హైదరాబాద్ కరోనాకు హాట్స్పాట్ గా మారింది!
posted on Apr 18, 2020 @ 10:20AM
శుక్రవారం నాడు కొత్తగా మరో 66 కేసులు నమోదు కావడంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. ఇందులో 37కేసులు హైదరాబాద్కు చెందినవి. హైదరాబాద్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పట్టి వరకు 409 కేసులు నమోదైయ్యాయి. ఇందులో 44 మంది కోలుకున్నారు. 12 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు ఆయన తెలిపారు.
పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాతబస్తీలో మర్కజ్ లింకులు ఉండడం.. అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వాలని.. కానీ ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. తలాబ్ కట్ట, రమ్నస్పురా, అలీబాగ్.
హైదరాబాద్లో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు వాహనాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్ శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్ శానిటైజేషన్ చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్ శానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.