టీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలో ప్రమోషన్..!

కొద్ది రోజుల క్రితం కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకున్నటీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలోనే పార్టీలో ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు కొద్ది రోజులు జైలులో రిమాండ్ లో ఉండి తరువాత బెయిల్‌ పై ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శాసనసభ లోపల, బయట ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కారణంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను అరెస్టు చేసి ఇబ్బందిపెడుతోందని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక అచ్చెన్న వైసీపీ సర్కారుపై దూకుడు తగ్గిస్తారా లేక మరింత తీవ్రం చేస్తారా అని ఒక పక్క చర్చ జరుగుతోంది.   ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అచ్చెన్నకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు దూకుడుగా వ్యవహరించే అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ లో మెజారిటీ నేతలు భావిస్తున్నారు. దీంతో అచ్చెన్నకు పదవి ఇవ్వడం పై సీనియర్ల ఆమోదం కూడా ఉండటంతో త్వరలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మండలస్థాయి వరకు పూర్తీ చేయగా ఇక లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.

మా విధుల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి.. హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆరోపించారు. అంతేకాకుండా తమ స్వతంత్రతను అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తమ సిబ్బందిపై సీఐడీ ఫైల్ చేసిన కేసును కూడా రాజ్యాంగ విరుద్ధం గా ప్రకటించాలని, అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం పై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ను, అందులోని డేటాను సీఐడీ అధికారులు తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తమకు తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ లో నిమ్మగడ్డ కోరారు. గతంలో తాను కేంద్రానికి రాసిన ఒక లేఖ వ్యవహారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన సీఐడీ అధికారులు.. ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఆసక్తి చూపారన్నారు.   అప్పటికే పని చేయని ఒక కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు తన సహాయ కార్యదర్శి సాంబమూర్తిని సీఐడీ అధికారులు వేధించడమే గాక.. సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పుడు కేసు పెట్టారని అయన తెలిపారు. కేవలం ఎన్నికల కమిషన్‌ను, ఉద్యోగులను వేధించేందుకే ప్రభుత్వం ఆ కేసు పెట్టిందన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్సులను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించేలా వీటిపై తరువాతి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తనకు భద్రత కల్పించాలని గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ.. దీనిపై విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దుబ్బాక బరిలో రాములమ్మ.. టీఆర్ఎస్ కి ఓటమి తప్పదా?

ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.   కరోనా కాలంలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు మొదట్లో దుబ్బాక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత నిలవనున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా టీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో నిలిచినా తాము బరిలోకి దిగి తీరుతామని ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీకి దిగనుండగా, కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు విజయశాంతి పేరు తెరమీదకు వచ్చింది.    గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక బరిలో నిలిపితే పోరు రసవత్తరంగా ఉంటుందన్న ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా పనిచేసిన ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పుడు విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే విషయంపై విజయశాంతి కూడా పాజిటివ్‌ గా ఉన్నట్లు సమాచారం.   దుబ్బాకలో విజయశాంతి బరిలోకి దిగితే టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దుబ్బాక టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. రామలింగారెడ్డి కుటుంబం పోటీ పట్ల టీఆర్ఎస్‌ లో అసంతృప్తి ఉంది. టికెట్ విషయంలో టీఆర్ఎస్‌లో ఉన్న అనిశ్చితి, నియోజకవర్గంలో విజయశాంతికి పట్టు, పార్టీలకు అతీతంగా ఆమెకున్న వ్యక్తిగత ఇమేజ్.. టీఆర్ఎస్ ను దెబ్బ తీసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరస్థులు 

ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను ఈ తెల్లవారుజామున సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్ధారించింది. narendramodi_in పేరుతొ ఉన్న ఈ అకౌంట్ ను గురువారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ అకౌంట్ నుండి వరుసగా రెండు ట్వీట్లు చేసి కలకలం రేపారు. మొదటి ట్వీట్ లో "కరోనా కట్టడి కోసం అందరూ ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అదించండి. ఇండియాలో కూడా బిట్ కాయిన్ రూపంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంభమయ్యాయి.'' అని మొదట ఓ ట్వీట్ చేశారు. ఇక రెండో ట్వీట్ లో ''అవును ఈ అకౌంట్ ను జాన్ విక్‌ బృందం హ్యాక్ చేసింది. మేమేమి పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదు.'' అని పేర్కొన్నారు. అయితే హ్యాకర్ల బారినపడిన narendramodi_in ట్విటర్ అకౌంట్ ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌ కి సంబంధించినదే కానీ అది ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ కాదు. ఐతే దీనిపై వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన ట్విటర్ టీమ్ హ్యాకర్లు పెట్టిన ఆ రెండు ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం ఆ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుంది.   గత జులైలో కూడా ఇలాగె ప్రపంచంలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్‌కు గురవడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం మరింత కలకలం రేపుతోంది. జులైలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్‌ కు గురయ్యాయి. అంతేకాకుండా ఆ మధ్య ఉబెర్, యాపిల్ కంపెనీలకు చెందిన అధికారిక అకౌంట్లు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా జరగుతుండడంతో ట్విటర్ టెక్నికల్ టీమ్ దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది.

సౌదీ కన్నా తక్కువ భారత్ రక్షణ బడ్జెట్

ప్రపంచంలోని అనేక దేశాలు తమ రక్షణ బడ్జెట్ ను ఏటేటా పెంచుతున్నాయి. జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలను రక్షణారంగానికి కేటాయిస్తున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏయే దేశాలు రక్షణవ్యవస్థ కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తున్నాయో పరిశీలిస్తే సౌదీ అరేబియా కన్నా భారత దేశం తక్కువ బడ్జెట్ ను రక్షణా రంగానికి కేటాయిస్తోంది.   ప్రపంచ మొత్తం సైనిక వ్యయం 2018 లో సుమారు 8 1.8 ట్రిలియన్లు. ఇది 2017 బడ్జెట్ కన్నా 2.6శాతం అధికం. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం ఉన్న పది దేశాలు రక్షణా రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ వివరాలు పరిశీలిస్తే ఆయా దేశాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలుస్తోంది.   యునైటెడ్ స్టేట్స్ అమెరికా రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతోంది. సైనికుల జీతభత్యాలతో పాటు పరిశోధనలకు కూడా ఇందులో కేటాయింపులు ఉంటాయి. అమెరికా రక్షణ వ్యయం 649 బిలియన్ డాలర్లు   చైనా  ప్రపంచంలో అధిక జనాభా ఉన్న చైనా రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు చేస్తోంది. ప్రతి ఏటా 250 బిలియన్ డాలర్లకు మించి రక్షణ శాఖకు కేటాయింపులు చేస్తోంది.   సౌదీ అరేబియా  ఈ దేశ జనాభా సుమారు 34,813,871. అయితే రక్షణ రంగానికి కేటాయింపులు మాత్రం 67. 6 బిలియన్ డాలర్లు. అంటే ఆ దేశ జిడిపిలో 8.8శాతం.   భారత్ భారతదేశంలో రక్షణా వ్యయం 66.5 బిలియన్ డాలర్లు. అంటే జిడిపిలో 2.4శాతం మాత్రమే. సౌదీ అరేబియా కేటాయించిన దాని కంటే ఇది తక్కువ.   ఇరత దేశాలు ఇక ఇతర దేశాల రక్షణా బడ్జెట్ ను పరిశీలిస్తే ఫ్రాన్స్   63.8 బిలియన్ డాలర్లు, రష్యా  61.4 బిలియన్ డాలర్లు, యునైటెడ్ కింగ్‌డమ్ 50 బిలియన్ డాలర్లు, జర్మనీ  49.5 బిలియన్ డాలర్లు, జపాన్  46.6 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా  43.1 బిలియన్ డాలర్లు.  

చైనా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అత్యవసరంగా తరలుతున్న బలగాలు

భారత చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దీంతో సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాజాగా హోం శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. భారత్ కు చైనా, నేపాల్, భూటాన్లతో గల సరిహద్దుల్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ లో ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.   మరీ ముఖ్యంగా చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో పెట్రోలింగ్, నిఘాను పెంచాలని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ)‌ కు, ఇండో టిబెటెన్ బోర్టర్ పోలీసు (ఐటీబీపీ) కి తాజాగా హోం శాఖ ఆదేశాలు జరీ చేసింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని హోం శాఖ ఆదేశించింది. దీనితో పాటు, ఇదే సమయంలో ఇండో-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో కూడా తమ నిఘా పెంచాలని ఎస్ఎస్‌బీ, ఐటిబిపిలకు హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.   కాగా కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌బీకి చెందిన పలు కంపెనీల దళాలను భారత్ నేపాల్ సరిహద్దుకు తరలించారు. ఇంతకుముందు జమ్మూకశ్మీర్, ఢిల్లీలో మోహరించిన ఈ బలగాలను తాజాగా బోర్డర్ కు తరలించారు. అంతేకాకుండా ఎల్ఏసీ వెంట మన భూభాగంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కదలవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. తాజాగా చైనా సరిహద్దు ప్రాంతాలను మార్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని "వ్యూహాత్మక ప్రదేశాల్లో" మన సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ లేక్ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో మరిన్ని అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఓ వైపు మిలటరీ చర్చలు జరుగుతుండగానే నిన్న(మంగళవారం) చైనా మరోసారి బోర్డర్ లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. పబ్జీ సహా 118 యాప్ లు బ్యాన్ 

ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా సరిహద్దు వివాదం పై చైనా ఒకపక్క భారత్ తో చర్చలు జరుపుతూనే మరోపక్క సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తూండటంతో కేంద్రం తాజాగా మరికొన్ని చైనీస్ యాప్‌లపై వేటు వేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్ లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో వెంటనే భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా అటు గూగుల్ ప్లే స్టోర్ నుండి, ఇటు యాపిల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఈ పబ్జీ యాప్‌ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్ టాక్ తో సహా మరో 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.   అయితే ఈ పబ్జీ యాప్ ను నిషేధించాలని గత కొంత కాలంగా తల్లితండ్రులు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఒక మాతృమూర్తి దీనిని నిషేధించాలని ఏకంగా ప్రధానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ యాప్ వ్యామోహంలో పడి కొంతమంది యువత తమ సమయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తించడం కూడా మనం చూస్తున్నాం. మరి కొంత మంది టీనేజర్లయితే తల్లితండ్రులు తమను ఈ గేమ్ ఆడనివ్వడం లేదని ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. చివరికి కారణమేదైనా ఈ యాప్ ను మనదేశంలో బ్యాన్ చేయడం భారత్ లోని తల్లి తండ్రులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.

ఏపీ గవర్నర్ మౌనానికి కారణం అదేనా?

కారణాలేమిటో తెలియదుకాని, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈమద్యకాలంలో సైలెంట్ అయ్యారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో విపరీతంగా ప్రబలుతున్న నేపధ్యంలో, ఆయన వయసు రీత్యా ఎలాంటి కార్యక్రమాలకి హాజరు అవడం గాని, సందర్శకులకు కలవడం గాని చేయడంలేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నప్పటికీ, కనీసం పండుగలు పబ్బాలప్పుడు కూడా మెసేజిలు కూడా ఇవ్వడం మానేశారు..    సహజంగా ఏదైనా పండగలకో, మరేఇతర కార్యక్రమాలకో రాజ్ భవన్ నుండి రాష్ట్ర ప్రజలకు సందేశాలు రావడం సహజం. అలాంటిది, కనీసం అత్యంత ప్రాముఖ్యమున్న వినాయక చవితికి కూడా గవర్నర్ వద్దనుండి ఎలాంటి సందేశం లేదంటే, పరిస్థితిని సులభంగానే అర్థంచేసుకోవచ్చు.    దీనికి కారణాలేయమైనప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ వర్గాలు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో అయితే నేమి, రాజధాని మార్పు, సీఆర్డీయే చట్టం రద్దు విషయంలో అయితే నేమి, రాజ్ భవన్ కొంత విమర్శలు ఎదుర్కొన్న మాట నిజం. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో అయితే నేరుగా సుప్రీమ్ కోర్ట్ గవర్నర్ విడుదల చేసిన ఆర్డినెన్సు ను పూర్తిగా చెల్లదని చెప్పడంతో, రాజ్ భవన్ వర్గాలు కొంత ఆశ్చర్యానికి గురైన మాట వాస్తవం.    ఇక, మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ చట్టం రద్దు విషయాలైతే ప్రస్తుతానికి హై కోర్ట్ దాటి సుప్రీమ్ కోర్ట్ వరకు వెళ్ళాయి. దేశ అత్యున్నత న్యాయస్తానం నిర్ణయం ఇంకా రానప్పటికీ, వీటిపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంతవరకు విమర్శలకు గురైనాయి.    అప్పటినుండే, రాష్ట్ర గవర్నర్ మౌనం వహించారని రాజకీయ విశ్లేషకుల వాదన. కోవిద్ నేపథ్యంలో అయితేనేమి, ఆయన వయసు రీత్యా అయితేనేమి,  గవర్నర్ ప్రత్యక్ష్యంగా జనబాహుళ్యంలోకి రాకపోయినా, కనీసం ఆన్లైన్ ద్వారా నయినా కొన్నీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నప్పటికీ, ఎందుకో తెలియదుకాని, ఆయన మౌనం వహించారు.    సుమారు అదే వయసులో వున్న హిమాచల ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దాదాపు ప్రతి రోజు ఏదోవిధంగా వార్తల్లో ఉంటూనే వున్నారనేది అందరికి తెలిసిందే. ఇక తెలంగాణా గవర్నర్ తమిళసై అయితే దాదాపు ప్రతిరోజు ఏదోఒక కార్యక్రంలో పాల్గొంటూనే వున్నారు. లేదా కనీసం రాజ్ భవన్ నుండి ఏదోఒక సందేశాన్నైనా విడుదల చేస్తారు.    అలాంటిది, ఆంధ్ర గవర్నర్ కనీసం వినాయక చవితి శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు అందించలేదు. చివరిసారిగా బిశ్వభూషణ్ హాజరైన కార్యక్రమం, జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరియు అప్పలరాజు లకు జులై 22 న ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా రాష్ట్రం కోవిద్ మహమ్మారి గుప్పట్లోనే వుంది. ఇంకా చెప్పాలంటే, లాక్ డౌన్ అప్పట్లో చాలా పకడ్బందీగా అమలవుతున్న సమయం. కానీ, ఆయన దీనికి హాజరవడం, కొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత, ఇక కేవలం ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆయన రెండు సార్లు కలవడం జరిగింది. అదికూడా ఆ రెండు ఆర్డినెన్సు లు విడుదల చెయ్యడానికి మాత్రమే.    ఎందుకో తెలియదుకాని, జగన్ కూడా మూడు రాజధానుల విషయంలో విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత, ఆయన కూడా రాజ్ భవన్ కు వెళ్లిన దాఖలాలు కనబడ్డంలేదు. కోవిడా, మరే ఇతర కారణలా, ఏది ఏమైనప్పటికి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈ మధ్య కొంత మౌనంగానే వుంటున్నారనేది మాత్రం వాస్తవం. 

చీరాల వైసీపీలో వర్గ విభేదాలు.. జగన్ కాళ్లు పట్టుకుని బతికిపోయారు!!

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు పోటాపోటీగా సాగడంతో పాటు.. ఆమంచి, కరణం వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.   వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కరణం వెంకటేష్.. ఆమంచిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ప్రమాణం చేశామని, స్వేచ్ఛను ఇచ్చేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవని స్పష్టం చేశారు. "బెదిరింపులను ఎవరూ చూస్తూ కూర్చోరు, జాగ్రత్త" అంటూ హెచ్చరించారు.   దీనిపై ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా స్పందించారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా? అంటూ ఆమంచి మండిపడ్డారు.   అధికార పార్టీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయంశమైంది. బాధ్యతగా ఉండాల్సిన నాయకులు ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు బెదిరింపులకు దిగడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   కాగా, 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ తరఫున కరణం బలరాం బరిలోకి దిగగా, వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం.. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్టుగా.. రాజకీయ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారు. అందుకే వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ పరిస్థితి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

ఏపీ వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించాలని పేర్కొంది.   అయితే, ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సున్నావడ్డీలానే ఉచిత విద్యుత్‌ ను నీరుగార్చబోతున్నారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఉచిత విద్యుత్ విధానాన్ని మార్చడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు నష్టం వస్తుందన్నారు.   రైతులకు ఉచిత విద్యుత్‌ పై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు విద్యుత్‌ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.

బంగారంపై 90శాతం రుణం.. ఆర్బీఐ నిర్ణయం

కరోనా నేపధ్యంలో ఆర్బీఐ అనేక వెసులుబాటు నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా బంగారంపై తీసుకునే లోన్ మొత్తాన్ని 75శాతం నుంచి 90 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల చిన్నచిన్న పరిశ్రమలకు పెట్టుబడులు సమకూరుతాయి. అంతే కాదు ప్రజల చేతికి తగినంత డబ్బు రావడంతో వారు ఉపాధి మార్గాలు వెతుక్కోవడం సాధ్యమవుతుంది.  బంగారంపై రుణం ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్లకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. గతంలోని నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు వరకు మాత్రమే రుణం వచ్చేది. ఇప్పుడు దీనిని 90 శాతానికి పెంచారు. అయితే వచ్చే ఏడాది మార్చి వరకే ఈ సదుపాయం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన ప్రజలకు ఇది ఉరటనిస్తుందని బ్యాంక్ వర్గాలు అంటున్నాయి.   దాదాపు 25వేల టన్నులు భారతదేశ ఆచారంలో బంగారానికి ప్రాధాన్యత ఎక్కువే. ఆభరణాలు కాకుండా బంగారాన్ని మూలధనంగా కూడా భావిస్తారు. ఆడపిల్ల పుట్టగానే బంగారం కొన్నే ఆచారం ఉంది. మనదేశంలోని ఇండ్లలో ఉన్న బంగారం దాదాపు 25 వేల టన్నులు. దీని విలువ అక్షరాల 1.41 లక్షల కోట్ల  డాలర్లు. అంటే మన దేశ సాధారణ జీడీపీలో సగం. బంగారం పై బ్యాంక్ వడ్డీ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పుడు బంగారంపై రుణాలకు భారీగానే గిరాకీ పెరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో మరింత ఎక్కువ మంది బంగారు రుణాలు తీసుకునే అవకాశం ఉంది.

ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ 

కరోనా నిబంధనలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామని సర్క్యులర్ జారీ చేసిన పార్లమెంటు వర్గాలు ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఉభయసభల సమావేశాలను ఒకేసారి కాకుండా ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహించనున్నారు. అంతేకాదు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున శని,ఆదివారాల్లో కూడా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌ వర్గాలు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేశాయి.

డేటింగ్ యాప్ లను నిషేదించిన పాకిస్తాన్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తమ సరదాల కోసం యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు అభ్యంతరకరమైన యాప్ లను రూపొందించి యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కొన్నింటిపై భారత్ ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం ఐదు ప్రధాన డేటింగ్ యాప్ లపై నిషేధం విధించింది. టిండర్, గ్రిండర్, ట్యాగ్ డ్, స్కౌట్, సే హాయ్ వంటి డేటింగ్, లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు స్థానిక చట్టాలను అతిక్రమిస్తున్నాయంటూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ ఆరోపిస్తోంది. తమ కంటెంట్ ను మార్చుకుంటే, స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉంటే నిషేధం అంశంపై పునరాలోచిస్తామని అథారిటీ తెలిపింది.   ఈ యాప్ ల్లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించాల్సిందిగా గతంలోనే నోటీసులు ఇచ్చామంటున్నారు. అయితే నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు స్పందించలేదని అందుకే వాటిపై నిషేధం విధించాల్సి వచ్చిందని పాక్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ వెల్లడించింది. 

ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి

దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2019 సంవత్సరంలో 18వేలకు పైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఇక, 13వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. 12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో నిలవగా.. నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. ఆంధ్రప్రదేశ్ లో 6,465 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.   ఇక, దేశవ్యాప్తంగా 10,281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్ర 3,927 ఆత్మహత్యలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,992), ఆంధ్రప్రదేశ్‌ (1,029), మధ్యప్రదేశ్‌ (541), తెలంగాణ (499) లు ఉన్నాయి.   రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు.   "రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు వైఎస్ జగన్. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారు. ఆఖరికి విత్తనాలు,ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం." అని లోకేష్ విమర్శించారు.   "ఇచ్చిన ప్రతీ హామీలో మోసం. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారు. 15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి." అని లోకేష్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ టూ శ్రీనగర్.. ఐపిఎస్ అధికారి చారుసిహ్హ

శ్రీనగర్‌ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) ఇన్ స్పెక్టర్ జనరల్‌గా తెలంగాణ క్యాడర్ మహిళా ఐపిఎస్ అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. వివాదస్పద, తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే శ్రీనగర్‌ సెక్టార్ కు మహిళా అధికారి ఐజీగా రావడం ఇదే మొదటిసారి.   శ్రీనగర్  సెక్టార్ 2005లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళాపోలీసు అధికారి ఎవరూ నియమించబడలేదు. మూడు జిల్లాలు ముద్గాం, గండర్ బల్, శ్రీనగర్ లు, లడఖ్ యూనియన్ భూభాగం ఈ సెక్టార్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడి సీఆర్పీఎఫ్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు. ఇక్కడ పనిచేసే అధికారి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో పాటు ఇండియన్ ఆర్మీతోనూ, జమ్మూ కాశ్మీర్ పోలీసులతోనూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ మహిళా అధికారిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలో బీహార్ సెక్టార్ లో నక్సల్స్ కార్యకలాపాలు అణిచివేయడంలోనూ, తెలంగాణలో నక్సల్స్ ప్రాభల్యం ఉన్న జిల్లాల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఆమెకు ఉంది.   చారుసిహ్హ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని బరేలీ. ఆమె తండ్రి ఎస్.ఎస్. సిహ్హ ఇక్రిశాట్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ హైదరాబాద్ కు బదిలీ పై వచ్చారు. అమ్మ మధుసిహ్హ ఆర్టిస్ట్. చారుసిహ్హకు ఇద్దరు చెల్లాలు ఉన్నారు. చారు సిహ్హ ఆబిడ్స్ లోని రోజరీ కాన్వెంట్ లో చదువుకున్నారు. సివిల్స్ లో చేరాలని ఎనిమిదో తరగతిలోనే ఆమె నిర్ణయించుకున్నారు. సెయింట్ ఫ్రాన్సెస్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ గోల్ట్ మెడల్ అందుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ లో పిజీ పూర్తి చేసి తర్వాత ఐపిఎస్ లక్ష్యంతోనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. 1996 బ్యాచ్ లో సివిల్ సర్వెంట్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఫస్ట్ పోస్టింగ్ కడప జిల్లా పులివెందుల. కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యాక్షనిస్టులను, నక్సలైట్స్ ను అదుపులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో సింహస్వప్నంగా ఉండేవారు. అందుకు నిదర్శనంగా ఆమె సర్వీస్ కన్నా ఎక్కువ సంఖ్యలో బదీలీలు ఉంటాయి. రాజీలేని తత్త్వం, చట్టానికి కట్టుబడి పనిచేసే మనస్తత్వం ఆమెను నిజాయితీ గల అధికారిలో ప్రజల మన్ననలు అందుకునేలా చేశాయి.   తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిఐడి ఐజీగా ఆమె పనిచేశారు. చిన్నారుల బాల్యం భయం లేకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చైల్డ్ అబ్యూస్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశారు. వివక్షలేని బాల్యం ద్వారానే భారత్ భవిష్యత్ ను బంగారుమయం చేయవచ్చని ఎన్నో వేదికలపై ఆమె చెప్పేవారు. కేంద్ర సర్వీస్ కు వెళ్ళిన తర్వాత బీహార్ లోనూ ఆమె పనిచేశారు. ఇప్పుడు శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందడం ఆమె అంకితభావానికి సరైన గుర్తింపు గా భావించవచ్చు. దేశసరిహద్దుల్లో చారుసిహ్హ లాంటి అధికారులు ఉండటం మన దేశంలోని మహిళలందరికీ గర్వకారణం.

వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ తీరుపై మోహన్ బాబు అసంతృప్తి!!

సీనియర్ నటుడు మోహన్ బాబుకు వైసీపీతో గ్యాప్ పెరిగిందా! వైఎస్ కుటుంబానికి ఆయన సన్నిహితంగానే ఉంటున్నారా!. ఈ ప్రశ్నలకు కొంత కాలంగా సరైన సమాధానం దొరకడం లేదు. ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ తో మోహన్ బాబు కలిసిన సందర్భాలు లేవు. వైసీపీ ప్రభుత్వం  పని తీరుపై ఆయన ఎక్కడా స్పందించడం లేదు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన మోహన్ బాబు.. జగన్ పాలనపై మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వైసీపీతోనూ, జగన్ తోనూ మోహన్ బాబు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో జగన్ పాలనపై ఆయన విమర్శలు కూడా  చేయలేదు . దీంతో మోహన్ బాబుకు జగన్ మధ్య గ్యాప్ లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.    వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా  మోహన్ బాబు ఆయనకు నివాళి అర్పించారు. వైఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రాజకీయవేత్త అని నివాళి అర్పించారు. మా బావగారు అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. దీంతో మోహన్ బాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగానే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ తో మోహన్ బాబుకు ఎంతో అనుబంధం ఉందని, అందుకే ఆయనకు నివాళి అర్పించారని మరికొందరు చెబుతున్నారు. వైఎస్ కు నివాళి అర్పించినంత మాత్రానా జగన్ తో గ్యాప్ లేదని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మోహన్ బాబు... సీఎంగా జగన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్ కు నివాళి అర్పించిన మోహన్ బాబు.. జగన్ ఏడాది పాలనపై ఎందుకు విషెష్ చెప్పలేదని అంటున్నారు.    కొద్దిరోజుల క్రితం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని మోహన్ బాబు కామెంట్ చేశారు. తన కుమారుడు మనోజ్ రాజకీయాల్లో వస్తానంటే వద్దని చెబుతానని చెప్పారు. దీంతో వైసీపీ రాజకీయాలు, జగన్ తీరుపై అసంతృప్తితోనే మోహన్ బాబు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావించారు.     వైఎస్ కుటుంబానికి మోహన్ బాబుకు మధ్య బంధుత్వం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. జగన్ ను సీఎం చేయాలని ఓటర్లకు పిలుపిచ్చారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మోహన్ బాబు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సీఎం జగన్. తాను పదవులు కోరనని మోహన్ బాబు చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆ మధ్య కుమారులు, కూతురుతో కలిసి ప్రధాని మోడీని కలిసి మోహన్ బాబు.. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే మోహన్ బాబు కొంతకాలంగా సీఎం జగన్ గురించి ప్రస్తావించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ పై మెహన్ బాబు ఆగ్రహంగా ఉన్నారనే   చర్చ జరుగుతోంది.

చంద్రబాబును ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వని వైసిపి.. కేసులు నోటీసులతో రచ్చ 

గత శాసన సభ ఎన్నికలలో టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు పని ఇక అయిపోయిందని వైసీపీతో సహా టీడీపీ వ్యతిరేకులు అందరు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల తరువాత చంద్రబాబు అమరావతి నివాసం పై వైసిపి నేతలు కొంతకాలం రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దాని తరువాత బాబు విశాఖ పర్యటనలో కూడా రచ్చ జరగడంతో విషయం హైకోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి చంద్రబాబు హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని తన నివాసం లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ కేడర్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే దీనిపై వైసిపి నాయకులు రెచ్చిపోయి బాబు పక్క రాష్ట్రం లో దాక్కొని జూమ్ ద్వారా కథ నడిపిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఏ అధికారపక్షమైనా తమ ప్రత్యర్ధులు ప్రజలలో కనపడకూడదు.. వినపడకూడదు అని కోరుకుంటాయి. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ లు కూడా అయితే అటు ట్విట్టర్ లో లేదంటే జూమ్ లో కాన్ఫరెన్సులతో కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క రాష్ట్ర ప్రజలు పలు రకాల సమస్యలతో సతమతమవుతుండగా బాబు, లోకేష్ లు మాత్రం ఇంటికే పరిమితమవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అటు పార్టీ నేతలు కూడా మొత్తుకుంటున్నారు.   ఇది ఇలా ఉండగా అధికారంలో ఉన్న వైసిపి మాత్రం అటు టీడీపీని ఇటు బాబును నిత్యం విమర్శిస్తూ ప్రజల లో ఆ పార్టీ పట్ల సానుభూతి పెరిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించి ఆ పార్టీని జనంలో ఎండగట్టే ప్రయత్నం చేయకుండా నిత్యం ఏదో ఒక సాకుతో బాబును విమర్శిస్తూ మరోపక్క ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏదో ఒక సాకుతో అరెస్టులు చేయడంతో టీడీపీకి ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతోంది. తాజాగా చిత్తూరులో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడి ఆత్మహత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు డిజిపికి లేఖ రాసారు. సోషల్ మీడియాలో అతడు చేసిన కామెంట్లపై కొంత మంది వైసిపి నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు చేసారు. దీని పై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు బాబు స్వయంగా చితూర్ జిల్లా లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు. ఇప్పటికైనా వైసిపి మేల్కొని బాబుగారికి మైలేజి ఇచ్చే ఇటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిదని.. లేదంటే తనకు తానే ప్రత్యర్థికి అస్త్రాలు ఇచ్చి మరీ ఆ పార్టీని బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికలలో వైసిపికి గడ్డు పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టు ఆదేశాలతో సీఏఏ పై నిరసన తెలిపిన డాక్టర్ కఫీల్ ఖాన్ అర్ధరాత్రి విడుదల

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకు వచ్చిన సీఏఏ చట్టం పై దేశంలో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన నిరసనల్లో పాల్గొని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్‌ఖాన్ నిన్న అర్ధరాత్రి జైలు నుండి విడుదలయ్యారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చడంతో పాటు కఫీల్‌ఖాన్ కు బెయిలు మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కఫీల్‌ఖాన్ గత అర్ధరాత్రి మధుర జైలు నుంచి విడుదలయ్యారు.   గత సంవత్సరం డిసెంబరులో సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కఫీల్‌ఖాన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ జాతీయ భద్రతా చట్టం కింద ఈ ఏడాది జనవరి 29న గోరఖ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికీ ఆయనను విదుదల చేయాలనీ కోర్టు ఆదేశించినప్పటికీ జైలు అధికారులు సత్వరంగా స్పందించకపోవడంతో ఖాన్ విడుదల ఆలస్యమైంది. దీంతో స్పందించిన ఖాన్ కుటుంబ సభ్యులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని హెచ్చరించడంతో ఆగమేఘాల మీద గత అర్ధరాత్రి జైలు అధికారులు విడుదల చేశారు. నిన్న రాత్రి జైలు నుండి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన కఫీల్ ఖాన్ యూపీలోని యోగి ప్రభుత్వం తనను కొత్త కేసులలో ఇరికించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. అయన అనుమానాలకు మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే గతంలో బిఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజెన్ కొరత గురించి డాక్టర్ కఫీల్ ఖాన్ తన ఆందోళన వ్యక్తం చేయడమే.