పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాసులా?.. జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన లోకేష్

పులివెందులలో జరిగే సమావేశాలకు పార్టీ సభ్యులకు వీఐపీ పాస్‌లు జారీ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఐటీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు "ఓరిని పాసులా. సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాస్‌ల గురించి విన్నాం కానీ  మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాస్‌లు ఏంటంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, కనలేదని పేర్కొన్నారు.   ఇటీవలి జెడ్‌పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ అడ్డాలో ఈ పరాజయ పరాభవం తరువాత ఆయన తొలి సారిగా పులివెందులకు సోమవారం (సెప్టెంబర్ 1) వచ్చారు. ఆ సందర్భంగా   తనను కలవాలనుకునే వారికి వీఐపీ పాస్‌లు జారీ చేశారు. జగన్ ఈ నిర్ణయం పులివెందుల పార్టీ నేతలు, కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడానికి దారి తీసింది.  ఎందుకంటే.. వీఐపీ పాస్‌లు ఉన్న అతి కొద్ది మంది నాయకులను మాత్రమే  జగన్  కలిశారు. జగన్ భద్రతా బృందం వీఐపీ పాస్‌లు కలిగి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించింది.. వీఐపీ పాసులు లేకుండా ఆయన ఛాయలకు కూడా వెళ్ల నీయలేదు. దీంతో చాలా మంది పార్టీ నేతలూ, కార్యకర్తలు జగన్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద జగన్ కు కలవడానికి వీఐపీ పాస్ ల జారీ వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది.   

దేశంలో తొలిసారిగా ప్రభుత్వ స్కూలులో స్మార్ట్ కిచెన్‌‌

  దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సికె దిన్నె ఎంపీపీ హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సికె దిన్నె స్మార్ట్ కిచెన్ నుంచి 1787 మంది విద్యార్థులకు  భోజనం తయారీ, పంపిణీ చేశారు. కమలాపురం నియోజక వర్గంలో 2, జమ్మలమడుగు 2, కడపకు చెందిన ఒక స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్ గా ప్రారంభించారు.  ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి శుచికరమైన భోజనం తయారీ, ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభిస్తామన్నారు. కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచితో కూడిన భోజనం అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.అంతకుముందు నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి  నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.  

కవిత సస్పెన్షన్.. చక్రం తిప్పిన కేటీఆర్?!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చకు ప్రవేశ పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గట్టిగానే నిలబడ్డారు. బలమైన వాదనలతో అసెంబ్లీలో నివేదిక తప్పుల తడక అని చెప్పే విషయంలో ప్రశంసార్హమైన విధంగా వాదనలు చేశారు. సరే చివరికి  ఆదివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి సభ వేదికగా కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు చేసిన ప్రకటన బీఆర్ఎస్  నాయకులు, శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.  సీబీఐ చేతికి కాళేశ్వరం వెడితే.. బీజేపీ దానిని అవకాశంగా చేసుకుంటుందనీ, ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ను బలహీనం చేసి  రాష్ట్రంలో బలపడుతుందనీ బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. ఇది చాలదన్నట్లు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..సోమవారం (సెప్టెంబర్ 1) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ  కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించేశారు. అంతే కాదు.. ఆ అవినీతికి పాల్పడింది.. మాజీ మంత్రి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ లేనంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సుద్దపూస అని ఆయనను వెనకేసుకు వచ్చారు. ఇందుకు ఉదాహరణగా హరీష్ రావును కేసీఆర్ రెండో టర్మ్ లో ఇరిగేషన్ శాఖ నుంచి తొలగించడాన్ని చూపారు.   అయితే ఆమె ఎంతగా కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినా.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనిచెప్పడం ద్వారా, అప్పటి ప్రభుత్వాధినేత అయిన తండ్రి కేసీఆర్ ను చిక్కుల్లో పడేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక కవిత విమర్శలూ, ఆరోపణలూ రేవంత్ సర్కార్ వేయేనుగుల బలాన్ని అందించాయి. ఇక ముందు ముందు ఈ కేసులో  సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరో గత్యంతరం లేదన్న భావనకు బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చి ఉంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఇంత కాలంగా కవిత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే మొతక వైఖరితో ఉంటారన్న అనుమానంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు. వాస్తవానికి చాలా కాలంగా కేటీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారనీ, ఈ మేరకు తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కవిత  విషయంలో తండ్రి మళ్లీ చూసీ చూడనట్లు వదిలేయకుండా కేటీఆర్ సోమవారం (సెప్టెంబర్ 1) కవిత మీడియా సమావేశం తరువాత స్వయంగా ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆయన రాత్రంతా ఫామ్ హౌస్ లో తండ్రితో చర్చించారనీ, కవితను సస్పెండ్ చేయకుంటే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని నచ్చచెప్పి కవిత సస్పెన్షన్ కు కేసీఆర్ ను ఒప్పించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

  సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు ముఖ్యమంత్రితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది.  ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల, అనగా అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.  హరీష్ రావు, సంతోష్  సహా పార్టీ నేతలపై చేసిన విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో బీఅర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.  కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ లది కీలక పాత్ర అని కవిత సోమవారం (సెప్టెంబర్ 1)న మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం అవకతవకలపై విచారణ సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వారి తప్పులకు తన తండ్రి చిక్కుల్లో పడ్డారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఇటీవల కొంత కాలంగా ఆమె పార్టీ లైన్ కు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు మంగళవారం (సెప్టెంబర్ 2) ఆమెను సస్పెండ్ చేసింది. 

గిడుగు సేవలు నేటి తరానికి ఆదర్శం.. టీడీ జనార్ధన్

తెలుగు భాషాసాహిత్యాలకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంకావాలని ఎన్టీ ఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు టి.డి.జనార్ధన్ పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతివేడుకల్లో భాగంగా గిడుగుఫౌండేషన్, శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గిడుగు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిడుగువారి మార్గంలో నడిచి,  తెలుగు భాషాకోసం ఎన్టీఆర్ ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. భాష పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడమేగాక ఆయన ముఖ్య మంత్రిగా అమలు జేసిన సంక్షేమ పథకాలకు తెలుగు పేర్లు పెట్టారని అన్నారు. ప్రముఖ కవి ,గిడుగు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు గిడుగు కాంతికృష్ణ, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి ధనలక్ష్మి,శతచిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,కవులు డా.జెల్ది విద్యాధర్, డా.వి.డి.రాజగోపాల్, డా.రాధాకృష్ఢ  అతిథులుగా పాల్గొన్నారు.

మైసూరుకు దీటుగా బెజబాడలో దసరా ఉత్సవాలు

బెజవాడలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అసలు దసరా ఉత్సవాలకు బెజవాడ పెట్టింది పేరు. కనకదుర్గమ్మ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటంతో ఇక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో సందేహం లేదు. సంప్రదాయబద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంప్రదాయపద్దతికి ఆధునికతను జోడించాలని నిర్ణయించింది. మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలను తలదన్నేలా నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరానవరాత్రులలో నగర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  పున్నమి ఘాట్‌లో దాండియా, లైవ్ బ్యాండ్‌లు  వాటర్ స్పోర్ట్స్‌ తో పాటు గొల్లపూడిలో  30 ఎకరాలలో బ్రహ్మాండమైన ఎక్స్‌పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది  పది రోజుల దసరా ఉత్సవాలలో కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యకలాపాలతో పాటు హెలి మరియు బెలూన్ రైడ్‌లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.   సంప్రదాయం, ఆధునికతల మేళవింపుతో దసరా ఉత్సవాలను నభూతో అన్నట్లుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది.  ఈ ఉత్సవాలు బెజవాడ వాసులకు ఓ కొత్త అనుభూతిని మిగిల్చేలా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.  

కాళేశ్వరంలో కేసీఆర్ ను నిండా ముంచేసిన కవిత వ్యాఖ్యలు!?

కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరగలేవని బీఆర్ఎస్ ఎంతగా గొంతు చించుకుని అరిచినా ఫలితం లేకుండా పోయే పరిస్థితిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ లపై ఆరోపణలు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారం వాస్తవమేనని కవిత కుండ బద్దలు కొట్టేశారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత పులు కడిగిన ముత్యమేనని చెబుతూనే.. మాజీ మంత్రి హరీష్ రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ధృవీకరించేశారు. దీంతో కాళేశ్వరం విషయంలో అవినీతి లేదని బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులు ఎంతగా గొంతు చించుకున్నా ఫలితం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన తండ్రి సుద్దపూస అంటూ.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినందునే హరీష్ రావుకు రెండో సారి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఇరిగేషన్ శాఖ ఏమిటి తొలుత అసలు హరీష్ ను క్యాబినెట్ లోకే తీసుకోలేదనీ, ఆ తరువాత బతిమలాడుకుంటే కేబినెట్ బెర్త్ ఇచ్చారని ఇప్పుడు కవిత గట్టిగా చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని స్వయంగా కవితే అంగీకరించేసిన తరువాత.. ఇక పార్టీకి డిఫెండ్ చేసుకునే అవకాశం ఎక్కడుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇంత కాలం కాళేశ్వరంలో అవినీతి అన్నదే జరగలేదని బీఆర్ఎస్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవా లంటూ కవిత ధృవీకరించేశారు.  కవిత తన వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ ప్రతిష్టనే కాదు.. స్వయంగా తన తండ్రి ప్రతిష్టను కూడా పాతాళంలోకి తోసేశారని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం డిజైన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కర్తా, కర్మా, క్రియా తానేననీ, ఇంజినీర్లకు డిజైన్ ఎలా చేయాలో కూడా తానే చెప్పాననీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు స్వయంగా ఆయన కుమార్తె కవితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు, అవినీతి నిజమేనని చెప్పడం, అయితే అందుకు తన తండ్రి ప్రమేయం లేదని సమర్ధించడానికి ప్రయత్నించడం ద్వారా కేసీఆర్ ను పూర్తిగా ఇరికించేసినట్లైందని అంున్నారు.  కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటున్న విమర్శకుల నోళ్లు మూయించడం సంగతి పక్కన పెడితే.. కవిత తన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ పై  ఆయన విమర్శకులు  మరింతగా విమర్శల దాడి చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లైందని అంటున్నారు. 

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత, మాజా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (సెప్టెంబర్ 2) విచారించింది.  ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ ప్రభుత్వం తీసుకోబోదనీ, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించనుందనీ తెలిపారు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ స్టే విధించింది. తదుపరి విచారణకు కాళేశ్వరంపై విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. 

జనం గుండెల్లో నాన్న.. షర్మిల

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారని, ఆయన మరణించి 16 ఏళ్ల అయినా నేటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు  షర్మిల అన్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా  నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహానేత వైయస్సార్   ఆరోగ్యశ్రీ ,ఉచిత విద్యుత్తు, ఫీజు రీయంబర్స్మెంట్, పథకాలు తీసుకువచ్చారనీ, అవి  వైయస్సార్ గుండెల్లో నుంచి పుట్టిన పథకాలని అన్నారు.  వైఎస్ఆర్ కు ఇంత ఆదరణ ఇచ్చిన  ప్రతి ఒక్కరికి కృతజ్ణతలు తెలిపారు.  వైయస్సార్ చనిపోయాక ఆ బాధ భరించలేక 700 మంది చనిపోయారని ఆ కుటుంబాలకు కూడా నివాళులర్పిస్తున్నానని తెలిపారు

ఇడుపులపాయలో తండ్రి వైయస్ కు జగన్ నివాళులు

  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా  కడపజిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్  వద్ద ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఘన నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు , వైసీపీ ముఖ్యనేతలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులర్పించిన జగన్.. ఆ తరువాత   ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.తల్లి విజయమ్మతో పాటు భార్య వైఎస్ భారతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో  ఇడుపులపాయ ఘాట్ ప్రాంతం మార్మోగింది.

పావురాళ్ల గుట్ట ఘటనకు 16 ఏళ్లు..

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. తాను 2004 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డానికి పాద‌యాత్ర చేసే ముందు.. చాలా చాలా తీవ్రంగా బాధ ప‌డ్డారు. కార‌ణం చంద్రబాబు పాలన, విధానాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు  చూస్తుంటే అస‌లు మ‌నం సీఎం కావ‌డం క‌ల్ల అన్న‌ది అప్పటికి ఆయ‌న భావన, ఆవేద‌న‌. ఈ విష‌యం త‌న ఆత్మగా చెప్పుకునే కేవీపీ కి చెప్పుకుని బాధ ప‌డ్డారని  చెబుతుంది ఆయ‌న బ‌యోపిక్ గా వ‌చ్చిన యాత్ర‌. త‌ర్వాత ఆయ‌న మాస్ నాడి ప‌ట్టుకున్నారు. ఆ పాద‌యాత్రకు అప్పటి వ‌ర‌కూ వ్యతిరేకిస్తూ వ‌చ్చిన ప‌త్రిక‌లు కూడా బాగా హైలెట్ చేసి చూపించ‌డంతో.. ఆయ‌న అనూహ్యంగా 2004 ఎన్నిక‌ల‌ను గెలిచారు. అంత‌క‌న్నా ముందు చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌ర‌గ‌టం,  ఆ సానుభూతి ప‌వ‌నాలు, ఆపై తాను మోడ్రన్ అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరు సాధించ‌డం వంటి అంశాలేవీ ప‌ని చేయ‌లేదు. వైయ‌స్ పాద‌యాత్ర ద్వారా మాస్ లోకి మ‌రీ ముఖ్యంగా రైతాంగంలోకి వెళ్లడంతో.. ఆయ‌న పంట, కాంగ్రెస్ పంట ఒకేసారి  పండాయి. అప్పటి వ‌ర‌కూ అంద‌ని ద్రాక్షగా ఉన్న అధికారం ఎట్టకేల‌కు వైయ‌స్ఆర్  ప‌ర‌మైంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయ‌స్ శ‌కం   ఒక‌టి మొద‌లైంది. ఎన్టీఆర్ అంటే, రెండు రూపాయ‌లకు కిలో బియ్యం, జ‌న‌తా వస్త్రాలు వంటి సంక్షేమ ప‌థ‌కాలు ఎలాగో, వైయ‌స్ అన‌గానే ట‌క్కున గుర్తుకొచ్చేవి ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇవి త‌ర్వాతి  కాలంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌వ‌డం, అటుంచితే కొన్ని విమ‌ర్శల‌ను సైతం మూట‌గ‌ట్టుకున్నాయి ఈ పథకాలు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు బాగు ప‌డ్డాయ‌న్న విమర్శలు రావ‌డం.. ఆపై ఫీజు రీఎంబ‌ర్స్ ద్వారా.. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ చేయ‌డం, దాని విలువ ప‌డిపోయి.. ఉద్యోగితా స్థాయి   దారుణంగా దెబ్బతిన‌డం ఒక ఎత్తు. ఈ విష‌యంపై కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు ఆనాడే విమ‌ర్శలు గుప్పించిన ప‌రిస్థితి. ఈ సామాజిక క్షేమం మ‌ర‌చి కూడా వైయ‌స్ఆర్, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తారు కాబ‌ట్టే.. వారికి ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చంద్రబాబుకు ఉండేది కాదని చెబుతారు విశ్లేష‌కులు. బేసిగ్గా చంద్రబాబు థియ‌రీ వాట్ దే నీడ్. అదే వైయ‌స్ వాట్ దే వాంట్. దీంతో వైయ‌స్ మ‌హానేత అయ్యాడు. చంద్రబాబు చెడ్డ పేరు సాధించార‌ని చెబుతారు వీరంతా. ఇదిలా ఉంటే.. 2009లో రెండో సారి గెలిచాక వైయ‌స్ఆర్ ఇక తిరుగులేని నేత‌గా  ఎదుగుతార‌ని అనుకున్నారంతా. మ‌ధ్యప్రదేశ్ లో దిగ్విజ‌య్ సింగ్ త‌ర్వాత ఆ స్థాయిలో అధిష్టానం ముందు మంచి పేరు సాధించి.. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎంపీల‌ను అందించి.. అటు యూపీఏ కూట‌మిని సైతం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంతో.. వైయ‌స్ కి సోనియా కోట‌రీ ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉండేద‌ని అంటారు. బేసిగ్గా వైయ‌స్ఆర్.. గాంధీ కుటుంబ వ్యతిరేకి. ఆయ‌న తొలి  రోజుల్లో ఆనాడు దేశ వ్యాప్తంగా న‌డుస్తోన్న కుటుంబ  రాజ‌కీయాల‌ను, గాంధీలు కాని గాంధీల దాష్టీకాన్ని స‌హించ‌లేక పోయేవారని చెబుతుంది ఇటీవ‌ల వ‌చ్చిన మ‌య‌స‌భ అనే సీరీస్. మీరు కావాలంటే చూడొచ్చు. ఆయ‌నేం పెద్ద ఇందిరాగాంధీ విధేయుడు కారు. పైపెచ్చు ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత‌.. కేవ‌లం ఒకే ఒక్కడుగా ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నుంచి గెలిచి చ‌రిత్ర సృష్టించారు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఆ త‌ర్వాత వైయ‌స్ గెలిచిన ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్- ఐలో క‌లిపేయ‌డంతో.. విధిలేని ప‌రిస్థితుల్లో మాత్రమే వైయ‌స్ ఇందిర అధినాయ‌క‌త్వంలోని పార్టీలో టెక్నిక‌ల్ గా చేరారంతే!  ఆపై సోనియాగాంధీ సైతం వైయ‌స్ తో ఎంత ఇష్టం లేకున్నా  స‌రే.. ఆమె వైయ‌స్ ని కొన‌సాగించేవారంటే అందుకు కార‌ణం.. శ్యాంపిట్రోడా వంటి వారు చేసిన స‌ల‌హా సూచ‌న‌గా చెబుతారు కొంద‌రు సునిశిత రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్ అన‌గానే సీఎంల‌ను త‌ర‌చూ మార్చేస్తుంటార‌ని ఒక అప‌వాదు ఉండేది అప్పట్లో. ఇక‌పై ఏ రాష్ట్రంలో.. ఎవ‌రు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారో.. వారు ఎన్నిసార్లు పార్టీని అధికారంలోకి తెస్తే అన్ని సార్లు ముఖ్యమంత్రిని చేయాల‌న్న విధాన ప‌ర‌మైన నిర్ణయం కార‌ణంగా వైయ‌స్ఆర్ రెండో సారి కూడా సీఎం కాగ‌లిగార‌ని అంచ‌నా వేస్తారు. ఆపై వైయ‌స్ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి ఇటు ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో పాటు.. అటు ఇక హైద‌రాబాద్ రావాలంటే పాస్ పోర్టు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని  జ‌నాన్ని రెచ్చగొట్టడం కూడా.. ప‌ని చేసింది. దీంతో ఆయ‌న ద్వితీయ విఘ్నం లేకుండా అధికార పీఠం రెండో సారి కూడా ఎక్కగ‌లిగారని చెబుతారు.  అయితే 2009, సెప్టంబ‌ర్ 2న  పావురాల గుట్టలో ఆయ‌న ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవ‌డంతో.. ఆయ‌న శ‌కం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో  మొద‌లైన ఆరో ఏటే ముగిసిపోయింది. ఒక వేళ వైయ‌స్సే బ‌తికి ఉంటే.. తెలంగాణ వ‌చ్చి ఉండేది కాదేమో. ఈ మాట స్వయంగా కేసీఆరే అనేవారు.  అలా వైయ‌స్ తాను చ‌నిపోయే నాటికి సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా జ‌నం గుండెల్లో గుర్తుండి పోవ‌డం.. ఆపై  కొంద‌రు ఆయ‌న మ‌ర‌ణ వార్త విని త‌ట్టుకోలేక చ‌నిపోయార‌న్న పేరు రావ‌డం. ఆపై వారిని ఓదార్చడానికంటూ జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టడంతో ఆయ‌న త‌ర్వాతి త‌రం విభ‌జిత ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేయ‌డం మొద‌లైంది. ఏది ఏమైనా వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ, ఫీజురీఎంబర్స్ మెంట్ వంటి వాటితో పాటు జ‌ల‌య‌జ్ఞం లాంటి ప‌థ‌కాల‌తో జ‌నానికైతే ఇంకా గుర్తే. ఆయ‌న మ‌ర‌ణించి నేటికి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయ‌న కొంద‌రి విష‌యంలో మ‌హానేత. ఈ విష‌యం మ‌న‌మెవ‌రం కొట్టిపారేయ‌లేం.

ఏసీబీ కస్టడీకి ఐఏఎస్ అధికారి సంజయ్

ఐపీఎస్ అధికారి సంజయ్‌ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీ   కస్టడీకిఅనుమతిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 1) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి ఏసీబీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. జగన్ హయాంలో  అగ్నిమాపక శాఖ, ఆ తరువాత ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ పని చేసిన సంగతి తలిసిందే. ఆయన అగ్నిమాక శాఖలో ఉన్న సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సంజయ్ ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పై గత వారం వాదనలు ముగియగా, కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు అంటే సోమవారం (సెప్టెంబర్ 2) సంజయ్ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 4 వరకూ ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ సంజయ్ ను అదుపులోనికి తీసుకుని విచారించనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఏరోజు కారోజు విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం ఆరుగంటలకు విజయవాడ జిల్లా జైలులో అప్పగించనుంది. ఇదిలా ఉండగా ఆరోగ్య కారణాలు చూపుతూ సంజయ్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది.  

శతృవులు చెల్లెళ్లు, మరదళ్ల రూపంలో ఉంటారుగా కవితక్కా!

కేసీఆర్ కి ‘టి ’కలసి వచ్చినంతగా ‘బి’ కలసి రాలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఆయనకెంతో అచ్చి వచ్చే టీని విడిచిపెట్టారో అప్పటి నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. టీలోని తెలంగాణ అనే సెంటిమెంటు ఒక తల్లిలా కాపాడుతూ వచ్చింది. అదే..  బీ ఆయన్ను పూర్తిగా విడిచి పెట్టేసింది. ఏ ముహూర్తాన ఆయన టీ తో మొదలయ్యే టీఆర్ఎస్ అన్న పార్టీ పేరును బీతో ఆరంభమయ్యే భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అక్కడి నుంచి మొదలైంది కేసీఆర్ కు కష్టాల పరంపర. మొదట ఓటమి ఎదురైంది. ఆపై వరుస కేసులు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్. ఇక తాను అల్లుడు కలసి కాళేశ్వరం అవినీతి ఊబిలో పీకలోతు చిక్కుకుపోగా.. తన కొడుకు ఈ ఫార్ములా కేసులో.. బిడ్డ ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్. ప్రస్తుతం హరీష్‌, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కి మచ్చ అంటోన్న కవిత.. పార్టీకి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పటికీ హరీష్‌ అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తూ అరివీర భయంకరుడిలా పోరాడి పేరు సాధిస్తున్నారు. ఆయనకు బూస్టింగ్ ఇవ్వాల్సిన కవిత.. అలాక్కూడా వదలడం లేదు. అనవసరమైన కామెంట్లు చేసి చెడ్డపేరు తెస్తున్నారు.  శతృవులు ఎక్కడో ఉండరు,, చెల్లెళ్ల రూపంలో, మరదళ్ల రూపంలో ఉంటారన్న మాటను నిజం చేస్తున్నారామె. ఒక సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేటీఆర్ ఆమె చేసిందసలు తప్పే కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు. ఢిల్లీ ప్రభుత్వం పాలసీ మార్చితే అందులో తాను కూడా ఒక వ్యాపార భాగస్వామిగా ఇన్ వాల్వ్ అయ్యారని ఆమెపై పడ్డ మరకను తుడిచేసే యత్నం చేశారు. హరీష్‌ , సంతోష్ ఎలాంటి ప్రో కామెంట్ చేయకపోయినా.. నెగిటివ్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.   ఇప్పుడు కళేశ్వరం విషయంలో అలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కవిత ఒకపక్క పార్టీపై  ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో చెడుగుడు ఆడేస్తుంటే.. ఏం చేయాలో పాలు పోవడం లేదు కేసీఆర్ కి.  అంటే టైం బాగలేకుంటే కర్రే పామై కరుస్తుందన్నట్టు.. మన అదృష్టం తిరగబడితే బిడ్డే అడ్డం తిరిగి ఇదిగో ఇలాంటి చిక్కులు తెచ్చి పడేస్తున్నారు.  ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్‌ని, సంతోష్ ని వేరు చేసి చూడాలని ఇక్కడ ఎవరికీ ఉండదు. తలసానిని ఆయన ఓఎస్డీ కలసి కాకుండా తలసానికి తెలీకుండా కేవలం ఆ ఓఎస్డీ గొర్రల స్కామ్ కి కారకుడని అంటే ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఒక వేళ కవిత చెప్పినట్టు వీరు ఇరువురూ.. అంత అవినీతికి పాల్పడి ఉంటే.. మరి కేసీఆర్ వైఫల్యం కూడా ఇందులో ఉన్నట్టేగా?  రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీల వారు, ఆపై సినీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వారి రహస్యాలను కనుగొన్న కేసీఆర్.. తన సొంతింట్లోని వారు ఇంత భారీ ఎత్తున అవినీతికిపాల్పడుతుంటే మాత్రం ఎందుకు వదిలేశారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చిన్. ప్రస్తుతం కవిత పిచ్చి ప్రయత్నమేంటంటే.. కేసీఆర్ పులుగడిగిన ముత్యం.. ఆయన్ను కాపాడ్డానికి ఇటు కేటీఆర్, అటు హరీష్‌ తో పాటు సంతోష్ ని కూడా బలిపెడుతోంది కావచ్చని అంటున్నారు. అది కూడా తన తండ్రికి చేటు తెచ్చేదేనని ఆమె ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదంటారు పలువురు. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దీంతో ఏ విధంగా ముందుకెళ్లాలో అని కేసీఆర్ ఓ పక్క తలపట్టుకుంటుంటే..  మధ్యలో కవిత తగుదునమ్మా అంటూ ఈ మేటర్ లో వేలు పెట్టి.. ఇటు సొంత కుటుంబాన్ని, అటు పార్టీని ఇరుకున పెట్టడంఎంత వరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది.

ప‌వ‌న్ బ‌ల‌మేంటో తెలుసా!?

చాలా మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బలం.. ఆయ‌న‌కున్న ప్ర‌జాద‌ర‌ణ‌గా భావిస్తారు. కానీ, అది కానే కాదు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రెంగ్త్ ఆయ‌న ఓపిక‌. దేనికైనా ఓపిక ప‌ట్ట‌డం ఆయ‌న నైజం. అందుకే ప‌వ‌న్ పాలిటిక్స్ లో అంత‌గా క్లిక్ అయ్యారు. అదే త‌న అన్న‌య్య చిరంజీవికి అలాంటి ఓపిక లేక పోవ‌డం వ‌ల్లే ఆయ‌న రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయారు. పార్టీ పెట్టిన‌ట్టే పెట్టి ఎత్తేశారు. ప‌వ‌న్ అలాక్కాదు. 2014లో ఆయ‌న నేరుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేయ‌లేదు. నాటి టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంటే ఒక వ్య‌క్తి  నేలపై పడుకున్న వాడు పడుకున్నట్లే నిటారుగా నిలుచోలేడు.. ముందు నిదానంగా కూర్చుని  ఆపై ఎలా లేస్తాడో అలాంటి వ్య‌వ‌హారం అన్న‌మాట‌. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడి పోవ‌డం. ఆపై త‌న పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఒకే ఒక్క‌డు, రాజోలు ఎమ్మెల్యే రాపాక‌ వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీలోకి వెళ్లినా.. త‌న కౌంట్ అసెంబ్లీలో జీరో అయినా  ఆ ఐదేళ్లు నిల‌బ‌డి, క‌ల‌బ‌డి ఆపై 2024లో తిరిగి పొత్తు క‌లుపుకుని   వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం ఆయన ఘనత.   చాలా మంది అప్ప‌టి వ‌ర‌కూ అన్న మాట ఏంటంటే.. ప‌వ‌న్ కి అస‌లు రాజ‌కీయాలే తెలియ‌వ‌ని. కానీ ఆయ‌న త‌న పంథాలో తాను చేయాల్సిన రాజ‌కీయ ప్ర‌యోగాలన్నీ చేసేశారు. ఒక సారి మ‌ద్ద‌తిచ్చాం. మ‌రోమారు ఒంట‌రిగా పోటీ చేశాం. మ‌నం ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో 2009నాటి రిజ‌ల్ట్స్ వ‌చ్చాయ్. అప్ప‌ట్లో త‌న అన్న‌య్య కార‌ణంగా తిరిగి  వైఎస్ రాజశేఖరరెడ్డి విజయానికి ఎలో దోహదపడ్డారో , 2019 ఎన్నిక‌ల్లో జగన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ విజయానికి దోహదపడ్డారు.  దీంతో ఆయన మళ్లీ పొత్తులతో వెడితే..  2014 నాటి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చ‌ని  అంచ‌నా వేసి దాని ప్ర‌కార‌మే ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ముందు పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు. అప్ప‌టికీ ప‌వ‌న్ ని బీజేపీ మైండ్ వాష్ చేయ‌కుండా పోలేదు. కానీ అది క‌రెక్టు కాద‌ని తానే ఓన్ డెసిష‌న్ తీసుకుని  రాజ‌కీయ ప‌రిణితిని  ప్ర‌ద‌ర్శించారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూశారు.  దీంతో కూట‌మి ఘ‌న‌ విజ‌యం సాధించింది. ఒక‌ప్పుడు రెండు చోట్ల పోటీ  చేసి ఓడిపోయిన ప‌వ‌న్.. త‌ర్వాత వంద‌కు వంద‌శాతం ఫ‌లితాల‌తో.. విజ‌య ఢంకా మోగించి.. ప్ర‌స్తుతం 21 ఎమ్మెల్యే 2 ఎంపీ, ఆపై మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌తో  తిరుగులేని విజయం సాధించారు.  ఇప్పుడు ప‌వ‌న్ టార్గెట్ జ‌న‌సేన జాతీయ పార్టీ కావాల‌ని భావించ‌డం. ఈ విష‌యంలోనూ కొంద‌రు గ‌ణాంకాలు వ‌ల్లె వేస్తున్నారు. మీకు ఆ మాత్రం ఓటు శాతం లేద‌ని అంటున్నారు. అది కూడా ఒక‌టిక‌న్నా ఎక్కువ రాష్ట్రాల నుంచి కావాల‌ని దెప్పి పొడుస్తున్నారు. కానీ ఆయ‌న తొలుత అంద‌రూ ఎగ‌తాళి చేశార‌ని ఎంత మాత్రం వెర‌వ‌రు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశ‌గా వెళ్తూనే ఉంటారు. ఒక మినీ బీజేపీ స్థాయిలో ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఏపీలో అత్య‌ధిక శాతం గ‌ల కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన  వారు. ఆపై త‌న భార్య క్రిష్టియ‌న్. ఇప్పుడు తాను చూస్తే స‌నాత‌న సార‌థిగా దూసుకెళ్తున్నారు. ఇక త‌న‌కు తాను ప్ర‌తి  ప్రాంతాన్ని ఓన్ చేసుకునేలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల స్థానిక‌త‌ను సొంతం చేసుకునేందుకు ప్ర‌యత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా రాజ‌కీయాల్లో ఒక భాగ‌మే. అందుకే ఆయ‌న్ను ఎగ‌తాళి చేసిన వారంతా  ప్ర‌స్తుతం అసెంబ్లీలో ప‌త్తా లేకుండా పోయారు. ద‌మ్ముంటే అసెంబ్లీ గేటు తాకి చూడు అన్నారు. ఆయ‌న ఎంట్రీ ఇచ్చాక అక్క‌డ అసెంబ్లీలో వారి ఊసే లేకుండా పోయింది. దీనంత‌టికీ కార‌ణం ఆయ‌న ద‌గ్గ‌ర ట‌న్నుల కొద్దీ ఉన్న ఓరిమి. భూదేవికి ఉన్నంత ఓపిక‌. ఇదే ప‌వ‌న్ ఆయుధంగా చెప్పాలంటారు ప‌లువురు పొలిట‌టిక‌ల్ ఎన‌లిస్టులు.

కడపలో అగ్రనేతల సందడి

ఉమ్మడి కడప జిల్లాలో సోమవారం (సెప్టెంబర్ 1 )రాజకీయ సందడి నెలకొంది. ఈ జిల్లాలో ఆ ఒక్కరోజే మూడు పార్టీల అధినేతలు పర్యటించారు.   ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల సేవలో కార్యక్రమం కోసం విభజిత అన్నమయ్య జిల్లా రాయింపేటకు వచ్చారు. ఆయన అక్కడ పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు బంగారు కుటుంబాలు ,పి 4 కార్యక్రమాలు, ధోబిఘాట్ల సందర్శన వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదిక లో మాట్లాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సోమవారం  పులివెందుల చేరుకున్నారు.  మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం ఇడుపులపాయ చేరుకొని అక్కడ తన తండ్రి వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నివాళులర్పిస్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ  వైఎస్ షర్మిల కూడా సోమవారం (సెప్టెబర్ 1)  మధ్యాహ్నం ఇడుపులపాయకు  చేరుకున్నారు. ఆమె కూడా తన తండ్రికి  వైఎస్ ఘాట్ లో  నివాళులర్పించ నున్నారు.  ఒకే రోజు మూడు పార్టీలకు చెందిన ముగ్గురు అగ్రనేతలు జిల్లాలో పర్యటించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు.  

మంచి రోజులు వస్తాయి అధైర్య పడకండి : జగన్

  మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడకుండా ఉండాలని,  ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రజా దర్బార్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకొని వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఈ సందర్భంగా  వైసిపి పార్టీ నాయకులు,  కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, ప్రభుత్వం వినకపోతే పోరాటాలు చేసే దానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిని  ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు.  కూటమి నాయకులు దాడులకు ఎవరు భయపడకూడదని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని వారికి సూచించారు. మంగళవారం ఉదయం తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. *ఘన స్వాగతం  పులివెందుల కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ దగ్గర మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషా , కడప ఎంపీ  వైయస్ అవినాష్ రెడ్డి , కడప నగర మేయర్ కే సురేష్ బాబు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్ మనోహర్ రెడ్డి  అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్చం, శాలువాలు లతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది.

వరద బాధిత మృతులకు రూ.5లక్షల పరిహారం : సీఎం రేవంత్

  వరద సహాయక చర్యలను అధికారులు పకడ్బందీగా అందించాలి  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు , పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  వరదల వల్ల మరమ్మతులకు గురైన పంచాయతీ రోడ్లు, రోడ్లు భవనాల శాఖ రోడ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల క్రింద పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.  వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విపత్తుపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులను సీఎం సూచించారు.