రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

 

సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను పోలీసులు సీజ్ చేయగా, ఈ వ్యవహారంలో 143 మందిని అరెస్టు చేసి 103 కేసులు నమోదు చేశారు.

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందోత్సాహాల వేళ. అయితే ఈ సంబరాలు మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన నైలాన్, సింథటిక్, మెటాలిక్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లలో ఒకేసారి దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన, విక్రయానికి సిద్ధంగా ఉన్న మాంజాను స్వాధీనం చేసుకున్నారు.

ప్రెస్ మీట్‌లో సీపీ సజ్జనర్ హెచ్చరిక

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.“సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. కానీ మన ఆనందం మరొకరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదు. చైనీస్ మాంజా వల్ల పిల్లలు, వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం విధించింది. 

నిషేధాజ్ఞలు ఉన్నా కొందరు అక్రమంగా వీటి విక్రయాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఎక్కడైనా చైనా మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని స్పష్టం చేశారు. దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయడంతో కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అక్రమ విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

ఆన్‌లైన్‌లో చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉన్న మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలతో తయారైన మాంజాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

నగరవ్యాప్తంగా  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి, 35 మందిని అరెస్టు చేసి రూ.37.22 లక్షల విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 18 కేసులు నమోదు కాగా, 29 మంది అరెస్టు, రూ.6.02 లక్షల విలువైన 301 బాబిన్లు సీజ్ చేశారు.సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు, 10 అరెస్టులు, రూ.4.42 లక్షల విలువైన 221 బాబిన్లు స్వాధీనం అయ్యాయి.

సెంట్రల్ జోన్‌లో 6 కేసులు, నార్త్ జోన్‌లో 5 కేసులు, వెస్ట్ జోన్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ మొత్తం ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. మొత్తం నమోదైన కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ.68.78 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనర్  అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు అందజేశారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అవసరమైతే సంక్రాంతి ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు బాంబు బెదరింపు!

పశ్చిమ బెంగాల్  గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టింది. గవర్నర్ ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ వార్నింగ్ తో  గురువారం (జనవరి 8) అర్ధరాత్రి అప్పటికప్పుడు లోక్ భవన్  వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో  తాజా బెదరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.

హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు.. కొట్టేసిన హైకోర్టు

టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  నవదీప్‌పై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు   కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. గుడిమల్కాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు..  నవదీప్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలూ లేవని పేర్కొంటూ కేసు కొట్టివేసింది.   నవదీప్ వద్ద డ్రగ్స్ లభించకపోవ డంతో పాటు, అతడిపై నమోదైన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.  ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసును కొనసాగించడం చట్టబద్ధం కాదనీ, అందుకే నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేస్తున్నట్లు వెల్లడించింది. నవదీప్ తరఫున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ తన వాదనలు వినిపించారు. నవదీప్‌పై ఉద్దేశపూర్వకంగా కేసు బనాయించారని, ఎలాంటి  ఆధారాలు లేకుండానే అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదన లను పరిగణనలోకి తీసు కున్న హైకోర్టు కేసును కొట్టివేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హీరో నవదీప్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసును కొర్టు కొట్టివేయడంతో ఆయన నిర్దోషిగా నిరూపితుడయ్యారని నవదీప్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

  టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన  నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. ఆయనపై గతంలో నమోదైన డ్రగ్స్‌ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని న్యాయవాది సిద్ధార్థ్‌ వాదించారు.  నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో కేసు ఉంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. గుడిమల్కాపూర్‌లో   నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హై కోర్టు పేర్కొన్నాది.  

బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా జిల్లా ఎస్పీ పేరుతోనే మోసాలు

ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది. ఫర్నిచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని  పలువురికి  జిల్లా ఎస్పీ పేరుతో గురువారం జనవరి 8) మెస్సేజ్ లు అందాయి. ఈ విషయం  పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే అప్రమత్తమై ఆ ఫేక్ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేశారు. సైబర్ మోసాలు వివిధ రూపాల్లో  పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంద ర్భంగా  ఎస్పీ సంకీర్త్ ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.  

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.కోటి.. కుమారుడికి ప్రమోషన్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అత్యంత అమానవీయంగా వేధింపులకు గురై  ఆ మానసిక క్షోభతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.   ప్రభుత్వ డాక్టర్ అయిన  సుధాకర్ కు జగన్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుమారుడిని పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.   జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది.  ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా..  విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనపై  పిచ్చివాడు అన్న ముద్రవేసి,  ఆసుపత్రికి పంపడం వంటి  అత్యంత అమానవీయ చర్యలకు అప్పటి జగన్ ప్రభుత్వం పాల్పడింది. ఆ  మానసిక వేదన, ఆ అవమానంతోనే  ఆయన కన్నుమూశారు.   నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రభుత్వ పరంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సహకారం అందించాలని నిర్ణయించారు.   ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని  గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు.  అలాగే ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.   

పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో  ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో..  గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో..  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్‌ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

సంక్రాంతికి నో టోల్ ఫ్రీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి నగరాలు, పట్టణాలలో ఉండే ప్రజలు స్వంత ఊళ్లకు వెళ్లడం ఆనవాయితీ. ఇలా  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లే ప్రజలకు టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ను ఇబ్బందులకు గురి చేస్తుండటం, గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుని అగచాట్లు పడటం సాధారణంగా మారిపోయింది. ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకూ టోల్ ఫ్రీకా ప్రకటించాలని తెలంగాణ పర్యాటక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే తెలంగాణ విజ్ణప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ తిరస్కరించారు. జాతీయ రహదారులపై ఉచిత టోల్ కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.  ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.  

టూరిజం డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని క్రియోటివ్ అకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు.   విజయవాడ పున్నమీ ఘాట్ లో   అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన  ఆయన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఈ   కార్యక్రమానికి హాజరైన  యూరోపియన్ యూనియన్ రాయబారి (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి  ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు.  తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమన్న చంద్రబాబు ఆవకాయ్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం  సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు.  ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు. ఇక ఈ ఆవకాయ ఫెస్టివల్ ను తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుంటున్నామన్న చంద్రబాబు తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు.  కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి.  మైసూర్, కలకత్తాలకు దీటుగా  విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా ఆ ఉత్సవాలను జరుపుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.  

పదేళ్లలో పర్యాటకంలో ఏపీ నంబర్ వన్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోంది.  రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే  విజయవాడలో మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్  ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. గురువారం (జనవరి 9)న ప్రారంభమైన అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ లో  సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయన్నారు.   పర్యాటక రంగాన్ని  ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో  పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.   సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ,  పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఇక అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందనీ, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నచంద్రబాబు, దేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ కే దక్కాయనీ, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తేటతెల్లం చేసిందని అన్నారు.   పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయన్న ఆయన. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడంలో భద్రత, శుభ్రత కీలకపాత్ర వహిస్తాయన్నారు.  ఇక రాష్ట్ర పర్యాటకంలో తెలుగు సినీమా కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  క్రియేటివిటీకి తెలుగు సినిమా చిరునామా అన్న విషయాన్ని   భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే  నిదర్శమన్నారు.   ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.    గత ప్రభుత్వం సాంస్కృతిక ,  వినోద కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేయడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.    విజయవాడ ఉత్సవ్ మరియు కనక దుర్గ ఉత్సవ్‌లను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.     అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూరోపియన్ యూనియన్  రాయబారి హెర్వే డెల్ఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్  వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో  ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు. సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ   నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్ధిక వృద్దిలో పెట్టుబడులతో ఏపీని లీడింగ్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన, ఈ డైనమిజమే యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోందని అన్నారు.  

కోడి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం.. తిరుపతిలో ఇద్దరు అరెస్టు

తిరుపతిలో  ఇద్దరు వైసీపీ కార్యకర్తలనుపోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధినేత జన్మదినం సందర్భంగా వారు చేసిన చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ వారేం చేశారంటే.. మాజీ  సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేట్ ఉద్యోగి భువనకుమార్ రెడ్డి  గత డిసెంబర్ 21న కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ   దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత ఈ విషయంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో  పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గురువారం (జనవరి 8) వారిరువురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.   నిందితుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు.  నిందితులు కోర్టుకు వచ్చిన సమయంలో వారిని పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టుకు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా కోర్టు వారిరువురికీ బెయిలు మంజూరు చేసింది.