సత్య సాయి ఆస్తుల వివరాలు కోర్టుకు
posted on Apr 28, 2011 @ 10:24AM
పుట్టపర్తి: ఆస్తుల వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు మల్లగుల్లాలు పడుతోంది. ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే వెల్లడించడానికి ఉన్న అవకాశాలను సత్యసాయి ట్రస్టు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ట్రస్టు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. న్యాయ నిపుణులతో కూడా ట్రస్టు సంప్రదిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్.భగవతి ట్రస్టు సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. భారతీయ వారసత్వచట్టం 317 నిబంధన ప్రకారం ఇన్వెంటరీ అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆస్తులకు సంబంధించిన సమస్త వివరాలుగల జాబితాను జిల్లా కోర్టులో దాఖలు చేస్తారు. జిల్లా న్యాయమూర్తికి అందజేసిన ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించాల్సిన అవసరంలేదు. అందులో వివరాలు తెలియకుండా ఆరోపణలు చేయడానికి వీలుండదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇన్వెంటరీ దిశగా ట్రస్టు అడుగు లేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టు నిర్వహణలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రస్టు కార్యక్రమాలు సవ్యంగా జరిగినంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి జోక్యం చేసుకొనే అవకాశంలేదు. మంగళ, బుధవారాల్లో పుట్టపర్తిలో ఉన్న ముఖ్యమంత్రితో సత్యసాయి ట్రస్టుతో సంబంధమున్న కొందరు మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. బాబాకు అన్నిరకాల సఫర్యలు చేస్తూ సన్నిహితునిగా గుర్తింపు పొందిన సత్యజిత్ను పూర్తిగా దూరంగా పెట్టేలా చూడాలని కొందరు ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.