ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి క్రిందపడ్డ కారు  .. ఇద్దరు మృతి 

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణిస్తున్న ఓ కారు నార్సింగి సమీపంలో అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

అభివృద్ధీ, సంక్షేమం రెండూ డొల్లే.. బాబు సవాల్ తో బయటపడ్డ జగన్ నిర్వాకం!

చంద్రబాబు సవాల్ తో వైసీపీ గొప్పల డొల్ల తనం బయటపడిపోయింది.  ఏపీ సీఎం జగన్ పాలనపై  తెలుగుదేశం అధినేత చంద్రబాబు   ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందనీ, రెక్కలు విరిగిన ఫ్యాన్ ను స్క్రాప్ లో పడేయడానికి జనం రెడీ అయిపోయారనీ పేర్కొన్నారు.  జగన్‌ది విధ్వంసక పాలన అని ఫైర్ అయిన చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.   బాదుడే బాదుడు  పాలనతో ప్రజల రక్తం పీల్చేసి,   విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటూ  అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్న చంద్రబాబు..   బూటకపు ప్రసంగాలు కట్టిపెట్టి దమ్ముంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  ప్లేస్, టైం జగన్ నే డిసైడ్ చేసుకోమన్నారు.  ఎక్కడికి, ఎప్పుడు ర మ్మంటే అప్పుడు వస్తాననీ, దేనిమీదైనా చర్చకు రెడీ అని చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ తో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. జరిగిన అభివృద్ధిని చూపలేక, చెప్పలేక, అరకొరగా అందించిన సంక్షేమాన్ని చూపించుకోలేక, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చెప్పుకుని ఇప్పుడు అమలు కాని హామీల చిట్టాపై ఏ ముఖం పెట్టుకు మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ గంగవెర్రులెత్తిపోతున్నది.  దీంతో చంద్రబాబు సవాల్ ను తిరస్కరించేందుకు కారణాలను వెతుక్కుంటోంది. హామీలు ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై లాజిక్ కూడా అందకుండా అడ్డదిడ్డమైన జవాబులు ఇచ్చేయడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన సజ్జల జగన్ తరఫున రంగం మీదకు వచ్చేశారు. జగన్ వంటి గొప్పనాయకుడికి చంద్రబాబుతో బహిరంగ చర్చకు రావలసిన అవసరం లేదని వాక్రుచ్చారు. అంతేనా ఇచ్చిన హామీలలో 99శాతానికి పైగా అమలు చేశామని చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అన్ని వాగ్దానాలనూ తుంగలోకి తొక్కారనీ, అయితే జగన్ మాత్రం అలా కాకుండా నెరవేర్చలేని వాగ్దానాలపై వివరణ ఇచ్చుకున్నారనీ భాష్యం చెప్పారు. అంటే ఆయన చెప్పిందెలా ఉందంటే.. వాగ్దానాల అమలు వైఫల్యాలను అంగీకరించడమే అమలు చేయడమన్నట్లుగా ఉంది. జగన్ గత ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం, అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు వంటి ఎన్నో ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు చెబుతున్నట్లు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చారా అంటే లేదని చెప్పేశాంగా అంటే నెరవేర్చేసినట్లే అని సజ్జల అంటున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్నీ, అడ్డగోలు పాలనను ఇలాగే సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ కూడా అదే పని చేస్తున్నారు. మద్య నిషేధం జగన్ కన్న కల అని అది సాకారం అయ్యే అవకాశం లేదనీ చెప్పకనే చెప్పిన సజ్జల ఇప్పుడు వచ్చే పాతికేళ్ల వరకూ మద్యం విక్రయాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ సంక్షేమం కోసం నిధులు సమకూర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగే జగన్ కు అవగాహన లేకపోవడం వల్లే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారనీ, అవగాహన వచ్చిన తరువాత సిపీఎస్ రద్దు అసంబద్ధమని  తేలడంతో రద్దు చేయడం లేదనీ చెబుతున్నారు.  అసలు వాస్తవమేమిటంటే.. జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలలో ఎనభై శాతానికి పైగా అమలు చేసేశామని ప్రకటించేసుకున్నారు. అంటే అప్పటి నుంచే హామీల అమలు కంటే అమలు చేసేశామన్న ప్రచారానికే పెద్ద పీట వేశారు. నిజానికి జగన్ ఇచ్చిన హామీలలో అమలు చేసినవి పది శాతం కూడా ఉండవు. కానీ గోబెల్స్ ప్రచారంతో జనాలను నమ్మించాలనీ, నమ్మించేయగలమన్న అతి విశ్వాసంతో తాము చెప్పిందే వేదమన్నట్లుగా ఇంత కాలం వ్యవహరిస్తూ వచ్చారు.      అయితే, ప్రతిపక్ష పార్టీలు, అసంతృప్త ప్రజలు జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని గణాంకాలతో సహా చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీ అన్నట్లుగా జగన్ ఎడా పెడా హామీలిచ్చేశారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలు ఇచ్చారని ప్రతిపక్షాలు లెక్క తేల్చారు. అయితే వాటిలో కేవలం పది శాతం మాత్రమే అమలయ్యాయని ఆధారాలతో సహా చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా  జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే వైసీపీ చెప్పుకుంటున్న అమలు చేసిన 99 శాతం హామీలు ఏమిటో  ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ వంటివి  అమలయ్యాయా అని నిలదీస్తున్నారు. అలా జగన్ అమలు చేయని హామీల జాబితా కొండవీటి చాంతాడంత ఉందని సోదాహరణంగా వివరిస్తున్నారు.  రాష్ట్రంలో మద్యం అంటే  స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ప్రస్తావించడమే దండుగ. రాష్ట్రంలో  ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు.  మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి అదీ ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు.  అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో , లక్షల్లో ఉన్నాయి. వీటితో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని చేసేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు సవాల్ చేసే సరికి బిక్కచచ్చిపోయి లాజిక్ కు అందని వాదనతో బహిరంగ చర్చకు నిరాకరిస్తూ ముఖం చాటేస్తున్నారు.  

మేడారం జాతర భక్తులకు  హెలికాప్టర్ సేవలు సిద్దం... అందుబాటులో రెండు ప్యాకేజీలు

మహా కుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. రేపటి నుంచి గిరిజన జాతర ప్రారంభం కానుండగా.., ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపట్టారు.. అటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారానికి చేరుకున్నారు.. ఆలయానికి చేరుకొని తులాభారంలో కూర్చొని ఎత్తు బంగారం సమర్పించారు. డెంగ్యూ జ్వరం బారిన పడ్డ  ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం చేరుకోలేకపోయారని సమాచారం.  మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.. మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో.. మేడారం కీకారణ్యంలో… ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి.. గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు  వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది..ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు.. హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా విఐపి దర్శనాన్ని పొందవచ్చు.. దీని ధర ఒక్కొక్కరికి రూ. 28,999.. హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. మరో రైడ్.. జాతర జరిగే ప్రాంతం మీదుగా  6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది.. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొద లయ్యే రైడ్‍ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది.దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌ లో సంప్రదించవచ్చు..

తెలంగాణ లోకసభ ఎన్నికల్లోనూ  హస్తం హవా    తాజా సర్వే వెల్లడి 

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రానున్న లోకసభ ఎన్నికల్లో కూడా విజయం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ కోలుకోలేక పోవచ్చు అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బిఆర్ ఎస్ చచ్చిన పాము అని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ఆ పాత్రను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతుంది. బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత అయిన కెసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి తన అసమర్ధతను చాటుకున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటబోతోందని పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలకు కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు... బీజేపీకి 2 నుంచి 4 పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది.  ఓట్ షేరింగ్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు 40 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు మహిళల్లో ఎక్కువ మద్దతు ఉందని తెలిపింది. 42 శాతం మహిళలు, 37 శాతం మంది పురుషులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం, అర్బన్ సెంటర్లలో 37 శాతం మంది కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం బాగుందని 34 శాతం మంది అభిప్రాయపడగా... పర్వాలేదని 33 శాతం మంది చెప్పారు. ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ తెలిపింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,600 శాంపిల్స్ సేకరించినట్టు వెల్లడించింది.

త్వరలో హైదరాబాద్‌ టు వైజాగ్‌ హై స్పీడ్ రైలు కారిడార్...4 గంటల్లోనే ప్రయాణం  

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది.ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది.మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్టు  సమాచారం.ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్‌) రూపొందించనున్నారు.దీని వల్ల రంగారెడ్డి,ఉమ్మడి నల్లగొండ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం కానుంది.హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం నల్గొండ, గుంటూరు మీదగా ఒక మార్గం, వరంగల్, ఖమ్మం మీదగా మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. రెండూ రద్దీగానే ఉంటాయి. వరంగల్ మార్గంలో ట్రాక్ గరిష్ట సామర్థ్యం 150 కిలోమీటర్లుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులను హైస్పీడ్ రైలు కారిడార్ ద్వారా అనుసంధానం చేయాలని భారత రైల్వే భావిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదగా విశాఖపట్నం, కర్నూలు నుంచి విజయవాడకు ఈ హైస్పీడ్ కారిడార్లు ఉండేలా రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది. 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించి ఇంజనీరింగ్, ట్రాఫిక్ అధ్యయనం కోసం రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. త్వరలోనే సంస్థను ఎంపిక చేయబోతున్నారు. హైస్పీడ్ రైలు ఏ మార్గంలో ఉంటే లాభదాయకంగా ఉంటుంది అనే విషయంలో ఈ సంస్థ 6 నెలల్లో నివేదిక అందజేస్తుంది. ఇది అందిన తర్వాతే అంచనా వ్యయం ఎంతనేది స్పష్టత వస్తుంది. ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు విజయవాడకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు కారిడార్ వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. దురంతో 10.30 గంటలు, వందే భారత్ 8.30 గంటల సమయంలో విశాఖకు చేరుకుంటున్నాయి. హైస్పీడ్ కారిడార్ కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.

ఏపీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం.. ఇదే కాంగ్రెస్ లక్ష్యం!

ఈ సారి న్నికలలో  ఎలాగైనా సరే ఏపీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది.  రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా కాంగ్రెస్ కనీసం బోణీ  కూడా కొట్టలేదు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. గత రెండు అసెంబ్లీలలోనూ జీరో స్థానాలతో  సరిపెట్టుకుంది. అయితే ఈ సారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాలుపెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.  టార్గెట్ 20 స్థానాలు అంటూ పట్టుదలగా అడుగులు వేస్తున్నది.  పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ లక్ష్యంతో రంగంలోకి దిగిపోయిన వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లి పనులలో ఒక వైపు బిజీగా ఉంటూనే.. రాష్ట్రమంతా ఇప్పటికే ఓ సారి సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పుడు కుమారుడి పెళ్లి వేడుక కూడా పూర్తి అయిపోవడంతో  ఇక అమె అవిశ్రాంతంగా ప్రచార పర్వంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా  దళిత-మైనారిటీ వర్గాల్లో ఆమెకు వస్తున్న మంచి స్పందన వస్తుండటంతో  కాంగ్రెస్  కేడర్ లో కూడా జోష్ పెరిగింది.  విభజన తర్వాత ఏపీలో.. ఉనికి మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ కు జవజీవాలు తీసుకువచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ పార్టీ హై కమాండ్ వదలడం లేదు.  ఏపీసీసీ అధ్యక్షురాలిగా  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిలారెడ్డికి బాధ్యతలు అప్పగగించడం కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అంటారు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి వరకూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత-మైనారిటీ లు వైసీపీకి మళ్లిపోయింది. షర్మిల పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న తరువాత ఆ ఓటు బ్యాంకు మళ్లీ కాంగ్రెస్ వైపు మరలే అవకాశాలున్నాయిని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది.  రాష్ట్ర విభజన తరువాత  స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ నేతలు  షర్మిల  పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న అనంతరం మళ్లీ చురుకుగా మారారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిల అందుకున్న తరువాత మీడియా  కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకింత ప్రాధాన్యత ఇస్తున్న వాతావరణం కనిపిస్తోంది.  ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపై షర్మిల విరుచుకుపడుతున్న తీరు జనాలను కూడా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సొంత అన్న, ఏపీ సీఎం జగన్ పై షర్మిల సూటిగా, నిర్మొహమాటంగా చేస్తున్న విమర్శలు ఇప్పటికే జగన్ పాలనపై విసుగెత్తి ఉన్న ప్రజలకు కనెక్ట్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై షర్మిల సీరియస్ గా దృష్టి సారించడంతో ఈ సారి ఆయా నియోజకవర్గాలలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో  అన్నకే కాదు, తనకూ సొంత జిల్లా అయిన కడపపై కూడా షర్మిల దృష్టి సారించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరును, ఆ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు మొత్తం అధికారాన్నంతా జగన్ ఉపయోగిస్తున్న వైనాన్ని ఎండగట్టేలో వివేకా కుమార్తె డాక్టర్ సునీతను కాంగ్రెస్ గూటికి చేర్చుకుని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేలా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో జగన్ కడప కోట బద్దలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతే కాకుండా  వైసీపీలోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కని వారికి ‘చేయి’ అందించి వైసీపీని దెబ్బకొట్టేందుకు కూడా షర్మిల నేతృత్వంలో వ్యూహ రచన జరుగుతోందని అంటున్నారు. అయితే షర్మిల ఏపీసీసీ పగ్గాలు అందుకున్న తరువాత కాంగ్రెస్ లో మునుపటి నిస్తేజం పోయి జోష్ కనిసిస్తున్నా.. షర్మిల ఒంటరి పోరు ఒక్కటే కాంగ్రెస్ ను లక్ష్యానికి చేరుకునేలా చేసే అవకాశం లేదన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ ఎన్నికల ప్రచారంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేందుకు రెడీ అయిపోయింది. ఒక వైపు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజస్కంధాల మీద ఉన్నప్పటికీ రేవంత్ కూడా సాటి తెలుగురాష్ట్రమైన ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తన వంతు సహకారం అందించేందుకు సై అన్నారని అంటున్నారు.   రేవంత్ కు తోడు వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కెవిపిరామచంద్రరావు కూడా షర్మిలకు అండదండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన సారథ్యంలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక మొదలైంది.  ఏపీలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాలలో బలాబలాలు, సామాజిక సమీకరణాలపై సంపూర్ణ అవగాహన ఉన్న కెవిపి తన అనుభవాన్నంతా రంగరించి కాంగ్రెస్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే.. ఆ మేరకు వైసీపీ కుదేలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద దాదాపు పదేళ్ల తరువాత ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తున్నాయన్నది మాత్రం వాస్తవమని సామాన్య జనం కూడా అంగీకరిస్తున్నారు. 

విడదల రజనీకి మళ్లీ స్థాన భ్రంశం? మళ్లీ మార్పులు.. జగన్ తీరుతో వైసీపీ నేతలకు తలనొప్పులు!

ఎన్నికల వేళ రాజ‌కీయాల్లో స‌ర్వేల హ‌వా న‌డుస్తోంది.. స‌ర్వేల్లో గెలుస్తార‌ని తేలిన వారికే అధిష్టానాలు సీట్లు కేటాయిస్తున్నాయి.. ముఖ్యంగా వైసీపీ అధినేత  సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూర్తిగా స‌ర్వేల‌పైనే ఆధార‌ప‌డ్డారు. స‌ర్వేల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేలితే ఎంత‌టి స్థాయి నేత‌కైనా టికెట్ ఇవ్వ‌డం లేదు. నిర్ధాక్ష‌ణ్యంగా వారిని ప‌క్కన పెట్టేస్తున్నారు.. తెలివైన రాజ‌కీయ నేత‌, ప్ర‌జ‌ల నాడి తెలిసిన రాజ‌కీయ నేత ఎవ‌రైనా పూర్తిస్థాయిలో స‌ర్వేల‌పై ఆధార‌ప‌డ‌రు. నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల కుటుంబం కీర్తి ప్ర‌తిష్ట‌లు, వారు ప్ర‌జ‌ల‌కు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు, ప్ర‌జ‌ల్లో వారికిఉన్న ప‌లుకుబ‌డి.  వీటినికూడా పరిగణనలోనికి తీసుకునే  అధినేత‌లు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స‌ర్వేల్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైన అంశాల‌ను స‌ద‌రు అభ్య‌ర్థుల‌కు తెలియ‌జేసి వాటిని స‌రిచేసుకొనేలా జాగ్ర‌త్త‌లు సూచిస్తారు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. స‌ర్వేల్లో ఏది తేలితే దాని ప్ర‌కారమే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ముందుకెళ్తున్నారు. దీంతో అభ్య‌ర్థుల ఎంపికలో ఆయ‌న‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ఏడు ద‌ఫాలుగా జాబితాలు  విడుద‌ల చేసి నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జుల‌ను కేటాయించిన జ‌గ‌న్‌,  తాజాగా నిర్వ‌హించిన‌ స‌ర్వేల పేరుతో మ‌ళ్లీ వారిలో కొంద‌రి విషయంలో  మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో జ‌గ‌న్ కు ఏమైనా అయిందా.. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీలో  త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అధికార‌, విప‌క్ష పార్టీలు వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. నేల విడిచి సాము చేస్తున్నారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాల‌న‌లో  అభివృద్ధి ఆనవాలే కనిపించకపోవడంతో  ఎమ్మెల్యేల‌పై తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త వ్యక్తమౌతోంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా స‌ర్వేల ఫ‌లితాల‌ ప్ర‌కారం సిట్టింగ్ ల‌ను తొల‌గించాలన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇప్ప‌టికే ఏడు విడుత‌లుగా జాబితాలు విడుదల చేసి 65 అసెంబ్లీ, ప‌ద‌హారు లోక్‌స‌భ సీట్ల‌కు కొత్త అభ్యర్థులను ప్రకటించారు.  వీరిలో కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు నిరాక‌రించ‌గా.. మ‌రికొంద‌రికి నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చేశారు. దీంతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌గా ఇంచార్జులుగా నియ‌మితులైన వారికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో షాక్ ఇవ్వ‌బోతున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది.  మ‌ళ్లీ కొత్త‌గా వ‌చ్చిన స‌ర్వేల ఆధారంగా ప‌లువురు ఇంచార్జుల‌ను తొల‌గించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ట‌.  పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జోగి ర‌మేష్ ను పెనమ‌లూరు వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు.  మ‌రోవైపు మైల‌వ‌రం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ను మార్చేసి తిరుప‌తిరావుకు ఇంచార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వీరిద్ద‌రి సీట్ల‌ను మ‌ళ్లీ మార్పుచేసే అవ‌కాశం ఉన్న‌ట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని మైల‌వ‌రం నుంచి బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపిస్తార‌ని కూడా వైసీపీ శ్రేణుల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది. దీనికితోడు గుంటూరు పార్ల‌మెంట్ ఇంఛార్జి ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను కూడా మార్చేయనున్నారని అంటున్నారు. లోక్ సభ కు పోటీ చేయడానికి ఆయన ససేమిరా అంటుండటంతో మార్పు తప్పడం లేదని అంటున్నారు. ఉమ్మారెడ్డి వెంకటరమణను గుంటూరు వెస్ట్ కు  పంపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే విడుద‌ల ర‌జ‌నీ మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. అంటే ఇప్పుడు విడదల రజనీకి కూడా మరోసారి స్థాన భ్రంశం తప్పదని అర్ధమౌతోంది. వీటికితోడు మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నూత‌నంగా నియ‌మించిన ఇంచార్జుల‌ను తాజా స‌ర్వేల ప్ర‌కారం మ‌ళ్లీ మార్చేసేందుకు  జ‌గ‌న్ సిద్ధ‌మయ్యారని పార్టీ వర్గాల సమాచారం. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా టికెట్ల కేటాయింపు విష‌యంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు వైసీపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో నియ‌మించిన ఇంచార్జుల‌ను తాజా స‌ర్వేల పేరుతో మ‌ళ్లీ మార్పులు చేసేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతుండ‌టంతో ఎప్పుడు ఎవ‌రి సీటు ఊడిపోతుందోన‌న్న ఆందోళ‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్నారు. ఇప్ప‌టికే కొత్త‌గా నియ‌మితులైన ఇంచార్జులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాలలో తమ త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభించారు.  గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ మార్పులు చేర్పులు జ‌రుగుతాయ‌ని అధిష్టానం నుంచి సంకేతాలు వ‌స్తుండ‌టంతో స‌ద‌రు వైసీపీ నేత‌ల‌కు ఏం చేయాలో తెలియ‌ని అయోమయ ప‌రిస్థితిలో పడ్డారు. మొత్తానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వెంటాడుతున్న ఓట‌మి భ‌యం.. వైసీపీ నేత‌ల‌ను ముప్పులు తిప్ప‌లు పెడుతుంద‌న్న టాక్ ఏపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పులి, సింహం కాదు.. పిల్లి! బాబు సవాల్ తో తాడేపల్లి ప్యాలెస్ గజగజ!

మా జ‌గ‌న‌న్న పులి, సింహం.. ద‌మ్ము ధైర్యం క‌లిగిన నాయుడు.. అలాంటి నాయ‌కుడు మా అధినేత కావ‌డం మాకు  గ‌ర్వ‌కార‌ణం.. అంటూ.. ఇన్నాళ్లు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తెగ గొప్పలు చెప్పుకున్నారు. కానీ  ప్ర‌స్తుతం వారు  జ‌గ‌న్  నిజ‌స్వ‌రూపం తెలిసి జ‌గ‌న‌న్నా మా ప‌రువు తీశావు క‌ద‌య్యా అంటూ గ‌గ్గోలు పెడుతున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు విసిరిన చాలెంజ్ కు జ‌గ‌న్ శిబిరం బెంబేలెత్తిపోయింది.. ఒక విధంగా చెప్పాలంటే తాడేప‌ల్లి ప్యాలెస్ గ‌డ‌గ‌డ‌లాడింది. ఇదేమీ తెలియ‌ని వైసీపీ  కార్య‌క‌ర్త‌లు.. మా జ‌గ‌న‌న్న ధీరుడు శూరుడు చంద్ర‌బాబు చాలెంజ్ ను స్వీక‌రిస్తాడ‌ని భావించారు. తీరా.. స‌జ్జ‌ల మీడియా ముందుకొచ్చి మేం స‌వాల్ ను స్వీక‌రించం అంటూ చేతులెత్తేశారు. దీంతో  చొక్కా చేతులు మొడ‌త‌పెట్టాల్సిన  వైసీపీ కార్య‌క‌ర్త‌లు. గ్రామాల్లో తల వంచుకొని తిర‌గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. జ‌గ‌న‌న్న ఎందుకింత ప‌నిచేశాడు..! చంద్ర‌బాబు స‌వాల్ ను స్వీక‌రిస్తే బాగుండేది క‌దా. అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు. వాళ్ల‌కు తెలియాల్సిన అస‌లు విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ చాలెంజ్‌ను స్వీక‌రించ‌డానికే  నాలుగున్న‌రేళ్ల‌లో ఏమైనా అభివృద్ధి చేస్తేక‌దా..! ఏపీలో త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ అధినేత‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌డ‌రానిపాట్లు ప‌డుతున్నారు. ప్లీజ్ ఒక్క‌సారి అధికారం ఇవ్వండి అంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను బ్ర‌తిమాలి, సానుభూతితో మోసం చేసి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. నాలుగున్న‌రేళ్ల కాలంలో ఏపీ ప్ర‌జ‌లు గ‌ర్వంగా చెప్పుకునేలా ఒక్కటంటే ఒక్క ప‌నికూడా చేయ‌లేదు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ, త‌ప్పుడు కేసుల‌తో వాళ్ల‌ను జైలుకు పంపించ‌డ‌మే ప‌నిగా జగన్ నాలుగున్న‌రేళ్ల పాల‌న సాగింది. దీనికితోడు జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏఒక్క హామీని పూర్తిస్థాయిలో నెర‌వేర్చ‌లేదు. దీంతో చంద్ర‌బాబు స‌వాల్ ను స్వీరించేందుకు జ‌గ‌న్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేకపోయారు. పైగా, స‌జ్జ‌ల మీడియా ముందుకొచ్చి.. మా నేత గొప్ప‌నేత‌.. జాతీయ స్థాయిలో ప‌లుకుబ‌డి క‌లిగిన నేత అన్న‌ట్లుగా జ‌గ‌న్ కు ఛాలెంజ్ విసిరే అర్హ‌త చంద్ర‌బాబుకు లేదంటూ పేర్కొన‌డం వైసీపీ శ్రేణుల‌ను కూడా విస్మ‌యానికి గురిచేసింది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధం స‌భ‌ల పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఆదివారం  (ఫిబ్రవరి 18)అనంత‌పురం జిల్లా రాప్తాడులో జ‌రిగిన సిద్ధం స‌భ‌లో జ‌గ‌న్   చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని విమ‌ర్శించారు..  దీంతో చంద్ర‌బాబు జ‌గ‌న్ కు స‌వాల్ చేశారు.. ద‌మ్ముంటే చ‌ర్చ‌కురా.. ఎవ‌రి పాల‌న‌లో అభివృద్ధి జ‌రిగింది.. ఎవ‌రి పాల‌న‌లో విధ్వంసం జ‌రిగిందో చ‌ర్చింద్దాం..  టైం నువ్వేచెప్పు.. ఏ టైంలోనైనా నేను చ‌ర్చ‌కు సిద్ధం.. జ‌గ‌న్ రెడ్డీ నువ్వు రెడీనా? అంటూ ఒక్క‌సారికాదు.. రెండు సార్లు చంద్ర‌బాబు స‌వాల్ చేశారు. దీంతో తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ణికిపోయింది. వెంట‌నే ఐప్యాక్ టీం, వైసీపీ ముఖ్య‌నేత‌ల‌ను పిలిపించుకొని జ‌గ‌న్ వారితో మంత‌నాలు జ‌రిపాడు.  చంద్ర‌బాబు స‌వాల్ స్వీక‌రించాలా? వ‌ద్దా? అనే విష‌యంపై అభిప్రాయాలు తీసుకున్నార‌ు. ఐప్యాక్ సిబ్బందితోపాటు వైసీపీ ముఖ్య‌నేత‌లుసైతం.. మ‌నం నాలుగేళ్ల‌లో ఏం అభివృద్ధి చేశామ‌ని స‌వాల్ ను స్వీక‌రిస్తాం అంటూ జ‌గ‌న్ ముందే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసినట్లు స‌మాచారం. దీంతో ప‌లు విధానాలుగా ఆలోచ‌న‌లు చేసిన అనంత‌రం.. జ‌గ‌న్ కు స‌వాల్ విసిరే స్థాయి చంద్ర‌బాబు లేదంటూ మీడియా ముందు చెప్పాల‌ని స‌జ్జ‌ల‌కు జ‌గ‌న్ సూచించారు. ఎప్ప‌టిలాగానే మీడియా ముందుకొచ్చిన స‌జ్జ‌ల.. అదీఇదీ కొద్దిసేపు చెప్పి చంద్ర‌బాబు స‌వాల్ ను మేం స్వీక‌రించం అంటూ చేతులెత్తేశారు.     టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగుతుండ‌టంతో వైసీపీ నేత‌ల్లో ఇప్ప‌టికే భ‌యం ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అసాధ్య‌మ‌న్న భావ‌న‌కు వారు వ‌చ్చేశారు. తాజాగా  చంద్ర‌బాబు స‌వాల్ ను జ‌గ‌న్ స్వీక‌రించ‌క‌పోవ‌టంతో విజయంపై ఏమూలో ఉన్న చిన్నపాటి ఆశకూడా ఆవిరైపోయిందని  వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు ఆవేద‌న చెందుతున్నారు. స‌భ‌ల్లో చొక్కాల చేతులు మ‌డ‌త పెట్టండి అని చెబుతున్న జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత స‌వాల్ ను స్వీక‌రించ‌క పోవ‌టం స్థానికంగా త‌మ‌ను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న‌ట్లు  వైసీపీ కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు.  ఇన్నాళ్లూ పులి, సింహం అంటూ జ‌గ‌న్ గురించి గొప్ప‌లు చెప్పుకున్నాం.. కానీ, తాడేప‌ల్లి ప్యాలెస్ లో ఉంది పులి, సింహం కాదు.. పిల్లి అని తేలిపోయింది.. ఇక ప్ర‌తిప‌క్షాల‌కు ఏమ‌ని స‌మాధానం చెప్పాగలం వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

అయ్యో పాపం కొడాలి నాని.. టికెట్ చింపేసిన జగన్?!

బూతులమంత్రిగా అనితర సాధ్యమైన ప్రఖ్యాతి పొందిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధినేత జగన్ గాలి తీసేశారా?  వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశారా అంటే నాని అనుచరులు ఔననే అంటున్నారు. నానికి పోటీగా జగన్ గుడివాడ నియోజకవర్గం నుంచి హన్మంతరావును రంగంలోకి దింపనున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నానికి జగన్ హ్యాండిచ్చేశారనీ, నియోజకవర్గంలో నానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న నివేదికలను చూపి, ఆయనకు టికెట్ నిరాకరించేందుకు రెడీ అయిపోయారనీ నాని అనుచరులే చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణంగా   గుడివాడ నియోజకవర్గంలో వెలసిన హన్మంతరావు ఫ్లెక్సీలను చూపుతున్నారు. ఐప్యాక్  సూచన మేరకు జగన్ కొడాలి నానిని పక్కన పెట్టేసి, హన్మంతరావును గుడివాడ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. హన్మంతరావు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.  జగన్ ఏపీ సీఎం అయిన తరువాత ఆయన కొడాలి నానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే నాని జగన్ కు వీర భక్త హనుమాన్ లాంటి వారు. జగన్ మెప్పుకోసం కొడాలి నాలి ముందు వెనుకలాలోచించకుండా  అసెంబ్లీలోనూ, బయటా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన భాషతో అత్యంత వివాదాస్పదుడిగా మారారు.    ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం  నాని  లక్ష్యంగా  ఎదురుదాడి చేస్తోంది. క్యాసినో నుంచి గుడివాడలో జరిగే దందాలను బయటపెడుతూ వస్తోంది.ఎట్టి పరిస్థితిలో నానిని అసెంబ్లీలో అడుగుపెట్ట నీయకూడదన్న లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.  అయితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న  చందంగా నాని ఎన్నికల బరిలోకి దిగకుండానే ఓడిపోయారు. వచ్చే  ఎన్నికలలో పోటీ చేసేందుకే చాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయనకు వీర విధేయుడిగా ఉంటూ.. ఆయన మొప్పు కోసం బూతుల నానిగా మారిపోయిన కొడాలి నానికి జగన్ టికెట్ చింపేయడం పార్టీ వర్గాలనే విస్మయ పరుస్తోంది.  నాని అభ్యర్థిగా ఉంటే గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయమన్న ఐప్యాక్ నివేదిక ప్రాతిపదికగా జగన్  కొడాలి నాని స్థానంలో మండలి హన్మంతరావును గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.    హఠాత్తుగా గుడివాడ నియోజకవర్గంలో మండలి హన్మంతరావు ఫ్లెక్సీలు వెలియడం వైసీపీ వర్గాలలో సంచలనం సృష్టించింది.  వాస్తవానికి జగన్ కు కొడాలి నాని వీరభక్త హనుమాన్ వంటి వాడైతే.. కొడాలి నానికి మండలి హన్మంతరావు అటువంటి వాడని నాని అనుచరులు చెబుతున్నారు. అయితే ఇటీవలే  మండలి హన్మంతరావు తాడేపల్లి ప్యాలెస్ పిలుపు మేరకు అక్కడకు వెళ్లి సీఎంవో అధికారులతో మాట్లాడి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో, ఏమైందో తెలియదు కానీ, సీఎంవో అధికారులతో భేటీ అనంతరం హన్మంతరావు ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతటా వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థగా హన్మంతరావు పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ పరిణామంలో కొడాలి నాని అనుచరులు భగ్గు మంటున్నారు. కొడాలి నానికి టికెట్ నిరాకరిస్తే.. జగన్ అయినా సరే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మొత్తం మీద సిట్టింగుల మార్పు అంటూ కొడాలి నాని సీటుకే జగన్ ఎసరు పెట్టారని అంటున్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా కొడాలి నానికి జగన్ ఇలానే ఝలక్ ఇచ్చారనీ చెబుతూ, అప్పట్లో నాని కొంత కాలం ప్రజలకు, పార్టీకి కూడా అందుబాటులో లేకుండా తన పశువుల పాకలో పడుకుని శూన్యంలోకి చూస్తూ గడిపేశారని అంటున్నారు. అప్పట్లో  పశువుల పాకలో పడుకుని నాని ఒంటరిగా శూన్యంలోకి చూస్తున్న ఫొటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు కూడా మరోసారి కొడాలి నానికి జగన్ అదును చూసి చేయిచ్చారనీ, వాడుకుని వదిలేయడంలో జగన్ ను మించిన వారు లేరని మరో సారి రుజువైందని అంటున్నారు. 

హస్తిన పర్యటన పొత్తు కోసమేనా కేసీఆర్!?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హస్తినకు వెడుతున్నారు.  ఈ వారంలోనే ఆయన హస్తిన పర్యటనకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన హస్తిన పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి అవుతుంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు ఆయన హస్తనయానానికి బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది.  ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయడం, మేడిగడ్డ కుంగుబాటుకు డిజైన్ లోపాలే కారణమని విస్ఫష్టంగా ప్రకటించడం, అలాగే కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం లోపాలను బట్టబయలు చేయడంతో ఆయన హస్తిన పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. చిక్కుల నుంచి బయటపడేందుకు, అలాగే లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో బీఆర్ఎస్  పొత్తు విషయంలో  విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లభించింది.   రాష్ట్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం, కాళేశ్వరం అవినీతి పుట్టగా అభివర్ణిస్తూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తూ,   ళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ఎవరినీ స్పేర్ చేసేది లేదంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొత్తుల విషయం చర్చించేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఉభయ తారకంగా పొత్తుల చర్చలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమకు అండగా నిలవాలని కూడా ఆయన బీజేపీ అధిష్ఠానాన్ని కోరే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలో అంటే ఈ వారంలోనే కేసీఆర్ హస్తినకు బయలుదేరనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హస్తినలో కేసీఆర్ ఎవరెవరితో చర్చిస్తారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల అప్పాయిట్ మెంట్ లు లభించాయా అన్న విషయంపై అయితే ఇప్పటి వరకూ స్పష్టత లేదు.  అయితే ఇటీవల ఒక సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీయేలోకి పాత మిత్రులే కాదు, కొత్త మిత్ురులు కూడా చేరనున్నయి అంటూ చేసిన ప్రకటన బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలకు బలం చేకూరుస్తోంది.   ఈ   నేపథ్యంలోనే  కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తు పొడుపునకే నని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణ బీజేపీలో మళ్లీ లుకలుకలు.. ఎన్నికల ముంగిట క్యాడర్ లో అయోమయం!

సార్వత్రిక ఎన్నికల ముంగిట తెలంగాణ బీజేపీలో మునుపెన్నడూ ఎరుగని గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ నాయకుల తీరు ఎవరికి వారే యమనా తీరే అన్నట్లుగా తయారైంది. ఒక వైపు ఈటల బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారన్న వార్తలు హల్ చ ల్ చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు,  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య విభేదాల వార్తలతో పార్టీ కేడర్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా కొందరు పార్టీ నేతలు కరపత్రాలు ముద్రించారు. గత కొంత కాలంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ సీనియర్లు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కరపత్రాలు ముద్రించి సంచలనానికి తెరలేపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ధర్మపురి అర్వింద్ కు పార్టీ టికెట్ ఇవ్వవద్దని అధిష్ఠానాన్ని కోరుతూ ముద్రితమైన ఆ పాంప్లెట్లు సోమవారం (ఫిబ్రవరి 19) దిపపత్రికలతో పాటు పంపిణీ  అయ్యాయి.  కళ్లకు చలవ కళ్లద్దాలు తీయడు, కారు దిగి ప్రజలతో మాట్లాడని ధర్మపురి నియంత, అహంకారి.. అటువంటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీగా వద్దు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.  కృష్ణమాచారి, పి.గంగాధర్, కే. శ్రీనివాస్, బి. రమేష్ పేర్లతో ముద్రితమైన ఈ కరపత్రాలు ఇప్పుడు నిజామాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం పార్టీ క్యాడర్ ను నిరాశా నిస్ఫృహలకు గురి చేసింది. కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సమావేశం బండి సంజయ్ సన్మాన సభ మాదిరిగా జరగడమే పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టింది. అప్పటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా ఉన్న బీజేపీ పరిస్థితి అక్కడ నుంచి వేగంగా దిగజారి పోయింది. చివరికి అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. అప్పట్లో పార్టీలో అంతర్గత విభేదాలకు తోడు బీఆర్ఎస్ తో లోపాయికారీ మైత్రి ఉందన్న ఆరోపణలు బలంగా రావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితి పునరావృతమౌతున్నది. పార్టీలో విభేదాలు భగ్గుమనడంతో పాటు..  కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినా మేడిగడ్డ పరిశీలనకు బీజేపీ డుమ్మా కొట్టడం, బీఆర్ఎస్ ఎన్డీయేలో చేరేందుకు బీజేపీ హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలలో బీజేపీ తెలంగాణలో మరోసారి చతికిలబడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరో వివాదంలో బండ్ల గణేష్..రేవంత్ సర్కారుకు తలనొప్పి 

సినిమా వాళ్లు రాజకీయాల్లో వస్తే ఆయా పార్టీల గ్లామర్ పెరుగుతుంది. కానీ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్  విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇటీవలె చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షపడింది. ఈ వివాదం మరువక ముందే  తాజాగా మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. ఫిలింనగర్ లో బండ్ల గణేష్ గత కొంత కాలంగా అద్దెకుంటున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని నౌహీరాషేక్ చెబుతున్నప్పటికీ బండ్ల గణేష్ ఖాలీ చేయడం లేదు. 11 నెలలరెంటల్ అగ్రిమెంట్ ను బండ్ల గణేష్ ఫోర్జరీ చేసినట్లు  నౌహీరా షేక్ చెబుతుంది. అద్దెకు ఒక పోర్షన్ ఇస్తే రెండో, మూడో ప్లోర్లు కూడా బండ్ల గణేష్ కబ్జా చేసినట్లు యజమాని చెబుతున్నారు. ఆమె వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని బండ్ల గణేష్ అరాచకాలు చేస్తున్నట్లు ఆమె మీడియా సమావేశంలో ఆరోపించింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, తీన్మార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. సినీ ఇండస్ట్రీలో అనేక ఫైనాన్షియర్లను మోసం చేసిన ఆరోపణలున్నాయి. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే భారీ చిత్రాల నిర్మాత స్థాయికి ఎదిగాడు. అంతలోనే అతని గ్రాఫ్ పడిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన బండ్ల గణేష్ నటనకు దూరమై సినీ నిర్మాతగా మారి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడంతో బండ్ల గణేష్ పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. వచ్చే లోకసభ ఎన్నికల నేపథ్యంలో తాను మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బాహాటంగానే ప్రకటించుకుని వార్తల్లోకెక్కారు. నౌహీరాషేక్ ఇంట్లో అద్దెకున్న బండ్ల గణేష్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి మరో వివాదానికి కారణమయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన నౌహీరాషేక్  బండ్ల గణేష్ మీద రాజకీయంగా దెబ్బతీయడానికి వ్యూహాలు రచిస్తోంది. ఆమె ఆషామాషీ మహిళ కాదు. అద్దెకు ఉంటున్న ఇంటినే ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఖాళీ చేయాలని చెప్పినందుకు తమపైనే దాడికి పాల్పడ్డారంటూ హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ నౌహీరా షేక్ సంచలన ఆరోపణలు చేశారు.రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని అద్దెకు ఇవ్వగా.. కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్‌ స్కెచ్‌ వేసాడని నౌహీర్ షేక్ ఆరోపించారు. తన ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం రావటంతో.. వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లగా తమపై రౌడీలతో దాడి చేయించారని తెలిపారు.మంచి మాటతో ఇళ్లు ఖాళీ చేయాలని అడిగితే.. తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని నౌహీరా షేక్ తెలిపారు. వాళ్లే తమపై దాడి చేసి.. తిరిగి తామే దౌర్జన్యం చేస్తున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తాము అక్కడ ఉండగానే.. పోలీసులు వచ్చి తమపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గంటల్లోని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని తెలిపారు. తనకు చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్‌ తమముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు నౌహీరా షేక్. ఈమె కూడ నొటోరియస్ క్రిమినల్. రేవంత్ సర్కారుకు తలనొప్పులు తేవడానికి ఆమె ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు అర్థమవుతుంది. బిఆర్ఎస్, బిజెపి, మజ్లిస్ పార్టీల సహకారం తీసుకునే యోచనలో నౌహీరాషేక్ ఆలోచన అని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

కాళేశ్వరం చాప్టర్ క్లోజ్? సాగునీటికి దిక్కేది?

ఆహా..ఓహో అంటూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం తన భుజాలను తానే చ రుచుకుంటూ గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టు డిజైన్ లోనే లోపం, నిర్మాణంలో అవకతవకలు, నాసిరకం పనులు కారణంగా అది ఒక పనికిరాని ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ చేసిన చేస్తున్న విమర్శలు వాస్తవమేనా అనిపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. బీటలు వారాయి. మేడిగడ్డలో ఇక నీరు నింపడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాళేశ్వరంలో భాగంగా ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజిల పరిస్ఖితి కూడా అంతేనని అంటున్నారు.  వీటి నాణ్యత, పటిష్టతపై  నిపుణులు తేల్చే వరకూ వాటిని పూర్తి చేయలేని, అలాగే కూల్చలేని పరిస్థితి ఏర్పడింది. అంటే కేవలం అలంకారప్రాయంగానే అంటూ నిరర్ధకంగానే ఆ ప్రాజెక్టులు మిగిలిపోనున్నాయి.  ప్రాజెక్టుల నాణ్యత, డిజైనింగ్ లపై వస్తున్న విమర్శలు, మేడిగడ్డ కుంగుబాటు కారణంగా తన ఇమేజికి వచ్చిన డ్యామేజినీ సమర్థించుకునే అవకాశం లేక మౌనముద్ర వహించారు. ఏదో నల్గొండ సభలో ఆవేశంగా, ఆగ్రహంగా మేడిగడ్డ సందర్శనకు వెళ్లి కాంగ్రెస్ నేతలు ఏం పీకుతారు అంటూ తన వాగ్ధాటిని ప్రదర్శించినా అది ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజీ చేసింది తప్ప మరో ప్రయోజనం లేకుండా పోయింది.  దేశానికే ఆదర్శం, రోల్ మోడల్, బీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు, కోటి ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధికి, సంకల్పానికీ నిదర్శనం అంటూ ఆ ప్రాజెక్టు ప్ురారంభం సమయంలో బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది.  ఇంజినీర్లకే కేసీఆర్ పాఠాలు చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు  ప్లానింగ్, డిజైనింగ్ అన్నీ ఆయనే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.  అయితే  ఒక్కటొక్కటిగా బ్యారేజీలోని లోపాలు బయటపడుతుండటంతో.. బీఆర్ఎస్ సమర్థించుకోలేక, లోపాలను కప్పిపుచ్చలేక పీకలోతు చిక్కుల్లో ఇరుక్కు పోయింది.   బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రాధానమైనదని గొప్పగా చెప్పుకుంది. ఆ ప్రధానమైన మేడిగడ్డే ఇప్పుడు ఎందుకూ పనికిరాని పరిస్థితికి చేరింది. నీటి నిల్వకు అవకాశం, ఆస్కారం లేకుండా మిగిలింది. దీంతో అన్నారం, సుందిళ్ల లకు నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.  అంటే కాళేశ్వరం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనాలను పెంచేసి నిర్మించిన మూడు ప్రాజెక్టులూ ఇప్పుడు నిరర్ధకంగా మారిపోయాయి.   మేడిగడ్డ పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ సర్కార్ పెద్ద రాద్ధాంతం చేస్తోంది. గతంలో ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఇలా జరగలేదా? కొత్త ప్రాజెక్టు అన్నాకా కొన్ని రిపేర్లు రావడం సహజం అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు చేసిన, చేస్తున్న ప్రకటనలు  ఆ పార్టీ ఇమేజ్ ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను మరింతగా పతనం చేస్తున్నాయి.   కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అయినా సరే ఆయన స్వయంగా స్వయంగా ఆయనా వెళ్లి పరిశీలించలేదు. అధికారులతో సమీక్షించనూ లేదు. సంఘటన జరిగిన వెంటనే అదో పెద్ద సమస్యే కాదంటూ అప్పటి మంత్రులు  కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. మరమ్మతుల విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం నుంచీ కానీ, అధికారుల నుంచి కానీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.   అన్నిటికీ మించి ప్రస్తుత పరిస్థితుల్లో  కాళేశ్వరం పూర్తిగా నిరుపయోగంగా మారిన నేపథ్యంలో  సాగు ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూ ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి మంత్రి ఉత్తమ్ అంటున్నారు. అయితే  కాళేశ్వరం నిరర్థకంగా మారడంతో వర్షాకాలంలో వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కాళేశ్వరం వైఫల్యమే పెద్ద మైనస్ గా మారనుంది.  

మేనల్లుడి పెళ్లికి జగన్ డుమ్మా.. మొహం చెల్లలేదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి.. సొంత చెల్లెలి కుమారుడు, అంటే మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టారు. ఆయన రాష్ట్రంలో మహిళలందరినీ అక్కచెల్లెమ్మలు అంటూ పిలుస్తుంటారు. కానీ సొంత చెల్లెల్లి కుమారుడి వివాహానికి మాత్రం హాజరు కాలేదు. సొంత మేనల్లుడి పెళ్లిలో సహజంగా హడావుడి అంతా మేనమామదే అయి ఉండాలి. కానీ ఎపీ సీఎం జగన్ మాత్రం సొంత మేనల్లుడి పెళ్లికే హాజరు కాలేదు. రాజస్థాన్ లో జరిగిన మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టిన జగన్ అనంతపురం జిల్లాలో సిద్ధం సభలో ప్రసంగించారు. ఆ సభకు జనాలను తరలించేందుకు ఆయన పార్టీ వారు పెద్ద ఎత్తున మద్యం, సొమ్ములూ పంచారు.  ఏపీ సీఎం జగన్ తన మేనల్లుడు-చెల్లి షర్మిల కొడుకయిన రాజారెడ్డి పెళ్లికి డుమ్మా కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. సామీ మేనల్లుడి పెళ్లికి పోలేదా? అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని సామీ నదికి పోలేదా అన్న డైలాగ్  స్ఫురించేలా తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే మావయ్య అన్న పిలుపు అన్న సాంగ్ కు షర్మిల కుమారుడి వివాహ వీడియోను అటాచ్ చేసి  సోషల్ మీడియాలో జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు.   సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా జగన్ సొంత మేనల్లుడి వివాహానికి గైర్హాజర్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్, షర్మిలను ఆదరించిన దివంగత వైఎస్ అభిమానులు కూడా జగన్ సొంత మేనల్లుడి వివాహానికి హాజరు కాకపోవడాన్ని తప్పు పడుతున్నారు.  బంధుత్వాన్ని  సైతం కాదనుకునేలా రాజకీయ కక్ష పెంచుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు.   జగన్ మేనల్లుడి వివాహ నిశ్చితార్థానికి హాజరైన సందర్భంలోనే ఆయన అక్కడ మెలిగిన తీరు, ఎప్పుడు వెళ్లిపోదామా అని చూసిన వైఖరిపైనే అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తన సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్థ వేడుక తరువాత షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సంగతి తెలసిందే. ఇక అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఆమెసై అనుచిత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఆమె పేరు ముందు వైఎస్ అన్న పేరును కూడా తీసేసి వైసీపీ సోషల్ మీడియా ఆమెపై దారుణంగా విమర్శల దాడులు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసి విమర్శల దాడులు చేయడం ఈ నాలుగున్నరేళ్లుగా వైసీపీ అనుసరిస్తున్న విధానమే అయినా.. సొంత చెల్లి విషయంలో జగన్ అంతే కక్ష పూరితంగా వ్యవహరించడంపై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.  మొత్తం మీద సొంత మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టి జగన్ తన ఇమేజీని మరింత డ్యామేజీ చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సిద్ధం స‌భలా? మ‌ద్యం స‌భ‌లా?

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.  త్వరలో  సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మరానికి తెర‌లేవ‌నున్న నేపథ్యంలో సిద్ధం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ‌ల‌కు జ‌నాన్ని త‌ర‌లించ‌డం వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌లకు త‌ల‌కుమించిన భారంగా మారింది. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో జ‌గ‌న్ నాలుగున్న‌రేళ్ల పాల‌న సాగింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అన్నివ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉండ‌టంతో వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న భ‌ల‌కు జ‌నాన్ని త‌ర‌లించ‌డం స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. గ్రామాల వారిగా వైసీపీ నేత‌లు టార్గెట్ లు పెట్టుకొని జ‌నాన్ని త‌ర‌లించాల్సి వ‌స్తోంది. ఇందు కోసం స‌భ‌ల‌కు జనాలను తీసుకురావడానికి వారికి  భారీ మొత్తంలో న‌జ‌రానాలు చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని స్థానిక వైసీపీ నేత‌లు అంతర్గత సంభాషణల్లో ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అనంత‌పురం జిల్లా  రాప్తాడులో జ‌రిగిన సిద్ధం స‌భ‌కు భారీగా జ‌నాన్ని త‌ర‌లించాల‌ని వారం రోజుల  కిందటే  వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసింది. రాయ‌ల‌సీమ జిల్లాల్లోని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌ల‌కు ఆ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జ‌గ‌న్ స‌భ అంటే జ‌నాలు స్వ‌త‌హాగా తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తార‌న్న‌ భ్ర‌మ‌ల్లో ఉన్న వైసీపీ నేత‌ల‌కు గ్రామాల్లోకి వెళ్తే కానీ అస‌లు విష‌యం బోధ‌పడలేదు. చాలా గ్రామాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం జ‌గ‌న్ స‌భ అంటే వ‌చ్చేది లేద‌ని తేల్చిచెప్ప‌డ‌తో వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వైసీపీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఒక‌వైపు.. స్థానికంగా పెల్లుబికుతున్న‌ ప్ర‌జా వ్య‌తిరేక‌త మ‌రోవైపు.. దీంతో బ‌లవంతంగా మ‌ద్యం, డ‌బ్బులు ఇచ్చి ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌త్యేక వాహ‌నాల్లో సిద్ధం స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించాల్సి వ‌చ్చింది. డ‌బ్బుకు, మ‌ద్యానికి లొంగ‌ని వారికి ప‌థ‌కాలు నిలిపివేస్తాం, పింఛ‌న్ ఆపేస్తాం అంటూ  బెదిరింపుల‌కు గురిచేసి స‌భ‌కు త‌ర‌లించిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తొలి రెండు సిద్ధం స‌భ‌ల‌కు అష్ట‌క‌ష్టాలుప‌డి వైసీపీ నేత‌లు, అధికారులు జ‌నాన్ని త‌ర‌లించినా.. జ‌గ‌న్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే స‌భ‌నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో జ‌గ‌న్ స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన‌ట్లు తెలిసింది. రాప్తాడు స‌భ‌లో అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వైసీపీ నేత‌లు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. బ‌స్సుల్లో త‌ర‌లిస్తున్న స‌మ‌యంలోనే జ‌నాల‌కు మ‌ద్యం బాటిళ్లు ఇవ్వ‌డంతోపాటు స్ట‌ఫ్ గా ఉడ‌క బెట్టిన గుడ్డు, బిర్యానీ ప్యాకెట్లను అంద‌జేశారు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్థానిక ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న లేకపోవడంతో ప‌క్క రాష్ట్రాల వారినికూడా డ‌బ్బులు, మ‌ద్యం అంద‌జేసి జ‌గ‌న్ సిద్ధం స‌భ‌కు త‌ర‌లించిన ప‌రిస్థితి.  రాప్తాడు ప‌రిస‌ర ప్రాంతాల్లోని మ‌ద్యం దుకాణాలు వైసీపీ శ్రేణుల‌తో కిక్కిరిసిపోయాయి. ఇంత‌ చేసినా ఈ స‌భ‌లోనూ జ‌గ‌న్ ప్రసంగం ప్రారంభ‌మైన కొద్ది నిమిషాల‌కే ప్ర‌జ‌ల స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం  సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జ‌గ‌న్ సిద్ధం స‌భ‌లు కాస్తా.. మ‌ద్యం స‌భలుగా మారిపోయాయ‌ని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.   తాజా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నూత‌నంగా నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిగా నియమితులైన వారు త‌మ విజయంపై నమ్మకం వదిలేసుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అవగతమౌతుంది.   ఏ గ్రామంలోకి వెళ్లినా సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచే నేత‌ల‌కు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మివైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్న‌ట్లు గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వ‌ర‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉండ‌టంతో వైసీపీకి ఈసారి క‌నీసం 20 నుంచి 30 సీట్లు వ‌చ్చినా గొప్పేన‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సిద్ధం స‌భ‌ల‌తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుదామ‌నుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం బెడిసికొట్టిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

కేసీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? బీజేపీ కాపాడుతుందా?

తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత రాజ‌కీయ ముఖచిత్రం మార‌బోతుందా?  సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో బీఆర్ ఎస్ అధినేత‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా? ఆయ‌న జైలుకు  వెళ్లే అవ‌కాశాలున్నాయా? మ‌రి కేసీఆర్ ను కాపాడేదెవ‌రు..?  రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంత‌కీ.. ఉన్న‌ట్లుండి ఈ ప్ర‌శ్న‌లు  ఉత్ప‌న్న‌ం కావడానికి  కార‌ణం కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని అధికారంలోకి రాక‌ముందు నుంచే  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌న దృష్టిని కేంద్రీక‌రించారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాలు ఫాలో అయిన‌వారికి ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో కాళేశ్వ‌రం, దాని ప‌రిధిలోని మేడిగ‌డ్డ, త‌దిత‌ర బ్యారేజీల‌పై చ‌ర్చ‌పెట్టిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ను కార్న‌ర్ చేసింది.  తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో 1.81ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మించిన‌  ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌న్నీ ప్ర‌మాదంలో ఉన్నాయి. వీటిలో ఇప్ప‌టికే మేడిగ‌డ్డ తీవ్రంగా దెబ్బ‌తింద‌ని, మ‌రో రెండు బ్యారేజీలు ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని, దీనికి కార‌ణం అవినీతికి పాల్ప‌డి నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించ‌క పోవ‌టంమేన‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రంలో పేర్కొంది. మొత్తానికి కాగ్  నివేదిక, విజిలెన్స్ రిపోర్టు, కృష్ణా ప్రాజెక్టుల ప‌రంగా తెలంగాణ‌కు గ‌త ప్ర‌భుత్వం ఎలా అన్యాయం చేసింద‌నే విష‌యాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రంలో వివ‌రించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ప్రాజెక్టుల్లో అవినీతిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపిస్తామ‌ని, బాధ్య‌తల‌పై క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అసెంబ్లీలో  ప్రకటించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే  ఓ క్లారిటీ వ‌చ్చార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచార‌ణ అనంత‌రం పూర్తిస్థాయి నివేదిక‌ల ఆధారంగా గ‌త పాల‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇదే జ‌రిగితే సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.   పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవినీతిపై సీఎం రేవంత్  మరింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో మాజీ సీఎం కేసీఆర్ పై చ‌ర్య‌లు తీసుకుంటే ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంద‌ని, త‌ద్వారా ఎన్నిక‌ల స‌మయంలో బీఆర్ ఎస్ కు ఏదో ఒక మేరకు మేలు జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఎన్నిక‌ల త‌రువాత  కేసీఆర్ తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవినీతిలో భాగ‌స్వాములుగా ఉన్న‌వారిపైనా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ కు మెరుగైన ఫ‌లితాలు రాకుంటే కేసీఆర్ జైలుకు   వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే  రేవంత్ రెడ్డి నుంచి ముంచుకొచ్చే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌, బీఆర్ ఎస్ నేత‌లు బీజేపీవైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందే బీజేపీతో చెలిమి మొద‌లు పెడితే కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పొచ్చ‌ని కేసీఆర్  భావిస్తున్నార‌ని స‌మాచారం.  బీజేపీతో ఇన్నాళ్లు ఢీఅంటే ఢీ అన్న మాజీ సీఎం కేసీఆర్‌.. బీజేపీతో స్నేహాన్ని కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు బీఆర్ ఎస్ వ‌ర్గాల స‌మాచారం. అయితే, రాష్ట్రం, ఢిల్లీ స్థాయిలోని కాషాయ పార్టీ నేత‌లు బీఆర్ ఎస్ తో పొత్తుకు నో చెప్పేస్తున్నారు. అమిత్ షా, జేపీన‌డ్డాలు మాత్రం ఆలోచిద్దామ‌ని పేర్కొన్న‌ట్లు తెలిసింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ‌తో మాజీ సీఎం కేసీఆర్‌, ఆయ‌న అనుచ‌రుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగితే.. సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

గుంటూరు లోక్ సభ ..తెలుగుదేశం హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసేసిన పెమ్మసాని!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు ప్ర‌త్యేక స్థానం ఉంది.. రాష్ట్రంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా త‌రువాత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా పెద్ద జిల్లా గుంటూరు జిల్లానే. ఈ జిల్లాలో రాజ‌కీయ ఉద్దండులుగా పేరున్న నేత‌లు అనేక మంది ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ, తెలుగుదేశం మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగినా.. తెలుగేదేశంకు జిల్లాలో  బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఒక‌టిరెండు ఎన్నిక‌లు మిన‌హా.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.   రెండు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించాయి. రాష్ట్రం విడిపోయిన  త‌రువాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ గుంటూరు నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా గ‌ల్లా జ‌య‌దేవ్ బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. దీంతో గుంటూరు పార్ల‌మెంట్ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డం ద్వారా హ్యాట్రిక్ విజ‌యం సాధించాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో.. స్థానిక‌ంగా ప్ర‌జ‌ల్లో మంచిపేరున్న వ్య‌క్తిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎంపిక చేసిన‌ట్లు తెలిసింది. ఆయ‌నే బుర్రిపాలెం వాస్త‌వ్యుడు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. సూప‌ర్‌స్టార్ దివంగ‌త‌ కృష్ణ గ్రామ‌మైన బుర్రిపాలెంకు చెందిన డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు  ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. నిజానికి ఆయ‌న ఎన్ఆర్ ఐ అయిన‌ప్ప‌టికీ.. కొన్నేళ్లుగా స్థానికంగా ఉంటూ ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నమ‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈద‌ఫా ఎన్నిక‌ల్లో తెలుగుదేశం - జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిగా ఆయ‌న గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రిని క‌లుపుకొని పోయే మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తి  పెమ్మ‌సాని. దీంతో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోని కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి నేత‌ల వ‌ర‌కు పెమ్మ‌సాని అంటే మంచి ఆద‌ర‌ణ చూపుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. ప్ర‌జాసేవ‌లో ఇద్ద‌రి భావ‌జాలం ఒక్క‌టే కావ‌డంతో వీరి మ‌ధ్య స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ప‌వ‌న్ తో స‌మావేశం త‌రువాత పెమ్మ‌సాని మాట్లాడుతూ..  స‌మాజ సేవ ఒక మ‌నిషికి అత్యంత తృప్తిని ఇస్తుంద‌ని మాట్లాడుకోవ‌టం జ‌రిగింద‌ని, ప‌వ‌న్ తో మాట్లాడుతున్న‌సేపు న‌న్ను నాకే ప‌రిచ‌యం చేసిన‌ట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గుంటూరు పార్ల‌మెంట్ నుంచి పెమ్మ‌సాని విజ‌యం న‌ల్లేరుపై న‌డేకేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశానికి కంచుకోట కావ‌డం..  జ‌న‌సేన కూడా తోడ‌వ‌డంతో పెమ్మసాని విజయం నల్లేరు మీద బండి నడకేనని అంటున్నారు.  దీంతో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేందుకు  ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరికోరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించారు. మాజీ కేంద్ర‌మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు కుమారుడే వెంక‌ట‌ర‌మ‌ణ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం వైపు చూడ‌క‌పోవ‌టంతో వైసీపీ శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొంది‌. వెంక‌ట‌ర‌మ‌ణ గుంటూరు పార్ల‌మెంట్ నుంచి బ‌రిలోకి దిగేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  ఆయన లోక్ సభ   అభ్య‌ర్థిగా కాకుండా ఏదోఒక అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగడానికి మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి  తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వెంక‌ట‌ర‌మ‌ణ అస‌లు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారా?  కొత్త‌వారు ఎవ‌రైనా వ‌స్తారా అని తేల్చుకోలేని ప‌రిస్థితుల్లో  వైసీపీ శ్రేణులు ఉన్న‌ాయి.  గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో వైసీపీలో నెల‌కొన్న గంద‌ర‌గోళంతో ఆపార్టీలోని కొంద‌రు నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్  తెలుగుదేశం అభ్య‌ర్థిగా దాదాపు ఖాయం కావ‌డంతో వైసీపీలోని అంస‌తృప్త నేత‌లు పెమ్మసానికి జై కొట్టేందుకు  తెలుగుదేశం పార్టీలో  చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. దీనికితోడు జ‌న‌సైనికులు సైతం ఈ ఎన్నిక‌ల్లో తోడ‌వుతున్నారు. పెమ్మ‌సాని అభ్య‌ర్థిత్వం దాదాపు ఖాయంకావ‌డంతో వైసీపీలోని కొంద‌రు నేత‌లు టీడీపీవైపు చూస్తున్నారు. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి టీడీపీ హ్యాట్రిక్ విజ‌యం ఖాయ‌మైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.