ప్రఖ్యాత మహిళా బైక్ రేసర్ వీను పాలివల్ దుర్మరణం

మహిళలు బైక్ రేసింగ్ చేయగలరని నిరూపించి దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మహిళల్లో స్పూర్తినింపిన వీను పాలివల్ ఇకలేరు. మధ్యప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు. జైపూర్‌కి చెందిన వీనుకి చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపడం అంటే సరదా..ఆ సరదానే వృత్తిగా మార్చుకుని హార్లే డేవిడ్‌సన్ బైక్‌ను గంటకు 180 కిమీల స్పీడ్‌‌తో నడిపి సంచలనం సృష్టించింది. దేశంలోని ఎన్నో నగరాల్లో బైక్ రేసుల్లో పాల్గోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బైక్ జర్నీ చేసి దానిని డాక్యుమెంటరీ తీయాలనుకుంది. కానీ ఇదే ఆమె చివరి యాత్రగా మారిపోయింది.     వీను తన తోటి బైక్ రేసర్ దీపేశ్ తన్వర్‌తో కలిసి హార్లేడేవిడ్‌సన్ బైక్‌పై టూర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో తన యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. నిన్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కి 100 కి.మీల దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వీను తీవ్రంగా గాయపడటంతో దీపేశ్ ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే పాలివల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్తతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు.  

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదాలు దేశాన్ని వణికిస్తున్నాయి. కేరళలోని కొల్లాం పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించిన సంఘటన మరవకముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధానే జిల్లా భివాండి ప్రాంతంలోని వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భవనంలో అనేకమంది కార్మికులు ఉన్నారు. వీరంతా బిల్డింగ్ పైకి చేరుకోవడంతో వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీకి దగ్గరలోనే నివాస సముదాయాలు ఉండటంతో స్ధానికులు ఆందోళనకు గురవుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముంబై, థానే తదితర ప్రాంతాల నుంచి మరికొన్ని ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

కొల్లం ఘటన.. లొంగిపోయిన ఐదుగురు అధికారులు

  కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 109 మంది చనిపోగా.. 400 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న ఈ ఘటనపై కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదం జరిగిన చోట మూడు కార్లు.. వాటినిండా బాంబులు, పేలుడు పదార్ధాలు ఉండటంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోసినట్టైంది. ఇక పోలీసులు ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురు అధికారులు పోలీసుల ముందు లొంగిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బాణాసంచా పోటీలకు అనుమతి నిరాకరించినా... అధికారులు పట్టనట్లు వ్యవహరించారని కొల్లం కలెక్టర్‌ ఎ.షాయినామోల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈఘటనపై ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి.

ఒక్క పుట్టినరోజు ఖర్చు 9వేల కోట్లా..!

ఎవరి స్తోమతకు తగ్గ రేంజ్ లో వాళ్లు పుట్టినరోజులు జరుపుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్లైతే వారి రేంజ్ కు తగ్గట్టు జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఒక్క పుట్టినరోజునే 9000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతకీ అంత ఖర్చు పెట్టింది ఎవరనుకుంటున్నారా.. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ రాణి. అయితే ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నది ఆమె కాకపోయినా.. ఆమె పుట్టినరోజు వేడుక సందర్భంగా దేశమంతటా సంబరాలు జరిపేందుకు ప్రజలు బిలియన్ పౌండ్లు (రూ.9 వేల కోట్లు) ఖర్చుచేస్తారని 'ద సండే టైమ్స్' పత్రిక సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్ 21 నుండి జూన్ 11 వరకూ జరిగే ఈ వేడుకలకు.. ఒక్కో బ్రిటన్ పౌరుడు ఎంత వెచ్చించాలో తెలుసా సుమారు 42.98 పౌండ్లు. వేడుకల్లో మూడో వంతు బ్రిటిషర్లు హాజరై.. పబ్బులు, బార్లు, వీధి పార్టీల్లో పాల్గొంటారట.

ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న విజయకాంత్..

  తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. అదేదో సినిమాలో హీరో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగినట్టు.. నేతలు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను కాకాపట్టే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు. పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలు జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి.. ఇక రాష్ట్రం నుండి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కూడా అధికారం చేపట్టాయి.. అయినప్పటికీ ఇంకా రాష్ట్రం అనేక సమస్యలతో ఉంది.. ఈసారి డీఎండీకే ప్రజా సంక్షేమ కూటమికి ఒక్క అవకాశం ఇవ్వండి.. అద్భుత పాలన అంటే ఏంటో రుచి చూపిస్తాము అని అన్నారు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న తాను తప్పుచేస్తే.. మిగిలిన ఐదుగురికి ప్రశ్నించే హక్కు ఉందన్నారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలు కోరుకునే పాలనను అందిస్తామన్నారు.

కొల్లం ఘటనపై మాతా అమృతానందమయి సంచలన వ్యాఖ్యలు.. దేవుడికేమైనా చెవుడా?

  కేరళలోని  కొల్లం.. పుట్టంగళ్ ఆలయం సమీపంలో బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన  ప్రముఖ ఆథ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడికేమైనా చెవుడా?...దేవాలయాల్లో బాణాసంచా కాలుస్తారు? అని ఆమె ప్రశ్నించింది. ఈ బాణసంచా కాల్చడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు తీవ్రంగా పరిగణించాలి.. దీనిపై చర్యలు తీసుకోవాలి.. కేవలం మానవుల ఆనందం కోసం బాణసంచా కాలుస్తున్నారు.. దీన్ని పూర్తిగా నిషేదించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేరళ శబరిమల ఆలయ ట్రస్ట్ కు సుప్రీం ప్రశ్న.. దేని ఆధారంతో చెపుతున్నారు..!

  మొన్నటి వరకూ శనిసింగనాపూర్ లోని శని దేవాలయంలోకి స్త్రీలను ప్రవేశించనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే దీనిని వ్యతిరేకించిన బ్రిగేడ్ భూమాతా మహిళా సంఘాల ఆందోళనతో.. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎట్టకేలకు ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళలకు అనుమతి నిషేదంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈకేసుపై విచారించిన సుప్రీం.. ఆలయ అధికారులపై మండిపడింది. రాజ్యాంగం చట్టం కంటే సంప్రదాయం గొప్పదా..? రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టివేసే సంప్రదాయం ఏదైనా ఉందా..? దేని ఆధారంతో మహిళలు దేవాలయాల్లోకి వెళ్లకూడదని చెబుతున్నారు.. దేవుడు సర్వాంతర్యామి అని, అలాంటి దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని స్పష్టం చేసింది. రాజ్యాంగ హక్కు కానంతవరకు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.

కొల్లం ప్రమాదంపై అనుమానాలు.. మూడు కార్లనిండా బాంబులు..

  కేరళలోని  కొల్లం.. పుట్టంగళ్ ఆలయం సమీపంలో బాణసంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగి 100 మందికి పైగా ప్రాణాలు పోగా.. 400 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాదంపై కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. అదేంటంటే.. ఆలయం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లును పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినదగ్గరనుండి కార్లు అక్కడే ఉండటం గమనించిన పోలీసులు తనిఖీలు చేయగా.. కార్ల నిండా బాంబులు.. పేలుడు పదార్ధాలు ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా వారు బాంబులను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఈప్రమాదం సహజంగా జరిగిందా.. లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

అంబేద్కర్ భారీ విగ్రహాం ఇక్కడే?

రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అయితే అది ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయో అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఆర్ గార్డెన్ సమీపంలోని 36 ఎకరాల స్థలంలో ఈ విగ్రహాం ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు..పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కమిటీ తీర్మానించింది. ప్రపంచంలోనే అంబేద్కర్‌కు సంబంధించి ఎత్తైన విగ్రహాం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న బాబాసాహెబ్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర అంబేద్కర్ టవర్స్‌తో పాటు బోరబండలో దళిత్ స్టడీ సెంటర్‌ను ఏకకాలంలో నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.  

పవన్ గురించి జోస్యం చెప్పిన జ్యోతుల...

  నేడు జ్యోతుల నెహ్రూ వైసీపీ ని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని.. ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతుంటాడు.. అలాంటి ఆయన మాటలను నమ్మడం ఎలా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తాం.. కానీ ఆయన చెప్పే మాటలపై మాత్రం తమకు నమ్మకం లేదని అన్నారు. నిన్న ఒక మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పినదానికే భిన్నంగా వ్యాఖ్యానించడం ఆయన నైజమని విమర్శించారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.

టీడీపీలో విబేధాలు.. ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి

  టీడీపీ పార్టీలో పార్టీ నేతల మధ్య విబేధాలు ఒకదాని తరువాత ఒకటి బయటపడుతున్నాయి. ఇప్పటికే అనంతలో జేసీ ప్రభాకర్ రెడ్జి, ప్రభాకర్ చౌదరి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇప్పుడు వైసీపీ పార్టీనుండి వెళ్లిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య విబేధాలు బయటపడ్డాయి. గతంనుంటే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారారు.. ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరిమధ్య సయోధ్య కుదరలేదు. ఈ నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యలయంలో మాట్లాడిన ఆయన ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీలో చేరేంత వరకూ బానే ఉన్నా.. చేరిన తరువాత ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని.. తమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు తనను, సీఎం రమేష్ ను ఆహ్వానిచంవద్దని.. ఆదినారాయణరెడ్డి అనుచరులు కార్యకర్తలను బెదిరిస్తున్నారని.. వారు వినకపోవడంతో ఇళ్ళపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించారు. లోపల ఒకటి పెట్టుకొని.. బయటకు ఒకటి నటించే ఆదినారాయణ రెడ్డి తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

బిల్ కలెక్టర్‌లా పన్ను వసూలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా జనగాం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనదైన స్టైల్లో ప్రజాసేవ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన బిల్ కలెక్టర్ అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే స్వచ్ఛ చేర్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పంచాయతీకి 3.86 లక్షల మొండి బకాయిలు రావాల్సి ఉందని తేలింది. వీటిని రాబట్టడంలో పంచాయతీ అధికారులు విఫలమయ్యారు.   ఈ విషయం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. వెంటనే గ్రామ సర్పంచ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి స్వయంగా తానే రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌లా మారారు. ప్రజాప్రతినిధులను, పోలీసులను వెంటబెట్టుకుని ఒక్కో దుకాణం వద్దకూ వెళ్లి దుకాణ యజమానుల ముక్కుపిండి మరి పన్నురాబట్టారు. అవి చెల్లించని వారి షట్టర్లకు తాళాలు వేయించారు. ఇలా రెండు గంటల్లో ఏకంగా 70 వేల రూపాయలు వసూలు చేశారు. మిగిలిన సోమ్మును తానే వసూలు చేసి ఇస్తానని పంచాయతీకి హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యేగారి పట్టుదలను ప్రజలు మెచ్చుకుంటున్నారు.  

కరుణానిధి వరాలు ఇవే..

  తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఏపార్టీ, ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి.. ఎవరు ఏ నియాజక వర్గం నుండి పోటీ చేయాలి అని ఇప్పటికే అంతా సిద్దమైపోయింది. దీనిలో భాగంగానే నేతలు ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి.. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏరకంగా మేనిఫెస్ట్ తయారుచేయాలో కూడా చేసేవారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో కరుణానిధి ప్రజలకు ఇచ్చిన వరాల వివరాలు..   * ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ * టీఏఎస్ఎంఏసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పన * విద్యార్థులకు ఉచిత నెట్ * నమాజ వార్ పథకం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేయడంలో శిక్షణ * సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ప్రారంభం * రైతులకు కనీస మద్దతు ధర * ప్రొహిబిషన్ చట్టం అమలు * కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టడం * ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు * లోకాయుక్త ఏర్పాటు * కొత్త పారిశ్రామిక వేత్తలకు రూ.లక్ష పెట్టుబడి * అన్ని జిల్లాల్లో ఉపాధి కేంద్రాలు * 750 చేనేత యూనిట్లకు ఉచిత విద్యుత్ * రేషన్ కార్డు లేనివారికి పదిహేను రోజుల్లో స్మార్డ్ కార్డు * అన్న ఉనావగమ్ ప్రారంభం * ప్రత్యేక నీటి పారుదల శాఖ * వరదల నివారణకు 200 ప్రత్యేక చెక్ డ్యాములు * మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకం * అన్ని రకాల పరువునష్టం కేసులు వెనక్కి * కుడాంకుళం ప్రాజెక్టుకు సంబంధించి పెట్టిన కేసులన్నీ రద్దు * శాసన మండలి ఏర్పాటు * విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ * పాఠశాలల్లో అన్ని ఖాళీల భర్తీ * నెలకు 20 కేజీల ఉచిత బియ్యం * ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు * నాలుగో పోలీసు కమిషన్ ఏర్పాటు * స్వచ్ఛ తమిళనాడుగా మార్పు * జల్లికట్టు కొనసాగింపునకు కృషి * పేదల గృహనిర్మాణాలకు రూ.3లక్షల సబ్సిడీ * సబ్సిడీ ధరల్లో మొబైల్ ఫోన్లు

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల దారుణహత్య

ఆస్ట్రేలియా, అమెరికా , జర్మనీ, బ్రిటన్ ఇలా దేశమేదైనా భారతీయులపై ప్రతిరోజు వివిధ దేశాల్లో దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఉక్రెయిన్ వచ్చి చేరింది. ఉక్రెయిన్‌లో ఇద్దరు భారతీయ విద్యార్ధులు దారుణ హత్యకు గురికాగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. భారత్‌కు చెందిన ప్రణవ్ శాండిల్య, అంకుర్ సింగ్, ఇంద్రజిత్ చౌహన్‌లు ఉక్రెయిన్‌లోని ఉజ్‌గొరొడ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు. నిన్న ఉక్రెయిన్ జాతీయులు భారతీయ విద్యార్ధులపై కత్తులతో దాడి చేసారు. ఈ దాడిలో ప్రణవ్, అంకుర్ సింగ్‌లు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..ఇంద్రజిత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి మరణాన్ని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

మరో అవార్డు సొంతం చేసుకున్న మథర్ థెరిస్సాకు

  40 సంవత్సరాలపాటు తన జీవితాన్ని సేవకు అంకింత చేసిన నోబుల్ బహుమతి గ్రహీత మథర్ థెరిస్సాకు పారిస్ సెయింట్ హుడ్ హోదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకున్నారు మథర్ థెరిస్సా. ఆమెక ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డ్ లభించింది. సాధారణంగా ఈ అవార్డును అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ.. విజయాలను సాధించిన వారికి అందజేస్తారు. దాదాపు 2010 నుండి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించిన పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ ఏడాది కూడా ఈ అవార్డులను అందజేయనున్నారు. మొత్తం 14 విభాగాల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. థెరిస్సాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకోవటానికి ఇటలీ నుంచి శుక్రవారం లండన్ చేరుకున్నారు.

సెలవుపై మోడీకి లేఖ రాస్తా.. సుమన్

  మహాత్మ జ్యోతిరావు పూలే 189వ జయంతి సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని అన్నారు. అంతేకాదు దీనిపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాస్తానన్నారు. ఇంకా హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలని.. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలని సూచించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు.. 11 మంది మృతి

  విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోయాయి. వివరాల ప్రకారం..విశాఖపట్నం ఎన్ఏడీ దరి బుచ్చిపాలేనికి చెందిన ఈదలాడ శ్రీను అనే వ్యక్తి తన కుటంబంతోపాటు, వదిన వారి పిల్లలతో కలిసి తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరాడు. అయితే నక్కపల్లి దగ్గరకు రాగానే కారు టైరు పగిలిపోవడంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ను గుద్దింది. ఈలోపు ఏం జరిగిందా అని ఆలోచించుకొనే లోపే భారీ పైపులతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోయి కారులో ఉన్నవారందరూ మృతి చెందారు. ముఖ్యంగా లారీ కారుని తొక్కుకుని వెళ్లడంతో, కారు ఇంజిన్‌కింద చిక్కుకుపోయి తుక్కుతుక్కయ్యింది. ఇందులోని వారంతా దుర్మరణం చెందడంతోపాటు శరీరభాగాలన్నీ మాంసపు ముద్దలైపోయాయి. అంతేకాదు చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులే ఉండటంతో ఆ ఘటన చూసినవారందరినీ కలిచి వేస్తుంది.

సాయిపూజ వల్లే మహారాష్ట్రలో కరువు -స్వరూపానంద

షిర్డీ సాయిబాబాపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరువు విలయ తాండవం చేస్తోంది దీనికి కారణం షిర్డీసాయిబాబా పూజా ఫలితమేనన్నారు. దేవుడిని పూజించవచ్చు కాని ఫకీరైన సాయిబాబాను పూజించడం ఏమిటని ప్రశ్నించారు. అందుకనే మరాఠా గడ్డ కరువు కాటకాలతో అల్లాడుతోందన్నారు. పూజకు యోగ్యత లేని వారిని పూజించిన చోట కరువు, వరదలు, చావు భయం లాంటివి మనుషులను వెంటాడుతుంటాయన్నారు. 94 ఏళ్ల స్వరూపానంద గతంలో పలుమార్లు సాయిబాబాని టార్గెట్ చేశారు. సాయిబాబా దేవుడు కాదని ఆయనను పూజించరాదని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దూమారం రేగడంతో పాటు ఆయనపై ఏకంగా కేసు నమోదైంది.  

నా భార్యకు 'భారత్ మాతాకీ జై' అని పేరు పెడతా.. కన్నయ్య కుమార్

  దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో జెఎన్ యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు కన్నయ్య తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో హాట్ ఏదంటే భారత్ మాతాకి జై వివాదం అని చెప్పొచ్చు. ఎవరో ఒకరు.. ఎక్కడో దగ్గర దీనిపై నోరు కదుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే కన్నయ్య కుమార్ కూడా ఈ నినాదంపై నోరు తెరిచాడు. తనకు పెళ్లయిన తరువాత తన భార్యపేరు 'భారత్ మాతాకీ జై' అని పెట్టుకోమని చెబుతానని.. తన పేరును కూడా అదే విధంగా మార్చుకుంటానని చెప్పారు. తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్ల పేరును ‘భారత్ మాతాకీ జై’ అని పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. మరి కన్నయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.