భద్రాచలం వద్ద గోదావరి వరద.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇక్కడ గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఆదివారం ఉ(ఆగస్టు 31) ఉదయం 9 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అగుడులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల మెట్లు నీట మునిగాయి. భక్తులు ఎవరూ గోదావరిలో స్నానాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండగా వరద ఉధృతితో తూరుబాక వద్ద ప్రధాన రహదారి నీట మునిగింది. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే  పలు ఏజెన్సీ మండ లాలు ముంపునకు గురయ్యాయి.  వీఆర్ పురం, కూనవరం, చింతూరులు జలదిగ్బంధంలో ఉన్నాయి.   

చిన్నబాబు నాడు చెప్పారు.. నేడు జరిగింది!

మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. పని మొదలు పెడితే పూర్తి చేయాలి. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావుండకూడదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే విశ్వసనీయత అంటే అదీ. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ జనం విశ్వాసం పొందేలా చెప్పింది చేసి చూపించిన పాపాన పోలేదు. నవరత్నాలంటూ ఆర్భాటంగా ప్రకటించిన పథకాల అమలు కూడా అరకొరగానే సాగింది. బటన్ నొక్కి సంక్షేమ సొమ్ము లబ్ధిదారులకు పందేరం చేశామంటూ ఘనంగా చాటుకున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఫలితమే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి చరిత్రలో మిగిలిపోయేటంతటి ఘోర పరాజయం ఎదురైంది.  అయితే మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. అంటూ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్ఘాటించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. అదే చేస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా రాయలసీమ జిల్లాలకు హంద్రీ నీవాతో నీళ్ళు అందిస్తామని నారా లోకేష్‌ చెప్పారు. చెప్పడమే కాదు..  శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు గ్రామంలో ఈ హామీని ఓ శిలాఫలకంపై చెక్కి మరీ ఆవిష్కరించారు.   గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు తాగఃగునీరు, సాగునీరు అందించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు. ఇప్పుడు అది సాకారమైంది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం (ఆగస్టు 30)  కుప్పంలో కృష్ణమ్మకి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా జనం నాడు లోకేష్ ఆవిష్కరించిన శిలా ఫలకం చూపి మరీ ఆయన తన మాట నిలబెట్టుకున్నారనీ, సాగు, తాగు నీరందించారని ఘనంగా చెప్పుకుంటున్నారు. పండుగ చేసుకుం టున్నారు.   ఒక పక్క వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపణలూ, విమర్శలూ గుప్పిస్తుంటే.. మరో పక్క నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.  ఇప్పుడు కృష్ణా జలాలను సీమకు అందించి కుప్పంలో గంగపూజ చేసి విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్ ను చాటారు. దీంతో వైసీపీ గళం మూతపడింది. కుప్పంకు కృష్ణాజలాలకు సంబంధించి వైసీపీ ఒక్కటంటే ఒక్క ముక్క మాట్లాడటం లేదు.   మంచిని చూడటానికి వారి నేత్రాలు, పొగడడానికి వారి నోళ్లు సహకరిస్తున్నట్లు లేదంటూ  వైసీపీ నేతలను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

హరీష్ రావుది దింపుడు కళ్లెం ఆశేనా?!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ప్రవేశపెట్టినా.. ఎలాంటి చర్యా తీసుకోవద్దనైనా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.  సరే కోర్టు నిర్ణయం ఏమిటన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేపెట్టి చర్చిస్తామన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ లు ఎందుకు అంత గాభరాపడిపోతున్నారు?  హరీష్ రావు శనివారం (ఆగస్టు 30) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శనివారం సాయంత్రం వరకూ హరీష్ రావు పిటిషన్ కోర్టులో విచారణకు రాలేదు. అదలా ఉంచితే.. కళేశ్వరం కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ లు పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చించిన తదుపరి మాత్రమే చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో నివేదికపై స్టే ఇవ్వడానికి అప్పట్లో కోర్టు నిరాకరించింది.  అయినా  హరీష్ రావు కాళేశ్వరం రిపోర్టునున అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ మరో సారి కోర్టును ఆశ్రయించారు. .  ఆయన గాభరా ఏమిటంటే.. ఒక సారి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే.. ఆ తరువాత ఆ నివేదిక చట్టబద్ధతపై కోర్టులు నిర్ణయం తీసుకోజాలవు.  అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు... ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్టబద్ధంగానే తీసుకోవాలి. అంటే చర్యల అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.   అయినా కూడా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతారంటేనే హరీష్ కంగారు పడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించేస్తున్నారా అన్నచర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అందుకే కాళేశ్వరం కమిషన్ నివదిక అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ పదే పదే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆక్టోబర్ లేదా నవంబర్‌లో జూబ్లీ‌ ఉప ఎన్నిక : కిషన్‌రెడ్డి

  దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఏర్పడిన జూబ్లీ‌హిల్స్ అసెంబ్లీ స్ధానానికి ఆక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోంది. బీసీల ఓట్లు అడిగి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేశానే జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికకు వెళ్లాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లు జూబ్లీహిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పాయల్ శంకర్‌తో పాటు గౌతమ్ రావు, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డిలకు అవకాశం కల్పించారు.

అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ వద్దు..హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్

  పీసీ ఘోష్ క‌మిష‌న్ కమీషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను శాసన సభలో  ప్రవేశ పెట్టొద్దని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు హౌస్ మోషన్‌ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వారు అనుమతినివ్వడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించి, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలలపాటు విచారణ జరిపిన పీసీఘోష్ కమిషన్.. జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది.  ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు బాధ్యులని తేలడంతో.. అసెంబ్లీలో చర్చించి.. అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారని లేదని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

సెప్టెంబరు 18 నుంచి శాసన సభ సమావేశాలు : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్ బిర్లా హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్‌ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారని  స్పీకర్‌  తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు తెలిపారు.  

స్థానిక సంస్థలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.  

దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం

  ఆగస్టు 29 నుండి పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ 24వ వార్షిక సమావేశం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, యువ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ రంగంలో తాజా ఆవిష్కరణలు, కొత్త చికిత్సా పద్ధతులు, అధునాతన శస్త్రచికిత్సా సాంకేతికతలపై చర్చించారు. 5 వేల మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తిరుపతి బర్డ్ హాస్పిటల్ సంచాలకులు డా. గుడారు జగదీష్ ఈ సమావేశంలో పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. “యువ రోగులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా వివరించారు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న రోగులకు దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే మోకాలి సమస్యల సందర్భాల్లో మోకాలి మార్పిడి అవసరం అవుతుందని వివరించారు. చిన్న వయసులో ఇలాంటి శస్త్రచికిత్సలలో ఎదురయ్యే సవాళ్లు, ఆపరేషన్ అనంతర జీవిత నాణ్యతలో వచ్చే మార్పులను విశ్లేషించారు. అదేవిధంగా చిన్న వయసులో జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? ఆపరేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. “ఉద్యోగం చేయలేక, ఇంటికే పరిమితం అయిన రోగుల జీవితాన్ని మార్చడంలో మోకాలి మార్పిడి ఆపరేషన్ కీలకం” అని డా. జగదీష్ అన్నారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సర్జన్ నైపుణ్యం, ఆపరేషన్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, నాణ్యమైన ఇంప్లాంట్ల ఎంపిక ప్రధానమని ఆయన పేర్కొన్నారు. తన అనుభవాలు, పరిశోధనల ఆధారంగా యువ రోగులకు ఈ శస్త్రచికిత్సలో పరిగణించాల్సిన అంశాలను వివరించారు. 1999లో బర్డ్ హాస్పిటల్‌లో 21 ఏళ్ల యువతికి చేసిన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహిళ ఆరోగ్యవంతంగా, చురుకుగా జీవిస్తున్నారని వివరించారు. ఈ తరహా ఉదాహరణల ద్వారా సరైన ఆర్థోపెడిక్ చికిత్సలతో యువ రోగులు కూడా పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆయన స్పష్టం చేశారు. డా. జగదీష్ ప్రసంగం యువ వైద్యులు, పరిశోధకులకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఈ సమావేశం ఆర్థోపెడిక్ వైద్య రంగంలో కొత్త పరిశోధనలకు, మెరుగైన చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

మోడీ చైనా టూర్ మేట‌రేంటి?

  ఆగ‌స్ట్ 29 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ మోడీ జ‌పాన్, చైనా ప‌ర్య‌టిస్తున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఆర్ధికాంశాలు ప్ర‌ధాన  పాత్ర పోషిస్తున్న‌ట్టు చెబుతున్నారు విదేశాంగ శాఖ అధికారులు. ప‌ది ట్రిలియ‌న్ జపాన్ ఎన్లు వ‌చ్చే ప‌దేళ్ల‌లో భార‌త్ లో పెట్టుబడుల వ‌ర్షం కురిసేలా తెలుస్తోంది. అస‌లీ యాత్ర మొత్తంలో చైనా షాంఘై కోప‌రేటివ్ స‌మ్మిట్ లోనే అస‌లు మేట‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. పుతిన్ తో స‌హా మొత్తం ఇర‌వై మందికి పైగా ప్ర‌పంచ నాయ‌కులు ఈ వేదిక మీద ఎక్కి ఒకేసారి క‌నిపించ‌నున్నారు. గ‌తంలో ర‌ష్యాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశాల త‌ర్వాత మోడీ.. పుతిన్, జిన్ పింగ్ ని క‌ల‌వ‌డం ఇదే. ఇప్ప‌టికే మోడీ చైనా ప‌ర్య‌టించి ఏడేళ్లు పూర్తి కావ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రంప్ మోడీ స‌ర్కార్ పై గ‌రం గ‌రంగా ఉండ‌టం తెలిసిందే. అమెరికా అప్పీళ్ల కోర్టు.. ఇలాంటి సుంకాల విధింపు అక్ర‌మం అని కోర్టు తీర్పునిచ్చినా ఆయ‌న సుప్రీం కెళ్లి త‌ద్వారా.. తాను అనుకున్న‌ది సాధించాల‌నుకుంటున్నారు. దీంతో మోడీ స‌ర్కార్ కూడా రూట్ మార్చింది. మ‌న వ‌స్త్ర ఉత్ప‌త్తులు దిగుమ‌తి పొందే 40 దేశాల్లో మేళాలు పెట్టి మార్కెటింగ్ పెంచి.. అమెరికా  నుంచి ఎదురు  కానున్న‌.. నష్టాన్ని పూడ్చే య‌త్నం చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే మోడీ ప్ర‌స్తుతం ఇటు పుతిన్ తో పాటు అటు జిన్ పింగ్ ని సైతం క‌ల‌సి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకునేలా తెలుస్తోంది. 2001లో ఆరు యురేషియా దేశాలతో మొద‌లైన ఎస్. సీ. ఓ.. ప్ర‌స్తుతం ఇర‌వైకి పైగా దేశాలతో పెద్ద కూట‌మిగా అవ‌త‌రించింది. ఇదిలా ఉంటే ఈ స‌మ్మిట్ ద్వారా గ్లోబ‌ల్ సౌత్ అనే కాన్సెప్ట్ ని కూడా తెర‌పైకి తెచ్చేలా తెలుస్తోంది. వీరంతా క‌ల‌సి వ‌చ్చే రోజుల్లో అమెరికా వ్య‌తిరేకంగా తీర్మానాలు తీస్కుంటే అదో గేమ్ ఛేంజ‌ర్ కానుంది. ఇప్ప‌టికే యూరోలా బ్రిక్స్ దేశాలు సైతం ఒక క‌రెన్సీని ఎంపిక చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు మొద‌లు పెడితే డాల‌ర్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గం ప‌డిపోతుంది. ఆపై ఈ బ్లాక్ మెయిల్ డ్రామాలకు ఇక కాలం చెల్లిపోతుంది. ఇలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యంగానీ ఈ స‌మ్మిట్ ద్వారా ఒక్క‌టి బ‌య‌ట‌కొచ్చినా చాలు ట్రంప్ ఖేల్ ఖ‌తం దుక‌ణం బందేనంటున్నారు. ఇవే కాకుండా ఆర్ధిక- ర‌క్ష‌ణ- సైనిక ప‌ర‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కూడా ఈ దేశాలుగానీ చేసుకోవ‌డం మొద‌లైతే అమెరికా, దాని వెన‌కున్న యురోపియ‌న్ దేశాలు దాదాపు ఒంట‌రిగా మిగిలిపోతాయి. వీట‌న్నిటిలోకీ యూఎస్ పెద్ద‌న్న పాత్ర దారుణంగా  ప‌డిపోయి బ‌ల‌హీన  ప‌డుతుంది. ఇలాంటిదేదో ప్లాన్ చేయ‌డానికే భార‌త్, 2020 నాటి స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల‌ను మ‌ర‌చిపోయి చైనాతో చెలిమి చేయ‌డాన‌కి ముందుకొస్తోంది. దానికి తోడు ఇటు పాకిస్తాన్,  అమెరికా పంచ‌న చేర‌డంతో చైనా కూడా భార‌త్ వైపే మొగ్గు చూపించేందుకు ముందుకొస్తోంది. అందుకే ఆగ‌స్ట్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భార‌త్ ప‌ర్య‌టించి.. చైనా రావ‌ల్సిందిగా మోదీకి జింగ్ పింగ్ పంపిన ఆహ్వాన ప‌త్రం అందించారు. అందులో భాగంగా మోడీ ఇటు జ‌పాన్ తో ఆర్ధిక అటు చైనాతో దౌత్య ప‌ర‌మైన స‌ర్దుబాట్ల కోసం ఈ గ్రాండ్ టూర్ వేశార‌ని అంచ‌నా వేస్తున్నారు దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాలు కలిసి రావాలి : సీఎం రేవంత్‌ రెడ్డి

  ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వామపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో  ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మా పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి కడదాకా పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎదిగారని అన్నారు. దాదాపు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడనే ఉన్నారని చెప్పారు. సామాజిక చైతన్యం ఉన్న నాయకుడు అని అన్నారు.  పేదల జీవితాల్లో మార్పు రావాలని నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా తాము కూడా ప్రయత్నం చేస్తామని.. త్వరలోనే క్యాబినేట్‌లో చర్చించి  ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు. వారి కంటే గొప్పగా ఆ పాత్రను ఇంకెవరూ పోషించలేరని అన్నారు. కొందరు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. బిహార్‌లో ఐదు లక్షల ఓట్లు మాయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని కోరారు.  

కుప్పానికి కృష్ణ‌మ్మ‌...అప‌ర‌భ‌గీర‌థుడు చంద్ర‌బాబు

  అస‌లేంటి హంద్రీనీవా ప్రాజెక్టు దీని పూర్వాప‌రాలు ఎలాంటివి అని చూస్తే.. రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన. మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు. సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్లు  ఖరీఫ్‌ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీలు  త్రాగునీటి సదుపాయం కల్పన. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల ద‌గ్గ‌ర‌ ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు. మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. ఉంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్‌ సుమారు 672 మెగావాట్లుగా ఉంది. ప్రాజెక్టు దశల విష‌యానికి వ‌స్తే.. ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు వెళ్తుంది. ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీల నీరందిస్తుంది. ఇక ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుండ‌గా..  4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీల మేర అందిస్తుంది. మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే..  కృష్ణగిరి – 0.161 TMC కాగా,  పాతికొండ – 1.126 TMC,  జీడిపల్లె – 1.631 TMC, కాగా మరాల – 0.465 TMC,  శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMCగా ఉంది. అదవిపల్లె – 1.814 TMCలుగా ఉంది.  బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే.. గోల్లపల్లె – 1.913 TMC మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌పై, చెర్లపల్లె – 1.608 TMC పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌పై బ్రాంచ్‌ కెనాళ్లు, ఇక‌  డిస్ట్రిబ్యూటరీలు, మడకశిర బ్రాంచ్ కెనాల్  235.435 Km – 61,557 ఎకరాలు, పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు, తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు, నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు, వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ..  42.30 Km – 22,400 ఎకరాలు, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు, సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్‌ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం కానుంది. దీని పొడవు: 220.350 Km. జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు  అంటూ చిత్తూరు జిల్లా  వరకు ఉంటుంది.  ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్  పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది. 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం. పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుప్పం చివ‌ర్లోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది. దీన్నిబ‌ట్టీ చూస్తే.. చిత్తూరు జిల్లా చివ‌రి ఆయ‌క‌ట్ట వ‌ర‌కూ కృష్ణాజ‌లాలు ప్ర‌వ‌హించడం ఒక చ‌రిత్ర‌, 2014 నుంచి 2019 మ‌ధ్య వ‌ర‌కూ నాలుగు వేల కోట్ల వ‌ర‌కూ వెచ్చించిన చంద్ర‌బాబు 2024 లో తిరిగి పీఠ‌మెక్కాక‌.. నెల‌లో మెయిన్ కెనాల్ పూర్తి చేసి.. కృష్ణా జ‌లాల‌ను ఎట్ట‌కేల‌కు కుప్పం చేర్చారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను అప‌ర భ‌గీర‌థుడ‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ ప్రాంత వాసులు.  

అపర భగీరథుడు చంద్రబాబు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దార్శనికుడు!

గంగానదిని భూమికి తీసుకువచ్చిన పౌరాణిక రాజు భగీరథుడైతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు ఆధునిక భగీరథుడిగా మారారు. రాయలసీమలోని   తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో కృష్ణాజలాలు అన్నది ఎన్నటికీ నెరవేరని కలలా అనిపించినది.. ఇప్పడు వాస్తవంగా మారింది. ఇది చంద్రబాబు దార్శనికతకు, ఆయన పట్టుదలకు, అనుకున్నది సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా  ముందుకు సాగే తీరుకు కుప్పం చేరుకున్న కృష్ణాజలాలే ప్రత్యక్ష, సజీవ నిదర్శనంగా చెప్పవచ్చు.  ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా జలాల్లో పడవ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్న క్షణాలు స్థానికులను ఉద్విగ్నతకు గురి చేశాయి.    శ్రీశైలం నుండి హంద్రీ-నీవా  కాలువ ద్వారా కుప్పంకు చేరుకున్నాయి.  కేప్పం చేరుకున్న కృష్ణా జలాలను పూజలు చేసి, జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ..  రాయలసీమకు నీటిని తరలించడం అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లక్ష్యం, కల అని చెప్పారు.    శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ ఒకప్పుడు  రత్నాల సీమ.. అయితే ఇప్పుడది రాళ్ల సీమగా, కరవు సీమగా మారిపోయింది. ఈ పరిస్థితి మార్చాలన్న చంద్రబాబు కృతనిశ్చయమే ఇప్పుడు ఈ జలసిరి. 1999లో  చంద్రబాబు హంద్రీనీవాకు పునాది వేశారు.  2025 నాటికి  కృష్ణ జలాలను  తీసుకురావగలిగారు.  భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కృష్ణా జలాలలో పడవ ప్రయాణం చేశారు.   

కేటీఆర్, హరీష్ అరెస్ట్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు  శనివారం  ప్రారంభమైన సంగతి  తెలిసిందే. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు సంతాపతీర్మానాలకే పరిమితమయ్యాయి. సంతాప తీర్మానాలను ఆమోదించిన తరువాత సభ వాయిదా పడింది.  అసెంబ్లీ నుంచి నేరుగా  సెక్ర‌టేరియ‌ట్‌కు చేరుకున్నకేటీఆర్, హరీష్ రావులు  రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసు వాహనం లోంచే మీడియాతో మాట్లాడారు. యూరియా దొరకక రైతులు ఆత్మహత్యలే గతి అనుకునే పరిస్థితికి వచ్చారనన్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేటీఆర్, హరీష్ రావులను ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ ను తరలించారు.  

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే : మంత్రి కోమటిరెడ్డి

  మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలిని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కేసిఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు..ఆయన హయంలోనే కూలిందన్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి..సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు..మంచి పేరున్న న్యాయ మూర్తి ఆయన అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.  కమిషన్ కమిటీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని దానికి భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు పోయారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు..బాధ్యత ఆయనపై ఉంటదని  వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం పై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌంట్ చేయకుండా.. మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు. కాళేశ్వరం పూర్తి నివేదిక, కంప్లీట్ గా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్న..కేసీఆర్ శాసన సభకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన తెలిపారు. కాళేశ్వరం పై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు...వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు  

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వీరిద్దరి పేర్లను  ఆమోదించి గవర్నర్‌కి  సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం తీసుకుంది. గతంలో కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.  అమీర్‌ అలీఖాన్‌ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించారు.ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకాలను బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీం.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.  మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సర్వోన్న న్యాయస్ధానం అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తానేకే  కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమని భావించాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌ హస్తం పార్టీ అభ్యర్థి ఎవరై అనేది సస్పెన్స్‌ గా మారింది

సుంకాల ‘ట్రంప్’ కు కోర్టులో ఎదురు దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఏది చేసిన అదొక సంచలనమే. నిజానికి.. కొన్ని కొన్ని నిర్ణయాలు కేవలం సంచలన సృష్టించడం కోసమే చేస్తుంటారా? అని కూడా అనిపిస్తుంది. అందుకే.. అగ్ర రాజ్యం అధినేత, అనే విషయం మరిచి పోయి ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే  నిర్ణయాలు అనేక సందర్భాలలో నవ్వుల పాలవుతున్నాయి. అమెరికా ప్రజలనూ నవ్వుల పాలు చేస్తున్నాయి. అందుకే, అమెరికా ప్రజలు కూడా  ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైనప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అదలా ఉంటే.. గత కొంత కాలంగా ‘ట్రంప్’ కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లుగా, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, ఇతర దేశాల విషయంలో అనవసర జోక్యం చేసుకోవడమే కాకుండాజజ  అన్నిటికీ  నేనే..నేనే అంటూ ప్రగల్బాలకు పోతున్నారు. సొంత డబ్బా గట్టిగా కొట్టు కుంటున్నారు. అంతే కాదు  భారత్ సహా ఆయన ప్రగాల్బాలకు జై కొట్టని దేశాలపై  పిచ్చివాడి చేతిలో రాయి చందంగా  సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు.   అయితే..   సుంకాల ట్రంప్  నెత్తిన అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు మరో మారు మొట్టికాయ వేసింది. ట్రంప్  విధించిన సుంకాలు చట్ట విరుద్ధం అని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీగా టారిఫ్ లు విధించారని పేర్కొంది. అయితే పెంచిన టారిఫ్ లను అక్టోబర్ వరకు కొనసాగించడానికి, అదే విధంగా తమ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది.కాగా.. అప్పీల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడతామని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అయితే కోర్టుల వ్యవహారం ఎలా ఉన్న ట్రంప్  ఎడాపెడా సుంకాలు విధించడం అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే !

  ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఋషికొండ ఐటీ హిల్ లోని మిలీనియం టవర్స్ లో ఈ సంస్థ కార్యకలాపాలకు అనువుగా భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ మిలీనియం టవర్ లోని 16 17 బ్లాక్ లకు తీసేసి కంపెనీ పేరుతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తొలిదశలో రెండు షిఫ్ట్ లలో 2000 మంది ఉద్యోగులతో కార్యకర్తల అప్పాలు ప్రారంభించనున్నారు. ఈ సంఖ్యను క్రమంగా 6000కు పైగా పెంచే అవకాశాలు ఉన్నాయి.  అందుకు తగ్గ భవనాలను మిలీనియం టవర్స్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ ఇదే . తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టిసిఎస్ ప్రయత్నిస్తుంది. 1370 కోట్ల పెట్టుబడితో 12000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక దిశగా ఐటి హిల్ 3 పై 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది.  

బాబుపై నమ్మకంతో పెట్టుబడుల వరద.. ఏపీలో పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారడం ప్రారం భమైంది.   ఇందుకు తాజా తార్కానంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఏకం గా 30 పరిశ్రమలు,  53 వేల922 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్ర మల ద్వారా 83 వేల437 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.