వేసవిలో నాలుకను తడిగా వుంచండి ఇలా...!

  వేసవిలో అధికంగా వేధించే సమస్య నోరు ఎండిపోవడం. మాటిమాటికీ తడి ఆరిపోయి నాలుక పిడచకట్టుకుపోవడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. నిజానికిది మంచిది కూడా కాదు. నోటిలో లాలాజలం ఎప్పుడూ ఊరుతూ ఉండాలి. లేదంటే నోటి ఇన్ఫెక్షన్లతో పాటు దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. జీర్ణక్రియలో లాలాజలానికి ఎంతో ముఖ్యమైన పాత్ర కాబట్టి జీర్ణక్రియా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అయితే నోరు ఎండిపోవడం అన్నది పెద్ద సమస్యేమీ కాదు. వేసవి వేడికి అలా అవుతూ ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.   పొద్దున్న లేవగానే నీటిలో ఉప్పు వేసుకుని బాగా గాగుల్ చేయండి. రోజంతా నోరు తేమగానే ఉంటుంది. రోజంతా తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే కూడా నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంది. సోంపు కూడా పొడిబారడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ లాలాజల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే ఓ చిన్న గ్లాసుడు కలబంద జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా నిమ్మరసం. దీనిలో కాసింత తేనె కలుపుకుని ఉదయాన్నే సేవిస్తే రోజంతా నోటిలో లాలాజలం ఉత్పత్తి అయ్యి, నోరు ఎండిపోకుండా ఉంటుంది. ఓ గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర వేసి కలిపి తాగినా మంచిదే. కొత్తిమీరకు కూడా లాలాజలాన్ని ఉత్పత్తి చేసే లక్షణం ఉంది. అందుకే వేసవిలో వంటకాల్లో కొత్తిమీర మోతాదును పెంచండి. అప్పుడప్పుడూ ఓ యాలక్కాయనో, చిన్న అల్లం ముక్కనో నోటిలో వేసుకున్నా కూడా నోటిలో తేమ పెరిగి పొడిదనం మాయమవుతుంది.   ఇవేవీ పెద్ద కష్టమైన విషయాలు కాదు. తేలికగా అనుసరించదగ్గవే. కాబట్టి వేసవిలో చిరాకు పుట్టించే ఈ సమస్యకి సింపుల్ గా చెక్ పెట్టేయండి.   - Sameera

సన్‌స్క్రీన్‌ వాడుతున్నారా? సమస్యలకు సిద్ధం కండి!

మనుపటి రోజుల్లో అందం గురించి శ్రద్ధ అంతగా ఉండేది కాదు. ఉన్నా దాన్ని కాపాడుకునే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు! అందం గురించిన ఆసక్తీ ఎక్కువయ్యింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు లక్షల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకోసారి మన అందాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు ప్రాణాంతకం కావచ్చునంటున్నారు పరిశోధకులు. అందుకు ఉదాహరణే సన్‌స్క్రీన్‌ లోషన్లు!   మొక్కలకీ మనుషులకీ మధ్య ఓ పోలిక ఉంది. మొక్కలు సూర్యకాంతి మీద ఆధారపడి తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లుగానే, మనుషులు సూర్యుడి నుంచి విటమిన్ డిని పొందుతారు. అలా సహజంగా లభించాల్సిన విటమిన్‌ డికి దూరమైతే చాలా సమస్యలే వస్తాయి. ఊపిరితిత్తుల జబ్బులు, ఎముకలు బలహీనపడిపోవడం, కండరాలు పనిచేయకపోవడం, డయాబెటిస్‌, మెదడు ఎదుగుదలలో లోపాలు... లాంటి ఎన్నో ఇబ్బందులు డి విటమిన్ లోపంతో తలెత్తుతాయని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- మన శరీరంలోని ప్రతి కణానికీ విటమిన్ డి చాలా అవసరం.   సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం వల్ల, సూర్యుడి నుంచి వెలువడే ultraviolet rays (అతినీలలోహిత కిరణాలు) నుంచి తప్పించుకునే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎందుకంటే వీటివల్ల శరీరం మీద మచ్చలు పడటం దగ్గర్నుంచీ, స్కిన్ కేన్సర్‌ వరకూ చాలా సమస్యలే వస్తాయి. కానీ బయటకి అడుగుపెట్టే ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ లోషన్ రాసుకోవడం వల్ల మన శరీరం డి విటమిన్ను ఏమాత్రం ఉత్పత్తి చేసుకోలేదట. ఒక అంచనా ప్రకారం SPF 15 (sun protection factor) కంటే ఎక్కువ గ్రేడ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్లు డి విటమిన్‌ను దాదాపు 99 శాతం అడ్డుకుంటాయి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కనిపిస్తున్న సన్‌స్క్రీన్‌లు SPF 15 కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.   సన్‌స్క్రీన్‌ లోషన్లతో మరో ప్రమాదం కూడా ఉంది. రంగు తక్కువగా ఉన్నవారు, ఎండలో మరింత నల్లబడతామేమో అన్న అనుమానంతో ఈ లోషన్లు తెగ వాడేస్తూ ఉంటారు. సాధారణంగా నల్లటి చర్మం ఉన్నవారిలో విటమిన్ డిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మరింత తక్కువగా ఉంటుంది. వీరు సన్‌స్క్రీన్‌ వాడటంతో అసలుకే ఎసరు వస్తుంది.   బయట ఎండ విపరీతంగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ రాసుకుని సిద్ధం కావడం మంచిదే కానీ.... దానిని మీ మేకప్ కిట్‌లో భాగంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు. పౌడర్‌ వాడినంత తరుచుగా సన్‌స్క్రీన్‌ లోషన్ వాడితే డి విటమిన్ లోపం రాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అసలే డయాబెటిస్ వంటి సమస్యలని అదుపు చేయడానికి విటమిన్ డి చాలా అవసరం కదా! ఇంతా చదివిన తరువాత మనకి విటమిన్‌ డి చాలా అవసరమనీ, దాన్ని సన్‌స్క్రీన్‌ లోషన్లతో అడ్డుకోవద్దనీ తేలిపోయింది. కానీ విటమిన్ డి కోసం ప్రత్యేకించి స్విమ్ సూట్లు వేసుకుని బీచ్ ఒడ్డున పడుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. వారానికి ఒక గంటన్నా ఒంటికి ఎండ తగిలేలా జాగ్రత్తపడితే కావల్సినంత డి విటమిన్‌ ఒంటికి పడుతుందట.   - నిర్జర.

అదనపు జింకుతో ఆరోగ్యం భద్రం

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆ తిండిలో తగినన్ని పోషకాలు ఉండాలి. శరీరంలో జరిగే జీవచర్యలన్నీ కూడా సవ్యంగా సాగిపోయేందుకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు అందాలి.  కానీ ప్రస్తుతం మనం తింటున్న ఆహారంలో అలాంటి పోషకాలు లేకుండా పోతున్నాయి. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్నామే కానీ, లోపల మాత్రం డొల్లబారిపోతున్నాం. ఆ విషయాన్ని మరో పరిశోధన మరోసారి గుర్తుచేస్తోంది. రోజూ తగినంత జింక్ని తీసుకుంటే మన డీఎన్ఏ సైతం భద్రంగా ఉంటుందని తేలుస్తోంది.   అసలు జింక్ ఎందుకు మనం అంతగా పట్టించుకోకపోయినా కూడా ఒంటికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం జింక్. రోగనిరోధక శక్తి సన్నగిల్లకుండా ఉండేందుకు, గాయాలు త్వరగా మానేందుకు జింక్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల దగ్గర్నుంచీ తీవ్రమైన గాయాల వరకూ చాలా సందర్భాలలో జింక్ సప్లిమెంట్స్ వాడమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. పిల్లలు త్వరగా, బలంగా ఎదిగేందుకు కూడా జింక్ అవసరం ఉంది.   డీఎన్ఏతో సంబంధం జింక్ వలన Oxidative stress నియంత్రణలో ఉంటుందన్న విషయం ఇంతకుముందే రుజువైపోయింది. దీని వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ అనే విష పదార్థాలు అదుపులో ఉంటాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అదుపులో ఉంచడం వల్ల కేన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలు సైతం మనల్ని దరిచేరవు. ఇప్పుడు ఏకంగా జింక్ వల్ల డీఎన్ఏకి ఏమన్నా లాభం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు ఆరువారాల పాటు కొందరికి తగు మోతాదులో జింక్ సప్లిమెంట్లను అందించారు. ఈ సమయంలో వారి శరీరంలోని డీఎన్ఏ తీరు ఎలా ఉందో గమనించారు.   అరుగు తరుగులు తగ్గాయి రోజుకి నాలుగు మిల్లీగ్రాముల జింక్ని అదనంగా తీసుకున్నా కూడా అది మన డీఎన్ఏ మీద సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మన ఆరోగ్యంలో ముఖ్యపాత్రని పోషించే డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండేందుకు, దెబ్బతిన్న డీఎన్ఏ తిరిగి స్వస్థతని పొందేందుకూ కూడా ఈ జింక్ ఉపయోగపడుతోందట. దీని వల్ల శరీరం ఎలాంటి రోగాన్నయినా, క్రిములనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందన్నమాట.   ఎందులో లభిస్తుంది మాంసం, రొయ్యలు, చేపలు, పీతలు వంటి మాంసాహారలో జింక్ సమృద్ధిగానే లభిస్తుంది. ఇక బచ్చలికూర, చిక్కుడు గింజలు వంటి కొన్నిరకాల శాకాహారంలోనూ జింక్ లభించకపోదు. అయితే పాలిష్ పట్టని బియ్యంలో కావల్సినంత జింక్ లభిస్తుందన్న విషయాన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. అదే కనుక పట్టించుకుంటే జింక్ కోసం అటూఇటూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితే రాదు! - నిర్జర.  

కొబ్బరినీళ్లని మించిన కూల్డ్రింక్ లేదు

  ఎండాకాలం మొదలైందంటే చాలు... కూల్డ్రింక్లకీ, పళ్లరసాలకీ డిమాండ్ పెరిగిపోతుంది. ఇళ్లలో ఫ్రిజ్లన్నీ సీసాలతో నిండిపోతాయి. కానీ ఎన్ని కూల్డ్రింక్స్ తాగినా జేబులు ఖాళీ అవుతాయేమో కానీ దాహం మాత్రం తీరదు. అందుకే కూల్డ్రింక్స్ పక్కన పెట్టి కొబ్బరిబోండాన్ని ఓ పట్టు పట్టమంటున్నారు నిపుణులు. దానికి బోలెడు కారణాలు చూపిస్తున్నారు కూడా!   - శీతల పానీయాలు నిలవ ఉన్నా, సీసా మూతలు తుప్పు పట్టినా లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కొబ్బరినీళ్లు sterile waterతో సమానం. అంటే వీటిలో సూక్ష్మక్రిములు ఇంచుమించుగా కనిపించవన్నమాట.   - కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇలాంటి ఖనిజాలని మనం Electrolytes అంటాము. గుండె కొట్టుకోవడం, రక్తపోటు నియంత్రణలో ఉండటం, కండరాలు పనిచేయడం వంటి ముఖ్యమైన జీవచర్యలకు ఇవి చాలా అవసరం. అందుకే శరీరం నిస్సత్తువుగా ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కానీ కొబ్బరినీళ్లు తాగించమని చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎలక్ట్రాల్ పౌడర్ వంటి మందులు ఒంటికి ఎంత ఉపయోగపడతాయో... కొబ్బరినీరు దాదాపు అంతే ఉపయోగపడతాయి.   - ఎండాకాలం చాలామందిని వేధించే సమస్య తలనొప్పి. ఎండ తీక్షణత చేతనో, ఒంట్లో నీరు తగ్గిపోవడం చేతనో... ఈ కాలంలో తలనొప్పి తరచూ పలకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్లతో బాధడేవారికి ఎండాకాలం నరకం చూపిస్తుంది. కొబ్బరినీరు ఈ తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొబ్బరినీరు ఒంట్లోని తేమని భర్తీ చేస్తుంది. పైగా ఇందులో ఉండే మెగ్నీషియం తలనొప్పి తీవ్రతని తగ్గిస్తుంది.   - మధుమేహంతో బాధపడేవారు దాహం తీరేందుకు పళ్లరసాలు, శీతల పానీయాలు తీసుకోవడం వల్ల అసలుకే మోసం వస్తుంది. కొబ్బరినీటితో ఈ ప్రమాదం లేకపోగా... ఇందులో ఉండే అమినో యాసిడ్స్ వల్ల రక్తంలో చక్కెర నిల్వలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.   - కిడ్నీలో రాళ్లతో బాధపడటం ఈ రోజుల్లో అతి సహజంగా మారిపోయింది. వీటిలో ఎక్కువశాతం కాల్షియం, ఆక్సిలేట్ వంటి పదార్థాలతో ఏర్పడతాయి. ఇలా కిడ్నీ లేదా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూడటంలో కొబ్బరినీరు పనిచేస్తుందని తేలింది.   - ఎండాకాలంలో విరేచనాలు సర్వసాధారణం. వీటివల్ల శరీరం డీహైడ్రేషన్కు లోనవుతుంది. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేసేందుకు కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. WHO సంస్థ సూచించే ORS నీటితో సమానంగా కొబ్బరినీరు పనిచేస్తుందని చెబుతారు.   - కొబ్బరినీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ నిష్పత్తి చాలా ప్రభావం చూపుతుంది. అందుకే కొబ్బరినీరు తాగేవారిలో రక్తపోటు తగ్గుతుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.   ఒక్కమాటలో చెప్పాలంటే... ఖరీదైన స్పోర్ట్స్ డ్రింక్స్కంటే కూడా కొబ్బరినీరే ఎక్కువ ఉపయోగం అని వైద్యులు సైతం తేల్చేశారు. మరింకెందుకాలస్యం... దాహం వస్తే కొబ్బరినీటికే ఓటు వేద్దాం. - నిర్జర.    

ఎండాకాలం వస్తే, సగ్గుబియ్యం కావాల్సిందే!

  మృద్ధిగా ఉంటాయి. వీటికి తోడు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇనుము వంటి ఖనిజాలన్నీ కనిపిస్తాయి. ఇక కొద్దిపాటి పీచుపదార్థం కూడా కనిపిస్తుంది. కానీ కొవ్వు పదార్థాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తాయి.   జీర్ణం జీర్ణం: సగ్గుబియ్యంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా తేలికగా అరుగుతుంది. అందుకనే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారిని సగ్గుబియ్యం జావని తాగమని చెబుతూ ఉంటారు. విరేచనాలు, పొట్ట ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ... ఇలా జీర్ణాశయానికి సంబంధించి ఎలాంటి సమస్యకైనా సగ్గుబియ్యం దవ్యౌషధంగా పనిచేస్తుంది. పేగులలో కదలికలు సవ్యంగా ఉండేలా చూస్తూ, అవి పొడిబారిపోకుండా కాపాడుతుంది.   తక్షణ శక్తి: నీరసంగా ఉండేవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు సగ్గుబియ్యపు జావ తాగితే శక్తిని పుంజుకుంటారు. వ్యాయామం చేసి అలసిపోయిన తరువాత కూడా సగ్గుబియ్యం తగినంత శక్తిని అందిస్తుంది. రోజులో ఎప్పుడైనా సరే... అల్పాహారం కింద సగ్గుబియ్యం జావని తాగవచ్చు. దీని వల్ల అలసట దూరం కావడమే కాకుండా, ఆకలి కూడా తీరినట్లవుతుంది. తక్కువ ఆహారంతో ఆకలి తీరడం వల్ల బరువు పెరగకుండా ఉంటాము!   ఆరోగ్యం అదుపులో: సగ్గుబియ్యంలో ఒంటికి కావల్సిన ఖనిజాలన్నీ ఉన్నాయి. రక్తపోటుని నియంత్రించడంలో, ఎముకలని దృఢంగా ఉంచడంలో, కండరాలకి శక్తిని అందించడంలో ఇవి ముందుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎలక్ట్రోలైట్స్‌గా చెప్పుకొనే ఖనిజాలన్నీ సగ్గుబియ్యంలో కనిపిస్తాయి.   అందానికి మెరుగులు చాలామంది సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి చర్మానికి పట్టిస్తూ ఉంటారు. దీని వలన ఒంటి మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుందట. పైగా ఒంటి మీద ఉన్న మచ్చలూ, మడతలూ కూడా తొలగిపోతాయంటున్నారు. ఇక ఆలివ్‌ నూనెతో కలిపి జుట్టుకి పట్టిస్తే... వెంట్రుకల ఎదుగుదలకి ఢోకా ఉండదంటున్నారు. అన్నింటికీ మించి, సగ్గుబియ్యం మంచి రుచిగా ఉంటుంది. ఎలాపడితే అలా తయారుచేసుకునేందుకు వీలుగా ఉంటుంది. అందుకనే సగ్గుబియ్యంతో పాయసం దగ్గర నుంచీ వడల వరకూ ఎలాంటి వంటకాన్నయినా చేసుకుంటారు. ఇంకా తనివితీరక సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకొంటారు. సగ్గుబియ్యంలో ఉన్న అతి ముఖ్యమైన గుణం చలవ చేయడం. నీటితో కలిపి తీసుకోవడం, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటంతో... సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో డీహైడ్రేషన్, నిస్సత్తువ వంటి సమస్యలు ఏర్పడతాయి. సగ్గుబియ్యపు జావ ఇందుకు విరుగుడుగా నిలుస్తుంది.

శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!   శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.   ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట! - నిర్జర.    

ట్రాఫిక్తో పిల్లల డీఎన్ఏ దెబ్బతింటోంది

  కాలుష్యం గురించి కొత్తగా చెప్పుకొనేదేముంది. సరికొత్తగా తిట్టుకునేదేముంది. కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయనీ, కాలుష్యకణాలు ఏకంగా మెదడులోకి చొచ్చుకుపోతాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఫలితంగా ఆస్తమా మొదల్కొని అల్జీమర్స్ దాకా నానారకాల సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనతో కాలుష్యం ఏకంగా పిల్లల డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది.   పిల్లల డీఎన్ఏ మీద కాలుష్య ప్రభావం తెలుసుకొనేందుకు పరిశోధకులు కాలిఫోర్నియాలోని Fresno అనే నగరాన్ని ఎంచుకొన్నారు. అమెరికాలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో Fresno ముందువరుసలో ఉండటమే ఇందుకు కారణం! దీనికోసం ఈ నగరంలో నివసించే కొందరు పిల్లలు, కుర్రవాళ్లకి సంబంధించిన డీఎన్ఏను పరిశీలించారు. మోటరు వాహనాల నుంచి వెలువడే polycyclic aromatic hydrocarbons (PAHs) అనే కాలుష్య కణాలు ఎక్కువైనప్పుడు, వారి డీఎన్ఏలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అంచనా వేశారు.   వాతావరణంలో PAH కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, డీఎన్ఏలో ఉండే telomere అనే భాగం కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆస్తమా ఉన్న పిల్లలలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది. మన వయసు పెరుగుతూ వృద్ధాప్యం మీద పడేకొద్దీ ఈ telomere తగ్గిపోవడం సహజం. ఒకరకంగా ఈ telomere మనం మరణానికి చేరువవుతున్నామనేదానికి సూచనగా నిలుస్తుంది. అందుకనే కేన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ telomere తగ్గిపోతుంటుంది.   పిల్లల్లో రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు వారి అవయవాలు సున్నితంగా, చిన్నగా ఉంటాయి. వారి డీఎన్ఏలోని telomere కూడా అంతే సున్నితంగా ఉంటుంది. దాంతో ట్రాఫిక్ నుంచి వచ్చే కాలుష్యం వారిని మరింతగా పీడించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్నే పై పరిశోధన రుజువు చేసింది. కానీ ఈ పరిస్థితి నుంచి భావితరాలను కాపాడేందుకు ఏ వ్యవస్థా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే దురదృష్టం. ఇక మనమే మన పిల్లల్ని ఎలాగొలా ఈ కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. - నిర్జర.    

విటమిన్ Kతో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

  శరీరానికి అవసరమయ్యే విటమిన్ల పేర్లు చెప్పమంటే టకటకా A నుంచి E వరకూ వల్లెవేస్తాం. కానీ K విటమిన్‌ గురించి మాత్రం మర్చిపోతాం. మనం ఎంతగా మర్చిపోయినా... శరీరానికి మిగతా విటమిన్లు ఎంత అవసరమో కె విటమిన్‌ కూడా అంతే అవసరం అని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు! కె విటమిన్‌తో ఎముకల దగ్గర్నుంచీ గుండె వరకూ ప్రతి భాగానికీ లాభాలున్నాయని పేర్కొంటున్నాయి.   విటమిన్ కె అనగానే మనకి రక్తం గడ్డకట్టడమే గుర్తుకువస్తుంది. నిజానికి ఈ విటమిన్‌కు ‘K’ అన్న పదాన్ని సూచించడం వెనుక కూడా ఇదే కారణం. జర్మన్‌ భాషలో koagulation అంటే గడ్డకట్టడం అని అర్థం. ఈ విటమిన్‌ ముఖ్య బాధ్యత రక్తాన్ని గడ్డకట్టించడం అని జర్మన్ పరిశోధకులు కనుగొనడంతో ఆ పదంలోని మొదటి అక్షరం స్థిరపడిపోయింది. మన శరీరానికి చిన్న గాయమైనా సరే... అక్కడ రక్తం కనుక గడ్డకట్టకపోతే ఇక మనిషికి మరణమే శరణ్యం! పంక్చర్‌ అయిన ట్యూబ్‌లోంచి గాలి ఎలా వెళ్లిపోతుందో మన శరీరం నుంచి రక్తం అలా జారిపోతుంది. ఆ పరిస్థితిని అదుపుచేసేందుకు కొన్ని ప్రొటీన్లు అక్కడి రక్తం గట్టిపడేలా చేస్తాయి. ఆ ప్రొటీన్లకి విటమిన్‌ కె తగిన బలాన్ని చేకూరుస్తుంది.    రక్తస్రావాన్ని అరికడుతుంది కదా అని పెద్దలకు మాత్రమే ఇది ఉపయోగం అనుకోవడానికి లేదు. అప్పుడే పుట్టిన పసిపిల్లలలో విటమిన్‌ కె చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో చాలా తక్కువ మోతాదులో ఈ విటమిన్‌ కనిపిస్తుంది. ఈ కారణంగా వారిలో అంర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని పసిపిల్లలు పుట్టిన వెంటనే ఇంజక్షన్‌ రూపంలో కె విటమిన్‌ను అందిస్తున్నారు.   విటమిన్‌ కె కేవలం రక్తానికే కాదు, ఎముకలకు కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నది నిపుణుల మాట. స్త్రీలలో కనిపించే ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి రాకుండానూ, ఒకవేళ వచ్చినా కూడా అది అదుపులో ఉంచడంలోనూ విటమిన్ ప్రభావం చూపుతుందట. ఎముకలకి తగినంత కాల్షియం అందేలా తోడ్పడటం ద్వారా... అవి పెళుసుబారిపోకుండా, దృఢంగా ఉండేలా కె విటమిన్‌ సాయపడుతుందట.   విటమిన్ కె వల్ల గుండెకు మేలు జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ గుండెధమనులు గట్టిపడకుండా ఉండేందుకు ఈ విటమిన్‌ దోహదపడుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంతేకాదు! గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెలకి చేరే రక్తసరఫరాలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా నివారిస్తుందట.   ఇదీ స్థూలంగా విటమిన్ కె వల్ల కలిగే కొన్ని లాభాలు! రోజులు గడిచేకొద్దీ ఈ విటమిన్‌ వల్ల ఉపయోగాలు ఇబ్బడిముబ్బడిగా బయటపడుతూనే ఉన్నాయి. ఆఖరికి కొన్ని రకాల మొండి కేన్సర్లను కూడా ఇది నివారించగలదని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఆందుకనే ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకి 120 మి.గ్రాముల విటమిన్ కె తీసుకోవాలనీ, స్త్రీలు రోజుకి 90 మి.గ్రాముల విటమిన్ కె ఉండే ఆహారం స్వీకరించాలనీ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.   ఆకుకూరలు, మాంసాహారం, సోయాబీన్స్, పాలపదార్థాల వంటి ఆహారంలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ శరీరంలో తగినంత విటమిన్ కె లేదని తేలినా, లేదా ఆ విటమిన్‌ను జీర్ణం చేసుకోవడంలో ఏదన్నా లోపం ఉన్నా... మందుల ద్వారా ఈ విటమిన్‌ను స్వీకరించవచ్చు. అయితే కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్‌ కె మందులు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అది ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, కొలెస్టరాల్‌, జీర్ణసమస్యలతో మందులు వాడేవారిలో విటమిన్‌ కె సప్లిమెంట్లు దుష్ప్రభావాన్నా చూపుతాయి.   - నిర్జర.

షుగర్ వచ్చిందా..? ఈ డైట్ ఫాలో అవ్వండి

ఇటీవలి కాలంలో డయాబెటిస్ అనేది కామన్‌గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాఢపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలు.. లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. అందుకే డయాబెటిస్ అంటే చాలు జనం హడలిపోతారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, స్థూలకాయం, స్మోకింగ్ తదితర కారణాలు షుగర్ రావడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత అది తినకూడదు. ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చట. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  

ఉగాది పచ్చడితో ఆరోగ్యం

‘ఉగాది పచ్చడి’ ఉగాది పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం.. ప్రసాదం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని షడ్రుచులున్న ఉగాది పచ్చడి ఇస్తుంది.  ఉగాది పచ్చడిని శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చెబుతోంది.  ఉగాది  పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తోంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు.  ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.  శిశిరంనుంచి వసంతంలోకి అడుగుపెట్టడం అంటే చల్లని వాతావరణంలోంచి తాపం ఎక్కువయ్యే వాతావరణంలోకి రావడమన్నమాట. శరదృతువు, వసంతకాలంలో వ్యాధులు తీవ్రత ఎక్కువ. శీతాకాలంలో శరీరం స్తబ్దుగా ఉండిపోతుంది. వాత, పిత్త, కఫ, శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఋతువులు మారే సంధికాలంలో ఇవి మరింత విజృంభిస్తాయి. ముఖ్యంగా వసంతం వచ్చీరాగానే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు, వీటినుండి రక్షణకు పెద్దలు ఉగాది పచ్చడిని రక్షణ పదార్థంగా అలవాటు చేశారని ప్రతీతి. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలన్నీ ఔషధాలే. బెల్లం మహిళలు మంచిది. ఐరన్‌ ధాతువు ఉంటుంది. ఇది రక్తపుష్టిని కల్గిస్తుంది. వేపపువ్వు చేదుగా ఉంటుంది. పొట్టలోని నులి పురుగులను సంహరిస్తుంది. యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ఉప్పు వాతాన్ని హరిస్తుంది. చింతపండు, మామిడిలోని పులుపు, వగరు వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మిరియాలు శరీరంలో వేడిని నియంత్రిస్తాయి. ఇన్ని విశిష్టతలున్నాయి కనుకే మనం ఉగాది పచ్చడిని ఇష్టంగా తిందాం.     

చింతపండు తగిలితే రక్తపోటు తగ్గిపోతుందా!

  రక్తపోటు ఉన్నవారు పులుపు ముట్టుకోకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే వేలసంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్న చింతపండుని వదులుకోవాల్సిందేనా! నానారకాల అనర్థాలకీ, అనారోగ్యాలకీ చింతపండు కారణం అవుతోందా! అంటే కాదనే అంటున్నారు నిపుణులు. చింతపండుతో రక్తపోటు పెరగకపోగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఏమేం చెబుతున్నారంటే... రక్తపోటు - చింతపండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చింత శరీరంలోని రక్తపోటుని అదుపులో ఉంచుతుందన్నది నిపుణుల వాదన. పైగా చింతపండులో పీచుపదార్థం చాలా ఎక్కువ. చింతపండు నుంచి ఎంత గుజ్జు తీసినా కూడా ఇంకా పీచు మిగిలి ఉండటాన్ని గమనించవచ్చు. శరీరంలోని కొవ్వుని తొలగించేందుకు ఈ పీచు చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత - చింతపండులో ఇనుము (iron) శాతం కూడా చాలా ఎక్కువ. దీని వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఆ రక్తహీనత కారణంగా వచ్చే నీరసం, తలనొప్పులూ దూరమైపోతాయి. ఊబకాయం - చింతపండులో hydroxycitric acid అనే రసాయనం ఉందంటారు. ఇది శరీరానికి అందే కార్బోహైడ్రేట్లు, కొవ్వు కిందకి మారకుండా అడ్డుకుంటుంది. పైగా చింతపండుకి LDL కొలెస్టరాల్‌ని తగ్గించే శక్తి కూడా ఉంది. వీటి అర్థం... చింతపండుతో బరువు తగ్గిపోతుందనేగా! జీర్ణశక్తి - ఇప్పుడంటే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి కానీ, చింతపండుతో చేసిన చారు లేక పులుసు లేకపోతే ఒకప్పుడు భోజనం పూర్తయ్యేది కాదు. మనం తిన్న భోజనాన్ని చక్కగా అరాయించుకునేందుకు ఈ చింతపండు చారు ఉపయోగపడుతుంది. ఇప్పటికీ జీర్ణశక్తి కాస్త మందగిస్తున్నట్లు తోస్తే తక్షణ ఉపశమనం కోసం పెద్దలు చింతపండుతో కాస్త చారుని తినమనే చెబుతారు. కాలేయం - జ్వరంతో బాధపడేవారికి చింతపండు చారునే పథ్యంగా చెబుతూ ఉంటారు. దీని వెనకాల శాస్త్రీయ కారణాలు లేకపోలేదు. చింతపండు త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు! చింతపండుకి కాలేయం నుంచి విడుదల అయ్యే పైత్య రసాన్ని (bile) నియంత్రించే శక్తి ఉంది. ఈ పైత్య రసంలో తేడాలే చాలా సందర్భాలలో జ్వరానికి దారితీస్తాయని నమ్ముతారు. బి విటమిన్‌ - బి విటమిన్లలో ముఖ్యమైన ‘థయామిన్‌’ (B1) చింతపండులో పుష్కలంగా లభిస్తుంది. మెదడు చక్కగా పనిచేయాలన్నా, ఆహారం శక్తిగా మారాలన్నా, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కావాలన్నా, శరీరం యవ్వనంగా కనిపించాలన్నా ఈ థయామిన్‌ చాలా అవసరం. రోగనిరోధక శక్తి - కేవలం B1 మాత్రమే కాదు C,E,K విటమిన్లు... కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌ వంటి ఖనిజాలు కూడా చింతపండులో కనిపిస్తాయి. వీటన్నింటివల్లా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఆరోగ్యం నిలిచి ఉంటుందని వేరే చెప్పాలా!

వేప గురించి 15 విషయాలు

  తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!   - వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.   - వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.   - వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.   - రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.   - వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.   - వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.   - వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.   - వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.   - వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.   - వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.   - నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.   - వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.   - వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.   - ఇంటికి కలపగా వాడటంలో టేకు, మద్ది తరువాత వేపకే ప్రాధాన్యత. పైగా వేపతో చేసిన కలప ఎన్నాళ్లయినా పుచ్చిపోకుండా, చెదలు సోకకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.   - ఇంతటి ఘనత కలిగిన వేప మన భారత ఉపఖండంలోనే ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు తేల్చారు! - నిర్జర.    

కూలింగ్ వాటర్‌ తాగుతున్నారా! ఇది చదవండి…

    ఎండాకాలం వచ్చిందంటే చాలు... సీసాల కొద్దీ చల్లటి నీళ్లని గొంతులో ఒంపేసుకుంటాము. కానీ అదేం చిత్రమో! చల్లటి నీళ్లు ఎంత తాగినా కూడా దాహం తీరదు. పైగా దగ్గు, జలుబులాంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. కూలింగ్‌ వాటర్‌ తాగడం వల్ల ఒంటికి ఇసుమంతైనా ఉపయోగం ఉంటుందా అంటే లేదనే జవాబిస్తున్నారు నిపుణులు. పైగా నానారకాల సమస్యలనీ ప్రస్తావిస్తున్నారు. అవేమిటంటే…   అందుకే జలుబు! చల్లటి నీటి వల్ల గొంతులో మ్యూకస్‌ అనే జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల గొంతు, ఊపిరితిత్తులలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి త్వరగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు పలకరిస్తాయి. చల్లటి నీరు తాగాక వచ్చే సమస్యలకు ఇదే కారణం!   అనవసర శ్రమ ఒంట్లోకి చేరుకునే ఏ పదార్థాన్నయినా మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో శరీరం తన శక్తిని కోల్పోతుందంటున్నారు. చాలామంది తిండి మధ్యలో ఈ చల్లటి నీరు తాగుతూ ఉంటారు. దాని వల్ల శరీరం తనకు ఆహారం ద్వారా అందుతున్న పోషకాలను జీర్ణం చేసుకునే శక్తి కాస్తా చల్లటి నీటిని వెచ్చచేసుకునే ప్రయత్నంలోనే మునిగిపోతుంది. అంటే! మనం తినే ఆహారం ఒంటపట్టదన్నమాట!   రక్తప్రసారానికి అడ్డు చల్లచల్లటి నీరు ఒంట్లోకి చేరడం వల్ల, ఒంట్లోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాని వల్ల ఒంట్లోని కణాలకు తగినంత నీరు అందక... ఇంకా దాహం తీరనట్లుగానే ఉంటుంది. చల్లటి నీరు రక్తప్రవాహం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే చల్లటి నీరు ఎక్కువగా తాగిన తరువాత ఒళ్లు తిమ్మిర్లు ఎక్కినట్లుగా అనిపిస్తుంది.   గుండె మీద భారం చల్లటి నీటి వల్ల రక్తప్రసావం తగ్గిపోతుందని చెప్పుకొన్నాం కదా! దీనివల్ల గుండె మీద భారం పడుతుంది. అంతేకాదు! చల్లటి నీరు తాగడం వల్ల గుండెకు చెందిన vagus అనే నరం పనితీరులో మార్పు వస్తుందట. దానివల్ల గుండె వేగం ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం ఒంట్లోని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. మరి చల్లటి నీరేమో పది డిగ్రీల లోపే ఉంటుంది. అలాంటి నీరు శరీరంలోకి ప్రవేశించడం వల్ల మన జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. కొవ్వు పదార్థాలు శరీరంలోనే పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తాయి. ఒకోసారి రక్తం కూడా గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. అదెంత ప్రాణాంతకమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా!   చల్లటి నీటికి విరుద్ధంగా గోరువెచ్చటి నీటి వల్ల శరీరానికి బోలెడ లాభాలు ఉంటాయి. ఎండాకాలంలో గోరువెచ్చటి నీరు తాగే ప్రయత్నం చేయడం ఏమంత తేలిక కాకపోవచ్చు. కానీ చల్లటి నీటికి మాత్రం దూరంగా ఉండమనే చెబుతున్నారు పెద్దలు.     - నిర్జర.

వేసవి వేడిని తట్టుకొనేందుకు 7 చిట్కాలు

  ఇదేమన్నా బ్రహ్మ విద్యా! ఇంటిపట్టున కూర్చోవడం, తరచూ మంచినీళ్లు తాగడం... లాంటి చిట్కాలతో వేసవి వేడిని ఎదుర్కొంటాం కదా! అంటారా. నిజమే. కానీ మనం ఎప్పుడూ పట్టించుకోని మరికొన్ని ఉపాయాలు కూడా ఆచరించి చూడమని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటంటే... మణికట్టు చల్లగా -     మణికట్టు, మెడ భాగాలలోని రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రదేశాల మీద ధారాళంగా నీరు పోయడం, తడి బట్ట కట్టడం వల్ల... రక్తంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరం త్వరగా చల్లబడిపోతుంది. అయితే ఎండతో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే ఈ పని చేయడం అంత సురక్షితం కాకపోవచ్చు.   కాఫీ, టీలకు దూరం -     వేసవిలో గొంతు ఎండిపోతోంది కదా అని రోడ్డు పక్కన ఆగి వేడివేడి టీలు చప్పరిస్తుంటారు. వేడి నీరు ఒంట్లోకి దిగగానే, వాటిని సాధారణ ఉష్ణోగ్రతలోకి మార్చుకునేందుకు శరీరం కష్టపడుతుంది. పైగా కాఫీ, టీలలో ఉండే కెఫిన్‌తో డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుందన్న వాదనలూ ఉన్నాయి. అందుకని దాహం వేసినప్పుడు కొబ్బరినీరు, నీరు, గ్లూకోజ్‌ వంటి పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.   జుత్తుని కాస్త తడుపుకుంటే -     వేసవిలో మాడు కూడా వేడిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ కొబ్బరి నూనె పెట్టుకోమని తిడుతుంటారు పెద్దలు. మనం ఎలాగూ ఆ మాట వినం కదా! అందుకే ఇంటిపట్టున ఉన్నప్పుడు తడి చేతులని కాస్త జుత్తులోకి పోనిచ్చి చూడండి. అలా జుత్తుని కాస్త తడిగా ఉంచడం వల్ల మాడుని కాసేపటవరకూ చల్లగా ఉంచగలుగుతాము.   అలోవెరా -     ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ చవకగా అలోవెరా గుజ్జు దొరుకుతోంది. చర్మాన్ని చల్లబరిచే గుణం అలోవెరాలో పుష్కలంగా ఉంది. పైగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది.   వ్యాయామం మానొద్దు –     వ్యాయామం వల్ల స్వేదరంధ్రాలు శుభ్రపడి చెమటపొక్కుల వంటి సమస్యలు దరిచేరవు. శరీరానికి కావల్సినంత దాహం కలుగుతుంది. ఒంట్లోని ప్రతి అవయవమూ శుభ్రపడుతుంది. కాకపోతే వేసవిలో వ్యాయామం చేసటప్పడు అదనపు జాగ్రత్తలు అవసరం. నీడపట్టున వ్యాయామం చేయాలి, తగినంత విశ్రాంతి తీసుకుంటూ తక్కువసేపు వ్యాయామం చేయాలి. శరీరానికి తగినంత నీరు, ఉప్పు లభించేలా జాగ్రత్తపడాలి.   అత్యవసరం అయితేనే షూస్ –     మన ఒంట్లోని వేడిలో కొంత భాగం పాదాల ద్వారా కూడా బయటకు వెళ్తుంది. మరి ఆ పాదాలనే పూర్తిగా మూసివేస్తే.... ఒంటికి ఉక్కపోత తప్పదు. అందుకనే వేసవిలో అత్యవసరం అయితే తప్ప షూస్ ధరించకూడదు. ఒకవేళ ఆఫీసుకి షూస్‌ వేసుకుని వెళ్లాల్సి వచ్చినా... సీట్లోకి చేరగానే వాడిని విడిస్తే మేలు.   కళ్ల మీద కీరా –     వేసవిలో కీరదోసని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. ఓ రెండు కీర ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కూడా ఒంట్లోని నిస్సత్తువ తీరిపోయిన అనుభూతి కలుగుతుంది. కీరని కళ్ల మీద పెట్టుకుంటే ఒంట్లోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది నిపుణుల మాట! - నిర్జర.

కూల్‌డ్రింక్స్‌తో మెదడు దెబ్బతింటుందా?

  ఎండాకాలం వచ్చిందంటే చాలు... దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. ఆ దాహాన్ని కూల్‌డ్రింక్స్‌తో తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. స్వచ్ఛమైన నీటిని వదిలేసి ఇలా చల్లటి కూల్‌డ్రింక్స్‌తో దాహం తీర్చుకోవడం ఏమంత మంచి పని కాదని నిపుణులు వాదిస్తూనే ఉంటారు. వాటివల్ల దాహం తీరకపోగా డయాబెటిస్‌, ఊబకాయం, కిడ్నీరాళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ పరిశోధన మరో అడుగు ముందుకు వేసి... కూల్‌డ్రింక్స్‌తో అసలు మెదడే పాడైపోతుందని హెచ్చరిస్తోంది.   మెదడు మీద శీతలపానీయాల ప్రభావాన్ని గమనించేందుకు అమెరికాలోని శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఇందుకోసం వారు ఓ నాలుగువేల మంది ఆహారపు అలవాట్లను గమనించారు. వారానికి కనీసం మూడుసార్లన్నా శీతలపానీయాలను తీసుకునేవారిని మరికాస్త శ్రద్ధగా గమనించారు. MRI వంటి ఆధునిక పరీక్షల ద్వారా వీరి మెదడులో వస్తున్న మార్పులను పసిగట్టే ప్రయత్నం చేశారు.   కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నవారి మెదడులోని కణాలు త్వరగా నిర్వీర్యం అయిపోవడాన్ని పరిశోధకులు గమనించారు. జ్ఞాపకశక్తి క్షీణించడం, గతం మర్చిపోవడం, మెదడు కుంచించుకుపోవడం, ఏకాగ్రత నిలపలేకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. ఈ లక్షణాలన్నీ అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.   డైట్‌ కూల్‌డ్రింక్స్ మరింత ప్రమాదం! మామూలు శీతలపానీయాలకంటే డైట్స్ కూల్‌డ్రింక్స్ సురక్షితం అన్నది ప్రజల భావన. కానీ రోజుకి ఒక డైట్‌ కూల్‌డ్రింక్‌ చప్పున తాగేవారు పక్షవాతం లేదా మతిమరపు బారిన పడే ప్రమాదం మూడురెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. డైట్‌ కూల్‌డ్రింక్స్‌లో ఉండే కృత్రిమ తీపిపదార్థాలే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. కృత్రిమమైన తీపి పదార్థాల వల్ల తక్కువ కెలోరీలు లభించవచ్చుగాక. కానీ దీర్ఘకాలికంగా ఇవి వినాశనానికే దారితీస్తాయన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనే!   ఏతావాతా మన జీవితంలో ఉప్పుతో పాటుగా, చక్కెర పదార్థాలని కూడా తక్కువగా తినాలని తాజా పరిశోధన సూచిస్తోంది. అందులోనూ ‘ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌’ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. అందుచేతా... ఎండాకాలం మాంచి దాహం వేస్తే కూల్‌డ్రింక్స్ ద్యాసని వదిలిపెట్టి చెంబుడు మంచినీటిని గొంతులో పోసుకుంటే సరి!   - నిర్జర.

వేసవిలో దాహం తీర్చుకోవడం ఓ కళ!

  వేసవి మొదలైపోయింది. అది కూడా ఉధృతంగా! ఇంతటి వేసవిని ఎదుర్కోవాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని అందరూ చెప్పేమాటే! ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఇంటపట్టునే ఉన్నా సమస్యలు తప్పవు. చెమటపొక్కుల దగ్గర్నుంచీ విరేచనాల దాకా.... నీరు తాగకపోవడం అనే సమస్య ఒకోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. మరి ఈ చిక్కుని విప్పాలంటే...   మద్యంతో అసలుకే మోసం – వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది చల్లటి బీరు తాగితే చాలనుకుంటారు. ఆల్కహాల్‌తో శరీరానికి నీరు దొరక్కపోగా, ఉన్న నీరు కూడా పోతుందంటున్నారు నిపుణులు. మద్యం మన శరీరంలో ఉండే anti-diuretic అనే హార్మోను మీద ప్రభావం చూపుతుందట. దీని వల్ల శరీరం అవసరమైనదానికంటే అదనపు నీటిని కోల్పోతుందంటున్నారు. అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని వేరే చెప్పాలా!   లెక్కలు పక్కన పెట్టండి – రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలా? రెండు లీటర్ల నీరు తాగాలా? లాంటి సందేహాలను పక్కన పెట్టండి. దాహం వేసినప్పుడల్లా కావల్సినంత నీరు తాగాలి. దాహం వేయనప్పుడు కూడా తరచూ నీరు తాగుతూనే ఉండాలి.   కూల్‌డ్రింక్స్‌ దండగ – ఎండాకాలం వచ్చిందంటే మనకి శీతల పానీయాలే గుర్తుకువస్తాయి. వీటిలో ఉండే చల్లదనం వల్ల, కార్బన్‌డయాక్సైడ్‌ వల్ల దాహం తీరినట్లు తోస్తుంది. కెఫిన్‌, చక్కెర వంటి పదార్థాల వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలుగుతుంది. ఫలితంగా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరానికి తగినంత నీరు దక్కదు సరికదా... రక్తపోటు, కిడ్నీల సమస్యలు కూడా రావచ్చు.   వాటర్‌ బాటిల్‌ వెంట ఉండాల్సిందే – ఎండాకాలం బయటకి వెళ్లేటప్పుడు, పనిలో మునిగిపోయినప్పుడు దాహం వేయడం సహజం. పక్కన మంచినీళ్ల బాటిల్‌ లేకపోతే తరువాత తాగొచ్చులే అన్న నిర్లక్ష్యం ఏర్పడిపోతుంది. ఒకోసారి అప్పటికే ఒంట్లో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోతుంది. మన ఒంట్లో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. ఈ నీటి శాతంలో మార్పులు వచ్చినప్పుడు తిప్పలు తప్పవు.   పోషకాహారం – మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సత్తువ ఎలాగూ ఉంటుంది. ఇక తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తినడం వల్ల వాటి ద్వారా కావల్సినంత నీరు కూడా ఒంట్లోకి చేరుతుంది.   సూచనలు పట్టించుకోండి – మూత్రం పచ్చగా రావడం, నోరు పొడిబారిపోవడం, తలనొప్పి, కళ్లు మంటలు, చర్మం గరుకు తేలడం వంటి సవాలక్ష సూచనల ద్వారా మన ఒంట్లో తగినంత నీరు లేదని శరీరం సూచిస్తూ ఉంటుంది. వీటిని విస్మరిస్తే మరింత తీవ్రమైన సూచనలకు సిద్ధంగా ఉండాల్సిందే!   వ్యాయామంతో జాగ్రత్త- ఎండాకాలం వ్యాయామం చేసినప్పుడు చెమటతో పాటుగా నీరు, సోడియం రెండూ కూడా బయటకు వెళ్లిపోతాయి. అందుకని వ్యాయామం చేసే ఒక గంటకు ముందు పుష్కలంగా మంచినీరు తాగాలి. అలాగే వ్యాయామం చేసిన తరువాత కాసేపటికి కూడా నీరు తాగాలి. నీటికి బదులుగా కొబ్బరినీళ్లు, పళ్లరసాలు తీసుకుంటే మరీ మంచిది. - నిర్జర.