విపక్షాలు వారిని అవమానించినట్టే..

  పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు కూడా ఆందోళనలతో దద్దరిల్లిపోయాయి. లోక్ సభలో నగ్రోటా కాల్పులపై చర్చలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నగ్రోటాపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్దమంటే కాంగ్రెస్ ముందుకు రాకపోవడం నగ్రోటా అమరవీరులను అవమానించినట్టేనని తెలిపారు. అసలు కాంగ్రెస్‌కు సభను సజావుగా సాగనిచ్చే ఉద్దేశ్యమేలేదన్నారు.   ఇంకా కేంద్రమంత్రి అనంతకుమార్‌ కూడా మాట్లాడుతూ..దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయొద్దని.. సరిహద్దుల్లో కూంబింగ్‌ కొనసాగుతోందని తెలిపారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతున్నా.. విపక్షాలు కావాలనే సభా కార్యకలాపాలు అడ్డుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు.

మిచెల్లీ రాజకీయ భవితవ్యంపై ఒబామా...

అమెరికా అధ్యక్షుడు ఒబామా తన భార్య మిచెల్లీ రాజకీయ భవితవ్యంపై స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్  గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈయనకు ప్రత్యర్ధిగా బరిలో దిగిన హిల్లరీ క్లింటన్ ఓడిపోయారు. అయితే ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోవడంతో... వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై స్పందించిన ఒబామా.. తన భార్య మిచెల్లీ 2020 సంవత్సరంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్లీ ఉండరని ఆయన స్పష్టం చేశారు.  మిచెల్లీ చాలా ప్రతిభావంతురాలని... ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి అంటూ తన భార్యకు కితాబిచ్చారు. మిచెల్లీకి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు.

కొడుకులకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు...

  తల్లిదండ్రులు కష్టపడి కట్టుకున్న ఇంటిపై కొడుకులకు దిమ్మ తిరిగేలా తీర్పు నిచ్చింది ఢిల్లీ హైకోర్టు. అసలు సంగతేంటంటే.. ఢిల్లీలోని ఓ వద్ద తల్లిదండ్రులు..  తమ సొంత ఇంట్లోని పైఅంతస్థుల్లో ఉంటున్న తమ కొడుకు, కోడలును ఖాళీ చేయించాలని 2007లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారించిన కోర్టు 2012లో తల్లిదండ్రులకు సానుకూలంగా తీర్పువచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొడుకు, కోడలు హైకోర్టులో పిటిషన్ వేయగా అదికాస్త ధర్మాసనం తోసిపుచ్చి సంచలన తీర్పు నిచ్చింది. తల్లిదండ్రులు స్వయంగా సంపాదించుకున్న ఇంట్లో ఉండే చట్టబద్ధ హక్కు కుమారుడికి లేదని తేల్చి చెప్పింది. కొడుకుకు పెండ్లి అయినా కాకపోయినా తల్లిదండ్రుల దయాదాక్షిణ్యాలతో మాత్రమే వారి ఇంట్లో ఉండటానికి వీలవుతుందని.. వారు అనుమతించినంత కాలం మాత్రమే ఉండటానికి వీలవుతుందని స్పష్టం చేసింది. సత్సంబంధాలు ఉన్న సమయంలో ఇంట్లో ఉండేందుకు కుమారుడికి అనుమతి ఇచ్చారంటే దాని అర్థం ఆ కుమారుడి భారాన్ని జీవితాంతం వారు మోయాలని కాదని.. ఇల్లు తల్లిదండ్రుల కష్టార్జితం అయినప్పుడు కొడుకు వివాహితుడైనా, కాకపోయినా వారి ఇంట్లో ఉండే చట్టబద్ధమైన హక్కు ఉండదని జస్టిస్ ప్రతిభా రాణి తన తీర్పులో పేర్కొన్నారు.

మొబైల్ బ్యాంకింగ్ అలవాటు చేసుకోవాలి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారులతో  టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భ‌ంగా ఆయ‌న మాట్లాడుతూ, మొబైల్ బ్యాంకింగ్ అలవాటు చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించాల‌ని అధికారుల‌కు చెప్పారు. రాష్ట్రంలోని రేష‌న్ డిపోల‌న్నింటిలో బియ్యంతో పాటు అన్ని స‌రుకులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి ఉంచి విక్ర‌యించాలని, విలేజ్ మాల్స్ మాదిరిగా అవి ప‌నిచేయాలని అన్నారు. బ్యాంకుల మ‌ధ్య అంత‌ర్గ‌త స‌మ‌న్వ‌యం పెర‌గాలని.. ప్ర‌తి గ్రామంలోనూ చర్య‌లు చేప‌ట్ట‌ేలా అధికారులు ప‌ని చేయాల‌ని చెప్పారు. డిసెంబ‌రు 5 లోపు అన్ని జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాలని చెప్పారు. అంతేకాదు ప్రజలకు భరోసా ఇవ్వాలని.. ప్రజా చైతన్యంతోనే సాధించగలమని అధికారులకు సూచించారు.

మమతా బెనర్జీ ఆలోచనను అందుకే తిరస్కరించా..

  పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ పై ధ్వజమెత్తారు. అంతేకాదు పలు దీక్షలు, నిరసనలు కూడా ఆమె చేపట్టారు. అయితే మమతాకు కొంతమంది నుండి మద్దతు లభించినా.. కొన్ని పార్టీల నుండి మాత్రం మద్దతు లభించడంలేదు. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒకరు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన నితీశ్ ఆయనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాను మమతా బెనర్జీ ఆలోచనను తిరస్కరించిన కారణాన్ని గురించి చెప్పారు. నితీశ్ కుమార్ కు స్వయంగా ఫోన్ చేసిన మమతా బెనర్జీ నోట్ల రద్దుపై తాను చేపట్టిన దీక్ష, నిరసనలకు మద్దతిచ్చి కలసి రావాలని కోరిందట.  అందుకు నితీశ్ నిరాకరించారట. ఎందుకంటే... ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, ముందడుగు వేసేందుకు ఓకే చెప్పిన తరువాత, ఎన్ని నిరసనలు తెలిపినా ప్రయోజనం ఉండదని తాను స్పష్టంగా చెప్పినట్టు చెప్పారు.

నల్ల కుబేరులకు ఆర్బీఐ మరో షాక్..

ఇప్పటికే నల్ల కుబేరులకు పెద్ద నోట్ల రద్దుతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోటు ఆర్బీఐ రోజుకో నిర్ణయం తీసుకుంటూ వారికి చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకొని నల్లకుబేరులకు షాకిచ్చింది ఆర్బీఐ. నగదు ఉపసంహరణ'' లపై  సరికొత్త పరిమితిలను  విధించింది. జన్-ధన్ యోజన  ఖాతాలనుంచి నగదు  విత్ డ్రాకు  పరిమితిని విధిస్తూ.. అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా  విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. దీనిలో భాగంగానే కేవైసి ఫిర్యాదు ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసి  ఖాతాదారులకు  ఒక నెలలో అయిదువేలు  విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది  అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు  సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత  బ్యాంక్ మేనేజర్ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. 

పోలీసు దుస్తుల్లో ఉగ్రవాదుల చొరబాటు..

  సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నిన్న తెల్లవారు జామున కొంత మంది సాయుధ ఉగ్రవాదులు పోలీసులు దుస్తుల్లో నగ్రోటాలోని ఆర్మీ ఆర్టిలరీ  విభాగంలో చొరబడి గ్రెనేడ్లు విసురుతూ ఆర్మీ మెస్ కాంప్లెక్స్‌లోకి చొరబడి అక్కడున్న సెంట్రీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులతో పాటు ఒక అధికారి మరణించారు. అనంతరం ఉగ్రవాదులు అధికారులు, వారి కుటుంబాలున్న రెండు భవనాల్లోకి చొరబడ్డారు. అక్కడ 12 మంది సైనికులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చంటిబిడ్డలుండగా వెంటనే స్పందించిన సైన్యం ఆపరేషన్ చేపట్టి వారిని క్షేమంగా రక్షించారు. అయితే  ఆపరేషన్‌లో ఒక అధికారితోపాటు మరో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని..తమ కష్టాలకు కారణం ప్రధాని మోడీయేనని కథనాలు వస్తున్నాయి. అయితే అవన్నీ పుకార్లేనని జనం బీజేపీ పక్షానే ఉన్నారనడానికి తాజాగా జరిగిన గుజరాత్ మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. గుజరాత్‌లోని మునిసిపాలిటీలు, జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కమలం ప్రభంజనం సృష్టించింది. మొత్తం 16 జిల్లాల్లోని 126 మునిసిపాలిటీలు, పంచాయతీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగ్గా, బీజేపీ ఏకంగా 109 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. గుజరాత్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని నమోదు చేయడంతో ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపుతూ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. బీజేపీ పట్ల మరోసారి విశ్వాసాన్ని చాటినందుకు ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు.  

అరుదైన గౌరవానికి చేరువలో ప్రధాని మోడీ

సర్జికల్ స్ట్రక్స్..పాకిస్థాన్ స్పీడుకు బ్రేక్..పెద్దనోట్ల రద్దు ఇవలా సంచలన, సాహసోపేత నిర్ణయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ప్రధాని నరేంద్రమోడీ..దేశీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ప్రతిరోజు మోడీ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుండటంతో ఆయన ఖ్యాతి ఆమాంతం పెరిగింది. ఈ క్రేజ్ మోడీకి అరుదైన గౌరవాన్ని కలిగించే దిశగా చేస్తోంది.  ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో దూసుకుపోతున్నారు. టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో 21 శాతం ఓట్లు సాధించిన మోడీ..ఈ విషయంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లను వెనక్కునెట్టారు. డిసెంబర్ 4తో ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే ఆయన సమీపానికి వచ్చేవారెవ్వరూ లేరు. దీంతో 2016 టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మోడీకి ఖాయంగా కనిపిస్తోంది.

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌటైన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే చాప చుట్టేసి భారత్ ముందు 103 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనకు బారిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే పూజారా, పార్థివ్ పటేల్‌లు దాటిగా ఆడారు ఈ క్రమంలో పూజారా కూడా అవుటయ్యాడు. కానీ పార్థివ్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. దూకుడుగా ఆడిన పార్ధీవ్ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా రెండు విజయాలతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ఆయన బిల్లుకు సంబంధించిన వివరాలను సభ్యులకు వివరించారు. జైట్లీ ప్రసంగం తరువాత మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మరోవైపు బిల్లుపై ఓటింగ్ కోసం విపక్షనేతల నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యే బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి  ఉంది. 

మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా

ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గతంలో క్యాన్సర్ బారిన పడిన సోనియా..అమెరికాలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ప్రచార రథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అక్కడ శాస్త్ర చికిత్స అనంతరం సోనియా చాలా కాలం పాటు ఆస్పత్రిలోనే గడిపారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సోనియా మరోసారి ఆస్పత్రిలో చేరడంతో మళ్లీ ఏ అనారోగ్యం బారిన పడ్డారా అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

చేతులేత్తేసిన ఇంగ్లాండ్..భారత్‌కు స్వల్ప విజయలక్ష్యం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్ భారత్ వశం కాబోతోంది. తన రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 236 పరుగులకే అలౌట్ కావడంతో భారత్‌ ముందు 103 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. నాలుగో రోజు 78/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ కుక్ టెయిలెండర్స్ సాయంతో జట్టు 200 పరుగులు దాటడంలో సాయపడ్డాడు. లేదంటే ఇంగ్లాండ్‌కు ఇన్నింగ్స్ పరాజయం తప్పేది కాదు. చివర్లో బట్లెర్, వోక్స్  సంయమనంతో ఆడి కాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 

వసూలైన నల్లధనమంతా పేదలకే -మోడీ

సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ప్రధాని మోడీ ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ వసూలైన  నల్లధనం అంతా పేదల కోసమే ఖర్చు చేస్తామన్నారు..ఆదాయపు పన్ను చట్టసవరణ బిల్లు అనేది నల్లధనాన్ని చట్టబద్ధం చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. దేశంలో పేదల సంక్షేమానికి ఆదాయపుపన్ను చట్టసవరణ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. దేశంలో నల్లధనాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నామని తెలిపారు. ఈ బ్యాంకింగ్, కార్డుల ఉపయోగం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.

జవాను తల నరికింది పాక్ సైన్యమే

జమ్మూకశ్మీర్‌లోని మిచ్చల్ సెక్టార్‌లో భారత జవానును హతమార్చడమే కాకుండా అతికిరాతకంగా తలను నరికి ఎత్తికెళ్లిన ఘటనలో పాకిస్థాన్‌ కుట్ర ఉన్నట్లు ఆధారాలతో సహా రుజువైంది. ఘటనా స్థలంలో భారత సైన్యం జరిపిన గాలింపు చర్యల్లో పాకిస్థాన్ గుర్తులు ఉన్న కొన్ని ఫోటోలు, ఆహార పదార్థాలు, గ్రనేడ్‌లు, యూఎస్ మార్కింగ్ ఉన్న రేడియో సెట్స్, రాత్రుళ్లు కూడా వీడియోలు చిత్రీకరించగల కెమెరాలు లభ్యమయ్యాయి.   ఈ నెల 22వ తేదీన మిచ్చల్ సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డాయి..ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. అంతేకాకుండా వారిలో ఓ జవాను తలను అతికిరాతకంగా నరికివేశారు. దీనికి మాకు ఏ ప్రమేయం లేదని..అది ఉగ్రవాదుల పని అంటూ పాక్ సైన్యం బుకాయించింది. తాజా ఆధారాలతో పాక్ కుట్ర బయటపడింది.