పోలీసులకు బుర్హాన్ వనీ వారసుడు వార్నింగ్..

  హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే బుర్హాన్ వనీ అంతం తరువాత ఎలాంటి ఉగ్ర సంస్థ నుండి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా బుర్హాన్ వనీ వారసుడు జకీర్ మూసా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. జకీర్ మూసా ఒక వీడియో తీసి దాన్ని విడుదల చేశాడు. ఈ వీడియో ద్వారా ఆయన పోలీసులకు ఓ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముజాహిదీన్ లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న పోరాటంలోకి తమ కుటుంబసభ్యులను ఎందుకు లాగుతున్నారని.. అదే పద్ధతిలో పోలీసులు ఉంటే, తామూ అదే విధంగా చేయాల్సి వస్తుందని హెచ్చరించాడు. జమ్మూకాశ్మీర్ లేదా బయట ప్రాంతాల్లో నివసించే తమ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని పోలీసులు అనుకుంటున్నారేమో, ఆ కుటుంబాలు కన్యాకుమారిలో ఉన్నా సరే, వారిపై దాడి చేసే సత్తా తమకు ఉందంటూ జకీర్ మూసా హెచ్చరించాడు. ఇక ఈ వీడియోపై స్పందించిన పోలీసులు బుర్హాన్ వనీ కుటుంబాన్ని తాము విచారించిన నేపథ్యంలోనే ఈ వీడియోను విడుదల చేసినట్లు అభిప్రాయపడ్డారు.

జియో యూజర్స్ కి గుడ్ న్యూస్...

  ఇప్పటికే ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటాతో సంచలన సృష్టించి.. మిగిలిన నెట్ వర్క్ లకు చెమటలు పట్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది జియో వినియోగదారుల ముందుకు. అదేంటంటే ఇంతకు ముందు జియో ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా ఆఫర్ ను ఈ నెల 3వతేదీ వరకు మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని.. ప్రస్తుతం జియో సిమ్ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్వర్క్లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులతో పాటు ఇతరాత్ర ఉచిత సేవలు డిసెంబర్ 3తో ముగియనున్న సంగతి తెలిసిందే.

సినిమా థియేటర్లలోనే జాతీయగీతం ఎందుకు..?

  రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏం విషయంపై ఎలా స్పందిస్తాడో చెప్పలేం. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించి తనదైన శైలిలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానిపై స్పందించిన వర్మ... ‘జాతీయగీతం థియేటర్లలోనే ఎందుకు ప్రసారం చేయాలి? కస్టమర్లు దుకాణంలో అడుగుపెట్టే ముందు జాతీయగీతం ప్రసారం చేశాకే లోపలికి ఎందుకు వెళ్లకూడదు? ప్రతి టీవీ ప్రోగ్రాం, టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌, రేడియో ప్రోగ్రాంలు ఆరంభంలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రసారం చేయకూడదు? వార్తలు అందించే ముందు టీవీలో ఎందుకు జాతీయ గీతాన్ని ప్రసారం చేయకూడదు? తల్లిదండ్రులు, పిల్లలు ఉదయాన్నే నిద్రలేవగానే జాతీయగీతం పాడి దినచర్య ప్రారంభించకూడదా? అన్ని మతాల ప్రార్థనాలయాల్లో ప్రార్థనలకు ముందుగా జాతీయగీతాన్ని ప్రసారం చేయకూడదా? నైట్‌ క్లబ్స్‌లో తాగడానికి, డ్యాన్స్‌ చేయడానికి ముందు జాతీయగీతం ప్రసారం చేయకూడదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. అంతేకాదు జాతీయగీతం సారాంశం గురించి రాయమని పరీక్షల్లో అడిగితే దాదాపు 99 శాతం భారతీయులు ఖచ్చితంగా ఫెయిలవుతారు అని అన్నారు. మన రాష్ట్రీయ భాష హిందీకి చాలా వెర్షన్లు ఉన్నప్పుడు భారతీయులకు అర్థమయ్యేలా జాతీయగీతాన్ని అన్ని వెర్షన్‌లలోనూ విడుదలచేయకూడదా?’ అంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్లు విసిరాడు. మరి నిజంగానే వర్మ చెప్పిన దాంట్లో కాస్త లాజిక్ ఉన్నట్టే కనిపిస్తోంది కదా...

లోక్ సభలో మారిన ఇష్యూ... రేపటికి వాయిదా...

  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యి రోజూ లాగే ఈరోజు కూడా ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టారు ప్రతిపక్షాలు. అయితే ఈరోజు లోక్ సభలో నోట్ల రద్దుపై ఆందోళనలు చేయలేదు విపక్షనేతలు. కొత్తగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమానం అంశం తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీ ఇండిగో విమానంలో నిన్న పాట్నా నుంచి కోల్‌కతా వెళ్తుండగా విమానంలో ఇంధనం కొరత ఏర్పడింది. దీనిపై టీఎంసీ నేతలు మండిపడ్డారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత మల్లిఖర్జున ఖర్గే మాట్లాడుతూ.. దీదీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అన్నారు. దీంతో టీఎంసీ నేతల ఆందోళనల నేపథ్యంలోనే స్పీకర్ సుమిత్రా మహజన్ సభను రేపటికి వాయిదా వేశారు.

మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పు...

  ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుపై మమతా బెనర్జీ మొదటి నుండి కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీదీకి ప్రాణాల ముప్పు ఉందా అంటే అవునంటున్నారు మల్లికార్జున ఖర్గే. ఈరోజు లోక్ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మమతా బెనర్జీ ఇండిగో విమానంలో నిన్న పాట్నా నుంచి కోల్‌కతా వెళ్తుండగా విమానంలో ఇంధనం కొరత ఏర్పడింది. ఇంధనం లేనందున పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. రన్‌వే ఖాళీ లేదంటూ ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతివ్వలేదు. 30 నిమిషాల పాటు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. కాగా ఉద్దేశపూర్వకంగా ల్యాండింగ్‌కు అనుమతించలేదని అదేవిధంగా విమానం బయల్దేరే ముందు ఇంధనం పరీక్షించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అన్నారు. దీనిపై విచారణ జరపాలని.. మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అన్నారు.

ఒకరోజు ముందే ఎంపీలకు వేతనాలు.. ఏటీఎం వద్ద క్యూ...

  ఒకపక్క ఈరోజు ఒకటో తారీఖు కావడంతో జీతాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరోపక్క జీతాలు వచ్చినా చిల్లర కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే సామాన్య ప్రజల జీతాల సంగతేమో కానీ.. మన ప్రజా ప్రతినిధులకు మాత్రం ఒక రోజు ముందే వేతనాలు పడిపోయాయి. నిన్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఖాతాల్లో వేతనాలు పడగా, ఆ వెంటనే అందరూ పార్లమెంట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు క్యూ కట్టారు. నిన్న ఒక్కరోజులో 300 మందికి పైగా ఎంపీలు డబ్బును విత్ డ్రా చేసుకున్నారు. వీరిలో అత్యధికులు ఒక వారంలో విత్ డ్రా చేసుకునే పరిమతి రూ. 24 వేలను తీసేసుకున్నారు. ఇక ఎంపీలు, వారి సిబ్బంది క్యూలో ఉండటంతో బ్యాంకు అధికారులు ఉరుకులు, పరుగుల మీద పని చేసి అందరికీ డబ్బు అందించారు. ఇక పార్లమెంట్ లోని ఏటీఎంల ముందు కూడా భారీ క్యూలు కనిపించాయి. మరి ఒకపక్క సామాన్యులు చిల్లర కోసం కష్టాలు పడుతుంటే వీరికి మాత్రం ముందుగానే వేతనాలు పడి ఏంచక్కా డ్రా చేసుకున్నారు.

రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... పాస్ వర్డ్ 'నరేంద్ర మోదీ'

  రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్లు అప్పుడప్పుడు హ్యాక్ కు గురవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చేరిపోయారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. రాహుల్ గాంధీ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. రాహుల్ గురించి, ఆయన కుటుంబీకుల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్టు చేశారు. దీంతో వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ ఆ ట్వీట్లను తొలగించారు. అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాహుల్ పై జోకులు పేల్చారు. ఇప్పటికీ చిన్నపిల్లాడిగానే వ్యవహరించే రాహుల్ తన అకౌంట్ పాస్ వర్డ్ ను 'చోటా భీమ్'గా పెట్టుకొని ఉంటాడని... అందుకే ఆయన అకౌంట్ ను హ్యకర్లు ఈజీగా హ్యాక్ చేయగలిగారని అనగా.. పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతో... 'నరేంద్ర మోదీ' అనే పాస్ వర్డ్ ను పెట్టుకుని ఉంటాడని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు.

చెన్నైపై నాడా తుఫాను ప్రభావం...

  చెన్నైకి భారీ తుఫాను వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తుఫాను సంభవించనుంది. అయితే 'నాడా' తుపాను ప్రభావం చూపడం అప్పుడే ప్రారంభించింది. రేపు తమిళనాట ఉత్తర కోస్తా తీరంతో పాటు పుదుచ్చేరిలో కుంభవృష్టి కురుస్తుందని, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను శరవేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. 45 నుంచి 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న తుపాను వేగం 65 కి.మీ వరకూ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రంప్ కు పాక్ ప్రధాని ఫోన్... ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్...

  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి డొనాల్డ్ తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. హిల్లరీ, ఒబామా విషయంలోనే ఇది అర్ధమైంది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా ట్రంప్ తన వైఖరికి మార్చుకున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నప్పుడు పాకిస్థాన్ పై ట్రంప్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశ ప్రధానిపై.. దేశంపై ప్రశంసలు కురిపించారు. అసలుసంగతేంటంటే..ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు నిన్న నవాజ్ షరీఫ్ ఫోన్ చేసినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. షరీఫ్, ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను పాకిస్థాన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. నవాజ్ ను పోరాటయోధుడిగా ట్రంప్ అభివర్ణించారని, అన్ని విధాలుగా ఆయన సంతృప్తికరంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారని.. తాను ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు లేదని, చాలా కాలంగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టు ఉందని ఆయన అన్నట్టు పీపీఐబీ వెల్లడించింది. అంతేకాదు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. దీర్ఘకాలంగా పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైతే తాను సహకరిస్తానని ట్రంప్ చెప్పినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పాక్ ను సందర్శించాలని షరీఫ్ ఆహ్వానించారని, అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని వెల్లడించింది.

విరాట్‌కోహ్లీ ఖాతాలో మరో ర్యాంకు..

  భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లీ మరో ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే మొహాలిలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో  ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌ జాబితాలో 833 రేటింగ్‌ తో 3వ స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అతడు 15వ ర్యాంకులో వున్నాడు. సిరీస్‌లో జరిగిన 3 మ్యాచుల్లో విరాట్‌ 405 పరుగులు చేయడంత 12 స్థానాలు ఎగబాకాడు. కాగా ప్రస్తుతం కోహ్లీ టీ20ల్లో అగ్రస్థానం, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

అఫ్జల్‌ గురు మరణశిక్షకు ప్రతీకారమే దాడి...

  జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటాలో ఉగ్రవాదులు చొరబడి భారత్ ఆర్మీ ఆర్టిలరీ విభాగంలో చొరబడి కాల్పులు జరపగా.. భారత సైన్యం కూడా రంగంలోకి దిగి ముష్కరులను మట్టు బెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు మరణించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు అక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఉర్దూలో రాసిన పత్రాలు దొరికాయి. ఈ పత్రాల్లో పార్లమెంట్‌ పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు మరణశిక్ష అమలు చేసినందుకు ప్రతీకారంగా దాడి దిగినట్టు ఈ పత్రాల్లో రాసివుంది. ‘అఫ్జల్‌ గురుకు  మరణదండన​ విధించినందుకు మొదటి విడతగా ఈ దాడి చేశామ’ని ఉర్దూలో రాసివున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.

15 మంది పాకిస్థాన్‌ రేంజర్లు.. 10 మంది ఉగ్రవాదులు హతం...

  భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్ లోని నగ్రోటాలో పోలీసుల దుస్తుల్లో ఉగ్రవాదులు చొరబడి భారత్ ఆర్మీ ఆర్టిలరీ విభాగంలో చొరబడి కాల్పులు జరపగా.. భారత సైన్యం కూడా రంగంలోకి దిగి ముష్కరులను మట్టు బెట్టారు. అయితే ఇప్పుడు బీఎస్‌ఎఫ్‌ డీజీ కేకే శర్మ మాట్లాడుతూ.. భార‌త‌ సైన్యం పీవోకేలోకి ప్ర‌వేశించి ఉగ్ర‌వాదుల శిబిరాల‌పై చేసిన ల‌క్షిత దాడుల త‌రువాత స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో కాల్పుల‌కు తెగబ‌డుతున్న‌ పాక్ రేంజ‌ర్ల ఆగ‌డాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతున్నామ‌ని, ఇప్పటి వరకు 15 మంది పాకిస్థాన్‌ రేంజర్లను మ‌ట్టుబెట్టామ‌ని.. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో చొర‌బాట్ల‌కు ప్ర‌య‌త్నించిన‌ 10 మంది ఉగ్రవాదులను కూడా హ‌త‌మార్చామ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యంతో భద్రతాదళాలకు ఇబ్బందులు ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు.   ఇంకా సరిహద్దు భద్రత గురించి మాట్లాడుతూ.. సరిహద్దుల్లో 24 గంటలూ నిఘా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో సాంకేతికత వినియోగం పెరుగుతోందని.. సరిహద్దు ప్రాంతాల్లో కంచెల ఆధునికీకరణకు విస్తృత చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను, దాడుల‌ను తిప్పికొడుతున్నామ‌ని చెప్పారు.

500 లకే ఐఏఎస్ జంట పెళ్లి...

  పెద్ద నోట్ల రద్దుతో ఒక పక్క చిల్లర ఇబ్బందులతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నోట్ల రద్దు వలన చాలా పెళ్లిళ్లు పీటల వరకూ వచ్చి ఆగిపోయాయి కూడా. అయితే ఈ నోట్ల రద్దు అయినా తమ పెళ్లి మాత్రం ఎవరూ ఆపలేరు అన్నట్టు కేవలం రూ.500 రూపాయలకే పెళ్లి చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు ఇద్దరు ఐఏఎస్ లు. వివరాల ప్రకారం...  మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌లో ఎస్డీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆశిష్ వశిష్ట  విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్న సలోని సిదానాని పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు. అయితే వీరు తమ వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌లోని బింద్‌ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కోర్టు వారికి నవంబర్‌ 28వ తేదిని కేటాయించింది. ఈ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకున్నారు. అది కూడా కేవలం రూ. 500లకే. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజుగా చెల్లించారు.

తెలంగాణ సీఎస్ గా ప్రదీప్ చంద్ర నియామకం..

  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు పదవికి వీడ్కోలు తెలుపనున్నారు. ఈనేపథ్యంలోనే  ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రదీప్ చంద్రను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం సచివాలయంలో సీఎస్ గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. మద్రాస్ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో ప్రదీప్ చంద్ర పట్టభద్రుడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్ కలకత్తాలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

పవన్ కళ్యాణ్ పార్టీ అందుకే పెట్టాడు...

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్టాపించినా.. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పార్టీ తరపున పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్. కానీ బీజేపీ-టీడీపీ కి తన మద్దతు తెలిపి ఒక రకంగా గెలుపుకు కారణమయ్యాడు. అయితే ఈసారి 2019న జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఆయన క్రియాశీలకంగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలిపారు ఆయన సోదరుడైన నాగబాబు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనను.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారు అని ప్రశ్న అడిగారు. దానికి నాగబాబు.. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని.. సాధారణంగా, ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదిలేస్తుంటామని... కానీ, పవన్ కల్యాణ్ అలా కాదని... దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని.. ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని... ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు.