గొర్రెల స్కామ్ @ 1000 కోట్లు .. తలసానికి తలనొప్పేనా?
posted on Aug 2, 2025 @ 10:20PM
మొన్నటి వరకూ గొర్రెల స్కామ్ విలువ కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే అన్నట్టు తేల్చింది కాగ్. అయితే ఈ కుంభకోణం దర్యాప్తులోని ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఈ కుంభకోణం వెయ్యి కోట్ల రూపాయల పై మాటే నంటూ వెయ్యి టన్నుల బాంబు పేల్చింది. అది కేవలం ఏడు జిల్లాలకు మాత్రమేనని.. ఈ మొత్తం హెచ్చించి చూస్తే అది అటూ ఇటూగా ఓ 1200 కోట్ల మేర ఉంటుందని తేల్చింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. దీంతో నోళ్లు వెళ్ల బెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కరూ.
ఆనాటి పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని కాగా.. ఆయన ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇందులో భారీ ఎత్తున చేతివాటం చూపించినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెబితే అసలైన లబ్ధిదారులకు కాక.. నకిలీ వ్యవస్థలకు చెందిన ఫేక్ అకౌంట్లలోకి ఈ నిధులు నీళ్లలా ప్రవహించినట్టు తేల్చింది ఈడీ. ఒక మంత్రిగారి ఓఎస్డీ ఇదంతా చేస్తుంటే.. మరి మంత్రిగారికి తెలీకుండానే జరిగి ఉంటుందనుకోవాలా? అన్నదిపుడు పెద్ద చర్చగా మారింది.
గతంలో ఇలాంటిదే గడ్డి కుంభకోణం జరిగింది. అది ఇంత మొత్తం కాదు కాదు కానీ ఇంచు మించు అలాంటిది. అయితే ఈ కేసులో బుక్ అయిన లాలూ.. ప్రజా ప్రతినిథుల చట్టం కింద ఎన్నికల వ్యవస్థకే దూరం కావల్సి వచ్చింది. ఇప్పటి వరకూ గులాబీ దళాధిపతి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్, కవిత మాత్రమే పీకలోతు స్కాముల్లో ఇరుక్కున్నారు. మిగిలిన వారంతా కడిగిన ముత్యాలేనని భావించే వారికి దిమ్మ తిరిగేలా.. ఆ పార్టీ మంత్రులు కూడా ఏం తక్కువ తినలేదన్న కోణంలో ఈ గోట్ స్కామ్ బయట పడ్డంతో.. అసలు గొర్రెలు ఎవరు? వీళ్లకు ఓటు వేసిన వారా? అన్న చర్చకు తెర లేచింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులోని నిధులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లలోకి కూడా మళ్లించారట. ఇప్పటికే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు వాటిని ప్రమోట్ చేసిన వారిపై భారీ ఎత్తున ఈడీ కొరడా ఝుళీపిస్తున్న విషయం తెలిసిందే. మరి నాటి మంత్రిగారికి ఇది కూడా ఒక కొత్త తలనొప్పిగా తయారవుతున్నట్టు భోగట్టా. ఇదంతా ఇలా ఉంటే ఓఎస్డీ.. ఆయన వెనకున్న మంత్రిగారు.. ఆ మంత్రి గారి వెనకున్న అధినేతలు.. ఈ పరంపర ఇంకాఎంత లోతుంది? వీటి ప్రభావం ఏ మేరకు పడనుందన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక వేళ ఈ కేసులో నాడు మంత్రిగా పని చేసిన తలసాని పీకలోతు కష్టాల్లో చిక్కినట్టేనని భావిస్తున్నారు. అంతే కాదు భారాసా అధినేతకు ఇదో కొత్త తలనొప్పి కానుందనీ అంచనా వేస్తున్నారు. మ ఈడీ మరెందరు గొర్రె కేడీలను వెలికి తీస్తుందో తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.