కర్ణాటక కాంగ్రెస్ కొంప ముంచుతోన్న నటీమణి డైలాగ్స్!

  దేశం మొత్తంలో కాంగ్రెస్ ఎక్కడా సోదిలో కూడా లేకుండా  పోయింది! ఇదేదో బీజేపి అభిమానులో , మోదీ భక్తులో అనే మాట కాదు.పచ్చి నిజం. మొన్నటికి మొన్న అసోం లాంటి చిన్న రాష్ట్రం కూడా హస్తం చేజారిపోయింది. ఇప్పుడిక మిగిలింది కర్ణాటక. అది తప్ప పెద్ద రాష్ట్రం అంటూ రాహుల్ గాంధీ చేతిలో లేదు! అయితే, త్వరలో కర్ణాటకలో కూడా ఎన్నికలు వున్నాయి! అక్కడ బీజేపికి తమ అధికారాన్ని ఇచ్చే గొప్ప పనిని అందరి కంటే ఎక్కువగా  హీరోయిన్ రమ్య చేస్తోంది!   కర్ణాటకలో రమ్య అంటే మంచి ఫాలోయింగ్ వున్న నటి. అందరు టాప్ హీరోలతో ఆడిపాడిన కమర్షియల్ బామ. తరువాత అనుకోకుండా తండ్రి స్థానంలో పాలిటిక్స్ లోకి వచ్చింది. తండ్రి మరణంతో ఉప ఎన్నికల్లో నిలబడి గెలిచింది. తరువాత తన ప్రవర్తనతో సాధారణ ఎన్నికల్లోఓడిపోయింది. ఇప్పుడు మాజీ ఎంపీ అండ్ మాజీ హీరోయిన్ గా వున్న రమ్య కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది!   అసలు తన నియోజక వర్గం గురించి ఏనాడూ మాట్లాడని రమ్య వున్నట్టుండీ మొన్న పాకిస్తాన్ కు వెళ్లి వచ్చినప్పటి నుంచీ తెగ వార్తల్లో వుంటోంది. ఓ మీటింగ్లో పాల్గొనటానికి పక్క దేశం వెళ్లి వచ్చిన ఆమె ఆ దేశం నరకం కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. మనోహర్ పారికర్ అలా అనటం తప్పని సెలవిచ్చింది. అయినా అసలు మన దేశంలో పాకిస్తాన్ పై ఎవ్వరికీ సరైన అభిప్రాయం లేదు. అటువంటి పాక్ ని పొగడటం ద్వారా రమ్య సాధించదలుచుకుంది ఏంటో ఆమెకే తెలియాలి? పనిలో పనిగా బీజేపి, అరెస్సెస్ వాళ్లనీ టార్గెట్ చేసింది. అంటే.... తనకి ఈ దేశం వారైన ఆరెస్సెస్, బీజేపి వాళ్లకంటే పాకిస్తానే ఇష్టం అన్నట్టు సంకేతాలు ఇచ్చింది!   సహజంగానే పాక్ ని పొగిడితే విమర్శలు ఎదురవుతాయి కదా? రమ్యకూ చాలా మంది తలంటారు.అయినా కూడా ఆమె కాంగ్రెస్ మార్క్ పొగరుతో మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ కి తీవ్ర నష్టం చేస్తోంది. మొన్నో సారి పాక్ నరకం కాదన్న రమ్యే.... మంగళూరు పట్టణం నరకమని చెప్పింది. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ సారీ చెప్పి మంగళూరు స్వర్గం అంటూ కితాబిచ్చింది. ఇక తాజాగా రమ్య, స్వతంత్ర సమరంలో పాల్గొంది కాంగ్రెస్ మాత్రమేనని బీజేపి, అరెస్సెస్ ఏం చేశాయని ప్రశ్నించింది!   నిజానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి బీజేపి అసలు లేనే లేదు. 1980ల తరువాతే బీజేపి ఏర్పడింది. అటు అరెస్సెస్ వున్నా కూడా అదొక స్వచ్ఛంద సంస్థ. స్వతంత్ర పోరాటం చేయటానికి అదేం పొలిటికల్ పార్టీ కాదు. పైగా ఆరెస్సెస్ నాయకులు చాలా మంది వ్యక్తిగతంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కూడా! అందులో కొందరు కాంగ్రెస్ పార్టీలో కూడా వుండేవారు! ఇవేవీ తెలియనీ, పట్టించుకోని రమ్య అరెస్సెస్ బ్రిటీష్ వారితో చేతులు కలిపిందని ఆరోపించింది!   ఇప్పటికే ఆరెస్సెస్ గాంధీ హత్యకి కారణమని కోర్టు ముందు దోషిగా నిలబడ్డాడు సాక్షాత్తూ రాహుల్ గాంధీ. తన ఉద్దేశ్యం అది కాదని మాట మార్చి వివరణ ఇచ్చుకున్నాడు కోర్టుకి! ఇప్పుడు ఆయన బాటలోనే రమ్య కూడా ఆరెస్సెస్ ను టార్గెట్ చేసి జనం ముందు కామెడీ అవుతోంది. పాక్ ని మెచ్చుకుని, ఆరెస్సెస్, బీజేపిల్ని తిట్టిన రమ్య వల్ల కర్ణాటక కాంగ్రెస్ కి మంచి కంటే చెడే ఎక్కువ జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు! అదంతా ఎన్నికల ఫలితాలు వచ్చిన నాడే తెలుస్తుంది...

ఇలాంటి గురువులుంటే... దేశ భవిష్యత్ గురి తప్పదా?

  బతకలేని బడి పంతులు అంటుంటారు. బతకలేని బడిపంతుళ్లు ఇప్పుడున్నారో లేదోగాని సరిగ్గా బతకటం చేతకాని బడి పంతుళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. అసలు ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా మందికి మంచి గౌరవం వుండేది. కాని, ఇప్పుడు పరిస్థితి మరీ విషాదం. ఏ ఇంజనీరో, డాక్టరో, కనీసం ఎంబీఏనో చేయలేని వాళ్లే టీచర్లు అవుతున్నారు. టీచర్ అయ్యేందుకు ఫలానా అర్హత అంటూ కూడా లేకుండా పోయింది. గల్లీ గల్లీల్లో వెలిసే చిన్నా చితకా స్కూల్స్ లో డిగ్రీ, ఇంటర్ పాసైన వారు ఎవర్నైనా సరే టీచర్లుగా పెట్టేస్తున్నారు! టీచర్ అయ్యాక విద్యార్హతలు సరిగ్గా లేకున్నా సరే..... కనీసం బుద్దైనా వక్రమార్గంలో వుండకుంటే అదే గొప్పా!   కాని, కొందరు గురువులు తమ వృత్తికే సిగ్గు చేటుగా మారిపోతున్నారు. ఒక టీచర్ పిల్లల్ని వాతలు పడేలా కొట్టి షాడిజమ్ చూపిస్తుంది. మరో టీచర్ బూతులు తిడుతూ అవమానిస్తుంది. ఇలాంటి వార్ని చూసి పిల్లలు అందుకు తగ్గట్టే తయారవుతున్నారు... కొట్టడం, తిట్టడం కాదు... మరో అడుగు ముందుకేసే దుర్మార్గ టీచర్లు కూడా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఓ గిరిజన పాఠళాల టీచర్ ఏం చేశాడో తెలుసా? చదువుకోటానికి తన దగ్గరికి వచ్చిన పిల్లల్ని మసాజ్ చేయమన్నాడు. వాళ్ల చేత కాళ్లు కూడా పట్టించుకున్నాడు. అయితే, ఆ ఘన కార్యం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. చివరకు, పై అధికారులు టీచర్ దొరవార్ని సస్పెండ్ చేశారు. నిజంగా మాట్లాడుకుంటే ఒక టీచర్ కాళ్లు పట్టడం పెద్ద వార్తేం కాదు మన దేశంలో. అది గౌరవం కొద్దీ పిల్లలు చేస్తే ఫర్లేదు. కాని, అమాయక గిరిజన పిల్లల్ని టీచర్ దబాయించి కాళ్లు ఒత్తించుకోవటం? నిస్సందేహంగా అమానుషమే అవుతుంది. ఇలాంటి టీచర్లు మన దేశంలో ఊరూరా వుంటుంటారు...     టీచర్లలో కీచక టీచర్లు కూడా ఈ మధ్య ఎక్కువైపోయారు. లైంగికంగా వేధించే ఉపాధ్యాయులకు దేహ శుద్ధి జరగటం అసలు పెద్ద వార్తే కాదన్నంత మందంగా మారిపోయాం మనం! ఒరిస్సాలో ఏకంగా ఉత్కల్ యూనివర్సిటి క్యాంపస్ లోనే తన పైత్యం ప్రదర్శించాడు ఓ టీచర్. తన స్నేహితురాల్ని కలవటానికి వచ్చిన మరో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయం తెల్సిన యూనివర్సటి విద్యార్థిని మాస్టార్ గార్ని చితకబాదింది. ఆమెకు మిగతా విద్యార్థినులు కూడా తొడయ్యారు. అయితే, ఇక్కడ మరో అరాచకం ఏంటంటే, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన గురువుగారు ఆ సమయంలో చిత్తుగా మందు కూడా తాగి వున్నాడట!   మందు తాగి, అమ్మాయిల్ని వేధించే టీచర్లతో ... ఇక విద్యార్థుల భవిష్యత్ ఎలా వుండబోతోంది? ధైర్యం వుంటే మనమే ఊహించుకోవచ్చు!

చైనాకు చెమటలు పట్టిస్తున్న ఇండియా, అమెరికా!

  పాకిస్తాన్ తో అంటకాగుతు ఇండియాని ఇబ్బందిపెట్టాలని చూస్తోన్న చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అటు కాశ్మీర్ మొదలు ఇటు అరుణాచల్ ప్రదేశ్ దాకా భారత భూ భాగంలో ఎక్కడపడితే అక్కడ చొరబడుతూ , కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వే చైనా ఇప్పుడు కాస్త ఇబ్బందిపడటం మొదలు పెట్టింది. అందుక్కారణం... అమెరికా, ఇండియా సరికొత్త స్నేహమే! గత కొన్ని ఏళ్లుగా అమెరికా, భారత్ అంతకంతకూ దగ్గరవుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా, మోదీ ప్రధాని అయ్యాక ఆయన చాలా సార్లు యూఎస్ వెళ్లి వచ్చారు. భారత ప్రధాని అగ్ర రాజ్యం సందర్శించినప్పుడల్లా రెండు దేశాల మీడియా పూనకంతో ఊగిపోతోంది. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కూడా ఇండియా వచ్చి వెళ్లారు. అదీ గ్రాండ్ సక్సస్ అయింది! మన ప్రధాని, వాళ్ల అధ్యక్షుడి స్థాయిలోనే కాదు... ఇండియా, అమెరికా వివిధ స్థాయుల్లో మీటింగ్ లు, ఒప్పందాలతో అలజడి చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ మీద ప్రేమతో అమెరికా ఇండియాని అంతగా నమ్మేది కాదు. అలాగే, చైనా మీది భయంతో మన గత ప్రభుత్వాలు అమెరికాను పూర్తి స్థాయిలో ఆహ్వానించలేదు. కాని, మోదీ వచ్చాక అన్ని హద్దులు చెరిగిపోయాయి. ఇటు బిజినెస్ అటు డిఫెన్స్ రెండు అంశాల్లోనూ అమెరికా రిజెక్ట్ చేయలేని ఆఫర్స్ ఇండియా ఇస్తోంది. అందుకే, అన్ని విధాల దివాలా తీసిన పాక్ ను పక్కకు పెట్టి అమెరికా ఇండియాతో స్నేహానికి సై అంటోంది! ప్రస్తుతం భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రక్షణ అంశాలపై కీలక ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ తో ఇండియా, అమెరికా ఒకరి డిఫెన్స్ లాజిస్టిక్స్ మరొకరు వాడుకోగలుగుతారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న అమెరికన్ ఎయిర్ బేస్ లు లాంటివి ఇక ఇండియా వాడుకునే ఛాన్స్ వుంటుందన్నమాట. అదే సమయంలో అమెరికా కూడా మన లాజిస్టిక్స్ వాడుకుంటుంది. కాని, ఎక్కువగా లాభపడేది ఇండియానే. అమెరికా ప్రపంచంలోని ఏ స్థానం నుంచైనా యుద్ధం చేయగలదు. ఆ ఏర్పాట్లన్నీ మనకు ఇప్పుడు అందుబాటులో వుంటాయన్నమాట. అమెరికా ఇండియాకి ఎక్కువగా లాభపడే ఈ ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంది? రీజన్ చైనానే!   డ్రాగన్ ను ఎలాగైనా అడ్డుకోవాలని ట్రై చేస్తోన్న అమెరికా దక్షిణా చైనాలో ఇండియా ద్వారా బీజీంగ్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే, అమెరికా ఇండియాతో కలిసి నడిచేందుకు సిద్ధపడింది! ఇలా అమెరికా, ఇండియా ఒప్పందం ఇద్దరికీ మేలు చేసేదే! ఎప్పటిలాగే మన అపొజిషన్ పార్టీలు ఒకట్రెండు విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, అమెరికాతో స్నేహం వల్ల వచ్చేలాభం, దాని అవసరంతో పోలిస్తే నష్టాలు అంత సీరియస్ కావు. కాబట్టి ఇటు పాక్, అటు చైనా రెండు మనతో జాగ్రత్తగా వుండాలంటే... ఇండియాఅమెరికాకు దగ్గరగా వుండటం అనివార్యం! 

బ్యాక్ టూ పెవిలియన్... కాని, కొ్త్త ఇన్నింగ్స్!

దేవినేని నెహ్రూ... ఈ పేరు బెజవాడ రాజకీయాల్లో చాలా ఫేమస్. అసలు ఆయన పేరు చెప్పుకోకుండా విజయవాడ పాలిటిక్స్ డిస్కస్ చేయటమే కుదరదు. అంతలా ఒకప్పుడు కృష్ణా తీరాన్ని ఏలారాయన. మరీ ముఖ్యంగా, వంగవీటి ఫ్యామిలీతో గొడవల కారణంగా దేవినేని పేరు మార్మోగిపోయింది ఒక దశలో. అయితే, ఇప్పుడు విజయవాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అమరావతిగా కొత్త సౌరభం సంపాదించుకుంటోంది నగరం. అదే క్రమంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నాయి. సరిగ్గా ఈ టైంలో దేవినేని టీడీపిలోకి తిరిగి రావటం ఆసక్తికర పరిణామం... దేవినేని ప్రస్థానం ఒక విధంగా టీడీపీతోనే ప్రారంభమైంది. ఎన్టీఆర్ పిలుపుతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. చాలా మంది తొలి తరం టీడీపీ నేతల్లాగే ఉధృతంగా ఎదిగారు. కాని, తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో ముందడుగు వేయలేదు. కాంగ్రెస్ వైపు సాగిపోయారు. వైఎస్ కాలంలో ఓ వెలుగు వెలిగారు. ఎప్పటిలాగే బెజవాడ పాలిటిక్స్ లో కీలకంగా కొనసాగారు. వైఎస్ మరణం తరువాత జగన్ శిబిరంలోకి వెళ్లని దేవినేని నవ్యాంధ్ర ఏర్పాటు తరువాత కూడా కాంగ్రెస్ లోనే ఇంత కాలం వున్నారు. అయితే, రోజురోజుకి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారుతుండటం... అలాగే, రాష్ట్ర రాజకీయాలు మొత్తం టీడీపీ, వైసీపీల మధ్యే ఇమిడిపోవటం దేవినేనికి పార్టీ మారక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టాయి. అయితే, ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే దేవినేని టీడీపీ జాయినింగ్ పుట్టింటికి రావటం లాంటిదే! స్వంత ఇంటికి చేరుకున్నారు దేవినేని. కాకపోతే, ఆయనతో పాటూ ఆయన కుమారుడు అవినాష్ కూడా పార్టీలోకి రావటం చెప్పుకోతగ్గ అంశం... దేవినేని వారసుడుగా ప్రస్తుతం రాజకీయాల్లో వున్న అవినాష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశాడు. అయితే, విభజన కారణంగా వీచిన ప్రతికూల గాలుల్లో ఓటమి తప్పలేదు. ఆయన చేరికతో టీడీపీకి విజయవాడలో తిరుగులేకుండా పోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పటి దాకా కాంగ్రెస్ దేవినేని కుటుంబం సాయంతోనే బెజవాడలో బండి నెట్టుకొస్తోంది. అలాంటిది ఆల్రెడీ దేవినేని ఉమా, వంశీ, నాని లాంటి నాయకులతో బలంగా వున్న టీడీపీలోకి దేవినేని కుటుంబం కూడా చేరిపోవటం సైకిల్ హవాకి తిరుగులేకుండా చేస్తుంది. మరో వైపు , కాంగ్రెస్ కహానీ ఖతమ్ అని కూడా డౌట్ లేకుండా చెప్పొచ్చు! దేవినేని చేరికతో టీడీపికి లాభమే కాదు... స్వంత పార్టీలో చేరిన ఆయన కూడా బాగానే లాభపడే అవకాశం వుంది. అమరావతి అభివృద్ధిలో బాగస్వామిని అవుతా అని చెప్పటం ద్వారా ఆయన భవిష్యత్ ని సూచించారనుకోవాలి. నవ్యాంధ్రకి రాజధాని అయిన విజయవాడలో ఖచ్చితంగా రాజకీయం బ్రహ్మాండంగా వుంటుంది మున్ముందు. అటువంటి నేపథ్యంలో దేవినేని యువనేతగా వున్న కొడుకుతో సహా టీడీపీలో చేరటం ప్రాఫిటబుల్ డీలే. దేవినేని నెహ్రు సామాజిక వర్గం మొత్తం ఎలాగూ బలంగా టీడీపీ వెంటే వుంటుంది కాబట్టి వైసీపికి వ్యతిరేకంగా ఆయన సైకిల్ ఎక్కటం ఏ విధంగా చూసినా తెలివైన నిర్ణయమే!

వెరీ వెరీ టెంప్టింగ్ ఆఫర్... టెక్స్ టైల్ సిటీ!

మొన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సభ పెట్టి మరీ ప్రత్యేక హోదాపై గొంత విప్పటంతో ఇప్పుడు అందరి చర్చా స్పెషల్ స్టేటస్ పైకి వెళ్లిపోయింది. అదొస్తే ఏంటి లాభం? చాలా రకాల ట్యాక్స్ బెనిఫిటి్స్ వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఇదీ ప్రత్యేక హోదా సారాంశం. అయితే, త్వరలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందో లేదో కాని... ఇంచుమించు అలాంటి లాభాలే వున్న ఒక పరిణామం మాత్రం చోటు చేసుకోనుంది!. రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా తన ప్రయాణం మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ మెల్లెమెల్లగా అడుగులు వేస్తుంది. అయితే, ఆర్దికాభివృద్ధి మాత్రం చంద్రబాబు సర్కార్ కి పెద్ద సవాల్ గా మారింది. భారీ ప్రాజెక్ట్ లు ఏవీ ఇప్పటి వరకూ రాలేదు. అందుకే, ఆంద్రప్రదేశ్ ప్రజలు, నేతలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాస్త గుర్రగా వున్నారు. వాళ్ల అలకని తగ్గించే భారీ ప్రాజెక్టే టెక్స్ టైల్ సిటీ! ఏపీకి టెక్స్ టైల్ సిటీ ఇవ్వాలని మోదీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతీ ఇరానీ ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. బాగా ఎక్కువగా కార్మికులు అవసరమయ్యే టెక్స్ టైల్ ఇండస్ట్రీ నవ్యాంధ్రకి రావటం మామూలు విషయం కాదు. దీని వల్ల భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంటుంది. అంతే కాదు, టెక్స్ టైల్ సిటీ అంటే ఏదో చిన్నా చితకా ఆఫర్ కాదు. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించబడి వుండే తయారీ వ్యవస్థ. ఇంత పెద్ద మొత్తంలో టెక్స్ టైల్ కంపెనీలు రాష్ట్రానికి వస్తే ఆర్దికాభివృద్ధి అమాంతం పుంజుకుంటుంది.           టెక్స్ టైల్ పరిశ్రమలు రావటమే కాదు వాటితో పాటూ ఇతర అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటిలో కూడా మళ్లీ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇలా ఎలా చూసుకున్నా టెక్స్ టైల్ సిటీ కారణంగా వేలాది ఉద్యోగాలు రావడం ఖాయమే. ఒక్క మాటలో చెప్పుకుంటే, టెక్స్ టైల్ సిటీ ఆగమనంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారిపోనుంది. ఇది నిజంగా తెలుగు వారికి శుభ పరిణామమే!

మాతృ(మృత)భాషా దినోత్సవమా?

ఆగస్ట్ 29... ఈ డేట్ స్పెషాలిటీ ఏంటి?  అది కూడా తెలియదా, కింగ్ నాగార్జున బర్త్ డే!  ఇలా వుంది తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితి! నాగార్జున జన్మదినం గుర్తుపెట్టుకోవటం తప్పు కాదు. కాని, ఇదే రోజు జన్మించిన వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి మాత్రం చాలా మందికి తెలియదు. ఇక ఆయన జయంతే మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నా సంగతైతే మరింత తక్కువ మందికి తెలుసు!. ఆగస్ట్ 29ని ప్రతీ యేటా మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రభుత్వాలు చేపట్టే అధికారిక కార్యక్రమాలేంటో మనకు తెలియదుగాని వ్యక్తిగతంగా మాత్రం మనం చేసే పనులంటూ ఏం వుండవు. మహా అయితే కొందరు ఫేస్బుక్ పోస్టులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మిగతా వారైతే అది కూడా చేయరు. ఇదీ మన తెలుగు ప్రేమ! తెలుగు గురించి ఇలా ఏదైనా మాట్లాడినప్పుడు, తెలుగు భాష నిరాదరణకి గురవుతోంది అన్నప్పుడు... కొంత మంది వింత వాదన చేస్తుంటారు. అసలు తెలుగు భాషని బతికించుకుని సాదించేదేమిటి అంటారు దుర్మార్గంగా! ఇంగ్లీష్ చదువులు చదివి, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ మనది కాని సంస్కృతి పట్ల వ్యామోహం చెందితే అలాగే వుంటుంది. పులిని చూసిన నక్క వాతలు పెట్టుకోవటం అంటారు. అలా ఇంగ్లీషు మనం ఎంతగా బతకటానికి నేర్చుకున్నా... అదే వుంది కదా అని... మనం బతకనేర్చిన తనం తెలుగు పట్ల ప్రదర్శించకూడదు. తెలుగు ఒక్కటి కాపాడుకుంటే మనం అందులో అంతర్భాగమైన అనేక సాంస్కృతమైన అంశాల్నీ రక్షించుకున్న వారం అవుతాం. కూచి పూడి నుంచి ఆవకాయ పచ్చడి దాకా ఏదైనా తెలుగు భాష నేర్చుకున్న వాడికి మరింత గొప్పగా రుచిస్తుంది. తెలుగు నేర్చుకుంటే, తెలుగు పద్యం ఆస్వాదించటం నేర్చుకుంటే ప్రపంచంలోని అత్యుత్తమమైన సాహిత్యానికి వారసులం అవుతాం. అలా కాక కొద్దిపాటి నెలసరి ఆదాయం తెచ్చి పెట్టే విదేశీ భాషల్నే నెత్తిన పెట్టుకుని మాతృభాషని విస్మరిస్తే ఎంతో కోల్పోతాం. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగును కాపాడుకోవటానికి కొన్ని నిర్ణయాలు చేసుకుంటే చాలు. బలవంతంగా ఇంగ్లీషు పదాలకి తెలుగులో పేర్లు పెట్టి పలకటం అవసరం లేదు. అంత భాషా వీరాభిమానం అక్కర్లేదు. కాని, చిన్న పిల్లలకి మమ్మీ, డాడీ బదులు అమ్మ, నాన్నా అనటం అలవాటు చేయటం మొదలుపెడితే మేలు! ఇంగ్లీష్ రైమ్స్ తో పాటూ తెలుగు పద్యాలు కంఠస్తం చేయిస్తుంటే చాలు! పెద్దలు కూడా వీలున్నప్పుడల్లా , వీలున్నంత మేర తెలుగులో మాట్లాడుకుంటే , అదే పది వేలు. ఎందుకంటే, ఇద్దరు తమిళులు తమిళంలో, ఇద్దరు మరాఠీలు మరాఠీ భాషలో మాట్లాడుకుంటూ వుంటే... తెలుగు వారు మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకునే దుస్థితి వుంది! ఈ మధ్యే తెలుగుకు ప్రాచీన భాష హోదా కూడా దక్కిన సందర్భంగా మనం మాతృభాషా దినోత్సవం నాడు ఈ ఒక్క సత్యం అర్థం చేసుకుంటే చాలు.... '' తెలుగును కాపాడుకోవటం అంటే ఉపన్యాసాలు, వ్యాసాలు కాదు! ఇంగ్లీషు మోజు తగ్గించుకుని తెలుగు మాట్లాడటం, మాట్లాడే వారిని చులకనగా చూడకపోవటం!'' ఇది తెలిస్తే తెలుగుకొచ్చిన డోకా ఏం లేదు! తెలియనంత కాలం ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా కలిగే లాభమూ లేదు!   

ఉండవల్లి (టీ కప్పులో) తుఫాన్ రేపుతాడా?

సాధారణ రాజకీయ నాయకులకి తాము భిన్నం... అన్నట్టు వ్యవహరిస్తూ వుంటారు కొందరు పొలిటీషన్స్! ఏదో అల్లాటప్పా విమర్శలు కాకుండా గట్టి ఆరోపణలతో సంచలనాలు సృష్టిస్తుంటారు! కొన్ని రోజుల పాటూ సదరు మేధావులు మీడియాకి కావాల్సినంత 'ఫుడ్' పెడుతుంటారు!. తరువాత ఏమవుతుంది?  ఏముంది.... అంతా నార్మాల్!  ఇంటలెక్చువల్ పొలిటీషన్ గారు ఇంటికి వెళ్లిపోతారు. మీడియా మరో అంశం వెదుక్కుని తన పని తాను చేసుకుపోతుంది. జనం కూడా లీడర్ గార్ని మర్చిపోతారు! ఇంత ఇంట్రో ఇప్పుడు ఎవరి కోసం అవసరమైందో తెలుసా? మన ఉండవల్లి గారి గురించే! వైఎస్ సీఎం అయ్యాక ఆయన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడంలో అరుణ్ కుమార్ వారే మార్గదర్శి! ఏకంగా రామోజీ రావునే టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టాడు. కాని, చివరాఖరుకు రామోజీ తన సత్తా, తెలివితేటలు గట్టిగా చూపించి బయటపడ్డాడు! ఆయన స్థానంలో మరెవరైనా వుంటే అంతే సంగతులు అన్నట్టే వుండేది గ్రహచారం... వైఎస్ బతికుండగా ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి ఆ తరువాత మేధావులందరిలాగే సైలెంట్ అయ్యాడు. జగన్ వైపు వెళ్లిపోయి ఆవేశపడలేదు. అయితే, కాంగ్రెస్ లో వుంటూనే తెలంగాణ ఏర్పాటు సమయంలో నానా రచ్చా చేశాడు. ఓ సారి జై అంధ్రా అని, మరోసారి జై సమైక్యాంధ్ర అని గందరగోళం రేపాడు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రెండు ప్రాంతాల్లో ఉండవల్లిని అయోమయంగా చూడటం మొదలుపెట్టారు జనం! రాష్ట్ర విభజన సమయంలో రాజమండ్రిలో సభ పెట్టి హడావిడి చేసిన అరుణ్ కుమార్ తరువాత అందరు కాంగ్రెస్ నేతల్లాగే ఎన్నికల్లో ఓడాడు. మరోసారి తనదైన స్టైల్లో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు , ఇంత కాలానికి ఆయన కొత్త రాష్ట్రంలో మరోసారి విమర్శలు మొదలుపెట్టాడు! ఈ సారి టార్గెట్ యథాప్రకారం చంద్రబాబు అండ్ టీడీపీయే! ఉండవల్లి కాంగ్రెస్ విడిచి వైఎస్ఆర్సీపి లోకి వస్తాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన తన కొత్త పార్టీ, కొత్త రోల్ రక్తి కట్టేలా ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది! ఆంధ్రుల కోసం కడుతోంది ఆమరావతి కాదు భ్రమరావతి అంటూ పంచ్ డైలాగ్ తో ఆరోపణలు గుప్పించేందుకు సిద్ధమయ్యాడు! రాజధాని నిర్మాణంలో గోల్ మాల్ జరుగుతోందని అందరూ చేసినట్టే విమర్శ చేయకుండా కాస్తా వెరైటీగా హడావిడి చేయటానికి పూనుకుంటున్నాడు. ఎలాగూ ఉండవల్లి లాంటి మేధావి కాబట్టి మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్లకు బాగానే ప్రచారం కల్పిస్తుంది! ఇక తుఫానే అన్నమాట!  ఉండవల్లి ఆరోపణలు చేసిన ప్రతీసారి తుఫాన్ రేగుతుంది. కాని, అది అంతలోనే టీ కప్పులో తుఫానుగా మిగిలిపోతుంది! ఈ సారి భ్రమరావతి తుఫాన్ ఎంత కాలం చెలరేగుతుందో చూడాలి...

సింధు మేనియాలో ... ఇప్పుడిక కార్పోరేట్లు!

సింధు... ఇప్పుడు ఈమెకున్న ఫ్యాన్స్ అంతా ఇంతా మంది కాదు! ఏకంగా ఒలంపిక్స్ లోనే మెరిసిపోయి భారతదేశానికి తొలి సిల్వర్ తీసుకొచ్చింది! మరి ఏ రేంజ్లో ఫాలోయింగ్ వుంటుంది? మనం ఈజీగా ఊహించవచ్చు! అంతే కాదు, రజినీకాంత్ నేను నీకు ఫ్యాన్ అని అంటే ... సచిన్ స్వయంగా హైద్రాబాద్ వచ్చి బీఎండబ్ల్యూ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు! ఇంకేం కావాలి? అఫ్ కోర్స్, ఇదంతా సక్సెస్ వల్ల వచ్చిన క్రేజ్! కాని, అసలు విషయం మొదలయ్యేది ఇప్పుడే! అంటే ప్యూర్ ఎకనమిక్స్ అన్నమాట! సింధు లాంటి ప్లేయర్స్ నిజంగా ఆట మీద ప్రేమతోనే ఆడతారు. ఛాంపియన్స్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని, వాళ్లు ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాక ఇక కాసుల వర్షం కురిపిపోతుంది! అప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు! స్వయంగా సదరు ఛాంపియనే నాకు డబ్బులొద్దన్నా తళతళాడే చెక్కులు వచ్చేస్తుంటాయి! ఇప్పుడు మన విజయలక్ష్మీ సింధు... ధనలక్ష్మీ కూడా అవ్వబోతోంది! ఆమె బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. కారణం తెలిసింది కదా... ఒలంపిక్స్ లో ఒకే ఒక్క బంపర్ విజయం! అంతే మార్కెట్ మొత్తం తల కిందులైపోయింది! కొన్నాళ్ల కిందటి దాకా సింధు బ్రాండ్ వాల్యూ 20లక్షలు. ఇప్పుడు ఎంతో తెలుసా? అంచనా వేయండి చూద్దాం...  సింధు ప్రస్తుత బ్రాండ్ వాల్యూ 2 కోట్లకు పైమాటే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏం లేదంటున్నారు వారు! ఆమె సక్సెస్ యావత్ దేశానికే గర్వకారణం అయినప్పుడు తనకి కోట్లు గుమ్మరించి తమ ప్రాడక్ట్స్ జనంలోకి తీసుకుపోవాలని సహజంగానే కార్పోరేట్స్ తహతహలాడతారు! అయితే, ఒలంపిక్ మెడల్ విన్నింగ్ బ్యాడ్మింటన్ క్వీన్ సింధు మాత్రం పెద్దగా తొందరపడటం లేదట. ఆచితూచి తాను ఎండార్స్ చేయనున్న బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకుంటుందట! అదీ మంచిదే... ఆమె గురువు పుల్లెల గోపిచంద్ ఒకప్పుడు కోకో కోలా బ్రాండ్ ఎండార్స్ చేయమంటే చేయలేదని ఒక కథనం ప్రచారంలో వుంది! అందులో నిజానిజాలు ఎలా వున్నా... సిందు కూడా అందరికీ మంచి చేసే విశ్వసనీయ వస్తువుల్నే ప్రచారం చేస్తే చాలా బావుంటుంది! 

'పెద్దలు జానారెడ్డి' వారికి ఇది తగునా?

కొందరు మేధావులు అమాయకుల్లా కనిపిస్తారు! కొందరు అమాయకులు మేదావుల్లా అనిపిస్తారు! ఈ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చూడగానే ఎవరికైనా గుర్తుకు వస్తుంది! ఇంతకీ, జానా రెడ్డి మేధావా? అమాయకుడా? ఆ వివాదాస్పద సమాధానం ఇపపుడెందుకుగాని... మనం విషయంలోకి వెళదాం...  జానా రెడ్డి ప్రస్తుతం సీఎల్పీ నేత. అసెంబ్లీలో కాంగ్రెస్ కి ఆయనే పెద్ద దిక్కు. ఆయన సుదీర్ఘ కెరీర్లో పోషించని పాత్ర లేదు. చేపట్టని పదవీ లేదు. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా '' పెద్దలు జానారెడ్డి '' అంటూ వినయంగా సంబోధిస్తారు! నిజంగా కూడా ఆయన స్టేచర్ అలాంటిది! అయితే, అప్పుడప్పుడు మన పెద్దలు జానారెడ్డిగారు ఇచ్చే స్టేట్మెంట్సే టీ కాంగ్రెస్ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తున్నాయి...మహారాష్ట్రతో చారిత్రక జల ఒప్పందాల విషయంలో ఇటు టీఆర్ఎస్ కు, అటు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలే నడిచాయి. అయితే, ఈ స్టేట్మెంట్ల పరంపరలో జానా రెడ్డి హఠాత్తుగా బాంబు పేల్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ హయాంలో ఒప్పందం జరగలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమే చోటు చేసుకున్నాయని అన్నారు! స్వయంగా జానా రెడ్డే ఇలా చెప్పటంతో టీ కాంగ్రెస్ టీఆర్ ఎస్ ముందు నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది! అయితే, జానా రెడ్డి చెప్పింది మాత్రం నిజమే కావటం ఇక్కడ గమనార్హం! సరే... మహారాష్ట్రతో ఒప్పందాల విషయంలో ఉత్తమ్ కుమార్ తొందరపడ్డారని భావించినా జానా మరో విషయంలోనూ టీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు! నయీమ్ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ గులాబి దళాన్ని ఎలాగో కార్నర్ చేయాలని చూస్తోన్న కాంగ్రెస్ కు జానాయే షాకిచ్చారు! నయీమ్ ఎన్ కౌంటర్ సూపర్ అని అధికార పక్షానికి జానా కితాబునిచ్చారు! అటు పింక్ పార్టీ మాత్రం హస్తం పార్టీయే నయీమ్ ను పెంచిపోషించిందని ఆరోపిస్తోంది! అయినా కూడా జానా ఆ పార్టీకే క్రెడిట్ ఇవ్వటం నిజంగా పెద్ద షాకే! జానా తన స్వంత పార్టీకి ఇచ్చిన మరో షాక్ కూడా వుంది! కృష్ణ పుష్కరాల విషయంలో అక్రమాలు జరిగాయని, అవినీతని, మరోటని, ఇంకోటని...  టీ కాంగ్రెస్ కొంచెం గొంతు సవరించుకునే సరికే జానా వారు మైండ్స్ బ్లాంక్ చేసేశారు! పుష్కర స్నానం చేసి.. ఏ మాత్రం అబద్ధం ఆడకుండా ఏర్పాట్లు భేష్ అంటూ మెచ్చుకున్నారు! నిజంగా అధికార పక్షం మంచి చేస్తే జానా లాంటి సీనియర్ మెచ్చుకోవటంలో తప్పు లేదు. కాని, తనకి ఎన్నో పదవులు ఇచ్చి ఇంత దాకా తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చేలా వ్యాఖ్యలు చేయటం... ఏమో ''పెద్దలు జానారెడ్డి''గారే ఉచితానుచితాలు ఆలోచించుకోవాలి!

అ అభాగ్యుడి భార్య కాదు... మానవత్వం మరణించింది!

ఒక కాకి చచ్చిపడిపోతే... మిగతా కాకులన్నీ చుట్టూ చేరతాయి. ఇతర ఏ జంతువు మరణించినా దాని జాతి జంతువులన్నీ చుట్టూ మూగుతాయి. కాని, మనిషి మాత్రమే... సాటి మనిషి ఛస్తే ... అదేదో తనకు, తన వారికీ ఎప్పటికీ రాని దుష్ఫలితం అన్నట్టు దూరంగా వెళ్లిపోతాడు! కాని, విచిత్రం ఏంటంటే... ప్రతీ క్షణం తాను శాశ్వతంగా ఇక్కడే వుండిపోతానన్నట్టు స్వార్థంగా బతికే మనిషి.. తన టైం రాగానే వెళ్లిపోతాడు! కాలం నిర్ధాక్షిణ్యంగా కాటేసి తీసుకుపోతుంది!  మధ్య ప్రదేశ్ లోని ఒకానొక అభాగ్యుడు రామ్ సింగ్. చాతర్ పూర్ జిల్లాల్లో వుంటాడు. దామో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్యని తీసుకుని బస్సులో బయలుదేరాడు. వెంట 5ఏళ్ల కూతురు కూడా వుంది. కాని, అంతలోనే మృత్యువు రామ్ సింగ్ భార్యని తన వెంట తీసుకెళ్లిపోయింది. ఆమె ప్రాణం బస్సుకంటే వేగంగా ఆనంత గాలుల్లో కలిసిపోయింది! అలా రామ్ సింగ్ భార్య మల్లీ భాయి ఆనారోగ్యంతో చనిపోయాక బస్సు అమాంతం ఆగిపోయింది. ఆ క్షణంలో మల్లీ భాయితో పాటూ మానవత్వమూ చచ్చిపోయింది. బస్సు కండక్టర్ మిగతా ప్రయాణికుల ఒత్తిడి మేరకు రామ్ సింగ్ ని, అతడి 5ఏళ్ల కూతుర్ని దారి మధ్యలో జోరు వర్షంలో బస్సు నుంచి దింపేశాడు! అది అడవి కూడా..  అడవి పాలైన ఆ నిర్భాగ్యుడు, రామ్ సింగ్, భార్య శవంతో అక్కడే వుండిపోయాడు. ఇంతలో బస్సు రూపంలో వెళ్లిపోయిన మానవత్వం మళ్లీ ఓ కార్ రూపంలో వచ్చింది. అందులో వున్న ఇద్దరు లాయర్లు రామ్ సింగ్ తన అయిదేళ్ల పాపకు ఏదో తినిపించటానికి ప్రయత్నం చేస్తుండటం చూసి విషయం తెలుసుకుని పోలీసులకి ఫోన్ చేశారు. వాళ్లొచ్చి జరిగిందంతా రాసుకుని తాపీగా వెళ్లిపోయారు. సాయం మాత్రం చేయలేదు. అప్పుడు ఆ లాయర్లే ప్రైవేట్ అంబులెన్స్ కి ఫోన్ చేసి రామ్ సింగ్ భార్య మల్లీ భాయి శవం ఇంటికి చేరేలా ఏర్పాటు చేసి ముందుకు వెళ్లిపోయారు!  కొన్ని రోజుల క్రితమే రెండో కూతురికి జన్మనిచ్చిన తన భార్యతో కలిసి వెళ్లిన రామ్ సింగ్... లాయర్ల దయతో పెద్ద కూతురు, భార్య శవంతో సహా ఇంటికి చేరాడు! పాపం ఆ అభాగ్యుడికి పోయింది భార్యే కాదు... సాటి మనుషుల మీద నమ్మకం కూడా అనుకుంటా!  ఈ మధ్యే... ఇలాంటి దారుణమే ఒడిశాలోనూ జరిగింది. అక్కడా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది రాక్షసత్వానికి ఓ అభాగ్యుడు భార్య శవంతో పది కిలో మీటర్లు నడిచాడు. తరువాత అంబులెన్స్ దొరికి ఇంటికి చేరాడు! డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రాణాలు కాపాడే ప్రభుత్వాసుపత్రులు కాదు... కనీసం శవాల్ని ఇంటికి చేర్చే అంబులెన్స్ లు కూడా లేవు! దేశపు అత్యంత పేదలకి ఇంతకంటే అమానుషమైన స్వేచ్ఛ మరొకటి వుండదు!

దిగంబరంగా వచ్చి... దడదడలాడించిన స్వామీజీ!

అసెంబ్లీలో ఏం చేయొచ్చు? చర్చలు చేయొచ్చు! చట్టాలు చేయొచ్చు! చాణక్యం చేయొచ్చు! ఇంతే కాని ఇంకేం చేయొచ్చు అనకండి! ఎందుకంటే, అసెంబ్లీల్లో ఏమేం చేయొచ్చొ ఈ మధ్య చాలా మందే చేసి చూపించారు! కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, బూతు తిట్టుకోవచ్చు, దారుణంగా సైగలు చేసుకోవచ్చు! ఇలా ఏదైనా చేయొచ్చు! చివరకు, సెల్ ఫోన్లలో బ్లూ ఫిల్మ్ లు కూడా చూడొచ్చు! ఇక పార్లమెంట్లో అయితే పెప్పర్ స్ప్రేలు కొట్టుకునే దాకా వెళ్లింది ప్రజాస్వామ్యం! ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్లో ఏం చేయొచ్చు అనే చర్చ ఎందుకంటే... హర్యాణా అసెంబ్లీలో ఒక జైన సన్యాసి ప్రసంగించారు! అది మహా పాపమైపోయిందట కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీకి! ఆప్ నేతలతో కలిసి మరి కొంత పాప్ లు కూడా రంగంలోకి దిగారు! పాపులంటే కేవలం హిందు మతాన్నే టార్గెట్ చేసే ఇండియాలోని సెక్యులర్ ఛాందసవాదులు!  ఒక సన్యాసి అసెంబ్లీలోకి వచ్చి ప్రసంగించటం మన లౌకిక దేశంలో తప్పే! కాని, ఏ ఇతర మతానికో చెందిన మరో మత గురువు వస్తే పెద్దగా గొడవుండదు. బీజేపి పాలిత రాష్ట్రంలో హిందు లేదా బౌద్ధ లేదా జైన గురువు అసెంబ్లీలోకి వస్తే మాత్రం ఇక అంతే సంగతులు! ఇప్పుడు అదే జరుగుతోంది జైన గురువు తరూణ్ సాగర్ విషయంలో! ఆయన గురించి మన అభ్యుదయవాదులు రెచ్చిపోవటానికి కారణం ఆయన జైన గురువు కావటమే కాదు దిగంబర సన్యాసి కూడా!  ఒక బట్టల్లేని జైన సన్యాసిని అసెంబ్లీలోకి బీజేపి ప్రభుత్వం పిలిచింది అంటూ ఆప్ పార్టీ వాళ్లు నానా యాగీ చేస్తున్నారు! దాంట్లో వాళ్లకు ఏం సెక్యులర్ లాజిక్ కనిపించిందో కాని బుద్ది వున్న ప్రతీ వాళ్లు ఈసడించుకుంటున్నారు! జైన మతంలో దిగంబర సంప్రదాయం అనాదిగా వుంది. దాన్ని పాటించే సన్యాసిని అసెంబ్లీలోకి పిలిస్తే అది ఎలా అపవిత్రం అవుతుంది? కేజ్రీవాల్ గారి గ్యాంగ్ కే తెలియాలి! బట్టలు వేసుకోకున్నా జైన సాధువు తరూణ్ సాగర్ అన్నీ మంచి మాటలే చెప్పారు. ఆడపిల్లల్ని బతికించుకోమన్నారు. సాక్షి, సింధు లాంటి ఛాంపియన్స్ ని మెచ్చుకున్నారు. పాకిస్తాన్ ని తప్పుపట్టారు. రాజకీయ నేతలకి చురకలు వేశారు. రాజకీయాన్ని ధర్మం శాసించాలని నీతి చెప్పారు. ఇవేవీ పట్టని కొందరు రాజకీయ నేతలు, సో కాల్డ్ మేధావులు మాత్రం తరూణ్  సాగర్ దిగంబరంగా అసెంబ్లీలోకి ఎందుకు వచ్చారన్న పాయింట్ దగ్గరే ఆగిపోయారు! పైగా దాన్ని వాళ్లు సెక్యులర్ ముసుగులో గొప్ప పనిగా బావిస్తున్నారు!

ఇక పోరాటమే..పవన్‌ స్పీచ్ హైలెట్స్

* నేను టీడీపీ తొత్తును కాను * తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన *టీడీపీ, బీజేపీకి భుజం కాశాను * నన్ను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు. * జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ జనసేన * భజనసేన అన్నారు..గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అన్నారు *నాకు కులం మతం అంటించకండి * సీమాంధ్రుల ప్రేమ, సీమాంధ్రుల సహనం చూశారు * సీమాంధ్రుల పోరాటం ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారు * దేశానికి వెన్నెముక యువత అంటున్నారు * కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినపుడు యువతకు ఏం చేయాలో చెప్పలేదు * తెలుగు ప్రజలు కొట్టుకు చావండి * కాంగ్రెస్‌ది ఎంత తప్పో..బీజేపీది అంతే తప్పు * బీజేపీ రాష్ట్ర విభజన అంశాన్ని కాకినాడలో తీర్మానం చేసింది * ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పార్లమెంట్‌లో ఏం సాధించారు * అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడమ్..మేడమ్.. ప్లీజ్ మేడమ్ అన్నారు * ప్రత్యేక హోదా అంశాన్ని జనసేన ముందుకు తీసుకువెళుతుంది * మూడు దశలుగా ప్రత్యేక హోదా పోరాటం * ఇప్పుడు ప్రశ్నిస్తా.. * మాటలను ఆచీతూచి మాట్లాడాలి * రాష్ట్రాన్ని ఎక్కడైతే బీజేపీ విడగొట్టాలని చూసిందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతా * సీమాంధ్రులంటే అంత చులకనా * కులం అంటే అరికాలి మంట నషాళానికి అంటుతుంది * మనకు జరిగిన అన్యాయంపై జిల్లా, జిల్లా తిరిగి చెబుతా * రెండవ దశలో అధికార, ప్రతిపక్ష, బీజేపీ ఎంపీల మీద ఒత్తిడి తెస్తా * మూడవ దశలో ఇక పోరాటమే * జనసేన, బీజేపీ కలిసి పోటీచేయవు * మోడీ గారు మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటున్నారు కానీ ప్రత్యేకహోదా అనడం లేదు * తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్‌ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదు * అరుణ్‌జైట్లీ మాట్లాడితే విసుగొస్తుంది * వెంకయ్యనాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు * వెంకయ్యనాయుడు గారు ముందు మీరు తెలుగువారు * పార్టీ కంటే ముందు తెలుగుజాతి గురించి ఆలోచించండి * ప్రజలకు న్యాయం జరగనపుడు నేను ఏ పార్టీలో ఉంటే ఏంటీ * నా దగ్గర 15 ఆవులున్నాయి * బీజేపీ ఆవులపై పడి మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదు * చంద్రబాబు, జగన్ ఒకే మాటపై ఉండాలి * తెలంగాణ ఇచ్చినపుడు ఆరు కోట్ల మంది అడ్డుపడినా విడగొట్టారు * ప్రత్యేకహోదాకు ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుపడితే ఇవ్వరా.. * కేంద్రప్రభుత్వం అంటే రాక్షసులు కాదు..మనుషులే కదా * పార్లమెంట్‌ను స్తంభింపజేయండి * సినిమాలు చేస్తా..రాజకీయాలు చేస్తా * సామాజిక మార్పులు జరిగితే అంతేచాలు * సెప్టెంబర్ 9న కాకినాడలో తొలిసభ * సీమాంధ్ర ఎంపీలు డబ్బున్న వాళ్లు * డబ్బున్న ఎంపీలను చూసి ప్రత్యేకహోదా ఇవ్వనక్కర్లేదు అనుకుంటున్నారా..? * పోరాడదాం..సాధించే వరకు పోరాడదాం * మన ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడదాం * మీరే నా బలం * మీ బలం చూసి కేంద్రంతో కొట్లాటకు దిగుతున్నా

పవర్ స్టార్ పవరేంటో తేల్చేసిన... తిరుపతి సభ!

పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అంటారు! అబచ్ఛా... మాకు తెలియదేంటి అంటారా? అఫ్ కోర్స్ అందరికీ తెలుసు! కాని, పవర్ స్టార్ పవర్ ఏంటో ఇవాళ తిరుపతిలో జరగబోయే సభ నిరూపించేసింది! ఎలాగంటారా?  1. వేలాది మంది పాల్గొనే ఒక బహిరంగ సభకి పోలీసులు పర్మీషన్ అంత సామాన్యంగా ఇవ్వరు. కాని, పవర్ స్టార్ తడాఖా తెలుసు కాబట్టి గంటల వ్యవధిలో ఇచ్చేశారు! అయితే, పొంగిన పాల లాగా వచ్చేసే అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అంత మంది పోలీసులు హఠాత్తుగా తిరుపతిలో ఎలా ఊడిపడతారు?  2. తిరుపతిలో పవన్ మీటింగ్ పెట్టిన ప్లేసు... ఇందిరా మైదానం. ఆ గ్రౌండ్ కెపాసిటీ ఎంతా? అంత మంది జనాన్ని అమాంతం అక్కడికి తీసుకొచ్చి నింపడానికి పూనుకున్నదెవరు? అసలు ఎవరైనా సిద్ధపడ్డా జనాన్ని తరలించటానికి ఏర్పాట్లు ఎలా సాధ్యమయ్యాయి? 3. గ్రౌండ్ అంటే వుంటుంది, జనం అంటే జన సేనాని కోసం ఎగబడి వస్తారు. కాని, వందల సంఖ్యలో జెండాలు, వేలాది పోస్టర్లు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు... ఇవన్నీ కూడా గంటల వ్యవధిలో ఎలా రెడీ అయిపోయాయి?    4. ఏర్పాట్లు కాదు... ఏర్పాట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ 'శ్రేయోభిలాషులు' ఎవరసలు? వాళ్లు ఇంత కాలం ఏం చేసినట్టు? పవన్ మీటింగ్ అనగానే ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎలా వాలిపోయార ు? 5. కొండ మీద పంచె కట్టుకుని కూర్చున్న పవన్ కళ్యాణ్ రోజుకోసారి వెంకన్నని దర్శించుకుని గెస్ట్ హోజ్ లోకి వెళ్లిపోతున్నాడు! మరి ఆయన తరుఫున ఇంత పెద్ద సభకి ఏర్పాట్లు చూసుకుంటున్న మొనగాళ్లంతా ఎవరు? వాళ్లు పవర్ స్టార్ ఒక్క మాటతో ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చుపెడుతున్నారు? ఏ లాభం లేనిదే రాజకీయాల్లో ఎవ్వరూ పైసా బయటకి తీయరు. మరి ఈ జనసేన మహారాజపోషకులు పవన్ నుంచి ఆశిస్తున్నదేమిటి?  ఈ కొశన్స్ అన్నీ ఎవరో ఒక్కరివి కావు! దాదాపూ ప్రతీ మధ్య తరగతి వాడి మనస్సులో వున్నవే! మామూలు వాడు ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేసినా చిన్న ఇల్లు కట్టలేడు. ఎన్ని నెలలు కుస్తీ పట్టినా ఒక పెళ్లి సజావుగా చేయలేడు. కాని, పవర్ స్టార్ జస్ట్ ఒక్క నిర్ణయంతో కొన్ని గంటల వ్యవధిలో చరిత్రలో నిలిచిపోయే సభకు సిద్ధమయ్యాడు! అందుకే, హీ ఈజ్ ట్రూలీ.... పవర్ స్టార్!

పవన్ మాట్లాడబోయే 5 అంశాలు ఇవేనా?

పవన్ కళ్యాణ్ సభ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అంతటా తిరుపతి సభే మార్మోగిపోతోంది. అసలింతకీ ఇంత హడావిడిగా పెట్టిన ఈ సంచలన సభ దేని కోసం? పవన్ ఏం మాట్లాడబోతున్నాడు? ఆ విషయం సభ పూర్తయ్యే వరకూ ఎలాగూ తెలియదుగాని... పవర్ స్టార్ ఈ సభలో మాట్లాడబోయే అయిదు ముఖ్యమైన విషయాలు మాత్రం ఇవే అంటున్నారు వి్శ్లేషకులు...  1. అభిమాని హత్య.... మరో టాలీవుడ్ హీరో వీరాభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరణించాడు. అతడి కుటుంబాన్నిపరామర్శించటానికి వెళ్లిన పవన్ ఆశ్చర్యకరంగా ఈ సభకు తెర తీశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సభలో ఖచ్చితంగా చనిపోయిన వినోద్ రాయల్ గురించి, హద్దులు మీరిన అభిమానం గురించి కామెంట్ చేసే అవకాశం వుంది! 2. ప్రత్యేక హోదా... జనసేనని ఇక మీదట రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని పవన్ భావిస్తున్నారా? అంతేనంటున్నారు ఆయనకు దగ్గరి వారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రధానమైన ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడే అవకాశం మెండుగా ఉంది. ఇటు బీజేపికి, అటు టీడీపికి ఆయన స్పష్టంగా సూచన చేసే ఛాన్స్ వుంది. ప్రత్యేక హోదాపై తన స్టాండ్ ఏంటో జనానికి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది. 3. జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల ప్రకటన... జనసేన పార్టీ పెట్టింది 2014 ఎన్నికల ముందే అయినా ఇప్పటి వరకూ ఎలాంటి సంస్థాగత నిర్మాణం చేపట్టలేదు. తిరుపతి సభలో జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల పేర్లు ప్రకటించే అవకాశం కూడా వుందంటున్నారు. అయితే, ఇది కొంత అనుమానాస్పదమే. సభ అయితే హడావిడిగా పెట్టారుగాని... నేతల పేర్లు కూడా ప్రకటిం చేస్తారా అన్నది డౌట్!  4. విజయవాడ సభ.... ఎవ్వరూ ఊహించని విధంగా తిరుపతి సభ ఏర్పాటు చేసిన పవన్ నెక్ట్స్ టార్గెట్ విజయవాడగా పెట్టుకున్నాడని టాక్. అక్కడ కూడా రాజధాని అమరావతిలో సభ జరపాలని భావిస్తున్నాడట. అదే నిజమైతే ఈ విషయం కూడా తిరుపతి వేదిక నుంచి ప్రకటించే అవకాశం వుంది! 5. కాపు రిజర్వేషన్... కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ వంటి నాయకులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకూ రిజర్వేషన్ ఉద్యమంపై స్పష్టంగా స్పందించలేదు. తిరుపతి సభలో ఆ సమస్య గురించి మాట్లాడే అవకాశం వుంది. కాని, అలాంటి సూచనలు మాత్రం చాలా తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.... 

గాలికిపోయే కంప... ఎన్టీఆర్ నెత్తిన పడిందా?

తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అనే పవన్ అభిమాని హత్యకి గురయ్యాడు. అతడ్ని చంపింది ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నారు చాలా మంది. ఇందులో ఖచ్చితమైన ఆధారాల వంటివేం లేవు. పోలీసులు సదరు మర్డర్ చేసిన వాడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తేనే నిజాలు బయటపడతాయి. అదీగాక అతడు ఎన్టీఆర్ ఫ్యానే అయినా ఆవేశంలో ఆ వీరాభిమాని చేసిన అఘాయిత్యానికి ఎన్టీఆర్ బాధ్యత ఏముంటుంది? ఏమీ వుండదు... జరిగిన విషాదంలో తన ప్రమేయం ఏమీ లేకున్నా, జూనియర్, సరిగ్గా జనతా గ్యారేజ్ టైంలో ఈ గొడవ వల్ల డిస్టబ్ అవుతున్నాడని టాక్. తన ఫ్యాన్ చనిపోయాడని తెలిసిన వెంటనే పవన్ తిరుపతి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించాడు. అలాగే ఆర్దికంగా సాయం చేశాడని కూడా అంటున్నారు. అక్కడితో ఆగకుండా సభ పెట్టటానికి కూడా సిద్ధం అయ్యాడు. మొత్తంగా పవర్ స్టార్ తన డై హార్డ్ ఫ్యాన్ డెత్ ని పెద్ద హెడ్ లైన్ గా మర్చేశాడు. ఒకవైపు పవన్ చకచకా దూసుకుపోతుంటే ఎన్టీఆర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో వున్నాడని ఆయన దగ్గర వారంటున్నారు. నిజంగా హత్య చేసింది ఎన్టీఆర్ ఫ్యానేనా కాదా అన్న క్లారిటీ కూడా లేకుండా తారక్ ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు వాల్డ్ వైడ్ గా జనతా గ్యారేజ్ మరి కొద్ది రోజుల్లోనే భారీ స్థాయిలో విడుదలవుతుండగా ఈ గొడవపై స్పందించటం అనవసరం అని కూడా కొందరు ఎన్టీఆర్ కి సలహా ఇస్తున్నారట... మహేష్ కి శ్రీమంతుడు, ప్రభాస్ కి మిర్చీ లాంటి హిట్స్ ఇచ్చి మంచి ఊపు మీదున్న కొరటాల శివ జూనియర్ కి కూడా అదే రేంజ్ హిట్ జనతా గ్యారేజ్ తో ఇస్తాడని అందరి అంచన. ఇటువంటి సమయంలో ఈ అభిమానుల గొడవ రచ్చంతా జరగటం నిజంగా బాధాకరమే. అటు పాపం ఎన్టీఆర్ కి తన ప్రమేయం ఏమీ లేకుండానే వచ్చిపడ్డ అనవసర తలనొప్పి....

పూర్తి బాధ్యత పవన్ దే అంటోన్న పోలీసులు!

మనమందరం కారు దిగినట్టే సినిమా హీరోలు కూడా కారు దిగుతారు! కాని, వారికుండే ఇమేజ్, గ్లామర్ వల్ల వేలాది జనం గుమిగూడిపోతారు! అంతే కాదు, మనం చేస్తే సిగ్నేచర్ అంటారు. హీరోలు చేస్తే ఆటోగ్రాఫ్ అంటారు! ఇదంతా వాళ్లకున్న పాలోయింగ్ వల్ల జరుగుతుంటుంది. పవన్ తిరుపతి బహిరంగ సభకు ఈ సినిమా గ్లామరే వరంగానూ, శాపంగానూ మారింది! అదెలా అంటారా?  పవన్ కళ్యాణ్ కేవలం మూడు రోజుల వ్యవధిలో బహిరంగ సభ నిర్ణయం తీసుకున్నాడు. అయినా జనం వస్తారా లేదా అన్న డౌట్ లేదు ఎవ్వరికీ! అందుక్కారణం... పవన్ కున్న విపరీతమైన అభిమానం. కాని, అదే అభిమానుల వీరాభిమానం టెన్షన్ కూడా తెచ్చిపెడుతోంది. సభ జరిగే సమయంలో, అంతకు ముందు , తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవటం చాలా పెద్ద సమస్యే! అసలు ఇప్పటికే ఒక అభిమాని చనిపోయాడని ఏర్పాటు చేస్తోన్న సభలో ఏదైనా అపశృతి జరిగితే మరి కొందరి ప్రాణాలు అపాయంలో పడతాయి. అదే అన్నారట పోలీసులు కూడా...  పవన్ సభకు పోలీసుల నుంచి అనుమతైతే వచ్చింది కాని అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవటం నిర్వాహకులే చూసుకోవాలని పోలీసులన్నారట! బలగాలు తగినన్ని లేవు కాబట్టి పవన్ భరోసా మీదే సభకు పర్మిషన్ ఇస్తున్నామన్నారట తిరుపతి పోలీసులు. అందుకే, ఎలాంటి విషాదం చోటు చేసుకోకుండా సభ ప్రశాంతంగా నడిడిచేందుకు పవన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. జనసేన వాలెంటీర్స్ గా పని చేస్తున్న ఫ్యాన్స్ కొందరు జనాన్ని కంట్రోల్ చేయటం పై దృష్టి పెట్టారట. ముఖ్యంగా వేదిక మీద పవన్ వున్నప్పుడు అభిమానులు తొసుకుని వచ్చేయకుండా వుండేందుకు రక్షణ కవచంలా ఏర్పడనున్నారట!  సభలో పవన్ చేయబోయే రాజకీయ ప్రకటన మాటెలా వున్నా ఏ మాత్రం తేడా రాకుండా ప్రశాంతంగా మీటింగ్ జరిగేలా చూడటం నిజంగా పెద్ద సవాలే! దీన్ని మరి పవన్ ఫోర్స్ గా రంగంలోకి దిగిన జనసేన వాలెంటీర్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి...

హడావుడి నిర్ణయమా? లేక వెల్ ప్లాన్డ్ డెసీషనా?

అభిమాని హత్యకి గురైతే తిరుపతికి వెళ్లిన పవన్ హఠాత్తుగా సభ అంటున్నారు? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయంగా పవన్ సభ పరిణామాలు ఎలా వున్నా... ఒక్కటి మాత్రం స్పష్టం! పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిలా కాక సినిమా హీరోలానే ఆలోచిస్తున్నారు. అదే ఆయనకు ప్లస్ , మైనస్ ఏదైనా అవ్వొచ్చు! సినిమా చూసే ప్రేక్షకుడు నెక్స్ట్ సీన్ ఇలా వుంటుంది అని ఊహిస్తాడు. కాని, అతడు అనుకున్న దానికన్నా భిన్నంగా సీన్ వస్తే షాకవుతాడు. తరువాత డైరెక్టర్ తెలివిని మెచ్చుకుని సినిమా హిట్ చేస్తాడు. ఇదే సూత్రం పాలిటిక్స్ లోనూ వర్తిస్తుంది అనుకుంటే పొరపాటే!   రాజకీయాల్లో అనూహ్య నిర్ణయాలు అన్ని సార్లూ పనికి రావు. కొన్ని సార్లు జనం అద్భుతం అంటూ మెచ్చుకోవచ్చేమోగాని పవన్ లాగా అమాంతం బహిరంగ సభలు వగైరా వగైరా అంటే కొంచెం ఇబ్బందే! పవర్ స్టార్ హీరో కాబట్టి జనం రావటం కష్టం కాదు. బిర్యానీ, బీర్ బాటిల్ లెక్కలు ఈ సభలో వుండవు. కాని, జనం వచ్చాక పవన్ ఏం మాట్లాడతారు? జస్ట్ మూడు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసి చర్చోపచర్చలు జరిపిన ఆయన పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి చెప్పేదేముంది? దగ్గర్లో ఎలాంటి ఎన్నికలు కూడా లేనప్పుడు ప్రెస్ మీట్ తో పోయేదాన్ని బహిరంగ సభ దాకా ఎందుకు లాక్కెళ్లాలి? అంత అవసరమే వుంటే బహిరంగ సభలు చంద్రబాబు, జగన్, కేసీఆర్ లాంటి వాళ్లు పెట్టలేకా? వాళ్లు కూడా సైలెంట్ గా ఎందుకు వున్నారు? ఎందుకంటే , ఇప్పుడు అనవసరంగా వేడి రాజేసి మాత్రం చేసేదేం లేదు. ఈ విషయం పవన్ కి తెలియదా?   పవన్ ఇప్పుడు బహిరంగ సభ పెట్టడం ద్వారా ఎంత హడావిడి జరిగేలా చూసినా ఎన్నికలు వచ్చేదాకా ఇదే టెంపో మెయిన్ టైన్ చే్స్తారా? మూడేళ్ల పాటూ పవన్ వరుసగా సభలైతే పెట్టలేరు కదా? ఇవాళ్ల సభ తాలూకూ  వేడి మహా అయితే ఓ పది రోజులు వుండి చల్లారిపోతుంది. పవన్ కూడా తాను కమిటైన సినిమాల షూటింగ్ లో పాల్గొనాలి.. అంటే మళ్లీ కొన్నాళ్ల పాటూ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి అదృశ్యం కావాల్సిందే! ఇంత మాత్రం దానికి అమాంతం సభ పెట్టి సాధించేదేముంది?   పవన్ రాజకీయ ప్రవేశం పై ముందు నుంచీ పెద్దగా సుముఖంగా లేని విశ్లేషకులు ఇలాంటి బోలెడు ప్రశ్నలు వేస్తున్నారు. కాని పవన్ మనసులో ఏముందో తెలియాలంటే సభ జరిగేదాకా ఆగాల్సిందే. ఆ తరువాతే పవర్ స్టార్ తన ఫుల్ టైం ఎంట్రీ ప్రకటిస్తారా? లేక ఊరికే అభిమాని హత్యకు సంబంధించి మాట్లాడి, ప్రత్యేక హోదాపై నాలుగు కామెంట్లు చేసి స్టేజ్ దిగేస్తారా? తెలిసిపోతుంది!

అభ్యుదయవాదం... కండీషన్స్ అప్లై!

  మన దేశంలో అభ్యుదయ వాదం బోలెడంత వుంది. అసలు ఎంతగా అభ్యుదయవాదం వుందంటే... ఎక్కడో పాలస్తీనాలోని గాజాలో ఓ పసికందు మరణిస్తే ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా మన వాళ్లు ట్వీట్స్ చేస్తుంటారు! అలాగే పెషావర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తానీ పిల్లల్నే కిరాతకంగా చంపేస్తే మన దేశంలో కొవ్వుత్తులు వెలిగించి బయలుదేరతారు! ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మన దేశ అభ్యుదయవాదులు గోచిలు ఎగజెక్కుకుని పోలోమంటారు!    అదేంటి మానవత్వంతో స్పందిస్తే కూడా తప్పేనా అంటారా? తప్పేం కాదు! కాని, ఎక్కడో ప్రపంచంలో ఏ మూలో జరిగిన వాటికి స్పందించే మన వాళ్లు ఇండియాలో చాలా విషయాలు చూసీ చూడనట్టు వదిలేస్తారు! అదీ ప్రాబ్లం! కొన్నాళ్ల క్రితం జేఎన్ యూలో ఏం జరిగింది? పవిత్రంగా నెహ్రు పేరు పెట్టుకున్న ఆ విశ్వవిద్యాలయంలో దేశానికి వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. భారత్ కి బర్బాదీ తక్ అంటూ మన నాశనం కోరారు ... అక్కడి ఉద్యమకారులు! ఎందుకు? మన పార్లమెంట్ పై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురుని ఉరి తీసినందుకు!    జేఎన్ యూలో జాతి వ్యతిరేక పనులకి పాల్పడుతున్న కొందరు విద్యార్థుల్ని మోదీ ప్రభుత్వం ఓ పట్టు పట్టడంతో సదరు అభ్యుదయవాదులంతా రంగంలోకి దిగారు. విచిత్రంగా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే విద్యార్థులకి సపోర్ట్ గా ఈ బ్యాచీ మొత్తం నిలిచింది. తప్పంతా స్మృతీ ఇరానీదే అంటూ అల్లకల్లోలం చేశారు అవార్డ్ వాప్సీ ముఠా. తరువాత అంతా కామోష్ అయిపోయారు...    ఇప్పుడు తాజాగా అదే జేఎన్ యూలో ఒక విద్యార్థిని తనపై అత్యాచారం జరిగిందని కేస్ ఫైల్ చేసింది. రేప్ చేసిన వాడు కన్నయ్యా కుమార్ లాంటి ఓ విద్యార్థి నేత. పేరు అన్ మోల్ రతన్! ఈ వామపక్ష విద్యార్థి రత్నం పీహెచ్ డీ చేస్తోన్న స్కాలర్ పై అత్యాచారం చేశాడు. కాని, మన లిమిటెడ్ టైం అభ్యుదయ వాదం ఆఫర్ ప్రకటించే మేధావులు ఇప్పడు దుకాణాలు బంద్ చేశారు! ఎక్కడా అలికిడే లేదు. యూనివర్సిటీ లోపల రేప్ ఏంటని అడిగే వాడే లేడు!    ఇప్పుడొక్కసారి ఇదే పరిస్థితిని భిన్నంగా ఊహించండి... రేప్ చేసింది ఏబీవీపీ విద్యార్థి నాయకుడైతే? ఆహా.... మేధావులు, ఉద్యమకారుల ఆవేశానికి హద్దే వుండేది కాదు! అభ్యుదయ ఆయాసంతో భలే రొప్పే వాళ్లు! కాని, దురదృష్టం రేప్ చేసింది లెఫ్ట్ సంఘమైన ఏఐఎస్యూ విద్యార్థి! అదీ ప్రాబ్లం!   ఇండియాలో ఆదర్శవాదం అంటే లెఫ్టిజమే! అదే లెఫ్టిస్టులు గీత దాటితే ఇక ఎవ్వరూ ప్రశ్నించరు! రైటిస్టులకి ఆ హక్కు వుండదు! హక్కున్న రెగ్యులర్  అభ్యుదయవాదులు తేలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ గా వుంటారు! జేఎన్ యూలో ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు, వాళ్లతో జోడి కట్టిన ప్రొఫెసర్లు.. అందరి మీదా వస్తున్న ఆరోపణలకి ఎలాంటి స్పందనా లేకపోవటం ఇందుకే! దేశ రాజధానిలో వున్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో సెక్స్ పార్టీలు జరుగుతున్నాయని అంటున్నా ఎవ్వరిలోనూ కదలిక లేదు... రాదు కూడా! ఒకవేళ జేఎన్ యూ అరాచకాలన్నీ నిజమైతే.... గవర్నమెంటే తాట తీయాలి...  

ఆమెని... జెట్ ఎయిర్ వేస్ తమ విమానం ఎక్కనీయలేదట!

  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై జనంలో , మేధావుల్లో, మీడియాలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమె మానవ వనరుల శాఖా మంత్రి అయినప్పుడు చాలా మంది తన విద్యార్హతల గురించి కామెంట్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఆమె కూడా రోజుకో వివాదంలో ఇరుక్కున్నారు. తన తప్పు వున్నా లేకున్నా గొడవలతో బాగా ఫేమస్ అయ్యారు. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలు జేఎన్ యూలో జాతి వ్యతిరేక కార్యక్రమాల దాకా స్మృతి నేతృత్వంలో నానా రచ్చ జరిగింది! చివరకు, ఇరానీ ఇప్పుడు జౌళి శాఖలో సెటిలయ్యారు...   స్మృతి ఇరానీ ఇప్పుడంటే బీజేపి టాప్ లీడర్స్ లో ఒకరు. మోదీ ఫేవరెట్ బ్యాచీలో వన్నాఫ్ ది మెంబర్. కాని, అసలు ఆమె ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? టీవీ సీరియల్ నటిగా స్మృతి ఫేమస్ కావటం , తరువాత రాజకీయాల్లోకి రావటం వగైరా వగైరా అంతా మనకు తెలుసు. కాని, తెలియంది ఏంటంటే ఆమె ఒకప్పుడు సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇండియాలో చాలా మంది లాగే రకరకాల ఉద్యోగాల కోసం ట్రై చేసింది!   స్మృతి ఇరానీ ఒకప్పుడు జెట్ ఎయిర్ వేస్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. కాని, వాళ్లు ఆమె పర్సనాలిటి బాగా లేదని రిజెక్ట్ చేశారు! సహజంగానే విమానయాన రంగంలో అందం, లుక్స్ వంటి వాటికి ప్రాధాన్యతకి ఇస్తారు కాబట్టి ఆమెని వద్దనుకుని వుంటారు! కాని, జెట్ ఎయిర్ వేస్ వాళ్లకి ఆనాడు తెలియంది ఏంటంటే, కొన్నేళ్ల తరువాత అదే స్మృతీ తమ ఉద్యోగికి అవార్డ్ ఇస్తూ కేంద్ర మంత్రిగా ఎదురవుతుందని!   ఒకప్పుడు జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించీ రిజెక్ట్ అయిన స్మృతి తరువాత మెక్ డొనాల్డ్ సంస్థలో పని చేసింది. తరువాత మోడల్, టీవీ యాక్ట్రస్, పొలిటీషన్ అయ్యారు! ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న ఆమె ఓ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తూ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని సన్మానిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పారు!   స్మృతి ఇరానీ స్మృతి లోంచి బయటకొచ్చిన జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగ ప్రయత్నం కథనం... ఎంతైనా ఇన్ స్పిరేషనలే! ఒకప్పుడు తనని ఉద్యోగంలోకి తీసుకోని కంపెనీ ఉద్యోగికే కేంద్ర మంత్రిగా సన్మానం చేయటం... గొప్ప విజయమనే చెప్పాలి! ఎవరి అభిప్రాయం ఎలా వున్నా స్మృతీ విజయ ప్రస్థానాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే!