వచ్చే ఏడాదినుండి అన్ని సెట్లు ఆన్‌లైన్‌లోనే.. గంటా

మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్లతో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 29న ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తామని.. వచ్చేనెల 9న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలోనూ ఎంసెట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసే సెంటర్లలో భద్రత, ఇతర అంశాలపై అక్కడి డీజీపీ, సీఎస్‌తో మాట్లాడతామని చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌తోపాటు అన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌లు హాజరయ్యారు.

కోహినూర్ వజ్రంపై చేతులెత్తేసిన కేంద్రం..

  కోహినూర్ వజ్రాన్ని మన దేశానికి తీసుకురాలేమని కేంద్ర సాంస్కృతిక శాఖ సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పేసింది.  కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని.. ఆ విలువైన వజ్రం చోరీ కాలేదని.. నాటి రాజులు ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని చెప్పింది. ఆల్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్‌కు చెందిన ఓ వ్యక్తి కోహినూర్ ను ఇండియాకి తెప్పించడంపై కేంద్రం స్పందన ఏంటో తెలుసుకుందామని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం.. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనికి స్పందించిన కేంద్రం పైవిధంగా సుప్రీంకు తేల్చి చెప్పేసింది.

రోడ్డు ప్రమాదంలో 25 మంది కళాకారులు మృతి

  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. ఒడిశాలోని రెంటా ప్రాంతం నుండి 40 మంది కళాకారులతో బస్సు దేవ్ ఘఢ్ కు బయలుదేరింది. అయితే జిల్లాలోని జార్జ్ వ్యాలీ సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున్న లోయలోపడింది. ఈ ప్రమాదంలో 25 మంది కళాకారులు అక్కడికక్కడే చనిపోగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మరణించిన వారందరూ భారతి నాట్య సమితికి చెందిన వారని పోలీసులు తెలుపుతున్నారు. బస్సువేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించాడని పోలీసులు చెప్పారు.

పోర్న్ సినిమాలు చూస్తే రూ.2.22 లక్షల జీతం..

  వారానికి 20 గంటలపాటు ఉద్యోగం చేస్తే రూ.2.22 లక్షల జీతం. ఇంతకీ ఏంటీ ఆ ఉద్యోగం.. ఎక్కడ అని అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్టంతా.. ఆ ఉద్యోగం ఏంటో తెలిస్తే ఖంగు తినాల్సిందే. డెన్మార్క్ లోని ఓ ప్రముఖ బార్ విచిత్రమైన జాబ్ ఆఫర్ చేసింది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే ఏకంగా రూ.2.22 లక్షల జీతం ఇస్తామని ప్రకటన చేసింది. అంతేకాదు జాబ్ కు కావాలసిన అర్హతలు కూడా అందులో పేర్కొంది. బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని.. ఏదో సరదాగా కాకుండా.. సీరియల్ ఉద్యోగం చేయాలని.. వాళ్లకు 'డీజే' లాగే 'పీజే' అనే టైటిల్ కూడా ఇస్తామని తెలిపారు. ఈ సందర్బంగా బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్.. తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని.. ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.

వైసీపీ పార్టీలోనే స్వేచ్ఛ.. టీఆర్ఎస్ లో వైసీపీ విలీనమా..? పొంగులేటి

  తెలంగాణ వైసీపీ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచిన ఏకైన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పటినుండో ఈయన పార్టీ మార్పుపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ.. దీని వెనుక తుమ్మల హస్తం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈవార్తలపై స్పందించిన పొంగులేటి ఆవార్తలను ఖండించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని పార్టీ నేత చండ్ర నరేంద్ర కుమార్ నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వైసీపీని వీడే ఉద్దేశం, అవసరం తనకు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు వైసీపీ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని కూడా చెప్పారు. ఈ నెల 27న తెలంగాణలో ఏదో జరుగుతోందని, టీఆర్ఎస్ లో వైసీపీ విలీనమవుతోందని దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’’ అని ఆయన మీడియాకు హితవు పలికారు.

ఈక్వెడార్లో భారీ భూకంపం.. చీలిపోయిన రహదారులు..

  లాటిన్‌ అమెరికా దేశమైన ఈక్వెడార్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి భవనాలే కాదు.. రహదారులు ఎక్కడిక్కడ చీలిపోయాయి. వంతెనలు కూడా కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 246 మంది చనిపోగా.. రెండు వేల మంది తీవ్రంగా గాయపడ్డారని దేశ అధ్యక్షుడు రఫాయెల్‌ కొరెయా తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు, విపత్తు నిర్వహణ దళాలు.. భవన శిధిలాల్లో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు యత్నిస్తున్నాయి. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు చెబుతున్నారు.

మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. జగన్ కు చెక్..!

  టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే పదిమందికి పైగా ఎమ్మెల్యేలు అధికార టీడీపీ పార్టీలో చేరిపోయారు. మరోపక్క ఈవలసలను ఎలా ఆపాలో తెలియక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు.. మరికొంత మంది నేతలు జట్టుపీక్కుంటున్నారు. ఈనేపథ్యంలోనే  మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అన్న సామెత ప్రకారం.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవడానికి చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.   ఇదిలా ఉండగా త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు టిడిపిలో చేర్పించుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. తద్వారా జగన్‌కు రాజ్యసభ సీటు విషయంలోను చెక్ చెప్పాలని భావిస్తోందట.

పదేళ్ల చిన్నారికి మోడీ థ్యాంక్స్.. ఎందుకు..?

ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓ పదేళ్ల చిన్నారి మోడీకి లేఖ రాసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. క్షణం తీరిక లేకుండా ఉండే మోడీ తిరిగి ఆమెకు థ్యాంక్స్ చెపుతూ లేఖ రాయడం. అశ్చర్యంగా ఉంది కదూ.. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరానికి చెందిన అదితి అనే ఓ పదేళ్ల బాలిక దేశం కోసం ప్రధాని ప్రారంభించిన పథకాలకు థ్యాంక్స్ చెబుతూ... ఆ పథకాలు ఎంతో మార్పును తెస్తున్నాయని మోడీకి లేఖ రాసింది. దీనికి మోడీ స్పందించి థ్యాంక్స్ చెబుతూ తిరిగి లేఖ రాశారు. దీంతో అదితి ప్రధాని తిరిగి లేఖ రాస్తారని ఊహించలేదని.. ఆ లేఖ చూసిన తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.  ప్రధానికి లేఖలు రాయడాన్ని ఇకముందూ కొనసాగిస్తానని చిన్నారి చెబుతోంది.

మంత్రిగారి సెల్పీతో వచ్చిన కష్టాలు..

  ఈ రోజుల్లో సెల్ఫీలు తీసుకోవడం చాలా కామన్ థింగ్. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు దాకా అందరూ సెల్ఫీలు తీసుకొని తమ ముచ్చటను తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాగే సెల్ఫీ తీసుకొని చిక్కుల్లో పడ్డారు ఓ మంత్రిగారు. మహారాష్ట్రలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పంకజా ముండే లాతూర్ పర్యటనలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆమె లాతూర్ లోని కరువు ప్రాంతాల్లో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆ ఫొటోలని సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేసింది. అంతే అది చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఎండిపోయిన మంజీరా నది ముందు సెల్ఫీలు దిగడం ఏంటంటూ.. ఆమె వైఖరి రైతులను అవమానపరిచేదిగా ఉందంటూ మండిపడుతున్నారు. అయితే వీటికి స్పందించిన  పంకజా ముండే ఆ విమర్సలను పట్టించుకోకుండా..  లాతూరుకు నీటిని అందించేందుకు ఏన్నో ఏర్పాట్లూ శరవేగంగా సాగుతున్నాయని మరో పోస్టును పెట్టారు.

కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంది.. అందుకే జగన్ ని కలిశా.. ఆర్.కృష్ణయ్య

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరి భేటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు వీటిపై స్పందించిన ఆర్.కృష్ణయ్య కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. బీసీల సంక్షేమం కోసం.. వారికి యాభైశాతం రిజర్వేషన్లకోసం.. ప్రధానికి లేఖ రాయమని జగన్ కు చెప్పానని.. దీనిలోభాగంగానే ఆయనను కలిశానని అన్నారు. అంతేకాని ఏదో పదవులు ఆశించికాదు.. అసలు తనకు ఎమ్మల్యే పదవి గడ్డిపోచతో సమానమని.. తాను ఏ పార్టీలో భాగం కాదని, తనకు పార్టీ పెట్టే ఆలోచన ఉందని, అవసరమైనప్పుడు ముందుకు వెళ్తానని అన్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని.. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తానంటే నిరాకరించానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదు.. టీడీపీ లోనే ఉంటూ బీసీల సంక్షేమానికి కృషి చేస్తా.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిలదీస్తానని చెప్పారు. మొత్తానికి ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకే కాదు.. ముఖ్యమంత్రికి కూడా షాకింగ్ ఇచ్చేలా ఉన్నాయి. మరి ఆయన వ్యాఖ్యలకు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

"గిఫ్ట్" తిరిగిచ్చేసిన యడ్యూరప్ప..!

కోటి రూపాయల కారుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆలోచనలో పడ్డారు. తన అనుచరుడు, వ్యాపారవేత్త మురుగేశ్ నిరానీ ఇచ్చిన కారును తిరిగి ఆయనకే ఇచ్చేశారు. మండే ఎండల్లో పార్టీ అధ్యక్షుడు పర్యటించడం కష్టమని భావించిన ఆయన అభిమాని కమ్ అనుచరుడు మురుగేశ్ ఆయనకు కోటీ పదిహేను లక్షల రూపాయల విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును బహుమతిగా అందజేశారు. దీనిపై కాంగ్రెస్, జేడీఎస్‌లు ముప్పేట దాడి చేశాయి. రైతులు కరువుతో అల్లాడుతుంటే వారు లగ్జరీ కారులో పర్యటించడం ఏంటని విమర్శలు రేగాయి. దీనిపై వెనక్కి తగ్గిన యెడ్డీ కారును తిరిగి ఇచ్చేయడంతో పాటు రైలులో వెళ్లి కరువు ప్రాంతాలను పరామర్శిస్తానని ప్రకటించారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి వేడుకలో కాల్పులు..

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహ వేడుకలో కాల్పులు జరిగాయి. రాజ్‌కోట్‌కు చెందినన రివా సోలంకితో ఇవాళ జడేజా వివాహం జరుగింది. అందరూ పెళ్లి వేడుకలో ఆనందంగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. పెళ్లి వేడుక సందర్భంగా జరిగిన బరాత్‌లో తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే వేడుకలో ఆనందంతో ఎవరో తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్ల వరకు కాల్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. లైసెన్స్ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే..ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని స్థానిక పోలీసులు తెలిపారు. 

బీహార్‌లో రోడ్డు ప్రమాదం..ఆరుగురు తెలుగువారి మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైమూర్ జిల్లాలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా తెలుగువారే. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా. వీరు వారణాసి నుంచి గయ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి: బీహార్‌లోని కైమూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు తెలుగువారు మరణించిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

లక్నోలో విషాదం..కూలిన మెట్రో బ్రిడ్జి

ఇండియాలో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు ఎప్పుడు కూలుతాయో తెలియడం లేదు. మొన్న కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 10 మంది మరణించిన సంఘటన మరవకముందే తాజాగా లక్నోలో మరో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని ఆలంబాగ్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ పిల్లర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.  

కంటతడి పెట్టిన పోప్

సిరియా అంతర్యుద్థంతో అక్కడి నుంచి గ్రీస్‌ తదితర దేశాలకు వలసలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిరియా నుంచి పారిపోయి గ్రీస్‌ లెస్బోస్‌లో ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థులను పోప్ ఫ్రాన్సిస్ పరామర్శించారు. లెస్బోస్‌లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్థులు స్వాగతం పలికారు. శిబిరంలోని ఒకరు తమను ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరి కొందరు తమకు విముక్తి కల్పించమంటూ వేడుకున్నారు. వారి దురవస్థని చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. పోప్ వెంట ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్‌ తదితరులున్నారు. మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు.