పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళతా.. జానారెడ్డి

  పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మండిపడుతున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలందరూ.. పార్టీలో గెలిచి పదవి వచ్చిన తరువాత వేరే పార్టీలోకి చేరడం కాదు.. పార్టీ మారాలనుకున్నవారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని అన్నారు. అంతేకాదు తాము ఎందుకు పార్టీ  మారాలనుకుంటున్నారో కూడా నియాజకవర్గాల ప్రజలకు వెల్లడించి మరీ పార్టీ మారాలని సూచించారు. అయినా పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తూ చేసిన చట్టం... ఇటీవలి కాలంలో అభాసుపాలవుతోందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం సక్రమంగా అమలు కావడం లేదని..  ఈ ఉల్లంఘనలను ఇకపై ఎంతమాత్రం సహించబోమని చెప్పిన జానారెడ్డి... ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని చెప్పారు. మొత్తానికి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జానాకు కూడా పార్టీ ఫిరాయింపులవల్ల కోపం వచ్చిందన్నమాట.  

అవును ప్రత్యూషను కొట్టాను.. రాహుల్ రాజ్ సింగ్ మాజీ లవర్

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో రోజుకో ఆసక్తికరమైన అంశం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. అతని మాజీ ప్రియురాలు సలోనీ శర్మపై కూడా ఆరోపణలు తలెత్తాయి. అసలు ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాహుల్ రాజ్ సింగ్, సలోని శర్మలే కారణమని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై ఆమె మొదటిసారి నోరు విప్పారు. ఓ ఇంటర్య్వూలో ఆమె దీనిపై స్పందించి.. అవును నేను ప్రత్యూషన్ కొట్టాను.. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందని జరిగిన ఉదంతం చెప్పుకొచ్చింది. నేను రాహు్ల్ కు కొంత డబ్బు ఇచ్చానని.. అది తీసుకెళ్లి ప్రత్యూషకి ఇచ్చాడని..  తిరిగి ఇవ్వడానికి రాహుల్ నిరాకరించాడని.. దీంతో డబ్బు కోసం నిలదీసేందుకు ఫిబ్రవరి 11న రాహుల్ ఉండే కాండివ్లీ అపార్టు మెంటుకు వెళ్లానని.. అయితే అక్కడ నన్ను చూడగానే రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయారు.. ఇద్దరూ కలసి దాడి చేశారు. ఫ్లాట్ బయటకు నన్ను నెట్టేశారు. అందుకే కోపంతో నేను ఆమెను కొట్టాను" అని చెప్పారు.

ఇకనుండి బస్సుల్లో ఫ్రీ వైఫై..

హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఉచిత వైఫై సేవను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుండి ఈ సేవను బస్సులకు కూడా అందిచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతున్న ఏసీ బస్సుల్లో ఈ వైఫై సేవలు అందించడానికి ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చిందని.. ముందుగా ఒక బస్సులో ప్రయోగించామని.. తరువాత అన్ని ఏసీ బస్సుల్లో ఉచితవైఫై సేవలు ప్రారంభమవుతాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ పురుషోత్తం తెలిపారు. అంతేకాదు బస్సుల సమయాలు తెలిపేవిధంగా బస్టాపుల్లో డిస్‌ప్లే బోర్డులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. పుష్పక్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 

ఎన్‌ఐఏ అధికారి భార్య కూడా మృతి..

  పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి మొహ్మద్ తంజిల్ అహ్మద్ కుంటుంబంపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓ వివాహా కార్యక్రమానికి వెళ్లి వస్తున్న వీరిపై ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో మోటార్ సైకిళ్లపై దుండగులు వచ్చి కాల్పులు జరపగా.. ఈ దాడిలో తంజిల్ ఆయన భార్య ఫర్జానా తీవ్రంగా గాయపడ్డారు.  వీరికి ఒక బాబు, ఒక పాప ఉండగా వారు మాత్రం సీటు వెనుక దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే గాయపడిన తంజిల్ ఆయన భార్యను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల క్రితమే మొహ్మద్ తంజిల్ అహ్మద్ మరణించాడు. ఇప్పుడు ఆయన భార్య ఫర్జానా కూడా పదిరోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.   కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో రెహాన్, జైనుల్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా రిజ్వాన్, తంజీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రధాన నిందితుడు మునీర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

శ్రీనగర్ నిట్ క్యాంపస్ ను తరలించేది లేదు.. స్మృతీ

  శ్రీనగర్ నిట్ లో స్థానికేతర, స్థానిక విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలుగు విద్యార్ధులు మండిపడుతున్నారు. శ్రీనగ్ నిట్ ను అక్కడి నుండి తరలించాలని.. లేదా తమకైనా వేరే వర్శిటీలో చేరే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొంతమంది విద్యార్ధులు తమ క్యాంపస్‌లో భద్రతను పటిష్టం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఎన్‌ఐటీ ప్రాంగణాన్ని మరోచోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి మాత్రం ఆమె అంగీకరించలేదని.. క్యాంపస్‌ను మరోచోటికి తరలించేది లేదని చెప్పినట్టు సమాచారం.  

రేపే టీడీపీలోకి బొబ్బిలి సోదరులు.. జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ

వైసీపీ పార్టీ నుండి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సుజయ కృష్ణతో పాటు ఆయన సోదరుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బేబి నాయన కూడా టీడీపీలో చేరుతున్నారు. పార్టీ అనుచరులతో సమావేశమైన వీరిద్దరూ రేపు అంటే (15-4) న టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వైసీపీ నుండి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు పార్టీకి దూరమైతే... వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

బొత్సది ఐరెన్ లెగ్ అంటున్న వైసీపీ నేతలు..!

  టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మాంత్రానికి వైసీపీ నేతలు ఒక్కోక్కరుగా టీడీపీలో చేరడానికి ఆకర్షితులవుతున్నారు. ఇప్పటివరకూ 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా.. ఇప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయకృష్ణ రంగారావు కూడా లిస్టులో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అనే సామెత ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడానికి కారణం బొత్స సత్యనారాయణ అంటూ కొంతమంది వైసీపీ నేతలు అనడం ఆశ్చర్యకరం.. బొత్స సత్యనారాయణది ఐరెన్ లెగ్ అని ఆయన వచ్చిన తరువాతే వైసీపీ నేతలు టీడీపీలోకి వెళుతున్నారని అంటున్నారు. అంతేకాదు వెంకట సుజయకృష్ణ రంగారావు ముందు నుండే బొత్స రాకును వ్యతిరేకిస్తున్నారని.. అయినా జగన్ వినకుండా పార్టీలోకి ఆహ్వానించారు.. ఇప్పుడు అనుకున్నట్టుగానే రంగారావు టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. మరి వైసీపీ నేతలు అన్నట్టు నిజంగానే బొత్సది ఐరెన్ లెగ్గా..

తృప్తి దేశాయ్ కొత్త వివాదం.. దేవాలయంలోకి చీరలా..?

  నిన్న మొన్నటి వరకూ దేవాలయాల్లో ప్రవేశించడానికి లింగ వివక్షతపై ఆందోళనలు జరిగాయి. ఒక దేవాలయంలో స్త్రీలకు ప్రవేశం లేకపోతే.. మరో దేవాలయం గర్భగుడిలోకి పురుషుల ప్రవేశానికి అనుమతి లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఈ ఆచారాలను సైతం తొలగించి మహిళలు పోరాటం చేసి ఆఖరికి ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఇక ఈగొడవలకు ముగిసిపోయాయి కదా అని ఆలోచించే లోపే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వివాదం.. దేవాలయంలో స్త్రీలు వేసుకునే దుస్తుల గురించి.   సాధారణంగా పలు ఆలయాల్లో స్ర్తీలు సంప్రదాయ దుస్తులు వేసుకునే రావాలన్న నిబంధనలు ఉంటాయి. ఇక పురుషుల విషయానికి వస్తే కొన్ని దేవాలయాలను బట్టి వారు పంచెతో వచ్చే ఆనవాయితీ ఉంటుంది. అయితే ఇప్పుడు భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ దీనిపై ఆరోపిస్తున్నారు. ఆమె ప్యాంటు, కోటు వేసుకొని కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి వెళుతుండగా అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయ నిబంధనల ప్రకారం చీరతోనే రావాలని సూచించారు. దీంతో ఆమె వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని.. ఇది వివక్షతే నంటూ ఆమె మండి ఆలోయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మరో  వివాదం తెరపైకి వచ్చింది. మరి దీనిపై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.

బెజవాడలో రౌడీయిజం మళ్లీ మెల్కొంది..!

రెండు దశాబ్ధాల క్రితం రౌడీయిజం పేరు చెప్పగానే టక్కున గుర్తుక్కొచ్చే నగరం విజయవాడ. రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయిలో రౌడీయిజం తన విశ్వరూపాన్ని చూపించింది. కాని అదంతా ముగిసిన కథ.. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ అండ్ అడ్మినిష్ట్రేషన్ కాపిటల్‌గా విజయవాడ టర్న్ అవ్వడంతో రౌడీలు నిద్ర లేచారు. నిన్న అర్థరాత్రి నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై కత్తులు చేతబట్టుకుని స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చారు.   పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్‌గా ఉన్న రాఘవేంద్ర అనే వ్యక్తిపై జాన్‌ బాబు అనే మరో రౌడీ షీటర్ వర్గం కత్తులతో విరుచుకుపడింది. ఈదాడిలో రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై రాఘవేంద్ర అనుచరులు కత్తులతో దాడి చేశారని జాన్ బాబు వర్గం ఆరోపించింది. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో పోలీసులు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విజయవాడకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పోలీసు పహారా మరింత పెరగడంతో చాలా వరకు ఇలాంటి ఘటనలు తగ్గిపోయాయి. మళ్లీ సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతుండటంతో వీరిని అణచివేసేందుకు ఖాకీలు రెడీ అవుతున్నారు.

ఈడి ఇచ్చిన షాక్ కి దిగొచ్చిన మాల్యా.. 6వేల కోట్లు కడతా..

  ఇన్ని రోజులు ఈడీ ముందు హాజరుకాకుండా విజయమాల్యా షాకిస్తుంటే.. ఇప్పుడు ఈడీనే విజయమాల్యాకు షాకిచ్చింది. ఇప్పటికే రెండు మూడుసార్లు తమ ముందు హాజరుకావాలని ఈడీ అధికారులు మాల్యాకు నోటీసులు జారీ చేయగా.. మాల్యా మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏవో కుంటిసాకులు చెబుతూ గడువు కోరుతూ వచ్చాడు. ఈనేపథ్యంలో ఆగ్రహం చెందిన ఈడీ.. మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈడీ ఇచ్చిన ఈ షాక్ కి మాల్యా స్పందించి రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. తను మొదటి దఫాగా చెల్లిస్తానన్న 4వేల కోట్లను పెంచుతూ ఇప్పుడు మొత్తం 6 వేల కోట్లు చెల్లిస్తానని దిగొచ్చాడు. దీంతో ఇప్పుడు మరింత చర్యలు తీసుకుంటే మాల్యా తప్పకుండా ఈడీ ముందు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.

ముంబైని వదలని మంటలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిదేవుడు వదలడం లేదు. నగరంలో రోజుకోక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న భీవాండీ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరిచిపోక ముందే ఇవాళ లోఖండ్ వాలా ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లోఖండ్‌వాలాలోని 13 అంతస్తుల రహేజా క్లాసిక్  బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. చూస్తుండగానే భవనం మొత్తాన్ని కమ్మెసాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటం పట్ల ముంబై మహానగర పాలక సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజీ

  ఆంధ్రప్రదేశ్ కు ఎస్సీ ఎస్టీ ఛైర్మన్ గా కారెం శివాజీని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పదవిలో మూడేళ్ల పాటు కారెం శివాజీ కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేసుకుంటూ, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఎస్సీ ఎస్టీ ప్రజల బాగోగులు, ప్రయోజనాలు రక్షించేందుకు ఈ కమిషన్ కృషి చేస్తుంది. ఎస్సీ ఎస్టీ చట్టం, 2003 లో అమల్లోకి వచ్చింది. 2006లో తర్వాత కమీషన్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో, ఇప్పుడు మళ్లీ కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసుకుని, దానికి ఛైర్మన్ ను నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు ఇలా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతల్ని కారెం శివాజీ తెలిపారు.

గంగా ప్రక్షాళనకు జర్మనీ చేయూత..!

  భారతదేశ ప్రజలు అతి పవిత్రంగా భావించే గంగానది శుద్ధి కోసం కేంద్రప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహత్కార్యంలో భారత్ కు సాయంగా తాముంటామంటూ జర్మనీ ముందుకొచ్చింది. రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ పద్ధతి ద్వారా, గంగానదిని శుద్ధి చేసేందుకు సాయం చేస్తామని జర్మనీ పేర్కొంది. దీనికి సంబంధించి భారత కేంద్ర జలవనరుల శాఖ, జర్మనీ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కలిసి ఒప్పందంపై సంతకాలు చేశాయి. గంగానదీ పరీవాహక తీరప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువైపోవడం, ఫ్యాక్టరీ వ్యర్ధాలను గంగలోకి వదిలెయ్యడం వంటి పనుల కారణంగా, దశాబ్దాల పాటు గంగానది తీవ్రంగా కలుషితమౌతూ వస్తోంది. మోడీ అధికారంలోకి రాకముందు, గంగా ప్రక్షాళన కూడా తమ మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగానది ప్రక్షాళన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్మనీలోని డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ విధానం ద్వారానే గంగను కూడా క్లీన్ చేయబోతున్నారు. 2016 నుంచి 2018 వరకూ మూడేళ్లపాటు జర్మనీ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటుంది.

జగన్‌పై పరువునష్టం దావా వేస్తా:సీఎం రమేశ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు టీడీపీ ఎంపీ రమేశ్. కొద్ది రోజుల క్రితం రమేశ్‌కు చెందిన కంపెనీపై జగన్‌కు చెందిన సాక్షి పత్రిక కథనాలు ప్రచురించింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రమేశ్. నిరాధారమైన వార్తలు రాస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానన్నారు. యూపీలో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని..అలా పెట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని..ఒకవేళ నిరూపించలేకపోతే సాక్షిని మూసివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్‌కు, అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు.

నన్నపనేనికి వడదెబ్బ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఎండవేడిమికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆస్పత్రిపాలవుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి వడదెబ్బకి గురయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేరారు. వడదెబ్బకు గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ నన్నపనేని రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్యసేవలను నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు.  

ఐపీఎల్‌కి బాంబే హైకోర్టు షాక్..!

బీసీసీఐకీ గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు తరలించాలని బాంబే హైకోర్టు బీసీసీఐని ఆదేశించింది. కరువు పరిస్థితులన్నప్పటికి నీటి ఎద్దడిని పట్టించుకోకుండా ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నారని, ఇందుకు లక్షల నీటర్ల నీరు వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లను వేరే ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన బాంబే హైకోర్టు ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు మార్చాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

వరదల పాపం కొత్తజంటలదే-స్వామి స్వరూపానంద

రోజుకోక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతున్న ద్వారకా శారదా పీఠం శంకరాచార్య..స్వామి స్వరూపానంద సరస్వతి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లి 2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో సంభవించిన వరదలకు హనీమూనర్లే కారణమన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహారయాత్రలకు వస్తుంటారని వారిలో కొత్తగా పెళ్లయిన వారు కూడా ఉంటారు. వారు పరమ పవిత్రమైన, దేవతలు సంచరించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అపవిత్రమైన పనులు చేస్తున్నారని అందుకే అంతపెద్ద ఎత్తున వరదలు సంభవించాయని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పవిత్ర ప్రాంతాల్లో అలాంటి అపవిత్రమైన పనులు ఆపకపోతే ఇంతకంటే భయంకరమైన విపత్తులు మళ్లీ మళ్లీ తప్పవని హెచ్చరించారు.