అర్ధరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రెండో రోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండు రోజు కూడా భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కాగా నిన్న రాజమండ్రిలోని పుష్కర ఘాట్‌ తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా అక్కడ ఏపీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మంగళవారం అర్ధరాత్రి వరకు పుష్కర ఘాట్‌ల వద్ద కలియతిరిగి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 టోల్‌ఫ్రీ ఫోన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.

రేవంత్ రెడ్డి గోడ కూల్చేందుకు యత్నం

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేత అనుచరులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ఉంది. దానికి ఉన్న ప్రహరీ గోడను కూల్చేందుకు శంకర్ గౌడ్ అనే టిఆర్ఎస్ నేత అనుచరులు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై ఉన్న కక్ష్య కారణంగానే ఇలాంటి పనులు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీ, టీ ఉద్యోగుల సర్దుబాటు!

  ప్రస్తుతం ఉన్న పరిస్థితులవల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు.. ఉద్యోగుల సర్దుబాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకరించారని.. దీనికి సంబంధించిన ఫైలుపై ఇప్పటికే తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికే సంతకం చేయగా.. ప్రస్తుతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వద్దకు ఫైలు వెళ్లినట్లు వినవస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాలలోని ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది.   మరోవైపు ఉద్యోగుల రిలీవింగ్‌ ప్రక్రియ కూడా ఊపందుకుంది. కానీ ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరో పక్క ‘స్థానికత’ ప్రాతిపదికన ఏపీకి కేటాయించినప్పటికీ, ‘పోస్టులు లేవు’ అనే పేరిట కొందరు ఉద్యోగులను చేర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. దీంతో ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగుల సర్దుబాటు’ అంశం తెరమీదకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఒకవేళ ‘సర్దుబాట్లు’ చేసుకోవాలని నిర్ణయిస్తే..దానిపై ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

పుష్కర సంఘటనపై బాలయ్య ఆవేదన

  రాజమండ్రి పుష్కరాలలో ఈరోజు ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో 27మంది భక్తులు చనిపోవడం తనకు చాలా బాధ కలిగిస్తోందని ప్రముఖ సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గత నెలరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరల కోసం అనేక ఏర్పాట్లు చేసిందని, చాలా జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తన అభిమానులు అందరూ పుష్కరాలకి వచ్చే ప్రజలకు వీలయిన విధంగా సేవలందించాలని ఆయన కోరారు. ప్రజలు, ప్రభుత్వం అందరూ ఒకరికొకరు సహకరించుకొంటూ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. తరువాత ఈ ప్రమాదం జరిగిన కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.

శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్.. జూపుడి

  గోదావరి మహా పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది వరకు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇదే ఛాన్స్ అనుకొని సీఎం చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన జూపుడి ప్రభాకర్ రావు ప్రతిపక్షాలకు ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ స్నానం వలన అరిష్టం... రేవంత్ రెడ్డి

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అయితే కేసీఆర్ వదిన చనిపోవడం వలన వారి కుటుంబానికి మైల ఉందని అందుకే కేసీఆర్ పుష్కర స్నానం చేయకూడదని వివరించారు. అయినా కేసీఆర్ పుష్కారం చేశారని.. కేసీఆర్ పుష్కర స్నానం చేయడం వలన రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని విమర్శించారు. మైల ఉన్నందున పుష్కర స్నానం చేయోద్దని వేద పండితులు కేసీఆర్ కు చెప్పినా వినకుండా పుష్కరస్నానం చేశారని.. కేసీఆర్ లక్ష పాపాలు చేసి గోదావరి నదిలో ఒక్క మునక మునిగితే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయన్న భ్రమలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. పవన్ కళ్యాణ్

    గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తొక్కిసలాటలో సుమారు 30 మంది వరకూ మృతి చెందారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని ఉన్నా.. తాను అక్కడకు వస్తే మళ్లీ తోపులాట జరిగే ప్రమాదం ఉంటుందని.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అందుకే అక్కడకు రాలేకపోతున్నాని ట్విట్టర్ తెలిపారు. నేను రాలేకపోయనా నా అభిమానులు మాత్రం సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు.

సండ్రకు బెయిల్ మంజూరు

  ఓటుకు నోటు కేసులో అయిదవ నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సండ్ర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నిన్న వాదోపవాదనలు జరిపినప్పటికీ మళ్లీ ఈరోజుకు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, నియోజకవర్గం దాటి వెళ్లవద్దని కోర్టు షరతులు విధించింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సండ్రకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. కేసు కీలక దశలో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ అధికారులు ఏసీబీని కోరారు. అయితే ఆ తరువాత సండ్రని రెండు రోజుల కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. కానీ సండ్ర తరఫు న్యాయవాది రవీంద్ర కుమార్.. రెండు రోజుల ఏసీబీ విచారణకు సండ్ర అన్ని రకాలుగా సహకరించాడని.. సండ్రకు సంబంధించి ఇంకెవర్నీ విచారించే అవసరం లేదని తన అన్నారు. విచారణ నిమిత్తం ఎప్పుడు అవసరమైన హాజరవుతారని చెప్పారు. దీంతో ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేసింది.

కంటతడి పెట్టిన చంద్రబాబు..

  ఈరోజు గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమయిన తొలి రోజే అపశృతి జరిగింది. రాజమండ్రిలోని ఘాట్ వద్ద తోపులాట జరిగి సుమారు 27 మంది మృతి చెందారు. అయితే అనుకున్నదానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో తోపులాట జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పదించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పుష్కరాల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనుకోని సంఘటన జరగడం.. ఇంత మంది మృతి చెందడం మనసు కలిచి వేస్తుందని కంటతడి పెట్టారు. ఎక్కడ లోపం ఉందో పుష్కరాలు పూర్తయ్యాక విచారణ జరిపిస్తామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

సినీ సంగీతానికి ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు..

  ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ గారు. తెలుగులో కేవలం 31 సినిమాలకే సంగీతం అందించినప్పటికీ ఆయన అందించిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అలాంటి ఎన్నో అద్భుతమైన బాణీలు అందించిన ఎం.యస్.విశ్వనాథన్ మరణంతో సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎం.యస్.విశ్వనాథన్ మృతికి సంతాపం తెలిపారు. ఎం.యస్.విశ్వనాథన్ దేశం గర్వించదగ్గ కళాకారుడని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.   https://www.youtube.com/playlist?list=PLvS3k4MyaWFfomd76mt2iP6Rr2NkXRdAR

పవన్ కళ్యాణ్ తరువాత టార్గెట్ జగనా..!

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. వారి తరపున నేను ప్రశ్నిస్తా అని అప్పుడెప్పుడో చెప్పారు. కానీ ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పనైతే చెప్పారు కానీ చెప్పిన తరువాత దాదాపు కొంత కాలం అసలు ఆయన ఆ ఊసే ఎత్తలేదు. ఇదే విషయంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది చాలా విమర్శలే చేశారు. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ కు ఏమైందో తెలియదు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఏపీ మంత్రులందరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదట తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన నిలదీశారు. వారి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానికి టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ కి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఓ సమయంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారిపోతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ చంద్రబాబు జోక్యం చేసుకొని సర్ధిచెప్పడంతో పరిస్థితి నెమ్మదించింది.   ఆ తరువాత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుటివరకు టీడీపీ నేతలను.. కాంగ్రెస్ నేతలను ప్రశ్నించగా తరువాత ఎవరిని ప్రశ్నిస్తారు అని విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తరువాత టార్గెట్ మాత్రం వైకాపా అధ్యక్షుడు జగనే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో... రానున్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి మరింత ఘాటుగా మాట్లాడవచ్చునని భావిస్తున్నారు.

తెలంగాణకు పుష్కర పాట్లు..

  ఆంధ్రరాష్ట్రంలోనూ.. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ గోదావరి మహా పుష్కరాలు మొదలయ్యాయి. ఆంధ్రరాష్ట్రంలో ఈ పుష్కరాలకు ఎలాంటి నీటి కొరత లేదు కానీ పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీటి కష్టాలు వచ్చిపడ్డాయి. గోదావరి మహా పుష్కరాలలో స్నానం చేద్దామంటే భక్తులకు నిరాశేమిగిలింది. తెలంగాణలో కొన్ని చోట్ల గోదావరి జలాలు ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం నీళ్లు లేక నేల ఎండిపోయి ఉండటం గమనార్హం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలోనూ, గోదావరి, మంజీర, హంద్రీ నదుల త్రివేణీ సంగమస్థలి అయిన నిజామాబాద్‌ జిల్లా కుందకుర్తిలోనూ గోదావరి నీరు లేక బోసిపోయి కనిపిస్తోంది.   మరోవైపు సీఎం కేసీఆర్ పుష్కరాలు సమయం కాబట్టి వాటికోసమైనా నీటిని విడుదల చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కోరారు. ఇదే విషయం పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఫడ్నవిస్ కు చెప్పరు కానీ.. నీరు వదలాల్సిన చోట తగినంత నీరు నిల్వ లేదని అందువల్ల తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నదని.. నీటిని విడుదల చేయలేమని చెప్పారు. ఒకవేళ పుష్కరాలు పూర్తయ్యే లోపు తగిన నిల్వ లభిస్తే జలాలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభత్వానికి ఏం చేయాలో తెలియక ప్రత్యేకంగా ఘాట్ లు.. షవర్లు ఏర్పాటు చేసి భక్తులు స్నానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరఘాట్లకు మళ్లిస్తోంది. ఈ పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రతి రోజూ 3 వేల క్యూసెక్కుల చొప్పున పుష్కరాలు పూర్తయ్యేంత వరకు మొత్తం 6 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు నుంచి, ఎల్లంపల్లి నుంచీ నీటిని విడుదల చేయనున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఘనంగా మహాపుష్కరాలు

  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి మహాపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ గోదావరి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ పుష్కరాలకు హాజరయ్యారు. గోదావరిలో పుష్కర స్నానం చేసి టీడీపీ తరుపున గోదావరికి చీర, సారెలను సమర్పించారు. చంద్రబాబుతో పాటు పలువురు పీఠాధిపతులు, వేద పండితులు కూడా స్నానం ఆచరించారు. ఈరోజు నుండి ప్రారంభమైన గోదావరి పుష్కరాలు ఈ నెల 25వ తేదీ వరకూ ఉంటాయి. 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను మహా పుష్కరాలు అంటారు. అలాంటి మహా పుష్కరాలు ఇప్పుడు రావడంతో ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుండి కూడా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఈ గోదావరి మహాపుష్కరాల కోసం తరలి వస్తున్నారు.

నేటి నుండే మహా పుష్కరాలు

  నేటి నుండి గోదావరి మహా పుష్కరాలు మొదలవుతాయి. సాధారణంగా 12సం.లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అటువంటి 12 పుష్కరాలు అంటే 144 సం.లకి ఒకసారి వచ్చేవె మహా పుష్కరాలు. అంటే మనిషి జీవితంలో ఈ మహాపుష్కరాలను కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలిగే అవకాశం ఉంటుందన్న మాట. కనుక ఎంతో అదృష్టం ఉన్నవాళ్లకే ఈ మహా పుష్కరాలను చూసే భాగ్యం కలుగుతుంది. అందుకే దేశ విదేశాల నుండి కూడా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలయ్యే ఈ గోదావరి పుష్కరాల కోసం తరలి వస్తున్నారు. రేపు ఉదయం సరిగ్గా 6.26నిమిషాలకి ఈ మహా పుష్కరాలు మొదలవుతాయని వేద పండితులు చెపుతున్నారు.   ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వీటి కోసం చాలా భారీ ఏర్పాట్లు చేసాయి. ఈ మహాపుష్కరాలను నిర్వహించే మహాభాగ్యం తనకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురయినా ఈ పుష్కరాలలో ఎటువంటి లోటు రానీయకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా పుష్కర ముహూర్త సమయానికి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తారు.

జయలలిత ఆరోగ్యానికి ఏమైంది..!

  తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలితకు ఆరోగ్యం బాలేదంటూ పలు రకాలైనా వదంతులు వ్యాపిస్తున్నాయి. నిజానికి జయలలిత ఆరోగ్య సరిగా లేదని.. ఆమె తీవ్రమైన మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని.. ముఖ్యంగా చక్కెర లెవెల్స్ తారా స్థాయికి చేరుకున్నట్టు సమాచారం. అందుకే ఆమె ముఖ్యమంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసినా కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అరోగ్యం బాలేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా  ఇప్పుడు జయ ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ నాయకుల కంటే మిగిలిన పార్టీ శ్రేణులే ఎక్కువగా కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జయ ఆరోగ్యం గురించి చెప్పాలంటూ వాదనలు చేస్తున్నారు. డీఎంకే నేత స్టాలిన్ మరో అడుగు వేసి అసలు తమిళనాడులో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఘాటుగా స్పందించారు.

అక్కడ పుట్టకపోవడం రాజమౌళి దురదృష్టం.. రాంగోపాల్ వర్మ

  ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ బాహుబలి సినిమాను డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి తరువాతే అని ప్రశంసించారు. అంతేకాక సినిమాలో ప్రభాస్ టెర్రిఫిక్ గా చేశాడని.. రానా అయితే విలన్ పాత్రలో ఒదిగిపోయాడని.. ఫిజికల్ గా, నటనలో కూడా శిఖర స్థాయి అందుకున్నాడని.. రమ్యకృష్ణ కూడా చాలా బాగా చేసిందని అన్నారు. అసలే విమర్శల వర్మ కదా అటు బాహుబలిని పొగుడుతూనే ఇండస్ట్రీలో ఉన్నకొంతమంది నాయకులకు చురకలు అంటించారు. సినీ ఇండస్ట్రీలో తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు బాహుబలి ఒక మేలుకొలుపని.. ఇండస్ట్రీ మొత్తం సింహాలు, పులులు, ఏనుగులతో నిండిపోయిందని.. ఈ జంగిల్ ఇండస్ట్రీలోకి బాహుబలి ఒక డైనోసార్ లాగ వచ్చిందని వ్యాఖ్యానించారు. అయినా రాజమౌళి ఇక్కడ పుట్టినందుకు తెలుగువారు గర్వపడనక్కర్లేదు.. బాంబే లాస్ ఎంజిల్స్ లో పుట్టక పోవడం అతని దురదృష్టకరమని అన్నారు.

టీడీపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం... కిషన్ రెడ్డి

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల నుండి కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నా పట్టించుకునే తీరిక తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. సమ్మె వల్ల నగరం అంతా చెత్తతో నిండిపోయిందని.. చెత్త వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా వారు తమ వేతనాలు పెంచమని అంటున్నారు.. అందులో తప్పేం లేదని.. అన్ని శాఖలకు వేతనాలు పెంచిన కేసీఆర్ వాళ్లకు పెంచడం న్యాయం అని అన్నారు. అయినా తెలంగాణ కోసం సమ్మె చేయవచ్చు కానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా అని నిలదీశారు. అంతేకాక ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకూ సరిగా స్పందించని కిషన్ రెడ్డి ఇప్పుడు ఓటుకు నోటు కేసు వల్ల తెలుగుదేశం పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకే ఎక్కున నష్టం కలిగించిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వ్యవహారం పై మాకు సంబంధం లేదని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం పై ఆసక్తి నెలకొంది. అలాగే ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

మోడీ పై ఉన్న శ్రద్ధ ఆంధ్రులపై లేదా.. పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ పోస్ట్ చేశారు. మొన్నటి వరకూ ఏపీ ఎంపీలు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడటం లేదని.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు.