బాప్ రే బాప్ అంటోన్న బచ్చా సీఎం...

మనకు సైకిల్ గుర్తు చూడగానే టీడీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. కాని, ఉత్తరాదిలో మరో సైకిల్ వుంది. అదే సమాజ్ వాది వారి సైకిల్! ములాయం సింగ్ యాదవ్ వారి ఈ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ను ఏళ్ల తరబడి ఏలింది. ఇప్పుడూ ఏలుతోంది! కాకపోతే, గతంలో ములాయం సీఎం అయితే ఇప్పుడు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎం. అలాగని మీరు తండ్రి తరువాత కొడుకు వారసత్వం తీసుకున్నాడు అని లైట్ తీసుకుంటే పొరపాటే! ప్రస్తుతం సమాజ్ వాది సైకిల్ రెండు చక్రాలు ఒక దానితో ఒకటి గొడవ పడుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే వున్న సమయంలో నానా గందరగోళం జరుగుతోంది! దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. దానిపై కర్చీఫ్ వేయాలని అన్ని పార్టీలు చూస్తాయి. కాని, గతంలో దశబ్దాలు లక్నోని ఏలిన లక్కీ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ డమ్మీ అయిపోయింది.   రాహుల్ రైతులకి మంచాలు వేసి మీటింగ్ లు పెడుతూ నానా తంటాలు పడుతున్నా అధికారంలోకి వచ్చే సీన్ కనిపించటం లేదు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో వున్న రామ జన్మభూమి వివాదంతో బీజేపి ఇవాళ్ల ఏకంగా దేశాన్నే ఏలుతోంది. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ను కూడా పరిపాలించింది. కాని, కాల క్రమంలో బాబ్రీ లాగే ఆ పార్టీ కూడా కుప్పకూలింది. ఇప్పుడు అమిత్ షా ఎలాగైనా ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసింపజేయాలని, రాముని భూమిలో రాజ్యం చేయాలని తపిస్తున్నారు!.ఉత్తర్ ప్రదేశ్ లో జాతీయ పార్టీలకు బతుకు దుర్బరం చేసినవి ప్రాంతీయ పార్టీలే. వాటిలో మొదటిది సమాజ్ వాది. రెండోది బహుజన్ సమాజ్ పార్టీ. వీళ్లు కులాల ఫార్ముల నమిలి మింగి అరిగించేసుకుని రాటుదేలారు. మాయవతి దళితులంటే ములాయం యాదవ్ లు, బీసీలు, ముస్లిమ్ లు అన్నాడు. ఇలా సమాజాన్ని అడ్డంగా విభజించి పాలిస్తున్నాయి ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు సమాజ్ పార్టీలు! అందులో ప్రస్తుతం అధికారంలో వున్నది ... దేశంలోనే అత్యంత కరుడుగట్టిన కుటుంబ పార్టీ సమాజ్ వాది!  యూపీని పరిపాలిస్తోన్న ఎస్పీ మళ్లీ అధికారంలోక్ వచ్చే సూచనలు అస్సలు కనిపించటం లేదు. అందుకు కారణం గత నాలుగేళ్లుగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన నేరాలే. అభివృద్ది మాట అటుంచితే కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేకపోయాడు అఖిలేష్ యాదవ్. అందుకు కారణం మరెవరో కాదు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతు దారులే.సమాజ్ వాది అధికారంలో వస్తే దళితులు టార్గెట్ అవుతారన్న మాట మరోసారి నిజం చేశారు ఈసారి కూడా. యూపీలో పదే పదే దళితులపై దాడులు జరిగాయి. అంతే కాదు, ఆజం ఖాన్ లాంటి ఎస్పీ నేతల వల్ల హిందు, ముస్లిమ్ గొడవలు కూడా బాగానే జరిగాయి. ఎక్కడపడితే అక్కడ మత కలహాలు రాజుకున్నాయి.  ఎలాగో నాలుగేళ్లు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం ఎన్నికలకి వెళుతోన్న అఖిలేష్ కి క్లైమాక్స్ కి ముందు స్వంత తండ్రే షాకిచ్చాడు. అఖిలేష్ తన మద్దతు దారులకి పార్టీ పదవులు కట్టబెడుతూ ఎన్నికలకి ప్రిపేర్ అవుతుంటే ములాయం అడ్డంగా ఎంటరై తన తమ్ముడ్ని పార్టీ చీఫ్‌గా ఎంపిక చేశాడు. అఖిలేష్ ను పట్టించుకోకుండా ములాయం నిర్ణయాలు తీసుకోవటమే కాదు అసలు కుర్ర యాదవ్ తన వల్లే సీఎం అయ్యాడని ప్రకటించాడు. ఇప్పటికే నేనే బాస్ అంటూ హెచ్చరించాడు.మొత్తానికి ములాయం చర్యల వల్ల అఖిలేష్ డమ్మీ కావాల్సి వచ్చింది! ఆయన ఎంపిక చేసిన అభ్యర్థుల్ని ఇప్పుడు ములాయం మనుషులు టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపుతున్నారు. ఒకప్పటి ములాయం స్నేహితుడు, జయప్రదకి ఆప్తుడు అమర్ సింగ్ కూడా చక్రం తిప్పటం మొదలుపెట్టాడు. అఖిలేష్ కి అమర్ సింగ్ అంటే కూడా పడదు. ఇలాంటి అమర్ సింగ్ లు చాలా మందే ములాయం అండతో సమాజ్ వాదిలో చెలరేగుతున్నారు!  దేశంలోని చాలా పార్టీల్లో అంతర్గత విభేదాలు చూశాం. కాని, ఎస్పీ లాంటి ఒక కుటుంబ పార్టీలో తండ్రి కొడుకులు ములాయం, అఖిలేష్ లే ప్రత్యర్థులుగా మారటం ... నిజంగా విడ్డూరమే! తమ పార్టీనే ఇంత గొప్పగా నడుపుతున్న సదరు నేతలంతా ఉత్తర్ ప్రదేశ్ ను ఎంత ఉత్తమంగా నడిపి వుంటారో .. మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు! 

కృష్ణా జిల్లా టీడీపీలో... అందరూ హ్యాపీయేనా?

ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి. దాంతో నదుల్లో వరదలు పొటెత్తుతున్నాయి. రిజర్వాయర్లు నిండుగా కళకళలాడుతున్నాయి. కాని, అదే సమయంలో హఠాత్తుగా వచ్చి చేరుతున్న కొత్త నీటితో పాత నీరు కొంత అలజడికి గురవుతోంది! ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపి పరిస్థితి కూడా నిండా నిండిన రిజర్వాయర్లా వుంది! కొత్త నీరు, పాత నీటితో కళకళ లాడుతోంది!. టీడీపికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మాణం, కార్యకర్తలు, నేతలు, బడా నాయకులు వున్నా కృష్ణా జిల్లా ప్రత్యేకం. ఇప్పుడంటే అమరావతి రాజధాని కాబట్టి రాజకీయ వ్యవహారాలు పెరిగాయని అనుకోవచ్చు. కాని, గతంలో కూడా కృష్ణా జిల్లా టీడీపీ పవర్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు మొదలు ఆంధ్రా రాజకీయాల రాజధాని విజయవాడ వరకూ  అన్నీ కృష్ణా జిల్లాలోనే వుండటమే దీనికి కారణం. ఇక విజయవాడ చుట్టూ వుండే నియోజకవర్గాల రాజకీయ చైతన్యం గురించి అందరికీ తెలిసిందే...    2014లో టీడీపీ నవ్యాంధ్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అమరావతి రాజధాని అయింది. దాంతో సీఎం సహా మంత్రులంతా ఇక్కడే వుంటున్నారు. కాబట్టి రాజకీయంగా కీలకంగా మారిన కృష్ణా జిల్లాలో పట్టు సంపాదించటం పై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ ఎఫెక్టే ఒకప్పటి కీలక నేత దేవినేని నెహ్రు పునరాగమనం! పార్టీ స్థాపించినప్పటి ప్రముఖ నేత అయిన దేవినేని తరువాతి కాలంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయంలో తనదైన రాజకీయం చేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తిరిగి స్వంత పార్టీలోకి వచ్చేశారు. ఇది ఆయనకు లాభమే కావొచ్చు కాని... అంతకంటే ఎక్కువగా టీడీపికి లాభం! ఇదే విషయం దేవినేని ప్రత్యర్థులకి బాబు చెప్పరంటున్నాయి టీడీపి వర్గాలు.    దేవినేనికి కృష్ణా జిల్లాలోని ఇతర కీలక నేతలైన వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ వంటి వారితో పెద్దగా పొసగదు. ఇది బహిరంగ రహస్యమే. అందుకే, దేవినేని వర్గం కొత్త నీరులా వచ్చి పార్టీలో చేరటంతో పాత నీరు లాంటి వల్లభనేని, ప్రసాద్ వర్గాలు కొంత ఆందోళన చెందాయి. అయినా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి అంతా మౌనంగానే వున్నారు. కాని, దేవినేని పూర్తిస్థాయిలో టీడీపి కండువా కప్పుకునేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకి మాత్రం నెహ్రు ప్రత్యర్థులు ఎవరు రాలేదు. కాని, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న నెహ్రుతో విభేదాలు ఓకే. కాని, ఇప్పుడందరూ టీడీపీలోనే వుంటూ ఎడ ముఖం పెడ ముఖంగా వుంటే ఎలా? అందుకే, దేవినేనితో పడని వారిని పిలిపించుకుని బాబు మీటింగ్ పెట్టారట...    దేవినేని కాంగ్రెస్ లోని కీలక నేత. పైగా కృష్ణా జిల్లాలో వైసీపీ కంటే ఇప్పటికీ కాంగ్రెస్సే బలంగా వుంది. కాబట్టి ఆ పార్టీని ఎదుర్కోవటానికి ఒకప్పటి టీడీపీ నేతైన దేవినేని అయితేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను సర్దుకుపోవాలని ఆయన సూచించారట. టీడీపీ వర్గాల సమాచారం మేరకు దేవినేని రాకతో ఇప్పటికే పార్టీలో వున్న పాత నేతలకి, వాళ్ల కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది రాదని సీఎం హామి ఇచ్చారట... దేవినేని చేరికతో పార్టీ లోపల ఏం జరగబోతోందో ముందు ముందు తెలుస్తుంది. కాని, పార్టీ వెలుపల మాత్రం జిల్లాల్లో టీడీపీకి తిరుగులేకుండా పోతుంది. ఇది టీడీపీ అభిమానులకి పెద్ద గుడ్ న్యూసే....  

పాకిస్తాన్ కోసం పాపిష్ఠి ప్లాన్ వేసిన కాంగ్రెస్!

సెప్టెంబర్ 21... ఇంటర్నేషనల్ పీస్ డే! పీస్ అంటే శాంతే కాదు... ఇంగ్లీషులో చిన్న ముక్క అని కూడా అర్థం! గత యూపీఏ ప్రభుత్వం బహుశా పీస్ అంటే శాంతికి బదులు ముక్క అని అర్థం చేసుకుందేమో! అందుకే, పాకిస్తాన్ కు మన దేశం లోంచి ఓ ముక్కను తీసి ఇచ్చేద్దామనుకుంది! అదీ ఏ పనికిమాలిన ప్రాంతమో కాదు. ఏకంగా అత్యంత భౌగోళిక ప్రాధాన్యమున్న సరిహద్దు ప్రాంతాన్నీ! ఇంతకీ మన్మోహన్ సింగ్ వారి సోనియా ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? వికీలీక్స్ తాజా లీకేజీల్లో కాంగ్రెస్ మార్కు జాతి విద్రోహం బయటపడింది. భారత్, పాక్ సరిహద్దులో వున్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం శత్రు దేశానికి అప్పగిద్దామని యూపీఏ భావించిందట! కాని, ఇండియన్ ఆర్మీ తీవ్ర అభ్యంతరం చెప్పటంతో మన్మోహన్ వారు వెనక్కి తగ్గారట. ఇంతకీ సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే లాభం ఏంటి? ఏం లేదనే అంటున్నారు బుర్రలో ఏ మాత్రం గుజ్జు వున్న వారైనా. కాని, సోనియా నేతృత్వంలోని యూపీఏకు అలా అనిపించలేదు. సియాచిన్ హిమనీ ప్రాంతం పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం మంచిదైపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వుంటుందని అనుకున్నారు! అంతే కాదు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి, పాక్ తో శాంతికి మన్మోహన్ కూడా తన వంతు కృషి చేశారని చరిత్ర చెప్పుకుంటుందని కక్కుర్తి పడ్డారు!  సియాచిన్ ఊరికే మన దేశంలో అంతర్బాగం కాలేదు. ఇప్పటి వరకూ దాదాపు 900ల మంది జవాన్లు అమరులైతే అది మన చేతుల్లో వుంది. 1984లో భారత ఆర్మీ ఎంతో కష్టపడి, ప్రాణాలొడ్డి దాన్ని కైవసం చేసుకుంది. ఎత్తైన ఆ ప్రాంతం ఒకవేళ పాక్ చేతిలో వుంటే పై నుంచి కాల్పులు జరపటం తేలిక. బుల్లెట్స్ కి ఎదురొడ్డి పైకి ఎక్కుతూ యుద్ధం చేయటం మన సైనికులకి నరకం లాంటిది. అయినా ఇవేవీ సోనియా, మన్మోహన్ లకు పట్టలేదు...  యూపీఏ అధికారంలో వుండగా సియాచిన్ పాక్ కు అప్పగించి మంచి పేరు తెచ్చుకుందామని అప్పటి పాలకులు దాదాపు నిర్ణయించారట. కాని, ఆర్మీ వద్దని పట్టుబట్టడంతో వెనక్కి తగ్గారట. వికీలీక్స్ చెప్పిన సారాంశం ఇది. కాని, ఇక్కడ విబ్రాంతికరం ఏంటంటే మన పాలకుల జాతి వ్యతిరేక స్వార్థ చింతన! అసలు కాశ్మీర్ సమస్యకు నెహ్రు ఎంతగా మూల కారణమో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇందిర దైర్యంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించి పాక్ కు చుక్కలు చూపించింది. కాని, ఆమె కూడా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవటం కోసం 90వేల మంది పాక్ సైనికుల్ని బేషరతుగా విడిచిపెట్టింది. కాని, బంగ్లాదేశ్ యుద్దం తరువాత మన వద్ద గొప్ప అవకాశం వుండింది. పాక్ తన 90వేల సైనికులు, మన చేతిలో వున్న కరాచీ నగరం కోసం అప్పుడే కాశ్మీర్ సమూలంగా మనకు ఇచ్చేసేది. కాని, చరిత్రలో తనకంటూ గొప్ప పేరు వుండాలని ఇందిరా గాంధీ కాశ్మీర్ తేల్చకుండానే పాక్ ను విడిచిపెట్టేసింది! ఇందిర తరువాతి కాలంలో పీఎం అయిన మరో అతి సెక్యులర్ మేధావి ఐకే గుజ్రాల్. బారత దేశ ముస్లిమ్ లను వెనకేసుకు రావటానికి, పాక్ ను వెనకేసుకురావటానికి కూడా ఈయనకు తేడా తెలియదు. పాకిస్తానీలు తనకు ఓటు వేస్తారన్నట్టుగా రా కార్యకలాపాలు మూసేయించాడు. అవును, గుజ్రాల్ మహానుభావుడు పాక్ పై నిఘా పెట్టే ఆర్ సంస్థ కార్యకలాపాలే కట్టి పెట్టేశాడు! అది సృష్టించిన సమాచార లోపమే చివరకు వాజ్ పేయ్ టైంలో కార్గిల్ ఉదంతంగా మారింది.  వాజ్ పేయి,ఇప్పుడున్న మోదీ కూడా పాక్ తో సత్సంబంధాలే కోరుకున్నారు. కాని, చరిత్ర స్పష్టంగా చెబుతోన్న గుణపాఠం ఏంటంటే పాక్ ది వంకర తోక. అది ఇక్కడి ప్రధాని ఎవరు స్నేహ హస్తం చాచినా ఆ చేయిపై వేటు వేయాలనే చూస్తుంది! అందుకే, ఒకవేళ మన్మోహన్ సియాచిన్ ఇచ్చివేసి వుంటే కూడా ఇలాగే ఉగ్రదాడులు చేస్తూనే వుండేది. పైగా మన సైన్యం ఆ నిర్మానుష్యమైన మంచు ముక్క కోసం చేసిన త్యాగాలు వృథా అయ్యేవి! కాంగ్రెస్ పాలనలో సాగిన యూపీఏ శకం దారుణమైన పాక్ అనుకూల వాదులకి సాక్షి. ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ మోదీ ప్రధాని అయ్యాక కూడా పాక్ వెళ్లి అక్కడి వారితో కలిసి మోదీని ఓడిద్దాం అంటాడు. దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని జనాభ్, సాహెబ్ అంటూ గౌరవంగా పిలుస్తుంటాడు. మొన్నటికి మొన్న భారత ఆక్రమిత కాశ్మీర్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడాడు. అంతే కాదు, ముంబై దాడులకి పాక్ ఉగ్రవాదులు కాదు ఆరెస్సెస్ కారణమంటూ రాసిన పిచ్చి పుస్తకాన్ని కూడా దిగ్విజయ్ సింగే ఆవిష్కరించాడు...  ఎవరో చిన్నా చితక నేతలు కాదు ఏకంగా రాహుల్ గాంధీనే... అరెస్సెస్, ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే డేంజర్ అంటూ చెప్పాడు. ఆ విషయం కూడా వికీలీక్సే బయటపెట్టింది! ఇలా పార్టీ మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చింది సోనియా నేతృత్వంలో. తాజాగా బయటపడ్డ ఆధారాలతో ఇటలీ నుంచే కాశ్మీర్ వేర్పాటు వాదులకి నిధులు కూడా వస్తున్నాయని తేలింది. ఇన్ని విధాలుగా మన నాయకులు దేశానికి హాని చేయటానికి సిద్ధపడ్డారు...  సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం బాగుపడుతుందని ఒకవేళ నిజంగానే మన్మోహన్ ఆశిస్తే అది గొప్పతనం కాదు... ఆయన అమాయకత్వం అవుతుంది. ఇంకా కాదంటే సోనియా కారణంగానే అతను అలా ప్రవర్తించి వుంటాడని అనుకోవచ్చు. ఎందుకంటే, యూపీఏలో ప్రభుత్వం మన్మోహన్ దైనా పాలన సోనియాదే కదా! అప్పుడు ఈ సియాచిన్ పాపం కూడా గాంధీల ఖాతాలోకే వెళ్లాలి... 

'జల'దరింపజేస్తోన్న హైద్రాబాదర్ రో్డ్లు!

హైదరాబాద్ .... హైరానాబాద్ అయిపోయింది! కారణం ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురుస్తున్న వర్షమే! నిజానికి వాన పడగానే హైద్రాబాద్ వాసులు నరకం చూడటం ఇప్పుడు కొత్తేం కాదు. ఎన్నో దశబ్దాలుగా ఇదే కథ నడుస్తోంది. చినుకు పడితే వణికిపోవటం మామూలైపోయింది. కాని, ఈ సారి పరిస్తితి మరీ దారుణంగా వుంది...  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ స్పెషల్ అటెన్షన్ పెట్టారు విశ్వనగరంపై. ఆయన నోటి వెంట బంగారు తెలంగాణ ఎన్నిసార్లు వచ్చిందో... అన్ని సార్లు హైద్రాబాద్ విశ్వనగరం అనే మాట కూడా వచ్చింది. హైద్రాబాద్లో స్కై స్కేపర్లు మొదలు స్కై వేస్ వరకూ బోలెడు నిర్మిస్తాం, నగరం రూపు రేఖలే మార్చేస్తామని పదే పదే ప్రకటించారు. కాని, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం కురుస్తోన్న వర్షాలు నిజమైన హైద్రాబాద్ ని ప్రతీ రోజు సాయంత్రం కళ్ల ముందు నిలుపుతున్నాయి.  హైద్రాబాద్ రోడ్లు బాగా లేవన్న విషయాన్ని ఊరికే మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శగా తీసుకోకూడదు ప్రభుత్వం. సిటీపై దృష్టి పెట్టిన కేటీఆరే స్వయంగా అంగీకరిస్తున్నారు రోడ్లపై వున్న అద్వాన్న పరిస్థితిని! వర్షం కారణంగా రోడ్లు కొట్టుకుపోవటమే కాదు... వాట్ని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయకపోవటం సమస్యకి అసలు కారణం. వర్షం వల్ల లోతైన గుంతలు ఏర్పడ్డాక అవ్వి పూడుస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. పూర్తి స్థాయి మంచి రోడ్లు వర్షాలు తగ్గాక వేసే ఆలోచన  వున్నా అప్పటి వరకూ రిపేర్లన్నా చేయాలి. కాని, జీహెచ్ ఎంసీ ఆ పనులు చేస్తున్నట్టు కనిపించటం లేదు.... గత కొన్ని రోజులుగా వర్షం ప్రతీ సాయంత్రం చల్లగా పలకరిస్తోంది. కాని, హైద్రాబాదీలకు వాన చల్లదనం కన్నా ట్రాఫిక్ వేడి మంట పుట్టిస్తోంది. వాన పడ్డాక ఒకవైపు గతుకుల రోడ్లు, మరో వైపు బతుకు దుర్బరం చేసే ట్రాపిక్ జామ్లు బెంబేలెత్తిస్తున్నాయి. దీనిపై గవర్నమెంట్ అర్జెంట్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే, వర్షం వల్ల, వరద వల్ల హైద్రాబాద్ లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుంటాయి. వాట్ని అమాంతం బాగు చేసేయటం కుదరకపోవచ్చు. కాని, అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగస్తులకి ఎంతో కీలకమైన రోడ్లు, వాటిపై రాకపోకలు నిర్లక్ష్యం చేయటానికి వీలు లేని అంశం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా రహదారులపై చూపు సారించాలి. లేకుంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ వానా కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. అంతకంటే మించి బ్రాండ్ హైద్రాబాద్ పై కూడా గుంతలు పడ్డ రోడ్లు దారుణమైన ప్రభావం చూపే ఛాన్స్ వుంది...  

ఆటలాడితే కోట్లు... ఆత్మ త్యాగం చేస్తే లక్షలా..?

ఇప్పుడు దేశమంతా దేని గురించి మాట్లాడుతోంది? యూరీలో జరిగిన దారుణం గురించి, పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదం గురించి, అమరులైన జవాన్ల గురించి! మనం ఓ పని చేద్దాం. వెరైటీగా కొన్నాళ్ల కింద నడిచిన ఒలంపిక్స్ మెడల్ హంగామా గురించి మాట్లాడుకుందాం! ఎందుకు అంటారా? వినండీ... మీకే తెలుస్తుంది!. సింధు సిల్వర్ గెలిచింది! ఈ వార్త దేశమంతా దావాణలంలా వ్యాపించింది. అంతకంటే ముందే సాక్షి మలిక్ కుస్తీలో పతకం సాధించింది. అదీ సెన్సేషనే! ఇక ఈ మెడల్స్ అనౌన్స్ అయ్యాక అసలు జాతర మొదలైంది. సాక్షి తమ హర్యానా అమ్మాయి కాబట్టి అక్కడి సీఎం, తనకు ఏ సంబంధం లేకపోయినా కేజ్రీవాల్... ప్రైజ్ మనీ ప్రకటించారు! సింధుకైతే డబుల్ ధమాకా... ఒక రోజు తెలంగాణలో ఏం జరిగిందో... అదే మళ్లీ ఆంద్రాలో రీపీట్! రెండు రాష్ట్రాలు, ఇద్దరు సీఎంలు, రెండేసి సన్మానాలు, డబుల్ ప్రైజ్ మనీ! కోట్లకు కోట్లు నజరానా! అసలు చంద్రబాబు, కేసీఆర్ లే కాదు ఒలంపిక్ విజేతలకు మొక్కులు చెల్లించుకోటానికి దేశంలోని ఎక్కడెక్కడి రాష్ట్రాల సీఎంలో పోటీ పడ్డారు!   కట్ చేస్తే... ఒలంపిక్స్ విజేతలకు ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పుపట్టేదేం లేదు. కాని, తప్పంతా ఇప్పుడు జరుగుతోంది! ఆటగాళ్లు దేశం కోసం మహా అయితే తమ కాలాన్ని, శ్రమని, జీవితాన్ని వెచ్చిస్తారు! మరి అర్థరాత్రి ఆద మరిచి నిద్రలో వున్న మన జవాన్లు ఎవరి కోసం ప్రాణాలు అర్పించారు? ఉగ్రవాదుల రక్తపు దాహానికి ఎందుకు బలయ్యారు? దేశం కోసం, దేశ వాసులమైన మనందరి క్షేమం కోసం! వాళ్లే లేకుంటే... మనం అసలు క్షణమైనా పడుకోగలమా? కళ్లు మూసుకుంటే మళ్లీ కళ్లు తెరవగలమా? జాతి అస్థిత్వానికే మూలమైన సైనికులు చనిపోతే... ఒలంపిక్ విజేతలకు పోటీ పడి మొక్కులు చెల్లించిన ముఖ్యమంత్రులు... ఇప్పుడు ఎక్కడా గట్టిగా గొంతు విప్పి మాట్లాడటం లేదు!   మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు తమ తమ అమర జవాన్ల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి! ఎంత అనుకున్నారు? అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ 20లక్షలు అయితే అతి తక్కువగా బీహార్ 5లక్షలు ఇస్తామని చెప్పాయి! మళ్లీ ఇందులోనూ ఒక ట్విస్ట్ వుంది. ఏ రాష్ట్ర జవాను చనిపోతే ఆ రాష్ట్ర సీఎం మాత్రమే డబ్బులిచ్చారు! ఒలంపిక్స్ పతక విజేతలకు ఎగబడి ప్రైజ్ మనీ ఇచ్చిన ఏ సీఎం ఇప్పుడు స్సందిచటం లేదు.   ఢిల్లీ రాష్ట్రం నుంచి ఏ జవానూ చనిపోలేదు కాబట్టి కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలది కూడా ఇదే రూటు. తెలుగు సైనికులు అమరులు కాలేదు కాబట్టి మిగతా జవాన్లకు రూపాయి ప్రకటించలేదు. ఇది తప్పేం కాదు. కాని, దారుణం! ఒలంపిక్స్ లో పతకం గెలవటం కంటే ప్రాణాలు ధారపోయటం చిన్న విషయమా? పతక విజేతలకు కోట్లు, అమరులకు లక్షలా? సీఎంల చేతుల్లో వుండే ప్రజాధనం ఉపయోగించే పద్ధతి ఇదేనా?ఆటగాళ్లకి , సినిమా స్టార్లకి ప్రాధాన్యత ఇవ్వటం తప్పు కాదు. కాని, అంతకంటే ముఖ్యమైన రియల్ హీరోలకి గుర్తింపు , గౌరవం ఇవ్వటం మనందరి బాధ్యత. దీనికి ప్రజలు, పాలకులు ఎవ్వరూ మినహాయింపు కాదు...  

ఈ ప్రశ్నలు వేసుకుందాం... సిగ్గనిపిస్తే తలదించుకుందాం!

హవాల్డార్ రవి పాల్, జమ్ము...  సిపాయ్ రాకేష్ సింగ్, బీహార్... సిపాయ్ జవ్రా ముండా, జార్ఖండ్... సిపాయ్ జనరావ్ ఉకే, మహారాష్ట్ర... సిపాయ్ బిస్వజీత్ ఘొరాయ్, పశ్చిమ బెంగాల్... లాన్స్ నాయక్ ఆర్కే యాదవ్, ఉత్తర్ ప్రదేశ్...   వీళ్లంతా ఎవరో తెలుసుగా? పాక్ నుంచి అక్రమంగా వచ్చిన ఉగ్ర నక్కలకి బలైపోయిన మన సింహాల్లాంటి జవాన్లలో కొందరు!    అది సర్లేగాని... ఈ అమరులు నిజంగా ఎవరు? బీసీలా? దళితులా? ఆదివాసీలా? బ్రాహ్మణులా? ఏ కులం వారు? వాళ్ల రంగేంటి? ఉత్తరాదిన వుండే తెల్లటి ఆర్యులా? దక్షిణాదిన వుండే నల్లటి ద్రవిడులా? పోనీ వాళ్లు ఏ భాష మాట్లాడతారు? మరాఠీనా, డోగ్రీనా, మైథిలీనా, బెంగాలీనా, తెలుగా? సరే... కనీసం వాళ్లు తాగే నీళ్లేవీ? కావేరీవా? కృష్ణవా? గంగవా? లేక యమునవా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇదొక్కటే... ఆ వీర జవాన్ల గుర్తింపు ఒక్కటే... భారత సైనికులు! వాళ్ల వర్ణం కూడా ఒక్కటే... అది తమ యూనీఫామ్ రంగు! ఇక వాళ్లు మాట్లాడే భాష కూడా ఒకే ఒక్కటి! నామ్  , నమక్ ఔర్ నిషాన్... ఇదే ఆ అమరులు ఎప్పుడూ మాట్లాడింది!   ఇవాళ్ల హుతాత్ములై అమర జవాన్ల స్థూపంలో తాము అంతర్భాగమైన వీరంతా సజీవ దహనం చేయబడ్డారు. ఆద మరిచి నిద్రపోతున్నప్పుడు ఉగ్రవాదులు పిరికిపందల్లా వారిని శాశ్వత నిద్రలోకి తోసేశారు. అయినా మనకు చీమ కుట్టినట్టైనా వుందా? ఏమైనా చేద్దామని హృదయం ద్రవిస్తోందా? లేదు కదా... ఒక రోహిత్ వేముల తనని తాను  ఉరివేసుకుంటే వేల మంది కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అలా కదిలిపోయేలా ఉద్యమం నడిపించారు. ఒక దోషిగా తేలిన ఉగ్రవాది, యాకుబ్ మెమన్ ఉరికంబం ఎక్కితే చాలా మందికి ఊపిరాడలేదు. వేలాది మంది అతడి అంతిమ యాత్రలో పాలుపంచుకున్నారు! ఇక మొన్నటికి మొన్న ఒక ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్లో ఎండ్ అయ్యాడు. కాని, తరువాతేం జరిగింది? ఆయన తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ అంటూ గొప్పగా సానుభూతి ప్రచారం మొదలైంది!    మరి... ఇప్పుడు మన కోసం, మన దేశం కోసం ప్రాణాలొదిలిన ఈ 17మంది అంతిమ యాత్రకు ఎంత మంది బయలుదేరుతారు? అయినా మనకు అసలు అంత టైముందా? ఈ దేశంలో ప్రతీ రోజూ వేలాది మంది రోడ్ల మీదకు వస్తారు. ప్రభుత్వ అస్తుల్ని తగులబెడతారు. ప్రజలపై పరోక్షంగా దాడి చేస్తారు. ఒక రోజు కొందరు నీళ్లు కావాలని రోడ్డెక్కితే, మరో రోజు మరి కొందరు రిజర్వేషన్లు కావాలంటూ గళమెత్తుతారు, ఇక ఇంకా కొందరు తమ భాష కోసం, నేరస్థులు, ఉగ్రవాదులకి తమ మద్దతు తెల్పటం కోసం కూడా వీధుల్లో వీరంగం వేస్తారు! కాని, ఇప్పుడు జాతి శత్రువుల చేతిలో నిర్జీవులైన జవాన్ల కోసం ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రారు!   నిన్న 17మంది కావచ్చు... రేపు 25మంది అవ్వొచ్చు... ఎంత మంది యువ సైనికులు భరతమాత కోసం ప్రాణాలు అర్పిస్తే మాత్రం మనకేంటి? ఒక జాతిగా మన ప్రతిస్పందన ఏంటి? అదే రక్తం మరిగిన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడతాం! అదే పాకిస్తాన్ నుంచి వచ్చే గులాం అలీ సంగీతం వింటూ గంగిరెద్దుల్లా తలలూపుతాం! భజ్రంగీ భాయ్ జాన్, పీకే లాంటి పాకీ కనెక్షన్ వున్న పాడు సినిమాల్ని సూపర్ హిట్ చేస్తాం! ఉగ్రవాదుల్ని మన మీదకి పంపించే పాకిస్తాన్ లోంచే నటుల్ని తెచ్చుకుని సిగ్గూ షరమ్ లేకుండా... చొంగ కారుస్తూ బాలీవుడ్ తెరపై చూసుకుంటాం!    మన కోసం, మన దేశం కోసం, మన దేశ సార్వభౌమత్వం కోసం, స్వేచ్ఛా, స్వతంత్రం, సంతోషాల కోసం... చలిలో, వేడిలో, కష్టంలో, నరకంలో దేశ రక్షణ చేసే  అసలు హీరోలు సైనికులు! వాళ్లని గౌరవించలేని మనం.. వాళ్లు పెట్టే భిక్ష లాంటి స్వాతంత్ర్యానికి అర్హులమేనా? ఆలోచించుకుందాం... 

భారత సైనికుల్ని... ఇండియానే చంపిందంటోన్న పాక్ మీడియా!

  భారతదేశానికి కాశ్మీర్ ఒక సమస్య. కాని, పాకిస్తాన్ కు కాశ్మీర్ సమస్యే పెద్ద జీవనాధారం! ఇది కాస్త విచిత్రంగా వున్నా నిజం. అక్కడి పాలకులకి కాశ్మీర్ సమస్య చక్కటి మంత్రదండం! తమకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు బయటకి తీస్తుంటారు. మనపైనే కాదు తమ స్వంత ప్రజలపై కూడా ప్రయోగిస్తుంటారు.    పాకిస్తాన్ లో లేని దరిద్రం అంటూ లేదు. అక్కడ పేదరికం, నిరుద్యోగం, మతోన్మాదం, హింస, స్త్రీలు, బాలలపై దాడులు... ఇలా అన్నీ వున్నాయి. అన్నిట్నీ మరిపించి జనాన్ని ఆవేశంతో ఊగిపోయేలా చేసేది... కాశ్మీర్ ఒక్కటే! పాకిస్తాన్ పాలకులు పదే పదే కాశ్మీర్ ప్రస్తావన చేయటం ఇందుకే. తమ లోకల్ మీడియా గొట్టాల ముందు మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో మైకుల ముందు వరకూ పాకీలకు ఇదే పని! కాశ్మీర్ జపం చేస్తూ తమ దేశంలో జరుగుతున్న అరాచకం కప్పి పుంచుకుంటుంటారు.    పాకిస్తాన్ లో పొలిటీషన్స్, మిలటరీ వాళ్లు, ఉగ్రవాద నాయకులు, మతోన్మాదులు...ఇలాంటి వాళ్లు సరే! ఆఖరుకి మీడియా కూడా ఇండియా, కాశ్మీర్ నెపం చెప్పుకునే బతికేస్తోంది! మొన్న యూరీలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత అక్కడి న్యూస్ పేపర్లు వింత వింత వాదనలు ముందు తీసుకొచ్చాయి! తమ ప్రధాని నవాజ్ షరీఫ్ యూఎన్ ఓలో కాశ్మీర్ ప్రస్తావన తేబోతుండటంతో భారత్ కావాలనే ఉగ్రవాద దాడి నాటకం నడుపుతోందని ఆరోపించాయి! అవును... మీరు వింటున్నది నిజమే... పాక్ పత్రికలు ఇండియ తన సైనికుల్ని తానే చంపుకుని పాక్ పై నింద వేస్తోందని చెబుతున్నాయి! ఇదీ వరస...    పాకిస్తాన్ పేపర్లకు టీవీలు కూడా ఏం తీసిపోవు. వాటిల్లో కూడా పొద్దున్నా, సాయంత్రం మైకులు పగిలేలా చర్చలు పెడుతుంటారు. అందులోనూ పాకిస్తాన్ జనానికి అసలు నిజం కాకుండా అంతా బూతులే వినిపిస్తుంటారు! సో కాల్డ్ మేధావులు స్టూడియోల్లోకి వచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంటారు! పాకిస్తాన్  మిలటరీ కమాండర్లు మాట్లాడినట్టే ఉన్మాదంగా ఇండియాని ఓడిస్తాం అంటూ బీరాలు పలుకుతుంటారు! వీటన్నిటి మధ్యా సామాన్య పాకిస్తానీలు మాత్రం భ్రమలు, భయాలు, ఆవేశాలు, ఆక్రోశాల మధ్యే కాలం గడిపేస్తున్నారు! పాకిస్తాన్ తన ఉగ్ర వాద నక్కలతో కలిసి చేసే చిన్నా చితకా దాడులతో ఏదో ఒక రోజు కాశ్మీర్ భారత్ నుంచి విడిపోతుందని కలలుగంటున్నారు! ఇక వాళ్లని, వాళ్ల దేశాన్ని అక్కడి మీడియా, మేధావులు, నేతలు, మిలటరీ, ఉగ్రవాదుల నుంచి ... అల్లానే కాపాడాలి!

విజయ్ మాల్యా మనిషే కాదన్న కోర్టు!

  విజయ్ మాల్యా... ఈ పేరు నిన్న మొన్నటి దాకా ఓ సెన్సేషన్! విమానాల దగ్గర్నుంచి బికినీల్లో ఊరించే అమ్మాయిల దాకా మనోడి లైఫ్ స్టైల్లో అన్నీ సంచలనమే! మీడియా కూడా ఆహా ఓహో అంటూ ఆరాధించేది. ఇక రాజకీయ నాయకుల సంగతైతే సరేసరి! విజయ్ మాల్యాను తమకు సాధ్యమైనంత సత్కరించుకున్నారు అన్ని పార్టీల వారు! అందుకే, ఇండిపెండెంట్ గా రాజ్యసభ సీటు కొ్ట్టాడు మాల్యా! అంటే... అన్ని పార్టీలు కలిసి కింగ్ ఫిషర్ జాదూని గెలిపించాయన్నమాట! విజయ్ మాల్యా రంగుల ప్రపంచం కళకళలాడినప్పుడు అందరూ ఆయన్ని హీరోని చేస్తే ఇప్పుడు అందరూ కామెడీ చేస్తున్నారు. టీవీల్లో, పేపర్లలో కాదు... ఏకంగా కోర్టు కూడా సెటైర్లు వేస్తుంది మాల్యాపై! తాజాగా బాంబే హై కోర్టు ఆయన కంపెనీ గుర్తుపై కామెంట్లు చేసింది. కింగ్ ఫిషర్ కంపెనీ లోగోలో వుండే బొమ్మ కింగ్ ఫిషర్ పక్షే! అది ఎక్కడికంటే అక్కడికి ఈజీగా ఎగిరిపోతుంది. ఎంత దూరమైనా ఆకాశంలో సాగిపోతుంది! అచ్చం మాల్యా లాగే...    అవును... విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ పక్షి లాగే రెక్కలు విప్పుకుని వెళ్లిపోయారు అన్నది కోర్టు! ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భరంగా జస్టిస్ కింగ్ ఫిషర్ పక్షిని మ్యాటర్ లోకి తెచ్చారు! దాని లాగే మాల్యా కూడా ఊడాయించాడని కామెంట్ చేశారు. అంతే కాదు, ఆ పక్షి, ఈ పక్షి ఇద్దరీకి దేశాలు, సరిహఃద్దులు తెలియవని సెటైర్ వేశారు! విజయ్ మాల్యా స్వంత విమానం వేలం వేయటం పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆయన టోపి పెట్టిన బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖలు ఇప్పుడు ఆయన్ని డబ్బులు కక్కమంటూ వెంటాడుతున్నాయి. కాకపోతే, మన కింగ్ ఫిషర్ కింగ్ ప్రస్తుతం హ్యాపీగా లండన్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు!   విజయ్ మాల్యా చేసిన అప్పుల్లో లక్షో వంతు కూడా చేయని పేద రైతులు ప్రభుత్వాలకి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు మన దేశంలో! కాని, బికినీలు వేసుకున్న అమ్మాయిలతో కలిసి బీచుల్లో వేల కోట్ల రూపాయలు నీటిపాలుజేసిన మాల్యాని మాత్రం ... కోర్టు కూడా చీవాట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతోంది! జనం ఖర్మ... 

'బిర్యానీ' రుచి మరుగుతోన్న నిరసనకారులు!

కొన్ని సంఘటనలు అప్పటికప్పుడు షాక్ కి గురి చేస్తాయి! కాని, తరువాత మెల్లిమెల్లిగా మన సమాజంలోని సత్యాన్ని బయటపెడుతూ ఆందోళన కలిగిస్తాయి! అలాంటిదే ఈ మధ్య జరిగిన కావేరీ జలాల గొడవ, దాని తాలూకూ విద్వంసం... తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల పంపకంపై గొడవ ఈనాటిది కాదు. అది రెండు వైపుల ప్రజల్లో దారుణమైన సెంటిమెంట్ గా మారిపోయింది. దానికి రాజకీయ నాయకులు ఆజ్యం పోసీ పోసీ జనాన్ని శత్రువులుగా మార్చేశారు. ఇదొక పెద్ద విషాదం. ఒక నది నీళ్లు న్యాయంగా పంచుకోవటానికి కూడా వీలుపడని అమానుష స్థితి సాటి భారతీయుల మధ్య ఏర్పడటం... చాలా ఆందోళనకరం! కావేరీ జలాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నేతల వ్యవహార శైలి.... ఇదంతా ఒక ఎత్తైతే... అసలు విషాదం మరొకటి వుంది. ఎక్కడో సుప్రీమ్ కోర్టు తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకను ఆదేశిస్తే బెంగుళూరులో విధ్వంసం జరిగింది. అదీ జనం తమంత తాముగా రోడ్ల మీదకి వచ్చి బస్సలు, టైర్లు తగులబెట్టారన్నట్టుగా ప్రచారం జరిగింది. కాని, కాస్త ఆలోచిస్తే దీంట్లో బోలెడు కుట్ర కనిపిస్తుంది. కావేరీ జలాల అవసరం అత్యంత ఎక్కువగా వుండేది కర్ణాటక రైతులకి. వాళ్లు విధ్వంసం సృష్టించిన దాఖలాలు కనిపించటం లేదు. ఎవరో ముక్కూ, మొఖం తెలియని బెంగుళూరు నగరంలోని అల్లరి మూకలు బస్సుల్ని తగులబెట్టాయి. వీళ్లకు కావేరీ జలాల మీద, రైతుల మీద ఎందుకంత ప్రేమ? ఎవరు వాళ్లని ఉసిగొల్పుతున్నారు? ఇవే అసలు ప్రశ్నలు! కర్ణాటకలోనే కాదు ఆ మధ్య రాష్ట్ర విభజనకి ముందు మన తెలుగు నేలపై కూడా ఇదే జరిగేది! ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డ వ్యవస్థ గంటల వ్యవధిలో నిరసనకారుల్ని రోడ్లపైకి తెచ్చేసేది. తెలంగాణ కావాలన్నా కోరిక, సమైక్యాంధ్ర వుండాలన్న తపన ... ఈ రెండూ నిజమే అయినా జనం తమంత తాముగా వీదుల్లోకి రారు. మరి వాళ్లను ఎవరు తీసుకొస్తున్నారు? దీనికి సమాధానమే బిర్యానీ బ్యాచీ! దేశంలో ఎంత పెద్ద ఉద్యమమైనా, లేదంటే ఎంత పెద్ద బహిరంగ సభ అయినా, కాదంటే ఎంత పెద్ద ఓదార్పు యాత్రైనా... ఇలా ఎక్కడ ఏ కార్యక్రమానికి జనం అవసరం అయినా  బిర్యానీ టెక్నిక్ వాడుతున్నారు ఈవెంట్ మ్యానేజర్స్! ఓ బిర్యానీ, రెండొందలో, మూడొందలో డబ్బు ఇస్తే ఇన్స్టాంట్ ఉద్యమకారులు ప్రత్యక్షమం అవుతన్నారు. వీళ్ల మద్యే పాపం కొంత మంది నిజాయితీ పరులు కూడా తమ వర్గమో, జాతి క్షేమం కోసమో పోరాడవచ్చు. కాని, ఈ అసలు కంటే కొసరు శాల్తీలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే తాజా కావేరీ జలాల నిరసనల వరకూ అంతటా బిర్యానీ బ్యాచీనే! ఏ నిరసన, ఏ ధర్నా, ఏ రాస్తారోకో అయినా బిర్యానీ పెట్టించి జనాన్ని తేవటం పెద్ద ప్రమాదకరం ఏం కాదు అనుకుంటే పొరపాటే. బెంగుళూరులో కావేరీ జలాల గొడవ నేపథ్యంలో కేపీఎన్ అనే సంస్థ తాలూకూ బస్సుల్ని నిరసనకారులు తగులబెట్టారు. ఒకటి రెండు కాదు 42బస్సుల్ని దహనం చేశారు. దీనికి ప్రధాన కారణం అంటూ పోలీసులు ఓ 22ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు! ఆశ్చర్యకరంగా ఆమె ఎవరో పార్టీ మనిషి కాదు, పోనీ ఏదో సంఘానికి నాయకురాలు కూడా కాదు. కేవలం కూలి పని చేసుకునే పేదరాలు! కూలీకి వెళ్లే 22ఏళ్ల మహిళ తనకు బిర్యానీ పెట్టి వంద రూపాయలు ఇస్తారంటే నిరసనల్లోకి వచ్చింది. తీరా వచ్చాక తానేం చేస్తుందో తనకు తెలిసేలోపే ఇతర నిరసనకారుల్ని రెచ్చగొట్టి 42 బస్సుల్ని తగులబెట్టించింది. కేపీఎన్ సంస్థ ఉద్యోగుల పై కూడా డీజిల్ పోశారట! అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం కాలేదు! పోలీసులు చెబుతున్నట్టు బిర్యానీ కోసం రోడ్డుపైకి వచ్చిన ఒక పేదరాలే నిజంగా దారుణమైన విధ్వంసానికి కారణం అయితే ... దీనిపై గట్టి నిఘా పెట్టాల్సిందే! ఏ కార్యక్రమం జరిగినా జనం ఎక్కడ్నుంచి వస్తున్నారు, ఎవరు తెస్తున్నారు, ఎలా వాళ్లని తీసుకొచ్చే వారు కన్విన్స్ చేస్తున్నారు... ఇవన్నీ నిఘా సంస్థలు కనిపెడుతూ వుండాలి. లేదంటే... బెంగుళూరు తరహా అరాచకం మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం వుంది!   

పవన్‌తో బీజేపీ రాయబారం

  ప్రత్యేక హోదా విషయమై ఎప్పుడైతే బీజేపీ చేయిచ్చిందో అప్పటి నుంచీ పవన్‌ నోటికి పనిచెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ సెటైర్లతో మొదలుపెట్టి, బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీని ఉతికి ఆరేశారు. పెద్దాయన మోదీ జోలికి పోకపోయినా, ఇంటాయన వెంకయ్యనాయుడుని మాత్రం ఏకిపారేశారు. ఇటు తిరుపతిలోనూ, అటు కాకినాడలోనూ పవన్‌ బీజేపీని ఒక స్థాయిలో చీల్చి చెండాడారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోతే తెలుగువారి ఆత్మగౌరవం మంటగలసినట్లే అన్నంత ప్రచారాన్ని తీసుకువచ్చారు.   మొదట్లో పవన్‌ విమర్శలకు బీజేపీ శ్రేణులు కూడా ప్రతివిమర్శలు చేశాయి. వెంకయ్యనాయుడుని విమర్శించినందుకు క్షమాపణలు చెప్పితీరాల్సిందే అంటూ పట్టుపట్టాయి. కెమెరా ముందు కనిపించే అవకాశం లేని నేతల సైతం పవన్‌ని విమర్శించేందుకు ముందుకు వచ్చారు. కానీ పవన్‌ గాండ్రింపుల ముందు వీరి సౌండ్‌ బైట్లు పెద్దగా వినిపించలేదు. అంతేకాదు! పవన్‌ విమర్శలతో తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి చేటు జరుగుతోంది అన్న సూచనలు కేంద్రానికి అందాయి. దాంతో కేంద్ర నష్టనివారణకు చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం.   చంద్రబాబు ఎలాగూ ప్యాకేజీ మీద ఆశలు వదిలేసుకుని, ఇచ్చిన నిధులతో తృప్తిపడిపోయారు కాబట్టి పవన్‌ని కూడా దారికి తెచ్చుకుంటే మంచిదన్న అభిప్రాయం బీజేపీలో వ్యక్తమవుతోంది. ఇందుకోసం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుని రంగంలోకి దింపినట్లు సమాచారం. నిజానికి పవన్‌ను బీజేపీకి దగ్గర చేసింది సోమ వీర్రాజే. కాబట్టి ఆయన ద్వారానే మళ్లీ చితికిపోయిన బంధానికి అతుకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఆ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయో కాలమే చెప్పాలి. ఆ రాయబారమే కనుక సఫలం అయితే పాచిపోయినా సరే, లడ్డూ లడ్డేయే అని తెలుగు ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం పవన్‌ చేస్తారేమో చూడాలి!

సెప్టెంబరు 17 చుట్టూ రాజకీయాలు

  ఒకప్పుడు సెప్టెంబరు 17 వచ్చిందంటే దాని ప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎవ్వరిని కదిపినా పుంఖానుపుంఖాలుగా దాని విశేషం చెబుతున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్‌ సంస్థానం అందులో విలీనం అయ్యేందుకు తిరస్కరించడం; దేశ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు, స్థానిక తిరుగుబాట్లను అణిచివేసేందుకు రజాకర్లను నియమించడం; నిజాం ప్రభువు అందడందలతో ఆ రజాకర్లు మారణహోమాన్ని సృష్టించడం... ఇవన్నీ ఇప్పుడు కరతలామలకమైన విషయాలు. కానీ ఇప్పుడు అయోమయంలో ఉన్నది మాత్రం పార్టీలే అని తోస్తోంది.   సెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహించేందుకు మొదట్లో సాక్షాత్తూ కేసీఆరే ఉత్సాహపడ్డారు. ఆ రోజుని తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా ఎందుకని జరపడం లేదంటూ ఒకప్పటి ప్రభుత్వాలను నిలదీశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస, మజ్లిస్‌ పార్టీలు రెండూ మౌనంగా ఉండిపోయాయి. దానికి కారణం- నిజం ప్రభువుని కానీ రజాకర్లని కానీ విమర్శిస్తే అది ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందన్న భయమే స్పష్టంగా కనిపిస్తోంది. పాలకపక్షం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండిపోవడంతో ప్రతిసారీ బీజేపీ మరింత దూకుడుగా విరుచుకుపడే అవకాశం లభిస్తోంది. విమోచనమో, విలీనమో, స్వాతంత్ర్యమో... ఏదో ఒక పేరుతో ఈ రోజుని అధికారికంగా నిర్వహించమంటూ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది.     నిజానికి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ-ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించడం ఒక చారిత్రాత్మక తప్పిదం.  హైదరాబాదు సంస్థానం, భారతదేశంలో విలీనం కావడంతో ఈ ప్రాంతానికి ద్రోహం జరిగిందనుకోవడం అమాయకత్వానికి పరాకాష్ట. ఆ విషయం అందరికీ తెలిసినా కూడా తెలియనట్లు ఉండటం రాజకీయ నేతలకే చెల్లింది. కానీ పర్యవసానంగా దేశ చరిత్రలోనే అపూర్వమైన ఒక ఘట్టం మసిబారిపోతోంది. హైదరాబాదు మీద భారతీయ సైన్యం చేసిన దాడి ఒక క్లైమాక్సు మాత్రమే! అప్పటివరకూ నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి రైతులు, కమ్యూనిస్టులు, మహిళలు, పేదలూ చేసిన పోరాటం సంగతి ఏమిటి? రాజుకి వ్యతిరేకంగా పీడిత ప్రజలు చేసే పోరాటాన్ని హిందూ-ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చూడటం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలకు కొన్ని పార్టీల దగ్గర ఎలాంటి జవాబులూ ఉన్నట్లు కనిపించవు. కాబట్టి మున్ముందు కూడా సెప్టెంబరు 17వ తేదీ వచ్చిన ప్రతిసారీ ఈ ముసుగులో గుద్దులాటలు తప్పవు!

కావూరి రీసౌండ్ వెనుకున్నదేవరు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన వెంటనే..కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్‌లో ఉంటే తమ గతి అధోగతి అని భావించిన ఏపీ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు అంతా మూకుమ్మడిగా తలో ఒక పార్టీలో చేరిపోయారు. చాలా మంది టీడీపీ అధికారంలోకి రాగానే దానిలోకి జంప్ అయ్యారు. తెలుగుదేశంలో బెర్త్ దొరకని వారు బీజేపీలో చేరిపోయారు. అలా చేరిన వారిలో పురందేశ్వరి, కావూరి ఉన్నారు. వీరు బీజేపీలోకి వెళ్లారు గానీ అక్కడ వీరిని పట్టించుకునే వారే లేరు. అయినా కమలంలోనే కొనసాగుతూ తమ వంతు వచ్చినపుడు మీడియాలో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. పురేందేశ్వరి ప్రత్యేకహోదాపై ఆడపాదడపా మాట్లాడుతున్నారు, కానీ పాపం కావూరికి ఏ ఛాన్స్ రావడం లేదు.   పార్టీలో చేరి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా..తగిన ప్రాధాన్యం లేదని బాధపడుతున్న కావూరికి ఈ మధ్య బీజేపీ ఫుల్ ప్రయారిటీ ఇస్తోంది. ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీని ఏకీపారేస్తున్నారు. విభజన పాపం కాంగ్రెస్‌దే..జరగుతున్న అనర్థాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీలో చేరిన కొత్తల్లో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో మండిపడిన కావూరికి సడెన్‌గా కాంగ్రెస్ ఎందుకు గుర్తుకొచ్చింది.   విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో..బీజేపీకి అంతే భాగముంది..ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వైఖరి ఏపీ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, విభజన పాపం కాంగ్రెస్‌దేనని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా హోదా అంశాన్ని అటకెక్కించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకే వేరే ఎవరితోనో కాంగ్రెస్‌పై విమర్శలు చేయిస్తే బాగుండదని విభజన సమయంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన కావూరిని అందుకు ఎంపిక చేసినట్లున్నారు. కావూరి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా కాంగ్రెస్‌పై బాగానే విమర్శలు చేస్తున్నారు.

వంశీ, బోడె ప్రసాద్‌లకు చంద్రబాబు క్లాస్...?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకోవటంపై ఆ పార్టీలో ఎలాంటి వ్యతిరేకత రాలేదని పైకి చెబుతున్నా..కానీ అంతర్లీనంగా ఉన్న అసమ్మతి సెగ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. కృష్ణాజిల్లాలో అది తెలుగుదేశంలో నెహ్రూ రాకను వ్యతిరేకించేవారున్నారా.? ఎవరబ్బా..? వారు ఎవరో కాదు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు నెహ్రూ పచ్చ కండువా కప్పుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దేవినేని పార్టీలోకి వచ్చే వరకు నోరు మెదపని వీరిద్దరూ, ఆయన పార్టీలో చేరిన మరుక్షణమే తమ అసమ్మతిని వెళ్లగక్కారు. ఈ మేరకు వారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసినట్టు సమాచారం. ఈ భేటీలో అయిన వీరు నెహ్రూ పార్టీలోకి రావడం వల్ల తమకు కలిగే ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు కాస్త ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది..పార్టీలోకి కొత్తగా చేరేవారితో ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎవరిపనులు వారు చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరి నియోజకవర్గాల్లో వారు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని గట్టిగా క్లాస్ పీకి పంపారట. అధినేత వద్ద ఇలాంటి సమాధానాన్ని ఊహించని వారు కాస్త మనస్తాపానికి గురైయ్యారట.

నెహ్రూ రాకతో వంశీ ఆలోచనలో పడ్డాడా..?

కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కావడం, బలమైన సామాజికవర్గం అండదండలు, ప్రత్యేకించి మూడున్నర దశాబ్దాలుగా విజయవాడ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కావడంతో ఆయన రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఒక్కనేత మాత్రం ఆయన పసుపు కండువా కప్పుకోవడాన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనేవరో కాదు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అందుకు కారణం పాత విబేధాలు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో నెహ్రూ, వంశీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తనను దేవినేని వర్గం టార్గెట్ చేశారని వల్లభనేని వంశీ బహిరంగంగానే విమర్శించారు. అక్కడితో ఆగకుండా తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్టు చెప్పడంతో అప్పట్లో బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి. అలాంటి నేత ఇప్పుడు టీడీపీలోకి రావడాన్ని వంశీ జీర్ణించుకోలేకపోతున్నారు. వంశీ, నెహ్రూలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం..ఆ సామాజిక వర్గంలో వంశీ కంటే నెహ్రూకే మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బెజవాడలో దేవినేనిదే పైచేయి అవుతుందని వంశీ భావిస్తున్నారు. వంశీకి గతంతో పోలిస్తే టీడీపీలో ప్రాధాన్యత అంతంత మాత్రమే. ఈ టైంలో నెహ్రూ రాకతో తనను ఎవరూ పట్టించుకోరని వంశీ ఫీలైపోతున్నారు. అలాంటపుడు పార్టీలో ఉండటం అనవసరమని వల్లభనేని భావిస్తున్నారట. దీంతో వంశీ ఏం చేయబోతున్నారా అని పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రమ్య కుటుంబాన్ని వెంటాడుతున్న మైనర్లు..

రోడ్డు ప్రమాదం..అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ప్రయాణంలో ఒక్కసారిగా హాహాకారాలు..రక్షించమంటూ ఆర్తనాదాలు. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని, పిల్లల నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. పోయినోళ్లు బాగానే ఉన్నా..బతికున్నవాళ్లు అనుభవించే మానసిక క్షోభ మాటలకు అందనిది. అలాంటి స్థితిలో వారికి మరో ప్రమాదం ఎదురైతే..మృత్యువు నీడలా వెంటాడితే. ఇప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది తాగుబోతుల నిర్లక్ష్యానికి బలైపోయిన చిన్నారి రమ్య కుటుంబం. సరిగ్గా రెండు నెలల క్రితం పట్టపగలు పీకలదాకా తాగి బీటెక్ విద్యార్థులు కారు నడిపి పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద చేసిన యాక్సిడెంట్ గుర్తుందా..? ఆ తాగుబోతులు చేసిన పాపానికి నాలుగు కుటుంబాలలో తీరని విషాదం నింపింది.   చిన్నారి రమ్య సహా ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా..రమ్య తల్లిదండ్రులు మంచానికే పరిమితమయ్యారు. ఆ ప్రమాదంలో చనిపోయిన రమ్య బాబాయి రాజేశ్ భార్య శిల్ప ఈసారి ప్రమాదానికి గురయ్యారు. శిల్ప, ఆమె అక్క, బావ మరో చిన్నారి కారులో ఏఎస్‌రావు నగర్, రుక్మిణిపురి కాలనీ నుంచి కాప్రా మీదుగా వయా ఘట్కేసర్ నుంచి నల్లగొండలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే కాప్రా సాకేత్ టవర్స్ వద్ద వేగంగా వస్తున్న బైకు వీరి కారును ఢీకొట్టింది. కారు కుడివైపు ముందు భాగంగా స్వల్పంగా దెబ్బతింది. బైక్ నడుపుతున్నయువకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీనిపై శిల్ప కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.   ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్‌ చేసిన యువకుడి పేరు సోహైల్ అతను మైనరు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నాడు పంజాగుట్ట వద్ద రయ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేసింది మైనర్లే. ఆ ప్రమాదంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి లైసెన్స్‌లు లేని మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత మరచిపోవడం ఆనవాయితీగా మారింది తప్ప శాశ్వత చర్యలు శూన్యం. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకుంటే మంచిది. ఒకవేళ జరగరానిది జరిగితే విలువైన ప్రాణాలు పోవడంతో పాటు మీ పిల్లల భవిష్యత్ నాశనమైపోతుంది.   కాగా జరిగిన ప్రమాదంపై శిల్ప స్పందిస్తూ భర్త, రమ్య, మావయ్యను కోల్పోయి షాక్‌లో ఉన్నానని. చాలా రోజుల తర్వాత తన కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లానని శిల్ప కన్నీటి పర్యంతమయ్యారు. బావగారు చాలా నెమ్మదిగానే కారును డ్రైవ్ చేస్తున్నారని.. ఆటోను ఓవర్‌టేక్ చేస్తూ వస్తున్న ద్విచక్రవాహనాన్ని గమనించి కారును సైడ్‌కు తీసుకున్నారని లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని..వారి చేతిలోనే తమ కుటుంబమంతా హతమవ్వాలా.?? అని ప్రశ్నించారు. తమకు మైనర్ల రూపంలోనే ప్రమాదం వెంటాడుతూనే ఉందని వాపోయారు. మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

చిల్లర తెచ్చిన సమ్మె...!

ఆర్టీసీ బస్సు ఎక్కగానే టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించండి అని ఉండే కొటేషన్‌ని మనలో ప్రతి ఒక్కరం చదివే ఉంటాం. ఆ వాక్యం ఎదో కాలక్షేపానికి రాసిందో..బస్సు  లోపం అందంగా ఉండటానికో రాసింది కాదు. ఆ చిన్న వాక్యాన్ని పాటించి ఉన్నట్లయితే ప్రభుత్వానికి కోటి రూపాయల నష్టం వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్‌ ఉప్పల్‌ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ను తెలంగాణ ఆర్టీసీ అధికారులు మరో డిపోకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ నిన్న హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎనిమిది డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.   సుమారు నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని వేరే చోటికి వెళ్లేందుకు ఒక ప్రయాణికురాలు ఉప్పల్ డిపోకు చెందిన బస్సు ఎక్కి టికెట్ తీసుకుంది..రూపాయి చిల్లర రావాల్సి ఉండటంతో దిగేటప్పుడు ఇస్తానని కండక్టర్ చెప్పింది. దిగాల్సిన స్టాప్ రావడంతో తనకు రావాల్సిన రూపాయి చిల్లర ఇవ్వమని అడిగిన ప్రయాణికురాలితో మహిళా కండక్టర్ దురుసుగా మాట్లాడింది. ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికురాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్టీసీ ఎండీ శాఖాపరమైన విచారణ జరిపి మహిళా కండక్టర్‌ను మరో డిపోకు బదిలీ చేశారు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆదివారం ఆమెకు మద్దతుగా టీఎంయూ నాయకులు ఉప్పల్ డిపో ముందు ఆందోళన చేపట్టి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.   తొలుత ఆందోళన ఉప్పల్ డిపోకు మాత్రమే పరిమితమైంది..అయితే విషయం ఆ నోటా ఈ నోటా మిగతా డిపోలకు పాకింది. హయత్‌నగర్ 1,2, బండ్లగూడ, మహేశ్వరం, మిధాని, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్ డిపోలకు చెందిన కార్మికులు కూడా బస్సులను నిలిపివేశారు. అధికారులు, కార్మికులు పంతానికి పోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్క బస్సు కూడా కదల్లేదు. యూనియన్ నాయకులు సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత జఠిలం చేశారు. సమ్మె కారణంగా సంస్థకు సుమారు కోటి రూపాయల నష్టం కలిగింది. ప్రయాణికురాలు సరిపడా చిల్లర తీసుకెళ్లినా..కండక్టర్ రూపాయి చిల్లర ఇచ్చేసి ఉన్నా ఇంత నష్టం కలిగి ఉండేది కాదు. అటు యూనియన్ నేతలు కూడా ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. చిన్న విషయానికే టీఎంయూ నేతలు బస్సులను నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించకోకుండా మెరుపు సమ్మెకు దిగడంతో సంస్థకు తీరని నష్టం కలిగింది.

ఒకరు విధ్వంసకుడు..మరొకరు రక్షకుడు

  బుర్హాన్‌వానీ..ఈ పేరు దాదాపుగా రెండు నెలలుగా దేశంలోని ప్రతీ ఒక్కరి నోటా నానుతున్న పేరు. కాశ్మీర్‌ను పాక్‌లో కలపాలనే ఉద్యమానికి ఆకర్షితుడై అనేక మంది కశ్మీర్ యువతను సోషల్ మీడియా ద్వారా మిలిటెంట్లుగా మార్చిన వ్యక్తి. అతని కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తుండగా కొద్ది రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని మరణంతో కశ్మీర్ లోయ గత రెండు నెలలుగా రావణకాష్టంలా రగులుతోంది. ఉగ్రవాదంతో నరమేధం సృష్టించిన బుర్హాన్ వానీ పుట్టిన కశ్మీర్‌ లోయలోనే మరో వానీ వెలుగులోకి వచ్చాడు. అయితే ఆ వానీ ఈ వానీలా  ఉగ్రవాది కాదు..దేశ రక్షణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బీఎస్‌ఎఫ్ కమాండర్‌గా. కశ్మీర్‌ లోయ లోని ఉద్దంపూర్‌కు చెందిన నబీల్ అహ్మద్ వనీ బీఎస్ఎఫ్ నిర్వహించిన అర్హత పరీక్షలో టాపర్‌గా నిలిచి అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు.     ఈ సందర్భంగా వనీ ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశాడు. దేశ రక్షణకు కాశ్మీర్ యువత ముందుకు రావటం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా వనీ మాట్లాడుతూ బీఎస్ఎఫ్ టాపర్‌గా నిలవటం సంతోషంగా ఉందని..నేను కశ్మీర్ యువతకు ఒక్కటే చెబుతున్నా..దేశ పరిస్ధితిని మార్చడం పెన్నుతోనే సాధ్యమవుతుంది తప్ప గన్నుతో సాధ్యం కాదన్నారు. బుర్హాన్ వనీని చంపినందుకు ఆగ్రహంతో రగిలిపోయిన కాశ్మీర్ యువత మరి ఈ వనీ సాధించిన విజయం నుంచైనా స్పూర్తి పొందాలని కోరుకుందాం.

ఆ బాబా 'జీన్స్'లోనే బిజినెస్ వుంది!

మారుతున్న కాలంతో పాటూ మారేదే ఎక్కువ కాలం మన్నుతుంది! లేకపోతే అంతరించిపోతుంది! ఈ సత్యానికి సజీవ సాక్ష్యం హిందూ మతం! బాబా రాందేవ్ తాజా ఉదాహరణ! హిందూ స్వామీజీలు అంటే గడ్డాలు పెంచుకుని, కాషాయం ధరించి, గంభీరంగా కూర్చునే పుటకు గతిలేని సన్యాసులు. ఇంత వరకూ అందరూ ఇలాగే అనుకునేవారు. లేదంటే కొందరు దొంగ స్వామీజీల సంగతి సరేసరి! కోట్లాది రూపాయల ఆస్తులు, ఛండాలమైన వ్యవహారాలు... ఇదీ వరస! అలాంటి హిందూ బాబాల్ని, స్వామీల్ని మీడియా తనకు వీలైనంత ఏకిపారేస్తూనే వుంటుంది. మనం అడగాల్సిన పనే లేదు! పోగా మిగిలిన నిజమైన సాధువులు జనాన్ని పట్టించుకోకుండా తమ జీవితం తాము గడిపేస్తుంటారు! యోగా గురు బాబా రాందేవ్ ఇప్పుడు హిందూ స్వామీజీ అన్న పదానికే సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. కాషాయం కట్టినప్పటికీ ఆయన ఎప్పుడూ డిఫరెంటే. యోగా నేర్పటంతో మొదలు పెట్టిన ఆయన ప్రయాణం ఆ మధ్య కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిరాహార దీక్షతో కొత్త మలుపు తిరిగింది. పొలిటికల్ గా ఆయన మీద ఎన్నో దాడులు కూడా జరిగాయి. అన్నిట్ని తట్టుకుని నిలబడ్డ ఆయన మోదీ ప్రధాని అయ్యాక తిరుగులేని కార్పోరేట్ అయ్యారు! ఇప్పటి దాకా స్వామీజీలు, బాబాలు ఆశ్రమాలు పెట్టి కోట్లు సంపాదించి వుండవచ్చు. విమర్శలు ఎదుర్కోవచ్చు. లేదంటే తమ సేవా కార్యక్రమాలతో ప్రశంసలు కూడా పొందవచ్చు. కాని, బాబా రాందేవ్ మరీ వినూత్నంగా దూసుకుపోతున్నారు! పతంజతి ప్రాడక్ట్స్ తో ఆయన వ్యాపారంలోకి దిగారు. చూస్తుండగానే వేల కోట్ల టర్నోవర్ సృష్టించారు. దాంతో పాటే తక్కువ ధరకి వినియోగాదారులకి అత్యుత్తమ వస్తువుల్ని అందిస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే చాలా మంది రాందేవ్ బాబా ఆర్జన మీద అప్పుడప్పుడూ సెటైర్లు వేయటం మనకు తెలిసిందే. కాని, ఆయన తన ఆయుర్వేదిక్ ప్రాడక్ట్స్ అమ్మకం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయి మళ్లీ సమాజ శ్రేయస్సు కోసమే వాడుతున్నారు. సో... ఆయన నిస్వార్థ కార్పోరేట్ అన్నమాట! ఇంతకాలం పతంజలి బ్రాండ్ తో ఆయుర్వేదిక్ మందులు, ఉత్పత్తుల వరకూ మాత్రమే పరిమితమైన బాబా ఇక మీదట మరో కొత్త అంకం ప్రారంభించనున్నారు. నాగపూర్ లో వెయ్యి కోట్ల భారీ పెట్టుబడితో జీన్స్ ప్యాంట్ల తయారీ యూనిట్ మొదలుపెట్టబోతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ ఫ్యాక్టరీలో పూర్తిస్థాయి స్వదేశీ జీన్స్ లు రెడీ అవుతాయట! ఇప్పటికే బాబా తీసుకొచ్చిన పేస్టులు, సబ్బుల వల్ల కోల్గేట్, లైఫ్ బాయ్ లాంటి బ్రాండ్ లు లబోదిబోమంటున్నాయి. మరి ఈ రాందేవ్ జీన్స్ రంగంలోకి దిగితే రచ్చ ఎలా వుంటుందో?  బాబా కేవలం ఇండియానే కాకుండా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మొదలు సౌదీ అరేబియా దాకా ఇంకా చాలా దేశాల్ని టార్గెట్ చేస్తున్నారు. అత్యధిక ముస్లిమ్ జనాభ వున్న దేశాల్ని కూడా బాబా రాందేవ్ తమ ఉత్పత్తులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయటం విశేషం! మొత్తం 50లక్షల కోట్ల టర్నోవర్ తమ లక్ష్యమని బాబా రాందేవ్ నమ్మకంగా చెబుతున్నారంటే... మన స్వామీజీ ప్రవేశపెడుతున్న కాషాయ జీన్స్ కల్లోలం సృస్టించటం ఖాయమే!    

హైదరా'బాధ' తీర్చలేకపోతోన్న మెట్రో రైల్!

హైద్రాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ కాదు కాస్మోపాలిటన్! అంటే... విశ్వనగరం అన్నమాట! మామూలు సమయాల్లో ఈ మాట బాగానే వుంటుంది కాని ప్రతీ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జాముల్లో హైద్రాబాదీలు పడే నరకయాతన అంతా ఇంతా కాదు! అప్పడు తెలుస్తుంది హైద్రాబాద్ నిజమైన స్టేటస్! అయితే, జనానికి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇప్పుడప్పుడప్పుడే తీరేలా లేవు!  హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యలకి పెద్ద రిలీఫ్ అనుకున్నారు మెట్రో. ఇదుగో వస్తుంది, అదుగో వస్తుంది అంటూ ఊరించారు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ వాళ్లు కూడా! కాని, లేటెస్ట్ సమాచారం ప్రకారం మెట్రో డ్రీమ్స్ ఇప్పుడప్పుడే తీరే సూచనలు ఎంత మాత్రం లేవు. నిజానికి పోయిన సంవత్సరమే తొలి మెట్రో ట్రైన్ చక్కర్లు కొడుతుందని ఎల్ అండ్ టీ చెప్పింది. కాని, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం గడిచిపోతున్నా ఇప్పటికీ ఫస్ట్ మెట్రో పట్టాలెక్కలేదు... సిటీ మొత్తం విస్తరించేలా అన్ని దిశల్లో సాగుతోన్న మెట్రో వర్క్స్ ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు. నాగోల్ మెట్టుగుడా మధ్య ట్రాక్ పూర్తిగా సిద్ధమైనా ఇంత వరకూ మెట్రో సర్వీస్ మొదలు కాలేదు. ఇక మియాపూర్, ఎస్ ఆర్ నగర్ మధ్య లైన్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. అయినా ఫినిషింగ్ టచ్చెస్ ఇస్తున్నారు. రైల్వే శాఖ నుంచి సర్టిఫికెట్ కూడా రావాల్సి వుంది. ఈ లైన్ కూడా సంవత్సరం కిందే ఉపయోగంలోకి రావాల్సి వుంది. మెట్టుగుడా, బేగంపేట మధ్య నడుస్తున్న మెట్రో వర్క్ కూడా ఆలస్యంగానే సాగుతోంది. ఈ లైన్ లో అనేక చోట్ల రైల్వే ట్రాక్ పైనుంచి మెట్రో బ్రిడ్జ్ కట్టాల్సి వుండటంతో పర్మిషన్స్ రాక పని మందగించింది. ఎంతో మంది ఉద్యోగస్థులకి ఉపయోగపడే బేగంపేట, శిల్పారామం లైన్ కూడా తాపీగా సాగుతోంది. ఈ సంవత్సరం పూర్తవతుందని మొదట చెప్పినప్పటికీ 2018 చివరికి కూడా డౌటే అంటున్నారు! ఎస్ ఆర్ నగర్, ఎల్బీనగర్ మధ్య నడవాల్సిన మెట్రో కూడా 2016లోనే జనానికి అందుబాటులోకి రావాల్సింది. కాని, అసెంబ్లీ భవనం వుండటంతో అలైన్మెంట్ ఛేంజ్ అంటూ చాలా రోజులు పనులు ఆపేశారు. ఇప్పుడు నడుస్తున్నా మరో రెండేళ్ల వరకూ పూర్తయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. మెట్రో పనుల్లో అత్యంత దారుణంగా నడుస్తున్న మార్గం జేబీఎస్, ఫలక్ నుమా. అసలు ఈ లైన్లో చాలా చోట్ల పని కొంచెం కూడా మొదలు కాలేదు. సుల్తాన్ బజార్ తొలగించాల్సి వుండటంతో చాలా రోజులు నిరసనలు కొనసాగాయి. ఎట్టకేలకు ఇప్పుడు అడ్డంకులు తొలిగినా పనులు నత్తనడకన సాగుతన్నాయే తప్ప స్పీడ్ అందుకోవటం లేదు! అటు ప్రభుత్వం , ఇటు మెట్రో నిర్మాణ సంస్థ రెండూ చెబుతున్న లెక్కల ప్రకారం హైద్రాబాదీల కల ఇప్పుడప్పుడే తీరే సూచనలు కనిపించటం లేదు. మరో నాలుగేళ్లైతే తప్ప మెట్రో ఓ కోలిక్కి వచ్చే అవకాశం లేదు. పైగా మెట్రో పనులు ఆలస్యమైన కొద్దీ రోడ్డుపైన కూడా ట్రాఫిక్ జాములు పెరిగిపోయి నగర వాసులు నరకం చూస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎప్పుడు దీనిపై దృష్టి పెడుతుందో ఏంటో?