఒక విషయంలో ఇద్దరూ అభినందనలు తెలుపుకుంటూనే ఉంటారు. మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంక వరల్డ్ కప్ లో టీమిండియా గెలిచినప్పుడు మోడీ కోహ్లీకి కూడా అభినందనలు తెలిపారు. ఇప్పుడు మరోసారి కోహ్లీ, మోడీ గురించి చెబుతూ ఆయనకు కితాబిచ్చారు. సీఎన్ఎన్ చానెల్ లో మల్లికా కపూర్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. మోదీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని మల్లికా కపూర్ అడుగగా..'సెల్ఫ్ బిలీఫ్' (ఆత్మవిశ్వాసం) అని కోహ్లి బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని కితాబిచ్చారు.

జగన్ పై చంద్రబాబు సీరియస్.. తోక జాడిస్తే కట్ చేస్తా..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ చెట్టు-నీరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఆనాడు కుట్రపూరితంగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. తాను ఏపీకి వెన్నుపోటు పొడిచానని కొన్ని పత్రికల్లో ఫొటోలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా నూతన రాజధాని అమరావతి... ఇలా అన్నిటినీ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. చివరకు కాపుల ఉద్యమంలో ప్రవేశించి దారుణంగా వ్యవహరించారు. అయినా నా ముందు ఆటలు సాగవు. ఎవరైనా సరే తోక జాడిస్తే కట్ చేస్తా అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

టీడీపీలోకి మరో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి..

  వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న తరుణంలో మరో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో మోహన్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు.    కాగా ఎస్వీ మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి స్వయాన బావ. ఈ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ టీడీపీలో చేరినప్పుడే ఈయన కూడా టీడీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆఖరికి ఇప్పుడు చేరిక ఖరారైంది.

సీఐఏ అధికారిపై పాక్ విష ప్రయోగం.. తెలిసినా అమెరికా మౌనం..!

  అగ్రరాజ్యమైన అమెరికా గత కొంతకాలం నుండి పాకిస్థాన్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పక్కలో బల్లెం సామెత ప్రకారం.. ఎంత మైత్రిగా ఉన్నా కానీ పాకిస్థాన్ మాత్రం తన పని తాను చేసుకుంటూపోతూనే ఉంది. ప్రపంచ దేశాలను సైతం గడగడలాడించిన ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను అమెరికా మట్టి కరిపించింది. అయితే బిన్ లాడెన్ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించింది మాత్రం అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఏజెంట్ మార్క్ కెల్టన్. ఈయనపై పాక్ విషప్రయోగం చేసినందని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.   ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను 2011 మే 4న చంపిన తరువాత సరిగ్గా రెండు నెలలకు మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాక్ నుంచి స్వదేశానికి రప్పించారు. అయితే ఆయన అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటని తెలుసుకోగా. చివరికి ఆయనపై విష ప్రయోగం జరిగిందని తేల్చారు. ఆఖరికి పొత్తికడుపు దగ్గర ఆపరేషన్ చేసి ఆయనను బతికించారు. జరిగింది తెలుసుకున్న మార్క్ మాత్రం గూఢచార సంస్థల్లో పని చేసేవారిపై ఇలాంటి దాడులు సర్వసాధారణమని చెప్పారు. అయితే ఇంతా తెలిసినా అమెరికా మాత్రం ఇలాంటి విషయాన్ని వెల్లడి చేసి ఇబ్బందుల్లో పడే కంటే దీనిపై మౌనంగా ఉండడమే కరెక్ట్ అని భావించి సలైంట్ గా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.