ఉల్లి రైతులకు చంద్రబాబు తీపి కబురు

  ఘాటైన ఉల్లిపాయలు పండించే కర్షకులకు ఏపీ  సీఎం చంద్రబాబు చల్లని వార్త చెప్పారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో  ముఖ్యమంత్రి  తాజాగా  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. వెంటనే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున .. అంటే కేజీ రూ.12కు ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు.  కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఉల్లికి రేటు వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతో పాటు ఆధునీకికరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని  సీఎం దిశానిర్దేశం చేశారు.

మత్తు కలిగించే దగ్గు మందు బాటిళ్లు పట్టివేత

    గంజాయి, డ్రగ్స్‌ లభించక పోవడంతో డ్రగ్స్‌ మత్తుకు అలవాటు పడిన  వ్యక్తులు నిషేధిత దగ్గు మందు టానిక్‌లను తాగి మత్తులో మునిగిపోతున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు, ఎస్సై రవి, సిబ్బంది కలిసి పక్కా సమాచారంతో సరూర్‌నగర్‌ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్‌ అనే వ్యక్తిని రోడ్‌ నెంబరు 6 అష్టలక్ష్మీ టెంపుల్‌ మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 కోడిన్‌ పాస్పెట్‌ దగ్గుమందు బాటిళ్లను కొనుగోలు తీసుకొని బైక్‌పై వెళ్తుండగా  పట్టుకున్నారు. రూ.190 ఎంఆర్‌పీ ధర కలిగిన ఈ దగ్గు మందు బాటిల్స్‌ను లక్ష్మాణ్‌ తన  ఇంట్లో పెట్టుకొని రూ. 350 ఒక బాటిల్‌ను అమ్మకాలు చేపడుతున్నట్లు  విచారణలో వెల్లడయ్యింది. కోడిన్‌ పాస్పెట్‌ బాటిళ్లను డ్రగ్స్‌ ఆధారిటీ గతంలో నిషేధించారు. దగ్గు మందును డాక్టర్‌ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాలి. కాని కొందరు అక్రమంగా దగ్గు మందును తయారు చేస్తూ ఎవ్వరికి అనుమానం  రాకుండా అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో మత్తు కలిగించే గంజాయి ప్యాకెట్‌ ధర రూ. 500 ఉంది. ఒక గ్రాము ఎండిఎంఎ డ్రగ్‌ విలువ రూ. 5000 వేలు ఉంది.  అంత డబ్బుతో  కొనుగోలు చేయలేని వారు, మత్తుకు బానిసగా మారిన వారు ఇలా  మార్కెట్‌ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న దగ్గు మందును  వాడి మత్తులో మునిగి పోతున్నారు.ఇలాంటి నిషేధిత మత్తు మందులను అమ్మకాలు జరుపుతున్న మెడికల్‌  హల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు డ్రగ్స్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.ఇలాంటి నిషేదిత కోడిన్‌ పాస్పెట్‌ మందును పట్టుకున్న సిఐ, సిబ్బందిని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌, ఏఈఎస్‌ జీవన్ కిరణ్  అభినందించారు.

హైదరాబాద్‌కి బీచ్ రాబోతోంది

  హైదరాబాద్‌లో తొలి ఆర్టిఫీషియల్ బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్ గూడ సమీపంలో నిర్మించనున్నారు. బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో 225 కోట్ల ప్రాజెక్టులో వ్యయంతో దీని నిర్మాణం డిసెంబర్ 2025లో ప్రారంభమవుతుంది. బీచ్‌సైడ్ ఫీల్ రావడానికి..సహజ సిద్ధమైన సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.  ప్రాజెక్టులో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్ళు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు & ఫుడ్ కోర్టులు ఉంటాయి. తేలియాడే విల్లాలు మరియు స్టార్-కేటగిరీ హోటళ్ళు.. బంగీతో సహా సాహస క్రీడలు ఉంటాయి. జంపింగ్, సెయిలింగ్, స్కేటింగ్ మరియు శీతాకాలపు ఆటలు.. పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలు వినోదం మరియు విశ్రాంతి సౌకర్యాలు కల్పించనున్నారు. థియేటర్లు, ఫుడ్ కోర్టులు, అలంకార ఫౌంటెన్లు మరియు ఆధునిక వేవ్ పూల్ ఉన్నాయి.  

ఫేక్ వీడియోతో అమరావతిపై మరోసారి విషం కక్కిన వైసీపీ

వైసీపీ ఫేక్ ప్రచారం విషయంలో డాక్టరేట్ సాధించిందా అనిపించక మానదు. పదే పదే ఫేక్ ప్రాపగాండాతో ప్రజలను తప్పుదోవపట్టించాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమౌతూ వస్తున్నాయి. అయినా వైసీపీ తీరు మారడం లేదు. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పలు సార్లు ఇలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేసి విఫలమైన వైసీపీ తాజాగా మరో సారి అదే విషప్రచారానికి తెగబడింది. ఇప్పటికే అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ నకిలీ వీడియోలను విడుదల చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఇప్పుడు తాజాగా మరో ఫేక్ వీడియోతో అమరావతిలో దళితులకు అవమానం జరుగుతోంది. వారిపై దాడులు జరుగుతున్నాయంటూ జనాలను నమ్మించడానికి ప్రయత్నించింది. వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ నకిలీ వీడియోలో ఒక దళిత మహిళను అవమానానికి గురి చేస్తున్నట్లుగా ఉంది. ఒకింత నిశితంగా పరిశీలిస్తే అది ఫేక్ వీడియో అని ఇట్టే తేలిపోతుంది. ఎందుకంటే ఆ వీడియో తమిళ టెక్స్ట్ స్పష్టంగా కనిపి స్తున్నది. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆ వీడియో అమరావతికి సంబంధించినదని చెప్పుకుంటోంది. అలా చెప్పడం ద్వారా అమరావతిలో దళితులకు అన్యాయం జరుగుతోందని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయనీ చాటడం ద్వారా కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే.. అమరావతికి, దళితులకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారానికి అంతం అన్నదే ఉండదా అనిపించక మానదు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం కూటమి వర్గాలు.. ఈ ఫేక్ వీడియో పోస్టు చేసిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాయి.   

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే

  వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి  హెలికాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియాల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం అని చెప్పారు.  ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావులను ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామ, అల్లుడు అతి తెలివితేటలతో ఒకరు ఆణిముత్యాం మరొకరు స్వాతిముత్యం అని అన్నారు. కాళేశ్వరం ఘోష్ నివేదికపై శాసన సభల్లో చర్చకు పెడుతామని, మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు.  మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.

హమ్ తుమ్ ఏక్.. క‌మ‌లంమే.. బంధ్ హే!

  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా వీరిద్దరు తెలంగాణ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా ఉన్నా విషయం తెలిసిందే.  ఈ లెక్క‌న బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య బంధం ఎట్ట‌కేల‌కు ఉన్న‌ట్టే ఎస్టాబ్లిష్ అయ్యిందా!? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక‌టేన‌నే  బీజేపీ నేత బండి సంజ‌య్, బీజేపీ కాంగ్రెస్ ఒక‌టేన‌నే కేటీఆర్.. కామెంట్ల వ‌ర్షం అంతా తుస్సేనా? ఈ ఇద్ద‌రు ఎదురు ప‌డ్డ‌ప్పుడు ఇలాంటి సన్నివేశం క‌నీసం ఊహించ‌లేక పోయారు చాలా మంది. ఇంత  స‌ర‌దాగా ఒక‌రికొక‌రు ప‌ల‌క‌రించుకుని న‌వ్వుకోవ‌డం ఏంటి? దీన్నెలా అర్ధం చేసుకోవాలి? చాలా మందికి అంతు చిక్క‌ని ఫ‌జిల్లా మారింది. గ‌తంలో ఇదే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే అంశం మీద సీఎం రమేష్ అన్న మాట‌ల‌కు ఇది తార్కాణ‌మా? బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెడుతున్న కేసుల నుంచి త‌ప్పించుకోడానికి బీఆర్ఎస్ ని బీజేపీలో క‌లిపేస్తార‌న్న మాట నిజ‌మ‌వుతుంద‌నుకోవాలా? అని చూస్తే.. అంత వ‌ర‌కూ వ‌స్తుందో రాదో తెలీదు కానీ కొంత వ‌ర‌కూ అయితే... ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయ‌గ‌లిగారు కేటీఆర్. అదెలాంటిదంటే, త‌మ‌కు కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం అండ పుష్క‌లంగా ఉంది. మీ కేసులు, క‌మిష‌న్ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం అన్న కోణంలో కొంత కేటీఆర్ ఈ దృశ్యం ద్వారా చెప్పాల‌ని చూసిన‌ట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇలాంటి ఘ‌ట‌న‌లు స‌ర్వ‌సాధార‌ణంగా  జ‌రుగుతూనే ఉంటాయి. మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ ఎదురు ప‌డ్డ‌ప్పుడు ఉండి ఎమ్మెల్యే, ఏపీ  డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌రాజు ఎంతో స‌ర‌దాగా ప‌ల‌క‌రించారు. జ‌గ‌న్ పై తాను చాకిరేవు పెట్టి ఉతికి ఆరేసిన‌దేదీ ఆయ‌న పెద్ద‌గా తీస్కోలేదు. ఇద్ద‌రు కూడా  రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌ర్వ సాధార‌ణం అన్న కోణంలో చేతులు క‌లుపుకుని వెళ్లిపోయారు. ఆ మాట‌కొస్తే అసెంబ్లీ లోప‌ల గ‌ల్లా ప‌ట్టుకుని కొట్టుకుంటారేమో అన్న కోణంలో క‌నిపించే-  అధికార ప్ర‌తిప‌క్ష  పార్టీల నాయ‌కులు బ‌య‌ట‌ క‌ల‌సి జోకులేసుకుని హ్యాపీగా మాట్లాడుకుని వెళ్లిపోతుంటారు. అచ్చం సినిమా  హీరోల్లా.. ఇక్క‌డ జ‌న‌మే వారి పేరు చేప్పుకుని వీరు- వీరి  పేరు చెప్పుకుని వారు త‌న్నుకులాడుకుంటారు. కానీ వాళ్లు వాళ్లు లోప‌ల అలాయ్ బ‌లాయే.  రాజాసింగ్ కిష‌న్ రెడ్డి మీద చేసిన మెయిన్ కామెంట్ ఇదేగా? ఎవ‌రు ప‌వ‌ర్ లో ఉంటే కిష‌న్ వారితో కుమ్మ‌క్క‌య్యి కావ‌ల్సిన ప‌నులు చేసుకుంటాడ‌ని. అలాంటి కామెంట్ చేసిన రాజాసింగ్ ప్రెజంట్ బ‌య‌ట ఉన్నారు. అదే కిష‌న్ తాను పార్టీలో చ‌క్రం తిప్పుతూనే ఉన్నారు. అదే ఏదైనా ఆల్ పార్టీ మీటింగుల్లాంటివి పెట్టిన‌పుడు మాత్రం.. త‌న‌కు టైమే లేద‌న్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి ఆపై బ‌య‌ట జ‌నానికి తానొక నిఖార్జైన క‌మ‌లం పార్టీ  నాయ‌కుడ‌న్న క‌ల‌రింగ్ ఇస్తుంటార‌ని అంటారు రాజాసింగ్.  ప్ర‌స్తుతం బండి- కేటీఆర్ క‌ల‌యిక అనే ఈ దృశ్యంలో స్ప‌ష్టంగా ఆ ఫేసుల్లో తొణికిస‌లాడిన ప్రేమాభిమానాల‌ను బేరీజు వేస్తే.. ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రికి ఉండాల్సిన దానిక‌న్నా మించి ఏదో ఉంది అన్న ఇంటిమ‌సీ అయితే బాగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. మ‌రి చూడాలి దీనిపై కాంగ్రెస్ లీడ‌ర్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైసీపీ వదిలేసిందా?

వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ జగన్ సర్కార్ లో అప్రకటిత నంబర్ 2 పొజిషన్ ను ఎంజాయ్ చేసిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పార్టీలో ఏకాకి అయిపోయారా అంటే పరిస్థితులను బట్టి చూస్తే ఔననే అనిపించక మానదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీలోనూ, జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డిది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి  సొంత జిల్లా  చిత్తూరు కావడంతో చిత్తూరు జిల్లాపై వైసీపీ ఆధిపత్యం కోసం జగన్ కూడా పెద్దిరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.  చిత్తూరు ఎంత చంద్రబాబు సొంత జిల్లా అయినా.. తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం గతంలో ఎన్నడూ లేదు. 2014 ఎన్నికలను తీసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ 14 అసెంబ్లీ  స్థానాలకు  గాను కేవలం ఆరింటిలోనే విజయం సాధించగలిగింది. అదే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పం వినా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పరాజయం పాలైంది. అలాగే జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలలోనూ ఓడిపోయింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితిపూర్తిగా తిరగబడింది. ఆ ఎన్నికలలో  వైసీపీ కేవలం  రెండంటే రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.  వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుల బలం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి వంటి బలమైన నాయకులు ఉన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో 2019, 2024  మధ్యా కాలంలో  జిల్లాలో పార్టీ బలహీనపడటానికి వీరే కారకులయ్యారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి కారణంగా పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. ఇక 2024లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసి.. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థతికి పతనమయ్యాకా.. చిత్తూరులో వైసీపీ ఉనికి మాత్రంగా మిగిలిపోయిందని చెపవచ్చు. సరే ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. మద్యం కుంభకోణంలో ఇరుక్కుని మిథున్ రెడ్డి జైలు పాలైన తరువాత జిల్లాకు చెందిన నాయకులెవరూ ఇంత వరకూ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా  ఉన్న ఆయన కోసం తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నినా ఎవరూ వెళ్లి పరామర్శించి పలకరించిన పాపాన పోలేదు. ఒకప్పుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టిన రోజా కూడా ఆ తరువాత కాలంలో పెద్దిరెడ్డితో విభేదాల కారణంగా మిథున్ రెడ్డిని పరామర్శించే ఆలోచన కూడా చేయడం లేదంటారు. ఇక జిల్లాలో మరో బలమైన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మద్యం కుంభకోణంలో జైలు పాలైన సంగతి తెలిసిందే.  ఇక జిల్లాలోని ఇతర నాయకుల పరిస్థితి చూస్తుంటే.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి లోలోన ఆనందిస్తున్నారా అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టునకు వ్యతిరేకంగా తొలి రోజులలో జరిగిన నామమాత్రపు నిరసనలు వినా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు అసలాయనను పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు.  ఇక మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయానికి వస్తే ఆయన తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో తనకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదన్న ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిట్ ఆయనను విచారించినప్పుడు కూడా ఆయన మద్యం కుంభకోణం విషయంలో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ, ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టి వ్యవహారమంతా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలే నడిపారని చెప్పినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇక జిల్లాకే చెందిన మరో నాయకుడు భూమన కరుణాకరరెడ్డి విషయానికి వస్తే ఆయన తిరుపతి, టీటీడీ విషయాలు తప్ప మరేమీ పట్టించుకునే పరిస్థితులు లేవు.   ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గీయులు రోజా, భూమనల అరెస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో మాజీ మంత్రి రోజా, టీడీఆర్ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలు త్వరలోనే అరెస్టు కాకతప్పదని వైసీపీ వర్గాలే చెబుతుండటం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎంతగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్ధమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే.. మద్యం కుంభకోణం తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో అసలు ఆ కుంభకోణంలో అరెస్టైన వారిని కనీసం పరామర్శించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఎలా చూసినా వైసీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని వదిలేసినట్లే కనిపిస్తోందని చెబుతున్నారు.  

వరదల్లో చావు వచ్చింది

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భారీ వర్షాలతో మెదక్‌ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో జరిగింది.  స్థానికుడైన బండి హరి అనే అంగ వికలాంగ యువకుడు గుండె పోటుతో బుధవారం మృతి చెందగా సాయంత్రం జరగాల్సిన అంత్యక్రియలు ఇబ్బందికరంగా ముగిశాయి. దహన సంస్కారాలు జరిపేందుకు వెళుతున్న వాళ్లకు భారీ వర్షాల కారణంగా ఉధృతంగా పారుతున్న గొల్ల వాగును దాటేందుకు ట్రాక్టర్, జెసిబి సహాయంతో శవాన్ని బంధువులను వాగు దాటించాల్సి వచ్చింది. చివరి చూపుకు హాజరైన బంధువులు గ్రామస్తులు సైతం వాగును దాటేందుకు తాడును ఆధారంగా తీసుకుని నానా తంటాలు పడుతూ అంతిమయాత్రను ముగించారు.   

కుప్పంలో యాపిల్ ఐఫోన్ విడిభాగాల తయారీ సంస్థ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రప్రగతికి విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పానికి భారీ పెట్టుబడితో హిందాల్కో సంస్థ రానున్నది. అది ఇలాంటి అలాంటి ప్రాజెక్టుతో కాదు. ఏకంగా ఐ ఫోన్ విడిభాగాల తయారీలో కీలకం అయిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ ట్రేషన్ ఫెసిలిటీని కుప్పంలో ఏర్పాటు చేయడానికి హిందాల్కో ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. కుప్పంలో హిందాల్కో ఉత్పత్తి చేసే అల్యూమినియంను ఐఫోన్ విడి భాగాల తయారీకి ముడి సరుకుగా సరఫరా చేయడమే లక్ష్యం.ఇందు కోసం హిందాల్కో కుప్పంలో     ₹586 కోట్ల పెట్టుబడితో  సంస్థను ఏర్పాటు చేయనుంది. ఐఫోన్ విడిభాగాల తయారీకి ముడి సరుకు సరఫరా యూనిట్ ఏర్పాటుతో కుప్పం యాపిల్ ఐఫోన్ తయారీ చైన్ లో భాగం కానుంది.   కుప్పంలో హిందాల్కో ప్రాజెక్టు నకు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) అతి త్వరలో ఆమోదిస్తుందని అంటున్నారు.  ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు అధికారులు.  ఈ భారీ ప్రాజెక్టుకు ఆ సంస్ధ కుప్పంనే ఎన్నుకోవడానికి అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడమే కాకుండా.. బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలకు సమీపంగా ఉండటం కూడా ఒక కారణం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్టు 2027 నాటికి సాకారం అవుతుంది. అంతే కాదు ప్రత్యక్షంగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెబుతున్నారు.  

వరదలో చిక్కుకున్న ఐదుగురిని... రక్షించిన ఆర్మీ హెలికాప్టర్లు

  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి, వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు,  ధ్యానబోయిన స్వామి, మరో ఇద్దరు బిసే ప్రదీప్, బిసే ఛాయా అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు.  ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే దగ్గరుండి పర్యవేక్షించారు.  అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకొని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే అక్కడికి చేరుకున్నారు.  బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. లింగన్నపేట లో వాగులో చిక్కుకుపోయిన ప్రవీణ్ ను క్షేమంగా ఒడ్డుకు చేర్చే వరకు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించి.. ఎన్డీఆర్ ఎఫ్ బృందానికి సలహాలు సూచనలు అందించారు. గురువారం ఉదయమే మళ్లీ ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, ఎగువ నుంచి ఎంత వస్తుందని ఆరా తీస్తూ.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారికి మనోధైర్యం కల్పించారు.  ఏడుగురు క్షేమంగా గమ్యం చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన విషయం తెలిసి దగ్గరుండి అందరిని క్షేమంగా తరలించడంలో విశేష కృషి చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని, వారికి అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం...69 గేట్ల ఎత్తి నీటి విడుదల

  ప్రకాశం బ్యారేజీకి వద్ద భారీగా వరద వచ్చి చేరుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి  4.3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 69 గేట్ల ద్వారా 3.93 లక్షల క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే ప్రమాదం ఉంటంతో కృష్ణ పరీహక ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులిచింతల నుంచి వస్తున్న నీరు మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక పొలాలలోకి వెళ్లవద్దని ఇప్పటికే సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,10,546 క్యూసెక్కులు చేరుతోంది.  

నదుల అనసంధానం కోసం నిర్మాణాత్మకంగా ముందుకు.. ఆనం రామనారాయణ రెడ్డి

నదుల అనుసంధానం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం (ఆగస్టు 28) మీడియాతో మాట్లాడిన ఆయన నారాచంద్రబాబునాయుడు గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానంపై కసరత్తు చేస్తున్నారనీ, ఇందు కోసం 84 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు కూడా రూపొందించారనీ తెలిపారు. ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదన్న మహదాశయంతో చంద్రబాబు ముందుకు సాగుతుంటే.. దానిపై కూడా కొందరు రాజకీయ స్వప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.  ఇక నదుల అనుసంధానానికి పొరుగురాష్ట్రాల సమ్మతి పొందే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం వివరించారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే రాయలసీమ ప్రాంతానికి రెండో పంటకు  కూడా నీరందించగలమని ఆనం అన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయన్న ఆనం రామనారాయణ రెడ్డి..  గత ప్రభుత్వం కేవలం 400 కోట్ల రూపాయలు వ్యయం చేయలేక హంద్రీనీవా ప్రాజెక్టును పక్కన పడేసిందని విమర్శించారు. ఆ పనిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేసిందన్నారు. సోమశిలకి ఎగువ ప్రాంతాల నుంచి 18750  క్యూసెక్కుల నీరు వస్తోందనీ,  ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామనీ చెప్పారు.   సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్ధ్యం 12వేల క్యూసెక్కుల నుంచి 24వేలకి పెంచుతామన్న జగన్ ఆయన హయాంలో  ఆలోచన లేకుండా కమిషన్ల కోసం టెండర్లు పిలిచారనీ, వారు పనులు మధ్యలోనే ఆపేసిపోయారు పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సోమశిల హైలెవెల్ కెనాల్ కోసం నిధులు ఇచ్చారన్నారు.   అలాగే జిల్లాలో 40 పంవాయతీ భవనాల నిర్మాణానికి రూ.12.8కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం రూ.50కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.  గత ప్రభుత్వం, తమ పార్టీ పంచాయతీల నిధులన్నీ మళ్లించింది. ఇప్పుడు కూడా మేము నిధులు ఇస్తామంటే ఒక మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసి రావడం లేదన్న ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలలో ఉన్నవాడిగా తనకు  విషయాలూ తెలుసునన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదన్న ఆయన కలిసిరాకుండా నష్టం వాళ్లకేనన్నారు. 

రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం తొలగింపు

హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. అలాగే మండపాలలో ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమలు  వినూత్నత, సృజన ఉట్టిపడేలా ఉంటాయి. భిన్న రూపాలలలో సమాకాలీన అంశాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు.  అందులో భాగంగానే హైదరాబాద్ హబీబ్ నగర్ లో కాంగ్రెస్ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. తమ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫురింప చేసేలా ప్యాంటు, షర్టు ధరించిన గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రూపాన్ని స్ఫురింపచేసేలా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వివాదాస్పదంగా మారింది.  విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా  మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  అభిమానం ఉండాలే కానీ అది హద్దులు దాటకూడదు,  హీరోలు, రాజకీయ నాయకుల రూపాలలో గణేష్ ప్రతిమలు చేయడం సరికాదంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి,  హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రూపాన్ని స్ఫురింప చేసేలా వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం తగదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మండపం వద్దకు బుధవారం (ఆగస్టు 27) వెళ్లి పరిశీలించిన సౌత్ జోన్ డిసిపి  రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుని విగ్రహం ఉండడం చూసి, వెంటనే మండపం ఏర్పాటు చేసిన ఫిషిరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిలిపించి భక్తుల మనోభావాలు దెబ్బతీయ వద్దనీ, వెంటనే విగ్రహం మార్చా లంటూ పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహ కులు  రేవంత్ రెడ్డి రూపం లో ఉన్న విగ్రహం మార్చి మరో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.  

గూగుల్ మ్యాప్ బోల్తా కొట్టించింది.. వరదలోకి దారి చూపింది!

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణాలు సాగించడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నది. అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా, ప్రయాణాలు చేసేవారు ఆ మ్యాప్ ల మీదే ఆధారపడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తున్న ఓ కుటుంబంలో ఘోర విషాదం సంభవించిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని  సవాయి భోజ్‌ను  దర్శించుకుని వ్యాన్ లో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం గూగూల్ మ్యాప్ సూచించిన విధంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ మ్యాప్ వారిని నేరుగా బనాస్ వరద నీటిలోకి గైడ్ చేసింది. దీంతో వారు ప్రయాణిస్తున్న వ్యాన్  వరద నీటిలో కొట్టుకుపోయింది. చిత్తోర్ ఘడ్ జిల్లా  రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన ఈ ఘోర ఘటనలో ఓ బాలిక మరణించింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు.  స్థానికుల సహకారంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.  వివరాలిలా ఉన్నాయి. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించి వారు రష్మి పీఎస్ పరిధిలోని సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్  మీదుగా ప్రయాణించాల్సి ఉంది. వాస్తవానికి ఆ కల్వర్ట్ గత మూడేళ్లుగా బంద్ అయి ఉంది.  దానిపై రాకపోకలను నిషేధించారు. అయితే గూగుల్ మ్యాప్ ఆ కల్వర్టు మీదుగానే ప్రయాణించాలని సూచించడంతో వారు అ లాగే ముందకు సాగారు. కానీ ఇటీవలి భారీ వర్షాలకు  బనాస్ నదికి వరద పోటెత్తి ఆకల్వర్టు మార్గాన్ని ముంచేసింది. అయితే గూగుల్ అంటూ ముందుకు సాగిన వారు, తమ వ్యాన్ ను కల్వర్ట్ పైకి తీసుకు వెళ్లారు. అయితే వరద ప్రవాహానికి ఆ వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటన  జరిగిన సమయంలో వ్యాన్ లో తొమ్మండుగురు ఉణ్నారు.  స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు స్థానికుల సహకారంతో ఐదుగురిని రక్షించగలిగారు. ఒక బాలిక మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్ లను చూసి ప్రయాణాలు సాగించడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైందని పరిశీలకులు అంటున్నారు.  

భగవద్గీత పుస్తకాలతో వినాయక విగ్రహం

దేశ వ్యాప్తంగా  వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, అత్యంత ఘనంగా గురువారం (ఆగస్టు 27)న జరుపుకున్న సంగతి తెలిసిందే. వాడవాడలా గణేస్ మంటపాలను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకోనున్నారు. అయితే పందిళ్లలో వినాయ విగ్రహాల ఏర్పాటులో నిర్వాహకులు తమ సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారు.   వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో  చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో  గణనాథుడి విగ్రహాన్ని పూర్తిగా పుస్తకాలతో రూపొందించారు. ఇందు కోసం నిర్వాహకులు ఐదు వేల భగవద్గీత పుస్తకాలను ఉపయోగించారు. వీటితో పాటుగా  1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఉపయోగించారు. ఐదు వేల బగవద్గీత పుస్తకాలతో రూపొందించిన గణనాథుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఈ మంటపానికి తరలి వస్తున్నారు. ఇక ఈ మండపం వద్ద పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా నిర్వాహకులు అన్ని చర్యలూ తీసుకున్నారు. భజనలు, సంకీర్తలలతో మండపం, పరిసర ప్రాంతాలు ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్నాయి.  

వరద బాధిత జిల్లాల్లో సిఎం ఏరియల్ సర్వే!

తెలంగాణలో  భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న  జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే  చేయనున్నారు. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాలపై   తన జూబ్లీహిల్స్ నివాసంలో  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంలోనూ ఎటువంటి ఉదాశీనతా ఉండకూడదని స్పష్టం చేశారు.  కాగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె. రామకృష్ణా రావు  భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,  నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో  బుధవారం (ఆగస్టు 27)  రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు.   విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు  కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.   గురువారం (ఆగస్టు 28) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను  యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలన్నారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.  మిన్నెసోటా మినియాపొలిస్‌లో ని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.  మరో 14 మంది చిన్నారులు సహా 17 మంది గాయపడ్డారు.  విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా దుండగుడు చర్చి కిటికీల గుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్ మ్యాన్ గా గుర్తించారు.  కాల్పులకు పాల్పడిన సాయుధుడు తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.  అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు స్వాధీనం చేసుకున్న తుపాకీపై న్యూక్ ఇండియా’ ,  మాషా అల్లా అని ఉంది. కాల్పుల ఘటనకు ముందు అతడుసోషల్ మీడియాలో పలు వీడిమోలు పోస్టు చేశాడు.  

వినాయక పూజ చేసి ప్రసాదం స్వీకరించిన జగన్.. ఈ మార్పు వెనుక మర్మమేంటో?

జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది.   జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. ఆయన హయాంలో  తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయట పడింది. అంతే కాదు.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో  అన్యమతస్తులకు  కొలువులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అదే విధంగా దేవుడి ప్రసాదం తినడానికి కూడా జగన్ ఇష్టపడరన్న ఆరోపణలు ఉన్నాయి.    జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ ప్రసాదం ముట్టలేదని అంటారు.  ఆయన మత విశ్వాసం మారిందో, లేక మారినట్లు కనిపిస్తే తప్ప జనం మద్దతు పొందలేమనుకున్నారో కానీ వినాయకచవిత సందర్భంగా బుధవారం (ఆగస్టు 27)న ఆయన గణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వినాయకచవితి సందర్భంగా జగన్   తాడేపల్లిలోని  వైసీపీ ప్రధాన కార్యాలయంలో  గణపతి పూజ చేశారు. ఆయన నేరుగా పూజలో పాల్గొనడం, పూజ చేయడం ఇదే తొలిసారి. పూజ అనంతరం పూజారులు ఆయనకు ప్రసాదం అందించారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. దీనిపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  జగన్ ప్రసాదం స్వీకరించడం ద్వారా  జగన్ ఇంత కాలం తన తీరుకు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తి కలిగిస్తోంది. ఏది ఏమైనా వినాయక చవితి సందర్భంగా జగన్ ప్రసాదం స్వీకరించడం మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం (ఆగస్టు 27) కామారెడ్డిలో అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరాన్ని నీరు ముంచెత్తింది. పలు కార్లు, ద్విచక్రవాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 28( కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. భారీ వర్షాల కారణంగా పది జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. ఇక పోతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   ఇక  ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు పెరిగితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు సూచిస్తున్నారు.