ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ కష్టమే!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ప‌రాభవం త‌ప్ప‌ద‌ని ప‌లు స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్‌ల‌ను మార్చారు. వీరిలో కొంద‌రికి వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం క‌ల్పించ‌గా.. మ‌రికొంద‌రిని ప‌క్క‌న పెట్టారు. ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ విజ‌యం సాధించింది. ఈసారి అత్య‌ధిక స్థానాల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేల ఫ‌లితాలు ప్ర‌కాశం ఉమ్మ‌డి జిల్లాలో తెలుగుదేశం, జ‌న‌సేన హ‌వా  ఖాయమని పేర్కొన్నాయి. ఈ జిల్లాలో తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  ఇక నియోజకవర్గాల వారీగా పరిస్ధితులను పరిశీలిస్తే..

గిద్ద‌లూరు.. 

గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక పెల్లుబుకుతుండ‌టంతో వైసీపీ అధిష్టానం అన్నారాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి మార్చేసింది.  అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే  కందూరు నాగార్జున రెడ్డిని గిద్ద‌లూరుకు పంపింది. కందూరుకు రాంబాబు వ‌ర్గీయులు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కందూరు ఓట‌మికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విడుదల చేసిన తొలి జాబితాలో  ఈ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిని కేటాయించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నుంచి ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతుంది. 

మార్కాపురం.. 

మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గానికి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే  అన్నా రాంబాబును వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది..  గత ఎన్నికలలో గిద్దలూరు   రాంబాబు విజ‌యం సాధించారు. వైసీపీ అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డికి మ‌రోసారి  అవ‌కాశం ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని తేలడంతో కందూరు నాగార్జున‌ను గిద్ద‌లూరు పంపించి.. రాంబాబును మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధిష్టానం బ‌రిలో నిలిపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో దిగేది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే    అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలో నిలిపిన విజ‌యం ఖాయ‌మ‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఎర్ర‌గొండ‌పాలెం.. 

ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ఆదిమూల‌పు సురేశ్ విజ‌యం సాధించారు. జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రిగానూ ప‌నిచేశారు. అయితే, ఆయనపై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆదిమూల‌పు సురేష్ ను త‌ప్పించి తాటిప‌త్రి చంద్ర‌శేఖ‌ర్ ను  వైసీపీ అదిష్టానం ఇక్కడ బరిలోకి దింపింది. ఈ ప‌రిణామాల‌తో సురేశ్ వ‌ర్గం  సంతృప్తితో ఉంది. బ‌హిరంగంగా బయటపడకపోయినా  చంద్ర‌శేఖ‌ర్ కు స‌హ‌క‌రించేది లేద‌ని సురేశ్ వ‌ర్గం అంతర్గత సంభాషణల్లో స్పష్టంగా చెబుతోందని  స‌మాచారం. దీనికితోడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా గూడూరి ఎల‌క్ష‌న్ బాబు మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకుతోపాటు, టీడీపీ, జ‌న‌సేన  శ్రేణుల అండతో  ఎలక్షన్ బాబు విజయం నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు.  

క‌నిగిరి..

క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బుర్రా మ‌ధుసుద‌న్ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయన్ని జగన్ పక్కన పెట్టేశారు.  యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో నేత‌ డి. నారాయ‌ణ యాద‌వ్ ను వైసీపీ అధిష్టానం బరిలోకి దింపింది. అయితే, నారాయ‌ణ యాద‌వ్ ను నియ‌మించ‌డంపై మ‌ధుసూద‌న్ యాద‌వ్ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో  ప్రజా వ్యతిరేకత వ్య‌తిరేక‌త నారాయ‌ణ యాద‌వ్  విజయానికి పెద్ద అవరోధం అని పరిశీలకులు చెబుతున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న విజ‌యం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒంగోలు.. 

ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే బ‌రిలోకి దిగ‌నున్నారు. బాలినేనిపై భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి కొంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థిగా మ‌రోసారి దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ రావు బ‌రిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలోనే దామచర్ల పేరు ప్రకటించారు. దీనిని బట్టే ఒంగోలులో దామచర్ల విజయంపై తెలుగుదేశం ఎంత ధీమాతో ఉందో అర్ధమౌతోంది. ప్ర‌భుత్వంపై ప్రజా వ్యతిరేక‌త‌, స్థానికంగా బాలినేనికి ఉన్న ప్రతికూలతలే దామచర్ల విజయానికి సోపానాలుగా పరిశీలకులు చెబుతున్నారు.  

కొండ‌పి.. 

కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. గ‌త రెండు ద‌ఫాలుగా అక్క‌డ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తోంది.  గ‌త ఎన్నిక‌ల్లో డోల బాల‌వీరాంజ‌నేయ స్వామి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఈ సారి కూడా తెలుగుదేశం కూట‌మి అభ్యర్థిగా కొండ‌పి నుంచి బాల వీరాంజ‌నేయ స్వామి పోటీ చేయనున్నారు. 2024 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా కొండపి నుంచి   ఆదిమూల‌పు సురేశ్ బ‌రిలోకి దిగ‌బోతున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే సురేశ్ ను కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట కావ‌డంతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా తోడ‌వుతుండ‌టం, జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఇలా అన్ని అంశాలు మ‌రోసారి తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యానికి దోహదం అవుతాయిని అంటున్నారు. 

ద‌ర్శి .. 

ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్  విజ‌యం సాధించారు. అయితే జగన్ ఆయన్న తప్పించి  బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా  నిలబెట్టింది. 2014లో బూచేపల్లి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీకి ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌న్న వాద‌న గట్టిగా వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా జ‌న‌సేన నేత‌ గ‌రిక‌పాటి వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉందని అంటున్నారు.  అదే జ‌రిగితే రెండు సామాజిక వ‌ర్గాల ఓట్ల‌తోపాటు, వైసీపీపై  ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మిలో కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ఉన్న‌ాయని  ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

సంతనూత‌ల‌పాడు..

సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి సుధాక‌ర్ బాబు విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం అత‌న్ని ప‌క్క‌నపెట్టి మంత్రి మేరుగ నాగార్జునను సంత‌నూత‌ల‌పాడు వైసీపీ ఇంచార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పార్టీలో  వ‌ర్గ‌విబేధాలు కొన‌సాగుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బి. విజ‌య్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. గ‌త రెండుసార్లు విజ‌య్ కుమార్ ఓడిపోవ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయన పట్ల సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని ప్రాంతాల్లో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువే. ఈ రెండు అంశాల‌కు తోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఈద‌ఫా విజ‌య్ కుమార్ విజ‌యానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.   

కందుకూరు.. 

కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి మ‌హిద‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టి  అర‌వింద యాద‌వ్ ను రంగంలోకి దింపింది. విద్యాసంస్థ‌ల అధినేత పెంచ‌ల‌య్య కుమార్తె అర‌వింద‌ యాద‌వ్‌  భ‌ర్త వెంక‌ట‌రంగ‌య్య బెంగ‌ళూరులో వ్యాపార‌వేత్త‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. అందుకే అర‌వింద‌ యాద‌వ్ ను వైసీపీ ఇంచార్జిగా నియ‌మించిన‌ట్లు స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఇంటూరు నాగేశ్వ‌ర‌రావుకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందంని అంటున్నప్పటికీ,   వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి  తెలుగుదేశంలో గూటికి చేరితే.. ఆయనకు సన్నిహితుడైన  మ‌హిద‌ర్ రెడ్డిని తెలుగుదేశం బరిలోకి దించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.  బ‌రిలోకి దిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. గ‌తంలో మ‌హిద‌ర్ రెడ్డికే క‌మ్మ స‌మాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తుగా నిలిచింది. ఈసారి ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు తెలుగుదేశం కూట‌మివైపు మ‌ళ్లే అవ‌కావం ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వం పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈనేప‌థ్యంలో ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సునాయాసం అని అంటున్నారు.

అద్దంకి.. 

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం అంటే గొట్టిపాటి ర‌వికుమార్ గుర్తుకొస్తారు. 2019లో  తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న విజ‌యం సాధించారు. మ‌రోసారి తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఆయనే  బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో అన్నివ‌ర్గాల నుంచి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జిగా హ‌నిమిరెడ్డిని పార్టీ అధిష్టానం నియ‌మించింది.  అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి గొట్టిపాటి ర‌వికుమార్ విజ‌యం సాధిస్తార‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

చీరాల.. 

చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న వైసీపీలో చేర‌డంతో చీరాల నుంచి వైసీపీ ఇంచార్జిగా క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు క‌రణం వెంక‌టేశ్ ను పార్టీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. తెలుగుదేశం కూట‌మి నుంచి చీరాల అభ్య‌ర్థిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి తెలుగుదేశం బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థే విజ‌యం సాధిస్తార‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. క‌ర‌ణం బ‌ల‌రాంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై కొంత వ్య‌రేకత‌ వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌రేక‌త ఉంది. మ‌రోవైపు తెలుగుదేశం ఓటు బ్యాంకుతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో చీరాల‌లో  తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు. 

ప‌రుచూరు.. 

ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏలూరి సాంబ‌శివ‌రావు గ‌త రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి ఇక్కడ నుంచి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చ ఇక్క‌డ ఏలూరి హ్యాట్రిక్ విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా య‌డం బాలాజీని జగన్ ఎంపిక చేశారు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా క‌మ్మ‌ సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఆ త‌రువాత కాపు సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌.  తెలుగుదేశం జనసేన క‌లిసి పోటీచేస్తున్న నేప‌థ్యంలో క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తుతోపాటు.. మిగిలిన సామాజిక వ‌ర్గాల్లోనూ ఏలూరి సాంబ‌శివ‌రావు అంటే అభిమానం ఉంది. ఈ క్ర‌మంలో ఏలూరి విజ‌యం లాంఛనమేనంటున్నారు.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.

2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

అందెశ్రీ కుటుంబానికి అండ!

ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు. 1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు. వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 4)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 5) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ బీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.