స్థంభించిన యూట్యూబ్ సేవలు 

జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్​ను, గూగుల్​ వర్క్​స్పేస్​ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్​ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్​.. రెండూ గూగుల్​లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  ప్రముఖ వీడియో  ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్  స్తంభించిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూట్యూబ్ పనిచేయలేదని వంద మంది కామెంట్ రాశారు. యూట్యూబ్  పనిచేయలేదని ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కనుగొనే డౌన్ డిటెక్టర్ నిర్ధారించింది. యూట్యూబ్‌లో  80 శాతం మంది వీడియోలు చూడటంలో ఇబ్బంది పడ్డారు. మరికొందరు వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌లో  అంతరాయం భారతదేశంలో ఏర్పడిందా..? మిగతా దేశాల్లో వచ్చిందానే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు అని’ డౌన్ డిటెక్టర్ పేర్కొంది. యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్య ఏర్పడిందని కొందరు యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్  సర్వర్ డౌన్ అయ్యిందా.? ఇతర సమస్యలు ఉన్నాయా..? స్పష్టత ఇవ్వండి. తాను లైవ్, షార్ట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంది. తన వైటీ స్టూడియోలో ఏమీ కనిపించడం లేదు. యూట్యూబ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌ డౌన్‌కు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మాత్రం ప్రకటన చేయలేదు. జీమెయిల్, యూట్యూబ్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్​ వర్క్​స్పేస్​లోకి లాగిన్​ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్​లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్​ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్​లో తమ జీమెయిల్​ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు. అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్​ ద్వారా మెసేజ్​లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్​లో 'వాట్సాప్​ డౌన్'​ హ్యాష్​ట్యాగ్​ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్​ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్​చల్​ చేశాయి.అప్పట్లో వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్​ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై మార్క్ జుకర్​బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్​లైన్​లోకి వచ్చినట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు. అలాగే వాట్సాప్ సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది. అంతర్జాల సమస్యలపై దృష్టి సారించే డౌన్​డిటెక్టర్.. ఫేస్​బుక్ అంతరాయంపై కీలక ప్రకటన చేసింది. ఫేస్​బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్​బుక్​ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని వెల్లడించింది.

వివేకా హత్య కేసు.. ఇక విచారణ వాయిదాలకే పరిమితమా?

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 27)న సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కోర్టు కేసు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. పెద్దగా ప్రాముఖ్యత లేని వ్యవహారంలా వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ మారిపోయిందనడానికి ఈ కేసు విచారణ జరుగుతున్న తీరే నిదర్శనం. కానీ గత ఏడాది ఫిబ్రవరి నుంచి మే నేలాఖరు వరకూ  మాత్రం ఇహనో ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు అన్న వాతావరణమే ఉండింది. అప్పట్లో రాజకీయ వర్గాలు కూడా అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుకోవడం ఇక ఎవరి తరం కాదన్నట్లుగానే భావించాయి.  గత ఏడాది ఫిబ్రవరి 24న  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అప్పట్లోనే కోర్టు హాలు నుంచి బయటకు రాగానే అవినాష్ ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ  హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. వాస్తవానికి వివేకా హత్య కేసులో అవినాష్ ను 2023 జనవరిలోనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.  అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో అప్పటికి వెనక్కు తగ్గిన సీబీఐ  ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతి పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించింది. వారిని విచారించిన అనంతరం అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ  నోటీసులు పంపింది.  దీంతో ఇక అవినాష్ అరెస్టే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  అప్పట్లో సీఎం జగన్ సైతం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ అరెస్టు తరువాత సీబీఐ తట్టేది తాడేపల్లి ప్యాలెస్ తలుపులేనన్న చర్చ కూడా అప్పట్లో జోరుగా సాగింది.  జగన్ హస్తిన పర్యటనతో పరిస్థితి సద్దుమణిగిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి.  ఆ తరువాత మళ్లీ గత ఏడాది మేలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టునకు సీబీఐ విశ్వ ప్రయత్నం చేసింది. తల్లికి గుండెపోటు కారణంగా సీబీఐ విచారణకు రాలేను అంటూ అవినాష్ విజ్ణప్తిని సీబీఐ తోసిపుచ్చింది. దీంతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలు దేరిన అవినాష్ రెడ్డి అంతలోనే మనసు మార్చుకుని కడపకు పయనమయ్యారు. దీంతో సీబీఐ ఆయనను సినీ ఫక్కీలో ఛేజ్ చేసింది. మార్గ మధ్యంలో ఆయన రూటు మార్చి తన తల్లిని కర్నూలులోని ఓ అసుపత్రిలో చేర్చారంటూ అక్కడకు వెళ్లారు. ఆ తరువాత గంటల తరబడి డ్రామా కొనసాగింది. అవినాష్ రెడ్డి ఆసుపత్రి లోపల, సీబీఐ అధికారులు ఆసుపత్రి బయట మధ్యలో వందల సంఖ్యలో అవినాష్ అనుచరులు. అప్పట్లో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. అవినాష్ అరెస్టు కు సీబీఐ స్థానిక పోలీసుల సహాయం కోరితే.. వారు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక సీబీఐ వెనుదిరిగింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చూపి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.  అంతే ఆ తరువాత నుంచీ వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటి అన్న విషయంపై ఇసుమంతైనా సమాచారం లేదు.  అవినాష్ ను అరెస్టు చేయడానికి నానా హడావుడీ చేసి చివరకు చేతులెత్తేసిన సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ.   కానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏపీ సీఐడీ మాత్రం జగన్ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసే విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కేసింది. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకు వెళ్లి మరీ అరెస్టులు చేసింది. గోడలు దూకి వెళ్లి మరీ అరెస్టులు చేసింది. ఇలా ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారిలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు చివరాఖరికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. వీళ్లెవరూ టెర్రరిస్టులు కారు.   రాత్రికి రాత్రి  పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించి మరీ అరెస్టులు చేశారు. వందల మైళ్లు కార్లలో తిప్పారు.  వైసీపీ రెబల్ ఎంపీపై అయితే ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు.    అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చోద్యం చూసిన తీరు ఆ సంస్థ ఇంటిగ్రిటీపైనే అనుమానాలు కలిగేలా చేసింది.  

చంద్రబాబుతో నారాయణ భేటీ 

టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. వచ్చే నెల 2వ తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై వీరు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులే లేరని చెప్పారు. టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. 2వ తేదీన చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారో తనకు తెలియదని... సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని... దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని అన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను అందరం పాటిస్తామని చెప్పారు.

సిబిఐ కోర్టు ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన మూడోసారి విచారణ కోసం వెళ్లారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.   ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం కోర్టు మార్చి 12కు తదుపరి విచారణను వాయిదా వేసింది.  కాగా, వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్‌రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే.   

వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ మంత్రితో సమావేశమైన రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. తెలంగాణలో మెడికల్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్‌లలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ స్కిల్ క్యాపిటల్‌గా మారబోతుందని తెలిపారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఐటీ, సాఫ్టువేర్ రంగాల్లో ముందుంది హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా-2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ ఐటీ, సాఫ్టువేర్ రంగాల్లో అగ్రగామిగా ఉందని, కరోనా అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారన్నారు.  

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపిన కాంగ్రెస్ 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ  ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇస్తోంది. తమ అధినాయకత్వం పై ఇష్టారాజ్య ఆరోపణలు అడ్డుకట్టవేయడానికి నడుంకట్టింది. ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ బెంజ్‌ కారును అందుకున్నారంటూ తెలంగాణ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ చేసిన ఆరోపణలపై హస్తం పార్టీ స్పందించింది. ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షీ ఖండించారు.

రాహుల్ పోటీ తెలంగాణ నుంచేనా?

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో  ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన తన సొంత నియోజకవర్గం అమేథితో పాటు కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో ఆయన అమేథి నుంచి పరాజయం పాలయ్యారు. అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్మృతి ఇరానీ విజయం సాధించారు. కాగా రాహుల్ వాయనాడ్ నుంచి విజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు. మరి 2024 ఎన్నికలలో ఆయన పోటీ ఎక్కడ నుంచి అనేదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అమేథి పక్కన పెడితే రాహుల్ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు దాదాపు మృగ్యమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా సతీమణి యాని రాజాను సీపీఐ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించేసింది. ఇండియా కూటమిలో భాగంగా పొత్తు చర్చల ప్రారంభానికి ముందే వాయనాడ్ బరిలో  యానీ రాజా పోటీ ఖరారు అయిపోవడంతో రాహుల్ గాంధీ మళ్లీ నియోజకవర్గం మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రాహుల్ తెలంగాణ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న చర్చ మొదలైంది. ఈ చర్చకు కారణం ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోరడం. ఆయనను భువనగిరి లేదా ఖమ్మం నుంచి ఎన్నికల బరిలో దిగాల్సిందిగా రేవంత్ కోరారు. ఇదే విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికలలో దక్షిణాది నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు  తెలంగాణయే సేఫ్ అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.  అయితే ఖమ్మం బరిలో కుసుమ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్న నేపథ్యంలో  అయితే గియితే రాహుల్ గాంధీ భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ కు సేఫ్ ప్లేస్  అనడంలో సందేహం లేదు. అందులోనూ ఖమ్మం, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలైతే కాంగ్రెస్ విజయానికి ఢోకా ఉండదని చెబుతున్నారు.  అసలు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని రేవంత్ కోరారు. ఆమె కూడా సుముఖంగా స్పందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్య సభకు వెళ్లడంతో ఆమెకు బదులుగా ప్రియాంకను రాష్ట్రం నుంచి లోక్ సభ బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు కూడా జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రియాంక మాత్రం తన తల్లి పోటీ చేసిన రాయబరేలి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని రాష్ట్రం నుంచి లోక్ సభకు పంపాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ రాహుల్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఇప్పటి వరకూ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న స్పష్టత లేకపోవడంతో ఆయన తెలంగాణ నుంచి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

రూ.500లకే గ్యాస్ సిలెండర్ షురూ!

రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా పరిమితి పెంపు లను అమలు చేసిన రేవంత్ సర్కార్ తాజాగా రూ.500లకే గ్యాస్ సిలెండర్ గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 27) జీవో విడుదల చేసింది. సబ్సిడీ సిలెంటర్ కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఆధారంగా ఈ పథకానికి  39.5లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం లబ్ధిదారుల కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించింది.   మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని  సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లను లబ్ధిదారులకు అందించనుంది. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఈ సబ్సిడీ ట్రాన్స్ ఫర్ 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి జమ అవుతుంది. . నెల నెలా  ఈ సబ్సిడీ మొత్తాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ముందు ముందు సిలెండర్ కు రూ.500లనే వినియోగదారులు చెల్లించే విధంగా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.  కాగా ఈ పథకానికి వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. అయితే గ్యాస్ సబ్సిడీ కోసం వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుని పేరిటే ఉండాలి.  

కేసీఆర్ రంగంలోకి.. లోక్ సభ ఎన్నకలలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత డీలా పడిన బీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహం నింపి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా చైతన్య పరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగారు. తన ఫామ్ హౌస్ లో  కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు.  ఈ భేటీలో వచ్చే ఆరు వారాలూ అత్యంత కీలకమని, నేతలు ప్రజలలోనే ఉండేలా వరుస కార్యక్రమాలు నిర్వహించాలనీ కేసీఆర్ కేటీఆర్, హరీష్ లను ఆదేశించారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరడం, మరి కొందరు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడం తదితర పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తున్నది. నేతలు, క్యాడర్ పక్క చూపులు చూడకుండా వరుస కార్యక్రమాలతో వారిని బిజీగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలలో ఇప్పటి వరకూ అమలు చేయని వాటిపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అలాగే  నిరుద్యోగ భృతి, రూ. రెండు లక్షల రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్ తదితర అంశాలపై రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించాలని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు. జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు, క్యడర్ ను నేతలను లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొనేలా వరుస కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  పార్టీలోని సీనియర్, కీలక నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.   పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు జగదీశ్ రెడ్డి, మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, నామా నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ కవిత, కె.కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ తరువాత కేసీఆర్ తన కుమార్తె కల్వకుట్ల కవితతో భఏటీ అయ్యారు. ఆమెను లిక్కర్ స్కాంలో  నిందితురాలిగా పేర్కొంటూ జారీ చేసిన నోటీసులపై చర్చించారు. కవిత పిటిషన్ పై బుధవారం (ఫిబ్రవరి 28)న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కవిత, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

టిడిపి నేత సోమిరెడ్డిపై గునపంతో దాడియత్నం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డిపై వైసీపీ కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు. గునపంతో వచ్చి పొడిచేస్తానంటూ వీరంగం వేశాడు. తనను అడ్డుకున్న టీడీపీ నాయకులను అసభ్యపదజాలంతో తిట్టాడు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి, స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేశాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టుపల్లిలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. దీనిపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’ ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం కట్టుపల్లికి వెళ్లారు. సోమిరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ నేతలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప వాటిని చించేశారు. దీంతో టీడీపీ నేతలు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా చింపేసి, కర్రలను చెరువులో పడేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడారు. ఇంతలో సోమిరెడ్డి గ్రామానికి రావడంతో టపాసులు కాలుస్తూ స్వాగతించిన టీడీపీ స్థానిక నాయకులతో వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. స్థానిక నేతలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకటయ్య.. కాసేపటికి గునపంతో వచ్చి సోమిరెడ్డిపై దాడికి యత్నించాడు. గొడవ పెరుగుతుండడంతో సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా స్థానిక టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి వెంకటయ్య బృందం దాడి చేసింది. ఇంటి కిటికీలు పగలకొట్టి, కారును ధ్వంసం చేశారు. చుట్టుపక్కల మహిళలు అడ్డుకోవడంతో వెంకటయ్య మిగతా వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపైనా వెంకటయ్య బృందం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ ఫౌల్ గేమ్.. క్రికెటర్ హనుమ విహారి ఔట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దాష్టికానికి నిర్వీర్యం కాని వ్యవస్థ లేదు. వేధింపులకు గురి కాని రంగం లేదు. రాష్ట్రంలో ఉండాలంటే వైసీపీ నేతల పెత్తనాన్ని అంగీకరించి తల వంచుకు బతకాల్సిందే అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు ఉంది.  పరిశ్రమలను తరిమేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను వలస బాట పట్టించేశారు. రైతులను వ్యవసాయానికి దూరం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే  రాష్ట్రంలో వైసీపీ దాష్టికానికి గురి కాని రంగం అంటూ ఉండదు. తాజాగా క్రీడా రంగంపై కూడా వైసీపీ తన పంజా విసిరింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ నాయకగణం.. తాజాగా దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్ హనుమ విహారిని ఏపీ నుంచి తరిమేసింది.   అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతోంది. ఇంటర్నేషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్పెన్సీ నుంచి అవమానకరంగా తొలగించారు. ఆయనే రాజీనామా చేశారంటూ ప్రచారం చేశారు. వాస్తవమేమిటన్నది హనుమ విహారి స్వయంగా తన సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్టు చేసే వరకూ వెలుగులోకి రాలేదు. తాజాగా హనుమ విహారి తాను ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడేది లేదంటూ చేసిన పోస్టుతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ నేతల ఆటలు ఎలా సాగుతున్నాయో బయటపడింది.   ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టులో   17వ ప్లేయర్ ను కెప్టెన్ హోదాలో మందలించిన హనుమ విహారిని  అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేశారు. ఎందుకంటే ఆ 17వ ప్లేయర్ వైసీపీకి చెందిన ఓ చిన్న నాయకుడి పుత్రరత్నం.  ఆ వైసీపీ చోటా నేత తిరుమతి కార్పొరేటర్ నరసింహ. తన కుమారుడిని మందలిస్తాడా అన్న ఆగ్రహంతో సదరు కార్పొరేటర్ తన పలుకుబడిని ఉపయోగించి హనుమ విహారిని అత్యంత అవమానకరరీతిలో కెప్టెన్సీ పదవి నుంచి తొలగించేశారు. అంత పలుకుబడి ఓ కార్పొరేటర్ కు ఎక్కడిదంటే.. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమనకు సన్నిహితుడు. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన తనయుడు రంగంలో ఉన్నారు. ఇది చాలదూ  వైసీపీలో ఓ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మాట చెల్లుబాటు కావడానికి. భూమన ద్వారా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ నుంచి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ను రాష్ట్రం నుంచి తరిమేశారు. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన హనుమ విహారి ఇక ఏపీకి ఆడేది లేదని ప్రకటించారు.   ఈ రంజీ సీజన్ లో ఏపీ జట్టు  బెంగాల్ తో  తొలి మ్యాచ్ సందర్బంగా  కెప్టెన్ హనుమ విహారి తన జట్టులో 17వ ప్లేయర్ అయిన కేఎన్ పృధ్వీరాజ్ ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు.  ఇది జరిగిన వెంటనే.. అంటే ఆ మ్యాచ్ పూర్తి కాగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని కెప్టెన్ గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా హనుమ విహారే కెప్టెన్సీకి రాజీనామా చేశారంటూ ఏకపక్షంగా ప్రకటన కూడా విడుదల చేసేసింది.  అయితే క్రీడా స్ఫూర్తి తెలిసిన క్రీడాకారుడిగా రంజీ సీజన్ మ్యాచ్ లు అయిపోయే వరకూ ఆగిన హనుమ విహారి ఆ తరువాత జరిగిన విషయాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు.   తెగించేసిన వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు. అసలు క్రీడా రంగంపై వైసీపీ పెత్తనాన్ని ప్రశ్నించాలి. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి అల్లుడు. మిగిలిన సభ్యులంతా ఆయన కనుసన్ననలలోనే మెలుగుతారు. పెత్తనం అంతా మనదేనన్న బరితెగింపుతోనే  వైసీపీ ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడి కెరీర్ తో ఆటాడేసుకుంది. ఇంతకీ ఆ కార్పొరేటర్ పుత్ర రత్నం కేఎన్ పృధ్వీరాజ్ ఏకంగా ఏపీ రంజీ జట్టులోకి ఎలా వచ్చేశాడన్న అనుమానం ఎవరికీ రావడం లేదు. ఎందుకంటే అడ్డగొలు సిఫార్సులతో జట్టులో స్థానం సంపాదించిన అతడు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు కెప్టెన్ మందలించారు. ఆ మందలింపే హనుమ విహారి ఏపీ జట్టుకు ఆడేదే లేదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇంత జరిగిన తరువాత కూడా పృధ్వీ హనుమ విహారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఏం పీకలేవు అంటూ అనుచిత భాషను ఉపయోగిస్తూ పోస్టు పెట్టి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు.   దీంతో హనుమ విహారి ఓపెన్ అయ్యారు. జట్టు  మొత్తం తననే కెప్టెన్ గా కొనసాగించాలన్న డిమాండ్ చేసిందనీ, వారంతా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు లేఖ కూడా రాశారని పేర్కొంటూ ఆ లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే కాదు.. ఆ తరువాత   అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నుంచి ఆంధ్ర జట్టు సపోర్ట్ స్టాఫ్‌కు ఫోన్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు హనుమ విహారి వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హనుమ విహారికి మద్దతుగా టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్  ఈ విషయమై తన యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడమని ఆహ్వానించాడు. అందుకు హనుమ విహారి అంగీకరించాడు. టీమ్ ఇండియా క్రికెటర్లందరూ కూడా హనుమ విహారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ వివరణ కోరుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఇక వైసీపీ దాష్టికానికి అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తొలగింపునకు గురైన హనుమ విహారికి మద్దతుగా చంద్రబాబు కూడా స్పందించారు.  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ లో రాజకీయ కుట్రలకు బాధితుడైన  టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి  అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  మొత్తం మీద హనుమ విహారి విషయంలో వైసీపీ ఆడిన వికృత క్రీడకు వ్యతిరేకంగా క్రీడా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ రంగంలోకి దిగితే   ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ పెత్తనానికి తెర పడటం ఖాయమని అంటున్నారు.   ఇంతకీ హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ లో హనుమ విహారి ఆడిన తీరు అద్భుతం. ఆ మ్యాచ్ లో హను మ విహారి ఆటతీరును ఎప్పటికీ మరచిపోలేం. గత ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా హనుమ విహారి ఐదు సార్లు జట్టును రంజీల్లో నాకౌట్ దశకు తీసుకువచ్చారు. అటువంటి గొప్ప క్రికెటర్ ను కేవలం ఒక కార్పొరేటర్ కుమారుడు చెప్పాడని అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేసిందీ జగన్ రెడ్డి సర్కార్. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. క్రీడాకారులతో అత్యంత అవమానకర రీతిలో వ్యవహరిస్తూ.. రాష్ట్రాంలో ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలను నిర్వహించి ఉపయోగమేమిటి జగన్ అని ప్రశ్రించారు.  ఆంధ్రా క్రికెట్ ను, జాతీయ క్రికెట్ ను మీరు అందించిన సేవలకు క్రికెట్ ను ప్రేమించే వారంతా హనుమ విహారికి అండగా ఉంటారని పవన్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. హనుమ విహారి మళ్లీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడతారనీ, రాష్ట్రంలో క్రీడాకారులను గౌరవించడం తోలిసిన ప్రభుత్వం రాబోతోందనీ పేర్కొన్నారు. 

వోటేయడానికి ఆధార్ కంపల్సరీ కాదు 

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల్లో ప్రజలు  తమ ఓటు హక్కును సద్వినియోగం కంపల్సరీ. అయితే   ఆధార్ కార్డు లేకుంటే ఓటు హక్కు లేదనే  అపోహ ను కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుకట్టవేసింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఆధార్ లేకున్నా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటరు కార్డు కానీ, లేదంటే, చెల్లుబాటు అయ్యే మరేదన్నా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో వేలాది ఆధార్‌కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ప్రకటన చేసింది. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి ఈసీ తెలిపింది.

ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ కష్టమే!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ప‌రాభవం త‌ప్ప‌ద‌ని ప‌లు స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్‌ల‌ను మార్చారు. వీరిలో కొంద‌రికి వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం క‌ల్పించ‌గా.. మ‌రికొంద‌రిని ప‌క్క‌న పెట్టారు. ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ విజ‌యం సాధించింది. ఈసారి అత్య‌ధిక స్థానాల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేల ఫ‌లితాలు ప్ర‌కాశం ఉమ్మ‌డి జిల్లాలో తెలుగుదేశం, జ‌న‌సేన హ‌వా  ఖాయమని పేర్కొన్నాయి. ఈ జిల్లాలో తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  ఇక నియోజకవర్గాల వారీగా పరిస్ధితులను పరిశీలిస్తే.. గిద్ద‌లూరు..  గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక పెల్లుబుకుతుండ‌టంతో వైసీపీ అధిష్టానం అన్నారాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి మార్చేసింది.  అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే  కందూరు నాగార్జున రెడ్డిని గిద్ద‌లూరుకు పంపింది. కందూరుకు రాంబాబు వ‌ర్గీయులు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కందూరు ఓట‌మికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విడుదల చేసిన తొలి జాబితాలో  ఈ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిని కేటాయించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నుంచి ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతుంది.  మార్కాపురం..  మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గానికి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే  అన్నా రాంబాబును వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది..  గత ఎన్నికలలో గిద్దలూరు   రాంబాబు విజ‌యం సాధించారు. వైసీపీ అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డికి మ‌రోసారి  అవ‌కాశం ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని తేలడంతో కందూరు నాగార్జున‌ను గిద్ద‌లూరు పంపించి.. రాంబాబును మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధిష్టానం బ‌రిలో నిలిపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో దిగేది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే    అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలో నిలిపిన విజ‌యం ఖాయ‌మ‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఎర్ర‌గొండ‌పాలెం..  ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ఆదిమూల‌పు సురేశ్ విజ‌యం సాధించారు. జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రిగానూ ప‌నిచేశారు. అయితే, ఆయనపై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆదిమూల‌పు సురేష్ ను త‌ప్పించి తాటిప‌త్రి చంద్ర‌శేఖ‌ర్ ను  వైసీపీ అదిష్టానం ఇక్కడ బరిలోకి దింపింది. ఈ ప‌రిణామాల‌తో సురేశ్ వ‌ర్గం  సంతృప్తితో ఉంది. బ‌హిరంగంగా బయటపడకపోయినా  చంద్ర‌శేఖ‌ర్ కు స‌హ‌క‌రించేది లేద‌ని సురేశ్ వ‌ర్గం అంతర్గత సంభాషణల్లో స్పష్టంగా చెబుతోందని  స‌మాచారం. దీనికితోడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా గూడూరి ఎల‌క్ష‌న్ బాబు మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకుతోపాటు, టీడీపీ, జ‌న‌సేన  శ్రేణుల అండతో  ఎలక్షన్ బాబు విజయం నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు.   క‌నిగిరి.. క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బుర్రా మ‌ధుసుద‌న్ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయన్ని జగన్ పక్కన పెట్టేశారు.  యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో నేత‌ డి. నారాయ‌ణ యాద‌వ్ ను వైసీపీ అధిష్టానం బరిలోకి దింపింది. అయితే, నారాయ‌ణ యాద‌వ్ ను నియ‌మించ‌డంపై మ‌ధుసూద‌న్ యాద‌వ్ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో  ప్రజా వ్యతిరేకత వ్య‌తిరేక‌త నారాయ‌ణ యాద‌వ్  విజయానికి పెద్ద అవరోధం అని పరిశీలకులు చెబుతున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న విజ‌యం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒంగోలు..  ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే బ‌రిలోకి దిగ‌నున్నారు. బాలినేనిపై భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి కొంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థిగా మ‌రోసారి దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ రావు బ‌రిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలోనే దామచర్ల పేరు ప్రకటించారు. దీనిని బట్టే ఒంగోలులో దామచర్ల విజయంపై తెలుగుదేశం ఎంత ధీమాతో ఉందో అర్ధమౌతోంది. ప్ర‌భుత్వంపై ప్రజా వ్యతిరేక‌త‌, స్థానికంగా బాలినేనికి ఉన్న ప్రతికూలతలే దామచర్ల విజయానికి సోపానాలుగా పరిశీలకులు చెబుతున్నారు.   కొండ‌పి..  కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. గ‌త రెండు ద‌ఫాలుగా అక్క‌డ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తోంది.  గ‌త ఎన్నిక‌ల్లో డోల బాల‌వీరాంజ‌నేయ స్వామి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఈ సారి కూడా తెలుగుదేశం కూట‌మి అభ్యర్థిగా కొండ‌పి నుంచి బాల వీరాంజ‌నేయ స్వామి పోటీ చేయనున్నారు. 2024 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా కొండపి నుంచి   ఆదిమూల‌పు సురేశ్ బ‌రిలోకి దిగ‌బోతున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే సురేశ్ ను కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట కావ‌డంతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా తోడ‌వుతుండ‌టం, జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఇలా అన్ని అంశాలు మ‌రోసారి తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యానికి దోహదం అవుతాయిని అంటున్నారు.  ద‌ర్శి ..  ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్  విజ‌యం సాధించారు. అయితే జగన్ ఆయన్న తప్పించి  బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా  నిలబెట్టింది. 2014లో బూచేపల్లి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీకి ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌న్న వాద‌న గట్టిగా వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా జ‌న‌సేన నేత‌ గ‌రిక‌పాటి వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉందని అంటున్నారు.  అదే జ‌రిగితే రెండు సామాజిక వ‌ర్గాల ఓట్ల‌తోపాటు, వైసీపీపై  ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మిలో కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ఉన్న‌ాయని  ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. సంతనూత‌ల‌పాడు.. సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి సుధాక‌ర్ బాబు విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం అత‌న్ని ప‌క్క‌నపెట్టి మంత్రి మేరుగ నాగార్జునను సంత‌నూత‌ల‌పాడు వైసీపీ ఇంచార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పార్టీలో  వ‌ర్గ‌విబేధాలు కొన‌సాగుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బి. విజ‌య్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. గ‌త రెండుసార్లు విజ‌య్ కుమార్ ఓడిపోవ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయన పట్ల సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని ప్రాంతాల్లో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువే. ఈ రెండు అంశాల‌కు తోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఈద‌ఫా విజ‌య్ కుమార్ విజ‌యానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.    కందుకూరు..  కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి మ‌హిద‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టి  అర‌వింద యాద‌వ్ ను రంగంలోకి దింపింది. విద్యాసంస్థ‌ల అధినేత పెంచ‌ల‌య్య కుమార్తె అర‌వింద‌ యాద‌వ్‌  భ‌ర్త వెంక‌ట‌రంగ‌య్య బెంగ‌ళూరులో వ్యాపార‌వేత్త‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. అందుకే అర‌వింద‌ యాద‌వ్ ను వైసీపీ ఇంచార్జిగా నియ‌మించిన‌ట్లు స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఇంటూరు నాగేశ్వ‌ర‌రావుకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందంని అంటున్నప్పటికీ,   వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి  తెలుగుదేశంలో గూటికి చేరితే.. ఆయనకు సన్నిహితుడైన  మ‌హిద‌ర్ రెడ్డిని తెలుగుదేశం బరిలోకి దించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.  బ‌రిలోకి దిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. గ‌తంలో మ‌హిద‌ర్ రెడ్డికే క‌మ్మ స‌మాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తుగా నిలిచింది. ఈసారి ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు తెలుగుదేశం కూట‌మివైపు మ‌ళ్లే అవ‌కావం ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వం పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈనేప‌థ్యంలో ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సునాయాసం అని అంటున్నారు. అద్దంకి..  అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం అంటే గొట్టిపాటి ర‌వికుమార్ గుర్తుకొస్తారు. 2019లో  తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న విజ‌యం సాధించారు. మ‌రోసారి తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఆయనే  బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో అన్నివ‌ర్గాల నుంచి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జిగా హ‌నిమిరెడ్డిని పార్టీ అధిష్టానం నియ‌మించింది.  అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి గొట్టిపాటి ర‌వికుమార్ విజ‌యం సాధిస్తార‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. చీరాల..  చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న వైసీపీలో చేర‌డంతో చీరాల నుంచి వైసీపీ ఇంచార్జిగా క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు క‌రణం వెంక‌టేశ్ ను పార్టీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. తెలుగుదేశం కూట‌మి నుంచి చీరాల అభ్య‌ర్థిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి తెలుగుదేశం బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థే విజ‌యం సాధిస్తార‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. క‌ర‌ణం బ‌ల‌రాంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై కొంత వ్య‌రేకత‌ వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌రేక‌త ఉంది. మ‌రోవైపు తెలుగుదేశం ఓటు బ్యాంకుతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో చీరాల‌లో  తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.  ప‌రుచూరు..  ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏలూరి సాంబ‌శివ‌రావు గ‌త రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి ఇక్కడ నుంచి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చ ఇక్క‌డ ఏలూరి హ్యాట్రిక్ విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా య‌డం బాలాజీని జగన్ ఎంపిక చేశారు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా క‌మ్మ‌ సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఆ త‌రువాత కాపు సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌.  తెలుగుదేశం జనసేన క‌లిసి పోటీచేస్తున్న నేప‌థ్యంలో క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తుతోపాటు.. మిగిలిన సామాజిక వ‌ర్గాల్లోనూ ఏలూరి సాంబ‌శివ‌రావు అంటే అభిమానం ఉంది. ఈ క్ర‌మంలో ఏలూరి విజ‌యం లాంఛనమేనంటున్నారు.   

కల చెదిరింది.. వంశీ కథ మారింది!

రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గన్నవరం, గుడివాడలో మాత్రం రాజకీయం రంజుగా మారుతోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ కొడాలి నానినే పోటీ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి వెనిగండ్ల రాము బరిలో దిగుతున్నారు. అయితే కొడాలి నాని వరుసగా గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి  వైసీపీ అభ్యర్థిగానే   బరిలో దిగుతుండగా, తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంత వరకు ఓకే.  కానీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం చిత్రం.. విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈసారి ఫ్యాన్ వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ,  టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో..అంటే.. 2019 ఎన్నికలలో వీరిద్దరే ప్రత్యర్థులైనప్పటికీ, ఇప్పుడు వారు పోటీ చేస్తున్న పార్టీలు రివర్స్ అయ్యాయి. అంటే గత ఎన్నికలలో వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా  పోటీలో ఉంటే, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగారు.  విజయం మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వంశీనే వరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ  151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి.. జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.  ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలోనే అటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గం, ఇటు వల్లభనేని వంశీ వర్గం ఏర్పడి.. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అందులో నుంచి అసమ్మతి రాగం పుట్టుకొచ్చింది. అది మిన్నంటింది. దాంతో యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే.. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా యార్లగడ్డను  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు  నియమించారు. దీంతో నాడే గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ పేరు ఖరారు అయింది.   అయితే గన్నవరం నియోజకవర్గం అంటే.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుందనీ, ఆ పార్టీ  ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ప్రజలు.. దాదాపుగా ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారని.. అలా పట్టం కట్టితేనే.. వరుసగా రెండు సార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారని.. కానీ గత ఎన్నికల తరువాత అధికారం మారడంతో.. ఆయన మనస్సు కూడా మారిందని.. కానీ నియోజకవర్గ ప్రజల మనస్సులు మాత్రం చెక్కు చెదరకుండా.. తెలుగుదేశం  వైపే ఉందని,  దీంతో గన్నవరంలో వరుసగా సైకిల్ పార్టీ జెండా రెపరెలాడుతోందని... అందుకే ఈ సారి గెలిచేది.. ఎమ్మెల్యే పదవి చేపట్టేది మాత్రం యార్లగడ్డ వెంకట్రావేనన్న  స్థానికుల్లో హల్‌చల్ చేస్తోంది.  మరోవైపు వల్లభనేని వంశీ పార్టీ మారితే మారాడు.. తనతో పాటు పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు నోరు మూసుకోని ఉన్నట్లు ఉండకుండా.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఆ రోజే.. వంశీ పోలిటికల్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పడిందని,  దీంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అయిందని స్థానికులు ఈ సందర్బంగా    గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలుపు.. అంటే యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు ఖాయమైందనే ఓ ప్రచారం సైతం స్థానికంగా జోరుగా సాగుతోంది. 

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుసుమకుమార్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  హల్‌చల్ చేసింది. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సైతం   పార్టీ గాలి బలంగా వీచేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం చేపట్టింది.  అందులోభాగంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా జెట్టి కుసుమ కుమార్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో లోక్‌సభ సీట్లకు కాంగ్రెస్ లో ఎంత డిమాండ్ ఉన్నా.. వాటిలో ఖమ్మం లోక్‌సభ స్థానం సెపరేట్. అది  చాలా హాట్ సీట్ అన్న సంగతి   తెలిసిందే. ఈ స్థానం కోసం జిల్లాలోని కీలక నేతలు ఎవరికి వారు పోటీ పడి మరీ తమ వంతు  ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినిని ఇక్కడ నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు హస్తిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇదే ఎంపీ టికెట్ ఇప్పించి.. గెలిపించుకోనేందుకు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం.  అలాంటి వేళ.. అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకుంటే... ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ చర్చ పార్టీలో సీరియస్‌గా నడుస్తోండగా.. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో  మంత్రులగా కొనసాగుతున్నారు. అదీకాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఖమ్మం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తమ అనుకూలురుకే  టికెట్ కేటాయించేందుకు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధిష్టానం వద్ద చక్రం తిప్పారని.. దీంతో ఈ సారి ఖమ్మం ఎంపీ టికెట్ మరోకరికి కేటాయించాలని.. అందులోభాగంగా జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం.  ఇక జెట్టి కుసుమ కుమార్ విషయానికి గత 38 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్  పార్టీనే అంటిపెట్టుకొని ఉండడమే కాదు.. పార్టీలో వివిధ స్థాయిలో కీలకంగా పని చేశారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ ఒకానొక సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా కాంగ్రెస్ ను వీడకుండా ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. అలాగే ఖమ్మం లోక్‌సభ పరిధిలోని 7 స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేయడంలో   జెట్టి కుసుమ కుమార్ హస్తం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆయనకు ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీకి దింపాలని నిర్ణయించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    అదీకాక.. ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమ కుమార్‌ది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసానికి నేరుగా వెళ్లి.. వారిని కలిసి మాట్లాడగల చొరవ ఆయన సొంతం. ఇక గతంలో ఇదే ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ బరిలో దిగితే.. ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ లో  ఓ చర్చ  ఊపందుకొంది.   ఇంకోవైపు పార్టీలో ఖమ్మం ఎంపీ సీటుకు తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రేణుకా చౌదరికే ఆ  టికెట్ కేటాయిస్తారనే ఓ ప్రచారం రాజకీయ వర్గాలలో  వాడి వేడిగా నడిచింది. అయితే పార్టీ అధిష్ఠానం ఆమెను రాజ్యసభకు పంపిచడంతో తమకు లైన్ క్లియర్ అయిందంటూ అటు మల్లు భట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాలు చేసుకొంటూ. ఎవరికి వారు.. తమకే ఖమ్మం ఎంపీ టికెట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం జెట్టి కుసుమ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటన రద్దు 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మొత్తం ఆరు గ్యారెంటీల అమలు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి సిద్దమైంది.  మహలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా  200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రెండు గ్యారెంటీలను ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగా గాంధీ రానున్నారు. అయితే  ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభ వేదికగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని కాంగ్రెస్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కానీ అనివార్య కారణాలతో రేపటి ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్‌గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు గ్యారంటీలను పాక్షికంగా అమలు చేశారు. రేపు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నారు.

ఒకరి వెంట ఒకరు.. వైసీపీ నుంచి వలసల జోరు!

అధికార పార్టీ నుంచి వలసల జోరు చూస్తుంటే 1977లో మోరార్జీ సర్కార్ పతనానికి ముందు జనతా పార్టీ నుంచి ఎంపీలు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. చివరికి మొరార్జీ సర్కార్ పతనమైంది. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నది. వీరు కాక పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ వైసీపీకి గుడ్ బై చెబుతోంది. ఈ పరిస్థితి  ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదన్నట్లు తయారైంది. తాజాగా  పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ సోమవారం( ఫిబ్రవరి 26) వైసీపీకి రాంరాం చెప్పేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. వీరికి . లోకేష్ పార్టీ  కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు వల్లే  సాధ్యమన్న నమ్మకంతో తాము  తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్  రాష్ట్ర భవిష్యత్  కోసం టిడిపితో కలసి పనిచేసేందుకు వచ్చిన పార్థసారధి, భవకుమార్, చంద్రశేఖర్ తో  చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలుగుదేశంపార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయన్నారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన వారిలో పెనమలూరు నియోజకవర్గం నుండి వల్లభనేని సత్యనారాయణ(ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్), నెరుసు రాజ్యలక్ష్మీ(కంకిపాడు ఎంపీపీ) ధూళిపూడి కృష్ణకిషోర్(కంకిపాడు వైస్ ఎంపీపీ), రొండి కృష్ణా యాదవ్(జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్), మాడలి రామచంద్రారావు(మండల వైసీపీఅధ్యక్షుడు), లోయ ప్రసాద్(బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), లింగమనేని సత్యవేణి(సీతారామపురం సర్పంచ్), పోలవరపు బొబ్బి(తాడిగడప మాజీ ఎంపీటీసీ), పార్టీ నేతలు కొలుసు పోతురాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, కొడాలి రవి, మండవ ప్రగతి, నలి మాధవ్, దుద్దుకూరి వెంకటకృష్ణారావు, బోడపాడు శంకర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తుపాకుల మహేష్ (వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి), పుప్పాల వెంకటసుబ్బారావు (సీనియర్ నాయకులు), మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్ యార్డు డైరక్టర్), చెన్ను సురేష్ (విజయవాడ నగర వైసిపి యూత్ జనరల్ సెక్రటరీ), ఇజ్జడ ప్రదీప్ (సిటీ వైసిపి పబ్లిసిటీ విభాగం కార్యదర్శి),ఉప్పులేటి అనిత (నగర వైసిపి లీగల్ సెల్ విభాగం కార్యదర్శి), పొలిమెట్ల డానియేల్ (అఖిలభారత క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్), నర్రా అరుణ్ బాబు (వైసిపి సిటీ యువజనవిభాగం కార్యదర్శి), సోనా సునీత, సోనా జయకుమార్, సోనా రాజేశ్వరి, కురుముల రాజా, షేక్ నాగూర్ తదితరులు ఉన్నారు. 

రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ గౌరవ అర్చకుడు రమణ దీక్షితులుపై వేటు వేసింది. జగన్ హయంలో తిరుమల పవిత్రత దెబ్బ తిందన్న అర్ధం వచ్చేలా రమణ దీక్షితులు ఇటీవల చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయన  ఆలయ గౌరవ అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది. ఆలయ ఈవో ధర్మారెడ్డి మతం పై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం అభిప్రాయపడింది. దీంతో ఆయనను ఆలయ గౌరవ అర్చక పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ భూమన వెల్లడించారు.