యూపీలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

  యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది యాత్రికులతో వెళ్లున్న బొలెరో అదనపు తప్పి కెనాలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పృథ్వినాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్‌-ఆలవాల్‌ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది.సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.  ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు. మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు. వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య వంటి వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఈ దుర్ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు చెప్పిన ప్రకారం, కారు డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. లోపల ఉన్నవారు తమ ప్రాణాల కోసం వేడుకున్నా, కారు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ, చాలా మందిని కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన గురించి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, సరైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాల అదుపు కోల్పోవడం వంటి సమస్యలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాక, అనేక మందికి ఒక హెచ్చరికలా మారింది.

ఈ నెల 6న ఢిల్లీలో ధర్నా.. టీపీసీసీ పిలుపు

  తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నాట్లు టీపీసీసీ తెలిపింది. ఇందుకోసం  ఈనెల 4న ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని పేర్కొంది. ఢిల్లీకి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు   తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించింది. ఈ నెల 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం  7న రాష్ట్రపతికి వినతి సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది.  ప్రతి జిల్లా డీసీసీల నుంచి 25 మంది పేర్లను లిస్ట్ చేసి టీపీసీసీకి పంపించాలి. రైల్ తిరిగి 7వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. డీసీసీ అధ్యక్షులు పేర్లను సకాలంలో పంపించి సహకరించి ధర్నా పెద్దఎత్తున విజయవంతం చేయాలని పేర్కొన్నారు.  జిల్లా నుంచి వచ్చే 25 మందిని సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేర్చాలి. ఢిల్లీకి వచ్చే వారికి అక్కడ వసతి, రవాణా, భోజన సదుపాయాలను పార్టీ ఏర్పాటు చేసిందని పార్టీ అధిష్టానం పేర్కొంది.

బీఆర్ఎస్ మాజీ మంత్రిపై కవిత సంచలన వ్యాఖ్యలు

    బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీఆర్ఎస్ లో ఒకరిద్దరు పెద్ద నాయకులు వెనుక ఉండి తనపై విమర్శలు చేపిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉన్నవారే తనపై విమర్శలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి కారకులు ఎవరో తనకు తెలుసని అవసరమైనప్పుడు అందరి భాగోతం బయట పెడతానని హెచ్చరించారు.  నల్లగొండ జిల్లాకు చెందిన ఒక లిల్లీ పుట్ నాయకుడు ఆమె .. ఎవరని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో ఆయన నిర్వాకం వల్లనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైందన్నారు. ఆయన ఒక్కరే కొద్దితేడాతో గెలిచారని చెప్పారు. కేసీఆర్ దయవల్లే బీఆర్ఎస్ లో అందరూ నాయకులుగా చలామణి అవుతున్నారని.. ఒకరిద్దరు మాత్రం తామే పార్టీలో సుప్రీం అనే భావనలో ఉన్నారని విమర్శించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడుతున్న కవిత నేడు మీడియా సమావేశంలో పరోక్షంగా కేటీఆర్, జగదీశ్ రెడ్డిలను ఉద్దేశించి మరింతగా రెచ్చిపోయారు. నల్లొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ని నాశనం చేశాడని కవిత ఆరోపించారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గెలిచాడు. జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనే అని కవిత అన్నారు. నా గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌లో ఒక ముఖ్య నాయకుడు మా జాగృతి లో కొందరు కోవర్టులను పెట్టి ఇక్కడి సమాచారమంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నాయకుడికి చెబుతున్నా... మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని కవిత పేర్కొన్నారు ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కవితపై కీలక వ్యాఖ్యలు చేశారే. బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఆమె గురించి మాట్లాడటం టేమ్ వేస్ట్. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆయన గురించే అని నెట్టింట చర్చ జరుగుతోంది.  

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

  జమ్మూ కశ్మీర్‌‌లో  కుల్గాం అఖల్‌దేవ్‌సర్‌లో మూడు రోజు ఆపరేషన్‌  కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, అటవీ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకపాలాలు జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ సమాచారం ఆగస్టు 1న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరపగా.. శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

నేనొక్క‌డినే ద‌టీజ్ కేసీఆర్!

  తెలంగాణ జాతి పిత‌ను నేను. నాకు తెలీదా? ఇదే కేసీఆర్ కొంప ముంచిందా? అంటే అవున‌నే చెప్పాలి. కేసీఆర్ ది అంతా ఎలా ఉంటుందంటే స‌ర్వం.. తెలుసు  అన్న‌ట్టు ఉంటుందని అంటారు ఆయ‌న మ‌న‌సు బాగా ఎరిగిన వారు. మ‌న‌కు తెలీక‌నా అన్న‌ట్టు ప్ర‌తిదాన్లోనూ ముద్ర వేయాల‌ని చూస్తారనీ. అది కాళేశ్వ‌రం అయినా యాదాద్రి సెట్ అయినా ఒక‌టేనంటారు. అలాంటి శైలి క‌న‌బ‌రుస్తార‌ని చెప్పుకొస్తారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు. ప్ర‌స్తుతం కాళేశ్వ‌రం సంగ‌తే తీసుకుంటే.. బ్యారేజీలు ఎప్పుడు ఎక్క‌డ ఎలా క‌ట్టాలో ఆయ‌నే చెప్పారు. నీటి నిల్వ నిర్ణ‌య‌మూ ఆయ‌న‌దే. ఓ అండ్ ఎం చేయించ‌లేదు.  అంచ‌నాల‌ను పెంచింది. కాంట్రాక్ట‌ర్ల‌ను స‌వ‌రించిందీ ఆయ‌నే. బ్యారేజీలు కూల‌డానికి అవ‌క‌త‌వ‌క‌ల‌కు కార‌ణం ఆయ‌నే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ కి తోడు హ‌రీష్‌. అంతా మాదే. మాకే అన్నీ తెలుసు. ఎలాంటి నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ అక్క‌ర్లేదు. ఈ ఇరువురూ నిర్ణ‌యం తీస్కుని త‌ర్వాత వ్యాస్కోస్ కి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. హైప‌వ‌ర్ క‌మిటీనైతే తుంగ‌లో తొక్కేశారు. భారీ ఎత్తున ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేశారు. మేడిగ‌డ్డ ఏడో బ్లాకు పున‌రుద్ద‌ర‌ణ బాధ్య‌త ఎల్ అండ్ టీదే. అన్నారం, సుందిళ్ల‌తో పాటు స‌రిచేయాల్సింది  నిర్మాణ సంస్థ‌లే. క‌మిష‌న్ కు కేసీఆర్, హ‌రీష్ త‌ప్పుడు సాక్ష్యాలు.  ఇదీ ప్ర‌స్తుతం కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌. దీన్నిబ‌ట్టీ ఇక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌చ్చు జాతి పిత‌గా ప్ర‌జ‌ల ముందు త‌లెత్తుకోవ‌ల్సిన వాడు కాస్తా.. త‌ల దించుకోవ‌ల్సి వ‌స్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.కేసీఆర్ పై గ‌తంలో మీడియా హైప్ కూడా అలాగే ఉండేది. పెద్ద సారే సింహం- పెద్ద సారే చిట్టెలుక‌. పెద్ద సారే రాజు- పెద్ద‌సారే బంటు. ఒక స‌మ‌యంలో రేవంత్ ని త‌యారు చేసింది సీఎంని చేసిందీ ఆయ‌నే అనే ఎలివేష‌న్లు ఇవ్వ‌డంతో ఇదీ ప్ర‌స్తుత ప‌రిస్థితి. ఇప్పుడు చూడండీ.. జీవ‌నాడి కావ‌ల్సిన ప్రాజెక్టు కాస్తా త‌ప్పుల త‌డ‌కగా మారింది.  ఇదే పెద్ద‌సార్ తో పాటు ఈఎన్సీలు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్లు, నీటిపారుద‌ల కార్య‌ద‌ర్శులు, ఆఖ‌రికి ఆనాటి సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శి స్మిత స‌బ‌ర్వాల్ వంటి వారు కూడా ఇందులో ఇరుక్కున్నట్ట‌య్యింది. మ‌రీ ముఖ్యంగా హ‌రిరాం, నూనెశ్రీధ‌ర్, ముర‌ళీధ‌ర్ రావులైతే ఏకంగా వెయ్యికోట్లు పైగా బొక్కిన ఇంజినీర్లు గా చ‌రిత్ర‌లో నిల‌బ‌డి పోయారు. వీరే ఇలా మేశారంటే ఇక ఆ పై వారి ప‌రిస్థితి ఏంటో అన్న పేరొచ్చేసింది. ద‌టీజ్ కేసీఆర్ నేనొక్క‌డినే పాల‌సీ అంటే అన్న‌ది  ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ఆగ‌స్టు 5 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

  తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.  1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ఆర్జితసేవలు రద్దు ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 4న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగ‌స్టు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.  

3 గంటల్లో శ్రీవారి దర్శనమా..

  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకోవడం అసంభవంమని తెలిపారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం..ఇవాళ ఉదయం వీఐపి విరామ సమయంలో తిరుమల ఆలయంలో  స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.  భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రెండు మూడు గంటల్లో చేయించడం అసంభవం అని ఆయన కొట్టిపడేశారు.. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించిన త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని స్పష్టం చేశారు... ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి కి సూచించారు

దీని భావమేమి జగనేశా?

లిక్కర్ స్కామ్ తో మాకేం సంబంధం లేదు. నా తల్లి మీద ఒట్టు. మా నాన్న, తమ్ముడు మద్యం వ్యసనం కారణంగా ఇబ్బంది పడితే.. మా అమ్మ నన్ను దాని జోలికే పోవద్దనింది. మరి నేనలా చేస్తానా? దానికి తోడు నేను డాక్టర్ ని విద్యాధికుడ్ని. వినాయక చవితి రోజు విగ్రహాలు పంచేవాడ్ని.అటువంటి నన్ను కూడా అవమానిస్తారా? ఇదీ చెవిరెడ్డి మీడియా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పిన విధం.  కన్నీటి పర్యంతమై సెంటిమెంటు సైతం పండించేశారాయన.  అలాంటి చెవిరెడ్డి శిష్యుడు,  ఏ సీరీస్ లో చెవిరెడ్డి కంటే ముందే ఉన్న   ఏ34 వెంకటేష్ నాయుడి దగ్గర కావల్సినంత మద్యం డబ్బు ఉన్నట్టు నిరూపించే వీడియోలను బయట పెట్టింది సిట్. మరి దీని భావమేమి చెవిరెడ్డిగారూ! మరి మీ అధ్వర్యంలో మీ అనుచర గణం మీ పరివార గణం సుమారు 200 కోట్ల రూపాయల మేర.. మీ పార్టీ అభ్యర్ధులకు, ఓటర్లకు డబ్బు పంచింది నిజం కాదా? తుడా వాహనాలను కూడా వదలకుండా అధికార దుర్వినియోగం చేసింది నిజం కాదా? అన్నదిపుడు ప్రశ్నగా మారింది.  ఇక ఇదే కేసులో.. ధనుంజయ రెడ్డి తాను పాత కారే వాడుతున్నాను. ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ కేసులో నా పాత్ర లేదు. నాకే పాపం తెలీదని అంటారాయన. ఆయనకేం తెలీకుండానే వైసీపీ నేతలైన జక్కంపూడి రాజా వంటి వారు మీడియా ముందుకొచ్చి తిడతారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఏవన్ రాజ్ కేసిరెడ్డి పెద్ద డాన్ అంటున్నారు. ఆయన డబ్బే ఇదంతా అని చెబుతున్నారు. అంత తెలిసిన వాడు ఈ డబ్బు ఇంత కాలం ఎందుకు దాచకుంటా ఉంటాడంటూ సన్నాయి నొక్కులు. మరి ఇదంతా ఏంటి? సిట్ వీరిపై 305 పేజీల ఛార్జ్ షీట్ ఊరకే రాసిందంటారా? చెవిరెడ్డిని ఊరకే అరెస్టు చేశారా? మిథున్ రెడ్డికి ఏ పాపం తెలీదు. చిన్నప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య గొడవల వల్లే ఈ కేసును పుట్టించి మరీ అరెస్టు చేశారు. ఇదంతా కక్ష సాధింపని అంటోన్న జగన్ అండ్ కో.. మరి ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లో చిక్కిన వీడియోల మాటేంటి? మా వాళ్లకు యూఏఈలో, యూకేలో ఎలాంటి ఆఫీసుల్లేవు సంస్థల్లేవు. టాంజీనియా, జాంబియాలో అసలే పర్యటనలు చేయలేదు. ఉన్నవీ లేనివీ కల్పిస్తున్నారని చెబుతోన్న జగనన్న.. మరి 28 సార్లు వారు విదేశీ పర్యటనలు ఎందుకు చేసినట్టో? అంటే పాస్ పోర్ట్ నెంబర్లు కూడా కల్పితాలేనా?     ఇక ఇప్పుడు పట్టుబడ్డ వీడియోల తాలూకూ తాడేపల్లిలో క్యాష్ డంప్ లు ఎవరివి? వాటిలో దాగిన డబ్బు ఎవరిది? ఇక మొన్న పట్టుబడ్డ 11 కోట్లు. ఇవాళ వాటికి సాక్ష్యంగా వెలుగు చూసిన వెంకటేష్ నాయుడు వీడియోలు... ఏంటిదంతా? మధ్యలో ఇలాగే ఒక సారి ఒక చెక్ పోస్టులో 8 కోట్లకు పైగా పట్టుబడ్డ డబ్బు ఎవరిది? అన్నీ లెక్కలు నిదానంగా తేలుతాయ్. ఇప్పటి వరకూ మద్యం కేసుల్లో చిక్కని వారు లేరు. కేజ్రీవాల్ అయితే ఏకంగా సీఎంగా ఉండగానే అరెస్టయ్యారు. మా. ము  (మాజీ ముఖ్యమంత్రి) అయిన జమోరె కూడా అరెస్టవ్వక తప్పదని అధకారులు అంటున్నారు.  

అడ్డంగా బుక్కైన జె గ్యాంగ్ సభ్యుడు.. నోట్ల కట్టల వీడియోలు బయటపెట్టిన సిట్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైసీపీ గ్యాంగ్ ఒక్కరొక్కరుగా బుక్కౌతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఫోన్ నుంచే  డబ్బుల డెన్ వీడియోలను సిట్ రిట్రీవ్ చేసింది.  మద్యం ముడుపుల సొమ్ములు దాచిన డెన్ లో నోట్ల కట్టలను లెక్కిస్తూ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయన పీఏ అడ్డంగా దొరికిపోయాడు.   ఆ వీడియోతో మద్యం ముడుపుల డెన్ లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పీఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్ లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతోంది.ఆ వీడియోను వెంకటేష్ నాయుడి ఫోన్ నుంచే సిట్ రిట్రీవ్ చేయడంతో మద్యం కుంభకోణంలో వందల కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా దోచుకుని దాచేసుకున్న సంగతి తిరుగులేకుండా రుజువైనట్లైంది.  ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ నాయుడు ను సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకూ తనకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదంటూ వైసీపీ కీలకనేత చెవిరెడ్డి బుకాయింపులు అన్ని పచ్చి అబద్ధాలనీ తేలిపోయింది. 

గొర్రెల స్కామ్ @ 1000 కోట్లు .. తలసానికి తలనొప్పేనా?

మొన్నటి వరకూ గొర్రెల స్కామ్ విలువ కేవలం 250 కోట్ల రూపాయలు  మాత్రమే అన్నట్టు తేల్చింది కాగ్. అయితే ఈ కుంభకోణం దర్యాప్తులోని  ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఈ  కుంభకోణం వెయ్యి కోట్ల రూపాయల పై మాటే నంటూ వెయ్యి టన్నుల బాంబు పేల్చింది. అది కేవలం ఏడు జిల్లాలకు మాత్రమేనని.. ఈ మొత్తం హెచ్చించి చూస్తే అది అటూ ఇటూగా  ఓ 1200 కోట్ల మేర ఉంటుందని తేల్చింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.  దీంతో నోళ్లు వెళ్ల బెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కరూ.  ఆనాటి పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని కాగా.. ఆయన ఓఎస్డీ  కళ్యాణ్‌ కుమార్ ఇందులో భారీ ఎత్తున చేతివాటం చూపించినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెబితే అసలైన లబ్ధిదారులకు కాక.. నకిలీ వ్యవస్థలకు చెందిన ఫేక్ అకౌంట్లలోకి ఈ నిధులు నీళ్లలా ప్రవహించినట్టు తేల్చింది ఈడీ. ఒక మంత్రిగారి ఓఎస్డీ ఇదంతా చేస్తుంటే.. మరి మంత్రిగారికి తెలీకుండానే జరిగి ఉంటుందనుకోవాలా? అన్నదిపుడు   పెద్ద చర్చగా మారింది.  గతంలో ఇలాంటిదే గడ్డి కుంభకోణం జరిగింది. అది ఇంత మొత్తం కాదు కాదు కానీ ఇంచు మించు అలాంటిది. అయితే ఈ కేసులో బుక్ అయిన లాలూ.. ప్రజా ప్రతినిథుల చట్టం కింద ఎన్నికల వ్యవస్థకే దూరం కావల్సి వచ్చింది. ఇప్పటి వరకూ గులాబీ దళాధిపతి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్‌, కవిత మాత్రమే పీకలోతు స్కాముల్లో ఇరుక్కున్నారు.  మిగిలిన వారంతా కడిగిన ముత్యాలేనని భావించే వారికి  దిమ్మ తిరిగేలా..  ఆ పార్టీ మంత్రులు కూడా ఏం తక్కువ తినలేదన్న కోణంలో ఈ గోట్ స్కామ్ బయట పడ్డంతో.. అసలు గొర్రెలు ఎవరు? వీళ్లకు ఓటు వేసిన వారా? అన్న చర్చకు తెర లేచింది.  ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులోని నిధులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లలోకి కూడా మళ్లించారట. ఇప్పటికే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు వాటిని ప్రమోట్ చేసిన వారిపై భారీ ఎత్తున ఈడీ కొరడా ఝుళీపిస్తున్న విషయం తెలిసిందే. మరి నాటి మంత్రిగారికి ఇది కూడా ఒక కొత్త తలనొప్పిగా తయారవుతున్నట్టు భోగట్టా. ఇదంతా ఇలా ఉంటే ఓఎస్డీ.. ఆయన వెనకున్న మంత్రిగారు.. ఆ మంత్రి గారి వెనకున్న అధినేతలు.. ఈ పరంపర ఇంకాఎంత లోతుంది? వీటి ప్రభావం ఏ మేరకు పడనుందన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక వేళ ఈ కేసులో నాడు మంత్రిగా పని చేసిన తలసాని పీకలోతు కష్టాల్లో చిక్కినట్టేనని భావిస్తున్నారు. అంతే కాదు భారాసా అధినేతకు ఇదో కొత్త తలనొప్పి   కానుందనీ అంచనా వేస్తున్నారు. మ  ఈడీ మరెందరు గొర్రె కేడీలను వెలికి తీస్తుందో తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.  కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో  కోర్టు ఏకీభవించింది.  ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించింది.  కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.  

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు,   మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ ఖైదు విధిస్తూ శనివారం  (ఆగస్టు 2) తీర్పు వెలువరించింది.  జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయల జరిమానా.. బాధితురాలికి 7 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.  రేవణ్ణ అరెస్టు అయిన తరువాత దాదాపు 14 నెలల పాటు కేసు దర్యాప్తు సాగింది. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలో తీర్పు వెలువడింది. కోర్టులో రేవణ్ణపై విచారణ శుక్రవారం (ఆగస్టు 1) ముగిసింది. శుక్రవారమే కోర్టు రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా నిర్దారించింది. రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలు మాయం చేయడం తదితర అంశాలలో రేవణ్ణపై నేరాలు రుజువయ్యాయి.   2024లో రేవణ్ణ హసన్పై ఆరోపణలు, ఆ ఆరోపణలకు సంబంధించి వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన జర్మనీకి పరారైపోయారు.   ఎన్నికల అనంతరమే దేశానికి తిరిగి వచ్చారు. రేవణ్ణకు మే 31న బెంగళూరు విమానాశ్రయంలో   పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్ సమీపంలోని రేవణ్ణ ఫాంహౌజ్ లో వంట పని చేసే 47ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవణ్ణపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  

హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. జల ప్రళయం

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రళయం సృష్టించింది. కులు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో శుక్రవారం (ఆగస్టు 1) పెను విషాదం చోటు చేసుకుంది.  కుండపోత వర్షం కారణంగా  మహోగ్రఉగ్రరూపం దాల్చిన మలానా నది గట్లు తెంచుకు ప్రవహించింది. మలానా వరద ధాటికి మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్‌డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది.  స్థానిక నివేదికల ప్రకారం, ఈ జలప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది.   ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఈ భారీ వరదలలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు చెబుతున్నారు.పలువురు వరద ముంపులో చిక్కుకున్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆహారం, నీరు లేక నానాయాతనా పడుతున్నారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది.  పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అత్యవసర ఉన్నతస్థాయి  సమావేశం నిర్వహించారు. కులులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.   భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరింత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం ఔతున్నది. 

ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి.. బాలకృష్ణ హర్షం

మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్  కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని  ఆ సినీమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భగవంత్ కేసరి జాతీయ సినిమా పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిపైన సంగతి తెలిసిందే. తాను నటించిన భగవంత్ కేసరి సినిమా  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా  ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఈ గౌరవం మొత్తం భగవంత్ కేసరి చిత్ర బృందానికే చెందుతుందన్నారు. చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే భగవంత్ కేసరి సినిమా విజయం సాధమైందనీ, ఇప్పుడు ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యిందనీ పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పరిశీలించేందుకు బాలకృష్ణ శనివారం ( ఆగస్టు 2) అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 21 ఎకరాలలో మూడు దశలలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. ఇక నుంచి తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన సందేశాలు ఉంటాయని చెప్పారు.  తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు బాలకృష్ణ చెప్పారు.  

రాందాస్ సొరేన్ ఆరోగ్య పరిస్ఖితి ఆందోళనకరం

ఝార్ఖండ్ మంత్రి రాందాస్ సొరేన్  ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (ఆగస్టు 2) తెల్లవారు జామున ఆయన జంషెడ్ పూర్ లోని తన నవాసంలో బాత్రూమ్ లో జారి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టిందని చెబుతున్నారు. రాందాస్ సొరేన్ ను తొలుత జంషెడ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సైచనమూరకు మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నాయకుడైన రాందాస్ సొరేన్   ఘట్‌షిలా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా, సాక్షరత, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2024లో ఆయనకు ముఖ్యమంత్రి మరో రెండు కీలక శాఖలు రెవెన్యూ, రవాణా కూడా అప్పగించారు. 

జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్.. మరో 18 మంది వైసీపీ నేతలపై కేసులు?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్ తో  వైసీపీ నాయకులపై కేసులు నమోదౌతున్నాయి. జగన్ పర్యటన సందర్భంగా  నెల్లూరు అంబేద్కర్ భవన్ పక్కన జరిగిన తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యకు  తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే  మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్,  పాతపాటి ప్రభాకర్ పై నెల్లూరు దర్గా మిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.  వీరి ముగ్గురితో పాటు ఈ తొక్కిసలాటకు కారకులుగా మరో 18 మందిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.  బారికేడ్లను తోసి వేయడం.. సెక్షన్ 30 యాక్ట్  ను ఉల్లంఘించడంతోపాటు హెడ్ కానిస్టేబుల్ గాయపడడానికి కారణమైన  ఈ18 మందిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.  పోలీసులు గుర్తించిన ఈ  18 మందీ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్  నియోజకవర్గాలకు చెందిన వారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో వీరిని అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని సుమారు నాలుగు కేసులు వరకు నమోదైన సంగతి తెలిసిందే. 

జూబ్లీ ఉప ఎన్నికల బరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం?

భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక  దగ్గర పడుతున్న కొద్దీ, నియోజక వర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.  జూన్ 6 న మాగంటి మరణించిన నేపధ్యంలో.. ఆరు నెలల లోగా అంటే డిసెంబర్ లోగా జూబ్లీ హిల్స్  ఉపఎన్నిక నిర్వహించ వలసి ఉంటుంది.అయితే..  ఇంకా ఎలక్షన్ కమిషన్,నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రధాన పార్టలు ఏవీ అభ్యర్ధులను ప్రకటించలేదు. అయినా..  జూబ్లీ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ఎగసి పడుతోంది.  ఈ నేపధ్యంలో..  అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో పాటు  బీజేపీ కూడా జూబ్లీ సీటును తమ ఖాతాలో కలుపుకోవాలని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్ధులను ప్రకటించక పోయినా.. పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీల టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఓ వంక టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవంక టిక్కెట్  ఖాయంగా వస్తుందన్న విశ్వాసంతో నియోజక వర్గంలో కార్యకర్తలు, అనుచరుల సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.  అదలా ఉంటే సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఇప్పటికే కకంటోన్మెంట్ ఉప ఎన్నికలలో గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సీటును కైవసం చేసుకుని..  జీహెచ్ఎంసీ ఎన్నికలకు, స్ట్రాంగ్  గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని చూస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కిషన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గంలో కేంద్ర మంత్రి హోదాలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తున్నారు. మరోవంక ప్రధాన పార్టీలు మూడింటిలోనూ.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిజానికి ఎంఐఎం ఆమోదంతో..  గతంలో పోటీ చేసిన మాజీ క్రికెటర్’ అజారుద్దీన్ పేరు  ఆల్మోస్ట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే.. ఇప్పడు తలఫై ఫిరాయింపుల కత్తి వేళ్ళాడుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ టికెట్ కోసం క్యూలో నిలబడినట్లు తెలుస్తోంది. అయితే..  దానం నాగేందర్ మాత్రం తాను టికెట్ కోరలేదని..  కానీ తనకు టికెట్ ఇస్తే..  జూబ్లీతో పాటుగా  ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్  నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని అంటున్నారు. మరోవంక జూబ్లీలో ఎవరు గెలిస్తే వారు మినిస్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో  కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ టికెట్ కోసం పోటీ ఎక్కవగా ఉందని అంటున్నారు.  అదలా ఉంటే కొద్ది రోజుల క్రితం..  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్న ప్రభాకర్, జూబ్లీ టికెట్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ టికెట్ స్థానికంగా పనిచేసే వారికే కానీ.. నాన్ లోకల్ అంటే  స్థానికేతరులకు ఇచ్చేది లేదని స్పష్తం చేశారు. అలాగే.. ఎంఐఎం, కాంగ్రెస్ టికెట్ ముస్లిం మైనారిటీకి ఇస్తేనే..  తమ మద్దతు ఉంటుందని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం షరతు విధించిన తర్వాతనే.. కాంగ్రెస్ నాయకత్వం అజారుద్దీన్ కు గ్రీన్  సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజక వర్గంలో ఒక లక్షా 30 వేల వరకు ఉన్న ముస్లిం ఓట్లు అత్యంత కీలకం అయిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పత్వాను కాదన లేదని అంటున్నారు. అయితే.. దానం పైకి ఏమి చెప్పినా, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి బయట పడేందుకు  ఆయన ఢిల్లీ స్థాయిలోనూ పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు ఖైరాబాద్’ స్థానానికి రాజీనామా చేసి ఫిరాయింపుల కేసు నుంచి బయట పడడంతో పాటుగా.. జూబ్లీలో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా సిటీ ఖాతాలో మంత్రి పదవిని సొంతం చేసుకోవచ్చని దానం పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు. ప్రధానంగా సుప్రీం కోర్టు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలల్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించిన నేపథ్యంలో  దానం అనర్హతవేటు నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల విషయం ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోణీ కొట్టి ఫిరాయింపుల ఖాతా ఓపెన్ చేయడంతో పాటుగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే  కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్  లోక్ సభ స్థానం నుంచి   పోటీ చేసిన దానం నాగేందర్  రాజీనామా చేసి, ఎంతో కొంత గౌరవ ప్రదంగా పక్కకుతప్పుకోవడం తప్ప మరో మార్గం లేదనీ.. అందుకే దానం నాగేందర్  జూబ్లీలో పోటీచేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే.. జూబ్లీ స్టోరీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. అంతిమంగా ఏమి జరుగుతుందో  ఇప్పుడే చెప్పడం కష్టం అంటున్నారు  విశ్లేషకులు.

న్యూయార్క్ నగరంలో వరద బీభత్సం

అమెరికా తూర్పు తీరంలో  భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరం భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని గంటల పాటు అతలాకుతలమైపోయింది. నగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లు, భవనాలలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానా ఇబ్బందులూ పడ్డారు.   భారీ వర్షం కారణంగా రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.   చాలా చోట్ల   నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.    ఒక ప్యాసింజర్ రైలులో నీరు ప్రవేశించడంతో అందులోని ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటకు తరలించాల్సి వచ్చింది. న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిం చారు.  

ఆ పది నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు.. కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా? 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరమైనట్లుగా కనిపించిన ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా?  పార్టీని, పార్టీ శ్రేణులనూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడానికి నడుం బిగించారా? అంటే తాజాగా ఆయన తన ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. శనివారం (ఆగస్టు 2) ఆయన ఆయన పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యమనీ, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచీ ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలూ, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అలాగే పార్టీ సంస్థాగతంలో బలోపేతం చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ముందుగా స్థానిక ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు సమాయత్తం కావాలనీ, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ, ఆ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దృష్టిసారిద్దామన్నారు. ఇక పోతే బనకచర్ల విషయంలో రేవంత్ వైఖరిని ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బనకచర్ల నిర్మింతి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు చెబుతున్నా.. నోరుమెదపకుండా తెలంగాణ సీఎం మౌనం వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.   బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలన్నారు.