జగన్ ఆర్థిక ఉగ్రవాది.. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు..

ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది. జిల్లాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  భారతదేశాన్ని అమ్మడమే మోదీ సిద్దాంతమని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైసీపీ ప్రభుత్వానికి ముందే తెలుసని గోరంట్ల అన్నారు. మాటలగారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని..రబీకి ముందస్తు ప్రణాళిక రూపొందించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు రబీకి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు నీరు సరపరా చేయాలని డిమాండ్ చేశారు. 

స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్! పట్టభద్రుల ఓట్లు ఊరికే రావు..

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గంటల్లో కొచ్చింది.ఆదివారం పోలింగ్ జరుగుతుంది. అభ్యర్ధులు, పార్టీలు ఆఖరి ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు. ఓటర్లను  ప్రసన్నం చేసుకునేందుకు,ఎవరికి తోచిన రీతిలో వారు తమ శక్తి కొలది ఓటర్లను ‘సంతృప్తి’ పరిచే పనిలో పడ్డారు. ఓటర్లు అందరూ పట్టభద్రులే, అభ్యర్ధులు అందరూ పెద్దలే..పెద్దల సభ సభ్యులుగా గౌరవం కోరుకుంటున్న వారే..  అయినా లెక్క లెక్కే అన్నట్లుగా చేతులు చాస్తున్నారు. ఓట్లు ఉరికే రావు,అనే మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఘనంగానే వినిపిస్తోంది.అభ్యర్ధుల ఆర్థిక స్తోమతను బట్టి ఓటర్లు రేటు ఫిక్స్ చేస్తునట్లు అభ్యర్ధుల తరపున ‘పని’ కానిస్తున్నవారు సైతం  ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అన్ని కోట్లున్నాయి, ఇంకా అన్ని కోట్లు సంపాదించుకుంటారు, ఈ చిల్లర బేరాలేంటి, మా ఓటు కావాలంటే మేము అడిగిన మొత్తం ఇవ్వాలిసిందే, అంతకు తగ్గిదే కుదరదు’ అని కుండబద్దలు కొడుతున్నారు. అవీ ఇవని కాదు ,ఒక్కొక్క ఇంట్లో ఓట్ల సంఖ్యను బట్టి  సెల్ ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు చివరికి లాప్ టాప్ ‘లు కూడా  ఓటర్లు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.  రెండు నియోజక వర్గాల్లోనో ఓటర్ల సంఖ్య గణనీయంగా  పెరిగింది . సాధారణ బ్యాలెట్ పేపర్’లో పట్టనంత మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అందుకే న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు . హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో 5.05 లక్షల మంది ఓటర్లున్నారు. ఏకంగా  71 మంది అభ్యర్ధులు తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఖమ్మం,వరంగల్ ,నల్గొండ  నియోజక వర్గంలో ఓటర్లు 5.31 లక్షలుంటే, అభ్యర్ధులు వందకు ఒకింత తక్కువగా 93మంది ఉన్నారు. ఓటర్లు, అభ్యర్ధుల సంఖ్యపెరగడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. అభ్యర్ధులు ప్రతి ఓటరును ముఖ్యంగా ,ముందుగానే ఆన్లైన్ పేమెంట్ జరిగిపోయిన ఓటర్లను పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేసే వరకు నీడలా వెంటాడేందుకు   ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందాలు, తమకు అప్పగించిన ప్రతి ఓటరు ఓటు వేసేవరకు ఫోన్ మీద టచ్’లో ఉంటారు అవసరం అయితే ఫిజికల్’గా ... ఏర్పాట్లు చేసుకున్నారు.  అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు పోలింగ్’కు ముందే ఫలితాల లెక్కలు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి నుంచి  వచ్చిన ఆదేశాల మేరకు అధికార పార్టీ  బాధ్యులు , చివరి నిముషం వ్యూహాలకు పదును పెడుతున్నారు. హైదరాబాద్ నియోజక వర్గంలో  కొత్తగా నమోదైన ఓటర్లలో సుమారు 2 లక్షల మంది, తెరాస నాయకులు, కార్యకర్తల  కుటుంబ సభ్యులే ఉన్నారు. మా ఓట్లు మేము తెచ్చుకున్నా, మా అభ్యర్ధి వాణీ దేవి  సునాయాసంగా విజయం సాధింస్తారని,  తెరాస కీలక  నేత ఒకరు చెప్పారు. అలాగే ఖమ్మలో కూడా కొత్తగా నమోదైన ఓట్లలో ఎక్కువ తెరాస కుటుంబ ఓట్లే, సో.. రెండు నియోజక వర్గాలలోను తెరాస విజయం సాధిస్తుందని ఆ నేత ధీమా వ్యక్తం చేశారు. మరో వంక బీజీపీ హైదరాబాద్ సిట్టింగ్ సీటును నిలుపుకోవడంతో పాటుగా,ఖమ్మం సీటును కైవసం చేసుకుంటామని ధీమాగాఉంది.అయితే, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా అన్నిటికీ  మోడీ మంత్రాన్నే నమ్ముకున్న కమల దళం ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు గట్టెక్కిస్తుందిని ఆశతో వుంది.  మరో వైపు  మొదటి ప్రాధాన్యత ఓటు మీ ఇష్టం రెండవ ప్రాధాన్యత ఓటు నా కివ్వండి’  అంటూ హైదరాబాద్’లో ప్రొఫెసర్ నాగేశ్వర, ఖమ్మంలో కోదండరామ్,సాగించిన వినూత్న ప్రచార వ్యూహం ఫలిస్తుందా అనేది కూడా ఆసక్తిని కలిగోస్తోంది. అదే విధంగా ప్రజలలో ‘ఎదిరించే గొంతుక’ గా పేరొందిన తీన్మార్ మల్లన్న సాగించిన సుదీర్గ ప్రచారం, ముఖ్యంగా పదవులతో పని లేకుండా  మీడియా ద్వారా ప్రజల గొంతు వినిపిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైనం  ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఓటు తనకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎవరికి వారు  ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరిఆశలు అడియాసలు అవుతాయో ..17 న తేలిపోతుంది .  

హైదరాబాద్‌లో మళ్లీ రేవ్ పార్టీస్.. డ్రగ్స్..!

లాక్‌డౌన్ టైమ్ నుంచి సైలెంట్ అయిన రేవ్  పార్టీస్ మళ్లీ రెడీ అవుతున్నాయి. డ్రగ్స్ వాడకం కూడా పెరిగింది. ఇన్నాళ్లూ పబ్స్‌తో అడ్జస్ట్ అయిన జల్సారాయుళ్లు ఇప్పుడు రేవ్ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ శివారు రిసార్టుల్లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని రేవ్ పార్టీల్లో డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు తేల్చారు. ఇటీవల బయటపడిన సంస్థాన్‌ నారాయణపురం ఫాంహౌస్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. పబ్స్ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ ఆర్డర్ చేశారు. శివారు ప్రాంతాల్లోని గెస్ట్‌హౌస్‌లు, రిస్టార్స్‌ టార్గెట్‌గా డ్రగ్స్‌ దందాకు పాల్పడినట్టు తెలుస్తోంది. గంజాయి, డ్రగ్స్ కోసం వాట్సాప్ గ్రూప్‌లలో చాటింగ్ చేసినట్టు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో పార్టీ వివరాలు పెడుతూ గ్యాంగ్‌లు ఆకర్షిస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారం తర్వాత డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు డ్రగ్స్ లింకులపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. నగరానికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి? ఎవరు, ఎలా తీసుకొస్తున్నారు? ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

విజయవాడ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్!

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. ఇది రొటీన్ న్యూస్. నౌ ప్లేస్ ఛేంజ్. విజయవాడ విమానాశ్రయంలో బంగారం పట్టివేత. ఇది లేటెస్ట్ న్యూస్. అవును, గోల్డ్ స్మగ్లర్లు రూటు మార్చినట్టున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు పెరగడం.. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతుండటంతో కేటుగాళ్లు ఎయిర్ పోర్ట్ మార్చారు. తాజాగా, విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానంతో అతన్ని తనిఖీ చేయగా బంగారం దొరికినట్టు సమాచారం. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు పట్టుబడిన బంగారంపై ఆరా తీస్తున్నారట. పట్టుబడిన బంగారం ఎంత? ఎవరు, ఎవరి కోసం ఈ గోల్డ్ తీసుకొస్తున్నారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

వాలంటీర్ మర్డర్.. ఎందుకు చంపారంటే...

వాలంటీర్ శ్రీకాంత్ పొలం దగ్గర పడుకున్నాడు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్నాడు. సడెన్‌గా అతనిపై అటాక్ జరిగింది. గునపంతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. శ్రీకాంత్ స్పాట్‌లోనే చనిపోయాడు. వాలంటీర్ హత్య ఏపీలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగిందీ మర్డర్. శివరాంపేటకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గునపంతో పొడిచి హత్య చేశారు. ఉదయం విషయం తెలీడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పొలంలో నిద్రిస్తున్నది శ్రీకాంత్ తండ్రి అనుకొని.. వాలంటీర్ శ్రీకాంత్ ను చంపారని అంటున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.

వారెవా.. సూపర్ పిక్.. కవితకు బర్త్‌డే గిఫ్ట్

60 అడుగుల చిత్రం. రంగులతో రూపొందిన అద్భుతం. రంగవల్లిలో ఎమ్మెల్సీ కవిత అందంగా ఒదిగిపోయారు. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నారు. చిత్రం అంటే అదేమీ అన్నిటిలా మామూలు ఫోటో కాదు. సంథింగ్ స్పెషల్. సంథింగ్ డిఫరెంట్.  సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని వెరైటీగా అభిమానం చాటుకున్నాడు. హైదరాబాద్ రవీంద్రభారతిలో 60 అడుగుల చిత్రపటాన్ని వేయించాడు. ఫోటో అంటే ఏ ఫ్లెక్సీపైనో.. గోడపైనో కాదు. నేలపై. అవును నేలపై 60 అడుగుల కవిత చిత్రాన్ని అద్భుతంగా గీశారు. మహారాష్ట్రకు చెందిన రంగోలి ఆర్టిస్ట్ శైలేష్ కులకర్ణి ఈ చిత్రాన్ని వేశారు. 20 గంటలు కష్టపడితేనే ఈ అందమైన బొమ్మ ఆవిషృతమైంది. కవిత ఫోటో దగ్గర సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు అభిమానులు. 

ఆంధ్రప్రదేశ్ కు నాలుగో క్యాపిటల్...!

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధానిగా ఉన్న అమరావతిని పక్కనపెట్టి కొత్తగా మూడు రాజధానుల మంత్రం ఎత్తుకున్న సంగతి తెల్సిందే. దీనిలో భాగంగా హైకోర్టును కర్నూల్ కు తరలించడం ద్వారా అక్కడ జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని, అలాగే సెక్రటేరియట్ ను విశాఖకు తరలించి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోపక్క ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిలో శాసనసభ ను కంటిన్యూ చేస్తూ శాసన రాజధాని అంటూ ఇక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కళ్ల నీళ్లు తుడిచే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం పాస్ చేయించుకుని దానిపై గవర్నర్ కూడా సంతకం చేశారు. అయితే దీనికి వ్యతిరేకంగా రాజధానికి భూములిచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ విచారణలో ఉంది. ఇది ఇలా ఉండగా రాజదాహాని తరలింపుకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు నడుస్తుండగానే జగన్ సర్కార్ మాత్రం సైలెంట్ గా అమరావతి నుండి ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాల తరలించుకు పోతోంది. మొత్తంగా అక్కడ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా కనిపించకూడదన్నట్లుగా చూస్తోంది. వీటిని అయితే అటు విశాఖకు లేదంటే... పులివెందులకు తరలిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటికే మెట్రో రైలు ఆఫీసుతో పాటు…అనేక కార్యాలయాలను విశాఖకు తరలిస్తూ.. ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా..వెటర్నరీ, బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను.సీఎం జగన్ సొంత నియోగాజకవర్గమైన కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ జీవో ఇచ్చేసింది. దీనిపై పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారని..అందుకే ఈ కార్యాలయాన్ని తరలిస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. అయితే వైసిపి సర్కార్ హయాంలోనే మోపిదేవి వెంకట రమణ పశుసంవర్ధక మంత్రిగా ఉన్నపుడు ఈ కార్యాలయాన్ని కంకిపాడులో ఏర్పాటు చేసందుకు అనుమతిస్తూ గతేడాది ఒక మెమో ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కె పార్థసారధి కూడా దీనిని ఇక్కడే నిర్మించాలని ప్రయత్నించారు. దీంతో కంకిపాడులో భవనాల నిర్మాణానికి స్థలాన్ని కూడా సిద్ధం చేసి..రూ. రెండు లక్షలు వెచ్చించిన అధికారులు ఆ ప్రాంతాన్ని చదును చేశారు. ఈ స్థలంలో గత డిసెంబరులో జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా ఇక్కడ పనులన్నీ నిలిపివేసి…హఠాత్తుగా దీనిని పులివెందుకు తరలిస్తున్నారు. ఈ సంస్థ కోసం పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని అలాగే.. దానికి సంబంధించిన ఉద్యోగులకు పులివెందులలోనే క్వార్టర్స్‌ కూడా ఇవ్వాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను ఇటు విశాఖతో పాటు అటు పులివెందులకూ తరలిస్తుండటంతో ప్రజలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విశాఖ మొదటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. రెండోది పులివెందుల అని… కొంత మంది కాదు కాదు పులివెందుల నాలుగో క్యాపిటల్ అని అనుకుంటున్నారు. దీంతో ఏపీకి మూడు కాదు నాలుగు క్యాపిటల్స్ అని మరికొంతమంది జనాలు సెటైర్లు వేసున్నారు.మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా.. కార్యాలయాలు అయితే విశాఖకు లేదంటే పులివెందులకు తరలింపు జరుగుతోందని అంటున్నారు. అంతేకాకుండా త్వరలో మరికొన్ని సంస్థలను కూడా పులివెందులకు తరలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఏపీలో పారిశ్రామికవేత్తలు ఎవరైనా పెట్టుబడులతో వస్తే వారికి కూడా పులివెందులను మాత్రమే చూపిస్తున్నారు. తిరుపతిలో ఉన్న డిక్సన్ అనే సంస్థ కూడా విస్తరణ లోచన చేయగా.. పులివెందులలో  పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. అలాగే జగన్ సర్కార్ ప్రకటించిన రెండు, మూడు రకాల పెట్టుబడులు కూడా పులివెందులలోనే ఉన్నాయి. అయితే మిగిలిన చోట్ల మాత్రం ప్రభుత్వపరంగా ఎటువటిని పెట్టుబడి ప్రతిపాదనలు కూడా లేవు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించారు.  ఒడిశా అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పోడియం వద్దకు చేరుకున్న బీజేపీ దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సభ్యులు ఆయన నుంచి సీసా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే గతంలోనే హెచ్చరించారు. ముందు చెప్పినట్లే ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి ఆత్మహత్యకు యత్నించారు. తన నియోజకవర్గమైన దేవ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని గత నెల 26న అసెంబ్లీలో మాట్లాడుతూ సుభాష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారని, ప్రభుత్వం కనుక తక్షణం కొనుగోళ్లు చేపట్టకుంటే తాను కూడా అదే పనిచేస్తానని హెచ్చరించారు

వెనక్కి తగ్గారా.. వదిలించుకున్నారా! కమలానికి వకీల్ సాబ్ కటీఫేనా?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మధ్య రాజీ కుదిరింది. తిరుపతి నుంచి తామే పోటీ చేస్తామని పట్టుబట్టిన జనసేన చివరకు వెనక్కి తగ్గింది. బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలిపింది. సోము వీర్రాజు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యామని, తిరుపతిలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావు అధికారికంగా ప్రకటించారు. దీంతో తిరుపతిలో పోటీ నుంచి జనసేన తప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దల మాటతో వకీల్ సాబ్ వెనక్కి తగ్గారా లేక.. మరోదేనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్‌తోనూ తలపడినంత పనిచేశారు. స్నేహం కోసం తాను చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. గతేడాది చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ సంచలనం రేపారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రన జనసేనకు సొంత అస్థిత్వం ఉండదా? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించిన ఆయన.. జీహెచ్ఎంసీలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి బుజ్జగించిన తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంలో.. జీహెచ్ఎంసీలో త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతిలో పోటీకి జనసేనకు అవకాశం కల్పించాలని బీజేపీ పెద్దలను కోరుతానని పవన్ ప్రకటించారు. ఆ మేరకు ఆయనకు హామీ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది.  జనసేన తిరుపతి నుంచి పోటీ చేయకుండా వెనక్కి తగ్గడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. రాజకీయ భవిష్యత్ కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తిరుపతి ఎంపీ ఎన్నికల తర్వాత జనసేన.. బీజేపీ నుంచి దూరమౌతుందని తెలుస్తోంది. తిరుపతిలో జనసేన పోటీ చేయాలని ఎంత గట్టి డిమాండ్ ఉందో... పోటీ చేస్తే ఇబ్బందనే వారు ఎక్కువ ఉన్నారు. పోటీ చేయడం వల్ల ప్రత్యేక హోదా అంశం, రైల్వే జోన్,  రాజధాని, విశాఖ ప్రైవేటీకరణ తదితర అంశాలు తెరమీదకు వస్తాయని జనసేన భావిస్తుంది. ప్రత్యేక హోదా అంశం పెండింగులో ఉండగా..తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. కాక రేపుతోంది. కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. బీజేపీ పేరు చెబితేనే మండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దూరంగా ఉండటమే బెటరని జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  బీజేపీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం జనసేన మీద పడుతుందనే భయం కూడా పవన్ కల్యాణ్ లో కనిపిస్తుందట. అందుకే తిరుపతిలో పోటీ చేయకుండా వదిలేస్తే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని అభిప్రాయం జనసేన నేతల్లో బలంగా ఉన్నట్లు తెలిసింది. ఫలితాలు తర్వాత ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని 2024 ఎన్నికలకు వెలతామని ఆ పార్టీలోని కొంత మంది చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేసి.. జనసేన సేఫ్ జోన్ లోకి వెళ్లిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి... జనసేన గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అనలిస్టులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.  ఇక  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతుతో బీజేపీ పోటీ చేయనుండటం ఖరారైనప్పటికీ, అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు.టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతోంది. అధికార వైసీపీ  అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించింది. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్....తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించనున్నారని తెలుస్తోంది.  

ఏపీలో మరో టీడీపీ నేత అరెస్ట్... బాధితులకే శిక్ష..!

  ఏపీలో వైసిపి ప్రభుత్వం టీడీపీ నేతలను కనీస ప్రొసీజర్ ఫాలో కాకుండా.. అడ్డగోలుగా అరెస్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే. మొన్న చింతమనేని ప్రభాకర్.. నిన్న కొల్లు రవీంద్ర లను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా . వారిని అరెస్ట్ చేసే సందర్భంలో పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ వారికీ బెయిల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఇవాళ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని వరుసకు బావ అయిన సత్తిరాజు రెడ్డి ని హత్య చేశారనే నేరం మోపి పోలీసులు అరెస్ట్ చేసి బిక్కవోలు పోలీసు స్టేషన్ కు తరలించారు. రెండు నెలల క్రితం సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో సత్తిరాజు రెడ్డి రెండో భార్య.. ఈ మృతి ఘటనలో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ కేసు విచారణలో ఏం తేలిందో చెప్పకుండానే పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసారు .దీంతో కేవలం రాజకీయ కారణాలతోనే ఆయనను అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా కొన్నిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మధ్య అవినీతి వ్యవహారాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేయగా . రెండు వర్గాలు కూడా ఆలయంలో ప్రమాణం చేశాయి. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి బావ హత్య అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను వేధింపులకు గురి చేయడం కోసం.. ఎవరితో ఒకరితో పిర్యాదు ఇప్పించడం.. తరువాత కనీసం దర్యాప్తు కూడా లేకుండా అరెస్టు చేయడం మామూలై పోయిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. "రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారు. చేస్తున్న ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలి" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ తోపాటు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న వీడియోను లోకేష్ షేర్ చేశారు.

ఏపీలో మరోసారి కరోనా రెడ్ జోన్.. ఎక్కడంటే..

గత కొంత కాలంగా ఏపీలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి దీంతో ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని మళ్లీ రెడ్ జోన్‌గా ప్రకటించింది. మరోపక్క దేశంలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై మళ్లీ దృష్టి పెట్టింది గతంలో కరోనా కట్టడి కోసం జోన్లుగా ప్రకటించి చర్యలు తీసుకున్నట్టుగానే మళ్లీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రదేశాలలో మళ్లీ రెడ్ జోన్ విధించారు. చిత్తూరు నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ వైరస్ నియంత్రణ చర్యలను చేపట్టారు ఈ రెండు విద్యా సంస్థల్లోనూ సోడియం హైఫోక్లోరైట్ స్ప్రే చేయించారు. అంతేగాకుండా వారం రోజుల పాటు ఆ పాఠశాలలను మూసి వేయాల్సిందిగా అదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన విద్యార్థుల తరగతి గదిలోని మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను సేకరించి, వారికి పరీక్షలు నిర్వహించే చర్యలు చేపట్టారు. ఈ పాఠశాల, కళాశాల పరిసరాలలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.  

ఇదేమీ ‘ఈశా’.. అర్థరాత్రి చిందులేమి ఈశ్వరా?!

ఈశా ఫౌండేషన్ అంటే ‘సద్గురు’ రూపం కళ్ల ముందు కదులుతుంది. ఆయన వేషధారణలోని ప్రత్యేకత ఆయనను అలా పట్టిస్తుంది. ఆద్యాత్మిక ప్రపంచంలో సద్గురుకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో సందేహం లేదు. అలాగే, ఈశా ఫౌండేషన్’కు కూడా అంతే గుర్తింపు, గౌరవం ఉన్నాయి.  ప్రతి సంవత్సరంలానే, ఈ సారి కూడా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్, అధ్వర్యంలో శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే, జాగారం పేరున.. అర్థరాత్రి అంకమ్మ శివార్లు  అన్నట్టు, ఆ గంతులు, చిందులు ఏమిటి? మంగ్లీ పాటకు సద్గురు చిందులు వేయడం ఏమిటి?  మంగ్లీనో, ఆమె పాటనో తక్కువ చేయడం కాదు. ఆమె చక్కని గాయిని. ఆమె పాడిన అనేక జానపద గీతాలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే, శివరాత్రి వేడుకల్లో ఆమె పాడిన పాటలు అన్నీ కూడా శ్రోతలను భక్తి పరవసులను చేసే పాటలే. అలాగే ఇతర గాయనీ గాయకులు పాడిన పాటలు కూడా భక్తి భావాన్ని నింపే పాటలే. సందేహం లేదు. అవే పాటలు, సందర్భానికి తగినట్లుగా గానం చేసుంటే బాగుండేది అనేది ప్రత్యక్షంగా, ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని చూసిన చాలా మంది భక్తులు వ్యక్తపరుస్తున్న   అభిప్రాయం, ఆగ్రహం. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక పవిత్ర ఆద్యాత్మిక వేడుకను పరవశం పేరుతో ఇలా వళ్ళుమరిచి, తూలుతూ, తేలుతూ సాగే.. ప్రాశ్చాత్య కల్చరల్ ఈవెంట్ స్థాయికి దిగాజార్చారనే అవేదనను అనేకమంది వ్యక్తం చేస్తున్నారు.  శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారు? శివరాత్రి జాగారం ఎందుకు? ఈ అన్ని ప్రశ్నలకు మన పురాణ ఇతిహాసాలలో, ఋషుల పలుకులో  సమాధానాలున్నాయి. ప్రవచనకర్తలు ఆ పురాణం ఇతిహాసాల సారాన్ని విడమరిచి చెపుతూనే ఉన్నారు. ఉపవాసం లక్ష్యం పంచేంద్రియాలను భగవంతునికి చేరువ చేయడం అయితే, జాగారం అర్థం, పరమార్ధం, ‘నేను వినా మరొకటి లేదు’ అన్న అత్మానంద అనుభూతిలోకి పోవడం. అంటే , పరమాత్మలో ఆత్మను విలీనం చేసి పరమానంద అనుభూతిని పొందడం. నిజానికి, సద్గురు, తమ ఉపన్యాసంలో అదే చెప్పారు, “ఈ రాత్రి కేవలం ఒక జాగారం రాత్రి మాత్రమే కాదు, ఇది మీకు ఒక  మేలుకొలుపు, జ్ఞాన కొలుపు  కావాలి” అనే సద్గురు తమ సందేశంలో చెప్పారు. చీకటి అనే సందిగ్ధం నుంచి సత్యాన్ని తెలుసుకునే పవిత్ర వేడుక శివరాత్రి జాగారం. కానీ, జరిగింది, అది కాదు.  ఈ వేడుకలను చూసింది భారతీయులు మాత్రమే కాదు, ఈశా విడుదల చేసిన ప్రకటనలోనే పేర్కొన్న విధంగా 100 ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమ్ ప్రసారమైంది. 11 భారతీయ భాషలలో మాత్రమే కాకుండా.. ఇంగ్లీషు, నేపాలీ, రష్యన్, ఫ్రెంచ్, పోర్చుగీస్, సాంప్రదాయ చైనీస్ ఇంకా సరళీకృత చైనీస్ భాషలలో కూడా ప్రసారమైంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. అయితే, భారతీయుల పవిత్ర వేడుకను అనేక ప్రపంచ దేశాల ప్రజలు ప్రజలు తిలికించినందుకు సంతోషించాలా? లేక, ప్రాశ్చాత్య ప్రపంచం ముందు తలవంపులు తెచ్చిందని విచారించాలా?

టీఆర్ఎస్‌కు మజ్లిస్ షాక్! గులాబీ పార్టీలో గుబులు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి మజ్లిస్ గుబులు పట్టుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురు వాణీదేవిపై ఆ వర్గం ఓటర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌తో ఎంతగా దోస్తీ ఉన్నా.. ఈసారి మాత్రం కారు గుర్తుకు ఓటేసేది లేదంటున్నారు. అందుకు కారణం పీవీపై ఉన్న ధ్వేషమే. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు.. అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావే బాధ్యుడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అందుకే, పీవీ కూతురి అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే లేదనే అభిప్రాయానికి ఎంఐఎం మద్దతుదారులు వచ్చారని చెబుతున్నారు. పీవీపై మైనార్టీ వర్గంలో ఉన్న వ్యతిరేకత.. పీవీ కూతురు వాణీదేవిపై కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన గులాబీ బాస్ మదిలో కలవరం మొదలైందని అంటున్నారు.  అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన మిత్రబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు  సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..  మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం.. అభ్యర్థి కారణంగా అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంఐఎం తీరుతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, మరోరకం ప్లాన్-బి అప్లై చేస్తున్నారట గులాబీ శ్రేణులు.  వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్‌కే వేయండి. అంతే. ఇక 2, 3 లాంటి ప్రాధాన్యతా ఓట్లు ఎవరికీ వేయకండి అని వేడుకుంటున్నారట. ఒకవేళ కాదూ కూడదంటే.. రెండో ప్రాధాన్యతా ఓటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మాత్రం వేయకండి అని చెబుతున్నారట. తప్పనిసరిగా వేస్తామంటే.. తాము సూచించిన కేండిడేట్స్‌కు మాత్రమే ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో ప్రొఫెసర్ కోదండరాంకు 2వ ప్రాధాన్యత ఓటు వేయండని చెబుతున్నారట. ఇలా.. బీజేపీ నుంచి కాచుకోడానికి.. ఎమ్ఐఎమ్‌తో కలిగే నష్టాన్ని పూరించుకోడానికి.. రెండో ప్రాధాన్యత ఓటుతో ప్లాన్-బి అమలు చేస్తున్నారట టీఆర్ఎస్ శ్రేణులు. మరి, ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో..? రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమాలు ఎక్కువవుతున్నాయి. ఓటరు లిస్టు ప్రకారం డబ్బు పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 30 మంది ఓటర్లుకు.. ఒక టీఆర్ఎస్ నేత చొప్పున బాధ్యతలు అప్పగించి వారిని మచ్చిన చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేల్చి చెబుతున్నాయి విపక్షాలు.

అవి'నీతి' బండి! 600కోట్లు.. ఏది నిజం? ఏది ప్రచారం?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు. ఢిల్లీ కంపెనీలో 50 కోట్ల పెట్టుబడులు, కరీంనగర్ జిల్లా తీగలగుట్ట దగ్గర 3 కోట్ల పంటభూమి. రాజేంద్రనగర్‌లో బినామీ పేరిట 75 కోట్ల విలువైన భూములు. ఇలా సోషల్ మీడియాలో విస్త‌ృత ప్రచారం. ఇవి చాలవన్నట్టు.. తాజాగా ఓ గ్రానైట్ స్కాంలోనూ బండి సంజయ్ పేరంటూ మరో వీడియో. బండి సంజయ్ ఆస్తుల పేరుతో ఓ పేపర్ క్లిప్పింగ్, గ్రానైట్ దందా అంటూ ఓ వీడియో. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ రెండూ ఫేక్ అని తెలుస్తోంది.  బండి సంజయ్‌పై ఆరోపణలకంటే ఈ సమయం, సందర్భమే మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతోంది. ఆయన నాయకత్వంలో దుబ్బాకలో దుమ్ము లేపింది కమలం పార్టీ. గ్రేటర్‌లోనూ గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది. ఇక నాగార్జున సాగర్ బై పోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌ల్లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. ఇక, అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలకూ సమయం దగ్గర పడింది. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా.. ఈ రెండు స్థానాల్లో గెలుపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని అమాంతం మార్చేయగలవు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడం, గ్రానైట్ బ్లాక్‌మెయిల్ దందాలో ఆయన పేరు వినిపించడం.. రాజకీయంగా సంచలనంగా మారింది.  కరీంనగర్‌ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు బండి సంజయ్. రెండేళ్లకు ముందు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఆయనకు పెద్దగా ఆస్తులేమీ లేవు. అలాంటిది సడెన్‌గా.. 600 కోట్ల ఆస్తులంటూ ఆరోపణలు రావడం, గ్రానైట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంపై పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ ఇచ్చిన వివరణపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను 600 కోట్లు సంపాదించినట్టు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. నిరూపిస్తే నిరుద్యోగ భృతి తానే చెల్లిస్తానని బండి సంజయ్ అన్నారు. అంతే, ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆ మేటర్‌ను అక్కడికి క్లోజ్ చేశారు. మళ్లీ 600కోట్ల గురించి పెద్దగా వివరణ ఇచ్చింది లేదు. మరోవైపు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఇంత పెద్ద అవినీతి ఆరోపణ వస్తే.. బీజేపీ నేతలు సైతం పెద్దగా స్పందించలేదు. అంటే.. మౌనం అర్థ అంగీకరమేగా? అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.   బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ. డబ్బు కంటే జెండా, ఎజెండానే వారికి ప్రాధాన్యం. అందుకే, బీజేపీ నేతలపై పెద్దగా అవినీతి ఆరోపణలు వినిపించవు. కానీ, ఇటీవల ఇటు ఏపీలో, అటు తెలంగాణలో పలువురు ప్రముఖ బీజేపీ నేతలకు అవినీతి మకిలీ అంటుకోవడం వివాదాస్పదమవుతోంది. ఓ ఆశ్రమం విషయంలో ఏపీ బీజేపీ నాయకులు జీవీఎల్, విష్ణువర్ధన్‌రెడ్డిలపై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. వరుస ఘటనలు మిస్టర్ క్లీన్ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని అంటున్నారు. అయితే, అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. కనీసం ఆ ఆరోపణలను గట్టిగా ఖండించడమో, సరైన వివరణ ఇవ్వడమో కూడా చేయడం లేదు ఆయా నేతలు. తాజాగా, బండి సంజయ్‌పై వినిపిస్తున్న 600 కోట్ల ఆస్తులు, గ్రానైట్ వ్యాపారుల నుంచి పైసా వసూల్ వ్యవహారంపై బీజేపీ నేతలను వివరణ అడిగే ప్రయత్నం చేసింది తెలుగు వన్ న్యూస్. బీజేపీ నేతలెవరూ ఆ విషయంపై స్పందించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామంటున్నారు బీజేపీ నేతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులపై వరుసగా వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇస్తేనే.. అసలు నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలిసేది. లేదంటే, ఫేక్ న్యూసే నిజమనుకునే ప్రమాదం ఉంది. కాదంటారా..?

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? విపక్షాలపై కేటీఆర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? మొదట భారతీయులం, తర్వాతే తెలంగాణ బిడ్డలం. ఇదీ కేటీఆర్ ఆగ్రహం. విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దతు ప్రకటించాక ఆయనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు ఇచ్చారని ఆరోపించాయి. కేటీఆర్ స్టేట్‌మెంట్ దురుద్దేశపూర్వకంగా ఉందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడితే.. ముందు తెలంగాణలో మూతపడిన ప్రాజెక్టులపై పోరాడమంటూ బీజేపీ నేతలు నిలదీశారు.  తన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ కొనసాగుతుండటంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. నీవెవరు అడిగేందుకు? ఏపీతో నీకేం పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? 80వేల మంది బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగులను రోడ్డుపై పడేసింది. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా?ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలంటూ విపక్షాలపై కస్సుమన్నారు కేటీఆర్. 

కేటీఆర్ పై బీజేపీ భగ్గు...

కమలనాధులు ముక్త కంఠంతో టీఆర్ఎస్ పార్టీతో పాటు.. మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డి ఆంటే. కేటీఆర్ నిజంగానే గట్స్ ఉన్న నాయకుడైతే అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెలిపించాలని బండి సంజయ్ మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఏడేళ్ళుగా షుగర్ పరిశ్రమను ఎందుకు తెరవలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు పూనకం వస్తోందని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. 70శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్‌కు ఓటు వేయరన్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన ఏడుపు తాను  ఏడిస్తే బాగుంటుందని. విశాఖపట్నంలో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు. 

ఆ వ్యాక్సిన్ తో హెల్త్ సమస్యలు .. వ్యాక్సినేషన్ ను ఆపేసిన ఆరు దేశాలు 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు అత్యవసరంగా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు ఇస్తుండగా.. ఇతర దేశాలు వీటితోపాటు ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ను ఆరు యూరప్ దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి శరీరంలో రక్తం గడ్డకట్టినట్లుగా తీవ్రమైన ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెల్సుస్తోంది. మరోపక్క ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టుగా రిపోర్టులు వచ్చాయని డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకాన్ని డెన్మార్క్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే రక్తం గడ్డ కట్టిందని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇదే కారణం చూపిస్తూ.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియా, ఐస్ ల్యాండ్ దేశాలు కూడా తరువాతి బ్యాచ్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ల వాడకాన్ని ఆపేశాయి. తాజాగా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపి వేస్తున్నట్టు డెన్మార్క్ కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 9వ తేదీకి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షల మందికి పైగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయాగా.. వీరిలో కొన్ని రక్తం గడ్డం కట్టిన కేసులు వచ్చాయి. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకం పై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.            

అమ్మను కొట్టి చంపిన కొడుకు

మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. మనిషన్న వాడు మాయమవుతున్నాడు. డబ్బు మీద అత్యాశతో దారుణాలకు తెగబడుతున్నాడు. ఆస్తి కోసం అమ్మను హింసించాడు ఓ దుర్మార్గుడు. రోజుల తరబడి చిత్ర హింసలకు గురిచేశాడు. సిగరెట్లతో ఆమె ఒంటిపై కాల్చాడు. చుట్టుపక్కలవారు అడ్డగిస్తే.. వారితోనూ గొడవ పడ్డాడు. కొడుకు దెబ్బలకు తాళలేక ఆ ముసలి తల్లి ప్రాణాలు విడిచింది. ఈ అమానుష ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం, మిట్టపల్లెలో జరిగింది.  గ్రామంలో పుల్లమ్మ (60) పేరిట రెండు ఎకరాల పొలం ఉంది. ఆ భూమిని తనకు రాసివ్వాలంటూ ఆమె కొడుకు ప్రసాదరెడ్డి కొంత కాలంగా వేధిస్తున్నాడు. రోజూ మద్యం తాగి వచ్చి టార్చర్ చేసేవాడు. కొడుకును నమ్మని ఆ తల్లి.. పొలాన్ని కూతురు పేరిట రాసిచ్చింది. దీంతో అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తల్లిని కర్రలతో విచక్షణా రహితంగా కొట్టాడు. తల్లి శరీరంపై సిగరెట్లతో కాల్చాడు. దెబ్బలకు తాళలేక ఆమె ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోయిందని తెలిసి ప్రసాదరెడ్డి ఇంట్లో నుంచి పారిపోయాడు. అత్తారింట్లో దాక్కున్నాడు. మరునాడు ఏమీ తెలీనట్టు అమాయకంగా ఇంటికొచ్చాడు. పోలీసుల దర్యాప్తులో కొడుకే కన్న తల్లిని కొట్టి చంపాడని తేలింది. ప్రసాదరెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు.  ఆస్తి కోసం అమ్మను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముసలి తల్లిని కర్రలతో దారుణంగా కొట్టడం.. సిగరెట్లతో కాల్చడం.. వాడిలోని పైశాచికత్వానికి నిదర్శనం. పొలం కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతాడా? మ‌ృగంలా ప్రవర్తిస్తాడా? అంటూ విషయం తెలిసిన వారంతా అతడిని తిట్టిపోస్తున్నారు. క్రూరుడైన ఆ కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.