ఈక్వెడార్‌లో భారీ భూకంపం..28 మంది మ‌ృతి

ఈక్వెడార్‌ వరుస భూకంపాలతో వణికిపోయింది. 11 నిమిషాల వ్యవధిలో రెండు చోట్లు భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజధాని క్వీటోకి పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లో అర్థరాత్రి 11.58 ప్రాంతంలో భారీగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8, 7.8గా నమోదైంది. క్వీటోలో భూక్రంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడ సునామీ వచ్చే అవకాశముందని ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది మరణించినట్టు సమాచారం. ప్రమాదం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు దేశ ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ పేర్కొన్నారు.

మే నెలాఖరు కల్లా వైసీపీ ఖాళీ అవుతుందట.. బుద్ధా వెంకన్న జోస్యం

ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి వరుసపెట్టి ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతుండటంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా మిగిలిన నేతలు కూడా ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో ఉన్నారు. పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలను.. పార్టీలోని సీనియర్ నాయకులను రంగంలోకి దిగి బుజ్జగించే పనిలో ఉన్నా వారుమాత్రం పార్టీ మారుతున్నారు. అసలే ఏం చేయాలో తెలియక బెంబేలెత్తి పోతున్న సమయంలో ఇప్పుడు టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు వైసీపీ కలవర పడుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ..  మరింత హీట్ ను పెంచుతున్నాయి. మే నెలాఖరు నాటికి రాష్ట్రంలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, ఏపీలో టీడీపీ ఒక్కటే అతి పెద్ద సింగిల్ పార్టీగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. తాము డబ్బులిచ్చి ఏ ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేయలేదన్నారు. అలాంటి అవసరం తమకు లేదని, టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో అధికార పార్టీ చేసే వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెరిగింది.

రజనీ కాంత్ పై విజయకాంత్ కామెంట్లు.. రజనీకాంత్ లా పిరికివాడిని కాదు

తమిళనాడులో రజనీ కాంత్ ను అభిమానులు దాదాపు దేవుడు  లాగానే చూస్తారు. ఒక్క తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా రజనీకాంత్ అంటే అందరూ అభిమానిస్తారు. అలాంటి రజనీకాంత్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నాడు డీఎండీకే అధినేత విజయకాంత్. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ.. నా పేరు విజయకాంత్ నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించాడు. అంతే ఇంక రజనీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే విజయకాంత్ దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు విజయకాంత్ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అభిమానులు మనసు చూరగొనేలా వ్యాఖ్యానించాలే కానీ.. ఇలా వారినుండి వ్యతిరేకత వచ్చేలా వ్యాఖ్యానించడం ఏం బాలేదని అంటున్నారు. మరి దీనిపై విజయకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

టీడీపీలో చేరిన సునీల్.. నా తప్పే.. చెప్పుతో కొట్టినా భరిస్తా అంటున్న వైసీపీ నేత

  వైసీపీ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలా జంప్ అయిన వారిలో గూడురు ఎమ్మెల్యే సునీల్ కూడా ఉన్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు సునీల్ టీడీపీలో చేరడంపై వైసీపీ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ బాగా పనిచేస్తాడని జగన్ కు చెప్పానని.. కానీ తనను మోసం చేసి టీడీపీలో చేరాడు.. ఈ విషయంలో తప్పు నాదే.. ఇందుకు గూడూరు ప్రజలు చెప్పుతో కొట్టినా భరిస్తానని అన్నారు. అంతేకాదు మా కుటుంబానికి ఏదో శాపం ఉంది.. అందరూ వెన్నుపోట్లు పొడుస్తారు.. ఇప్పుడు సునీల్ కూడా అదే చేశాడని అన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మాకు ఓటెయ్యకపోతే అంతే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత బెదిరింపు

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నేతలు పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అయితే సాధారణంగా ప్రచారంలో పాల్గొన్న ఏ నేతలైనా తమకు ఓటు వేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. కానీ ఇక్కడ ఓనేత మాత్రం ఏకంగా బెదిరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ మన్నన్ అనే నేత ఓ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవ‌త్స‌రం పొడ‌వునా ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తామనీ, అయితే త‌మ‌కు ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవ‌ల‌సి వస్తుందని తాము ఆశించినంత‌గా మెజారిటీ ఇవ్వాల‌ని లేదంటే త‌మ‌లో అస‌హ‌నం చూస్తార‌ని పేర్కొన్నాడు. మరి ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపిస్తారో లేదో చూడాలి.

మార్క్ జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మిన కొచ్చి స్టూడెంట్..

  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరంటే మార్క్‌ జుకర్‌బర్గ్ అని తెలయని వారుండరు. ఫేస్ బుక్ తో సోషల్ మీడియా రంగంలోనే విప్లవాన్ని తీసుకొచ్చాడు. అలాంచి జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మాడు ఏ కొచ్చి కుర్రాడు. వివరాల ప్రకారం.. అమల్ ఆగస్టిన్‌ అనే కుర్రాడు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతనికి డొమైన్ పేర్లను సొంతం చేసుకోవడం హాబీ. ఈ నేపథ్యంలోనే అమల్ నాలుగు నెలల క్రితం 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్‌.ఓఆర్‌జీ' పేరిట ఓ వెబ్‌సైట్‌ డొమైన్‌ ను రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ డొమైన్ లో జుకెర్ బర్గ్ కూతురి పేరు ఉండటంతో ఈ డొమైన్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. అమల్‌తో బేరసారాలు ఆడి.. 700 డాలర్ల (రూ. 46వేల)కు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుంది. దీనికి అమల్ ఈ డొమైన్ అమ్మినందుకు ఎంత డబ్బు వచ్చిందన్నది ముఖ్యం కాదు.. ఫేస్ బుక్ లాంటి కంపెనీ తనను ఆశ్రయించి బేరసారాలు జరిపిందని ఇదే తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

బీజేపీకి ఓటు వేసినందుకు భార్యకు విడాకులు.. ఎక్కడ..?

  కొన్ని సార్లు కొన్ని సంఘటనలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసోంలో కూడా అలాంటి విచిత్రమైన ఘటనే జరిగింది. వేరే పార్టీకి ఓటు వేసిందని చెప్పి తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఓ భర్త. వివరాల ప్రకారం.. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో సోనిత్‌పూర్‌ జిల్లాలోని దొనా అద్దాహతి గ్రామవాసులంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఓ నిర్ణ‌యానికొచ్చారంట. కానీ అయినుద్దీన్ అనే వ్య‌క్తి భార్య దిల్వారా మాత్రం కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి ఓటు వేసింది. అనంతరం ఆ విషయాన్ని తన భర్తకు చెప్పగా కోపంతో ఊగిపోయిన అయినుద్దీన్ ఆమెకు తలాఖ్ అని విడాకులు ఇచ్చాశాడు. అయితే గ్రామస్తులు మాత్రం వారి విడాకులకు వేరే కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

హంద్వారాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళ‌న‌ల‌ మధ్యే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

  కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా పట్టణంలో ఓ అమ్మాయిని జవాన్ వేధించాడంటూ స్థానికులకు, జవాన్లకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆర్మీ పికెట్ పై దాడి చేసి, నిప్పు  పెట్టేందుకు ప్రయత్నించగా.. జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు శ్రీనగర్ తో పాటూ సున్నితమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.     మరోవైపు ఆందోళ‌న‌ల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న అక్క‌డి కుప్వారా జిల్లాలో నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పర్యటించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న అనంత‌రం నాలుగు రోజులుగా వేడెక్కిన అక్క‌డి వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లు కల్పించాలి.. వీహెచ్ దీక్ష

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దీక్ష పూనారు. ప్రభుత్వ రంగానికి ఉన్న రిజర్వేషన్లను ప్రైవేటు రంగానికి కూడా కల్పించాలని ఆయన దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఈరోజు ఉదయం నుండి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న వెనకబాటుదనాన్ని పారద్రోలాలంటే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అవసరముందన్నారు. దీనికి ప్రేవేటు సంస్థలు సహకరించాలని కోరారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం కనుక అలా చేస్తే దానికి మద్దతు తెలుపుతామని ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీహెచ్ దీక్షా శిబిరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది.

ఎదురుగా వస్తున్న రైలుతో సెల్పీ.. ఇద్దరు మృతి

  సెల్ఫీ తీసుకోవడం మామూలే.. కానీ ఎంత వెరైటీగా సెల్ఫీ తీసుకున్నామా అన్నది ముఖ్యం అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే ఎంతో మంది సెల్ఫీ తీసుకుంటూ తమ ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుతో సెల్ఫీ తీసుకుంటుండగా.. అది తొండంతో కొట్టి ఓ యువకుడు చనిపోయిన ఘటన రెండు రోజుల క్రితమే జరిగింది. అది మరిచిపోకముందే.. ఇప్పుడు ఈ సెల్ఫీ మోజుకు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు వేగంగా వచ్చే రైలు ముందు నిల్చొని సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటూ రైలు దగ్గరకొచ్చే క్రమంలో వెళ్లిపోవచ్చనుకున్నారు కానీ.. జరగాల్సింది జరిగిపోయింది. రైలు ఢీ కొట్టి ఇద్దరూ మృతి చెందారు. సెల్ఫీల వల్లే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. ఇలాంటి ఘటనలు చూసినా ఇంకా రోజు రోజుకి ఎక్కువవుతుందే తప్ప తగ్గేలా కనిపించడంలేదు.

వైసీపీ తూ.గో జిల్లా అధ్యక్షుడిగా కన్నబాబు నియామకం..

వైసీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ను తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జ్యోతుల నెహ్రూ పార్టీ వీడుతున్నారన్న వార్తలు రాగానే జగన్ పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ప్రసన్నకుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మరో నిర్ణయం తీసుకుంది.

సుజయకృష్ణ టీడీపీ ఎంట్రీ వాయిదా.. చంద్రబాబు పుట్టినరోజున..

  వైసీపీ బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయకృష్ణ రంగారావు టీడీపీ లో చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరికను ప్రస్తుతం వాయిదా వేసి చంద్రబాబు పుట్టినరోజు అంటే ఈ నెల 20 వ తేదీకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో తన సోదరుడు బేబినాయనతో కలిసి సుజయ్‌ విజయవాడలో టీడీపీలో చేరుతారు. ప్రస్తుతానికి సుజయ్‌ ఒక్కరే టీడీపీలో చేరుతున్నారు. భవిష్యతలో మరికొందరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లే ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   మరోవైపు సుజనా ఎంట్రీ వల్ల కొంతమంది టీడీపీ నేతల్లో ఆసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సుజయ్‌కు మంత్రి పదవితోపాటు సోదరుడు బేబీనాయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బేరం కుదిరింది. దీంతో బొబ్బిలిరాజులు పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ నియోజక వర్గంలో ఇంత వరకు రాజులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గర్భగుడిలోకి మహిళలకు ఎంట్రీ.. కానీ..!

  మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరాలయం గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి దొరికింది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకూ ఒక గంటపాటు పురుషులు స్త్రీలు గర్బగుడిలోకి ప్రవేశించవచ్చని ట్రస్ట్ సభ్యులు అనుమతిచ్చారు. అయితే అనుమతి ఇవ్వడానికైతే ఇచ్చారు కానీ..  కేవలం తడిదుస్తులతో మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించాలని.. అలాగు కాటన్ లేదా సిల్కు వస్త్రాలు మాత్రమే ధరించాలని మహిళలకు కొన్ని షరతులు పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ షరతులపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు సభ్యులు కావాలనే ఇలాంటి నిబంధనలు పెట్టారని.. తడి దుస్తులతో గర్భగుడిలోకి ఎలా ప్రవేశిస్తామని.. మహిళలు స్వచ్ఛందంగా తమకు తామే గర్భగుడిలోకి వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి నియమాలు పెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆలయ ట్రస్టు సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరి ట్రస్ట్ సభ్యులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

కేసీఆర్ చెప్పేది అబద్దం.. కలిపే ప్రసక్తే లేదు.. దేవినేని ఉమ

  రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు బదాయిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పందించి.. పోలవరం ముంపు గ్రామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణకు బదలాయించేదిలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పే మాటల్లో వాస్తవం లేదని.. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి కానీ.. ఏపీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఇంకా.. ఎగువరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఎంతో నష్టపోయామని.. దీనికోసం రెండు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలని అన్నారు.

నిఖిల్ రెడ్డి హైట్ ఆపరేషన్.. కూర్చోలేని పరిస్థితిలో నిఖిల్

  పొడుగు పెరగడం కోసం నిఖిల్ రెడ్డి అనే యువకుడు గ్లోబల్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా చేయించుకున్న ఈ ఆపరేషన్ చాలా వివాదాస్పదమైంది కూడా. అయితే ఆపరేషన్ తరువాత తను పొడుగు పెరగడం సంగతి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అంటున్నాడు నిఖిల్ రెడ్డి. సరిగా కూర్చోలేక పోతున్నాడు.. అంతేకాదు.. రెండు రోజుల నుండి కాళ్లలో వాపు, మంటలు, నొప్పి మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఆపరేషన్ తరువాత వారం రోజులకే డిశ్చార్జి చేస్తామని.. పదిరోజులు దాటినా ఇంకా ఆస్పత్రిలోనే ఉంచారని అంటున్నారు. ఇంజనీరింగ్ చదివేప్పుడు క్లాసులో అందరూ పొడవుగా ఉండేవారు.. ముగ్గురమే కొంచం పొడవు తక్కువగా ఉండేవాళ్లం.. అందుకే ఆపరేషన్ చేయించుకున్నాను.. మా అమ్మనాన్నలకు చెబితే ఒప్పుకోరని.. అందుకే వారికి చెప్పకుండా చేయించుకున్నానని చెప్పాడు.

భయపడకండి.. పాతవారి తర్వాతే కొత్తవారికి ప్రాధాన్యం.. చంద్రబాబు

  వైసీపీ పార్టీ నుండి దాదాపు పదిమందికి పైగా ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా కొంత మంది నేతలు చేరడానికి సిద్దంగా ఉన్నారు కూడా. అయితే వైసీపీ నేతలు టీడీపీలో చేరడం వరకూ బాగానే ఉన్నా.. వీరి చేరికతో కొంత మంది టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న తమ పరిస్థితి ఏమిటన్న భయం టీడీపీ నేతల్లో ఉందట. ఈనేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. కొత్తవారు పార్టీలోకి రావడం వల్ల పాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారంట. పాత వారికి ప్రాధాన్యం కల్పించిన తర్వాతే కొత్త వారికి అవకాశం కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారంట.

సుజనా చౌదరి కొడుకుపై కేసు నమోదు..

  ఇప్పటికే కేంద్రమంత్రి సుజనా చౌదరి మారిషన్ బ్యాంకు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దానికి తోడు మరో చిక్కుల్లో పడ్డారు కేంద్రమంత్రి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆయన కొడుకు కార్తీక్ పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. నిన్న రాత్రి కార్తీక్, అతని ఫ్రెండ్స్ కలిసి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్టవైపు దాదాపు 100 నుండి 150 కిలో మీటర్ల వేగంతో కారు రేసింగులకు దిగారు. నడిరోడ్డుపై ఇంత స్పీడుతో వెళుతున్న కార్లను చూసి భయపడిన జనాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేసి కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు.