ఫోన్ ట్యాపింగ్‌లపై రాష్ట్రపతికి ఫిర్యాదు

  తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రత్యేకించి పోన్ టాపింగ్,సెక్షన్ ఎనిమిది అమలు, తొమ్మిది, పది షెడ్యూల్ లలోని సంస్థల విభజన, తెలంగాణ ప్రభుత్వ వైఖరి మొదలైన వాటిపై రాష్ట్రపతికి మంత్రులు ఫిర్యాదు చేశారు. గరికపాటి రామ్మోహన్ రావు, సెబాస్టియన్‌ల ఫోన్లను ట్యాప్ చేశారని, దీనికి సంబంధించిన వివరాలను రాష్ర్టపతికి అందజేశామని తెలిపారు. తమ ఫిర్యాదులపై స్పందించిన రాష్ర్టపతి, కేంద్ర కేబినెట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ర్టాల సమస్యలను పరిష్కరిస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతంర లేదన్నారు.

సండ్రకి రెండువారాలు రిమాండ్

  ఈరోజు ఉదయం నుండి తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యకి ఎసిబి కోర్టు రిమాండ్ విదిస్తుందా లేదా? అనే అనుమానం ఎసిబి అధికారులలో సైతం నెలకొంది. ఎందుకంటే ఆయన తరపున వాదించిన లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను అరెస్ట్ చేసే ముందు స్పీకర్ నుండి ముందుగా అనుమతి తీసుకోలేదని వాదించడంతో కోర్టు కూడా కొంచెం సమయం తీసుకొన్న తరువాతనే తన నిర్ణయం ప్రకటించింది. ఆయనకీ రెండు వారల పాటు అంటే జూలై 21వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను జైలు అధికారులు ప్రత్యేక ఖైదీగా చూడాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనని చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. ఆయన తరపున వాదించిన లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్దమవుతుంటే, ఆయనను ప్రశ్నించేందుకు ఐదు రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు.

మాజీ మంత్రి బాట్టం శ్రీరామమూర్తి మృతి

  మాజీ మంత్రి మరియు ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు బాట్టం శ్రీరామ్మూర్తి (89) ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. శ్రీరామ్మూర్తిగారు విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 సం.లో జన్మించారు. సుమారు 16సం.ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పని చేసి సమర్దుడయిన నాయకుడిగా పేరు పొందారు. సమైక్య ఆంద్ర రాష్ట్రంలో ఆయన విద్యా, సాంస్కృతిక శాఖ, సోషల్ వెల్ఫేర్, సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలందించారు. అనంతరం స్వర్గీయ యన్టీఆర్ ప్రేరణతో ఆయన తెదేపాలో చేరి విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.   ఆయన రాజకీయాలలోనే కాక మంచి రచయితగా కూడా సుప్రసిద్దులు. ఆయన జయ భారత్, ప్రజారధం, ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకులుగా పనిచేసారు. ఆయన జీవిత చరిత్ర స్వేచ్చా భారతం తో కలిపి మొత్తం నాలుగు గ్రంధాలను ఆయన స్వయంగా రచించారు. వృదాప్యం కారణంగా ఆయన చాలా ఏళ్ల క్రితమే రాజకీయాల నుండి నిష్క్రమించారు. ఆయనకీ భార్య, ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు.

తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి తెరాస కుట్రలు పన్నిందని రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా తెదేపాపై సరిగ్గా అటువంటి ఆరోపణలే చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు కనబడుతోంది. తెదేపా ఎమ్మేల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇద్దరూ ఏకంగా 29 మంది తెరాస ఎమ్మేల్యేలతో టచ్చులో ఉన్నారని, వారిరువురూ తెలంగాణా ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారిరువురి కాల్ డాటా ఆధారంగా ఎసిబి అధికారులు ఈ సంగతి కనుగొన్నట్లు మీడియాలో లీకులు వస్తున్నాయి.కనుక నేడో రేపో వారి సంభాషణలని కూడా మీడియాకు రిలీజ్ చేస్తారేమో?

తెరాసలో చేరనందుకే ఈ కక్ష సాధింపు చర్యలు : సండ్ర

  నిన్న సాయంత్రం తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ అదుపులోకి తీసుకొన్న ఎసిబి అధికారులు ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత మళ్ళీ తమ కార్యాలయానికి తరలించారు. మరి కొద్ది సేపటిలో ఎసిబి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి కస్టడీ కోరవచ్చును. ఆయన ఎసిబి విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరెస్ట్ తరువాత తెరాస చెందిన కొందరు మధ్యవర్తులు వచ్చి తనను కలిసి తెరాసలో చేరమని కోరారని తెలిపారు. తెరాసలో చేరినట్లయితే ఎటువంటి కేసులు, సమస్యలు ఉండవని హామీ కూడా ఇచ్చేరని కానీ తను తెదేపాలో కొనసాగేందుకే మొగ్గు చూపడంతో ఆ మరునాడే ఎసిబి నుండి నోటీసులు వచ్చేయని తెలిపారు. కానీ తాను ఇటువంటి బెదిరింపులకి ఎంత మాత్రం భయపడబోనని, తను అరెస్టుకి సిద్ధమయ్యే వచ్చేనని తెలిపారు.   ఆయన విచారణకు హాజరయినప్పటికీ అరెస్ట్ చేయడాన్ని తెదేపా నేత జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడాన్ని దళితులపై జరుగుతున్న దాడిగానే చూస్తామని అన్నారు. తెరాసలో చేరనివారిపై ఈవిధంగా తెరాస ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మేల్యేలని నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవాలని ప్రయత్నించడాన్ని ఆయన ఆక్షేపించారు. తమ పార్టీ తెరాసను రాజకీయంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలి: పవన్ కళ్యాణ్

  ఓటుకి నోటు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దాని గురించి తానేమీ మాట్లాడబోనని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ, “ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా తీవ్రమయిన నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండి ఉంటే దానిపై సీబీఐ చేత విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చవలసి ఉంది. అయినా రాజకీయాలను ఇంతగా దిగజార్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. దాని వలన వారే కాదు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. కనుక ఇప్పటికయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి రాజకీయ యుద్దాలను ఇంతటితో ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్దాలకి దారి తీసే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.

సెక్షన్:8 కి నేను వ్యతిరేకం: పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్మీడియాతో మాట్లాడుతూ ‘నేను సెక్షన్: 8 అమలుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అది కేవలం ప్రజల మధ్య అల్లర్లు చెలరేగినప్పుడు లేదా నగరంలో అశాంతి నెలకొన్నప్పుడే ఉపయోగిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. తెలంగాణా ఉద్యమాల కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉన్న నగరంలో సెక్షన్: 8ని అమలుచేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. సెక్షన్: 8 అమలు ఏ వ్యక్తినో కాపాడటానికి ఏర్పాటు చేసింది కాదని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రహించాలి. అదే విధంగా నగరంలో ప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దే. కానీ తెదేపాతోనో లేక చంద్రబాబు నాయుడినో తిట్టాలనే ఉద్దేశ్యంతో ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ వంటి పదాలను వాడుతున్నారు. దాని వలన రాష్ట్రప్రజలందరి హృదయాలను గాయపరుస్తున్నామనే విషయం మరిచి పోతున్నారు. ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తానని హామీ చేసిన ముఖ్యమంత్రి పక్షపాత వైఖరితో వ్యవహరించడం తగదు. ముందుగా ముఖ్యమంత్రులిరువురూ సక్యతగా వ్యవహరించ గలిగితే అప్పుడు ప్రజల మధ్య కూడా సక్యత ఏర్పడుతుంది,” అని అన్నారు.

ముఖ్యమంత్రులకి పవన్ కళ్యాణ్ హితబోధ

ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని జనసేన రథసారథి పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.   హైదరాబాద్‌ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు. ఆంధ్ర అంటే ఒక జాతి అని వివరిస్తూ వారిలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు... ఇలా అందరూ ఉన్నారని, ఆంధ్రోళ్లు అంతా తెలుగుదేశం పార్టీలో లేరని ఆయన గుర్తు చేశారు. తనను ఎవరైనా విమర్శించవచ్చునన ఆయన అన్నారు.   యాదాద్రిలో విజయనగరానికి చెందిన వ్యక్తిని చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగుజాతి ఐక్యతకి అడుగు వేశారా అని ఈరోజు పత్రికలు చూస్తుంటే అనిపించిందని ఆయన కితాబు ఇచ్చారు. ఇది చాలా మంచి పరిణామం అని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు యుపిఏ, ఎన్డీయే రెండూ బాధ్యులే అంటూ తెలంగాణకు మంచి జరిగింది, మంచిదే, కాని ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విభజన సమస్యలు పరిష్కరించకపోతే శ్రీలంక తరహా సమస్యలు తలెత్తుతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.   విభజన సమయంలో తెలంగాణ ఎంపీలు పనిచేసినట్టు ఆంధ్ర ఎంపీలు పనిచేయలేదని ఆయన ఆక్షేపించారు. అందుకు కారణం వారు వ్యాపారవేత్తలు కావడమేనని ఆయన వివరించారు. మీ రాష్ట్రంకోసం మీరు పనిచేయవలసింది పోయి మీ వ్యాపారాలకోసమే పనిచేసుకుంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం చేసేది మీరే అవుతారని కూడా ఆయన హెచ్చరించారు. మీకు పనిచేయడం చేతకాకపోతే రాజకీయాలలో ఉండకండి అని కూడా ఆయన హితవు చెప్పారు.

ఆంధ్రోళ్లు అని తిట్టవద్దు: పవన్

  పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రులిరువురూ బాధ్యతగా వ్యవహరించాలి. అదే విధంగా మాట్లాడేటప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు తరచూ ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ అని చాలా అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఒకవేళ వారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి తిట్టుకోదలిస్తే నేరుగా ఆయన పేరు పెట్టి తిట్టుకోవచ్చును. లేదా ఆయన కులాన్ని తిట్ట దలిస్తే నేరుగా వారినే తిట్టుకోవచ్చును. కావాలనుకొంటే నన్ను కూడా తిట్టుకోండి. మరేమీ పరువాలేదు. కానీ ఆంధ్రోళ్లు అంటే చంద్రబాబు నాయుడని కానీ తెదేపాకు చెందిన వారు కారని కాదని సంగతి గ్రహించాలి. ఆంధ్రాలో ఉండే అనేక కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలందరూ కలిస్తే ఆంధ్రావాళ్ళు అవుతారు తప్ప ఏదో ఒక కులానికో రాజకీయ పార్టీకి చెందినవాళ్ళు మాత్రమే ఆంధ్రావాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి. వారు ఆవిధంగా నోటికి వచ్చినట్లు అదుపు లేకుండా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. రాజకీయాలలో ఉన్నవాళ్ళకి నోటిపై, మాట్లాడే బాషాపై చాలా అదుపు అవసరం. కులాల గురించి మాట్లాడటం నాకసలు ఇష్టం లేదు. కానీ రాజకీయాలలోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవిధంగా వ్యవహరించడం వలన ప్రజల మధ్య ఇంకా చిచ్చుపెట్టినట్లవుతుంది. మొన్న నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం చూసిన తరువాత నాకు ఈ పరిస్థితులుఅంతర్యుద్ధాలకి దారి తీస్తాయేమోననే భయం కలుగుతోంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విద్వేషాలను విడనాడి కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది.

ఆంధ్రాకు కేంద్రం న్యాయం చేయాలి: పవన్ కళ్యాణ్

   పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ హడావుడిగా రాష్ట్రాన్ని విడదీయడం వలన తెలంగాణకు లాభం కలిగి ఉండవచ్చును. అందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ అదే సమయంలో ఆంద్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగినందుకు నేను చాలా బాధ పడుతున్నాను. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్ర విభజన చేసాయి కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యతా వాటిదే. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలతో ఒక కమిటీ వేయాలి.   ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యెక వ్యవస్థని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో చొరవ చూపమని నేను ప్రధాని నరేంద్ర మోడీని ఈ మీడియాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు మొగ్గలోనే ఉన్నప్పుడే తుంచి వేయాలి లేకుంటే ఇంతకు ముందు ఆంధ్రా, తెలంగాణా పోలీసులు కొట్టుకొన్నారు. ఇక ముందు ప్రజలు కూడా రోడ్లమీద కొట్టుకొనే పరిస్థితి దాపురిస్తుంది. కనుక పరిస్థితులు అంతవరకు వెళ్ళకుండా తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.

రేవంత్ రెడ్డి కేసుపై స్పందించను: పవన్

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవల గురించి, ఇంకా అనేక ఇతర అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే: ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నా గొడవలన్నిటినీ నేను నిత్యం గమనిస్తూనే ఉన్నాను. వాటిపై నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇంత జరుగుతున్నా నేను ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ యంపీ వీ. హనుమంత రావు గారు నన్ను నిలదీయాలనుకోవడం గురించి నాకు తెలుసు. కానీ మాట్లాడితే చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలనే ఉద్దేశ్యంతోనే నేను వెనక్కి తగ్గుతున్నాను.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు విజయనగరానికి చెందిన ఆనందసాయి అనే ఆర్కిటెక్ట్ ని నియమించి తెలుగు జాతి సమైక్యత అవసరమనే ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేరు. అందుకు ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి కేసుప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దానిపై ఇప్పుడు నేను నా అభిప్రాయాలు చెప్పలేను. కానీ దానికి ముందు జరిగిన పరిణామాల గురించి మాట్లాడగలను. తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షించినందునే ఈ సమస్య మొదలయిందని నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులు తమ కంట్లో దూలాలు ఉంచుకొని ఎదుటవాడి కంట్లో నలుసుల గురించి మాట్లాడుతున్నారు.   రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించకుండా ఈ విధమయిన అనవసరమయిన రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ చాలా బాధ్యతగా వ్యవహరించుతూ ఈ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. ప్రజలు వారు తమ సమస్యలని తీర్చుతారనే ఉద్దేశ్యంతోనే వారిని ఎన్నుకొన్నారు. కానీ వారు ప్రజాసమస్యలను గాలికొదిలేసే ఇటువంటి సమస్యలు సృష్టించుకొని కోర్టులు, కేసులు అంటూ రోజులు దొర్లించేసినట్లయితే వారిని ఎన్నుకొన్న ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారు. తెదేపాకి చెందిన ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోగలరేమో గానీ వారితో బాటు ప్రజల అభిమానాన్ని ఓట్లను కూడా పోనగాలమని భావిస్తున్నారా?తలసాని శ్రీనివాస్ ని తెరాసలో చేర్చుకొన్నంత మాత్రాన్న హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలను ఆకర్షించగలరా?

త్వరలో తెలంగాణా మంత్రివర్గ ప్రక్షాళణ?

    రసమయి బాలకృష్ణను త్వరలో మంత్రిగా చూడబోతున్నారని కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మళ్ళీ మొన్నీ మధ్యనే చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ని కూడా క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు తెలిపారు. అంటే త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళణ తధ్యమని స్పష్టమవుతోంది. మంత్రివర్గ విస్తరణకి బదులు ప్రక్షాళణ ఎందుకంటే పార్లమెంటరీ నియామలను అనుసరించి తెరాసకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం మంత్రివర్గంలో 18 మంది కంటే ఎక్కువ మంది మంత్రులను నియమించుకోవడానికి వీలులేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో సరిగ్గా 18 మంది మంత్రులే ఉన్నారు. కనుక కొత్తవారిని తీసుకోవాలంటే మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకక తప్పదు. కేసీఆర్ చెప్పినట్లు కేవలం ఇద్దరినే మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎవరో ఇద్దరు మంత్రులకి ఉద్వాసన తప్పదు.   కానీ ఆ ఇద్దరిని నియమించడం కోసం ప్రయత్నిస్తే ఇంకా చాలా కూడికలు తీసివేతలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఈసారి కనీసం ఒక్క మహిళకయినా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఇక తెదేపా నుండి కొత్తగా పార్టీలోకి వచ్చి జేరిన కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకి మంత్రి పదవులు దక్కాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కి రాజ్య సభ సీటు లేదా ఎమ్మెయల్సీ సీటు కానీ ఇస్తారనే హామీతోనే ఆయన రేపు తెరాసలో చేరబోతున్నట్లు సమాచారం. ఇంకా మున్ముందు కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి ఆకర్షించడానికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది.   ఈ కారణంగా ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తెరాస నేతలకి అవకాశం దక్కకకపోవడంతో వారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కనుక ఒకవేళ మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే వారందరూ కూడా మంత్రిపదవుల కోసం ఒత్తిడి చేయవచ్చును. అంటే కొత్తగా ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోదలిస్తే అంతకు సమానంగా పాత మంత్రులను తొలగించక తప్పదన్నమాట. ఒకరిద్దరిని సంతృప్తి పరిచేందుకు మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే ఆ కారణంగా పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడినవారు అందరూ అసంతృప్తి చెందడం తధ్యం. కనుక మంత్రివర్గ ప్రక్షాళన చేయడం అంటే కత్తి మీద సాము వంటిదేనని చెప్పవచ్చును. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సాము ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే!

జపాన్‌లో చంద్రబాబు బిజీ

  జపాన్ పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్లో వున్నారు. ఆయన సోమవారం నాడు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుజి సంస్థ విజయవాడలో పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది. ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. నవంబర్‌లో జరిగిన ఎంఓయు పురోగతిని సంస్థ ప్రతినిధులు చంద్రబాబు బృందానికి వివరించారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఫుజి సంస్థ ప్రధాన ప్రాజెక్టును చేపట్టనుంది. ఇక మిత్సుబిషి సంస్థ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కృష్ణాజిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు కూడా అవకాశాలు వున్నాయి. తాజా పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో తమ పరిశ్రమకు రహదారిని నిర్మించాలని సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. దీనికి స్పందించిన ఆయన వంద రోజుల్లో రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.