తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల విజయం

  తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 75 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పరిధిలోని మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి 692 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మోగించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు.

నేను మాత్రం సోనియాగాంధీ పటాన్ని తీసేయను.. డిఎస్

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే ఆపార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరుతున్నట్టు తెలియజేశారు కానీ ఎప్పుడు చేరతారో అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆయన ఈనెల 8 వ తేదీన తెరాసలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఆశించి తెరాసలో చేరలేదని తెలంగాణ అభివృద్ధికి పాటుపడదామని చేరానని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. అయితే గాంధీభవన్ లో ఫొటోలు తీసేసిన విషయంపై స్పందిస్తూ ఫొటోలు తీసేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. తను మాత్రం తన ఇంట్లో ఉన్న సోనియాగాంధీ పటాన్ని తీసేయనని స్పష్టం చేశారు.

కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురక

  రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు జైల్లోనే ఉంచుకున్నారు.. ఇంకా ఉంచుకొని ఏం చేస్తారు అని చెప్పి తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తరపు న్యాయవాదులలో ఒకరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.   రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి అతనిని దాదాపు నెల రోజుల నుండి జైలులోనే ఉంచారు.. నాలుగు రోజులు విచారణ జరిపారు.. అయినా బెయిల్ ఇవ్వడం సరికాదని అంటున్నారు.. కొన్ని కేసుల్లో నిందితుడు అరెస్ట్ అయిన ఒక్క రోజుకే బెయిల్ మంజూరు చేయాలని మీరు వాదించిన రోజులు లేవా అని సుప్రీంకోర్టు జడ్డి హెచ్.ఎల్. దత్తు కపిల్ ను ప్రశ్నించారు.   న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు కపిల్ ఖంగుతిన్నట్టు సమాచారం. అంతేకాక నిందితుడు నాలుగు రోజులు మీ కస్టడీలోనే ఉన్నాడు. అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినా నెల రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎందుకు అడుగుతున్నారు? మళ్లీ అతన్ని జైల్లో పెట్టడం ఎందుకు?' అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించే సరికి మిన్నకుండిపోయారట.

సండ్రకు మళ్లీ నోటీసులు

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా భావించి గతంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకటయ్యని విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విచారణకు పదిరోజులు గడువు తీసుకొని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పడంతో ఏసీబీ అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సండ్ర కూడా ఏసీబీకి లేఖ రాశాడు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని ఎప్పుడు విచారణకు రమ్మన్నా సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. అయితే టీ ఏసీబీ మళ్లీ ఇప్పుడు సండ్రకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు ఏసీబీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన ఏసిబి అధికారులు, సండ్ర వెంకటవీరయ్య ఇంటి వద్ద లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు.

కేకే, బొత్స ఫోటోలు ఉండటానికి వీల్లేదు.. వీహెచ్

ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతగా లేకపోయేసరికి ఆపార్టీలో నేతలంతా వేరే పార్టీలోకి వలసలు కట్టారు. ఇప్పటికే చాలామంది వేరే పార్టీల తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడుతున్నారు. పార్టీ లో ఉన్నంతకాలం పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండకుండా వేరే పార్టీలోకి మారడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గాంధీభవన్‌లోని కేకే, బొత్స ఫోటోలను తొలగించారు. కష్టకాలంలో పార్టీని వీడిన నేతల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి వీల్లేదని వీహెచ్‌ అన్నారు. మరో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా పార్టీ ఫిరాయించిన వాళ్లపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డిఎస్ కు చాలా చేసిందని.. అలాంటి డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడతారని అనుకోలేదని.. కానీ తాను కూడా పదవి మీద వ్యామోహంతో పార్టీ మారరని ఎద్దేవ చేశారు. అసలు తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని ఆయన బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని అనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నేతలు వీడినా.. కార్యకర్తలు ఉన్నారని.. నేతలను చూసి కార్యకర్తలు ఛీ కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.

జైల్లో రేవంత్ ను ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగిందా?

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయన అక్కడ ఏంచేశారు.. ఆయన ఆ సమయంలో కనీసం తెదేపా నేతలను కూడా కలవడానికి నిరాకరించారు.. కానీ జైల్లో ఉన్న రేవంత్ రెడ్డిని ప్రలోభ పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అన్న వార్తలు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురైనట్టు.. ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు భావిస్తున్నారు. తెదేపాను ఎలాగైనా దెబ్బతీయాలనే.. తెలంగాణలో తెదేపా లేకుండా చేయాలనే కుట్రతో ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించిన టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనే బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించి పార్టీ అధినేతను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నించింది. దీనిలో భాగంగానే జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని ఈ కేసు వ్యవహారంలో తెదేపా పార్టీ అధినేత పేరు చెప్పాలని.. అప్రూవర్ గా మారాలని.. అలా మారిన నేపథ్యంలో 300 కోట్ల తో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారని తెలుగు వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇదిగో చంద్రబాబు అరెస్ట్.. అదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ.. నోటీసులు జారీ చేస్తామంటూ తెగ సంబరిపడిపోతూ స్టేట్ మెంట్ లు ఇచ్చింది. కానీ వారిపప్పులేమి రేవంత్ రెడ్డి దగ్గర ఉడకలేదని.. తెదేపా పార్టీకి నమ్మినబంటు కాబట్టి.. అలాంటి తప్పుడు పనులు చేయనని ఖండిస్తూ గట్టిగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో టీ ప్రభుత్వం ఏం చేయాలో తెలీక వెనక్కి తగ్గిందని ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పింది.

పేదల కోసం ఎనలేని కృషి చేశారు.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు 118 వ జయంతి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కీర్తి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని అన్నారు. పేదల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. అంతేకాదు త్వరలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహం ఒకటి అసెంబ్లీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజనాభివృద్ధికి అల్లూరి సీతారామరాజు విశేష కృషి చేశారని.. అదే స్ఫూర్తితో మేము కూడా గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు.

రేవంత్ కి బెయిల్ రాకుండా చేయాడానికి ఖర్చు 2కోట్లా?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని అందరికీ అర్ధమయ్యే విషయమే. ఎంత తెలివిగా ఈ కేసులో ఇరికించాలని చూశారో అంతే జాగ్రత్తగా రేవంత్ కు బెయిల్ రాకుండా చేయడానికి కష్టపడ్డారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గరనుండి దాదాపు నెల రోజులు జైలులో ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపిన తరువాత కూడా ఇంకా విచారణ జరపాలి.. అంటూ చెప్పి బెయిల్ రాకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి తాను చెప్పాల్సిందంతా విచారణలోనే చెప్పానని చెప్పడానికి ఇంకా ఏం లేదని ఏసీబీ అధికారులు కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలుసుకొని హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేస్తూ రేవంత్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీ ఏసీబీ అంతటితో ఆగిందా లేదు. ఏకంగా హైకోర్టు రేవంత్ బెయిల్ పై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. పాపం అక్కడ కూడా ఏసీబీకి చుక్కెదురైంది. ఇప్పటికి వరకూ రేవంత్ రెడ్డిని జైల్లోనే ఉంచుకున్నారు కదా.. ఇంకా ఉంచుకొని ఏంచేస్తారు అని దిమ్మతిరిగి పోయే సమాధానం చెప్పింది. రేవంత్ బెయిల్ రద్దు చేసేది లేదు.. ఒకవేళ రేవంత్ ఏదైనా బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు రండి అని సూచించింది.   ఇదంతా ఒక ఎత్తయితే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి టీ ప్రభుత్వం 2కోట్లు ఖర్చు చేసిందని ఇప్పుడు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఒక వ్యక్తి మీద ఉన్న కక్ష్య కారణంగా ప్రజల సొమ్మును టీ ప్రభుత్వం ఇలా దుర్వినియోగం పరచడం నేరమని ఇప్పుడు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాడానికి ఏసీబీ తరుపు న్యాయవాదులకు ఇంత ఖర్చు చేయడం అవసరమా అని అనుకుంటున్నారు ప్రజానీకం.. పోనీ ఇంతా చేసినా ఏసీబీకి ఒరిగింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.. ఎప్పటికైనా న్యాయమే గెలిచితీరుతుంది అన్నట్టు కొంచెం లేటయినా రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఏసీబీకి చెంపదెబ్బకొట్టేట్టు చేశారు. ఏదేమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్నిస ప్రభుత్వం రాజకీయ కక్ష్యల వల్ల ప్రజాధనాన్ని తమ స్వార్ధం కోసం ఉపయోగించడమనేది అనైతికం.

వంగవీటి పయనం ఎటు!

  కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేని కారణంగా తాను కూడా కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలోకి చేరడం వల్ల ఆపార్టీలో ఉన్న వంగవీటి రాధా కుటుంబం పరిస్థితి ఎంటని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. ఎందుకంటే దేవినేని నెహ్రూ, వంగవీటి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. అయితే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం ఎటువైపు పయనిస్తుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు కత్తులు ఒక ఒరలో ఉండవన్నట్టు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం మాత్రం వైకాపాను వీడటం కచ్చితమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కూడా బొత్స సత్యనారాయణ వైకాపాలోని చేరడం ఎంతమాత్రం ఇష్టంలేని సుజయ్ సోదరులు కూడా అప్పట్లో పార్టీని వీడతారు అనే వార్తలు బాగా ప్రచారం చేశాయి. కానీ అలాంటిది జరగలేదు.. సుజయ్ కృష్ణా రంగారావు కూడా పార్టీనీ వీడే ప్రసక్తే లేదని.. వైకాపాలోనే ఉంటామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుటి పరిస్థితి వేరు.     ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి.. వంగవీటి రాధా కుంటుబానికి మధ్య ఉన్న శత్రుత్వం అలాంటిది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి తాతను చంపిన కుటుంబంతో కలిసి జగన్ కూర్చోగలడా.. అలాగే నేను కూడా వీళ్లతో కలిసి ఎలా కూర్చోగలను అని అన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ విజయవాడ పర్యటనకి కూడా రాధా డుమ్మాకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు జగన్, విజయ్ సాయిరెడ్డి, వై సుబ్బారెడ్డిలు కలిసి వంగవీటి కుటుంబానికి నచ్చేజెప్పడానికి ప్రయత్నించగా రాధా మాత్రం వారికి టచ్ లోకి రాలేదు. దీంతో జగన్ కొడాలి నానికి రంగంలోకి దించి ఆయన చేత నచ్చజెప్పే ప్రయత్నం చేయించినా ఆ ప్రయత్నంలో నాని కూడా విఫలమయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం రాధా చాలా పట్టుదలగా ఉన్నారని.. ఒకవేళ దేవినేని నెహ్రూ కనుక వైకాపా లోకి వస్తే వంగవీటి రాధా బీజేపీలోకి కాని.. టీడీపీ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. చూడాలి ఇంతకీ వంగవీటి పయనం ఎటు సాగుతుందో..

పురందేశ్వరికి జాతీయ స్థాయికి ప్రమోషన్

  ఆంద్రప్రదేశ్ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికలలో ఊహించని విధంగా ఓడిపోయిన తరువాత ఆమె రాజకీయ జీవితంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందకుండా రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుపోతున్నారు. ఆమె సేవలను, ప్రతిభను, చిత్తశుద్దిని గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెని రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి ప్రమోషన్ చేశారు. ఆమెను జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు ఆమెకు అదనంగా కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా బాధ్యతలను కూడా అప్పజెప్పారు.   అదే విధంగా మురళీధర్ రావుకి కూడా జాతీయ స్థాయికి పదోన్నతి కల్పించారు. ఆయనను జాతీయ యువ మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు అదనంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల యువమోర్చా బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా సిద్దార్థ్ నాద్ సింగ్ ని, తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా క్రిష్ణదాసుని నియమించారు.

వైకాపా ఎమ్మెల్యే భూమా అరెస్ట్

వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి పోలీసు అధికారులను దూషించారని అతనిపై 353, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం స్థానిక సంస్థల కోటాకింద కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ పోలీసుల ఆమెతో దురుసుగా ప్రవర్తించారని.. ఈ విషయం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి అక్కడకి వచ్చి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసు అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని వాహనంలో నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూమా అరెస్ట్ తో అతని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు

ఆప్ పార్టీ రోజు రోజుకి చాలా ఫెమస్ అయిపోతుంది. అది అదరగొట్టే పరిపాలన చేసి కాదు.. రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటూ. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతూనే కేజ్రీవాల్ ను చిక్కుల్లో పడేస్తుంది. ఈ పార్టీలో ఇప్పుడు నకిలీ సర్టిఫికెట్ల వివాదాలు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ నకిలీ సర్టిఫికేట్లతో మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ సింగ్ పార్టీని, ప్రజలను మోసం ఆఖరికి పదవిని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు మరో ఆప్ నేత భావనా గౌర్ అనే మహిళ నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలో చిక్కుకున్నారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త బావనా గౌర్ నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని.. 2013లో సమర్పించిన అఫిడవిట్ లో, 2015లో సమర్పించిన అఫిడవిట్ లో తేడాలున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. 2013లో తాను ఇంటర్ వరకే చదివానని అఫిడవిట్లు సమర్పించగా... 2015 లో మాత్రం బీఏ చదివానని అఫిడవిట్లు సమర్పించారని కేవలం 14 నెలల వ్యవధిలో బీఏ, బీఈడీ పూర్తి చెయ్యడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి ఆమె సర్టిఫికేట్లలో ఏదో తేడా ఉందని తెలుస్తోందని.. ఆమె తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారని అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఆప్ పార్టీలో నుండి రోజుకో నేత నకిలీ సర్టిఫికేట్ల వివాదంతో బయటపడుతున్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి..

చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీ

సెల్ఫీల పిచ్చి ముదిరిందంటే ఏమో అనుకున్నాం కానీ అది నిజమేనని అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే అర్ధమవుతుంటుంది. సెల్ఫీల గోల ఎక్కువైన తరువాత ఎంతోమంది ప్రాణాలు కూడా బలిగొన్నాయి. ఎదో కొత్తగా ట్రై చేసి సెల్ఫీ దిగాలని ఎంతో మంది తమ ప్రాణాలనే కోల్పోయారు. ఎప్పుడు ఫోటో దిగాలి.. ఏ సందర్భంలో దిగాలి అనే కనీస విజ్ఞతను కూడా కోల్పోతున్నారు. సౌది అరేబియాకు చెందిన ఓ యువకుడు ఏకంగా తన తాత శవం పక్కన సెల్ఫీ దిగి పోస్ట్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశాడు. అక్కడితో ఆగకుండా విచిత్రమైన హావభావాలతో ఫోటోలు దిగి పైగా 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసి మరీ పోస్ట్ చేశాడు. యువకుడు చేసిన ఈ పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా బాధ్యతారహితంగా చేసిన యువకుడిని శిక్షించాలని.. ఇది నైతిక విలువలను ఉల్లంఘించడమేనని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు.

మత్తయ్య కాల్ డాటాతో దేశ భద్రత ముడిపడుందా!

  ఓటుకి నోటు కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్య కాల్ రికార్డ్స్ డాటా సమర్పించామని విజయవాడ 3వ మెట్రోపోలిటన్ కోర్టు కోరినప్పుడు అది దేశభద్రతకు భంగం కలిగించే అంశమని కనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొన్నాకనే కోర్టుకి ఆ వివరాలు అందించగలమని చెప్పినట్లు సమాచారం. కానీ రేవంత్ రెడ్డిపై ఎసిబి అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసిన మరుక్షణంలోనే ఎసిబి చేతిలో మాత్రమే ఉండవలసిన ఆడియో వీడియో టేపులు మొట్ట మొదట టీ-న్యూస్ ఛానల్లో ఆ తరువాత సాక్షితో సహా అన్ని ఛానల్స్ లో ప్రసారం అయిపోయాయి. అందుకు ఎసిబి ఏమి సమాధానం చెపుతుందో మున్ముందు విచారణలో తేలవలసి ఉంది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి దానికి టెలీఫోన్ సంస్థలు ఏమి సమాధానం చెపుతాయో చూడాల్సి ఉంది.   అత్యంత రహస్యంగా ఉంచాల్సిన వివరాలను మీడియాకి బహిరగతం చేసినప్పుడు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు గానీ దేశ భధ్రతకు ఎటువంటి భంగం కలగనప్పుడు, ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్స్ డాటాని కేవలం కోర్టుకి అందజేస్తే ఏవిధంగా దేశ భద్రతకు భంగం కలుగుతుందని టెలీఫోన్ కంపెనీలు భావిస్తున్నాయో తెలియదు. కానీ కోర్టు అడిగినా ఇవ్వలేమని కేంద్రం అనుమతి లేనిదే తెగేసిచెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మొబైల్ సంస్థల మాటలు విన్న ప్రజలు మాత్రం మత్తయ్యకి వచ్చే ఫోన్ కాల్స్ తో దేశ భద్రత ముడిపడి ఉంటే అతను చాలా గొప్పవాడయ్యే ఉండాలి...అని అనుకోవలసి వస్తోంది.  

టీ. ఏసీబీకి సుప్రీం దిమ్మతిరిగే సమాధానం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా.. బెయిల్ రాకుండా చాలా కష్టపడ్డారు పాపం తెలంగాణ ఏసీబీ అధికారులు. కానీ హైకోర్టు మాత్రం ఏసీబీ చెప్పిన కుంటి సాకులను తోసిపుచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసి ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. అంతటితో ఊరుకున్నారా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ లో దాఖలు చేసింది. అంతేకాదు రేవంత్ రెడ్డి జైలు నుండి విడుదలైనపుడు చేసిన ప్రసంగాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందించి ఇంకేముంది రేవంత్ బెయిల్ రద్దు చేయోచ్చు అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఏసీబీ వేసిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి వారిక దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని నెల రోజుల పాటు జైలులోనే ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపారు. మళ్లీ అతడిని కస్టడీకి తీసుకొని ఏం చేస్తారు అని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తాము సమర్ధిస్తున్నామని.. రేవంత్ కు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు సహేతుకమైన కారణాలే పేర్కొందని ధర్మాసనం తెలిపింది. కనుకు రేవంత్ రెడ్డిని ఇంకా జైలులోనే ఉంచాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రేవంత్ బెయిల్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే అప్పుడు తమ తలుపు తట్టవచ్చని తెలంగాణ ఏసీబీ అధికారులకు సుప్రీం సూచించింది.

సుప్రీంకోర్టులో ఎసిబికి ఎదురు దెబ్బ

  ఎసిబికి అనే కంటే తెలంగాణా ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎసిబి వేసిన పిటిషన్ని ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలు ముగ్గురూ నెల రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని వారిని నాలుగు రోజులు ఏకధాటిగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టిన తరువాత వారిపై సెక్షన్: 164 క్రింద కేసు కూడా నమోదు చేసారని, ఇంకా వారిని జైల్లోనే ఉంచాలని ఎందుకు అనుకొంటున్నారని? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్.దత్తు ఎసిబి తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ని ఎదురు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో అనేక లోపాలున్నాయని ఆయన చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఎసిబి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. రేవంత్ రెడ్డి మిగిలిన ఇద్దరికీ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్ధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎసిబి కంటే తెరాస ప్రభుత్వానికే ఎదురు దెబ్బ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తగాదాలొద్దు.. ప్రణబ్

తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని.. రెండు రాష్ట్రాల మధ్య వున్న తగాదాలు రాష్ట్రా అభివృద్దికి అవరోధమవుతాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిస్థితి గురించి పైవిధంగా అన్నారు. ఇష్టమున్నా.. లేకపోయినా పొరుగురాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని.. దేశాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే ఒక్క ఏపీకి.. తెలంగాణ కు మాత్రమే ఇష్టంకాదు.. దేశ ప్రజలందరికీ హైదరాబాద్ అంటే ఇష్టమని.. అన్ని సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ అని అన్నారు. తనకు విద్యాసాగర్ రావు ఎంపీగా ఉన్నప్పటి నుండి తెలుసని.. తాను రాసిన ఉనికి పుస్తకం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను రాష్ట్రపతి ప్రణబ్ వద్దకు వెళ్లానని.. అంతకుముందే తాను ఓసారి కలిసినప్పుడు అంత తొందరపాటు వద్దని, కొంత ఆవేశం తగ్గించుకోమని సూచించారన్నారు. విద్యాసాగర్ రావు విలక్షణమైన రాజకీయ నాయకుడు.. ఉద్యమ కాలంలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు.

డిఎస్ ఉంటే ఎంత పోతే ఎంత.. కాంగ్రెస్ లీడర్స్

డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ని వీడి టీఆర్ఎస్ లో చేరడంపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. డిఎస్ పార్టీని వీడటం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమి లేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి తోడు ఉండకుండా.. కష్టకాలంలో పార్టీలో పనిచేయాలనే ఆలోచన లేని డిఎస్ పార్టీలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఎద్దేవ చేశారు. అయినా పార్టీనే డిఎస్ ను మోసింది కానీ డిఎస్ ఎప్పుడూ పార్టీని మోయలేదని.. 30 ఏళ్లు పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ వీడడం సరికాదని అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడితే పలితాన్ని డిఎస్ అనుభవించారని.. కాంగ్రెస్ పార్టీ డిఎస్ కు చాలా చేసిందని అన్నారు. అయినా బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ ఇచ్చింది కూడా బీసీ అభ్యర్ధికేనని అది డిఎస్ గుర్తుంచుకోవాలని అన్నారు.