మదీనాలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

మృతులంతా ఇండియన్సే అత్యధికులు హైదరాబాదీయులే  సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. మృతులంతా భారతీయులే. మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులతో వెడుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.   మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో వారు గాఢ నిద్రలో ఉన్నారు. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. మృతులలో 11 మహిళలు, 10 మంది పిల్లలూ ఉన్నారని తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది.   సీఎం రేవంత్ దిగ్భ్రాంతి సౌదీ అరేబియాలో  భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురై పలువురు మరణించడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులు ఉండటంతో వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు.  కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ  అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   సీఎం అదేశాలతో  సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో  తెలంగాణకు  చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.  కాగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

తిరుమల దర్శనాలు.. ఫిబ్రవరి కోటా విడుదల వివరాలు!

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాలు, గదుల కోటాకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి.   శ్రీ‌వారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మంగళవారం (నవంబర్ 18)  ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20 దయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చుని పేర్కొంది.  ఈ సేవా టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది. ఇక  ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ 21న విడుదల చేయనున్నట్లుతెలిపింది.  కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్  21 ఉదయం 10 గంటలకు  ఆన్ లైన్ లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక వర్చువల్ సేవ టికెట్ల కోటా కూడా 21నే విడుదల చేయనున్నట్లు  పేర్కొన్న టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న  శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే నెల24న  విడుదల చేయనున్నట్లు పేర్కొంది.వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను కూడా నవంబర్ 24నే విడుదల చేయనుంది.  ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అదే నెల 25న  తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను నవంబర్ 25న  ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది.  టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి మాత్రమే ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది. 

విశాఖలో సన్ ఇంటర్నేషనల్ రూ.150 కోట్ల ఇన్వెస్ట్ మెంట్

విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అందులో భాగంగానే సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు సన్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ పై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు 150 కోట్ల రూపాయల ఇన్ వెస్ట్ మెంట్ తో తమ సంస్థ ఏర్పాటు చేయనున్న మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.  ఈ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ విశాఖలో హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు శాఖల నుంచి హోటల్స్ రంగంలో అవసరమైన అనుమతులు, ఆమోదాలు, క్లయరెన్స్ ల విషయంలో సహకారం అందిస్తుంది. అలాగే హోటల్ రంగం అభివృద్ధి నిర్దిష్ట కాలవ్యవధిలో ఎలాంటి ఆటంకాలూ సజావుగా సాదేందుకు దోహదం చేస్తుంది. 

వంగవీటి రంగా కుమర్తె పొలిటికల్ ఎంట్రీ

వంగవీటి రంగా కుమార్తె వ ఆశాకిరణ్ తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం(నవంబర్ 16) ఉదయం ఆమె వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు.  రాధా రంగా మిత్రా మండలి ఆధ్వర్యంలో తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు.  ఇక నుంచీ తాను పూర్తిగా ప్రజలతో మమేకమౌతాననీ, .ప్రజలకు ఏ కష్టం వచ్చినా  అండగా ఉంటాననీ ఆశాకిరణ్ ఈ సందర్భంగా చెప్పారు.  కులం,మతం బేధం లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తివంగవీటి మోహన రంగా అన్న ఆమె, ఆయన  రాజకీయ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు.    కాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత   ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు.   ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ తన రాజకీయ ప్రవేశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

రోడ్డు ప్రమాదంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మృతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ క్రీడాకారిణి దుర్మరణం పాలైంది. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సత్యజ్యోతి విజయనగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లిమర మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శివజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కోసం తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు . విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత, ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి గాయత్రి గాయపడ్డారు. ప్రతిభామంతురాలైన క్రీడాకారిణి సత్యజ్యోతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడంతో  ఆమె స్వగ్రామం కొండవెలగాడలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులు

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో నాలుగువేల 380 కోట్ల రూపాయలకు ఏడు ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్,   రీసైక్లింగ్,  గార్మెంట్స్,   సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు.  విశాఖపట్నం,  చిత్తూరు,  గుంటూరు,  శ్రీ సత్యసాయి,  అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో   మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.అలాగే చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో  ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది.  ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా   రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  అదే విధంగా గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.  విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900  మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.  ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు  ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకు రానుంది.విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి  .సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 

తెలుగు.. తేనెలొలుకు.. జపాన్ నోట తెలుగు మాట

విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. మన తెలుగు భాష పట్ల కూడా విదేశీ ప్రతినిథులు, రాయబారుల ఆసక్తిని, అనురక్తిని పెంచింది. తెలుగు పలుకుబడి, నుడికారం పట్ల మమకారం పెంచింది.  జపాన్‌  రాయబారి ఓనో కెయిచ్చి ఏకంగా తన తెలుగులోనే ప్రసంగాన్ని  ప్రారంభించి అందరినీ విశ్మయపరిచారు. జపాన్‌ దేశంతో వాణిజ్య సంబంధాలపైన ఆయన ప్రసంగించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు తాను చాలా గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సదస్సు ద్వారా జపాన్‌, భారత్‌ కంపెనీలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ఆయన తెలుగులోనే చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు  తెలుగు భాష పట్ల  తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు.  తనను ఆహ్వానించినందుకు కృతజ్ణతలు అని పేర్కొన్న ఆయన..  తెలుగులో ఇదే తన మొదటి ప్రసంగం అన్నారు.  జపాన్‌,ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  స్టీల్‌, ఫార్మా, రిన్యూవబుల్‌ ఎనర్జీ రంగాల్లో, శ్రీసిటీ, టయోమా ప్రీఫెక్చూర్‌ సంస్థలతో వాణిజ్య సహకారం కొనసాగిస్తున్నామన్నారు.

విజన్, ఇన్నోవేషన్, జీల్, యాస్పిరేషన్, గ్రోత్.. వైజాగ్ కు చంద్రబాబు కొత్త భాష్యం

విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.  సాగర తీరనగరంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. శుక్ర, శనివారాలలో (నవంబర్ 14, 15) రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో  .లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ సదస్సు సందర్భంగా విశాఖకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు.  వి అంటే విజన్‌, ఐ అంటే ఇన్నోవేషన్‌, జడ్‌‌కి జీల్‌ అంటే ఉత్సాహం, ఏ అంటే యాస్పిరేషన్‌, జీ అంటే  గ్రోత్‌  అని అభివర్ణించారు. విశాఖకు చంద్రబాబు చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇక దీనిపై  తెలుగు దేశం పార్టీ   చంద్రబాబు, లోకేష్  కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే .. ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం" అని చెప్పుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదికలో ఎక్స్ లో పోస్టు చేసింది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఏపీ పెవిలియన్‌లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించిందని పలువురు ప్రతనిథులు పేర్కొన్నారు.   

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణకు రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ

తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో  ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియలు శనివారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.  విష్ణు ప్రియ   మూడు బెట్టింగ్ యాప్ లను   ప్రమోట్ చేసినట్లుగా సిట్ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే   ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.  విచారణ సందర్భంగా విష్ణుప్రియ తన బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. అలాగే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం ఆమె కుదుర్చుకున్న ఒప్పందాలపై సిట్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా విష్ణుప్రియకు చెల్లింపులు ఎలా, ఎవరి ద్వారా అందాయి అన్న విషయాలపై సిట్ ఈ విచారణలో ఆరా తీసినట్లు తెలిపింది.  కాగా  ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా శనివారం ఈ కేసులో విచారణకు సిట్ ఎదుట హాజరయ్యారు. రానా కూడా తన బ్యాంక్ స్టేట్ మెంట్లు సిట్ కు సమర్పించారు. తాను ప్రమోట్ చేసింది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ మాత్రమే ననీ, అది చట్టవిరుద్ధం కాదని రానా తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది.న 

ఏపీలో రేమాండ్స్ ఇన్వెస్ట్ మెంట్

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతి మరో లెవెల్ కు చేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న  సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా  రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న ఆయన  సదస్సు వేదికపై నుంచే  రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన 5 కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు   దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్‌ అయిన శ్రీసిటీ  నుంచే  డైకెన్, ఇసుజు, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు  తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు శ్రీసిటీకి రావాలన్నారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాల కంపెనీల నుంచి రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.  గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో   22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు.  త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 50కి పైగా దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయనీ,  తద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.  రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామనీ,  ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయి తెలిపారు. అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమన్న ఆయన,  కియా సమీపంలోనే రేమాండ్స్ ఆటో కాంపోనెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.   

విశాఖ భాగస్వామ్య సదస్సులో లోకేష్ పై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు

విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసీసీ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులకు గేట్ వేగా మారింది.  ఈ సదస్సు ఇంత విజయవంతంగా జరగడానికి, ఈ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ నారా లోకేష్ అంటున్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న, కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులూ చెబుతున్నారు.  రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో ఒప్పందాలను ఖరారు  కావడం, వారితో సమన్వయం చేయడంలోనూ లోకేష్ కీలక పాత్రపోషించారు. అందులో సందేహం లేదు. విశాఖలో భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడానికి చంద్రబాబు ట్రాక్ రికార్డ్, విజన్ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో తరలిరావడానికి ఒక కారణమైతే.. లోకేష్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చూపిన నిబద్ధత, అందుకోసం చేసిన కృషి మరో ప్రధానకారణమంటున్నారు.    ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సహా సీనియర్ కేంద్ర మంత్రులూ గుర్తించారు. అందుకే రాష్ట్ర ప్రగతి విషయంలో వారు చంద్రబాబు విజన్ ను ఎఫిషియెన్సీనే కాకుండా.. లోకేష్ ప్రతిభనూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయన చూపిన చొరవనూ ప్రశంసలతో ముంచెత్తారు.   ఆదానీ గ్రూప్ ఏపీలో నలభైవేల కోట్ల రూపయాలు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ముందు ముందు మరింత ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం వెనుక లోకేష్ చోరవ, ఆయన కనబరిచన శ్రద్ధ, అందించిన మద్దతు కారణమని ఆ సంస్థ ప్రతినిథులే పేర్కొన్నారు.   ఎస్ వైఆర్ఎమ్ఏ ఎస్జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్ గుజ్రాల్ లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ కంపెనీకి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు, క్లియరెన్సులు కేవలం పధ్నాలుగు రోజుల్లోనే వచ్చాయనీ, దీని వెనుక ఉన్న చురుకైన పాత్ర లోకేష్ దేనని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అపూర్వమైన చురుకైన చర్యలు తీసుకువచ్చినందుకు ఆయన లోకేష్‌ను ప్రశంసించారు. 

తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్

గేమింగ్ యాప్ లు, బెట్టింగ్ యాప్ లపై కొరడా ఝుళిపిస్తున్న కోర్టులకూ హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు ఆ వెబ్ సైట్ లో ఏకంగా బెట్టింగ్ యాప్ ను తీసుకువచ్చారు. వివరాల్లోకి వెడితే.. తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని శనివారం గుర్తించారు. ]కోర్టు ఆర్డర్లు డౌన్ లోడ్ చేస్తుండగా హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందన్న విషయం వెలుగు చూసింది. సదరు వెబ్ సైట్ లో బెట్టింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. హైకోర్టు వెబ్ సైట్ లోకి హ్యాకర్లు ఏలా యాక్సెస్ అయ్యారు.. సర్వర్ లో లోపాలు తదితర విషయాలపై విచారణ చేపట్టారు. మరో వైపు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సిస్టమ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది 

ఏపీకి మరో వాయు‘గండం’!

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటున్నది. ఇప్పుడిప్పుడే మొంథా తుపాను దెబ్బ నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీపంలో ఈ నెల 19 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి  నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉండగా.. ఏపీలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండటం లేదు. దీంతో పగలు ఉక్కపోత, రాత్రిళ్లు చలికి గజగజ అన్నట్లుగా ఏపీలోని వాతావరణం మారింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ సీజన్ లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో శుక్రవారం (నవంబర్ 14) అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

గన్నవరం టు సింగపూర్ విమాన సేవలు ప్రారంభం

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడప నుంచి. శనివారం ప్రారంభమైన ఈ విమాన సర్వీసును  విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు లాంఛనంగా ప్రారంభించారు. గన్నవరం నుంచి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసు ప్రారంభం కావడంతో  రాజధాని అమరావతి నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అంటున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం, సింగపూర్ విమాన సర్వీసును వారానికి మూడు రోజులు నడపనుంది.  గన్నవరం సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభంతో రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల కు సంబంధించి కీలక పురోగతి సాధించినట్లయ్యింది.   ప్రయాణీకుల సంఖ్య, వయబులిటీ వంటి  అంశాలతో సంబంధం లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు సింగపూర్ కు విమానసర్వీసులు నడుపుతుంది. మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఇందులో భాగంగా తొలి విమానం ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు గన్నవరం నుంచి సింగపూర్ కు బయలుదేరింది.  .

మావోయిస్టు సీనియర్ నేత ఆజాద్ అలియాస్ సాంబయ్య లొంగుబాటు?

కేంద్ర ప్రభుత్వం నక్సల్ విముక్త భారత్ లక్ష్యం అంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలౌతోంది. వరుస ఎన్ కౌంటర్లో వందల మంది మావోయిస్టులు హతం కాగా, భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. అలా లొంగిపోయిన వారిలో పార్టీకి చెందిన అంత్యంత కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత బలపైన ప్రాంతంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉనికి మాత్రంగా నిలిచింది. ఆ తరువాత మావోయిస్టు పార్టీకి అంతో ఇంతో బలమైన పట్టు ఉన్న తెలంగాణలో సైతం మావోయిస్టు పార్టీ వరుస ఎదురుదెబ్బలతో సతమతమౌతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి తెలంగాణలో  మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సాంబయ్యతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ కేడర్ కూడా ఆయుధాలు విడిచి  జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలియవచ్చింది. అయితే సాంబయ్య, ఆయనతో పాటు క్యాడర్  లొంగుబాటు వార్తలను పోలీసులు   అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  ములుగు జిల్లా  మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995 నుంచీ అజ్ణాతంలో ఉన్నారు.   గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా  కూడా పని చేసిన సాంబయ్యపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.  

సతీష్ కుమార్ ది హత్యే!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి .. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు.   దీంతో సతీశ్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి పోలీసు స్టేషన్ లో కేసు  నమోదైంది.   మృతుడు సతీష్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శుక్రవారం (నవంబర్ 14)న మరణించి రైలు పట్టాలపై పడి ఉన్నారు.  దీంతో ఆయనది అనుమానాస్పద మృతిగా అందరూ భావించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీయులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఉండటంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో సతీష్ ది హత్యే అని తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.  అయితే  వైసీపీ మాత్రం దర్యాప్తు అధికారులు, తెలుగుదేశం నేతల వేధింపుల కారణంగానే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది.  అలాగే సతీష్ ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.  టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకరరెడ్డి అయితే.. ఈ ఆరోపణలు, డిమాండ్ లతో చేసిన అతి వికటించింది.    అత్యంత కీలకమైన కేసులో  ఫిర్యాదుదారు, సాక్షి అయిన ఓ పోలీసు  అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మామూలుగా అయితే ఆయన హత్యకు గురయ్యారు అని వైసీపీయులు ఆరోపణలు చేయాలి. కానీ.. అసలు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా తేలక ముందే ఆత్మహత్య అంటూ నిర్ధారించేసి ఆరోపణలు గుప్పించడం చూస్తుంటూ.. గతంలో అంటే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు తొలుత గుండెపోటు అంటూ ప్రచార చేసిన విధానం గుర్తుకు వస్తున్నది.  ఇక భూమన అయితే..  ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా ఆరోపణలు గుప్పించడం పలు సందేహాలకు తావిస్తున్నది. గతంలో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కూడా వైసీపీయులు ఇలాగే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఇప్పుడు విషయానికి వస్తే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే పరకామణి చోరీ కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి  తెచ్చి కేసు  రాజీ చేయించారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ వాంగ్మూలం ఇచ్చేందుకు వెడుతున్న సమయంలోనే సతీష్  మరణించారు. ఇక్కడే  సతీష్ మృతి వెనుక ఈ కేసులో నిందితులుగా  ఉన్న వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు  ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు.  తన ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా  సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిన రవిపై పలువురు తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల యవ్వారలన్నీ బయటపెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకే సవాల్ చేసి బెదరించే స్థాయికి వెళ్లాడు. అప్పటి నుంచీ రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండంటూ రవి పోలీసులకు సవాల్ కూడా విసిరాడు.  ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాలోని  రూ. 3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.  కాగా రవి శుక్రవారం (నవంబర్ 14) హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.    

బ్యాటింగ్ కాదు విధ్వంసం!

వీడెవ‌డండీ బాబూ! వంద మంది వీరేంద్ర సెహ్వాగ్ లు ఒకే సారి బ్యాటింగ్ చేస్తున్నట్లు..   యాభై మంది రిష‌బ్ పంత్ ల ఇన్నింగ్స్ ఇన్ స్పిరేష‌న్ గా తీస్కున్న‌ట్టు.. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. ప్ర‌తి  రెండో బాల్ కి ఒక సిక్స్ కొడుతూ..  స్కోర్ బోర్డుకు ర‌న్నింగ్ రేస్ నేర్పిస్తున్న‌ట్టు  ప్ర‌తి బాల్ నీ ఫోర్ గానీ సిక్స్ గానీ వెళ్లేలా చేస్తూ.. ఆ మాట‌కొస్తే.. బాలు ఉన్న‌దే తాను ఫోర్లూ సిక్స్ లు కొట్టేందుక‌న్న‌ట్టు.. క‌ల‌లో రాకుమారుడుగానీ బ్యాటు ప‌ట్టుకుని ఫ‌టా ఫ‌టా బాదిన‌ట్టూ.. పుస్త‌కాల్లో మాత్ర‌మే క‌నిపించే కామిక్ క్యారెక్ట‌ర్ గానీ మాయ‌లూ మంత్రాలు  చేసిన‌ట్టు.. ఇలా ఒక‌టా రెండా ఆ విశేష‌ణాలు అన్నీ ఇన్నీ కావు.. యూఏఈ తో ఇండియా ఏ జ‌ట్టు ఆడిన ఈ ట్వంటీ ట్వంటీలో స్టేడియంలో కూర్చున్న‌దే ప‌ట్టుమ‌ని పాతిక మంది.. వారంతా క‌ల‌సి వైభ‌వ్ సూర్య‌వంశీ ఆడుతుంటే..స్టేడియం నిండా జ‌న‌మున్న‌ట్టు ఆ అరుపులేంటి  కేక‌లేంటి..??? జ‌స్ట్ 17 బంతుల్లో హాఫ్ సెంచురీ, జ‌స్ట్ 32 బంతుల్లో సెంచురీ.. ప్ర‌తి బంతినీ ఆకాశం చూడాలా అన్న‌ట్టు చిత‌క‌బాదుతూనే వెళ్లాడంటే న‌మ్మండీ.. అబ్బ‌బ్బ‌బ్బ 10 ఫోర్లు 15 సిక్సులూ.. ఇలా చెబుతూ పోతుంటే ఆ ఇన్నింగ్స్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ పారించిన ప‌రుగుల వ‌ర‌ద‌కు ఒక అంతే లేదా అన్న‌ట్టు మారింది అత‌డి బ్యాటింగ్ సెన్సేష‌న్.   అస‌లు వీ అన్న అక్ష‌రంతో పేరున్న వాళ్లంతా  ఒక్కో వీరేంద్ర సెహ్వాగ్ లా  చెల‌రేగుతారా? అన్న‌ట్టుగా సాగిందా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్. కేవ‌లం 41 బంతుల్లో 144 ప‌రుగులు చేసి.. ఎట్ట‌కేల‌కు అత‌డు ఔట్ అయితే ప్ర‌దత్య‌ర్ధి ప్లేయ‌ర్లు కూడా హ‌ర్ట్ అయ్యారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.. అది కోత కాదు.. మామా ఊచ కోత‌!  అత‌డు ఆడిన మొద‌టి బంతికే ఇచ్చిన క్యాచ్ ని ఎందుకు డ్రాప్ చేశామా? అని ప్రత్యర్థి జట్టు ఫీల‌వ‌లేదంటే ఒట్టు. ఒక స‌మ‌యంలో ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే ఇంత‌టి  విధ్వంస‌క‌ర  ఇన్నింగ్స్ ని  మ‌నం కూడా  చూడ‌లేక పోయే వాళ్లం  క‌దాని  యూఏఈ జ‌ట్టు ఆట‌గాళ్లు కూడా  ఫీల‌య్యేలా చేశాడు పట్టుమ‌ని ప‌దిహేను ఏళ్లు కూడా లేని వైభ‌వ్ సూర్య‌వంశీ.

శ్రీశైలంలో కోటి దీపోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆలయ అధికారులు ఆలయ ప్రధాన మాడవీధి నుండి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయం ముందు 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం 6.30 గంటలకు కైలాస వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, దశవిధ హారతులను సమర్పించారు.  గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ప్రమిదలు, పూజా సామాగ్రిని  దేవస్థాన అధికారులు ఉచితంగా అందజేశారు.  భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అధ్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీశైలం క్షేగ్రంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.