37 మంది మావోయిస్టుల లొంగుబాటు

మవోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీశివధర్ రెడ్డి సమక్షంలో 27 మంది మావోయిస్టులు శనివారం (నవంబర్ 22) లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్రకమిటీ, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.  వీరు కాకుండా మరో 22 మంది దళ సభ్యులు కూడా లొంగిపోయారు.   కాగా లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, మావోయిస్టు సాంకేతిక విభాగం ఇన్ చార్జి అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ పరిణామం తెలంగాణలో శాంతి స్థాపనకు మరో ముందడుగుగా డీజీపీ అభివర్ణించారు.  లొంగిపోయిన 37 మందిలో ఆజాద్ గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ  ఏవోబీ ( ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.   పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావోయిస్టులను లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మావోయిస్టులపై ప్రభావం చూపిందనీ, అందుకే నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారనీ ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.  లొంగుపోయిన నక్సలైట్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందనీ, సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులకు సంపూర్ణ రక్షణతో పాటు పునరావాసం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సత్యం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందన్నారు.. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకు ముందు పుట్టపర్తి  విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము  సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం  తన మహాద్భాగ్యంగా చెప్పారు.   సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రగణ్యుడన్న రాష్ట్రపతి  నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారన్నారు.  బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు లవ్ ఆల్..సర్వ్ ఆల్ అన్నది పుట్టపర్తి సాయిబాబా సిద్ధాంతమన్నారు.  సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు. వాటిని పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు.  సత్యసాయి బాబాతో  తనకు  మంచి అనుబంధం ఉందన్న ఆయన  తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని చెప్పారు.  ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు... పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు.   సత్యసాయి భక్తులు ఇప్పటికీ  అదే స్ఫూర్తిని కొనసాగించడం  సంతోషాన్నిస్తోందన్నారు చంద్రబాబు.   భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని చంద్రబాబు అన్నారు.

సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ బహిష్కృత నేత,  తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న  హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లన్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సజ్జనార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడనీ, అందుకే ప్రజల మద్దతు చూరగొన్నాడనీ పేర్కొన్నాడు.  తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఇంతకీ సజ్జనార్ పై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడానికి . ఆయన సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే కారణంగా కనిపిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్టుకు కారణం అతడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడమేనన్న తీన్మార్ మల్లన్న ఆమె సమాచారం ఇవ్వకుంటే రవిని పట్టుకోగలిగేవారా అని నిలదీశారు.  సినీమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచేయడం వల్లనే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడలేని వారు ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారన్న  తీన్మార్ మల్లన్న వంద రూపాయల సినిమా టికెట్ ను వేలల్లో అమ్ముకునే నిర్మాతలతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటుచేయడాన్ని తప్పుపట్టారు.  ఐబొమ్మ రవి అరెస్టు కాదు..  దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు.  సీవీ ఆనంద్ కూడా   సైబర్ మోసాలు ఆగవని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 

డ్రోన్ల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్!

ఢిల్లీ ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగున్న సమయంలోనే మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు.  పాకిస్ఠాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారీగా ఆయుధాలను తరలిస్తున్న స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.   పాక్‌ ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలున్న ఈ ముఠా నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.    ఢిల్లీలో కొంతమంది భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు డీసీపీ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని  పోలీసు  బృందం   పలు ప్రాంతాల్లో నిఘా ఉంచగా.. రోహిణిలో ఈ ఆయుధ మాడ్యూల్ గుట్టు బయటపడింది. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పంజాబ్‌ సరిహద్దుల నుంచి తీసుకొచ్చిన ఈ ఆయుధాలను లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్‌ సభ్యులకు అందజేయడానికి ఉద్దేశించినవిగా తేలింది.  నిందితుల నుంచి విదేశాల్లో తయారైన 10 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్‌ పిస్టల్స్‌తో పాటు 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లభ్యమైన ఆయుధాలు టర్నీ, చైనాలో తయారైనవిగా తెలిపారు. ఈ ముఠాకు  చెందిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆయుధాలను ఎవరికి విక్రయించారు, నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబట్టేందుకు అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.  నిందితులకు చెందిన మొబైల్‌ ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

ఆరునెలలలోగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం.. కేంద్రమంత్రి పెమ్మసాని

అమరావతి రైతుల సమస్యల పరిష్కారం విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే శనివారం (నవంబర్ 22) న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సీఆర్డీయే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ,  ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, రైతు జేఏసీ ప్రతినిధులు  పాల్గొన్నారు. భూముల రిజిస్ట్రేషన్, అభివృద్ధి పనులు వంటి వాటిపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.  ఇటీవలే రైతు జేఏసీ ప్రతినిధులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమై రాజధాని రైతుల సమస్యలను సానుకూల దృక్ఫథంతో సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రాజధానికి భూములిచ్చిన రైతులెవరికీ ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.  మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరు నెలలలోగా రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద భూముల్లో 20 ఎకరాలు కుటుంబపరమైనవి కాగా, మరో 45 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయన్నారు.  ఇప్పటికే రాజధాని పరిధిలో 90 శాతానికి పైగా కుటుంబాలకు ప్లాట్లను కేటాయించామని వెల్లడించారు. అన్ని సమస్యలనూ ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఏ రైతుకూ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని పెమ్మసాని స్పష్టం చేశారు. 

జైల్లో దస్తగిరికి బెదరింపుల కేసు.. అధికారులపై విచారణకు ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన  దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి అప్పుడు కడప జైలు అధికారులుగా ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నాటి సూపరింటెండెంట్ ఐఎన్‌హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్‌బాబు, డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం (నవంబర్ 21) ఉత్తర్వులు  జారీ చేశారు.  విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ   రవికిరణ్‌ను,  రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. విచారణ పూర్తి చేసి మూడు నెలలలోగా  నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, మరో కేసులో భాగంగా 2023 అక్టోబరు 31న కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబరు 28న జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముసుగులో వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించారు. ఈ సమయంలోనే చైతన్యరెడ్డి  దస్తగిరిని బెదిరించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.  ప్రస్తుతం ఐఎన్‌హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్‌బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డాక్టర్ పుష్పలత కడప జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

గుడిలో దండల పెళ్లి.. యువ ఐఏఎస్ జంట ఆదర్శ వివాహం

కోట్లాది రూపాయల ఖర్చుతో ఆడంబరంగా, ఆర్భాటంగా వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో వాటన్నిటికీ దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు అత్యంత నిరాడంబరంగా వివాహబంధంతో ఒక్కటై ఆదర్శంగా నిలిచారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మల వివాహం శుక్రవారం (నవంబర్ 21) విశాఖలో జరిగింది. విశాఖ కైలాసగిరిపై  ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.   ఈ వివాహ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత వీరు నేరుగా విశాఖ వన్ టౌన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.  విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ  ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

విశాఖకు కాగ్నిజెంట్.. ఊహించిన దానికంటే ముందుగానే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పీడ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కృతిని పూర్తిగా వంటబట్టించుకుంది. అయితే  ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వాయువేగంతో ముందుకు సాగుతోందని మరోసారి నిర్ద్వంద్వంగా రుజువైంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఏదైనా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే.. వారి కంపెనీ కార్యకలాపలను వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సాహకాలు, అనుమతులు వంటివి అనూహ్య స్పీడ్ తో అందిస్తామని విస్పష్టంగా చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నారు.   విశాఖలో భారీ పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాగ్నిజెంట్ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే రాష్ట్రంలో తన కార్యకలాపాలు ప్రారంభించడం చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ అన్న మాటను చేతల్లో చూపిస్తున్నదని  స్పష్టంగా అవగతమౌతుంది   కాగ్నిజెంట్   విశాఖ సమీపంలోని కాపులుప్పాడలోని 21 ఎకరాల భూమిలో మెగా నిర్మాణాన్ని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున, కాగ్నిజెంట్  వచ్చే ఏడాది  రెండవ త్రైమాసికం అంటే 2026 ఏప్రిల్ తురువాత వైజాగ్ లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా  వచ్చే ఏడాది జనవరి నాటితే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకోసం తాత్కాలిక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.   ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వమే స్వయంగా ఇనీషియేటివ్ తీసుకుంటే..    పెట్టుబడిదారులు అంతకు మించి చొరవ, ఉత్సాహం చూపిస్తారు.  కాగ్నిజెంట్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.   కాగ్నిజెంట్  శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచిచూడకుండా.. ముందుగా తాత్కాలిక భవనాల్లో కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఐటీ హిల్స్ లో   భవనాలను అద్దెకు తీసుకోడానికి రెడీ అయ్యింది. ఇందు కోసం తమకు అనువైన భవనాల ఎంపికకు కాగ్నిజెంట్ బృందం విశాఖకు చేరుకుంది కూడా. అంతే కాదు.. జనవరి  నుంచి 800 మందితో విశాఖలో ఆపరేషన్స్ కి కాగ్నిజెంట్ సమాయత్తం అవుతోంది. విశాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న  వారు ముందుకు రావాలంటూ.. ఇప్పటికే తమ సిబ్బందికి సమాచారం ఇచ్చింది కూడా.   విశాఖలో  1,583 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రభుత్వానికి తెలిపింది.  దీంతో రాష్ట్రంలో యువతకు  ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతోపాటు పరోక్షంగా మరి వేల కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాగ్నిజెంట్ కు   భూములు కేటాయించింది. ఆ భూముల్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. అయితే అంతకు ముందే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ ముందుకు రావడం చూస్తుంటే ఇన్వెస్టర్లకు రాష్ట్రప్రభుత్వంపై ఎంత విశ్వాసం ఉందో అర్థమౌతోంది. 

ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ విమానం

దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో  భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా..  దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్న వాయుసేన తేజస్ విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.  ఇలా ఉండగా ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయి మంటలు చేలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కుప్పంలో నారా భువనేశ్వరి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సాధారణ ప్రయాణీకు రాలిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అందులోనూ రాష్ట్రంలో మహిళలకు ఉచిత  ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తిపేర ప్రవేశ పెట్టిన పథకం కింద ఆమె ఆర్టీసీ బస్సులో తన ఆధార్ కార్డు చూపి ఉచితంగా ప్రయాణించారు. కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి  శాంతిపురం  నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు శుక్రవారం (నవంబర్ 21) ఆర్టీసీ బస్సు ఎక్కి మిగిలిన మహిళలతో పాటుగా తన ఆధార్ కార్డును  కండక్టర్ కు చూపి ఉచిత టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె  సహచర ప్రయాణీకులతో ముచ్చటించారు.  ఉచిత బస్సు పథకం ఎలా ఉందని ఆరా తీశారు.  ఈ పథకం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అదే సమయంలో వారు చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు.  జలహారతిలో  పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భువనేశ్వరి అభివర్ణించారు.  కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎంతో శ్రమించి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చారన్నారు.   కేవలం నీటిపారుదలకే పరిమితం కాకుండా కుప్పం పారిశ్రామిక ప్రగతికి కూడా చంద్రబాబు బాటలు వేశారన్న భువనేశ్వరి,  ఈ ప్రాంతానికి  23,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకోచ్చారని వివరించారు.  పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు   ఎల్లప్పుడూ ఉండాలని   ఆకాంక్షించారు.

పాఠ్యాంశాలలో మళ్లీ నైతిక శాస్త్రం.. మంత్రి లోకేష్ ను ప్రశంసించిన నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా సమగుట్ట పల్లిలోని విలువల బడిని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ పాఠశాల విద్యార్థులతో మమేకమయ్యారు.  ఈ సందర్భంగా విలువల బడి వ్యవస్థాపకుడు లెనిల్ ను అభినందించారు.  విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. తన చిన్నతనంలో  స్కూల్లో  నైతిక శాస్త్రం   ఒక పాఠ్యాంశంగా ఉండేదని గుర్తు చేసుకున్న ఆమె ఇప్పుడు రాష్ట్రపాఠశాలల్లో మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ను తీసుకువచ్చినందరకు లోకేష్ ను అభినందిస్తున్నాన్నారు.   రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషమన్న నారా భువనేశ్వరి నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లలలో నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించే విషయంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తిని గమనించి  అందుకు అనుగుణంగా పిల్లల ఎదుగుదలకు దోహదపడాలన్నారు.  

రాజమహేంద్రవరానికి ఓఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఆకాశమే హద్దా అన్నట్లుగా దూసుకుపోతున్నది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో రాష్ట్రప్రగతి నల్లేరుమీద బండి నడకలా సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలలో కూడా అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.   ఇందులో భాగంగానే రాజమహేంద్ర వరం చుట్టూ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి బీజం పడింది. రాజమహేంద్రవరంకు ఔటర్ రింగ్ రోడ్డు వేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ధి వేగం పెరుగుతుందనీ, వైజాగ్, చెన్నై రోడ్డు కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందనీ భావిస్తున్నారు.  అంతే కాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమౌతుందని భావిస్తున్నారు.  రాజమహేందరవరం ఔటర్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీని కోసం అధికారులు డీపీఆర్ రెడీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. డీపీఆర్ పూర్తికాగానే ఓఆర్ఆర్ కోసం భూమి సమీకరణ ప్రారంభించనున్నారు.   కాగా రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు విషయాన్ని మంత్రి నారాయణ ధృవీకరించారు. రాజమహేంద్రవరం మునిసిపల్  కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ మధురపూడి, రాజానగరం, దివాన్‌చెరువు, దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్‌ రాహుల్‌ మీనా పాల్గొన్నారు.  

హిడ్మా ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ!

హిడ్మా ఎన్‌కౌంటర్‌  ఓ కట్టుకథగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభివర్ణించింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను విజయవాడలో అరెస్టు చేసి హత్య చేసి మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి  మాడ్వి హిడ్మా , రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నిరాయుధులుగా ఉండగా పట్టుకుని క్రూరంగా హత్య చేశారని ఆ ప్రకటన పేర్కొంది.  ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ఆదివారం (నవంబర్ 23) దేశ వ్యాప్తంగా నిరసన దినం  పాటించాలని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది.     దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.  ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నదని ఆ ప్రకటన పేర్కొంది.  హిడ్మా,  అతని  భార్య  రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారనీ, ఈ సమాచారాన్ని కొందరు ద్రోహుల ద్వారా తెలుసుకుని వారిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.   కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఆంధ్ర ఎస్ఐబీ  ఈ నెల 15 న విజయవాడలో హిడ్మా తదితరులను అదుపులోనికి తీసుకుని  లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారని పేర్కొంది. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలని పేర్కొంది.   చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందన్న ఆ ప్రకటన వీరు  కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోందని పేర్కొంది. 

బెంగళూరు వదిలేస్తే భారీ ప్రోత్సాహకాలు, రాయతీలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు కర్నాటక బంపరాఫర్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ  బెంగళూరు నగరం నుంచి టెక్ కంపెనీలను, టెకీలను బయటకు వెళ్లిపొమ్మంటోంది కర్నాటక ప్రభుత్వం. ఇందు కోసం ఏకంగా ఒక పాలసీనే రూపొందించింది.  ఈ పాలసీ మేరకు  స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది సిద్దరామయ్య సర్కార్. ఇలా ఇచ్చే ప్రోత్సాహకాలలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె రాయితీ, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను మినహాయింపు, 5 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీలపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అదే కాకుండా కంపెనీలకు ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల్లో  పాతిక శాతం, ఏఐ, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధన ఖర్చులపై 40 శాతం వరకు   రీఫండ్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నది. ఈ విధానం టెక్ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు సమాచారం. దీనిపై  టెక్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ప్రభుత్వం నూతన ఐటీ పాలసీలో భాగంగా  కంపెనీలు మైసూర్, మంగళూరు వంటి నగరాలకు మారేందుకు డబ్బు ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీ కోసం కర్నాటక సర్కార్ ఐదేళ్లలో  దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. ఈ పాలసీలో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ పద్ధతిగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశాలుంటాయని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కర్నాటక సర్కార్ వచ్చే నెల రెండో వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బియాండ్ బెంగళూరు అన్న కర్నాటక సర్కార్ వ్యూహంలో లీవ్ బెంగళూరు కీలకం అంటున్నారు.   రాష్ట్రంలోని మైసూరు, మంగళూరు, హుబ్బిళి, ధారవాడ, బేలగావి, కలబురిగి, శివమెుగ్గ, దావణగెరె, తుమకూరు వంటి నగరాలు ఐటీ ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రప్రగతికి దోహదమౌతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలాగే కంపెనీలు రాష్ట్రంలోని ఇతర నగరాలకు తరలిపోవడం వల్ల బెంగళూరులో  ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యలు  కూడా ఆటోమేటిగ్గా సాల్వ్ అయిపోతాయన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది.   అలాగే బెంగళూరు నగరం విడిచి రాష్ట్రంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు ఎంచుకున్న ఐటీ ఉద్యోగులకు కూడా కర్నాటక ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  బెంగళూరు నుంచి రాష్ట్రంలోని మైసూరు మైసూరు, మంగళూరు, కలబురగి వంటి ఇతర నగరాలకు మారేందుకు అంగీకరిస్తే వారికి 50 వేలు ప్రొత్సాహకంగా అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 445 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధానం కూడా అతి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఓ వైపు స్టార్టప్ లను తరలిపోవాలని కోరుతూనే.. వాటికి సిబ్బంది కొరత లేకుండా, రాకుండా ఉద్యోగులకు కూడా బెంగళూరు వదిలి వెళ్లిపోవడానికి సుముఖత చూపితే ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.   దేశం మొత్తంలోనే ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా బెంగళూరు భాసిల్లుతోంది. అటువంటి నగరాన్ని వీడడానికి ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులూ ఏ మేరకు ముందుకు వస్తారన్నది చూడాల్సిందే.  

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?

నగరంలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ ఈ శుక్రవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపుతూ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.   అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో , అలాగే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన  రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ  జారీ చేసిన నోటీసుల్లో ఈ రెండు స్టూడియోలూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ తక్కువగా చెల్లిస్తున్నట్లే పేర్కొంది.  అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు.. తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ.. భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు  గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.   అన్నపూర్ణ స్టూడియో 1,92,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తోందనీ, దీని ప్రకారం  రూ.11, 52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా,   8,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లుగా చూపించి కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియో  68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ, కేవలం 19 వందల చదరపు అడుగుల విస్తీర్ణం అని మాత్రమే  చూపుతూ.  రూ.7,600 మాత్రమే టాక్స్ చెల్లిస్తోందని పేర్కొన్న అధికారులు ఆ మేరకు    బకాయిపడ్డ  మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని ఈ రెండు స్టూడియోలనూ నోటీసులు జారీ చేశారు. 

సాగర్ కుడికాలువకు గండి

నాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గురువారం (నవంబర్ 20)అర్ధరాత్రి గండి పడింది.  ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద కట్టకు గండి పడి నాగులేటి వాగుకు ఒక్కసారిగా  ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక  ప్రాంతాల ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  పల్నాటి వీరుల తిరునాళ్ల నేపథ్యంలో నాగులేటి వాగుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో  వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోకి నీరు చేరింది.   మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న ఆందోళనలో జనం ఉన్నారు. కాగా గండి విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని  గండి పూడ్చే పనులు చేపట్టారు.ఇలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కట్టను ధ్వసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా.. సాగర్ కుడికాలువకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఆందోళన వద్దంటూ ప్రజలకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టామనీ, మధ్యాహ్నానికల్లా గండిని పూడ్చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే గ్రామాలలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అదే సమయంలో.. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. 

భార్యా బిడ్డల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

వికారాబాద్  హత్యల కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం (నవంబర్  22) తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే..  వికారాబాద్ పట్టణంలో  ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించే ప్రవీణ్ కుమార్ కు అప్పటికే పెళ్లై ఒక కొడుకు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.  దీంతో వారివురూ వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది. అయితే వివాహం తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.   2019 ఆగస్టు 5 రాత్రి పీకలదాకా మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దదవ్వడంతో ఆగ్రహానికి లోన ప్రవీణ్ కుమార్  ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో భార్య మరియు ఐదేళ్ల కుమార్తెను  కొట్టి హతమార్చాడు. అనంతరం 9 ఏళ్ల కుమారుడని గొంతు నులిమి హత్య చేశాడు. భార్యా పిల్లలను హత్య చేసిన అనంతరం  పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య మొబైల్లో మెసేజీలు  చూసి  అనుమానం పెంచుకుని భార్య పిల్లలను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.   పోలీసులు సాక్ష్యాధారాలు లను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.  

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం

  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ దూకుడు పెంచింది.  ఈ కేసు దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని దర్యాప్తులో వెలుగులోనికి వస్తున్నది. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని సిట్ ఇప్పటికే విచారించింది. ఈ విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్ 19) ఉదయం వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విచారించారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు వైసీ సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.   ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలు కీలక అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. వారి వాంగ్మూలాలన సిట్ రికార్డు చేసింది. వారి విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు.  టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత, కొనుగోలు విధానాలు, కాంట్రాక్టుల కేటాయింపులపై సిట్ అధికారుల ప్రశ్నలతో వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం.  సుబ్బారెడ్డి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోనికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.    తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు  నోటీసులు జారీ చేశారు. అయితే.. అరోగ్యం సహకరించని కారణంగా తాను విచారణకు రాలేననీ వైవీ చెప్పడంతో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వచ్చి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలోనే విచారించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందన్న సంకేతాలను ఇచ్చింది.   వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై ఈ విచారణలో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. అప్పన విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.