ఉప్పల్ స్టేడియానికి లియోనెల్ మెస్సీ

  గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనన్నున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మోస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు.  అనంతరం  మెస్సీ బృందం ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత  ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఉప్పల్ స్టేడియం వద్ద  బందోబస్తు పెంచారు.  

అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక వినతి... వెంటనే స్పందించిన పవన్

  ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇమిడియట్‌ యాక్షన్ తీసుకున్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును డిసెంబర్ 12వ తేదీ ఉదయం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామం తంబాళహట్టికి చెందిన జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామం రోడ్ల పరిస్థితి వివరించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కు తెలిపారు.  గ్రామానికి రోడ్డు వేయాలని వినతి చేశారు. అయితే, తాను వెంటనే చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీపిక విజ్ఞప్తిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. గ్రామానికి నాణ్యమైన రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం విజ్ఞప్తి చేయగా.. ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంతో దీపికతో పాటు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 12వ తేదిన క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు. ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. అంతేకాకుండా, ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను కూడా అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు.  

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ విందు

  హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.  సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.   వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.   రామేశ్వరం కేఫ్‌లో లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, అఖిలేష్ యాదవ్ మరియు కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.  

హాస్టల్లో కోతుల బెడద…రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల నిరసన

  అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మెరుగైన విద్య కోసం రావికమతం, మాడుగుల మండలాల పరిధిలోని ఆవురువాడ, చీమలపాడు పంచాయతీ పరిధిలో రాయపాడు, పెదగరువు, జోగంపేట, అజయ్పురం, కళ్యాణ్ లావా, చీమలపాడు, తోపాటు గొరిగడ్డ గ్రామాలకు చెందిన మొత్తం 96 మంది ఆదివాసి గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గత నెల రోజులుగా హాస్టల్ ప్రాంగణంలో కోతులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో, వారిని  హాస్టల్ సంక్షేమ అధికారి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. తమ పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, జిల్లా ఉన్నతాధికారులు ఒక రాత్రైనా హాస్టల్లో బస చేసి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరారు. అదే విధంగా హాస్టల్‌లో కిటికీలు సక్రమంగా లేకపోవడం, చుట్టూ భారీ చెట్లు ఉండటం వల్ల కోతుల బెడద పెరిగిందని వారు తెలిపారు. వెంటనే చెట్ల తొలగింపు, కిటికీల మరమ్మతులు చేపట్టి, గిరిజన విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  స్వాగతం పలికారు. రాహుల్ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ పాల్గొంటారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి డొమెస్టిక్ అరైవల్స్ వద్దకు ప్రయాణికులను ఒక్కొక్కరిని అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి విజిటర్స్ అవర్స్‌ను కూడా డిస్మిస్ చేశారు.  మొదటగా లియోనెల్ మెస్సి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపధ్యంలో  ఉప్పల్ స్టేడియం వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో సీసీటీవీ కెమోరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు.  

ధాన్యం కొనుగోలుపై మంత్రి పార్థసారథి తక్షణ స్పందన

  కృష్ణా జిల్లాలో కారకంపాడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ రైతులు మాట్లాడుతూ… ధాన్యం పై పొర రంగు మారిందనే కారణంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపించి విచారణ చేపట్టారు. వ్యాపారస్తులు ధాన్యం రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పినా, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్టు మంత్రి పరిశీలనలో తేలింది. దీంతో రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నట్లు స్పష్టమైంది. మంత్రి ఆదేశాల మేరకు మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించగా, పై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత పూర్తిగా బాగానే ఉందని నిర్ధారణ అయింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, డీఎం సహా సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇకపై రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  

పొందూరు ఖాదికి జి.ఐ. టాగ్...రామ్మోహన్ నాయుడు హర్షం

  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రమ ఫలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదికి మళ్ళీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదికి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ పరిధిలోని భోగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం నాడు అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ ప్రకటన పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చెయ్యగా… శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   అసలేంటి జి.ఐ. టాగ్..?  ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది.. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని.. వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే విదంగా  "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం క్రింద  ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.తద్వారా మిగిలిన ఉత్పత్తుల కన్నా, మేలైనవిగా, విలువైనవిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు నిలుస్తాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు.. నకిలీ వస్తువుల నుండి కాపాడబడుతుంది. విలువైనదిగా కూడా మారుతుంది.  ఇందుకోసం భోగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని  అన్ని దశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మన దేశంలో అనేక విలువైన, అంతరించిపోయే దశలో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ చాలా కొద్ది వస్తువులు మాత్రమే ఈ తరహా భౌగోళిక గుర్తింపు సాధించగా.. అందులో పొందూరు ఖాదీకి జి.ఐ టాగ్ లభించడం వెనుక.. అప్పట్లో శ్రీకాకుళం ఎంపిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేశారు.  2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఆ సందర్భంగా పొందూరు ఖాది గురించి తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మలా సీతారామన్ తో అప్పటి శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా భేటి అయ్యారు. అప్పటికే జి.ఐ టాగ్ విలువ తెలిసిన రామ్మోహన్ నాయుడు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు  పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ. టాగ్ ను కేటాయించాలని తొలుత కోరారు. దీనికి ఆమె నుండి కూడా సానుకూల స్పందన లభించింది.  అనంతరం ఆగస్ట్ 3, 2021 పార్లమెంట్ లో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. మరోమారు జి.ఐ టాగ్ కోసం ప్రధానంగా, సుదీర్ఘంగా సభలో ప్రసగించారు. ఇక అది మొదలు అందుబాటులో ఉన్న అన్ని వేదికల్లో పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ టాగ్ కోసం యత్నించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత మరింత వేగం పెంచారు. సంబంధిత శాఖపై ఈ తరహా గుర్తింపు సంఖ్య వచ్చేందుకు చర్యలు వేగవంతం అయ్యేలా కృషి చేశారు.  తాజా శుక్రవారం నాడు అధికారికంగా పొందూరు ఖాదికి సంబంధించిన జి.ఐ టాగ్  గుర్తింపు ప్రతి అందుబాటులోకి వచ్చింది. పొందూరు ఖాదికి జి.ఐ టాగ్ నంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భోగోళిక సూచికల రిజిస్ట్రీ, ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వెలువడించింది.  ఇంతవరకు బాస్మతి బియ్యం,డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు (2005), మైసూరు పట్టు, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు,  మైసూర్ శాండల్ సబ్బు.. ఇలా  కొన్ని ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు ఉండగా.. ఇకపై పొందూరు ఖాది కూడా ఆ లిస్టులో చేరింది.  దీని ద్వారా చట్టపరమైన గుర్తింపు, పొందూరు తప్ప.. ఈ తరహా విధానంలో ఇతరులు చేసే నకిలీ ఉత్పత్తులను అరికట్టే అవకాశం ఉంది. గడచిన కొన్నేళ్లుగా తన ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఉన్న పొందూరు ఖాదికి.. జి.ఐ టాగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేసిన రామ్మోహన్ నాయుడు కు పొందూరు వాసులే కాదు.. ఉత్తరాంధ్ర ప్రాంతీయులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉన్న పొందూరు ఖద్దరుకు.. జి.ఐ. గుర్తింపు రావడంతో భవిష్యత్ లో మరింతగా కీర్తి సంపందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా  ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణమని రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న  శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయిని తెలిపారు. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దామని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.  

ఆడకుండా వెళ్లిపోయిన మెస్సీ... కోల్‌కతా ఫ్యాన్స్ వీరంగం

  భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. అర్జెంటీననా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి ఇండియాలో అడుగుపెట్టాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. ఇప్పటికే మెస్సి కోల్‌కతా చేరుకున్నాడు. కోల్‌కతా అంతా ఇప్పుడు అంతా మెస్సి జపమే చేస్తోంది. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అభిమానులంతా భారీ ఎత్తున ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.  గోట్ టూర్ ఆఫ్ ఇండియాపేరుతో సాగుతున్న ఫుట్ బాట్ దిగ్గజం కోల్‌కత్తా సాల్ట్ లేక్ స్టేడియం సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  చాలా మంది వీరాభిమానులు మెస్సిన చూడటం కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్సుకతతో ఎదురుచూశారు. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా వెల్లడించారురు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మెస్సీ కోల్ కత్తా స్టేడియంలో మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమైంది.   మెస్సీని దగ్గర నుంచి చూడాలని అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురు చూశారు.  ఇలాంటి తరుణంలో అతను అలా వచ్చి, ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు.  స్టేడియంలో పట్టుమని 10 నిముషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు.  తెల్లవారుజామున కోల్‌కతాలో దిగిన మెస్సి ఉదయం 11.30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లాడు. అప్పటికే భారీస్థాయిలో అభిమానులు అక్కడకి చేరుకున్నారు. రాజకీయ నేతలు, పుట్ బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టడంతో స్టాండ్స్ నుంచి ఆ స్టార్‌ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్నవారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవికూడా ఫలించలేదు. ఈ గందరగో పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించి రెండు ఈవెంట్లను నిర్వహించలేకపోయారు.   భద్రతాకారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతడిని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లి పోయారు. అతడు వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయి ఆగ్రహం వెళ్లగక్కారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు , ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరూ రూ.4,500 నుంచి రూ. పదివేల వరకు వెచ్చించారని తెలుస్తోంది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపారు. శనివారం కోల్‌కతాలో పర్యటించిన మెస్సీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సి ఆవిష్కరించాడు.  అయితే ఈ సందడి నడుమ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మెస్సి  అభిమానులంతా ఆగ్రహానికి గురయ్యారు మెస్సి.. ప్రపంచ స్థాయిలో ఎంతో మంది అభిమానులు ఆయన సొంతం. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తుండటం.. ఇటీవలే ఫిఫా ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో మెస్సిని చూడాలని అభిమానులు తహతహలాడారు. ఆయన కోసం గంటలు గంటలుగా ఎదురు చూశారు. కానీ ఆయన ఎంతో సేపు అక్కడ లేకపోవడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆడుతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్ అంతా నిరసన తెలిపారు. మెస్సి కోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నామని.. మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు. కోల్‌కతా స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.  నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, స్టేడియంలో మెస్సీ అభిమానులు గందరగోళం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

మేస్త్రీ- మెస్సీ...టూర్ ఆఫ్ హైద‌రాబాద్

  ప్ర‌పంచ ఫుట్ బాల్ లెజండ్, అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ 14 ఏళ్త త‌ర్వాత తిరిగి భార‌త్ వ‌చ్చారు. 2011లో కోల్ క‌తాలో జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ త‌ర్వాత మెస్సీ ఇండియా రావ‌డం ఇది సెకండ్ టైం. GOAT ఇండియా టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఆయన భారతదేశంలో ప‌ర్య‌టిస్తారు.ఈ టూర్ లో మెస్సీ మొద‌ట కోల్ క‌త‌, త‌ర్వాత హైద‌రాబాద్, ఆ త‌ర్వాత ముంబై, ఢిల్లీ  సంద‌ర్శిస్తారు. ఈ టూర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే దేశంలో ఫుట్ బాల్ ని ప్రోత్స‌హించ‌డం. ఆపై చారిటీ, క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయ‌డం. కోల్ క‌తాలో శ‌నివారం ఉద‌యం సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అటు త‌ర్వాత బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, న‌టుడు షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గ‌జం సౌర‌వ్ గంగూలీ  వంటి  వారిని  క‌లుస్తారు. అలాగే  శ్రీ  భూమి స్పోర్టింగ్ క్ల‌బ్ లో త‌న 70 అడుగుల విగ్ర‌హాన్ని  వ‌ర్చువ‌ల్ గా ప్రారంభిస్తారు మెస్సీ. ఇక శ‌నివారం సాయంత్రం మెస్సీ హైద‌రాబాద్ వ‌స్తారు. ఇక్క‌డ సీఎం రేవంత్ రెడ్డితో క‌ల‌సి ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతారు.. ఆ త‌ర్వాత మెస్సీ గౌర‌వార్దం సంగీత క‌చేరీ.. ప్రీమియం మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేస్తారు. ప్ర‌త్యేకంగా  ఫ‌ల‌క్ నుమా  ప్యాలెస్ లో ఫోటో సెష‌న్లో పాల్గొంటారు మెస్సీ. ఒక్కో ఫోటో కోసం ప‌ది ల‌క్ష‌ల  మేర వ‌సూలు చేస్తారు.  ఆల్రెడీ మెస్సీతో ఫుట్ బాల్ ఆడ్డానికి మేస్త్రీ రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. ప్ర‌స్తుతం నెట్టింట రేవంత్ ఫుట్ బాల్ ఆడిన వీడియులు తెగ వైర‌ల్ అవుతున్నాయి. బేసిగ్గా  ఫుట్ బాల్ అంటే ఎంతో మ‌క్కువ గ‌ల రేవంత్ కి తెలంగాణ‌లో క్రీడాభివృద్ధిపై ప్ర‌త్యేక‌మైన ఆలోచ‌న‌లున్నాయి. ఇది వ‌ర‌కే క‌పిల్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌తో క‌లిసి.. తెలంగాణ‌లో క్రీడాభివృద్ధికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా మెస్సీతో క‌ల‌సి ఆయ‌న  ఫుట్ బాల్ ఆడి.. ఇక్క‌డ ఈ ఆట‌కు విశేష‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  మొన్న‌టి గ్లోబ‌ల్ స‌మ్మిట్ లోనూ వివిధ‌ క్రీడారంగాల‌కు సంబంధించిన ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి వారి ద్వారా  క్రీడా చ‌ర్చ‌లు జ‌రిగేలా చేశారు. 140 కోట్ల మంది భార‌తీయుల‌కు ఒలింపిక్స్ లో బొటాబొటీగా మెడ‌ల్స్ వ‌స్తున్నాయ్. ఈ సంఖ్య‌ను పెంచ‌డానికి మ‌న వంతు కృషి చేయాల‌న్న‌దే సీఎం రేవంత్ ఆలోచ‌న‌. ఈ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఇక్క‌డ మెస్సీ టూర్ ప్లాన్ చేశారు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆదివారం నాడు ముంబైలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎం.ఎస్. ధోనీ, శుభ్‌మన్ గిల్ వంటి క్రికెటర్లు, నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశమవుతారు మెస్సీ. సోమవారం ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు మెస్సీ.మెస్సీ, మేస్త్రీ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మ్యాచ్‌కి ముందు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో భాగంగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ హైదరాబాద్ రాప్ సింగర్ కేడన్ శర్మ పాల్గొంటారు.  పాటలు, డ్యాన్స్‌లతో హైదరాబాద్ లైఫ్ స్టైల్లో భాగ‌మైన‌, బిర్యానీ, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని వివరిస్తారు. తెలుగు సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారు. ఎందుకంటే హైద‌రాబాద్ అంటేనే బిర్యానీ- బాల్ బాడ్మింట‌న్- బాహుబ‌లి అంటూ మోడీ లాంటి వారే  కామెంట్లు చేసిన విష‌యం  తెలిసిందే. ఇక కేడన్ శర్మ మాట్లాడుతూ.. గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇవ్వబోతున్న తొలి భారతీయ హిప్-హాప్ ఆర్టిస్ట్‌గా తాను రికార్డు సృష్టించడం  గ‌ర్వంగా ఉందన్నారాయ‌న‌. తాను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిన‌ని.. అందుకే త‌న‌ ప్రదర్శనలు పక్కా లోకల్‌గా, స్ట్రీట్ బేస్‌డ్‌గా ఉంటాయని అన్నారు.  నేను సాయి పల్లవి, అల్లు అర్జున్ గురించి మాట్లాడతాను, సల్మాన్ ఖాన్ గురించి కాదు. తెలుగు సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లాయని అన్నారు. త‌న‌ పర్ఫామెన్స్‌లో మెస్సీకి పుష్ప ఫేమస్ డైలాగ్ వినిపిస్తానని అన్నారు. ఏది ఏమైనా వ‌ర‌ల్డ్స్ ఫుట్ బాల్ లెజండ్ మెస్సీ రాక‌తో ఇక్క‌డి ఫుట్ బాల్ ల‌వ‌ర్స్ ఎంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మేస్త్రీ రేవంత్ ఎప్పుడెప్పుడు మెస్సీతో క‌ల‌సి కాలు కాలు క‌దుపుతామా అన్న ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టును ఆశ్రయించిన గవాస్కర్

  భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సునీల్ గావస్కర్, వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచారు.  టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై తన పేరు, ఫొటోలు అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ లిటిల్ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ జరిపి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గావస్కర్ దావాను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, హక్కులు ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా సంస్థలు వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని సూచించింది.  ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరే వ్యక్తులు, ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని, ఆ తర్వాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బేసిక్ సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ , ఐపీ వివరాలను అందిస్తామని మధ్యవర్తులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రతివాదులు 7, 10, 11గా ఉన్న మధ్యవర్తులు గావస్కర్ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. హక్కులు ఉల్లంఘిస్తున్న కంటెంట్‌కు సంబంధించిన స్పష్టమైన యూఆర్‌ఎల్‌లను 48 గంటల్లో కోర్టులో హాజరైన న్యాయవాది ద్వారా సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది. సినిమా రంగానికే పరిమితమైన ఇటువంటి వివాదాలు ఇప్పుడు క్రీడా రంగానికీ విస్తరించాయన్నది ఈ కేసుతో స్పష్టమైంది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, నాగార్జున, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, డిజిటల్ క్రియేటర్ రాజ్ శమానీ వంటి ప్రముఖులకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్‌, ఏఐ సృష్టించిన తప్పుడు వీడియోలు, అనధికార డిజిటల్ మెర్చండైజ్ వంటి కొత్త తరహా ముప్పులపై కూడా న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వ్యంగ్యం, కళాత్మక వ్యక్తీకరణ, వార్తా కథనాలు, వ్యాఖ్యానాల వంటి రంగాలపై ఈ పరిరక్షణ ప్రభావం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.  

పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం

  ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురైంది. తుర్కిమెనిస్థాన్‌లో జరిగిన మీటింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ షరీఫ్‌ను అస్సలు పట్టించుకోలేదు.  పుతిన్, ఎర్డోగాన్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూములో పుతిన్, ఎర్డోగాన్‌లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు.  వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అక్కడ షరీఫ్ లేరు. వేరే రూములో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పుతిన్, ఎర్డోగాన్‌ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాలు పైనే గడిచింది. అయినా షరీఫ్‌కు పిలుపురాలేదు. దీంతో అసహనానికి గురైన షరీఫ్... పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. రూములోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు.  అయితే, పుతిన్ కానీ, ఎర్డోగాన్ కానీ షరీఫ్‌ను పట్టించుకోలేదు. వారి మానాన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. అయినా ఆయనను ఎవ్వరూ పలకరించను కూడా లేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడినుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇక, ఈ సంఘటనపై ఆర్టీ ఇండియా స్పందిస్తూ... ‘ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు’ అని వెల్లడించింది.  రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోడీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. రెండు రోజుల పాటు సందడి సందడిగా గడిపారు. పర్యటన సందర్భంగా ఇద్దరూ చాలా సార్లు ప్రోటోకాల్స్‌ను బ్రేక్ చేశారు.  

తెలంగాణలో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్ధాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం అత్యల్పంగా  సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది.  గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. దీంతో గత పదేళ్ల రికార్డు (డిసెంబరు 12న ఇంత తక్కువ నమోదు కావడం) బద్దలైంది. దీంతోపాటు డిసెంబరు రెండోవారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని.. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణశాఖ తెలిపింది.  హైదరాబాద్‌లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్‌లో 5.6 డిగ్రీలు, మెదక్‌లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి.రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.

సవితి తండ్రి చేతిలో... బాలుడి దారుణ హత్య

  హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇరుగు పొరుగు పిల్లలతో జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ఓ 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసిన విషాదకర ఘటనగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, షేక్ మొహమ్మద్ అజహర్ (10) అనే బాలుడు పరిసరాల్లోని పిల్లలతో ఆడుకుంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో “మీ పిల్లలను ఇలాగే పెంచుతారా?” అంటూ ఎవరో వ్యాఖ్యానించడంతో బాలుడి తండ్రి (సవితి తండ్రి) తీవ్ర ఆగ్రహానికి లోన య్యాడు. కోపంతో రెచ్చిపోయిన సవతి తండ్రి ఈ నెల 7వ తేదీన అజహర్‌ను రోడ్డుపైకి ఎత్తి బలంగా పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఇదిలా ఉండగా, మృతుడు అజహర్ కుటుంబ నేపథ్యంలో కూడా చర్చనీయాంశంగా మారింది.  అజహర్ తల్లి ,భర్త ఉండ గానే మరో వ్యక్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. మొదటి భర్తతో కలిగిన సంతానమే అజహర్... రెండో వివాహం చేసుకున్న తర్వాత బాలుడు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండో భర్త చేతిలోనే బాలుడు హత్యకు గురయ్యాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చాంద్రాయ ణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైసీపీ ఎంపీలకు.... నిర్మల సీతారామన్ షాక్

  వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రైవేటీకరణ కాదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో మాత్రమే చేస్తున్నారని నిర్మల సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్తువకు లోనయ్యారు. ​ పీపీపీ అంటే ప్రైవేట్ కాదు: నిర్మల సీతారామన్ ​వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, "మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు. మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి?" అని సూటిగా అడిగారు. ​దీనికి సమాధానంగా, వైసీపీ ఎంపీలలో ఒకరైన, జగన్ బాబాయి సుబ్బారెడ్డి, "అవును, అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి" అని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్, "మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని 'ప్రైవేట్' అని ఎందుకు చెబుతున్నారు?" అని ప్రశ్నించారు. ​ఎంపీలు ఏదో చెప్పబోతుండగా, "పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం..." అని అన్న సమయంలోనే నిర్మల సీతారామన్ కలుగజేసుకున్నారు. "నో, నో. మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.. నిర్మల సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో, వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు.  

రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ...సీపీ కీలక ఆదేశాలు

  ఫుట్​బాల్​ అభిమానులకు ఈ నెల 13న పండగే పండగ. ఎందుకంటే ఫుట్​బాల్​ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఉప్పల్​ స్టేడియం వేదిక కానుంది. అయితే మెస్సీ పాల్గొనే మ్యాచ్​లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు. క్రీడాకారుడు లియోనల్​ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మ్యాచ్​లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.  మెస్సీ ఫుట్​బాల్​ మ్యాచ్​ నేపథ్యంలో ఉప్పల్​ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి , మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.   శుక్రవారం (ఈ నెల 12) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.శనివారం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని... ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు.  మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని... ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు.  ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రత విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేంద్రం నిర్ణయం

  కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. యూపీఎ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏ’ పథకాన్ని 2006లో ప్రారంభించింది. జనాభా లెక్కలు-2027కు ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ బృహత్ కార్యక్రమానికి రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ‘కోల్  సేతు విండో’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం నూతన పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్  కొబ్బరి క్వింటాలుకు  400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి  క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.   

సీఎం రేవంత్‌ను కలిసిన ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్

  భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొ. అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న  అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయనను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు. 

రాష్ట్రపతి తెలంగాణ పర్యటన... మినిస్టర్ ఇన్ వైటింగ్‌గా మంత్రి సీతక్క

  శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో   రాష్ట్రపతి పర్యటకు మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ టెండర్లు, ప్రత్యేక వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.  

భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు

  భర్త వేధింపులు భరించలేక  భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు... రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.  అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.  కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి  కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.  మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...