హైకోర్టు ఆదేశాలతో సీఏఏ పై నిరసన తెలిపిన డాక్టర్ కఫీల్ ఖాన్ అర్ధరాత్రి విడుదల
posted on Sep 2, 2020 @ 11:12AM
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకు వచ్చిన సీఏఏ చట్టం పై దేశంలో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన నిరసనల్లో పాల్గొని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్ కఫీల్ఖాన్ నిన్న అర్ధరాత్రి జైలు నుండి విడుదలయ్యారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చడంతో పాటు కఫీల్ఖాన్ కు బెయిలు మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కఫీల్ఖాన్ గత అర్ధరాత్రి మధుర జైలు నుంచి విడుదలయ్యారు.
గత సంవత్సరం డిసెంబరులో సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కఫీల్ఖాన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ జాతీయ భద్రతా చట్టం కింద ఈ ఏడాది జనవరి 29న గోరఖ్పూర్లో అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికీ ఆయనను విదుదల చేయాలనీ కోర్టు ఆదేశించినప్పటికీ జైలు అధికారులు సత్వరంగా స్పందించకపోవడంతో ఖాన్ విడుదల ఆలస్యమైంది. దీంతో స్పందించిన ఖాన్ కుటుంబ సభ్యులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని హెచ్చరించడంతో ఆగమేఘాల మీద గత అర్ధరాత్రి జైలు అధికారులు విడుదల చేశారు. నిన్న రాత్రి జైలు నుండి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన కఫీల్ ఖాన్ యూపీలోని యోగి ప్రభుత్వం తనను కొత్త కేసులలో ఇరికించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. అయన అనుమానాలకు మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే గతంలో బిఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజెన్ కొరత గురించి డాక్టర్ కఫీల్ ఖాన్ తన ఆందోళన వ్యక్తం చేయడమే.