ఉక్కుపై ఉగ్రరూపం.. కేటీఆర్‌తో రేవంత్, రాములమ్మ చెడుగుడు

విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు. అవసరమైతే తాను విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటానంటూ కేటీఆర్ స్టేట్‌మెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కేటీఆర్ ఫోటోకు విశాఖలో ఉక్కు కార్మికులు పాలాభిషేకం చేస్తే.. తెలంగాణ నేతలు కేటీఆర్ కామెంట్స్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే దురుద్దేశంతో కేటీఆర్ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారని ఎద్దేవా చేశారు. తాజాగా, బీజేపీ నేత విజయశాంతి సైతం కేటీఆర్ కామెంట్లపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కాస్త సాఫ్ట్ గా విమర్శిస్తే.. రాములమ్మ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె విసిరిన ఒక్కో బాణం.. కేటీఆర్ ఇమేజ్ ను ఫుల్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.  అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ కేటీఆర్‌పై ఫేస్‌బుక్‌లో సెటైర్లు వేశారు విజయశాంతి. తెలంగాణలోని మూతపడిన నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ కోసం ఉద్యమం చేయడం లేదేంటని నిగ్గదీసి అడిగారు. పనిలో పనిగా.. గతాన్ని కూడా తవ్విపోశారు రాములమ్మ. ‘‘అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని.. తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది’’ అంటూ రాములమ్మ కామెంట్లు చేశారు.  ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి.. అటు బీజేపీ నుంచి విజయశాంతి.. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు.. కేటీఆర్ ను విశాఖ ఉక్కుపై నిలదీయడంతో.. కేటీఆర్ స్టేట్‌మెంట్ వెనుక అసలు మతలబు ఏముంటుందనే అనుమానం పెరుగుతోంది. 

4 రోజులు వైన్స్ క్లోజ్.. బార్లు బంద్

అవును. మీరు చదివింది నిజమే. తెలంగాణలో మద్యం షాపులు బంద్. ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు రోజులు వైన్స్ క్లోజ్. ఆ తర్వాత మరో రోజు కూడా బంద్. అంటే, మొత్తం నాలుగు రోజులు వైన్స్ ఓపెన్ కావు. ఆరు జిల్లాల్లో లిక్కర్ షాపులన్నీ మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులు బంద్ చేస్తుండటం మద్యం ప్రియులకు షాకింగ్ న్యూసే. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఈ ఆరు జిల్లాల్లో మద్యం దుఖాణాలు బంద్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మద్యం షాపులు మూతపడనున్నాయి. మళ్లీ మార్చి 14 ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాతే తెరుచుకుంటాయి. ఇక, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈనెల 17, బుధవారం రోజున కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో, మందు బాబులు ముందే మద్యం కొనుగోలుకు ఆరాటపడుతున్నారు. 

రాజకీయ తెరపై.. సినీ వెలుగులు..

ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు, ముఖ్యంగా, సినీరంగ ప్రముఖులను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతుంటాయి.కాషాయ దళం, బీజేపీలో అయితే ఈ ఆసక్తి కొంచెం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే, అలా ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన సినీ ప్రముఖులలో చాలా వరకు వడపోతలో జారిపోతూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితం, బెంగాలీ వృద్ధ నటుడు, మిదున్ చక్రవర్తి, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పటికే రెండు పార్టీలు మారిన మిదున్ చక్రవర్తి, మూడవ పార్టీలో ఎంత కాలం ఉంటారో, ఈ వయసులో (70 ప్లస్) ఆయన పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తారో ఏమో కానీ, ఆయన చేరికకు బీజీపీనే కాదు, మీడియా కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఇచ్చింది. మిధున్ చక్రవర్తి ఎంట్రీతో ఏవేవో జరిగిపోతాయని మీడియా ఊదర కొట్టింది. ఒక్క మిధున్ చక్రవర్తి మాత్రమే కాదు, ఇంకొందరు, హీరోలు, విలన్లు, హీరోయిన్లు, బుల్లి తెర బెంగాలీ నటీ నటులు అనేక మంది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. చేరుతూనే ఉన్నారు.  నిజానికి, కొద్ది కాలం క్రితం వరకు ‘బెంగాలీ సినీ/టీవీ ఇండస్ట్రీలో తృణమూల్’దే పైచేయిగా వుంది.ఇప్పటికే,ఇటు బెగాలీ సినిమాలలో,అటు బుల్లి తెరమీద రాణించిన మిమీ చక్రవర్తి, నుసారత్ జహాన్’ 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి, పార్లమెంట్’ సెలబ్రిటీ ఎంపీలుగా చక్రం తిప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా దీపాంకర్ డే’సహా అనేక మంది బెంగాలీ నటులు తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు.అలాగే, మిధున్ కంటే ముందే,యంగ్ హీరో యాష్ దాస్ గుప్తా, సౌమిలి ఘోష్, పాపియా అధికారి వంటి అనేక మంది బెంగాలీ నటీనటులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.అంతే కాదు, బెగాలీ ఇండస్ట్రీలో రాజకీయ వివక్ష కూడా ఉందని, ప్రముఖ నటి అంజనా బసు ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన తనను ఇండస్ట్రీ వెలివేసిందని, మంచి టీఆర్పీ రేటింగ్ ఉన్నా తన సీరియల్ ప్రసారాన్ని రాజకీయ వత్తిళ్ళ కారణంగా నిలిపి వేశారని ఆమె చెపుతున్నారు.  ఇదిలా ఉంటే సినిమా ప్రముఖులకు కండువాలు కప్పేందుకు, రాజకీయ నాయకులు కొంచెం దిగివచ్చి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇటీవల సీనియర్ బీజేపీ నాయకుడు,అనిర్బంజన్ గంగోపాధ్యాయ ప్రముఖ హీరో ప్రోసెన్’జిత్ చటర్జీ’ని పార్టీలోకి ఆహ్వానించేందుకు మేళ తాళాలతో ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, చటర్జీ రాజకీయాలలో చేరే ఆలోచన లేదని, సున్నితంగా  చెప్పి పంపారు అనుకోండి అది వేరే విషయం.ఇదిలా ఉంటే, మరో ప్రముఖ నటుడు,తృణమూల్ ఎమ్మెల్యే చిరాంజిత్ చక్రవర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్ల్యేగా పనిచేసిం తర్వాత రాజకీయాలు తన వంటికి పడవని అర్థమైందని  ఆయనే చెప్పుకున్నారు. ఇక రాజకీయాలు,సినిమా రంగాలు ఒకటిగా  కలిసి పోయిన తమిళనాడులో పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. అయితే చాలా చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన ద్రవిడ పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే ప్రత్యక్ష సినిమా లింకులు అంతగా లేని నాయకుల సారధ్యంలో ఎన్నికల బరిలో దిగుతున్నాయి.అయితే,చాలా కాలంగా రాజకీయాలలో ఉన్న విజయకాంత్, కొత్తగా అరంగేట్రం చేసిన కమల హసన్ వంటి వారి పక్క వాద్యపార్టీలు ఉన్నాయి. మరో వంక బీజేపీ తాతకు దగ్గులు నేర్పే పనిలో పడింది. సినిమా రంగ ప్రముఖలను ఆకట్టుకునేందుకు చాలా చాలా ప్రయత్నాలే చేసింది. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అన్నట్లుగా, తమిళ మెగా స్టార్ రజనీకాంత్’ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది.అయినా, తమిళ నాడులోనూ సినీ ప్రముఖు చాలామందే కమల దళంలో చేరారు.తాజాగా కొద్ది రోజుల క్రితం తమిళ హాస్య నటుడు సెంథిల్‌ బీజేపీలో చేరారు. గతంలో ఏఐఏడీఎంకే, ఆ తర్వాత టీటీవీ దినకరన్‌ ఏఎంఎంకేలోనూ ఆయన పని చేశారు.అంతకు ముందే, ఖుష్బూ కాంగ్రెస్’కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, గౌతమి, రాధా రవి, నమిత, గంగై అమరన్‌, వి.శేఖర్‌ తదితరులు ఇప్పటికే బీజేపీలో చేరారు.  అయితే, ఒక్క బీజేపీలోనే కాదు, కాంగ్రెస్’లో ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ అనేక, అగ్ర నటుడు అమితాబ్ నుంచి మన కోటా వరకు అనేక మంది సినిమా సెలబ్రిటీలు, చట్ట సభల మెట్టెక్కి కూడా, మళ్ళీ వెనక్కి వచ్చేశారు.అలా వచ్చిన వాళ్ళలో  మన తెలగు వెలుగులు ఉన్నారు. ఏకంగా  సొంత పార్టీలే పెట్టిన ఎన్టీఅర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి మంచో చెడో రాజకీయాల్లో కొంతవరకు నిలతొక్కు కున్నారు. అలాగే అలనాటి కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు, బాబు మోహన్ వరకు, ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మురళీ మోహన్ వరకు, చట్ట సభల మెట్లెక్కి దిగి రాజకీయాల నుంచి తప్పుకున్నవారి  జాబితా కూడా చాలా ఎక్కువగానే ఉంది.

కారుతో ఢీకొట్టి.. మెడ కోసి.. కోటి కోసం టీచర్ మర్డర్ 

వారిద్దరికీ రెండు సంవత్సరాల పరిచయం. ఆ పరిచయం ఆర్థిక సంబంధాలుగా మారాయి. అంతే అవసరానికి  ఓ ప్రభుత్వ టీచర్ ఒక వ్యక్తికి కోటి రూపాయలు ఇచ్చాడు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే తన పేరుమీద ఉన్న ల్యాండ్ రాసి ఇస్తాను అని బుకాయించాడు. చివరికి అప్పు ఇచ్చిన టీచర్ ప్రాణాలను తీశాడు.  మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఆయనను తొలుత కారుతో ఢీకొట్టి,  ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని వైష్ణోదేవి కాలనీకి చెందిన నరహరి (40) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్ జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన జగదీశ్ అలియాస్ జగన్‌ పదేళ్ల క్రితం రాజేంద్రనగర్  వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నరహరికి ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇది ఆర్థిక సంబంధాలకు దారితీసింది. ఈ క్రమంలో జగదీశ్‌కు దాదాపు కోటి రూపాయల వరకు నరహరి రుణంగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానన్న సమయం మించిపోవడంతో జగదీశ్‌పై నరహరి ఒత్తిడి పెంచాడు. డబ్బుల గురించి అడిగేందుకు బుధవారం సాయంత్రం జగదీశ్ ఇంటికి నరహరి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో బాలానగర్‌లో తనకు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో శాంతించిన నరహరి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక భగీరథ కాలనీ సమీపంలో ఆయన బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. కిందపడిన నరహరి మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢీకొట్టిన కారు వివరాల గురించి ఆరాతీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కారు జగదీశ్‌దేనని తేలింది. నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

బెజవాడ మేయర్.. కాయ్ రాజా కాయ్..

విజయవాడ మేయర్ ఎవరు? ఇది మిలియన్ణ డాలర్ల ప్రశ్న. అందుకే, మేయర్ ఎవరనే దానిపై లక్షల్లో బెట్టింగ్ నడుస్తోంది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అన్ని పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతర్గత కుమ్ములాటలు టీడీపీని కలవర పెడుతుంటే.. అమరావతి ఇష్యూతో అధికార పార్టీ బెదిరిపోతోంది. జనసేన తమ బలమెంతో పరీక్షించుకుంటోంది. మూడు పార్టీలకు గెలుపు ఓ సవాల్.  విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. పోరు హోరాహోరీ జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సందట్లో సడేమియాలా.. పందెంరాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. కాయ్ రాజా కాయ్ అంటూ కాసులు కుమ్మరిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది? మేయర్ సీటు ఎవరికి దక్కుతుంది? డివిజన్లలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? ఇలా డివిజన్ల వారీగా.. నగర వ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతోంది. టఫ్ ఫైట్ ఉన్న చోట్ల 50 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని అంటున్నారు. పందెం విషయంలో టీడీపీ, వైసీపీ, జనసేన అనే తేడా లేకుండా అంతా కలిసిపోయారు. మనీ మేటర్ అయ్యేసరికి తమ పార్టీ అభ్యర్థిపై కాకుండా గెలిచే ఛాన్స్ ఉన్న కేండిడేట్ పైనే బెట్టింగ్ కడుతుండటం ఆసక్తికరం. కార్పొరేటర్లపైనా, మేయర్ పైనా వేరు వేరుగా బెట్టింగ్ నడుస్తోంది. ముఠాగా ఏర్పడి కొందరు పందాలు కాస్తుంటే.. వ్యక్తిగతంగా పక్క వారితో బెట్టింగ్ వేస్తున్న వారి మరికొందరు.  విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లకు ఎన్నికలు జరిగితే.. వీటిలో కొన్ని స్థానాల్లో పందాలు భారీగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో రిజల్ట్స్ రాబోతుండటంతో ఈలోగా బెట్టింగ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పందెంరాయుళ్లతో పాటు బెజవాడ వాసుల్లో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కోహ్లీ స్వీట్ కిస్..  

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు రొమాంటిక్ ఫెలో అని మళ్ళీ అనిపించుకున్నాడు. విరాట్  ఓ అందమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. భార్య అనుష్క శర్మను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా లవ్ సింబల్‌ను జోడించాడు. కోహ్లీ, అనుష్క దంపతులు ఇటీవలె తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వామిక అని విరుష్క జోడీ నామకరణం చేసింది.  శుక్రవారం నుంచి ఇండియా ఇంగ్లండ్ మధ్య ‌ ఐదు టీ-20ల సిరీస్. ఇటీవల టెస్ట్ సిరీస్ గెలిచి కదనోత్సాహంతో ఉన్న టీమిండియా టీ-20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఈ రోజు సాయంత్రం మొతేరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగబోతోంది.  

టీఆర్ఎస్ నేత ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది.  ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి రేవ్ పార్టీని భగ్నం చేశారు. 99 మంది యువకులు, మహిళలు పట్టుపడ్డారు. పట్టుబడిన వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులేనని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చి రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌజ్ స్థానిక టీఆర్ఎస్ నేత జక్కిడి ధన్వంత రెడ్డిగా గుర్తించారు. ధన్వంత రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి.. రేవ్ పార్టీని నిర్వహించారని, అతని స్నేహితుడు గిరీష్ పార్టీని కో ఆర్డీనేట్ చేశారని చెబుతున్నారు. రేవ్ పార్టీ కోసం భారీగా మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చారని తెలుస్తోంది. గంజాయి కూడా లభ్యమైందని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌజ్ ఓవర్ ధన్వంత రెడ్డి.. మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు. రియల్టర్ గా ఉన్న ధన్వంత రెడ్డి... కూసుకుంట్ల రాజకీయ వ్యవహారాల్లో కీలకంగాా ఉంటారని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే క్యాంప్ నిర్వహించారని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.   

కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరా! రఘురామ రచ్చబండ 

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అధికార పార్టీ నేతల మద్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందని, జగన్ జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి కావాలని మంత్రి పెద్దిరెడ్డి కోరుకుంటున్నారని రఘురామ కృష్ణం రాజు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. దీంతో రఘురామకు కౌంటరిచ్చిన మంత్రి పెద్ది రెడ్డి... తీవ్రంగా విరుచుకుపడ్డారు. రఘురామను దున్నపోతుతో పోల్చారు. చంద్రబాబుకు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని పెద్ది రెడ్డి మండిపడ్డారు. కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి.. జగన్ దయతో ఎంపీ అయ్యారని చెప్పారు. రఘురామకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు పెద్దిరెడ్డి.  మంత్రి పెద్దిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రఘురామ కృష్ణం రాజు. తన కాళ్లు పట్టుకుని బతిమాలిడితేనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు. ఆయన సవాలును తాను స్వీరిస్తున్నానని, అయితే,  తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని రఘురామ ప్రతి సవాల్ విసిరారు. ‘నేను కనుక సీఎం అయితే’ అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని పెద్దిరెడ్డికి హితవు పలికారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

పదేండ్లు సీఎం.. ఆస్తి 16 లక్షలు!

పదేండ్లుగా ముఖ్యమంత్రి.. రెండు సార్లు కేంద్ర మంత్రి.. పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారం కోసం పోరాడుతున్న మమతా బెనర్జీ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా... రూ. 16. 73 లక్షలు. అక్షరాలు 16 లక్షల 73 వేల రూపాయలు మాత్రమే. మమతా బెనర్జీకి సొంత వాహనం కూడా లేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పుర్బా మేదినీపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్డీ.. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన నికర ఆస్తుల విలువను రూ. 16.72 లక్షలుగా తెలిపారు. అలాగే తనకు సొంత వాహనం కూడా లేదని అఫిడవిట్‌లో ఆమె వెల్లడించారు.  ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ  సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 66 ఏళ్ల మమత వద్ద ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు. 2016 ఎన్నికలకు ముందు వీటి విలువ రూ. 30.45 లక్షలు మాత్రమే. అలాగే, 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చింది. రూ. 69,255 నగదు ఆమె వద్ద ఉంది. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 13.53 లక్షలు. ఇందులో ఆమె ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా ఉంది.జాతీయ పొదుపు సర్టిఫికెట్ లో రూ. 18,490 డిపాజిట్ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీడీఎస్ రూపంలో రూ. 1.85 లక్షలు రావాల్సి ఉందని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు.  రూ. 43,837 విలువైన 9 గ్రాముల బంగారం కూడా దీదీ వద్ద ఉంది. తన పుస్తకాలపై 2019-20లో రూ. 930 రాయల్టీగా వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో మమత వివరించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవని, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని,  ఎల్ఎల్‌బీ కూడా చేశానని మమత వివరించారు. 

మహారాష్ట్రలో కరోనా పంజా! నాగపూర్ లో లాక్ డౌన్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే  13,659 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 60 శాతం. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 నగరాల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూణె, నాగ్ పూర్, థానే, ముంబై, అమరావతి, జల్ గావ్, నాశిక్, ఔరంగాబాద్ నగరాల్లో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. నాగ్ పూర్ లో గత 24 గంటల్లో 1800 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.కరోనా తీవ్రత పెరగడంతో మార్చ్ 15 నుంచి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది.  రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు.  మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహారాష్ట్రలో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్రంగా ఆందోళన చెందుతోందని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.మన దేశం కోవిడ్ రహితంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరూ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. నాగ్ పూర్ లో మళ్లీ లాక్ డౌన్ విధించాలనుకోవడం పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోందని పాల్ చెప్పారు. మళ్లీ సీరియస్ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నుంచి మనం రెండు విషయాలను నేర్చుకోవాలని... వైరస్ ను తేలికగా తీసుకోకూడదనేది తొలి విషయమని, కరోనా రహితంగా దేశం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలనేది రెండో విషయమని వీకే పాల్ తెలిపారు.  

చెల్లి దగ్గర అప్పు.. ఆపై తప్పు.. వాడు అసలు అన్నేనా?

వావివరసలు మరిచాడు. చెల్లి జీవితంతో ఆడుకున్నాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించాడు. డబ్బు కోసం పాడు పని చేశాడు. ఫోటోలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. అన్న చేతిలో మోసపోయానని గ్రహించిన చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చేస్తే, ఆ అన్న కటకటాలు లెక్కపెడుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిందీ దారుణం.  బీదర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి(26) హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఉండే యువతి చిన్నమ్మ కొడుకు నిఖిల్‌(27) ఫిలింనగర్‌ పరిధి మహాత్మాగాంధీ నగర్‌ సమీపంలో ఉంటున్నాడు. అతని అవసరాల కోసం చెల్లి వరుస అయిన ఆ యువతి నుంచి 50 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు వసూలు కోసం ఇటీవల అన్న ఇంటికి వచ్చింది చెల్లి. నిఖిల్‌ ఆమెతో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. ఆ మత్తులో ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు గుర్తు లేదు. ఆ మర్నాడు ఆ యువతి తన ఇంటికి వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత డబ్బులు అడిగేందుకు నిఖిల్‌కు ఫోన్‌ చేసింది. తాను డబ్బులు ఇవ్వనంటూ రివర్స్ అయ్యాడు నిఖిల్. నిద్ర పోయినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నట్లు తీసిన ఫొటోను వాట్సాప్‌ లో ఆమెకు పంపించాడు. అవాక్కైన ఆ యువతి వెంటనే అన్నకు ఫోను చేయగా.. ఆ రోజు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో చేయకూడని పని చేశానని.. విషయం ఎవరికైనా చెప్పినా, అప్పు తిరిగి అడిగినా ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అన్న చేసిన పనికి నిర్ఘాంతపోయిన చెల్లి.. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు నిఖిల్ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

త్వరలో సోము వీర్రాజు అవుట్! సీనియర్లకు హైకమాండ్ సిగ్నల్

సోము వీర్రాజు పని అయిపోయిందా? ఏపీ బీజేపీకి కొత్త సారథి రానున్నారా?  అంటే అవుననే సమాధానమే వస్తోంది. సోము వీర్రాజు తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ హైకమాండ్.. ఆయన స్థానంలో మరొకరికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ సీనియర్ నేత , మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు హైకమాండ్ కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. సోము వీర్రాజును మారిస్తే, ఆ స్థానాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ సన్యాసిరాజు పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు.  పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కష్టపడి పని చేస్తున్న తనకు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని తన లేఖలో కోరారు. సన్యాసి రాజు  రాసిన లేఖ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సోము వీర్రాజుకు చెక్ పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.  సోము వీర్రాజును మారుస్తున్నారనే  చర్చ బీజేపీ  వర్గాల్లో చాలాకాలం నుంచి జరుగుతోంది. వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టాక, పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. వైసీపీతో పోరాడటంలో విఫలమయ్యారని, సీనియర్లను మీడియా ముందుకు వెళ్లకుండా ఆంక్షలు విధించారని, అసలు పార్టీ అంతా నలుగురికే పరిమితమయిందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయకుండా.. వారికి మద్దతు ఇచ్చేలా సోము టీమ్ పని చేస్తుందనే ఆరోపణలు బీజేపీ నేతలే అంతర్గతంగా చేస్తున్నారు. సోము తీరుపై ఇప్పటికే కొంత మంది నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనతో లాభం లేదనుకున్న పార్టీ నాయకత్వం, కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాసిన సీనియర్ నేత సన్యాసిరాజుపై, పార్టీ సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆవిధంగా పార్టీ నాయకత్వానికి లేఖ ఎలా రాస్తారని, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించగా, తాను పార్టీ సీనియర్ కార్యకర్తనని, తననే బెదిరిస్తే సహించేలేదని సన్యాసిరాజు కూడా గట్టిగా జవాబు ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తగా నాయకత్వానికి లేఖ రాసే అధికారం, స్వేచ్ఛ తనకు ఉందని సన్యాసి రాజు చెబుతున్నారు. సోము వీర్రాజును మారిస్తేనే తనకు ఇవ్వాలని కోరానే తప్ప, ఆయనను తొలగించాలని కోరలేదన్నారు. తాను ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, హరిబాబు, కన్నా అధ్యక్షులుగా ఉన్న కమిటీలో పనిచేసిన సీనియర్ నాయకుడినని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వ పనితీరు గురించి తాను చెప్పనవసరం లేదని, నాయకత్వానికి అన్నీ తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, తన మాదిరిగానే లక్షలాదిమంది కార్యకర్తల కోరిక కూడా అదేనన్నారు. తాము వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడితేనే మరింత బలపడతామని అభిప్రాయపడ్డారు. అయితే ఇది మీడియాకు ఎలా లీక్ అయిందో తనకు తెలియదని, తనంటే గిట్టనివారెవరో దానిని లీక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి పార్టీ హైకమాండ్ కు సన్యాసిరాజు రాసిన లేఖ బీజేపీలో సంచలనంగా మారంగా.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోముకు చెక్ పడటం ఖాయమని... ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.  

తగ్గేదే లేదు.. వీల్‌ఛైర్‌లో ప్రచారం చేస్తా..

మొండిఘటం. గట్టిపిండం. ఐరన్ లేడీ. ఫైర్ బ్రాండ్ లీడర్. ఇవన్నీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సరిగ్గా సరిపోతాయి. కాలుకు దెబ్బతగిలినా, ఆసుప్రతిలో చేరినా.. తగ్గేదే లేదంటున్నారు దీదీ. అవసరమైతే వీల్ ఛైర్ లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేస్తానంటున్నారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ మీద నుంచే వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పనిలో పనిగా పీస్ మెసేజ్ కూడా పంపించారు. దీదీకి గాయం.. బీజేపీ విమర్శ.. వీడియో సందేశంతో ఎన్నికల వేళ బెంగాల్ దంగల్ యమ రంజుగా సాగుతోంది.  సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి జరగడంతో తృణమూల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీదీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార టీఎమ్సీ ఆరోపించింది. దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఘటనపై ఈసీ బాధ్యత తీసుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.    నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో దీదీ కాలికి గాయమైంది. అది ప్రమాదం కాదు ప్రతిపక్షాల దాడి అనేది తృణమూల్ ఆరోపణ. అయితే, అధికార పార్టీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు కమలనాథులు. ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బీజేపీ.   ఘటన తర్వాత బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం మమతా బెనర్జీ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘నందిగ్రామ్‌లో కారు ఎక్కుతుండగా ఒక్కసారిగా కొంతమంది నన్ను తోసేశారు. నా ఎడమకాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైంది. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రస్తుతం నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్‌ అయి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. అవసరమైతే వీల్‌ఛెయిర్‌లో కూర్చుని ప్రచారం చేస్తా. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’’ అంటూ మమతా వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

గురువారం రాత్రి ఫ్లై ఓవర్లు బంద్! 

హైద‌రాబాద్‌లోని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి 10 గంట‌ల నుంచి శుక్రవారం  తెల్ల‌వారు జాము వ‌ర‌కు మూత పడనున్నాయి. నగరంలోని అన్ని ప్లై ఓవర్లను మూసివేయాలని హైదరాబాద్ ‌ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్  అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మినహా హైద‌రాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి మూసివేయనున్నారు.జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో హైద‌రాబాద్‌లో అవాంఛనీయ ఘటనలు జ‌ర‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ లో ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో శుక్రవారం  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్  ఆంక్షలను గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిర్ పోలీసులు సూచించారు.  

100 ఏళ్ల మోదీ తల్లికి కరోనా వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతోంది. అనేక మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా, ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైతం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  ‘‘మా అమ్మ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను. వ్యాక్సిన్‌‌కు అర్హులైన వారందరూ టీకా వేయించుకోండి. ఇతరులను కూడా ఈ మేరకు ప్రేరేపించండి.’’ అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. వృద్ధుల కోటాలో హీరాబెన్ టీకా తీసుకున్నారు. ప్రస్తుతం మోదీ తల్లి వయస్సు 100 ఏళ్లు. ఆ వయసులో కూడా ఆమె ఎలాంటి భయం, బెరుకు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

14 రోజుల డెడ్‌లైన్.. సమ్మెతో ఉక్కు సమరానికి సై

విశాఖ ఉక్కు పోరాటం మరో దశకు చేరుతోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మెకు సై అన్నారు. కొన్ని వారాలుగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా.. ఫలితం లేకపోవడంతో ఇక ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీసు ఇచ్చారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు అందజేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.   విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు-కొనేదెవరు? అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు కొన్ని రోజులుగా విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇంత ఉధృతంగా ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం దిగిరాకపోగా.. ఇటీవల పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో నిరసనలు మరింత ఎగిశాయి. అది స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించి.. డైరెక్టర్‌ ను ఘోరావ్ చేసే దాకా వెళ్లింది. ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టి తీవ్ర స్థాయిలో తమ నిరసన తెలిపారు ఉద్యోగులు. అయినా, స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. స్టీల్ ప్లాంట్ సీఎండీకి సమ్మె నోటీసులు ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. 14 రోజుల డెడ్‌లైన్ పెట్టి.. ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మె చేపడతామని నోటీసులో తెలిపారు. 

మమత డ్రామాలో మరో డ్రామా  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  నందిగ్రామ్ లో  పర్యటిస్తున్న మమతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో స్వల్పంగా  గాయపడిన ఆమె కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఎడమ కాలు, నడుము, భుజం, మెడ తదితర భాగాల్లో గాయాలైనట్టు వైద్యులు చెబుతున్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారనీ.. తనను నెట్టివేసి కారు డోరు బలంగా విసరడంతో గాయాలయ్యాయంటూ మమతా దీదీ ఆరోపించారు.  నిజానికి ముఖ్యమత్రి పై దాడి జరగడం అంటే అది మాములు విషయం కాదు. అందునా ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా రాజుకోక ముందే ఏకంగా ముఖ్యమంత్రి పై దాడి జరిగిందంటే ఎనిమిది విడతల్లో  సుదీర్ఘంగా సుమారు రెండు నెలల పాటు సాగే ఎన్నికల క్రతువులో ఇంకెన్ని నేరాలు ఘోరాలు జరుగుతాయో అన్న సామాన్యులలో ఆందోళన కలగడం సహజం. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్ధులు సహా ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్ధులు, ప్రచారంలో పాల్గొనే నాయకులకు రక్షణ కలిపించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంటుంది. మమతా బెనర్జీ చేసిన ఫిర్యాదును బట్టి చూస్తే, ఆమెకు భద్రత కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ కూడా  ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ అయితే ఈ ఘటనకు సంబందించిన సీసీ కెమెరాల ఫూటేజిని విడుదలచేయాలని కోరడంతో పాటుగా, నిజానిజాలు అందరికీ తెలిసేలా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అయితే ఏకంగా సిబిఐ విచారణ డిమాండ్ చేశారు.  మరో వంక తృణమూల్ నాయకులు కార్యకర్తలు, రాష్ట్రం అంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ, బీపేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైళ్లను అడ్డుకున్నారు . ఈమొత్తం వ్యవహారానికి కొసమెరుపు ఏంటంటే.. గాయపడిన దీదీని పరామర్శించడానికి బీజేపే నాయకులు అసుపత్రికి వెళ్లారు. అయితే, వైద్యులు అందుకు అనుమతించలేదు అనుకోండి.అయినా, వారు తమ విచారణ వ్యక్తం చేసి, ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతునికి ఓ అర్జీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీదీ పై దాడి, కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా తృణమూల్ ఆడిన  డ్రామా అనుకుంటే, బీజేపీ నాయకులు ఇచ్చిన ట్విస్ట్..డ్రామాలో డ్రామా ..మరీ బాగుంది.