మోడీని కారులో తిప్పిన మెక్సికో అధ్యక్షుడు..

  ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నిన్న మెక్సికో వెళ్లిన సంగతి తెలిసిందే. మెక్సికో వెళ్లిన ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇద్దరూ భారత్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్ఎస్జీ) గురించి చర్చించారు. ఈ సందర్భంగా మెక్సికో ఎన్ఎస్జీ లో చేరేందుకు మద్దతు తెలిపింది. అనంతరం.. మోదీకి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో వద్ద అరుదైన గౌరవం దక్కింది. మోదీని తన కారెక్కించుకుని, సదరు కారును స్వయంగా డ్రైవ్ చేసిన ఎన్రిక్... మెక్సికో సిటీ వీధుల్లో తిప్పారు. ఆ తర్వాత అక్కడి ఓ వెజిటేరియన్ రెస్టారెంట్ ముందు కారు ఆపిన ఎన్రిక్... మోదీని అందులోకి తోడ్కుని వెళ్లారు. మోదీకి ఇష్టమైన ఆహార పదార్థాలను ఎన్రిక్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. మోదీకి లభించిన ఈ అరుదైన గౌరవాన్ని భాతర విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత 30ఏళ్లలో మెక్సికోను సందర్శించిన తొలి ప్రధాని మోదీ. గతంలో 1986లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మెక్సికోలో పర్యటించారు.

కిర్లంపూడిలో టెన్షన్.. సెక్షన్‌ 30 అమలు..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం తన నివాసం వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. తుని ఘటనపై అరెస్టులను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టారు. దీంతో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాపు నేతలు పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి తరలివస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సెక్షన్‌-30 అమలులో చేశారు. కిర్లంపూడి పరిసరాల్లో 3వేల మంది పోలీసులను మొహరించారు. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు మినహా గ్రామంలోకి ప్రైవేటు వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. గ్రామానికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసులు విధించిన ఆంక్షలపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కాగా తుని ఘటనపై పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముద్రగడ తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రపంచం ఏమనుకుంటుందో మాకు అనవసరం.. క్రిస్ గేల్

  ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తాను ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్‌’ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచం మొత్తం మా గురించి ఏమనుకుంటుందో మాకు అనవసరం’ అని అన్న గేల్.. త‌న‌ని తాను ప్రిసిద్ధ‌ ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు బాల్‌లో రొనాల్డో , ఇబ్రమోవిచ్‌తో పోల్చుకున్నాడు. ఈ ఇరువురి ఆట‌గాళ్ల‌తో పాటు త‌న‌ని తాను ఛాంపియ‌న్‌ వ‌ర్గానికి చెందిన వాడిగా అభివ‌ర్ణించుకున్నాడు. త‌మ శైలి, ఆట‌తీరు గురించి ప్ర‌పంచం ఏమ‌నుకుంటుందో త‌మ‌కు అన‌వ‌స‌ర‌మ‌ని..  రికార్డుల కోసం ప‌రిత‌పించ‌డం త‌మ‌కు అల‌వాటు లేద‌ని ఆయ‌న తెలిపాడు. త‌మ మీద త‌మ‌కు ఉన్న‌ న‌మ్మ‌కంతోనే మైదానంలోకి దిగుతామ‌ని ఆయ‌న చెప్పాడు.

సెల్ఫీ తీసుకున్నాడు.. హంతకుడు దొరికిపోయాడు..

  సెల్ఫీ తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు పోయినవాళ్లను చూసుంటాం. కానీ చెన్నైలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా బుక్కాయ్యాడు ఓ హంతకుడు. వివరాల ప్రకారం.. చెన్నై వాసి అయినా మణి అనే వ్యక్తి.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తాను  2009లో తాను తన సొంతు ఊరు అయినా అరియ‌ళూరుకి వచ్చాడు. ఒకరోజు తన భార్య అయిన విజయలక్ష్మీతో గొడవ పడిన మణి ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. ఇక అప్పటినుండి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది.   అయితే ఈ మధ్య ఆ హంతకుడు తన స్నేహితులతో తీసుకున్న ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన విజయలక్ష్మీ బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. త‌న భార్య‌ను హ‌త్య‌చేసిన త‌రువాత నాలుగేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిపాడ‌ని, త‌రువాత మ‌ళ్లీ చెన్నైకి వెళ్లి అక్క‌డి ఓ హోట‌ల్‌లో ఉద్యోగం చేశాడ‌ని పోలీసులు మీడియాకి తెలిపారు.

ముద్రగడపై చంద్రబాబు సీరియస్.. మీడియా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిన చంద్రబాబు

కాపు నేత ముద్రగడ పద్మనాభం తుని ఘటనలో అరెస్టు చేసిన వారికి నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. ఇప్పటికే ముద్రగడ దీక్ష గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాపు రిజర్వేషన్లపై ఆలోచిస్తున్నామని.. ముద్రగడ డిమాండ్లపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోందని చెపుతూ.. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగ‌డం మంచిది కాద‌ని.. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రంలో మ‌రిన్ని స‌మ‌స్య‌లు సృష్టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హామీలను నెర‌వేర్చే క్ర‌మంలోనే తాము కమిష‌న్ వేశామ‌ని రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌కు ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సమావేశం మధ్యలోనే చంద్రబాబు హడావుడిగా లేచి వెళ్లిపోయారు. ముద్రగడ చేతిలో పురుగుల మందు ఉందని అధికారులు ఆయనకు చెప్పడంతోనే చంద్రబాబు వెంటనే అక్కడి నుండి లేచి వెళ్లారని సమాచారం.

తుని అరెస్టులపై ముద్రగడ నిరాహార దీక్ష.. పురుగుల మందు పట్టుకొని

  కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని ఘటనలో తననూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అరెస్టులను నిరసిస్తూ ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు పట్టుకొని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఆయన పక్కనే ఆయనసతీమణి, ఇతర కుటుంబ సభ్యులు కూర్చున్నారు. అమలాపురం పోలీసు స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై పోలీసులు ముద్రగడపై కేసు నమోదు చేశారు. కానీ ముద్రగడ మాత్రం తాను తుని ఘటనలో అయితేనే అరెస్టవుతానని ముద్రగడ మొండికేస్తున్నారు. తనపై ఉన్న కేసుల వివరాలు చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తనను అరెస్టు చేస్తే జైల్లోనే దీక్ష చేస్తానని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అరెస్టు చేయాలని అడిగితే చేయకుండా దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అడిగారు.

కేసీఆర్ కు నేనెందుకు భయపడతాను..

  తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయమంటూ పలువరు పలు సందర్భాల్లో విమర్శించిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. నిన్న కడపజిల్లాలో జరిగిన మహా సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. '43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... నన్ను ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తాడా?' అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్..

  ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్.. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిని పదవి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మరి అమ్మ ఇంకా ముందు ముందు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ముస్లింలపై సాధ్వీ మరోసారి విమర్శలు..

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మతఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సాధ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త భారత్ మిషన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు ముస్లిం ముక్త భారత్‌ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం విముక్త భారత్‌కు ఇదే సరైన సమయమని ఆమె సూచించారు. షారూఖ్, అమీర్‌ఖాన్‌లు పాక్ అనుకూలురంటూ మండిపడ్డారు. అమీర్ దంగల్‌ను హిందువులు చూడవద్దని పిలుపునిచ్చారు. వచ్చే ఏడు జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్యనాథ్‌ను ప్రకటిస్తే విజయం కమలానిదేనని ఆమె పేర్కొన్నారు.

ప్రజల కళ్లలో ఆనందం చూడాలి-చంద్రబాబు

రాష్ట్ర ప్రజల కళ్లలో ఆనందం చూసేవరకు తాను విశ్రమించబోనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మహా సంకల్ప యాత్ర సందర్భంగా కడపలో జరిగిన మహా సంకల్ప సభకు సీఎం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం అక్కడకు వచ్చిన ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు..ఈరోజు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండి పోవాలని ఆయన కోరారు.   రాష్ట్ర విభజనతో మనం చాలా నష్టపోయామని..ప్రస్తుతం అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నా ఒక్కొ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించినట్టు తెలిపారు. రాజధాని అమరావతి కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఏకంగా 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందన్నారు. దీనికి రగిలిన ఏపీ ప్రజలు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని..ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

చిన్నారి లేఖకు స్పందించిన మోడీ

తనకు వైద్యం చేయించాలని ఒక చిన్నారి సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసింది. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ఆరేళ్ల చిన్నారి వైశాలి యాదవ్‌కు గుండెలో రంధ్రం ఉండి..అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు..కాని అంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో విషయాన్ని ప్రధానమంత్రికి తెలియజేస్తానని వైశాలి తన తండ్రిని అడిగింది.   దీనికి ఆయన ఒప్పుకోవడంతో అప్పటికప్పుడే నోట్‌బుక్‌లో నుంచి ఒక పేజీ చించి తన అనారోగ్యం, పేదరికం గురించి ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఖచ్చితమైన అడ్రస్ లేకపోవడంతో తన స్కూల్ ఐడీ కార్డును జత చేసింది. అయిదంటే ఐదు రోజుల్లో స్పందించిన మోడీ చిన్నారికి ఆపరేషన్ చేయించాలని జిల్లా కలెక్ట్రర్‌ను ఆదేశించారు. అలాగే పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌‌కు నేరుగా పీఎంవో నుంచి లేఖ వచ్చింది. అటు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, ఆసుపత్రి ప్రతినిధులు బాలిక వద్దకు చేరుకోవడానికి ఎలాంటి సదుపాయం రావడంతో పాఠశాలలో ఎంక్వైరీ చేసి బాలికను కలుసుకున్నారు. ఈ వారమే విజయవంతంగా ఆపరేషన్ కూడా నిర్వహించారు. తన లేఖకు సాక్షాత్తూ దేశ ప్రధాని స్పందించడంతో ఆ చిన్నారి ఆనందం వ్యక్తం చేసింది.

భళా ఫ్లిప్‌కార్ట్..స్మార్ట్‌ఫోను బదులు నిర్మా సబ్బు పంపారు..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ముంబైలో కేసు నమోదైంది. వాల్కేశ్వర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫోన్ ఆర్డర్ చేస్తే మే 30న డెలివరీ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ప్రకారం రూ.29,000 చెల్లించి ఎంతో ఆనందంగా బాక్స్ ఓపెన్ చేసిన ఆనంద్ అవాక్కయ్యాడు. అందులో ఫోన్‌కు బదులు నిర్మా సోప్, అండ్రాయిడ్ ఫోన్ చార్జర్ ఉన్నాయి.వెంటనే డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి పిలవగా, అతడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పాడు. కానీ కస్టమర్ కేర్ వాళ్లు దాన్ని తప్పుడు ఫిర్యాదుగా కొట్టేయడంతో ఆనంద్ మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్ ఇవ్వాలి లేదా తన డబ్బు వాపస్ ఇవ్వాలని చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేశానని, వాళ్లు ఏ మాత్రం వినిపించుకోకపోవడంతో ఇక ఫిర్యాదు చేయక తప్పలేదని ఆనంద్ మీడియాతో చెప్పారు.

దేశం మొత్తం పవర్ కట్‌..నేరం కోతిపైకి..!

సాధారణంగా మనం తప్పు చేసి దొరక్కుండా ఉండటానికి అవతలి వాళ్ల మీదకు నెడుతూ ఉంటాం. అచ్చం కెన్యాలో ఓ ఎలక్ట్రిక్ కంపెనీ తప్పు చేసింది. అయితే నేరం వేరే వాళ్ల మీద తోయడానికి దానికి ఎవరూ కనిపించలేదు. దీంతో తప్పు కోతి పైకి నెట్టేసింది సదరు కంపెనీ. ఆఫ్రికా దేశం కెన్యా మొత్తం ఒక్కసారిగా కారు చీకట్లలోకి వెళ్లిపోయింది. దీంతో మూడు గంటల పాటు చీకటి రాజ్యమేలింది. దీనిపై ప్రభుత్వం ఎలక్ట్రిక్ కంపెనీ వివరణ కోరింది. దానికి ఆ కంపెనీ ఒక కోతి తమ కంపెనీ గిటార్ పవర్ స్టేషన్ పైకప్పు మీదకు ఎక్కిందని, అక్కడి నుంచి ట్రాన్స్ ఫార్మర్ మీద పడటంతో పవర్ ట్రిప్ అయ్యిందని, ఈ కారణంతో అన్ని మెషిన్లు పనిచేయకపోవడంతో 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పింది. అయితే ఆ కోతి బతికే ఉందా..చనిపోయిందా ..? ఆ కోతిని ఎవరైనా చూశారా అన్న క్వశ్చన్స్‌కి మాత్రం కంపెనీ అన్సర్ ఇవ్వలేదు.

అంపైర్ ను తిట్టిన క్రికెటర్.. ఏడేళ్లు నిషేదం..

  సాధారణంగా క్రికెటర్లు గ్రౌండ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేసి జరిమానాలు కడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువ క్రికెటర్ మాత్రం ఓ అంపైర్ ను తిట్టి ఏకంగా ఏడేళ్లపాటు నిషేదానికి గురయ్యాడు. ఈ ఘటన బెర్ముడాలో జరిగింది. వెస్ట్ ఇండీస్ ఆల్‌రౌండర్ కెవన్ ఫబ్లర్‌ సీ బ్రీజ్ ఓవల్‌ మైదానంలో బెయిలీస్‌ బే జట్టుపై విల్లో కట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అయితే తాను ఔటైనప్పుడు అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు వికెట్లను బ్యాటుతో కొట్టి, అంపైర్ పై బాలు విసిరి.. అతనిని తిట్టాడు. దీంతో అతను క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించినందుకు.. బెర్ముడా క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. అయితే ఫబ్లర్ పై చిన్న శిక్షనే విధించేవారు కానీ.. అంపైర్ తిట్టడంతో సీరియస్ గా తీసుకున్న క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఫబ్లర్ గతంలో కూడా  సెలెక్టర్ మొల్లీ సిమన్స్‌ను తిట్టినందుకు నిషేధానికి గురయ్యాడు. మరో వైపు ఇలా ఆవేశంతో పదే పదే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తన క్రికెట్ భవిష్యత్ కే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

బాలింతలకు ఉపయోగ పడే 'జనని సేవ’ పథకం ప్రారంభం..

  రైళ్లలో ప్రయాణించే బాలింతలు, శిశువులకు ఉపయోగపడే విధంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రైళ్లలో ‘జనని సేవ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బాలింతలు, శిశువులకు ఉపయోగపడే వేడిపాలు, వేడి నీళ్లు సహా ఇతర వస్తువులను 25 స్టేషన్లలో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువుకు పాలు దొరకలేదంటూ ఓ బాలింత చేసిన ట్వీట్‌ తనను చలించేలా చేసిందని.. శిశువుకు వెంటనే పాలు అందేలా ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని.. ఆ ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొనే అందరికీ ఉపయోగపడేలా జననీ సేవ పథకాన్ని ప్రారంభించానని తెలిపారు.

తెలంగాణ.. 13 కొత్త జిల్లాలు ఇవే..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనంలో కలెక్టర్లతో సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించి కొత్తంగా ఏర్పాటయ్యే 13 జిల్లాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 23 జిల్లాల వివరాలు 1. ఆచార్య జయశంకర్‌ జిల్లా 2. ఆదిలాబాద్‌ 3. భద్రాద్రి 4. యాదాద్రి 5. హైదరాబాద్‌ 6. జగిత్యాల 7. కామారెడ్డి 8. కరీంనగర్‌ 9. ఖమ్మం 10. కొమరంభీమ్‌ 11. మహబూబాబాద్‌ 12. మహబూబ్‌నగర్‌ 13. మెదక్‌ 14. నాగర్‌ కర్నూలు 15. నల్గొండ 16. నిజామాబాద్‌ 17. రంగారెడ్డి 18. సంగారెడ్డి 19. సికింద్రాబాద్‌ 20. సిద్ధిపేట 21. సూర్యాపేట 22. వనపర్తి 23. వరంగల్‌