గుండెపోటుతో కలెక్టర్ కన్నుమూత..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కలెక్టర్ అక్షత్ గుప్తా గుండెపోటుతో కన్నుమూశారు. నోయిడాలోని ఓ మాల్‌లో నిన్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడి నుంచి ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 39 సంవత్సరాల అక్షత్ గుప్తా 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన తల్లిదండ్రులు నోయిడాలోనే ఉంటారు. అక్షత్ భార్య రిధిమ్ అగర్వాల్ రుద్రాపూర్‌లో ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టేబులరీ 31వ బెటాలియన్ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణం పట్ల ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, గవర్నర్ కెకె పాల్ తదితరులు సంతాపం తెలిపారు.

అమరావతి లగ్జరీ బస్సులు.. సీటుకో టీవీ.. దానికో రిమోట్

  సాధారణంగా దూర ప్రయాణాలు చేసే బస్సులో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండటానికి ఓ టీవీ ఏర్పాటు చేసి ఉంటుంది. కానీ అది డ్రైవర్ ఆధీనంలోనో.. కండక్టర్ ఆధీనంలోనో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఇప్పుడు సీటుకో టీవీ... దానికో రిమోట్ సౌకర్యం కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు అధికారులు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీనిని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు   అంతేకాదు ఇంకా చంద్రబాబునాయుడు దేశంలోనే తొలిసారిగా విజయవాడ నెహ్రూ బస్టాండ్‌లో మ‌ల్టీ ఫ్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టికెట్‌ కొనుగోలు చేసి కొద్దిసేపు సినిమా చూశారు. ప్రయాణికులకు వినోదం పంచే ఉద్దేశ్యంతో బస్టాండ్‌లో సినిమా థియేటర్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

ఎట్టకేలకు దిగొచ్చిన ఆర్ట్ ఆఫ్ లివింగ్.. జరిమానా మొత్తం చెల్లింపు

  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎట్టకేలకు తమపై విధించిన జరిమానా చెల్లించింది. ఆర్ట్ అఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యమునా నదీ తీరాన ఉత్సవాలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా మార్చిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించింది. కానీ ఈ ఉత్సవాల వల్ల అక్కడి  ప‌రిస‌రాలు కాలుష్యం అవుతున్నాయని గ్రీన్ ట్రైబ్యున‌ల్ పైన 5కోట్ల జరిమానా విధించింది. అయితే మొదట కట్టడానికి నిరాకరించిన సంస్థ ఆ తరువాత కట్టడానికి అంగీకరించింది. రూ.25 లక్షల పరిహారం చెల్లించి, మిగ‌తా జ‌రిమానాను త‌రువాత చెల్లిస్తామ‌ని.. అయితే, ఆ త‌రువాత మాట మార్చేసి జ‌రిమానాను ఎగ్గొట్ట‌డానికి కోర్టుల చుట్టూ తిరిగింది. కానీ గ్రీన్ ట్రైబ్యునల్ గట్టిగా హెచ్చరించడంతో పూర్తి జ‌రిమానాను చెల్లించింది.

తుని ఘటన.. 10 మంది అరెస్ట్.. రౌడీషీటర్ దూడల ఫణి కూడా

కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తునిలో కాపు ఐక్య గర్జన ఉద్యమం చేపట్టిన సంగతి తెలసిందే. అయితే ఆయన చేపట్టిన ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి కూడా విదితమే. ఆ రోజు కొందరు రైలుకు నిప్పటించి ఘర్షణలు రేపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను పరిశీలించిన అనంతరం, 10 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో రౌడీషీటర్ దూడల ఫణిని నేడు అదుపులోకి తీసుకున్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనంలో దూడల ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, మిగతా నిందితులు ఎక్కడివారో ఫణిని విచారిస్తే తెలుస్తుందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవడంతోపాటు తుని ఘటన వెనుకున్న అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసులు తెలిపారు. త్వరలోనే మరికొంత మంది నిందుతులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

నా అనుభవం అంత లేదు జగన్ వయసు.. అదే సమస్య..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చంద్రబాబు స్పందించి ఆయనపై మండిపడ్డారు. అమరావతిలో జరుగుతన్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే జగన్ సవాల్ విసురుతాడా? తన రాజకీయానుభవంలో ఎంతో మంది నేతలను చూశాను.. వైఎస్ లాంటి వాళ్లను చూశాను.. కానీ జగన్ లాంటి వాళ్లను చూడలేదు..  కాని జగన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలు నాకు ఎప్పుడు ఎదురు కాలేదు’’ అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా అనుభవం అంత లేదు జగన్ వయసు.. అదే పెద్ద సమస్యగా మారింది అని అన్నారు.

ఆధార్ కార్డ్ తో దొంగ మొగుడి గుట్టు రట్టు..

  ఏదైనా ఫ్రూఫ్ కావాలంటే ఈమధ్య ఆధార్ కార్డ్ తప్పని సరైపోయింది. అయితే ఈ ఆధార్ కార్డ్ వల్లే ఓ దొంగ మొగుడి వ్యవహారం బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా ఆమెకు ఐదు కిలోల బియ్యం తగ్గాయి. అయితే కార్డులో తన భర్త పేరు కనిపించకపోవడంతో.. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెప్పాడు. దీంతో భర్త ఆధార్ నంబరును ఆన్ లైన్లో చూడగా అసలు నిజం తెలిసింది. అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది.

భారత్ పై దాడికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉంది..

  26/11 ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా అధినేత హఫీజ్‌ సయీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పై భారత్ పాకిస్తాన్‌పై భారత్‌ శత్రుత్వ ధోరణి కనబరిచి దూకుడుగా వ్యవహరించినా, తక్షణమే తిరిగి దాడి చేయడానికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ భూభాగంనుంచి ఎలాంటి డ్రోన్‌ దాడి జరిగినా, మొత్తం భారత్‌ను తుడిచివేసేందుకు అవసరమైన డ్రోన్‌లు తమ వద్ద ఉన్నాయని సయీద్‌ హెచ్చరించాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌ వ్యతిరేక ప్రణాళికలను అమలుపర్చడానికి అవసరమైన నియామకాలు చేపట్టాడు. సయీద్‌కు పాకిస్తాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐల ప్రోద్బలం ఉంది. మరి ఈ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఢిల్లీలో దారుణం... తల్లీ, ఇద్దరు కూతుళ్ల గొంతు కోసి హత్య

  ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్లను దారుణంగా పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం..ఢిల్లీలోని బ్రహ్మపుర ప్రాంతంలో 50 ఏళ్ల సైరా అనే మహిళ, ఆమె కూతుళ్లు మెహరున్నీసా(19), షబ్నం (9) ముగ్గురు ఉంటున్నారు. అయితే తాళం వేసి ఉన్న వారి ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా ముగ్గురూ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండడం గమనించారు. దుండగులు వారి గొంతును దారుణంగా కోసేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు దుండగులు మూడు రోజుల క్రితమే వీరిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్య

  సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. ఈ మాటలు ఎవరన్నారనుకుంటున్నారా.. బీజేపీ సీనియర్ నేత. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్వయంగా చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీపై తమ ప్రతాపం చూపించే  బీజేపీ కీలక నేత సుబ్రహ్మణ్యస్వామి.. ఇటీవలే రాజ్యసభ అభ్యర్ధిగా సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. పైవిధంగా వ్యాఖ్యనించారు. సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. అందుకే ఆయన ఏం చెబితే దానిని నేను విశ్వసిస్తాను అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికల్లా అయోధ్య నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్న ఆయన మాటలను నమ్ముతున్నాను.. దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది.. అయోధ్యలో అత్యద్భుత రామాలయాన్ని నిర్మిస్తాం’’ అని ఉమా భారతి పేర్కొన్నారు.

ఫ్యాన్సీ నంబర్‌ కోసం 33 కోట్లు..

కార్ల నెంబర్ ప్లేట్లు కానీ..మొబైల్ ఫోన్ నంబర్లు కానీయండి ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజే వేరు. ఖరీదైన కార్లు కొని వాటికి తమ హోదా కనిపించేలా నంబర్ ప్లేట్‌ మీద ఫ్యాన్సీ నంబర్ ఉండాలనుకుంటారు సంపన్నులు. రాజకీయనాయకులు, సినీతారలు, సంపన్నులు   ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు.  మొన్నామధ్య టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాను కొత్తగా కొన్న బీఎండబ్ల్యూ కారు కోసం 10 లక్షలు ఖర్చుపెట్టారంటే నోరెళ్లబెట్టాం. కానీ ఒక వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా 33 కోట్లు ఖర్చుపెట్టాడంటే నమ్ముతారా.? యూఏఈలోని షార్జాలో ఫ్యాన్సీ నంబర్‌ను వేలం వేయగా, ఆరిఫ్ అహ్మద్ అల్ జరౌనీ అనే వ్యాపారవేత్త నలభై తొమ్మిది లక్షల డాలర్లు ( మన కరెన్సీలో రూ.33 కోట్లు)కు బిడ్ వేసి నం.1 నంబర్‌ను దక్కించుకున్నాడు. ఈ మొత్తం నిర్ణయించిన ధర కంటే 18 రెట్టు ఎక్కువ. అయితే ఇక్కడ ఇదేం పెద్ద గొప్ప కాదు. 2008లో జరిగిన బిడ్డింగ్‌లో యూఏఈలోనే అత్యంత సంపన్న ఎమిరేట్ అయిన అబుదాబీలో నం.1 నంబర్‌ను ఒక వ్యక్తి 1.42 కోట్లకు దక్కించుకున్నాడు.

అమేజాన్ ను కష్టాల్లోకి నెట్టిన డోర్ మ్యాట్లు...

  ఆన్ లైన్ షాపింగ్ లో మంచి పేరు తెచ్చుకున్న అమేజాన్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇంతకీ అంత పని అమేజాన్ సంస్థ ఏం చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. వివిధ మతాలకు చెందిన దేవుళ్ల చిత్రాలతో కూడిన డోర్ మ్యాట్లను ఆన్ లైన్ లో విక్రయించడమే ఇందుకు కారణం. లక్ష్మీ దేవి, వినాయకుడు, శివుడు తదితర దేవతామూర్తుల చిత్రాలతో పలు దేవాలయాల ఫోటోలు, ఖురాన్, ఏసుక్రీసులను సైతం డోర్ మ్యాట్లపై ముద్రించి అమేజాన్ విక్రయించింది. ఇక అంతే అమేజాన్ చేసిన ఈపనికి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 'బాయ్ కాట్ అమేజాన్' పేరిట ప్రచారం మొదలు పెట్టగా, అదిప్పుడు వైరల్ అయింది. దీంతో జరిగిన తప్పును తెలుసుకున్న అమేజాన్ ఆఖరికి క్షమాపణలు చెప్పింది. అయితే ఎంత క్షమాపణలు చెప్పినా కానీ.. సంస్థకు వ్యతిరేకంగా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

కన్నయ్యపై దాడి చేసిన వ్యక్తి.. అమిత్ షాతో సెల్ఫీలు

జేఎన్యూ విద్యార్ధి కన్నయ్య కుమార్ ఇటీవల విమానంలో ప్రయాణిస్తుండగా.. అతనిపై మనాస్ డేక అనే వ్యక్తి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత పోలీసులు కన్నయ్య ఆరోపణలు తప్పని తేల్చేసింది. ఇప్పుడు మనాస్ డేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి తీసుకున్న సెల్ఫీలు సంచలనం సృష్టిస్తున్నాయి. పుణెలో జరిగిన ప్రమోద్ మహాజన్ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మిషన్ అనే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనాస్ కూడా పొల్గొని అమిత్ షాతో సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే వీటిని చూసిన పలువురు షాకవుతున్నారు. ఇక ఈ ఫొటోలపై స్పందించిన కన్నయ్య కుమార్.. అతనో బలమైన బీజేపీ మద్దతుదారని ఈ ఫొటోల ద్వారా అర్ధమవుతోందని అన్నాడు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వసతులు కల్పించకుండా రమ్మంటున్నారు..అక్కడ వసతులు లేకుండా మేం వచ్చి ఏం చేస్తాం అని అన్నారు. అంతేకాదు.. ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి స్పష్టత లేదుట.. జూన్ 27నాటికి సచివాలయం పూర్తవుతుందన్న నమ్మకం లేదు.. ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడింది.. ఉద్యోగుల పట్ల ఉదాసీదంగా వ్యవహరించవద్దు.. అన్ని వసతులు కల్పించిన తరువాతే వస్తాం అని తేల్చి చెప్పారు.   మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27 నాటికల్లా హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ అమరావతి వచ్చి తీరాల్సిందే అని ఆదేశించారు. మరి ఇప్పుడు అశోక్ బాబు ఇలాంచి వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో  చూడాలి.

మాల్యా విషయంలో ఈడీ మరోసారి ఝలక్...

  బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన మాల్యా విషయంలో ఈడీకి అప్పుడప్పుడు ఝలక్కులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మాల్యా వ్యవహారంలో ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ఇంటర్ పోల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేఖను పరిశీలించిన ఇంటర్ పోల్.. వెంటనే మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేం.. అలా చేయాలంటే తమకు మరింత సమాచారం కావాలని ఈడీకి ఓ లేఖ రాసింది. ఇక దీనిపై స్పందించిన ఈడీ.. పలు కేసుల్లో ఇంటర్ పోల్ ఇలాంటి సమగ్ర సమాచారం కావాలని కోరడం సాధారణమే.. ఇదేమి ఎదురుదెబ్బ కాదు.. ఇంటర్ పోల్ లేఖకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నామని, ఆ తర్వాత మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.

అనంతలో ఆగని టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అనంతలో అగ్గి రాజేశాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంత నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. అసలే కోపంతో ఊగిపోతున్న టీడీపీ కార్యకర్తల ముందు వారు జగన్‌కు జిందాబాద్‌లు కొట్టడంతో తెలుగుదేశం శ్రేణులకు చిర్రెత్తుకువచ్చింది. దీంతో వైసీపీ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.