కరెన్సీ నోట్లతో గణనాథుడికి అలంకరణ

గణపతి నవరాత్రి ఉత్సావాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి పందిళ్లను నిర్వాహకులు వినూత్న రీతిలో అలంకరణలు చేస్తున్నారు. అయితే మంగళగిరిలో కొలువైన గణపతిని అలంకరించే విషయంలో నిర్వాహకులు మరింత వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా గణనాథుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం ఏకంగా 2 కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీని ఉపయోగించారు.  గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారిని రూ.2.35 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు  పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ఏపీని వదలంటున్న వానలు.. వచ్చే నెలలో రెండు అల్పపీడనాలు!

ఆంధ్రప్రదేశ్ ను వానలు వదలనంటున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్న ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నెలలో మరో రెండు అప్పపీడనాల కారణంగా మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   దశలో సెప్టెంబర్ నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా  వేస్తోంది. సెప్టెంబర్ మూడో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్యదిశ గా పయనించి సెప్టెంబర్ ఐదు నాటికి వాయుగుండం గా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.  వీటి కారణంగా సెప్టెంబర్ మొదటి రెండు వారాలూ ఏపీకి , మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

శివలింగాకృతిలో రెండు టన్నుల లడ్డూ!

గణపతి నవరాత్రులు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గణేష్ మండప నిర్వాహకులు వినూత్నంగా ఆలోచనలు చేసి వివిధ రూపాలలో గణనాథులను ప్రతిష్టించి సృజనను చాటుకుంటున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ స్వీట్ షాప్ నిర్వాహకుడు గణపతికి సమర్పించే లడ్డూ విషయంలో కూడా కొత్తగా ఆలోచించారు. శివలింగాకృతిలో రెండు టన్నుల భారీ లడ్డూను రూపొందించారు.   విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్ లో అక్కడి నిర్వాహకులు లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతికి నైవేద్యంగా ఈ లడ్డూను సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్  తెలిపారు.  15 మంది సిబ్బంది నాలుగు రోజుల పాటు శ్రమించి, 8 అడుగుల ఎత్తు, 2 వేల కిలోల బరువు   లడ్డూని శివలింగం ఆకృతిలో తయారు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఇది అత్యంత భారీ లడ్డూ అని చెప్పిన ఆయన.. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించే అవకాశం ఉందన్నారు.  ఈ భారీ లడ్డూను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి  భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం (ఆగస్టు 29) రాత్రి దీనిని గాజువాకకు తరలించారు.  

విశాఖలో జనసేన బహిరంగ సభ

 విశాఖలో సేనతో సేనాని పేరిట జనసేన శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ కోసం  రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున  జనసేన క్రియాశీల  కార్యకర్తలు విశాఖ నగరానికి చేరుకున్నారు.  విశాఖ వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో బస చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది క్రియశీలక కార్యకర్తలు ఈ బహిరంగ సభ కు హాజరయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ బహిరంగ సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు.   విశాఖ నగర వ్యాప్తంగా జనసేన జెండాలు, ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు.  

ప్రియుడి కోసం భర్తను అంతమొందించిన భార్య

  తన భర్త నిద్రలో చనిపోయాడంటూ ఓ భార్య 100 డయల్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్య చేకితులయ్యారు.  అనుమానాస్పద మృతి కేసునమోదు చేసుకొని విచారించగా పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో.. పోలీసులు ఎంక్వ యిరీ చేయడం మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి... దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... జెల్లెల్ల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు వీరు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ సెవెన్‌లో  నివాసం ఉంటున్నాడు. శేఖర్ డ్రైవర్‌గా  పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడ ప్పుడు రెండు మూడు రోజులు లేదంటే వారం రోజులు బయటికి వెళ్తూ ఉంటాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై భర్త బయటికి వెళ్లిన సమయంలో చిట్టి కి హరీష్‌తో పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే భార్య ప్రవర్తన పై అనుమానం కలిగి భర్త శేఖర్ పలుమార్లు తన భార్య చిట్టిని హెచ్చరించాడు.  కానీ చిట్టి ప్రవర్తన లో మార్పు రాలేదు ప్రియుడిని విడిచి ఉండలేక పోయింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఫ్లాన్ వేసింది. పథకం ప్రకారమే చిట్టి తన ప్రియుడు హరీష్ తో కలిసి నిద్రపోతున్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్రలో చనిపో యాడంటూ లబో దిబో మొత్తు కుంటూ 100 కి ఫోన్ చేసింది... తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా చిట్టి ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వినాయక నిమజ్జనం ఊరేగింపులో పేలుడు

  నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న వినాయక విగ్రహంతో పాటు టపాసులు ఒక్కసారిగా పేలడంతో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో ఒక ట్రాక్టర్‌లో వినాయక విగ్రహాన్ని, మరో ట్రాక్టర్‌లో బాణాసంచాను ఉంచి తీసుకువెళ్తున్నారు.  ఊరేగింపులో జరుపుతున్న బాణాసంచా ట్రాక్టర్‌లో ఉన్న టపాసులపై పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పదిమంది చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన చిన్నారులను వింజమూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యా సంస్థల్లో ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి : సీఎం రేవంత్‌

  స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ,బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని ఆ విషయం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. ప్ర‌తి విద్యాసంస్థ‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో పీఈడీలను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.  బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని విద్యా అధికారులకు సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, టాయిలెట్ గదులు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని మఖ్యమంత్రి తెలిపారు. కంటైన‌ర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు.  అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు .మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి తేవడం ద్వారా నాణ్య‌తా‌ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నం తేలికవుతుందని అధికారులకు సూచించారు.  

డ్రగ్స్ దందాలో కొత్తరకం మాఫియా

  పుష్ప సినిమా ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే... అదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు కూడా సంచలనం సృష్టి స్తున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. ఓ మాఫియా కొత్తరకం డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఈ ముఠాలు పుష్ప సినిమాను మించి.. కొత్త కొత్త తరహాలో  డ్రగ్స్ సరఫరా చేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికా రులు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ ఉంటే... మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలు రకరకాల వస్తువుల మాటున వివిధ రకాల డ్రగ్స్ లను ఏదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు  ప్రముఖ యూనివర్సిటీ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలక పాత్ర వహించిన ముగ్గురు విద్యార్థు లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యూని వర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలమైన విష యాలు బయట పడ్డాయి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుం దని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా... కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 10 కొరియర్ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.  ఈ డ్రగ్స్ ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో  ఉన్న మెడికల్ కాలేజీలు మరియు ఇంజ నీరింగ్ కాలేజీల విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ విక్రయాలు జరుపు తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠాలు పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలు మొత్తం 36 రకాల వస్తువుల తినుబండారాల మాటున డ్రగ్స్ ని హైదరాబాదు నగరానికి పంపిస్తున్నారు. కొరియర్ సర్వీసులలో డ్రగ్స్ తో కూడిన వస్తువులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  ఈ ముఠాలు ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా యూనివర్సిటీ హాస్టల్ లోపలికి మారుతి కొరియర్స్ ద్వారా ఓజీ డ్రగ్స్ పుస్తకాల మధ్యలో పెట్టి పంపిస్తు న్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కాస్మెటిక్ డబ్బాలో డ్రాప్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మల్నాడు డ్రగ్స్ నిందితులకు ఫుడ్ ఆర్టికల్స్ రూపంలో డ్రస్ సరఫరా చేశారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారవేత్తలకి ఫుడ్ ఆర్టికల్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు. మరికొందరికి మట్టి గాజుల మాటున ఎఫిడ్రిన్ పొట్లాలను కొరియర్ ద్వారా డ్రగ్స్ తరలిస్తు న్నారు. కొరియర్ సంస్థలు కమిషన్కు కక్కుర్తి పడి డ్రగ్స్ ముఠాలకు సహక రిస్తున్నట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు..

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నిట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఆయన హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని జగదీశ్ అని సమాచారం.  ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ శ్రీకాంత్ విచారణ జరుపుతుమన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తున్న రౌడీషీర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో అంశం తన దృష్టిలో ఉందని ఎస్పీ.  విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నని ఎస్పీ తెలిపారు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని సుప్రీంలో పిటిషన్

  లంబాడీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు పిటిషన్ వేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని, వేరే రాష్ట్రల నుండి వచ్చి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని  ఎమ్మెల్యే తెల్లం  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే  మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.

ప‌వ‌న్ ధ‌రించిన... ఈ ఉంగ‌రంలో ఇంత అర్ధ‌ముందా?

  విశాఖ సేన‌తో సేనాని విస్తృత స్థాయి స‌మావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు అటు ఇటు ఆడిస్తూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వేలికి ప్ర‌త్యేకించి ఒక ఉంగ‌రం ధ‌రించిన‌ట్టు క‌నిపించింది. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌క‌ర‌కాల ఉంగ‌రాలు ధ‌రిస్తూ క‌నిపిస్తున్నారు. వాటిలో ప‌గ‌డం.. ఉంగ‌రం ఆపై మేరు కూర్మ‌ ఉంగ‌రం.. ప్ర‌స్తుతం చూస్తే నాగ‌బంధ ఉంగ‌రం క‌నిపించించింది. దీని అర్ధ‌మేంట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో ఆయ‌న కూర్మం ఉండే మేరు ఉంగ‌రం ధ‌రించేవారు. మాములుగా ఇది ఎందుకంటే మేరు  ప‌ర్వ‌తాన్ని పాల స‌ముద్రంలో వేసి వాసుకి ద్వారా చిల‌క‌డానికి ప‌నికొస్తుంద‌ని అంటారు. ఆ ప‌ర్వ‌తం మ‌రీ స‌ముద్రంలోప‌ల మునిగి పోకుండా ఆపడానికి పుట్టుకొచ్చిందే కూర్మావ‌తారం. ఆ అవ‌తారం అర్ద‌మేంటంటే ఏదైనా స‌రే మునిగిపోకుండా ఆపేద‌ని అర్ధం. దాని ప్ర‌కారం కూట‌మిలో తానొక కూర్మావ‌తారం దాల్చి ఎలాగోలా గ‌ట్టించ‌గ‌లిగిన పేరు సాధించారు ప‌వ‌న్. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌భుత్వం 15 ఏళ్ల వ‌ర‌కూ ఉండాల్సిందే అంటున్నారు. కార‌ణం.. ఇటు రాజ‌ధాని అమ‌రావ‌తి కానీ, అటు రాష్ట్రం కానీ స్థిర‌ప‌డి అభివృద్ది చెందాలంటే.. ఈ మాత్రం స‌మ‌యం అవ‌స‌రం అన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌. ఈ విష‌యంపై నేరుగా జ‌న‌సైనికులు నాగబాబునే మొహాన్నే అడిగేసిన ప‌రిస్థితి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అధినేత తీస్కున్న నిర్ణ‌యాన్ని మ‌నం ఎవ్వ‌రం మార్చ‌లేము అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేస్తున్నారు నాగ‌బాబు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ధ‌రించిన ఈ నాగ‌బంధ ఉంగ‌రంలో ఒక బంధం ఉంటుంది. రెండు పాములు పెన‌వేసుకున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఇది టీడీపీ కూట‌మితో త‌న పార్టీ బంధం ఇలాగే పెన‌వేసుకోవాల‌న్న కోణంలో ప‌వ‌న్  క‌ళ్యాణ్ ఇలాంటి ఉంగ‌రం ధ‌రించిన‌ట్టుగా భావిస్తున్నారు ప‌లువురు అభిమానులు.  

పిన్నెళ్లి సోదరుల బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ లను పరిశీలించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో   పిన్నెల్లి బ్రదర్స్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించింది. వారి బెయిలు పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వారికి బెయిలు ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదరించే చాన్స్ ఉందని  కోర్టుకు తెలిపారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును  రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం (ఆగస్టు 29) తీర్పు వెలువరించింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు.  ఇంతకీ కేసేమిటంటే.. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో పిన్నెల్లి బ్రదర్స్‌ సహా హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.   

డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా వైజాగ్ నగరం ఎదుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటకులు విశాఖను పర్యావరణరహితంగా మార్చాలి తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కోరారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వైజాగ్‌లో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా వైజాగ్ ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని సీఎం తెలిపారు. హాప్ ఆన్ హాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కి.మీ మేర పరుగులు పెట్టనున్నాయి. రూ. 250తో రోజాంతా ప్రయాణించవచ్చు.

మూసీ వరద.. జంటనగరాల్లో పలు చోట్ల రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు పైకెత్తి 4100 క్యూసెక్కుల నీటినీ, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 23వందలక్యూసెక్కుల నీటిని మూసిలోకి వదలడంతో మూసీనది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో  బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద ధాికి  బ్రిడ్జ్ పిల్లర్లు  డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిని మూసివేయడంతో అంబర్ పేట, దిల్ షుక్ నగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.  

కామ్రేడ్ల కుర్చీ పోరు

  క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టుల్లో , ప్రజాసామ్యయుతంగా నడిచే ప్రజా ఉద్యమాల పార్టీ సీపీఐలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నాయకులు చెప్పినట్లు నడుచుకునే సీపీఐ నేతల్లో పదవీ కాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్ధితి ఏర్పడింది. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్ధంతరంగా ఆగిపోయింది.   కౌన్సిల్, కార్యదర్శివర్గం ఎన్నిక జరిగినా..కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే ఒంగోలులో జరిగిన 3 రోజుల మహసభలను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాట వేశారు. మూడు రోజుల పాటు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను చర్చించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిగింది. దానితో పాటు నూతన సారథిని ఎన్నుకోవాల్సి ఉంది.  పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ మూడు పర్యాయాలు కంటే ఎక్కువ సార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయాడానికి వీలు లేదు.  రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపధ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజు తో పాటు, పార్టీ నాయకత్వంపై క్యాడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది. మహాసభ చివరిరోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తరువాత రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా  పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు. అయితే పార్టీ నిబంధల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైన పోటీ పడవోచ్చు. దాంతో ముప్పాళ్ల పేరు ప్రతిపాదించగానే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్ధానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవ్వాకయ్యారు. అయితే అప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారంట.  అయితే రామకృష్ణ ముప్పాళ పేరు తెరమీదకు తీసుకురావడంతో ఈశ్వరయ్య పోటీకి రావడం, ప్రజాస్వామ్య యుతంగా పోటీ పెట్టాలని కోరడంతో చేసేది ఏం లేక ఈశ్వరయ్య ను సమూదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారు. ముప్పాళ వయస్సులో పెద్దవారు. పార్టీ నిబంధన ప్రకారం 75ఏళ్లు వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్క సారి ముప్పాళ నాగేశ్వరరావుకి అవకాశం ఇద్దాం.. తరువాత నువ్వు సెక్రటరీ అవ్వవచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంట. ప్రజాస్వాయ్యపద్దతిలో ఎన్నిక జరగాలి, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పడంతో కార్యదర్శి పదవి తరువాత చూద్దాం అంటూ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. మరోపక్క ఈశ్వరయ్య అనుచర వర్గం కూడా ఓటింగ్ పెట్టాలని ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్యే గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారంట. అదే కనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ ఆగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికలను వాయిదా వేసిందంటున్నారు.  ఇప్పటి వరకు ఇటువంటి పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ సీపీఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ లీడర్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని, దాని ప్రభావం కారణంగానే ముప్పాళ పేరు తెరమీదకు వచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది క్యాడర్ వ్యక్తం చేస్తోంది.  బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే  కారణంతోతే వాయిదా వేశారనే వాదన వినిపిస్తుంది. ఒంగోలులో జరిగిన మహసభలో ఆ జిల్లా క్యాడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నినదించడంతో పార్టీ చరిత్రలో ఒంగోలు సభ నిలిచిపోతుందని, ఇటువంటి మహసభ ఇప్పటివరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందంట. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి క్యాడర్‌కి మధ్య దూరం ఏవిధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కమ్యూనిస్టుల్లో కూడా అంతర్గత కుమ్ములాటల ఇప్పుడు బహిర్గతం అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. పదవీ కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదన్న విమర్శలు వస్తున్నాయి.  

తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు.. మరో ఆరు రోజులు వానలే వానలు

ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వదలడం లేదు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మరో ఆరు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు, ఉత్తర తెలంగాణలకు వర్షం ముప్పు అధికంగా ఉందని పేర్కొంది.  ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలా ఉండగా ఏపీలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ  కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

కొనసాగుతున్న లేడీ డాన్ అరుణ విచారణ

  లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు  విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం సాయంత్రం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు.  ఈ విచారణ లోనే అరుణ నుండి మరిన్ని విషయాలు రాబట్టడం తో పాటు ఆమె ఫోన్ లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరుణ ఫోన్‌లో  ఎలాంటి సమాచారం ఉంది. ఆ సమాచారం బయట వస్తె ఎలాంటి  రహస్యాలు బయటకు వస్తాయి. అనేది తీవ్ర ఉత్కంఠ  నెలకొంది. ఇదే సమయంలో లేడీ డాన్ అరుణ తో సన్నిహితంగా వున్న అనేక మంది పెద్దలు గుండెల్లో గుబులు మొదలైంది. రాబోయే మూడు రోజులు కొందరికి అగ్నిపరీక్ష కానుంది

రిషికొండ ప్యాలెస్‌‌లో ఊడిన పెచ్చులు..పరిశీలించిన డిప్యూటీ సీఎం

  విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్‌‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్స్ సీలింగ్ షీట్లు విరిగిపడినాయి. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్నడిప్యూటీ సీఎం ... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు.  గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ నూతన భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు.  రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను  పవన్ ఆదేశించారు.