కేజ్రీవాల్ కొత్త క్రేజీ థాట్.. లెర్నింగ్ లైసెన్స్ రద్దు..!

  ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి, బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ క్రేజీ ఆలోచనకు బాగానే మార్కులు పడ్డాయి. ఇప్పుడు కేజ్రీవాల్ మరో క్రేజీ ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ఢిల్లీ పరిధిలో లెర్నింగ్ లైసెన్స్ విధానాన్ని తొలగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందని.. అధికంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుందని.. అనేక ఫిర్యాదులు వచ్చిన పిమ్మట కేజ్రీవాల్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించగా.. ఆయన కూడా దానికి అనుకూలంగానే స్పందిచారని..  మంచి ఆలోచనేనని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. చదువుకున్న వారికి రవాణా నిబంధనల గురించి తెలుసునని, వారికి లెర్నింగ్ లైసెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేజ్రీవాల్ ప్రతిపాదనను కొంత మంది అధికారులు మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

జయలలితకు కుష్బూ సవాల్..!

  త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత తన నియోజకవర్గమైన ఆర్కేనగర్ నుండి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజకవర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటీ చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పటికే ఈ పోటీపై ఆసక్తి పెరగగా.. ఇప్పుడు కాంగ్రెస్-డీఎంకే కూటమి కూడా ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి కుష్బూను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి అనుకున్నది అనుకున్నట్టు జరిగి.. కుష్బూని కనుక రంగంలోకి దింపితే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది.

డీకే అరుణకు షాక్..కారెక్కిన సోదరుడు

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో  సమావేశమైన చిట్టెం ఆ వెంటనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. చిట్టెం రామ్మెహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకున్నట్లు రామ్మోహన్ తెలిపారు.

జగన్‌ని కలిసిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రోజుకొక వైసీపీ ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంప్ ఆఫీస్‌కు క్యూకడుతుంటే ఇవాళ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. జగన్‌ని కలిసింది ఎవరో కాదు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య.   అయితే జగన్‌ని కలిసింది ఏ పార్టీలో చేరడానికి కాదు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్న ఆయన దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌ని కలిసి వినతిపత్రం అందించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని జగన్‌ని కోరారు. ఏపీలో వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్య జగన్‌ని కలవడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.  

నిట్ తెలుగు విద్యార్ధులు.. ఫ్యాకల్టీనే అత్యాచారం చేస్తామని బెదిరించారు..

  శ్రీనగర్ నిట్ లో స్థానికుల, స్థానికేతర విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు తన స్వస్థలాలకు రావడానికి అనుమతి ఇచ్చిన సంగతి కూడా విదితమే. అలా అక్కడి నుండి బయటపడిన విద్యార్ధులు యూనివర్శిటీలో అనుభవించిన కష్టాల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ నుండి ఢిల్లీకి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామని.. నిరసన చేపడుతున్న సమయంలో స్థానిక విద్యార్దులు తమను బెదిరించారు.. ఆఖరికి ఫ్యాకల్టీ కూడా క్లాసులకు రాకపోతే అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్బంగా వారు తమ డిమాండ్లను కూడా తెలియజేశారు.. ఇక మేం అక్కడ ఉండలేమని.. నిట్ ను అక్కడి నుండి తరలించాలి.. లేదా మమ్మల్ని వేరే వర్శిటీల్లోకి చేరే అవకాశం ఇవ్వాలని.. మమ్మల్ని కొట్టిన శ్రీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన 30 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన ఏపీ భవన్ అధికారులు, వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.

జగన్ తో ఆర్. కృష్ణయ్య భేటీ.. అందుకేనా?

  తెలంగాణ టీడీపీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో లోటల్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తాను జగన్‌ను కోరానని చెప్పారు. దీనికి జగన్ అనుకూలంగా స్పందిచారని.. వారంలోపులో లేఖ రాస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంకా కాపు రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని.. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలు నష్టపోతారని ఆయన ఆరోపించారు. మరోవైపు కృష్ణయ్య, జగన్ భేటీలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పెద్దలు.. కృష్ణయ్య చెప్పినట్టు రిజర్వేషన్ల నేపథ్యంలోనే భేటీ అయ్యారా.. లేక ఇంకా ఏదైనా మతలబు ఉందా అంటూ సందేహిస్తున్నారు.

జగన్ ఇలాకాలో మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి సుజయకృష్ణ రంగారావు..!

వైసీపీ నుండి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడి పార్టీ నుండి జంప్ అవుతున్నారు అని వార్తలు గురించి ఇంకా మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే జగన్ షాకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కూడా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సుజయకృష్ణ రంగారావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.  తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నానని వెల్లడించిన ఆయన.. నేతల అభిప్రాయాలను కోరారు. త్వరలోనే తాను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని ఆయన తెలిపినట్టు సమాచారం. తనతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారుతారని రంగారావు వెల్లడించారట.

తెలంగాణ నుండి రూ. 2,500 కోట్లు వసూలు చేయండి.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు (ఏపీఎస్ఈబీ) భేటీ ఆయ్యాయి. ఈ సందర్బంగా వారు రూ.1000 కోట్లకు పైగా విలువైన హైదరాబాద్ లోని ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో లకు చెందిన ఆస్తులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఏపీ, తెలంగాణా విద్యుత్ సంస్థలకు చెందిన ఆస్తుల విభజనకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కమిటీని నియమించేందుకు చొరవ తీసుకోవాలని సూచించింది. దీంతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం వేదవ్యాసరావు, సీహెచ్ విజయభాస్కర్ తదితరులు వున్నారు.

స్కార్ప్ కట్టుకున్న వాళ్లకి రైల్లో అనుమతి లేదు..!

  ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషనులో రూ. 12 లక్షల దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ముఖం కనిపించకుండా స్కార్ప్ కానీ, మఫ్లర్, దుప్పట్టా కట్టుకున్న వారికి రైల్లో ప్రవేశించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం దీని నుండి మినహాయింపు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే ముందు చెకింగ్ చేసే సమయంలో ముఖం ముసుగులు తీసివేయమని చెబుతారని, దీని ద్వారా వారి ముఖాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. ఆ విధంగా దొంగలను పట్టుకోవడం కొంతవరకూ సాధ్యమవుతుందని తెలిపారు.

జ్యోతుల నెహ్రూ స్థానంలో కన్నబాబు..

వైసీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేవారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు జిల్లా బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. ఆయన పేరు మాత్రం ఖరారైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ కమిటీల నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమైన జగన్, ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారని సమాచారం.

అమ్మాయిల దుస్తులపై ప్రధాని కామెంట్లు.. పొట్టిబట్టల్లో యువతులు రేపర్ లేని కాండీ

రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అప్పుడప్పుడు ఏదో ఒకవిషయంపై నోరు జారుతుంటారు. ఇప్పుడు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ చానోచా కూడా యువతుల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. థాయ్ లాండ్ 'సాంగ్ క్రాన్' అనే పేరుతో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడుతూ.. అంగసౌష్టవం బయటకు కనిపించేలా కురచ, బిగుతైన దుస్తులు ధరించవద్దని.. పొట్టిబట్టల్లో ధరిస్తే యువతులు రేపర్ లేని కాండీ(ఆచ్చాదన లేని చాక్లెట్)లా ఉంటారని వ్యాఖ్యానించారు.   సాధారణంగా ఆ వేడుకల్లో యువతే ఎక్కువ ఉత్సాహంగా రెయిన్ డాన్సులు చేస్తుంటారు. దీంతో వారిపై వేధింపులు ఎక్కువవుతాయి. అందుకే దేశ ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని థాయ్ లాండ్ సైనిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిన్న నలుగురు ఎమ్మెల్యేలు .. నేడు మరో ఎమ్మెల్యే.. జగన్ కు షాకులమీద షాకులు

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలు మామూలుగా షాకులివ్వట్లేదు. నిన్ననే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్యే జగన్ కు షాకివ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అశోక్ రెడ్డి పార్టీలోకి చేరుతున్నారన్న వార్తలు రాగానే.. ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు. అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు. ఎట్టకేలకు అక్కడ లోకేశ్ తో భేటీ అయి.. అశోక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని.. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ అన్నే రాంబాబు బాగానే పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ బాగానే బలపడిందని, కొత్తగా అశోక్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఒరిగేదేమీ లేదని చెప్పారు.   అయితే లోకేశ్ మాత్రం పార్టీలోకి చేరతామంటూ ఎవరు ముందుకు వచ్చినా కాదనవద్దని వారికి సూచించారు. అయినా పార్టీలో చేరుతున్న విపక్ష ఎమ్మెల్యేలకు చెందిన నియోకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలకు సర్దిచెప్పిన తర్వాతే ముందడుగు వేస్తున్నాం కదా అని కూడా లోకేశ్ వారికి చెప్పారు. దీంతో అశోక్ రెడ్డి పార్టీ మార్పు పై స్పష్టత వచ్చినా.. ఎప్పుడు పార్టీ మారుతారో ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

కాశ్మీర్లో జవాన్ల కాల్పులు.. వర్ధమాన క్రికెటర్ మృతి

  ఉత్తర కాశ్మీర్లోని హంద్వారాలో కాల్పుల కలకలం రేగింది. ఆందోళనకారులపై జవాన్లు దాడివలన ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఓ వర్ధమాన క్రికెటర్ నయీం అనే యువకుడు మరణించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. కళాశాల నుండి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్ధిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో జవాన్లు వారిపై కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. అయితే జవాన్లు మాత్రం ముందుగా స్థానికులే తమపై రాళ్లతో దాడి చేశారని.. ఆ తర్వాతే మేం కాల్పులు జరిపామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మూడేళ్ల కింద జాతీయ స్థాయిలో అండర్19 జట్టులో నయీం  ఆడాడని అతని స్నేహితుడు తెలిపాడు.

తెలంగాణ సర్కారుకు సుప్రీం అక్షింతలు.. కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏంటీ..

  తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో చేతిలో మొట్టికాయలు తినడం కొత్తేమికాదు. ఏదో ఒక విషయంలో ఎప్పుడూ కోర్టుల చేత తిట్లు తిట్టించుకుంటునే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 398 ప్రభుత్వ పాఠశాల్లో 'సున్నా' శాతం అడ్మిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషితో సమానమని వ్యాఖ్యానించింది. విద్యార్థుల ప్రవేశాలు జరగకపోవడానికి గల కారణాలతో నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 10కి వాయిదా వేసింది.

ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్ కు ఊరట.. అరెస్ట్ చేయవద్దు

  బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాహుల్ కు కోర్టులో ఊరట లభించింది. రాహుల్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ముంబై సెషన్స్ కోర్టు దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపై విచారించి.. ఈ నెల 18 వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయవద్దంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బుధవారం నుంచి 18 వరకు ప్రతిరోజు ముంబైలోని బంగుర్నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని రాజ్సింగ్ను ఆదేశించింది.

చంద్రబాబుకు చిరంజీవి ఆఫర్.. నేను కూడా వస్తా..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సినీ నటుడు.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఓ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఏం ఆఫర్ అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా ఆడియో రిలీజ్ విశాఖలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. నాడు చెన్నై నుండి సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని.. అలాగే విశాఖపట్నంలో కూడా  విశాఖలో అదే విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. అంతేకాదు విశాఖలో సినిమా స్టూడియోలకు భూములు గుర్తించి.. వాటి నిర్మాణానికి.. మౌలిక సదుపాయాలు కల్పించాలని.. విశాఖలో చిత్రపురి కాలనీని నిర్మించాలని సూచించారు. చంద్రబాబు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దృష్టి సారిస్తే నేను కూడా విశాఖకు వస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సినిమా పరిశ్రమ కళకళలాడాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

కరువు ఎఫెక్ట్..ఐపీఎల్ మ్యాచ్‌లకు మురుగునీరు

మహారాష్ట్రలో కరువు ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లపై గట్టిగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు తీసుకుంటున్న చర్యలపై బీసీసీఐ బాంబే హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మహారాష్ట్రలో కరువు పరిస్థితుల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం నీటి వృథాపై లోక్‌సత్తా మూవ్ ‌మెంట్, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై న్యాయస్థానం సీరియస్ అయింది. మ్యాచ్‌ల ఏర్పాట్లపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది.   ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మురుగునీటిని రీసైకిల్ చేసి ఉపయోగిస్తామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వివరించింది. పంజాబ్ కింగ్స్ తాము ఆడబోయే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పూణే, ముంబైలలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ రెండు స్టేడియాల్లో 17 మ్యాచ్‌లు జరగనున్నాయి.