డ్రగ్స్ కోణంలో రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ... బలమైన ఆధారాలతోనే అంటున్న బీహార్ డీజీపీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి వెనుక డ్రగ్స్ మాఫియా ఉందన్న కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.    దీనిపై తాజాగా బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియాకు వ్యతిరేకంగా చాలా బలమైన ఆధారాలే సంపాదించినట్టుందని అయన అభిప్రాయపడ్డారు. "రియా నుంచి ఎన్సీబీ అధికారులు బహుశా డ్రగ్స్ కు సంబంధించి పూర్తి సమాచారం రాబట్టి ఉంటారని.. అంతేకాకుండా ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో గల సంబంధాలు కూడా కచ్చితంగా వెల్లడై ఉంటాయి. అందుకే ఈ కేసులో డ్రగ్స్ కోణంలో రియా పాత్ర స్పష్టం కావడంతో ఆమెను అరెస్ట్ చేసి ఉంటారు" అని పాండే అభిప్రాయపడ్డారు.

మాకు అధికారం ఇస్తే రాజధాని అక్కడే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ 

ఏపీ రాజధానిపై ఇప్పటివరకు ప్రజలను పెద్ద కన్ఫ్యూషన్ లో ఉంచిన ఏపీ బీజేపీ ఫైనల్ గా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశం పై స్పందిస్తూ ప్రజలు మాకు అధికారం ఇస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని... అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ లు పోను మిగిలిన 9000 ఎకరాలలో రాజధానిని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేసారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయం పై ఎవరికీ తోచినట్లుగా వారు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజధాని విషయంలో ఏపీలోని బీజేపీ నాయకులు ఒక మాట చెప్పగానే ఢిల్లీ నుండి జివిఎల్ వంటి వారు దానిని ఖండించడం మనం చూసాం. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతోనైనా ఈ దాగుడుమూతలకు తెర పడుతుందేమో చూడాలి.

సో'న‌యా' మార్గ్?!

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అంత‌ర్ముఖంగా ఏమి ఆలోచిస్తున్నారు? అంత‌ర్గ‌తంగా ఏమి చేస్తున్నారు? పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగి రెండు వారాలైంది. నివురు గ‌ప్పిన నిప్పు బైట‌ప‌డింద‌నుకున్నారు. అది మంచికే జ‌రిగింద‌ని కొంద‌రు సంతోషించారు. కాదు..అది విఘాత‌మ‌ని మ‌రికొంద‌రు మ‌థ‌న‌ప‌డ్డారు. పార్టీలోనే నాయ‌క‌త్వశ్రేణిలో అయోమ‌యం. ఇక కేడ‌ర్ సంగ‌తి చెప్పేదేముంది! మొత్తంమీద నాయ‌క‌త్వలోప‌మే ఇంత దూరం తెచ్చింద‌ని సోనియ‌గాంధీ గ్ర‌హించారు. గారాల కొడుకు రాజ‌కీయంగా ఇంకా ఎదిగిరాలేద‌నే ఆమె అనుకుంటున్నారు. అందుకే ఆ బిడ్డ‌డికి మ‌రికొంత స‌మ‌యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆలోగా తాను క్రియాశీలం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుక‌నుగుణంగానే వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం సాగింది. రెండు రోజుల్లో ఆమె మోడీ స‌ర్కారు మీద వ్యూహాత్మ‌క యుద్దం మొద‌లెట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ఇచ్చిన జ‌వ‌స‌త్వాల‌తో ఆమె రంగంలోకి దిగారు. యుద్ధానికి ఆయుధాలు కావాలి. మోడీ ప్ర‌భుత్వం నుంచి ఆయుధాలు దొర‌క‌టం క‌ష్ట‌మేమీ కాదు. కాని అవ‌న్నీ ఇప్ప‌టికే రాహుల్‌గాంధీ ఉప‌యోగించేశారు. అలా దొరికిన‌వ‌న్నీ వాడేసి చివ‌రికి అస్త్ర స‌న్యాసం చేసి కూచున్నారు. ఆ సంగ‌తి సోనియాగాంధీకి తెలుసు. అందుకే తాజా అస్త్రం ప‌ట్టుకున్నారు. నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న ఒక‌చిన్న ఆయుధం ప‌ట్టుకుని రంగంలోకి దూకారు.   ఏడుగురు ప్ర‌తిప‌క్ష ముఖ్య‌మంత్రుల‌తో అర్జంటుగా వీడియో కాన్ఫ‌రెన్సులో యుద్ద వ్యూహాన్ని వివ‌రించారు. ఆ యుద్దంలోని ఔచిత్యాన్ని ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌లేదు. దిగ‌క‌దిగ‌క పెద్ద‌మ్మ చాలా కాలం త‌ర్వాత రంగంలోకి దిగిన‌ప్పుడు ఆమెకి సంఘీభావం ప్ర‌క‌టించ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌కూడ‌ద‌ని వారూ ముందే తీర్మానించుకున్నారు. ఎందుకంటే ఆమె తీసుకున్న కార్య‌క్ర‌మం అలాంటిది. ప‌స ఉందా లేదా అన్న‌ది కాదు. అది అంత బ‌ల‌మైందా కాదా అన్న‌ది ఆమె ఆలోచించ‌లేదు. ఆమాట‌కొస్తే అది ఆమె ఆలోచ‌న కూడా కాదు. అందుకే అందులోని హేతుక‌త గురించి ఆమె ఆలోచించే అవ‌కాశం లేదు. నీట్, జేఈఈ ప‌రీక్ష‌లు ఆశావ‌హ యువ‌తకు ఎంత ప్ర‌ధాన‌మైన‌దో ఆక్ష‌ణంలో వారెవ్వ‌రూ ఆమెకు సూచించ‌లేదు. క‌రోనా మాత్ర‌మే గుర్తుంది కాని, క‌రోనాతోపాటు యావ‌త్ ప్ర‌పంచం స‌హ‌జీవ‌నం చేస్తూ ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో ముందుకు సాగుతున్న ఈ ద‌శ‌లో అంత‌టి జాతీయ ప‌రీక్ష‌ల‌ను జ‌ర‌పొద్ద‌ని కేంద్రాన్ని డిమాండు చేసే అంశానికి దేశ‌వ్యాప్తంగా పెద్ద‌గా మ‌ద్ద‌తు రాలేదు. ఇక్క‌డ మ‌ద్ద‌తు అంటే ఆ ప‌రీక్ష‌ల‌తో సంబంధం లేని ఏ ఇత‌ర వ‌ర్గాల మ‌ద్ద‌తు అని కాదు. ప‌రీక్ష‌ల‌తో నేరుగా జీవితాలే ముడిప‌డి ఉన్న విద్యార్ధులు, వారి త‌ల్లిదండ్రులే ఇక్క‌డ ప్రామాణికం. ముఖ్య‌మంత్రులు భేష్ భేష్ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ ముందుగానే యుద్ద‌రంగంలో కాలు మోపారు. ఆమెకి ఈమె నైతిక స్ధ‌యిర్యాన్నిస్తే ఈమెకి ఆమె పెద్ద గొంతుకై నిలిచారు. మొత్తంమీద ఒక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించారు. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. న్యాయ‌ప‌రమైన పోరాటానికి జ‌న‌సంఘీభావం, దానికితోడు విశ్వ‌స‌నీయ‌త వ‌స్తుంద‌నుకున్నారు. కాని ఈ అంశంమీద సుప్రీంకోర్టు అభిమ‌తం వేరుగా ఉంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయారు. మ‌రోవంక రాజ‌కీయ పోరాటానికి తెర‌తీశారు. నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేశారు. దాన్ని ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఏతావాతా జ‌రిగిందేమిటంటే నీట్, జేఈఈ పోరాటం విద్యార్ధుల చేతిలోనుంచి రాజ‌కీయ పార్టీల చేతుల్లోకి వెళ్లి అది రాజ‌కీయాంశంగా మారిపోయింది. ఎప్పుడైతే రాజ‌కీయ రంగు పులుముకుందో దాని తీవ్ర‌త త‌గ్గిపోయింది. ప్ర‌ధాని మోడీ ఏదైతే కోరుకున్నారో అదే జ‌రిగింది. ప్ర‌ధాని మోడీ ప‌ని సులువైంది. రాజ‌కీయ ప్ర‌త్యర్ది అయిన కాంగ్రెస్ పార్టీ ఏది కోరితే దానికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ఆరితేరిన న‌రేంద్ర మోడీ ఇక ఆ అంశం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అప్ప‌టికే నీట్, జేఈఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సోనియాగాంధీ తొలి అస్త్రం అలా నీరుగారింది. అస‌లు ఈ నీట్ ఉద్య‌మానికి కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేద‌న్న‌ది మ‌రొక వాద‌న‌. పార్టీ నాయ‌త్వ బాధ్య‌త‌లు త‌న‌కు త‌ప్ప‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా క్రియాశీల‌కంగా ఉండాల‌న్న అత్యుత్సాహంతో ఆమె కోట‌రీ స‌భ్యులు ఆమెని ఇలా రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తున్న‌ది.    డెబ్బ‌య్ మూడు సంవ‌త్స‌రాల వ‌యస్సులో ఏ బాద‌ర‌బందీ లేకుండా విశ్రాంత జీవ‌నం గ‌డ‌పాల్సిన త‌రుణంలో ఆమె త‌ప్ప‌నిస‌రై పార్టీ కాడిని భుజాన వేసుకుని ఒంట‌రి ప‌య‌నం సాగిస్తున్నారు. ఆందుకే ఆమె పోరాటంలో ప‌దును ఉండ‌టంలేదు. అలాగ‌ని ఆమె పూర్తిగా కాంగ్రెస్ పార్టీని స‌హ‌చ‌ర స‌భ్యుల‌కు వ‌దిలేయ‌డానికి సుముఖంగా లేరు. న‌యానో భ‌యానో బుజ్జ‌గించో బ‌తిమిలాడో కొడుక్కే ప‌ట్టాభిషేకం చేయాలని ఆమె గ‌ట్టిగా కోరుకుంటున్నారు. ఇది ఆమెలో వ‌చ్చిన కొత్త ఆలోచ‌న కాదు. ద‌శాబ్దం పైచిలుకుగా ఆమె ఎదురుచూస్తున్నారు. మ‌ధ్య‌లో రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. కాని ఆయ‌న ఆ ప‌గ్గాలు వ‌దిలేశారు. ఇష్టంగా కాదు. వైరాగ్యంతో. త‌న‌కు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వ‌డం లేద‌ని. సోనియాగాంధీ త‌న కుమారుణ్ణి అలా స్వేచ్ఛ‌గా వ‌దిలేయ‌డానికి సుముఖంగా లేర‌ని పార్టీలోని ఒక వ‌ర్గం నాయ‌కులే బాహాటంగా చెబుతుంటారు. సీనియ‌ర్ల‌తో సాహ‌చ‌ర్యం చేస్తూ రాహుల్ పార్టీని న‌డ‌పాల‌న్న‌ది ఆమె అభిమ‌తంగా ఉంది. అనుభ‌వం, ప‌రిప‌క్వ‌త లేని రాహుల్ గాంధీ కొన్నేళ్ల‌పాటు సీనియ‌ర్ల నీడ‌లో ఉండ‌టం అటు పార్టీకి, ఇటు త‌న‌యుడికి శ్రేయ‌స్క‌ర‌మ‌న్న‌ది ఆమె భావ‌న‌గా చెబుతున్నారు. అందుకే మొన్న వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో నాయ‌క‌త్వ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆమె తాను దిగిపోతాన‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, శాశ్వ‌త ప్రాతిప‌దిక మీద కార్యాచ‌రణ అవ‌స‌ర‌మ‌ని భావించారు. అందుకు అనుగుణంగా కొంత‌కాలం పాటు త‌న‌కు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి, ఎప్ప‌టిక‌ప్పుడు కార్య‌క్ర‌మాల‌తో పార్టీని స‌జీవంగా ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే మొన్న‌టి ఉద్య‌మం. అయితే అది వ‌ట్టిపోవ‌డంతో మ‌ళ్లీ సందిగ్దంలో ప‌డ్డారు. ప్ర‌ధాని మోడీని ఎదుర్కోవాలంటే ఎలాంటి కార్యాచ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌న్న‌దాని మీద కాంగ్రెస్ పార్టీలో స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్లు ఒక పంథాను అనుస‌రిస్తుంటే, కొత్త‌త‌రం మ‌రొక పంథాలో పోతున్న‌ది. అందుకే రాహుల్‌గాంధీ ప్ర‌తి ఒక్క అంశాన్నీ చేప‌ట్టినా అది రెండు త‌రాల రెండు వ‌ర్గాల మ‌ధ్య చీలి శ‌ల్య‌మైపోతున్న‌ది. ఈ విష‌యం సోనియాగాంధీ గ్ర‌హించినా పార్టీ స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసిన‌ట్టుంటుంద‌న్న భావ‌న‌, భ‌యంతో ఆమె మిన్న‌కుండిపోతున్న‌ట్టు ఒక వ‌ర్గం నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.   సోనియాగాంధీ కొత్త మార్గాన్ని ఎంచుకోవాల‌ని తీర్మానించుకున్న‌ప్ప‌టికీ ఆమెకి దారీతెన్నూ చూసే దిక్సూచిలాంటి స‌హాయ‌కులు లేకుండా పోయారు. ప్ర‌త్య‌ర్ధిని ఎదుర్కోవాలంటే చొర‌వ‌, సాహ‌సం ఉండాలి. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్ధిని ఎదుర్కోవాలంటే అస్త్ర‌శ‌స్త్రాలుండాలి. మోడీని ఎదుర్కోవాలంటే మ‌రో మోడీ కావాలి. మోడీలాంటి వ్యూహ‌క‌ర్త ఉండాలి. అది ఆమె గ్ర‌హిస్తే కాంగ్రెస్ కు కొత్త సార‌థి దొరికిన‌ట్టే. లేదా రాహుల్‌గాంధీని మ‌రో మోడీలా ఆమె త‌యారుచేయ‌గ‌ల‌దా? అంత‌టి శ‌క్తే ఆమెకి ఉంటే ఆమే త‌న‌కు తానుగా మ‌రో మోడీ రూపంలో క‌ద‌న‌రంగంలోకి దూక‌రా! మోడీలా వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌రా!! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

టీఎస్ అసెంబ్లీలో తీర్మాణం.. ఎంఐఎం దూరం.. అందుకేనా! 

తెలంగాణ అసెంబ్లీలో అరుదైన ఘటన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఎంఐఎం మద్దతు ఇవ్వలేదు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన ఓ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని  అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పీవీ తెలంగాణ ఠీవి  అని కొనియాడారు. దేశ ప్రతిష్టను పీవీ ఇనుమడింపజేశారని... పలు సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని చెప్పారు. మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లు భారతరత్నకు పీవీ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.    అయితే పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఎంఐఎం దూరంగా ఉంది. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. ఈఘటన వెనక పీవీ పాత్ర ఉందని ముస్లిం సంఘాల నుంచి ఆరోపణలున్నాయి. కరసేవకులను అయోధ్య రాకుండా కట్టడి చేయడంలో పీవీ సర్కార్ నిర్లక్ష్యంగా వహించందని గతంలో ఎంఐఎం కూడా ఆరోపించింది. ఈ కారణంగానే పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వలేదని అనుకుంటున్నారు. అటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కార్యక్రమాల్లోనూ ఎంఐఎం నేతలెవరు పాల్గొనడం లేదు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడాన్ని మాత్రమే ఇప్పటివరకు ఎంఐఎం వ్యతిరేకించలేదు. అయితే తీర్మానానికి దూరంగా ఉంటూ ఆయనపై తమకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఎంఐఎం.    దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా నిలిచారు పీవీ నరసింహరావు. అయన హయాంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వాటి వల్లే దేశంలో ఆర్థికంగా బలపడిందని చెబుతారు. కారణాలేవైనా పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన సొంత రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గగనతలంలో మహిళా శక్తి...!

దేశ ప్రగతిరథం ముందుకు కదలడానికి మహిళా శక్తి ఎంతో అవసరం అని నేటి పాలకులు గుర్తిస్తున్నారు. అనేక రంగాల్లో రాణిస్తున్న మహిళలకు వైమానిక దళంలోనూ ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే 1932 లో ప్రారంభమైన భారత వాయుసేనలో 1990 వరకు మహిళలకు ప్రవేశం లేదు. ఆ తర్వాతే మహిళలకు స్థానం కల్పించారు. అది కూడా చాపర్స్, రవాణాకు సంబంధించిన విమాన సర్వీసుల్లోనే మొదట ప్రవేశం కల్పించారు. 991లో మహిళలు చేరడానికి అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు వాయుసేనలో ఉన్న మహిళల సంఖ్య కేవలం13 శాతం మాత్రమే. 1999 నాటి కార్గిల్ వార్  సందర్భంగా 'గుంజన్ సక్షేనా' తో పాటు ఆమె బ్యాచ్ మేట్ 'శ్రీ విద్య రాజన్' చేతన్ హెలికాప్టర్ ద్వారా గాయపడ్డ సైనికులను తరలించడం, నిఘా ను కొనసాగించడం చేశారు. చాపర్స్ , హెలికాప్టర్ వరకే ఉన్న అనుమతిని ఆ తర్వాత ఫైటర్ జెట్ నడపడానికి కూడా ఇచ్చారు. అయితే 2015 తర్వాతనే ఫైటర్ జెట్ లో మహిళలకు ప్రవేశం కల్పించారు.   వాయుసేనలో చేరేందుకు అనేక ఆడంకులను అధిగమించి 2002లో డాక్టర్ పద్మ బందోపాధ్యాయా 'ఎయిర్ మార్షల్' ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు. కానీ పోరాటానికి ముందు వరుసలో నిలించేందుకు మాత్రం 2015 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ వైమానిక రంగానికి సంబంధించిన అన్నింటిలో మహిళ భాగస్వామ్యం ఉండాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యమైంది. మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అనేకమంది భారతీయ మహిళల స్వప్నాన్ని నిజం చేసింది. వివిధ దేశాల్లో, సమాజాల్లో, వ్యక్తుల మధ్య, ముఖ్యంగా భారతీయ వైమానిక రంగంలోకి తరతరాలుగా గుడుకట్టుకున్న లింగవివక్షను రూపుమారింది. 2018 లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ 'అవని చరుద్వేది' ఒంటరిగా మిగ్ -21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అవని చతుర్వేది  తన అనుభవాలను పంచుకుంటూ 'ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక మిషన్, దాన్ని ఆపరేట్ చేస్తున్నది ఆడనా మగనా అనేది దానికి తెలియదు. అది ఇద్దరి విషయంలో ఒకేలా నడుచుకుంటుంది. కాబట్టి ఆడ అయినా, మగ అయినా సమర్థవంతంగా నడపగలిగితే చాలు' అంటూ తోటి సహచరులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఇచ్చిన స్పూర్తితో భవన్ కాంత్, మోహనా సింగ్ వంటి మిగతా మహిళలు కూడా సమర్థవంతంగా వాయు సేనలో చేరి తమ సత్తా చాటారు.   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి మహిళా పైలట్ భవన్ కాంత్ . 2019 లో కంబాట్ మిషన్ ను సమర్థవంతంగా ఫైటర్ జెట్ నడిపి మహిళల శక్తిసామర్ధ్యాలను విశ్వవ్యాపితం చేశారు. ఇక మోహనా సింగ్ అధునాతనమైన 'హావాక్'  ఫైటర్ జెట్ ను నడిపి భారతదేశ చరిత్రలో తన పేరును పదిల పరుచుకున్నారు. వీరి ప్రతిభ, శక్తి సామర్ధ్యాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం (2020) రాష్టప్రతి రాంనాధ్ కొంవింద్ చేతుల మీదుగా నారిశక్తి పురస్కారంతో గౌరవించింది. వీరి స్ఫూర్తితో ఎంతో మంది యువతులు భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. 

అసెంబ్లీలో ఆమోదించనున్న బిల్లులు

క్యాబినేట్ లో నిర్ణయం   ఈనెల 9న సభ ముందుకు రెవెన్యూ కొత్త చట్టం   కొత్త చట్టం వచ్చేవరకు నో రిజిష్ట్రేషన్స్   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భారీ సంష్కరణలకు శ్రీకారం చుట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకురావాలని ముందుగానే అనుకున్నప్పటికీ జాతీయ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రి కె. చంధ్రశేఖర్ రావు కొత్త చట్టాల గురించి, వచ్చే మార్పుల గురించి కూలంకషంగా ఆలోచించి ముసాయిదాలుగా వాటికి సభ ముందుకు తీసుకువస్తున్నారు.  కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈనెల 9న అసెంబ్లీలో ప్రవేశపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చేవరకు రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు సెలవులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే  వివిధ శాఖలకు సంబంధించిన ఆర్టినెన్స్ లను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. - ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 - ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 - తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు - పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లు - తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లు - తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020 - ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 - ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002 - ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ - టిఎస్ బిపాస్ బిల్ - తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లు - ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లు   ఈ ఆర్డినెన్స్ ల తో పాటు క్యాబినెట్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు, కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా  17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయించిన ఆర్డినెన్స్ లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ అనుమతితో వాటిని అమలు చేస్తారు.

భారత అక్షరాస్యత రేటు 77.7శాతం

96.2శాతంతో మొదటిస్థానంలో కేరళ   66.4శాతంతో ఆఖరి స్థానంలో ఆంధ్రప్రదేశ్   తెలంగాణలో 72.8శాతం   భారతదేశంలో అక్షరాస్యత రేటుపై జరిగిన సర్వే ఫలితాలను నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసింది. ‘హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ ‘జాతీయ నమూనా సర్వే’ నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో నిర్వహించిన  సర్వే ఆధారంగా ఒక నివేదిక తయారుచేశారు. 2017 జూలై నుంచి 2018 జూన్‌ వరకు దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణ ప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు వెల్లడైంది. ఇక అక్షరాస్యత వివరాలకు వస్తే దేశంలో అక్షరాస్యత రేటు 77.7శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతం, పట్టణప్రాంతాల్లో 87.7శాతంగా ఉంది.   రాష్ట్రాల వారీగా అక్షరాస్యత రేటును పరిశీలిస్తే గతంలో మాదిరిగానే కేరళ 96.2శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. 88.7 శాతం అక్షరాస్యతతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌ (87.6శాతం), హిమాచల్‌ప్రదేశ్‌(86.6శాతం), అసోం (85.9శాతం) ఉన్నాయి. ఇక అడ్డడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ 66.4శాతం ఉండగా, రాజస్థాన్ 69.7 శాతం, బీహార్ 70.9 శాతం, తెలంగాణ 72.8 శాతం, యుపి 73 శాతం, మధ్యప్రదేశ్ 73.7 శాతం అక్షరాస్యత రేటు కలిగి ఉన్నాయి.   ఇక స్త్రీ, పురుషుల్లో గమనిస్తే దేశవ్యాప్తంగా పురుషుల్లో 84.7శాతం, మహిళల్లో 70.3శాతంగా అక్షరాస్యత రేటు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల అక్షరాస్యత రేటు  పురుషుల అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉందని సర్వేలో తేలింది. కేరళలో పురుషుల అక్షరాస్యత 97.4 శాతం, మహిళల్లో 95.2 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం, మహిళల్లో 59.5 శాతం .   స్వాతంత్య్ర భారతవని వయసు 75ఏండ్లు. దానికి కొంచెం ఎక్కువ గా మన దేశ అక్షరాస్యత. ప్రజలను ఓటర్లుగా మాత్రమే గుర్తించే పాలకుల స్వార్థం కారణంగా అక్షరాలు రాని వారి శాతం 22.3గా ఉంది. కేజీ టూ పీజీలు, బేటీ బచావో పథకాలు ఏవీ కూడా అక్షరాస్యతను పెంచలేకపోయాయి. వందేళ్ల సంబురాల నాటికైనా నూరుశాతం అక్షరాస్యత సాధించగలుగుతామా..! సందేహమే...!

కంగనా ముంబైలోకి ఎంటరైతే జరిగేది ఇదే..! 

మహారాష్ట్రలోని శివసేన సర్కార్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ ఇప్పటికే అక్కడి అధికార శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో కంగనా సెప్టెంబర్ 9 న ముంబై చేరుకుంటానని స్వయంగా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఇదే సందర్భంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ ను కూడా కంగనా సవాలు చేసింది. దీంతో ఆమె ముంబై చేరుకుంటే ఎం జరుగుతుందోనని జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె ముంబై చేరుకున్న తరువాత ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు క్వారంటైన్ పేరుతో నిర్బంధించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం, ముంబై చేరుకున్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు నిర్బంధించడానికి బిఎంసి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.   ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ రూల్స్ ప్రకారం, ఎయిర్ లైన్స్ ద్వారా ముంబైలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారిని తప్పకుండా క్వారంటైన్ లో ఉంచాలి. ఇప్పటికే సుశాంత్ కేసు దర్యాప్తుకు వచ్చిన బీహార్ ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని కూడా బిఎంసి ఇలాగే నిర్బంధించింది. ఇక కోవిడ్ ప్రోటోకాల్ కింద ముంబైకి వచ్చే వ్యక్తి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి.

ఎంత పని చేశాడు.. పాపం లోకేష్.. పంచాయ‌తీరాజ్‌ శాఖ అధికారుల ఆసక్తికర చర్చ!!

తాము ఏం చేయకపోయినా ఏదో చేశామని మాయమాటలు చెప్పి జిందాబాద్ లు కొట్టించుకునే నాయకులు కొందరు.. తాము ఎంతో చేసినా దానిని చెప్పుకోలేక మాటలు తడబడి నవ్వులపాలయ్యే నాయకులు మరికొందరు. ఆ రెండో కోవకి వచ్చే నాయకుడే నారా లోకేష్. ఆయన దొడ్డిదారిన మంత్రి అయ్యారని విమర్శలు, ఆయన మాట తడబడుతుందని జోకులు వినిపిస్తాయి కానీ.. ఆయన తనకి అప్పగించిన బాధ్యతకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని, ఆయన పనితీరుకు ఆయన పనిచేసిన శాఖలకు వచ్చిన ఎన్నో అవార్డులే నిదర్శనం అని చాలా తక్కువమందికి తెలుసు. కారణం, ఆయన ఎంతో చేసినా.. ఆ చేసిన దానిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రత్యర్థులు కూడా ఆయన పనిని కాకుండా, ఆయన మాట తీరుని టార్గెట్ చేస్తూ.. ఆయనని నవ్వులపాలు చేశారు. అయితే, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా.. ఇప్పుడు లోకేష్ పనితీరు గురించి చర్చలు మొదలయ్యాయి.   ఇటీవల ఏపీ సచివాలయం క్యాంటీన్ లో జరిగిన ఒక చర్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పంచాయతీ రాజ్ శాఖలో దళిత ఉద్యోగుల‌ మధ్య జ‌రిగిన సంభాషణ.. అక్క‌డే వున్న ఒక జ‌ర్న‌లిస్టు ఆస‌క్తిగా విన్నాడు. వారు ఏం మాట్లాడుకున్నారంటే!.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ పనిచేసేప్పుడు అనేక నూతన కార్యక్రమాలు చేప‌ట్టాడు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీసీ రోడ్లు, మరుగు దొడ్ల నిర్మాణం, ఎల్ఈడి బల్బులు, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్టీఆర్ సుజల, ఉపాధి హామీ పథకం ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఆ సందర్భంగా జరిగే ప్రతీ రివ్యూ మీటింగ్ లో లోకేష్ ఒక విషయం మాత్రం తరచూ గుర్తు చేసేవారట. ఎల్ఈడి బల్బులు బిగించే కార్యక్రమం 'చంద్రకాంతి'. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రతీ గ్రామంలో ఎస్సీ కాలనీ నుండే 'చంద్రకాంతి' కార్యక్రమం ప్రారంభం కావాలని అధికారులకు గట్టిగా సూచన చేసారట. ఇదే కాదు ఏ ప‌థ‌కమైనా ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌కి తొలి ప్రాధాన్యం ఇవ్వ‌మ‌ని ఆదేశించేవార‌ట‌. ప్ర‌తీ ప‌థ‌కం లాంచింగ్‌కీ ఇదే నిబంధ‌న లోకేష్ చెబుతుండ‌డం..అధికారులు పాటించ‌డం అల‌వాటుగా మారిపోయింది. అయితే, అప్పుడు రివ్యూ మీటింగ్ ల‌లో వున్న అధికారులు.. ఇదేదో ద‌ళితుల్ని దువ్వి ఓట్లు వేయించుకునే ప్లానింగ్ అనుకునేవార‌ట‌. ఒకసారి ఓ ఉన్న‌తాధికారి అక్క‌డి నుంచే ఎందుకు అని రివ్యూ మీటింగ్‌లో అడిగితే...ప్ర‌తీ గ్రామంలోనూ ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌లో ఆల‌స్యంగా ప‌నులు ప్రారంభించ‌డం, స‌కాలంలో పూర్తి చేయ‌క‌పోవ‌డం, నాణ్య‌త లేక‌పోవ‌డం, వారు కూడా ఎవ‌రినీ నిలదీయ‌క‌పోవ‌డంతో.. అభివృద్ధికి దూరం అవుతున్నార‌ని.. అందుకే అభివృద్ధి ప‌నులేమైనా ముందుగా అక్క‌డ నుంచి ప్రారంభించి.. విజ‌య‌వంతంగా పూర్తిచేశాకే మిగిలిన చోట్ల మొద‌లుపెట్టాల‌నేది త‌న ఆలోచ‌న అని చెప్పారట. అలాగే కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రోగ్రెస్ మీద జరిగే రివ్యూ మీటింగుల్లో కూడా ఎస్సీ కాలనీల్లో పని ఎంత వరకూ వచ్చింది అని అడిగి మరీ తెలుసుకునేవారట. ఒక వేళ పొరపాటున ఏ అధికారి అయినా కొన్ని సమస్యల వలన ఇతర కాలనీల్లో పనులు ప్రారంభించాం అంటే అధికారులకు క్లాస్ పీకేవారట. నేను ఎస్సీ కాలనీల్లో ప్రారంభించమంటే మీరు ఇతర ప్రాంతాల్లో ఎందుకు మొదలుపెట్టారు అని సీరియస్ గా మందలించేవారట.    ఇలా గ‌త‌ ప్రభుత్వంలో పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రిగా లోకేష్ పనితీరుని, దళితులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేసుకున్న దళిత ఉద్యోగులు.. ఇప్పటి ప్రభుత్వ పనితీరుని కూడా పోల్చుతూ చర్చించుకున్నారు. అప్పుడు ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌కి తొలి ప్రాధాన్యం అని లోకేష్ చెబితే అధికారులం అంతా ఆశ్చ‌ర్య‌పోయేవార‌మ‌ని.. ఇప్పుడు వ‌చ్చిన ప్ర‌భుత్వంలో అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు, దాడులు, శిరోముండనం, భూములు లాక్కోవడం, మానభంగాలు, ఇల్లు తగలబెట్టడం లాంటి ఘటనలు ఎస్సీ కాలనీల నుంచే ప్రారంభమవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దళితులు అండగా నిలిచి అధికారంలోకి తెచ్చుకున్న జగన్ గారు ఉంటే అభివృద్ధి అంతా ఎస్సీ కాలనీలకే దక్కుతుంది అనుకుంటే.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయ్యింద‌ని, పోలీస్ స్టేషన్ లోనే ద‌ళితుల్ని కొట్టి చంపడం, శిరోముండనం చెయ్యడం, మానభంగాలు ఇలా రోజుకో ఘటనతో దళితుల‌పై దాడులు చేసేందుకే ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌న్నంత ఘోరంగా పాల‌న వుంద‌ని అధికారులు చ‌ర్చించుకున్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఎస్సీ కాల‌నీల నుంచి మొద‌ల‌వ్వాల‌ని ప‌నిచేసిన మంత్రి నారా లోకేష్ ఓడిపోయి.. అరాచ‌కం ఏదైనా ఎస్సీ కాల‌నీల నుంచే మొద‌లు పెడుతున్న జ‌గ‌న్ ‌రెడ్డి ప్ర‌భుత్వం రావ‌డం ద‌ళితుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూనే.. పాపం, మంచి చేసిన లోకేష్ ఓడిపోయారంటూ అధికారులు సానుభూతి వ్య‌క్తం చేయ‌డం రికార్డు చేసిన జ‌ర్న‌లిస్టు.. ఒక ఆర్టిక‌ల్‌గా రాసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. దీంతో లోకేష్ పనితీరుపై చర్చ మొదలైంది. లోకేష్ మాటల మనిషి కాదని, చేతల మనిషని.. ఆయన చేసిన మంచిపనులేంటో, ఆయనేంటో ఎప్పటికైనా ప్రజలందరికి తెలిసొస్తుందని టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

అయోధ్యలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం

పునాదుల తవ్వకాల చేప్పట్టిన ఎల్ అండ్ టీ   అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ జన్మభూమి వీలైనంత త్వరగా మందిరం పూర్తి చేయాలన్న సంకల్పంతో అయోధ్య ట్రస్ట్ శరవేగంగా పనులు చేస్తోంది. ఆలయనిర్మాణంలో మొదటిభాగంగా పునాదులు తవ్వుతున్నారు. భూమిలో వంద అడుగల మేరకు పునాదులు తవ్వేందుకు భారీ యంత్రాలను సిద్ధం చేశారు. నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఇంజినీర్లు పనులు చేపట్టారు. కాగా, ఈ పునాదులను సీబీఆర్, ఐఐటీ చెన్నై నిపుణులు డిజైన్ చేశారు.  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మందిర నిర్మాణ సమితి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.   ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే నాటికే మందిర డిజైన్ మొత్తం పూర్తి అయ్యింది. ఇటీవలే రామ మందిరం లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ(ఏడీఏ)కూడా ఆమోదం తెలిపింది. మొత్తం లేఔట్ రెండు లక్షల 74వేల చదరపు మీటర్లు కాగా  ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు  అంత‌స్థుల్లో నిర్మించ‌నున్నారు.

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు.. సీఎం జగన్ తో కొడాలి నాని

కొద్దిరోజుల క్రితం మంత్రి కొడాలి నాని రాజధాని అమరావతి విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించగా.. భూములిచ్చిన రైతులు హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. 55000 మంది పేదలకు పట్టాలు ఇస్తే దానికి వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్న అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండడానికి వీల్లేదని తాజాగా మంత్రి కొడాలి నాని సీఎం జగన్ కు సూచించినట్లుగా తెలిపారు. దీని పై అన్ని పక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం జగన్ ను కోరానని నాని తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబుకు జనంలో బలం లేదని ఉన్నదే 23 మంది.. వారిలో కూడా కొంత మంది చేజారి పోయారని అన్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయనని ఎమ్మెల్యేను చేయడం ఎవరి తరము కాదని అయన సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు సీఎం జగన్ వెన్నంటి ఉండి దుష్ట శక్తులను ఎదుర్కొంటానని అయన అన్నారు.

భారత్ చైనాల మధ్య అర్థరాత్రి కాల్పుల కలకలం..

భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు తగ్గకముందే ఇంకోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఏసి వద్ద చైనా సైన్యం రెచ్చగొట్టేలా వ్యవహరించందని నిన్న లడఖ్‌లోని పాంగ్యాంగ్ సరస్సు ఒడ్డున వాస్తవ నియంత్రణ రేఖను దాటి వచ్చే ప్రయత్నంలో భారత సైనికులు కాల్పులు జరిపారంటూ చైనా ఆరోపించింది. దీనిని తిప్పికొట్టేందుకు చైనా కూడా ఎదురుదాడి చేయవలసి వచ్చిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ మొట్ట మొదటిగా కాల్పులు జరిపిందని.. ఇండియన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని చైనా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై భారత వైపు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

రాములమ్మ హ్యాండ్! జంపింగేనా..? ఆపరేషన్ కమల్ 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటికి విజయశాంతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దుబ్బాక బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. రాములమ్మ ఇమేజ్ తో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు, పోటీకి ఫైర్ బ్రాండ్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉపఎన్నికలో పోటీపై కాంగ్రెస్ కు రాములమ్మ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. పోటీ చేసే అంశంపై తెలంగాణ పీసీసీ నేతలు సంప్రదించినపుడు ఆమె నిరాసక్తత తెలిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డీనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం. విజయశాంతి నో చెప్పడంతో అభ్యర్థిత్వం కోసం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహ ఇతర పేర్లను పీసీపీ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది.    కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి విజయశాంతి నిరాకరించడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గతంలో బీజేపీలో పనిచేసిన విజయశాంతి.. మళ్లీ కమలం గూటి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమె టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె కేంద్ర సర్కార్ నిర్ణయాలను సమర్ధిస్తూ ట్వీట్లు కూడా చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక లోపే రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బండి సంజయ్ కు బాధ్యతలు ఇచ్చాకా పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరిగింది. టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా బీజేపీ జనంలోకి వెళుతోంది. కేసీఆర్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది సంజయ్ టీమ్. హైకమాండ్ డైరెక్షన్ లో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారు కమలనాధులు. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.   తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాములమ్మ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుని మహేష్ బాబు సినిమాలో కీ రోల్ పోషించారు. అయితే ఇటీవలే ఆమె రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. రాములమ్మ యాక్టివ్ కావడంతో దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని భావించారు.  ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన  ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు పెద్ద షాకే. బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చినా హస్తానికి ఇబ్బందే. అందుకే రాములమ్మను పోటీ చేయించాలని పీసీసీ నేతలు భావించారు. రాములమ్మ బీజేపీ ఓట్లు చీలుస్తుందని,.. దాంతో కాంగ్రెస్ గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో అయినా ఉంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ముందే  పసిగట్టిన బీజేపీ నేతలు.. రాములమ్మను తమ వైపు లాగేశారనే ప్రచారం జరుగుతోంది. విజయశాంతిని రాజ్యసభకు పంపాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి రాములమ్మ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.

భారత్ లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ త్వరలో..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు రష్యా మొట్టమొదటి వ్యాక్సిన్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాక్సిన్ పై ప్రపంచదేశాలు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా రష్యా ఈ వ్యాక్సిన్ కరోనాను ఎంత ప్రభావవంతంగా ఎదుర్కుంటుందో, అలాగే దీని భద్రత వంటి విషయాలకు సంబంధించిన పూర్తీ డేటాను ఈరోజు భారత్ కు అందించింది.    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ భారత్ లో ఈనెలలోనే ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి రష్యా డైరక్ట్ ఫండ్స్ హెడ్ కిరిల్ డిమిట్రి ఒక ప్రకటన చేస్తూ సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్ తో పాటు భారత్, బ్రెజిల్ లో త్వరలో స్పుత్నిక్-v వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని ప్రకటించారు.    వ్యాక్సిన్ కు సంబంధించిన ముఖ్యమైన డేటాను రష్యా ఈరోజు భారత్ కు అందించిన నేపథ్యంలో భారత్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ కు అడ్డు తొలగిపోయినట్లే. అయితే ఈ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు మాత్రం అక్టోబర్ నవంబర్ మధ్యలో వెల్లడి కావచ్చని తెలుస్తోంది.

కేసీఆర్ కొత్త పార్టీ.. మరో వ్యూహానికి తెర లేపారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి అరగేంట్రం చేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రజల స్పందన ఎలా వున్నా,  ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు ఇద్దరు ఇది కేవలం కేసీఆర్ మరో గేమ్ ప్లాన్ గానే చూస్తున్నారు.    రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉందని, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిపై మాట్లాడకుండా ఉండడానికే కేసీఆర్ మరో వ్యూహానికి తెర లేపారని కాంగ్రెస్ నాయకులంటుంటే, ప్రస్తుతం రెవెన్యూ చట్టానికి సవరణలు చేస్తూ, రాష్ట్రంలో వీఆర్వో  వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రజల మరియు రాజకీయ నాయకుల ద్రుష్టి దీన్ని నుండి మరలించడానికే కొత్త వ్యూహానికి తెరలేపారని బీజేపీ నాయకులు   భావిస్తున్నారు.    కేసీఆర్ నయా భరత్ పేరుతో కొత్త పార్టీ స్థాపించబోతున్నారని, ఇప్పటికే బెంగాల్ ముఖ్య మంత్రి మమాత బెనర్జీ, హిమాచల్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ లాంటి నాయకులతో చర్చలు కూడా జరిపారని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక నేడు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై  కొంతమంది ప్రముఖ నాయకుల స్పందన కోసం ప్రయత్నించినప్పుడు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు  దీన్ని పూర్తిగా కొట్టివేయగా, మరి కొందరు వేరే పార్టీల నాయకులైతే కేటీఆర్ ను ముఖ్య మంత్రి స్థానంలో కూర్చొబెట్టడానికె ఇంత సీన్ క్రియేట్ చేసారని అంటున్నారు.    కేటీఆర్ ను ముఖ్య మంత్రిని చెయ్యాలంటే తాను ఏదోఒక ప్లాట్ఫారం చూసుకోవాలని, తాను ఇక్కడేవుండి కొడుకును పీఠం మీద కూర్చోబెడితే  ప్రజలకు కొన్ని తప్పుడు సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉందని భావించి, ఈ కొత్త ప్రతిపాదనను అలోచించి ఉంటారనేది వారి వాదన. ఇంకొంతమంది నాయకులు, బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు భావన కల్పించాలనే ఆలోచన కెసిఆర్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.    కనీసం, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా, వెళ్లకున్న, బీజేపీ అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉంటుందని, ఆవసరమైతే తనను కొంత మేరకు సంతృప్తి పరిచే విధంగా కూడా ఆ పార్టీ ఆలోచించ వచ్చని, అందువల్లనే ఈ ప్రతిపాదనను తెరమీదకు కేసీఆర్ తెచ్చారని ఈ నాయకులు అభిప్రాయపడుతున్నారు.    తెరాస కు కొంత వరకు దగ్గరగా వుండే నాయకులైతేమాత్రం, కెసిఆర్ కొత్త ప్రతిపాదనను సమర్దిస్తున్నారు. అంతే కాకుండా ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. 2018 ఎన్నికల్లోనే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫై ఆలోచించారని, అయితే అప్పుడు కొందరు ఇతర రాష్ట్ర నాయకులు ఈ విషయంపై చంద్రబాబు ను సంప్రదిచారని, ఆయన దీనిని అంతగా సమర్ధించలేదని, దాంతో వారుకూడా వెనక్కు తగ్గారని, అంటున్నారు. అంతే కాకుండా, 2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంతో, ఫెడరల్ ఫ్రంట్ విషయం మరుగున పడి పోయిందని కూడా వీరంటున్నారు,   ఇప్పుడు ఇది సరైన సమయమని, కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వీరు నమ్ముతున్నారు. ఒకవేళ, కేసీఆర్ కు ఎప్పటికి తమ మద్దతు ఉంటుందని, కేటీఆర్ కు కూడా ముఖ్యమంత్రి అవడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని, కూడా వారు నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికి, కేసీఆర్ జాతీయ రాజకీయ అరగేంట్రం ఫై అతి త్వరలో ఒక స్పష్టత వస్తుందో, రాదో వేచి చూడ వలసిందే.  

ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 8,368 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,06,493కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 70 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,487 కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,187 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 41.66 లక్షల కరోనా టెస్టులు చేశారు.

మీరు దావూద్ ఇబ్రహీంకు కూడా సెక్యూరిటీ ఇస్తారు.. కేంద్రంపై శివసేన ఫైర్

సుశాంత్ సింగ్ రాజపుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. సాక్షాత్తు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్నిఎద్దేవా చేశారు. ఒకవేళ అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కనుక మాట్లాడితే... రేపే దావుద్ కు కూడా కేంద్రం రక్షణ కల్పిస్తుందని అయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కేంద్రం ఏమైనా చేస్తుందని అయన మండిపడ్డారు. ఒకపక్క ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ కు పట్టవని ప్రతాప్ సర్నాయక్ విమర్శించారు. అదే సమయంలో ముంబై పోలీసులను నమ్మని వ్యక్తులకు మాత్రం కేంద్రం భద్రత కల్పిస్తుందని అయన అన్నారు. మంబైని పీఓకేతో పోల్చిన కంగనా పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వీఆర్వో వ్యవస్థ కు రాంరాం

కొత్త రెవెన్యూ యాక్ట్  ల్యాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు   అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం   శతాబ్దాల నాడు రూపొందించిన రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలని గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రెవెన్యూ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో అప్పటి సీఎం చంద్రబాబు 1999లో ఆంధ్రప్రదేశ్‌‌ భూమి రెవెన్యూ కోడ్‌‌–1999 పేరుతో కొత్త నిబంధనలను ఫ్రేం చేశారు. అందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే ఈ కోడ్ లో ఉన్న విషయాలపై కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో అట్టకెక్కింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సమాయత్తం అయ్యింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రెవెన్యూ చట్టంగా తీసుకువస్తూ ‘ల్యాండ్  మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ’గా పేరు మార్చారు. రెవెన్యూ శాఖలో మార్పుపై, పేరుకుపోతున్న అవినీతిపై కొన్నాళ్లుగా  తరుచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు.   నిజాం కాలం నుంచి.. నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని భూచట్టాలకు 113 ఏండ్ల చరిత్ర ఉంది. అప్పటి పాలకులు  1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని భూచట్టాలకు ఇదే కేంద్రబింధువుగా ఉంది. భూ పరిపాలనకు సంబంధించింనంత వరకు ఇదే సమగ్ర రెవెన్యూ చట్టం. ఆ తర్వాత ఎన్నో మార్పులుచేర్పులతో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది. ఇందులో భూపరిపాలన, భూసేకరణ, కౌలుదారులు, రైతుల  హక్కులు ఇలా అనేక అంశాలుగా విడిపోయి కొత్తకొత్త చట్టాలు పుట్టుకువచ్చాయి. నియమ నిబంధనలు మారాయి. ఇందులోని అనేక సెక్షన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, అవినీతికి ఆస్కరం కల్పిస్తున్నాయని అనేక సార్లు ముఖ్యమంత్రి అన్నారు. వీటన్నింటిని కలిపి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలన్న కసరత్తు గత కొద్దినెలలుగా జరుగుతోంది. ఈ కొత్త చట్టానికి ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గా పేరు పెట్టారని తెలిసింది. రెవెన్యూ శాఖలో ఇప్పటివరకు ఉన్న వీఆర్వోల వ్యవస్థ రద్దు కావడంతో పాటు వారిని వివిధ శాఖల్లో భర్తీ చేస్తారని వినికిడి.  భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం మొదలైన అనేక సంస్కరణలు తీసుకురానున్నారు.

మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా.. ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయాలు. ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది జగన్ సర్కార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నామని గొప్పగా ప్రకటించుకుంది. దశల వారీగా షాపులను కూడా తగ్గిస్తూ.. పూర్తి మద్యపాన నిషేదం దిశగా వెళతామని సీఎం జగన్ తో పాటు మంత్రులు చెప్పారు. అయితే సిన్ రివర్స్ కావడంతో మద్యం ధరలను తగ్గించింది జగన్ సర్కార్. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. మద్యం తాగేవారిని తగ్గించేందుకు ధరలు పెంచామని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెందుకు పెంచిందనే ప్రశ్న వస్తోంది. దశల వారీగా మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా... ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని పలువురు నిలదీస్తున్నారు.    లిక్కర్ ధరలు పెంచుతూ జగన్ సర్కార్ తీసుకున్న తొందర పాటు నిర్ణయంతో కొత్త సమస్యలు వచ్చాయి. ధరలు పెరగడం మందుబాబులకు ప్రాణాలమీదకు వచ్చింది. మత్తుకు బానిసలుగా మారిన కొందరు.. ఎక్కువ ధర లిక్కర్ కొనలేక.. శానిటైజర్ కు అలవాటుపడ్డారు. మత్తుగా ఉండటంతో దాన్నే లిక్కర్ గా ఊహించుకుని తాగారు. శానిటైజర్ మోతాదు మించడంతో పలు జిల్లాలో మరణాలు సంభవించాయి. ప్రకాశం జిల్లా కురిచేడులోనే 13 మంది ప్రాణాలు కోల్ఫోయారు. తిరుపతిలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు శానిటైజర్ తాగి చనిపోయారు. అన్ని జిల్లాల్లోనూ శానిటైజర్ తాగే వారున్నారనే సమాచారంతో .. ఆలస్యంగా మేల్కొన్న జగన్ సర్కార్ ఎస్ఈబీని విచారణకు ఆదేశించింది. ధరలు ఎక్కువగా ఉండటం వల్లే  శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది.    2019 అక్టోబర్ లో తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోనే లిక్కర్ ధరలు పెంచింది జగన్ సర్కార్. కరోనా ప్రభావంతో మార్చి చివరలో మద్యం దుకాణాలు బందయ్యాయి. అన్ లాక్ లో షాపులు తెరవగా మందు కోసం జనాలు పోటెత్తారు. ఏ షాపు దగ్గర చూసినా కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించాయి. దీంతో తాగేవారి సంఖ్యను తగ్గించాలనే సాకుతో మద్యం ధరలను మరో 75 శాతం పెంచింది ఏపీ సర్కార్. మద్యం ధరలు పెరగడంతో సామాన్యులు, పేదలు కొనలేకపోయారు. అదే సమయంలో మత్తును మరిచిపోలేక శానిటైజర్లకు అలవాటు పడ్డారు. ఇంకొందరు నాటుసారా తాగారు. చీప్‌ లిక్కర్‌ ధర పెరిగేకొద్దీ నాటుసారా సాధారణంగానే పెరుగుతూ ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలున్నాయి. అయినా ఆ సంగతి ఊహించకుండా... వరుసగా  షాక్‌ కొట్టేలా ధరలు ఎందుకు పెంచారనే ప్రశ్న వినిపిస్తోంది.      జరగాల్సిన నష్టం జరిగాకా మేల్కొన్న జగన్ సర్కార్.. పేదలు తాగే చీప్‌ లిక్కర్‌ ధరలను తగ్గించింది. మీడియం, ప్రీమియం మద్యం ధరలను మాత్రం భారీగా పెంచింది. అత్యంత చీప్‌ అయిన రెండు కేటగిరీల మద్యం ధరలను  తగ్గించింది. కనిష్ఠంగా 90 ఎంఎల్‌కు రూ.10 తగ్గింది. అదే... క్వార్టర్‌ రూ.600పైన ధర ఉన్న రకం మద్యంపై 90 ఎంఎల్‌పై రూ.140 పెంచారు. క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరల్లో మార్పు చేయలేదు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌పై రూ.30 తగ్గించారు.     రాష్ట్రంలో ఇప్పటికే 30కిపైగా కొత్త బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. అత్యంత చీప్‌ నుంచి బాగా ఖరీదైన మద్యం వరకు అన్నీ కొత్త బ్రాండ్లే. ఎప్పటినుంచో ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్ల స్థానాన్ని ఇవి ఆక్రమించేశాయి. వచ్చిందే తడవుగా ఎక్సైజ్‌శాఖ కూడా కొత్త బ్రాండ్లకు చకచకా అనుమతులు ఇచ్చేసింది. వీటి వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. తాజాగా మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను బాగా పెంచి... జేబులు నింపుకొనే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. చీప్‌ లిక్కర్‌ ధర తగ్గి సేల్స్‌ పెరిగినా, ఆపై రకం మద్యం ధరలు పెరిగినా... సొమ్ములన్నీ సొంత పార్టీ నేతలకే వెళ్లేలా స్కెచ్ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి.    ధరలు తగ్గించిన తర్వాత కూడా రాష్ట్రంలో చీప్ లిక్కర్ ‌ ధర పొరుగు రాష్ట్రాలతో పోల్చితే 30 నుంచి 40 శాతం అధికంగానే ఉంది. ఇక రాష్ట్రంలో దొరికేదంత కొత్త, నాసిరకం మద్యమే. మీడియం, ప్రీమియం కేటగిరీలో పాపులర్‌ బ్రాండ్లు రాష్ట్రంలో దొరకడం లేదు. దీంతో వాటినీ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడ్డదారిలో లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో కొందరు దళారి వ్యాపారులు.. అక్రమంగా భారీగా మద్యం బాటిళ్ల ను ఏపీకి తరలిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ నాటినుంచి కోట్లాది రూపాయల మద్యాన్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ప్రీమియం బాండ్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఈ అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశముంది. ధరల సవరణతో కొత్తగా ప్రయోజనమేంటో తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులే అభిప్రాయపడుతున్నారు.